imd
-
కచ్చితత్వం దిశగా...
పక్షుల, పాముల, జంతువుల ప్రవర్తనను చూసీ...ఆకాశం తీరుతెన్నులు గమనించీ, గాలివాటు, దాని వేగం గ్రహించీ వాతావరణాన్ని అంచనా కట్టే గతకాలపు రోజుల నుంచి ఇవాళ ఏం జరుగుతుందో, వచ్చే నాలుగైదు రోజుల్లో ఎలాంటి వాతావరణం ఉండబోతున్నదో, రాగల సంవత్సరమంతా ఎలాంటి స్థితిగతులుంటాయో స్పష్టంగా వివరించే సమాచారం అందరికీ అందుబాటులో కొచ్చింది. గత నూట యాభయ్యేళ్లుగా అవిచ్ఛిన్నంగా ఈ పనిలోనే నిమగ్నమై కోట్లాది పౌరులకు చేదోడువాదోడుగా నిలిచిన భారతీయ వాతావరణ విభాగం(ఐఎండీ) తన వార్షికోత్సవాన్ని మంగళ వారం ప్రధాని మోదీ సమక్షంలో ఘనంగా నిర్వహించుకుంది. ఒక దేశ విజ్ఞాన శాస్త్ర అవగాహన ఆ దేశంలోని వైజ్ఞానిక సంస్థల ప్రగతిలో ప్రతిఫలిస్తుందని ఈ సందర్భంగా మోదీ చెప్పిన మాట అక్షరసత్యం. ఈ నూటయాభయ్యేళ్లలో ఐఎండీ సాధించిన ప్రగతి ఇందుకు సాక్ష్యం. ‘వాన రాకడ... ప్రాణం పోకడ’ ఎవరికీ తెలియదనే నానుడి నుంచి మనం చాలా దూరం వచ్చాం. ఇక పోవటం ఖాయమనుకున్న ప్రాణాన్ని నిలబెట్టడానికీ, పునర్జన్మ ఇవ్వడానికీ అధునాతన వైద్య సదుపాయాలు విస్తృతంగా అందుబాటులోకొచ్చాయి. అలాగే వాన ఎక్కడ కురుస్తుందో, దాని తీవ్రత ఏపాటో అంచనా వేయగలుగుతున్నాం. తుపాను ఏర్పడే అవకాశాలు, దాని గమ్యం, గమనం, అది మోసుకు రాగల విపత్తు గురించీ హెచ్చరించటంతో పాటు కరవుకాటకాల ప్రమాదాన్ని తెలియజెప్పటం ఆ రంగంలో సాధించిన ప్రగతికి తార్కాణం. మూడు రోజుల వరకూ వాతావరణం ఎలా ఉండబోతు న్నదో చెప్పే స్వల్పకాలిక అంచనాలు, పదిరోజుల వరకూ వాతావరణ పోకడల్ని వివరించగల మధ్య శ్రేణి అంచనాలు, నెల పాటు ఏ వారమెలా వుంటుందో తెలియజేయగల సామర్థ్యం ఇప్పుడు మన సొంతం. ఇంకా స్థానిక వాతావరణాలను అంచనా వేయగలిగే దిశగా ఐంఎండీ ముందుకెళ్తోంది.పేరులో తప్ప జనాభా రీత్యా, సంపద రీత్యా, లేదా విస్తీర్ణం రీత్యా ఏ రకంగానూ ‘గ్రేట్’ అనే పదానికి అర్హత లేని బ్రిటన్ నుంచి వచ్చిన వలస పాలకులు ఈ దేశంలోని వాతావరణ తీరుతెన్నులు చూసి అయోమయంలో పడ్డారు. వీటిని సక్రమంగా అంచనా వేసే సాధనాలు లేకపోతే సరిగా పాలించటం అసాధ్యమన్న నిర్ణయానికొచ్చిన ఫలితంగానే 1875లో సర్ చార్లెస్ చాంబర్లేన్ నేతృత్వంలో ఐఎండీని నెలకొల్పారు. అంతవరకూ రైతులు సంప్రదాయంగా అనుసరిస్తూ వచ్చిన విధానాలన్నీ క్రమేపీ కనుమరుగై వాతావరణ అధ్యయనం కొత్త పుంతలు తొక్కటం ప్రారంభించింది. కేవలం బ్రిటన్ వాతావరణాన్ని పోలి వుంటుందన్న ఏకైక కారణంతో తమ వెసులుబాటు కోసం సిమ్లాలోని పర్వత ప్రాంతంలో మొదలెట్టిన ఐఎండీ వల్ల పెద్దగా ప్రయోజనం ఉండటం లేదని గ్రహించాక 1928లో పుణేకు తరలిరావటం, ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఢిల్లీకి వెళ్లటం తప్పనిసరైంది. ఐఎండీ డైరెక్టర్ జనరల్గా వచ్చిన గిల్బర్ట్ వాకర్ 1904–1924 మధ్య రెండు దశాబ్దాల సమయంలో భారత వాతావరణంలో చోటుచేసుకున్న అసాధారణతలపై అధ్యయనం చేయటంతో అనేక అంశాలు బయటపడ్డాయి. ముఖ్యంగా ఉష్ణమండల ప్రాంత పసిఫిక్ మహా సముద్ర జలాలపై ఉండే వాయుపీడనంలో వచ్చే హెచ్చుతగ్గులే ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ స్థితిగతులను ప్రభావితం చేస్తున్నాయని ఆ అధ్యయనం తేల్చాక వాతావరణాన్ని అర్థంచేసుకునే తీరే మారిపోయింది. పసిఫిక్ జలాలపై ఉండాల్సిన సాధారణ ఉష్ణోగ్రతలో మైనస్ 17 డిగ్రీల సెల్సియస్ మేరకు హెచ్చితే లాæనినో... ఆ ఉష్ణోగ్రత మైనస్ 17 డిగ్రీల కన్నా తగ్గితే లానినా ఏర్పడు తుందని తేలింది అప్పుడే. ఇదంతా అర్థమయ్యాక రాగల కాలంలో వాతావరణమెలా వుండనున్నదో అంచనా వేయటం సులభమైంది. వాతావరణంలో విడిచిపెట్టే బెలూన్లు గాలిలో తేమనూ, ఉష్ణోగ్రతనూ ఇట్టే చెప్పగలుగుతుండగా ఉపగ్రహాలు నేల పరిస్థితుల గురించి సమాచారం ఇస్తున్నాయి.స్వాతంత్య్రానంతరం వాతావరణాన్ని కొలవటానికి రాడార్ల వంటి ఉపకరణాలు అందుబాటు లోకొచ్చాయి. 1971లో తొలి తుపాను హెచ్చరిక కేంద్రం ఏర్పాటైతే, 1990ల్లో ఇస్రో ఉపగ్రహాలు పంపే డేటాతో వాతావరణ అంచనాల కచ్చితత్వం పెరిగింది. సెకనుకు కొన్ని లక్షల గణనలను చేయగలిగిన అధునాతన సూపర్ కంప్యూటర్ వినియోగం మొదలయ్యాక రుతుపవనాలు, తుపానుల గురించి మాత్రమే కాదు... వడగాల్పులు, వరదల వంటి వైపరీత్యాల గురించి కూడా చెప్పగలుగుతున్నారు. మన దేశంలో సాగుకు యోగ్యమైన భూమిలో 60 శాతం కేవలం వర్షాధారం కావటం, జనాభాలో మూడింట రెండొంతుల మందికి జీవనాధారం వ్యవసాయమే కావటం వల్ల ఐఎండీ చెప్పే అంచనాలు ఎంతో అవసరం. అందుకే వర్షాలు సరిగ్గా ఎక్కడ పడతాయో, ఏ ప్రాంతంలో వడగాడ్పులు వీచవచ్చో, ఎక్కడ పిడుగులు పడే అవకాశం ఉన్నదో కూడా పదేళ్లుగా చెప్పగలుగుతోంది. కృత్రిమ మేధ దీన్ని మరింత పదునెక్కించింది.ఐఎండీ అంచనాల వల్ల ప్రభుత్వాలు అప్రమత్తమై లక్షలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించటం, వేలాది ప్రాణాలను కాపాడుకోవటం సాధ్యమవుతోంది. ఇది మున్ముందు ఇంకా విస్తరించి కనీసం అయిదురోజుల ముందు 90 శాతం కచ్చితత్వంతో చెప్పగలిగే విధానాలను అభివృద్ధి చేసుకోవాలనీ, ఆఖరికి భూకంపాల రాకడను సైతం పసిగట్టగలగాలనీ ఐఎండీ 2047 విజన్ డాక్యుమెంటు విడుదల సందర్భంగా మోదీ చేసిన సూచన శిరోధార్యం. ఈ అంచనాలు మన దేశానికి మాత్రమే కాదు...ఆసియా ప్రాంత దేశాలకు సైతం ఎంతో మేలుచేస్తాయి. పంటల దిగుబడిపై, ఆర్థికవ్యవస్థ తీరుతెన్నులపై మరింత మెరుగైన అంచనాలకు తోడ్పడతాయి. -
పలు రాష్ట్రాలకు కోల్డ్వేవ్ అలర్ట్
న్యూఢిల్లీ:ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాలకు వాతావరణ శాఖ(IMD) అలర్ట్ ఇచ్చింది. జమ్ముకశ్మీర్,పంజాబ్,హర్యానా,రాజస్థాన్,ఢిల్లీలో డిసెంబర్ 30 నుంచి జనవరి 2 వరకు తీవ్రమైన చలి(కోల్డ్వేవ్) ఉంటుందని హెచ్చరించింది. ఉత్తరప్రదేశ్లోని తూర్పు,పశ్చిమ ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు కనిష్టస్థాయికి పడిపోయి చలి తీవ్రంగా ఉంటుందని తెలిపింది. హిమాచల్ప్రదేశ్లో మరో రెండు రోజుల పాటు మంచు(Snow) కురుస్తుందని వెల్లడించింది. కశ్మీర్లో మంచు ప్రభావంతో ఇప్పటికే రోడ్లపై ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడుతోంది. ఇక్కడ పలు విమానాలు, రైళ్లు ఇప్పటికే రద్దయ్యాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో మరో రెండు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది. ఢిల్లీకి వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.ఇదీ చదవండి: హాలిడే సీజన్పై టోర్నడోల ఎఫెక్ట్ -
AP Rains: ఏపీలో మరో రెండ్రోజులు వర్షాలు
విశాఖపట్నం, సాక్షి: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బలహీన పడిన వాయుగుండం.. అల్ప పీడనంగా నైరుతి దిశగా పయనిస్తోంది. ఈ క్రమంలో.. ఏపీకి మరో రెండ్రోజులు వర్షాలు తప్పవని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.ఇప్పటికే వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్నాయి. గడచిన 24 గంటల్లో పల్నాడులో కుండపోత వాన పడింది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మరో రెండు రోజులపాటు విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెబుతోంది.రేపు, ఎల్లుండి నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో భారీ వర్షాలు పడనున్నాయి. కోస్తా తీరం వెంబడి కొనసాగనున్న తీవ్రమైన ఈదురు గాలులు కొనసాగుతాయి. మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని ఇప్పటికే సూచించింది వాతావరణ శాఖ.ఇదీ చదవండి: అకాల వర్షం నిండా ముంచేసింది -
బంగాళాఖాతంలో వాయుగుండం..ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు
సాక్షి,విశాఖ : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. తీవ్ర అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. విశాఖపట్నంనకు 640 కిలోమీటర్ల దూరంలో,చెన్నైకి 370 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో విస్తారంగా వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు పడనున్నాయి. గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశమున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. వాయుగుండం ఏర్పడి వాతావరణం అల్లకల్లోలంగా ఉన్న ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ తీరంలో మత్స్య కారులు వేట నిషేధం విధించింది. కళింగపట్నం , విశాఖ, కాకినాడ, గంగవరం, మచిలీపట్నం పోర్టులో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. -
ఆరెంజ్ అలర్ట్.. ఆ జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు
-
ఏపీలో ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు
విశాఖపట్నం, సాక్షి: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. కోస్తా, రాయలసీమలపై తీవ్ర ప్రభావం చూపెట్టనుంది. ఇప్పటికే సముద్ర వాతావరణం అలజడిగా మారగా.. విశాఖ తీరం వెంట తేలికపాటి వర్షం మొదలైంది. రేపటి నుంచి నగరం సహా కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.ఓవైపు చలి తీవ్రత.. మరోవైపు తేలికపాటి వర్షం విశాఖను వణికిస్తోంది. అల్పపీడన ప్రభావంతో రేపటి నుంచి నాలుగు రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. తాజాగా.. తీరం వెంబడి 35 -45 కిమీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. అలాగే.. రాబోయే మూడు రోజుల్లో కోస్తా, రాయలసీమ భారీ వర్షాలు పడొచ్చని అంచనా వేస్తోంది. ఇప్పటికే.. దక్షిణ కోస్తా మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మరోవైపు వాతావరణశాఖ అంచనాలకు తగ్గట్లే నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షం మొదలైంది. నెల్లూరు, తిరుపతి, కాకినాడ, అనకాపల్లి, విశాఖ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. రేపు ఆయా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. అలాగే.. రేపు కృష్ణా, బాపట్ల, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చని చెబుతూ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. -
రాష్ట్రానికి వాన గండం.. దూసుకొస్తున్న అల్పపీడనం
సాక్షి,విశాఖ : రాష్ట్రానికి వానగండం పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ (బుధవారం) తమిళనాడు - శ్రీలంక తీరాలకు చేరుకునే అవకాశం ఉందని భాతర వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.ఈ అల్పపీడనం దక్షిణ కోస్తా, రాయలసీమపై ఈరోజు, రేపు ప్రభావం చుపనుంది. ఫలితంగా నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సమాచారం. అల్పపీడనం నేపథ్యంలో రేపు నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, సత్యసాయి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. కాగా, ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. అది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ 24 గంటల్లో మరింతగా బలపడే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. బుధవారం నాటికి శ్రీలంక-తమిళనాడు తీరాలకు చేరే అవకాశం ఉంది. దీని ప్రభావంతో డిసెంబర్ 15 వరకు... కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. -
AP : అమ్మో .. మళ్లీ వానలా
సాక్షి,అమరావతి: రాష్ట్రంలో మరోసారి వర్షాలు కురవనున్నాయి. బంగాళాఖాతంలో మంగళవారం అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణశాఖ పేర్కొంది. ఇది రేపటికి తమిళనాడు - శ్రీలంక తీరాలకు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. వీటి ప్రభావం దక్షిణ కోస్తా, రాయలసీమపై రెండు రోజుల పాటు ప్రభావం చూపనుంది. దీని ప్రభావంతో బుధవారం నుంచి శుక్రవారం వరకు కోస్తా, రాయలసీమలో జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో వర్షాలు ఎక్కువగా కురుస్తాయని తెలిపింది.మంగళవారం అల్లూరి, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. బుధవారం ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల,గురువారం తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, నెల్లూరు, వైఎస్సార్, శ్రీసత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా -
దూసుకొస్తున్న ‘ఫెంగల్’
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం : ఫెంగల్ తుపాను దూసుకొస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ఉత్తర వాయువ్య దిశగా గంటకు 12 కి.మీ వేగంతో కదులుతూ ట్రింకోమలీకి తూర్పుగా 110 కిలోమీటర్లు, నాగపట్నానికి ఆగ్నేయంగా 350 కి.మీ., పుదుచ్చేరికి ఆగ్నేయంగా 450 కి.మీ., చెన్నైకి ఆగ్నేయంగా 500 కి.మీ.ల దూరంలో కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ, విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపాయి. ఇది బుధవారం సా.5.30కు తుపానుగా బలపడింది. అనంతరం.. శ్రీలంక తీరాన్ని దాటి తమిళనాడు తీరం వైపు కదిలే అవకాశముంది. 30న దక్షిణ తమిళనాడు, శ్రీలంక మధ్యలో తీరం దాటే అవకాశాలున్నాయని.. ఆ తర్వాత బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారనున్నట్లు వెల్లడించాయి. దీని ప్రభావం ముఖ్యంగా నెల్లూరు జిల్లాలోనూ, రాయలసీమలోని తిరుపతి జిల్లాలోనూ ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. అలాగే, కోస్తాంధ్రలో అక్కడక్కడ గురు, శుక్ర, శనివారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, రాయలసీమలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశముంది. మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు విస్తారంగా పడతాయన్నారు. ప్రకాశం, కడప, అన్నమయ్య జిల్లాల్లోనూ ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే సూచనలున్నాయని.. అందుకనుగుణంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. మత్స్యకారులెవరూ డిసెంబరు 3 వరకూ వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. ఇక తుపాను కారణంగా విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో ఒకటో నంబరు ప్రమాద హెచ్చరిక.. కాకినాడ, గంగవరం పోర్టుల్లో సిగ్నల్–4తో ఒకటో నంబరు ప్రమాద హెచ్చరిక జారీచేశారు. మరోవైపు.. నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్లలో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటుచేశారు. ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే 9491077356 (చిత్తూరు).. నెల్లూరు ప్రజలు 0861–2331261 టోల్ఫ్రీ నంబర్లలో సంప్రదించాలి. అధికారులకు ఆయా జిల్లాల కలెక్టర్లు సెలవులు రద్దుచేశారు.రైతులు అప్రమత్తంగా ఉండాలి..ఫెంగల్ తుపాను దూసుకొస్తున్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి. భారీ వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పంట పొలాల్లో నిలిచే అదనపు నీరు వీలైనంత త్వరగా బయటకుపోయేలా రైతులు ఏర్పాట్లుచేసుకోవాలి. పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాల్లో ఉంచాలి. – రోణంకి కూర్మనాథ్, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ -
ఫెంగల్ పంజా.. చూస్తుండగానే కూలిన భవనం
చెన్నై: తమిళనాడులో ఫెంగల్ తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. బుధవారం ఉదయం నుంచి ఫెంగల్ ధాటికి రాష్ట్రంలో పలు జిల్లాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. మైలాదుత్తురై జిల్లా కేంద్రంలోని ఓ పాత భవనం ఫెంగల్ దెబ్బకు కుప్పకూలింది. దీంతో వాతావరణ శాఖ రాష్ట్రంలోని ప్రాంతాల్లో ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. అలాగే బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఉత్తర-వాయవ్య దిశగా కదులుతూ తమిళనాడు, శ్రీలంక తీరాలవైపు పయనిస్తుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఫలితంగా రాబోయే 24గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనే అంచనాలతో.. తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలోని 15 జిల్లాలలోని కాలేజీలు, స్కూళ్లకు రెండురోజుల పాటు సెలవు ప్రకటించింది.వాతావరణ శాఖ వివరాల ప్రకారం.. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఆరు గంటలపాటు గంటకు 13 కిలోమీటర్ల వేగంతో ఉత్తర-వాయువ్య దిశగా ప్రయాణించింది. సాయంత్రం 5:30 గంటల సమయంలో త్రికోణమలీకి తూర్పు- ఆగ్నేయంగా 130 కిలోమీటర్లు నాగపట్టినానికి ఆగ్నేయంగా 400 కిలోమీటర్లు, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 510 కిలోమీటర్లు, చెన్నైకి ఆగ్నేయంగా 590 కిలోమీటర్లు దూరంలో ఉన్నట్లు పేర్కొంది. VIDEO | An old house collapsed in Tamil Nadu's Mayiladuthurai due to heavy rains earlier today.(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7)#TamilNaduRains pic.twitter.com/sYHwEFfO5W— Press Trust of India (@PTI_News) November 27, 2024 -
ఏపీలో పిడుగులతో వర్షాలు
అమరావతి, సాక్షి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. వాయుగుండంగా మారి.. పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోంది. మరో 24 గంటల్లో తీవ్ర వాయుగుండగా మారే అవకాశం కనిపిస్తోంది. ఈ ప్రభావంతో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని ఐఎండీ హెచ్చరిస్తోంది.రేపటి నుంచి ఏపీపై వాయుగుండం ప్రభావం కనిపించనుంది. రాష్ట్రంలో మూడు రోజులపాటు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తాలో రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. ఈ నెల 28, 29న నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి.తీరప్రాంతాల్లో 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని.. దక్షిణ కోస్తాలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు.. కోస్తాంధ్రలో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కోస్తాంధ్ర రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచించారు. -
భారత్లో విచిత్రమైన వాతావరణం!! 123 ఏళ్ల తర్వాత..
ఢిల్లీ: భారత్లో దాదాపు 120 ఏళ్ల తర్వాత విచిత్రమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. నవంబర్ నెల వచ్చేసింది. అయినా చలి జాడ లేకుండా పోయింది. దీంతో ఈ నెల కూడా సూర్యతాపం తప్పదని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.భారత్లో నెలకొన్ని ఈ అసాధారణ వాతావరణ పరిస్థితులపై ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో భారత వాతావరణ శాఖ(IMD) డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర వివరించారు. బంగాళాఖాతంలో అల్పపీడనలు తరచూ ఏర్పడడం, తూర్పు గాలుల ప్రభావం, పశ్చిమ దిశ నుంచి ఎలాంటి అవాంతరాలు లేకపోవడం.. తదితర కారణాల వల్ల దేశవ్యాప్తంగా వాతావరణం వెచ్చగా ఉంటోందని వెల్లడించారు. అలాగేవాతావరణ శాఖ గణాంకాల ప్రకారం.. 1901 తర్వాత ఈ ఏడాది అక్టోబర్ అత్యంత వెచ్చని నెలగా రికార్డయ్యింది. సాధారణం కంటే.. 1.23 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అధికంగా నమోదైంది. అలాగే దేశవ్యాప్తంగా సరాసరి ఉష్ణోగ్రత చూసినా.. 1.84 డిగ్రీల సెల్సియస్(20.01 డిగ్రీల సెల్సియస్ బదులు 21.85 డిగ్రీల సెల్సియస్ నమోదైంది) అధికంగానే రికార్డు అయ్యింది. ఈ గణాంకాలను బట్టి నవంబర్ నెల కూడా ఉష్ణోగ్రతల్లో తగ్గుముఖం ఉండకపోవచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది. అలాగే.. రాబోయే రెండు వారాలు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగవచ్చని చెబుతోంది.అంటే.. ఈసారి నవంబర్ చలితో వణికించదని ఐఎండీ డైరెక్టర్ మహాపాత్ర చెబుతున్నారు. అలాగే.. డిసెంబర్ నుంచి మొదలయ్యే చలి జనవరి, ఫిబ్రవరి నెలలపాటు కొనసాగుతుందని వెల్లడించారు. అంతేకాదు.. దక్షిణ భారతంలో నవంబర్ నెలలో రుతుపవనాల తిరోగమనం సమయంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని కూడా తెలిపారాయన. -
ఏపీకి ముంచుకొస్తున్న వాయుగుండం.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్
సాక్షి,అమరావతి: మరి కొద్ది గంటల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నట్లు అంచనా వేసింది.ఈ తరుణంలో దక్షిణ కోస్తా, రాయలసీమకు వాతావరణ శాఖ హై అలర్ట్ ప్రకటించింది. ఈనెల 17న పుదుచ్చేరి, తమిళనాడు, దక్షిణ కోస్తా దగ్గర వాయుగుండం తీరం దాటుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. నెల్లూరు, ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు, వైఎస్సార్, తిరుపతి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తా, రాయల భారీ వర్షాలు , కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు పడనున్నాయి. ఫ్లాష్ ఫ్లడ్ సంభవించే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచనలు జారీ చేసిందిబంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడనుండటంతో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే వేటలో ఉన్న మత్స్యకారులను వెనక్కి రావాలని స్పష్టం చేసింది. ప్రజా రవాణా, రైల్వేల రాకపోకలపై నిరంతర పర్యవేక్షణ వుండాలని వాతావారణ శాఖ సూచనలు జారీచేసింది. -
ఏపీకి మళ్లీ తుఫాను ముప్పు
సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతుపవనాల ఉపసంహరణ మొదలైన క్రమంలో ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వాస్తవానికి ఏటా అక్టోబర్ 20న ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకుతుంటాయి. ఈసారి చురుగ్గా ముందుకు కదులుతుండటంతో.. 15 నాటికి దక్షిణ కోస్తాలోకి వచ్చే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో వర్షాలు జోరందుకోనున్నాయని వెల్లడించారు. మరోవైపు.. దక్షిణ బంగాళాఖాతంలో ఈనెల 12న ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. ఇది 16 నాటికి బలపడి తుపానుగా మారే సూచనలున్నాయని అంచనా వేస్తున్నారు. అయితే.. దీని ప్రభావం తమిళనాడు, దక్షిణ కోస్తా జిల్లాలపై ఉండే సూచనలున్నాయని చెప్పారు. ప్రస్తుతం కేరళ, తమిళనాడు మీదుగా నైరుతి బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 4.5 కి.మీ. ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వెల్లడించారు. దీని ప్రభావంతో నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, అనంతపురం, రాయలసీమల్లో అక్కడక్కడా మోస్తరు వానలు పడే అవకాశాలున్నాయనీ.. అదేవిధంగా.. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ చెదురుమదురు వానలు కురుస్తాయని ఏపీ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. -
10 రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
న్యూఢిల్లీ: దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బీహార్లో భారీ వర్షాలకు అక్కడి జనం అతలాకుతలమవుతున్నారు. తూర్పు యూపీలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.రాబోయే ఐదారు రోజుల్లో ఈశాన్య ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. అసోం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర తదితర 10 రాష్ట్రాల్లో కుండపోత వర్షాలకు అవకాశం ఉంది. రాబోయే 24 గంటల్లో ఉప-హిమాలయ పశ్చిమ బెంగాల్, బీహార్, సిక్కిం, అండమాన్- నికోబార్ దీవులలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.ఉత్తరాఖండ్, తూర్పు ఉత్తరప్రదేశ్, తూర్పు రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కేరళ, కోస్టల్ కర్నాటక, లక్షద్వీప్ తదితర దక్షిణాది ప్రాంతాలలో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. గుజరాత్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అందించిన డేటా ప్రకారం ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 106గా నమోదైంది. ఈ ఏడాది రుతుపవనాలు వారం రోజులు ఆలస్యంగా వచ్చాయి. రాజస్థాన్, గుజరాత్లలో రుతుపవనాల ఉపసంహరణ సెప్టెంబర్ 23 నుండి ప్రారంభమైంది. ఢిల్లీలో రుతుపవనాల ఉపసంహరణ సాధారణంగా సెప్టెంబర్ 25న జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం గణనీయంగా ఆలస్యమవుతోంది.ఇది కూడా చదవండి: పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర.. ఎంతంటే? -
ముంబైని మరోసారి ముంచెత్తనున్న భారీ వర్షాలు
ముంబై : మహరాష్ట్రకు వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. మరోసారి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. రెండ్రోజుల క్రితం భారీ వర్షాలు ముంబై నగరాన్ని ముంచెత్తాయి. ఫలితంగా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. జనజీవనం స్తంభించి పోయింది. ఈ తరుణంలో శుక్రవారం మధ్యాహ్నం వాతావరణ శాఖ ముంబైకి మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. బలమైన పశ్చిమ గాలుల కారణంగా శుక్రవారం ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం నుంచి శనివారం ఉదయం 8గంటల వరకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.ఈ సందర్భంగా పాల్ఘర్, రాయ్గఢ్ పరిసర జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అంతేకాదు ముంబైలోని పలు ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలుస్తోంది.👉చదవండి : సీఎం సార్.. కర్మ సిద్ధాంతం అంటే ఇదే కదా -
ముంబైలో వర్ష బీభత్సం
ముంబై: మహరాష్ట్రలో వర్ష బీభత్సం సృష్టిస్తుంది. బుధవారం సాయంత్రం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి ముంబై రోడ్లు జలమయమయ్యాయి. ట్రాఫిక్ స్తంభించిపోయింది. వర్షం కారణంగా స్పైస్జెట్, విస్తారాతో పాటు పలు సంస్థలు విమానాలను దారి మళ్లించాయి. వాతావరణ శాఖ బుధవారం ఉదయం ముంబైతో పాటు పొరుగు జిల్లాలకు హెచ్చరిక జారీ చేసింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. వాతావరణ శాఖ హెచ్చరికల అనంతరం మధ్యాహ్నం నుంచి ముంబైలోని పలు శివారు ప్రాంతాలలో భారీ వర్ష పాతం నమోదైంది. ములుండ్ దాని పరిసరాల్లో భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వాతావరణ శాఖ అధికారి సుష్మా నాయర్ మాట్లాడుతూ, ఉత్తర కొంకణ్ నుండి దక్షిణ బంగ్లాదేశ్ వరకు దక్షిణ ఛత్తీస్గఢ్ దాని పరిసర ప్రాంతాలలో తుఫాను ద్రోణి నడుస్తుందని చెప్పారు. ఫలితంగా ముంబై, థానే, రాయ్గఢ్, రత్నగిరి జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కావడంతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులతో భారీ వర్షం కురుస్తుందన్నారు. ఈ వారంలో కొంకణ్, గోవాలో దీని ప్రభావం ఎక్కువగా ఉందని ఆమె వావాతవరణ శాఖ అధికారి సుష్మా నాయర్ చెప్పారు. -
హైదరాబాద్కు మరోసారి భారీ వర్షసూచన
సాక్షి,హైదరాబాద్:రాజధాని హైదరాబాద్ నగరంలో వరుసగా మూడోరోజు ఆదివారం(సెప్టెంబర్22) భారీ వర్షం పడే ఛాన్సుందని వాతావరణశాఖ తెలిపింది.నాగోల్, బండ్లగూడ, ఉప్పల్, బోడుప్పల్, మీర్పేట్, ఎల్బీనగర్,దిల్సుఖ్నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడనుందని వాతావరణశాఖ తెలిపింది.కాగా, శుక్ర,శనివారాలు సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి నగరంలో రోడ్లపై వరదలు పోటెత్తి ఎక్కడికక్కడ ట్రాఫిక్జామ్ అయింది. దీంతో వాహనదారులు గంటల తరబడి రోడ్లపై ట్రాఫిక్లో చిక్కుకుపోయారు. పలు చోట్ల విద్యుత్తీగలపై చెట్లు,ఫ్లెక్సీలు పడి విద్యుత్ అంతరాయాలు ఏర్పడ్డాయి. ఇదీ చదవండి: హైదరాబాద్లో కుండపోత వర్షం -
ఏపీకి మరో తుపాన్ ముప్పు!
సాక్షి, విశాఖపట్నం: ఈ నెలాఖరులో రాష్ట్రానికి తుపాను ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. ఉత్తర బంగాళాఖాతం, మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఈ నెల 24న ఏర్పడే అల్పపీడనం తీవ్రరూపం దాల్చి తుపానుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. తుపానుగా మారితే.. ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలుంటాయని తెలిపారు. పశ్చిమ వాయువ్య దిశగా వీస్తున్న గాలుల ప్రభావంతో 20 నుంచి రాష్ట్రంలో వర్షాలు కురిసే సూచనలున్నాయని చెప్పారు. -
దేశంలో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
న్యూఢిల్లీ: దేశంలోని పలు రాష్ట్రాలు భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో పశ్చిమ బెంగాల్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్లోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ(ఐఎండీ) హెచ్చరికలు జారీచేసింది.కోస్తా ఆంధ్ర ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు(సోమవారం) భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఛత్తీస్గఢ్లోని దక్షిణ ప్రాంతంలో సోమవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రానున్న మూడు రోజుల్లో ఒడిశాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. మత్స్యకారులు సెప్టెంబర్ 11 వరకు సముద్రంలోకి వెళ్లవద్దని వాతావరణశాఖ అధికారులు సూచించారు.ఇది చదవండి: Surat: వినాయక మండపంపై రాళ్ల దాడి.. పలువురు అరెస్ట్ -
ఆంధ్రప్రదేశ్కు పొంచి ఉన్న మరో ముప్పు
సాక్షి, అమరావతి : భారీ వర్షంతో ఆంధ్రపద్రశ్కు భారీ ముంపు పొంచి ఉంది. రాష్ట్రంలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.రాష్ట్రంలో మరోసారి భారీ వర్షాలు కురవనున్నాయి. రానున్న 48గంటల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఉత్తర అండమాన్ సమీపంలో ఏర్పడనున్న ఈ అల్పపీడనం క్రమంగా తుఫానుగా మారే అవకాశం ఉంది.ఈ తుఫాను ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరం దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వాయిగుండం సృష్టించిన విలయం మరువకముందే మరో తుఫాను గండం ముంచుకొస్తుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. -
తెలంగాణ అంతటా మరోసారి భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక
ఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జనజీవనం అస్తవ్యస్థమైంది. లోతట్టు ప్రాంతాల్లో నీటి మునిగాయి. వర్షం బీభత్సంతో వాహనాలు సైతం కొట్టుకుపోతున్నాయి. పలువురు నీట మునిగి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మహబూబాబాద్లో కురస్తున్న భారీ వర్షాలకు ఇంటికన్నె-కేసముద్రం మధ్య రైల్వే ట్రాక్ ధ్వంసమైంది. ఫలితంగా రైళ్ల రాకపోకలు ఆగిపోయాయి. పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు కేంద్ర హోంశాఖ ఆదేశాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి.ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం ఐఎండీ గుజరాత్తో పాటు ఇప్పటికే వరదలతో అల్లాడుతున్న తెలంగాణా అంతటా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో 52 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది రాష్ట్రంలో ఈ సీజన్లో అత్యధిక వర్షపాతం. వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల్లో 40 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. భారీ వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే ఆదివారం రాష్ట్రంలో ప్రయాణించే పలు రైళ్లను రద్దు చేసి దారి మళ్లించింది. హైదరాబాద్లోనూ శనివారం ఉదయం 8.30 గంటల నుంచి ఆదివారం ఉదయం 8.30 గంటల వరకు భారీ వర్షం కురిసింది. 2020 వరదల మాదిరిగానే 30 సెం.మీ కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉన్న అనుకూల వాతావరణంతో నగరానికి ఉపశమనం కలిగినట్లు తెలిపింది.ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్, ఆసిఫాబాద్, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ, జనగాం సహా రాష్ట్రంలోని 15 జిల్లాల్లో ఆదివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. గుజరాత్లో సైతం1976 తర్వాత అరేబియా సముద్రంలో తొలిసారి తుపాను విధ్వంసం సృష్టిస్తోంది. గుజరాత్లో ఆగస్ట్ 25 నుంచి ఆగస్ట్ 29 వరకు కురిసింది. ఈ వర్షం ధాటికి 47 మంది మరణించారు. ఈ తరుణంలో ఆదివారం (సెప్టెంబర్1) వాతవారణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. ఈ రోజు నుంచి ప్రారంభమైన వర్షాలు సెప్టెంబర్ 5వరకు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. -
తెలంగాణలో రెండు రోజులపాటు వర్షాలు
సాక్షి,హైదరాబాద్: రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో శుక్ర,శనివారాల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.రాజధాని హైదరాబాద్ నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్సుంది. ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. -
తెలంగాణలో ఐదు రోజుల పాటు వర్షాలు: ఐఎండీ
సాక్షి,హైదరాబాద్: జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం కొనసాగుతోంది. ఆవర్తనం కారణంగా తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.రాబోయే ఐదు రోజులపాటు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలకు అవకాశం ఉందని వెల్లడించింది.కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉంది. -
హైదరాబాద్లో భారీ వర్షం.. రోజంతా వర్ష సూచన
సాక్షి,హైదరాబాద్: రాజధాని హైదరాబాద్ నగరంలో శుక్రవారం(ఆగస్టు16) మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. మణికొండ, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, టోలిచౌకిలో వర్షం దంచికొట్టింది. దీంతో రోడ్లపై వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల ట్రాఫిక్జామ్ అయింది. నగరవ్యాప్తంగా క్యుములోనింబస్మేఘాలు కమ్ముకోవడంతో మధ్యాహ్నం నగరంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షం పడే అవకాశముందని వాతావరణకేంద్రం తెలిపింది. అత్యవసర పనులు ఉంటేనే ఇళ్లలో నుంచి బయటికి రావాలని, నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ సూచించింది.కాగా, గురువారం రాత్రి కురిసిన గాలివానకు నగరంలోని చాలా ప్రాంతాలు అతలాకుతలమైన విషయం తెలిసిందే. హైదరాబాద్ నగరంతో పాటు దక్షిణ తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడే ఛాన్సున్నట్లు సమాచారం.