
సాక్షి, అమరావతి: పోలవరం జాతీయ ప్రాజెక్టు పనులను ఈనెల 4న కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్తో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. అక్కడి అంశాల ఆధారంగా కేంద్ర జల్ శక్తి శాఖ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), రాష్ట్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో కేంద్ర మంత్రి షెకావత్, సీఎం వైఎస్ జగన్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. సకాలంలో ప్రాజెక్టును పూర్తి చేయడానికి సహకరించాలని షెకావత్కు సీఎం జగన్ విజ్ఞప్తి చేయనున్నారు.
కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) 2017–18 ధరల ప్రకారం ఆమోదం తెలిపిన సవరించిన అంచనా వ్యయం రూ. 55,548.87 కోట్లకు పెట్టుబడి అనుమతి (ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్) ఇచ్చి, నిధులు విడుదల చేయాలని కోరనున్నారు. పెండింగ్లో ఉన్న డిజైన్లను యుద్ధప్రాతిపదికన ఆమోదించేలా సీడబ్ల్యూసీని ఆదేశించాలని విజ్ఞప్తి చేయనున్నారు. పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించడానికి కేంద్ర మంత్రి షెకావత్ ఈనెల 3న ఢిల్లీ నుంచి విమానంలో విజయవాడకు చేరుకోనున్నారు. విజయవాడ నుంచి 4న ఉదయం హెలీకాప్టర్లో సీఎం జగన్తో కలిసి షెకావత్ పోలవరానికి చేరుకుని.. ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment