DCCB
-
రైతుల ‘వేలం’వర్రీ!
సాక్షి, హైదరాబాద్: పాడి గేదెల పెంపకం కోసమో, వ్యవసాయ యంత్రాల కొనుగోలు, ఇతరత్రా అవసరాల కోసమో తీసుకున్న దీర్ఘకాలిక రుణాలను సహకార బ్యాంకులు రైతుల ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నాయి. కొన్నిచోట్ల వారు తాకట్టు పెట్టిన భూముల్ని వేలం వేసి మరీ బకాయిలను రాబట్టుకుంటున్నాయి. దీర్ఘకాలిక వ్యవసాయ రుణాలు, పంట రుణాలు తిరిగి చెల్లించాలంటూ నోటీసులు జారీ చేస్తున్న వివిధ జిల్లాల కేంద్ర సహకార బ్యాంకులు (డీసీసీబీలు).. నిస్సహాయ పరిస్థితుల్లో రుణాలు చెల్లించని వారి భూములు, ఇతర ఆస్తులను వేలం వేస్తున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సహకార బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న రైతాంగంలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఫలానా రోజు ఫలానా రైతు భూమిని వేలం వేస్తున్నామంటూ గ్రామాల్లో చాటింపు వేయిస్తుండటంతో పరువు పోతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెల్లించాల్సిన రుణం తక్కువగా ఉన్నా మొత్తం భూమిని డీసీసీబీలు వేలం వేస్తుండటంతో తమకు భూమి లేకుండా పోతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతుల విషయంలోనే కఠిన వైఖరి? రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకు (టెస్కాబ్) ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటుంది. దాని పరిధిలో జిల్లా స్థాయిలో డీసీసీబీలు ఉంటాయి. వాటి కింద ప్యాక్స్ పని చేస్తుంటాయి. ఇవి ప్రధానంగా రైతుల కోసమే పనిచేయాల్సి ఉంటుంది. వీటి చైర్మన్లను, డైరెక్టర్లను రైతులే ఎన్నుకుంటారు. డీసీసీబీల చైర్మన్లు టెస్కాబ్ చైర్మన్ను ఎన్నుకుంటారు. ఈ బ్యాంకులు రైతులకు అవసరమైన పంట రుణాలు, దీర్ఘకాలిక రుణాలు ఇవ్వాల్సి ఉంటుంది. వాణిజ్య బ్యాంకుల మాదిరిగానే డీసీసీబీలు ప్రతి ఏటా వేలాది కోట్లు రైతులకు రుణాలు అందిస్తుంటాయి. రైతులతోపాటు ఇతరులకు కూడా గృహ, విద్య రుణాలు కూడా ఇస్తుంటాయి. రైతులకైతే ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాలు కొనేందుకు, భూములను చదును చేసుకునేందుకు, వ్యవసాయ అనుబంధ రంగాలైన పాడి, చేపలు, గొర్రెల పెంపకం తదితరాల ద్వారా అదనపు ఆదాయం సమకూర్చుకునేందుకు దీర్ఘకాలిక రుణాలు ఇస్తుంటారు. అయితే పలుకుబడి కలిగి కోట్ల రూపాయలు తీసుకునే వారిపై, రాజకీయ నాయకుల విషయంలో మెతక వైఖరి అవలంభించే డీసీసీబీలు రైతుల విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. పెద్దల విషయంలో కోట్లు రికవరీ చేయలేక నష్టాలను చవిచూస్తున్న అనేక సహకార సంఘాలు, రైతులను మాత్రం ముప్పుతిప్పలు పెడుతున్నాయి. ఎలాగోలా చెల్లిస్తామని రైతులు వేడుకుంటున్నా కనికరించడం లేదు. భూములను వేలం వేస్తున్నాయి. వేలం పాటలో ఆయా గ్రామాల ఇతర రైతులు ఎవరూ పాల్గొనకపోతే డీసీసీబీలే స్వాదీనం చేసుకుంటున్నాయి. మరోవైపు చెల్లించాల్సిన రుణం కంటే ఎక్కువ విలువున్న భూములను వేలం వేయడంపై రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదనంగా వచ్చే డబ్బును రైతులకే ఇస్తున్నామని అధికారులు అంటున్నా, కొద్దిపాటి భూమిని కూడా తమకు ఉంచడం లేదని రైతులు అంటున్నారు. అప్పుకు మించి భూమిని అమ్మే హక్కు సహకార బ్యాంకులకు ఎక్కడ ఉందని నిలదీస్తున్నారు. మరీ విచిత్రంగా కేవలం రూ.50 వేల రుణం ఉన్న రైతుల ఆస్తులను కూడా వేలం వేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఒక్క ఉమ్మడి మహబూబ్నగర్లో 202 మందికి నోటీసులు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా డీసీసీబీ పరిధిలో 78 ప్యాక్స్ ఉన్నాయి. వీటి పరిధిలో 22 డీసీసీబీ బ్రాంచీలు ఉన్నాయి. గత ఏడాది (2023–24) పంట రుణాల కింద 62 వేల మంది రైతులకు రూ. 672 కోట్లు, దీర్ఘకాలిక రుణాల కింద 1,100 మందికి రూ.70 కోట్లు, గృహ రుణాల కింద 200 మందికి రూ.18 కోట్లు, విద్యా రుణాల కింద 180 మందికి రూ.14 కోట్లు అందజేశాయి. ఇందులో దీర్ఘకాలిక రుణాలు పెండింగ్లో ఉన్న 202 మందికి బ్యాంక్ అధికారులు లీగల్ నోటీసులు జారీ చేసి రూ.8 కోట్లు రికవరీ చేశారు. ఈ క్రమంలో కొందరు రైతుల భూములు, ఆస్తులను కూడా వేలం వేయడం గమనార్హం. నిజామాబాద్లో 71 మందికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 2023–24 ఆర్థిక సంవత్సరంలో డీసీసీబీలో ఇళ్లు, వ్యవసాయ భూములు, ఇతరత్రా ఆస్తులు తాకట్టు పెట్టి కొందరు రైతులు రుణాలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో 71 మందికి డీసీసీబీ అధికారులు నోటీసులు జారీచేశారు. అయినా అప్పులు చెల్లించని రైతుల ఆస్తులను వేలం వేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో కూడా.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతి ఏటా వానాకాలం, యాసంగి సీజన్లలో డీసీసీబీలు పంట రుణాలు ఇస్తాయి. గడిచిన వానాకాలంలో రూ.469.82 కోట్లు, యాసంగి సీజన్లో రూ.126.68 కోట్లు పంట రుణాలుగా ఇచ్చాయి. అలాగే రూ. 236.38 కోట్ల దీర్ఘకాలిక రుణాలు ఇచ్చాయి. ఈ నేపథ్యంలో రుణాలు తిరిగి చెల్లించని రైతులకు నోటీసులు జారీ అయ్యాయి. రైతులు రుణాలు చెల్లించకుంటే ఆస్తులను వేలం వేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. డీసీసీబీలు నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నాయి రైతులు తీసుకున్న దీర్ఘకాలిక రుణాలు, పేరుకు పోయిన ఇతరత్రా రుణాలను రికవరీ చేయాల్సిన బాధ్యత డీసీసీబీలపై ఉంటుంది. రిజర్వు బ్యాంకు నిబంధనల ప్రకారం అవి పనిచేయాలి. రైతులు తమ భూములు, ఇళ్లు, ఇతరత్రా ఆస్తులను తనఖా పెట్టి దీర్ఘకాలిక రుణాలు తీసుకుంటారు. అయితే ఏళ్లుగా పేరుకుపోయిన మొండి బకాయిలను వసూలు చేసే క్రమంలో రైతులకు నోటీసులు ఇస్తున్నారు. పలు జిల్లాల్లో భూములు, ఇతర ఆస్తులు వేలం వేస్తున్నారు. నిబంధనల ప్రకారమే డీసీసీబీలు వ్యవహరిస్తున్నాయి. – నేతి మురళీధర్రావు, ఎండీ, టెస్కాబ్ – నాగర్కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం ఐనోలు గ్రామానికి చెందిన ఓ రైతు పాల వ్యాపారం చేసేందుకు గాను గేదెలను కొనుగోలు చేయాలని భావించి 2017 డిసెంబర్లో తనకున్న 2.30 ఎకరాల భూమిని తాకట్టుపెట్టి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ)లో రూ.7.20 లక్షల దీర్ఘకాలిక రుణం