
న్యూఢిల్లీ: దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బీహార్లో భారీ వర్షాలకు అక్కడి జనం అతలాకుతలమవుతున్నారు. తూర్పు యూపీలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
రాబోయే ఐదారు రోజుల్లో ఈశాన్య ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. అసోం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర తదితర 10 రాష్ట్రాల్లో కుండపోత వర్షాలకు అవకాశం ఉంది. రాబోయే 24 గంటల్లో ఉప-హిమాలయ పశ్చిమ బెంగాల్, బీహార్, సిక్కిం, అండమాన్- నికోబార్ దీవులలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఉత్తరాఖండ్, తూర్పు ఉత్తరప్రదేశ్, తూర్పు రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కేరళ, కోస్టల్ కర్నాటక, లక్షద్వీప్ తదితర దక్షిణాది ప్రాంతాలలో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. గుజరాత్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అందించిన డేటా ప్రకారం ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 106గా నమోదైంది. ఈ ఏడాది రుతుపవనాలు వారం రోజులు ఆలస్యంగా వచ్చాయి. రాజస్థాన్, గుజరాత్లలో రుతుపవనాల ఉపసంహరణ సెప్టెంబర్ 23 నుండి ప్రారంభమైంది. ఢిల్లీలో రుతుపవనాల ఉపసంహరణ సాధారణంగా సెప్టెంబర్ 25న జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం గణనీయంగా ఆలస్యమవుతోంది.
ఇది కూడా చదవండి: పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర.. ఎంతంటే?
Comments
Please login to add a commentAdd a comment