
సాక్షి, నరసరావుపేట: ‘ఇది కొత్త శకానికి నాంది పలికిన రోజు. మన విద్యార్థులు పోటీతత్వంతో ప్రపంచ వ్యాప్తంగా రాణించాలి. సీఎం జగన్ ఆలోచనలకు దిక్సూచిలా, రాబోయే తరాలకు ఆదర్శంగా ఉండాలి’ అని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. బాపట్ల జిల్లా చుండూరు మండలం యడ్లపల్లిలో బుధవారం ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు సీఎం వైఎస్ జగన్ ట్యాబ్లు పంపిణీ చేసే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జగనన్న హయాంలో నిలదొక్కుకున్న భావి భారత పౌరులమని గర్వంగా చెప్పుకునేలా నిలవాలని కోరుకుంటున్నానని ఆకాంక్షించారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. అంబేడ్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, నెల్సన్ మండేలా ఆలోచనా విధానాలు, ఆదర్శాలకు ప్రతిరూపం సీఎం జగన్ అని అన్నారు.
థ్యాంక్యూ మామా..!
జగన్ మామా.. హ్యాపీ బర్త్ డే. గత మూడేళ్లుగా విద్యా వ్యవస్థలో మీరు తెచ్చిన మార్పులను ప్రత్యక్షంగా చూస్తున్నాం. అమ్మ ఒడి పథకం పేద, మధ్య తరగతి విద్యార్థులకు వరం లాంటిది. నాడు నేడు కార్యక్రమం, ఇంగ్లిషు మీడియం, ట్యాబ్ల పంపిణీ ఇలా విద్యారంగంలో విప్లవాత్మక చర్యలు తీసుకుంటున్నారు. మామా.. «థ్యాంక్యూ.. – సాయి నాగశ్రీ, 8 వ తరగతి విద్యార్థిని, జెడ్పీహెచ్ఎస్ ఐలవరం, వేమూరు నియోజకవర్గం
బర్త్డే కానుక..
మామయ్యా.. మీరు సీఎం అయిన తర్వాత నాడు నేడు, అమ్మ ఒడి, విద్యాకానుక, గోరుముద్ద లాంటి ఎన్నో పథకాలు తెచ్చారు. ప్రభుత్వ స్కూళ్లలో అన్ని వసతులు కల్పించారు. పుట్టినరోజు సందర్భంగా మేం మీకు కానుక ఇవ్వాలి. కానీ మీరే మాకు ట్యాబ్లు ఇస్తున్నారు. బాగా చదువుకుని మీ పేరు నిలబెడతాం జగన్ మామయ్యా.
– సాత్విక, 8 వ తరగతి విద్యార్థిని, మునిసిపల్ గరల్స్ హైస్కూల్, తెనాలి