
సాక్షి, అమరావతి : వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీతోఫా పథకాలను అర్హులైన వారందరికీ సంతృప్తస్థాయిలో అమలుచేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ సంకల్పమని.. ఇందుకోసం ఈ పథకాలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన పెంచాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కేఎస్ జవహర్రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. వివాహాల సంఖ్యతో పోలిస్తే వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీతోఫాల రిజి్రస్టేషన్ల సంఖ్య చాలా తక్కువగా ఉందని ఇటీవల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో సీఎస్ తెలిపారు. ఏ పథకమైనా సంతృప్త స్థాయిలో అర్హులందరికీ వర్తించడమే వైఎస్సార్సీపీ ప్రభుత్వం విధానమని స్పష్టంచేశారు. ఇందులో భాగంగానే వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీతోఫాలపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని కలెక్టర్లకు సీఎస్ సూచించారు.
నాడు అర్హులను ఎలా తగ్గించాలన్నదే ధ్యాస
నిజానికి.. గత ప్రభుత్వం ఏ పథకానికైనా అర్హులను ఎలా తగ్గించాలని ఆలోచిస్తే అందుకు భిన్నంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం దరఖాస్తులు తక్కువగా ఎందుకు వచ్చాయని ఆలోచిస్తోంది. అంతేకాక.. వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీతోఫా పథకాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లి అర్హులందరూ రిజి్రస్టేషన్ చేయించుకునేలా చర్యలను చేపడుతోంది. ఇక గత ఏడాది అక్టోబర్ 1 నుంచి వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీతోఫా అమల్లోకి వచ్చాయి. అప్పటి నుంచి ఈ నెల 4 వరకు వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫాకు 7,203 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఈ నేపథ్యంలో.. వివాహాల సంఖ్యతో పోలిస్తే ఈ రెండు పథకాలకు వచ్చిన దరఖాస్తుల సంఖ్య తక్కువగా ఉన్నందున ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు చర్యలను చేపట్టాల్సిందిగా కలెక్టర్లను ఆదేశించారు. ఈ రెండింటి కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకున్న వారికి పక్షం రోజుల్లోగా డిజిటల్ వివాహ ధ్రువీకరణ పత్రాలను జారీచేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. దరఖాస్తులు పెండింగ్ లేకుండా కూడా సకాలంలో ఆమోదించాలని కలెక్టర్లకు సూచించారు. పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్లు, గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శి వివాహ ధ్రువీకరణ పత్రాలను ఆమోదించాలన్నారు.
నియమ నిబంధనలివే..
బీసీ, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, మైనార్టీ వర్గాలు, భవన కారి్మకుల కుటుంబాలకు వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీతోఫా వర్తింపజేస్తున్న విషయం తెలిసిందే. వివాహమైన 60 రోజుల్లోపు దగ్గరలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో సంప్రదించి వివాహ ధ్రువీకరణ పత్రాన్ని దరఖాస్తు చేసుకుని పొందవచ్చును. వరుడు, వధువు తప్పనిసరిగా పదవ తరగతి ఉత్తీర్ణత అయి ఉండాలని, అలాగే వివాహ తేదీ నాటికి వధువు వయస్సు 18 ఏళ్లు, వరుడు వయస్సు 21 ఏళ్లు నిండి ఉండాలి. గ్రామాల్లో నెలకు రూ.పది వేలు, పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ.12 వేలలోపు ఆదాయం గల వారు ఇందుకు అర్హులు.
Comments
Please login to add a commentAdd a comment