CM Jagan Review Meeting On Heavy Rains And Floods In Andhra Pradesh - Sakshi
Sakshi News home page

వర్షాలు, వరదలపై సీఎం జగన్‌ ఉన్నతస్థాయి సమీక్ష

Published Thu, Jul 27 2023 9:19 PM | Last Updated on Fri, Jul 28 2023 2:35 PM

CM Jagan Review Meeting On Heavy Rains And Floods In Andhra Pradesh - Sakshi

సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలోని వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సీఎంవో అధికారులతో సమావేశం చేపట్టారు. గోదావరిలో వరద పెరుగుతుండడంతో అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గోదావరి నదీతార ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉంటూ ముంపు బాధితులకు బాసటగా నిలవాలని తెలిపారు. ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కోనసీమ జిల్లాల  పరిస్థితులతోపాటు, భారీవర్షాలు కురుస్తున్న ఇతర ప్రాంతాల గురించి కూడా ముఖ్యమంత్రి ఆరాతీశారు. 

42 మండలాల్లోని 458 గ్రామాలను అప్రమత్తం చేశామని సీఎం​​కు అధికారులు వివరించారు. సహాయచర్యల్లో 3 NDRF, 4 SDRF బృందాలు ఉన్నాయని తెలిపారు. గోదావరి నదికి ఆనుకుని ఉన్న జిల్లాల్లో ఇప్పటికే కంట్రోల్‌ రూమ్స్‌ పనిచేస్తున్నాయని, ముంపునకు ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో బోట్లు సహా సహాయక సిబ్బందిని సిద్ధంచేశామని అధికారులు తెలియ జేశారు. ఏలూరు జిల్లా కుకునూరు, వేలేరుపాడు సహా ఇతర మండలాల్లో ఇప్పటికే సహాయక శిబిరాలను తెరిచామని చెప్పారు.
చదవండి: చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే: మంత్రి అంబటి

ముంపు ప్రాంత ప్రజలను సహాయక శిబిరాలకు తరలించామని, మందులు సహా ఇతరత్రా అత్యవసర వస్తువులను సిద్ధంగా ఉంచామని అధికారులు సీఎంకు వివరించారు.  కోనసీమ జిల్లాలో 150 బోట్లను రెడీ ఉంచామన్న అధికారులు.. అలాగే పశ్చిమగోదావరి జిల్లాలోని మూడు మండలాల్లో ముంపునకు ఆస్కారం ఉన్న గ్రామాల్లో అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. 

అయితే  సహాయక శిబిరాల్లో ఎలాంటి కొరతా లేకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. తాగునీరు సహా ఇతరత్రా సదుపాయాలు విషయంలో ఎక్కడా లోటు రాకూడదని అన్నారు. సహాయక చర్యల విషయంలో గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిని, వాలంటీర్ల సేవలను వినియోగించుకోవాలి సూచించారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుని, ఆ మేరకు ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వరద ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాలు కోసం ముందస్తుగా నిధులను అందుబాటులో ఉంచాలని సీఎం జగన్ పేర్కొన్నారు.
చదవండి: హైదరాబాద్- విజయవాడ రహదారిపై స్తంభించిన రాకపోకలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement