
సాక్షి, తూర్పుగోదావరి: అంతర్వేది నూతన రథం నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం శరవేగంగా చర్యలు చేపడుతుంది. దీనిలో భాగంగా రావులపాలెం టింబర్ డిపోలో రథం నిర్మాణానికి అవసరమైన బస్తర్ టేకు కలప దుంగలను అధికారులు గుర్తించారు. 21 అడుగుల పొడవైన దూలాలుగా వాటిని కోయించే ప్రక్రియ ప్రారంభమైందని, రథం నిర్మాణానికి 1330 ఘనపుటడుగుల కలప వినియోగిస్తున్నామని దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ రామచంద్ర మోహన్ తెలిపారు. (చదవండి: కొత్త రథం నిర్మాణ డిజైన్లు ఖరారు)
పాత రథం నమూనాలోనే అంతర్వేది ఆలయ కొత్త రథం నిర్మాణ డిజైన్లను దేవదాయ శాఖ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. 41 అడుగుల ఎత్తు, ఆరడుగుల వెడల్పుతో ఏడంతస్తుల్లో ఆలయ రథం ఉంటుందని దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఇటీవల వివరించారు. ఆరు చక్రాలతో కూడిన కొత్త రథం నిర్మాణంతో పాటు, రథశాల మరమ్మతులకు రూ.95 లక్షలు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. (చదవండి: అంతర్వేది ఘటన వెనుక చంద్రబాబు హస్తం)