
విజయవాడ: ఏపీలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీలో మూడు రోజులు పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.

మిగతా జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఎల్లుండి నుంచి మత్స్యకారులు వేటకు వెళ్లరాదన్నారు. ప్రజలు చెట్ల క్రింద శిథిలావస్థలో ఉన్న భవనాలు, హోర్డింగ్స్ వద్ద ఉండరాదన్నారు. తీరం వెంబడి 40 నుంచి 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
