
రోడ్లన్నీ కొట్టుకుపోవడంతో స్తంభించిన రవాణా
దీంతో హోటల్కే పరిమితమైన విజయనగరం తహసీల్దార్ కుటుంబం
ఆయన వెంట భార్య, ఇద్దరు పిల్లలు
సహాయక చర్యలు చేపట్టిన ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు
వరదల్లో చిక్కుకున్న మరో ఏడుగురు సాఫ్ట్వేర్ ఉద్యోగులు
సాక్షి, న్యూఢిల్లీ/విజయనగరం అర్బన్ : సిక్కిం వరదల్లో విజయగరం తహసీల్దార్ ఎన్. కూర్మనాథరావు (42) ఆయన కుటుంబ సభ్యులు చిక్కుకుపోయారు. కుటుంబంతో కలిసి ఆయన 5 రోజుల క్రితం గ్యాంగ్టక్ విహారయాత్రకు వెళ్లారు. ప్రస్తుతం అక్కడికి 18 కిలోమీటర్లు దూరంలోని నార్త్ సిక్కిం ప్రాంతం మంగన్ జిల్లాలోని లుచూంగ్లో ఉన్నారు. అక్కడ కురిసిన భారీ వర్షాలకు వారు వెళ్లిన మార్గం ఆదివారం కొట్టుకుపోయింది.
చుట్టుపక్కల వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వారు హోటల్కే పరిమితమయ్యారు. పర్యటనలో తహసీల్దార్తో పాటు ఆయన భార్య ఎం. ఉమ (38) (డిప్యూటీ తహసీల్దార్, ల్యాండ్ ఎక్విజేషన్ విభాగం బొబ్బిలి యూనిట్లో పనిచేస్తున్నారు), కుమార్తె దీక్షిత (15), కుమారుడు జయాన్‡్ష నారాయణ (6) ఉన్నారు.
బెంగళూరులో పనిచేస్తున్న ఏడుగురు సాఫ్ట్వేర్ ఉద్యోగులు అభిషేక్రాజు (కర్నూలు), ఆదిత్యకిరణ్ (శ్రీకాకుళం), ఆదేష్ శ్రీవాస్తవ (బెంగళూరు), శ్రీజ సంతోష్ (బెంగళూరు), చందన్గౌడ (మైసూరు), సిరిన్ థామస్ (బెంగళూరు), సమృధి భాస్కర్ (బెంగళూరు) కూడా వరదలతో అక్కడే చిక్కుకుపోయారు. వీరంతా తహసీల్దార్ కుటుంబం బసచేసిన హోటల్కు సమీపంలోనే మరో హోటల్లో బసచేశారు.
సురక్షితంగా తరలించేందుకు ఏర్పాట్లు..
కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు వరదల్లో చిక్కుకున్న కూర్మనాథరావు కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారిని సురక్షితంగా తీసుకురావాలని అక్కడి ఎయిర్పోర్టు అధికారులను ఆదేశించారు. తహసీల్దార్ కుటుంబ సమాచారాన్ని విజయనగరం జిల్లా కలెక్టర్ అంబేడ్కర్ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. తహశీల్దార్ కుటుంబాన్ని అక్కడనుంచి సురక్షితంగా తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఢిల్లీలోని ఏపీ భవన్ కూడా తెలిపింది.
ఏపీ సీఎం ప్రిన్సిపల్ కార్యదర్శి రవిచంద్ర ఆదేశాల మేరకు.. ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు అక్కడి జిల్లా కలెక్టర్ అనంత్, ఎస్పీ చుంగ్టన్ అరుణ్ తటాల్ సహా స్థానిక అధికారులతో మాట్లాడుతున్నారు. అవసరమైన సహాయాన్ని అందించడంలో సిక్కిం డీజీపీ శ్రీధర్రావు కీలకపాత్ర పోషిస్తున్నారని ఏపీ భవన్ అధికారులు తెలిపారు..
పర్యాటకుల ఆందోళన..
తహసీల్దార్ కూర్మనాథరావు కుటుంబం ఉన్న మంగన్ జిల్లా లుచూంగ్లో రోడ్లన్నీ కొట్టుకుపోయి రవాణా పూర్తిగా స్తంభించిపోవడంతో అక్కడికి హెలికాప్టర్ వెళ్తేనే వారంతా సురక్షితంగా బయటకొచ్చే అవకాశముంది. వారు బసచేసిన ప్రాంతం చుట్టుపక్కల వరద నీరు చేరడంతో పర్యాటకులంతా ఆందోళన చెందుతున్నారు.