
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీగా కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపు జరిగింది. తాజాగా స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న మరో 1500 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారు. అయితే, ముఖ్యమంత్రి చంద్రబాబుతో స్టీల్ సెక్రటరీ భేటీ అనంతరం కార్మికులను తొలగించడం గమనార్హం.
వివరాల ప్రకారం.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ మరో 1500 మంది కాంట్రాక్ట్ కార్మికుల తొలగించారు. గతంలో 1100 మంది కాంట్రాక్ట్ కార్మికులను యాజమాన్యం తొలగించిన విషయం తెలిసిందే. కార్మికుల ఆందోళన కొనసాగుతున్నప్పటికీ తొలగింపు ప్రక్రియ మాత్రం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో నేడో, రేపో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు కార్మికులు. అయితే, స్టీల్ ప్లాంట్ యాజమాన్యం దాదాపు 4500 మందిని తొలగించాలని ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఇక, సీఎం చంద్రబాబుతో స్టీల్ సెక్రటరీ భేటీ అనంతరం కార్మికుల తొలగింపు జరగడం గమనార్హం. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై కార్మిక సంఘాలు నేతలు మండిపడుతున్నారు.
