
సాక్షి, అమరావతి: మారుమూల గ్రామాలకు చెందిన రైతులకు సైతం ఆర్థిక చేయూతనిచ్చే లక్ష్యంతో మండలానికో జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ) శాఖలను ఏర్పాటు చేయబోతున్నట్టు రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖమంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతానికి సంబంధించి ప్రస్తుతం 343 మండలాల్లో మాత్రమే డీసీసీబీ బ్రాంచ్లున్నాయని, మరో 332 మండలాల్లో బ్రాంచ్ల్లేవని, ఆయా మండలాల్లో రానున్న మూడేళ్లలో కొత్త బ్రాంచ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఏడాది కనీసం 30 శాతం మండలాల్లో బ్రాంచ్లు ఏర్పాటు చెయ్యాలని ఆదేశించారు.
డీసీసీబీ శాఖల విస్తరణ, ఇతర అంశాలపై ఆప్కాబ్ఎండీ శ్రీనాథ్రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో విజయవాడలో సమీక్ష జరిపారు. డీసీసీబీల ద్వారా మహిళా స్వయం సహాయక సంఘాలతో పాటు కౌలు రైతులకు అధికంగా రుణాలు ఇచ్చే విషయంలో ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. దీని వల్ల ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అమలు చేసేందుకు దోహదపడతాయని చెప్పారు. రాష్ట్రంలో 675 మండలాలుండగా, వాటి పరిధిలో 416 బ్రాంచ్లున్నాయని తెలిపారు. వాటిలో 73 బ్రాంచ్లు పట్టణాలు, నగరాల్లో ఉన్నాయన్నారు. గడచిన మూడేళ్లలో 21 బ్రాంచ్లు కొత్తగా ఏర్పాటు చేయగా, ప్రస్తుతం గుంటూరు జిల్లాలో 20,చిత్తూరు జిల్లాలో 10, నెల్లూరు జిల్లాలో 4బ్రాంచ్లు ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను ఆప్కాబ్ ద్వారా నాబార్డుకు పంపినట్టు అధికారులు వివరించగా, సాధ్యమైనంత త్వరగా వాటిని ప్రారంభించాలని మంత్రి సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment