
తిరుమల: అక్టోబర్ 15–23 వరకు తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి చెప్పారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో సమాధానమిచ్చారు. నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ఈ నెల 14న అంకురార్పణ చేయనున్నామని తెలిపారు. బ్రహ్మోత్సవాల తేదీల్లో అన్ని రకాల ప్రివిలేజ్డ్ దర్శనాలను రద్దు చేశామన్నారు. తిరుపతిలో అక్టోబర్ 6, 7, 8, 13, 14, 15వ తేదీల్లో ఎస్ఎస్డీ టోకెన్లు జారీ చేయబోమని చెప్పారు.
29న పాక్షిక చంద్రగ్రహణం కారణంగా 28న రాత్రి 7.05 గంటలకు శ్రీవారి ఆలయ తలుపులు మూసివేసి తిరిగి 29న తెల్లవారుజామున 3.15 గంటలకు తెరుస్తామని చెప్పారు. గ్రహణం కారణంగా తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనాన్ని 28న సాయంత్రం 6 గంటలకు మూసివేసి 29న ఉదయం 9 గంటలకు తెరుస్తామన్నారు. తిరుమలలో యూపీఐ విధానంలో చెల్లింపులు చేసి గదులు పొందిన భక్తులకు వారు గదులు ఖాళీ చేసిన గంటలోపు కాషన్ డిపాజిట్ మొత్తం రీఫండ్ చేస్తున్నట్లు చెప్పారు.
క్రెడిట్/డెబిట్ కార్డు ద్వారా చెల్లింపులు చేసిన వారికి ఖాళీ చేసిన గంటలోనే రీఫండ్ ప్రక్రియను మొదలుపెడతామని, అయితే ఈ మొత్తం వారి బ్యాంకు ఖాతాల్లోకి చేరడానికి 3–7 పనిదినాలు పడుతుందన్నారు. సెపె్టంబర్లో శ్రీవారిని 21.01 లక్షలు మంది దర్శించుకున్నారని, హుండీలో రూ.111.65 కోట్లు వేశారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment