
సాక్షి, అమరావతి: ఇసుక, మద్యం అక్రమాలతో పాటు అక్రమ రవాణాకు ఎవరు పాల్పడినా ఉపేక్షించాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కలెక్టర్లు, ఎస్పీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. స్పందన కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఇసుక, మద్యం అక్రమాలపై ప్రభుత్వ విధానాన్ని స్పష్టం చేశారు. మద్యం, ఇసుకపై నిరంతరం పర్యవేక్షణ జరుగుతోందన్న సీఎం, వాటిపై జిల్లా ఎస్పీలు, ఎస్ఈబీ సిబ్బంది ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారని ప్రశంసించారు. మద్యం ధరలను తగ్గించడం వల్ల స్మగ్లింగ్ జరగకుండా చర్యలు తీసుకున్నప్పటికీ, ఆ ప్రక్రియ ఇంకా కొనసాగుతోందన్నారు. సీఎం ఇంకా ఏమన్నారంటే..
► ఎవరైనా మద్యం, ఇసుక అక్రమ రవాణాకు ప్రయత్నిస్తే కఠినంగా వ్యవహరించాలి. వాటిపై రాజకీయంగా ఎటువంటి ఒత్తిళ్లు రావు.
► క్రితంసారి కొన్ని విషయాలు ప్రస్తావించాను. కొన్ని సున్నిత అంశాల మీద, ముఖ్యంగా అట్టడుగు వర్గాల కేసులకు సంబంధించి, పోలీసులు అనుసరించిన విధానం, వ్యవహరించిన తీరు బాగుందని పత్రికల్లో చదివాను.
► వాటికి సంబంధించి సీఐ, ఎస్ఐ నుంచి కానిస్టేబుల్ వరకు స్పష్టమైన మెసేజ్ వెళ్లాలి. లేదంటే మంచి ఫలితాలు రావు. ఆ దిశలో సిబ్బందిని బాగా సెన్సిటైజ్ చేశారు. ఎస్పీలకు అభినందనలు.