తీసుకున్నాడు. మూడు కిస్తీలు కట్టాడు. ఆ తర్వాత గేదెలు చనిపోవడంతో నష్టం వాటిల్లింది. కిస్తీలు చెల్లించకపోవడంతో అసలు, వడ్డీ కలిపి రూ.9.68 లక్షలు బకాయి చెల్లించాల్సి ఉండగా.. రైతు తాకట్టు పెట్టిన భూమిని బ్యాంకు అధికారులు వేలం వేసి నగదు జమ చేసుకున్నారు. – జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (ప్యాక్స్) పరిధిలోని పెద్దపోతులపాడు గ్రామానికి చెందిన చంద్రకాంత్రెడ్డి తండ్రి సంజీవరెడ్డి కొన్నేళ్ల క్రితం ట్రాక్టర్ కోసం మూడెకరాలు తాకట్టు పెట్టి రూ.1,66,000 రుణం తీసుకున్నాడు. మూడేళ్ల అనంతరం లోన్ సరిగా చెల్లించడంలేదని ట్రాక్టర్ను సీజ్ చేశారు. దీంతో చంద్రకాంత్రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా కేసు నడుస్తోంది. ఇలావుండగా పొలం వేస్తున్నామంటూ ఇటీవల ప్యాక్స్ అధికారులు నోటీసులు పంపించారు. దీంతో చంద్రకాంత్ తమ ట్రాక్టర్ సీజ్ చేశారని, పొలం ఎలా వేలం వేస్తారని నిలదీసినా ఫలితం లేకపోయింది. ఎకరం రూ.12.10 లక్షల చొప్పున మరో రైతుకు విక్రయించారు. అయితే రెవెన్యూ రికార్డుల్లో ఆ సర్వే నంబర్లో ఉన్న మొత్తం 4.12 ఎకరాలు రెడ్మార్క్లో పెట్టడంతో రైతు లబోదిబోమంటున్నారు. -
‘సహకార రంగ’ సంస్కరణల్లో ఏపీదే అగ్రస్థానం
(పంపాన వరప్రసాదరావు – సాక్షి, అమరావతి) : ‘సహకార రంగ సంస్కరణల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. సహకార రంగం బలోపేతానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఇస్తున్న తోడ్పాటు ప్రశంసనీయం. ఈ రంంగంలో అంతర్జాతీయంగా భారత్ ఎంత బలంగా ఉందో.. దేశంలో ఆంధ్రప్రదేశ్ అంతే బలంగా ఉంది. రాష్ట్ర సహకార బ్యాంక్ (ఆప్కాబ్)తో పాటు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు (డీసీసీబీలు) చాలా బాగా పనిచేస్తున్నాయి. రికార్డుస్థాయి వ్యాపారంతో మంచి లాభాలు ఆర్జిస్తున్నాయి. 36 ఏళ్ల తర్వాత కర్నూలు, 28 ఏళ్ల తర్వాత కడప డీసీసీబీలు లాభాల బాట పట్టాయంటే ఆషామాషీ కాదు. ప్యాక్స్ను కూడా లాభాల్లోకి తేవాలి’ అని జాతీయ సహకార బ్యాంకుల సమాఖ్య (నాఫ్స్కాబ్) మేనేజింగ్ డైరెక్టర్, అంతర్జాతీయ సహకార బ్యాంకింగ్ సమాఖ్య (ఐసీఏ) సభ్యుడు భీమా సుబ్రహ్మణ్యం చెప్పారు. ఐసీఏ సభ్యునిగా ఎన్నికై తొలిసారి రాష్ట్రానికి వచ్చిన ఆయన ‘సాక్షి ప్రతినిధి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. డీసీసీబీలకూ షెడ్యూల్ హోదా వచ్చేలా కృషి రాష్ట్రాల సహకార బ్యాంకుల (అపెక్స్ బ్యాంకు)ను ఒకే గొడుగు కిందకు తేవాలన్న సంకల్పంతో నాఫ్స్కాబ్ ఏర్పాటైంది. ఇది అపెక్స్ బ్యాంకులకు – ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేస్తుంది. రైతులకు అనుకూలంగా పాలసీల రూపకల్పనలో కృషి చేస్తుంది. దేశంలోని 351 డీసీసీబీల్లో 348 డీసీసీబీలకు ఆర్బీఐ లైసెన్సులిచ్చేలా కృషి చేశాం. నాఫ్స్కాబ్ కృషి వల్లే దేశంలోని 34 అపెక్స్ బ్యాంకుల్లో 24 షెడ్యూల్ హోదా పొందాయి. డీసీసీబీలకు కూడా షెడ్యూల్ హోదా కలి్పంచేలా పాలసీ తేవాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాం. నాఫ్స్కాబ్లో అపెక్స్ బ్యాంకులతో పాటు డీసీసీబీలకు కూడా సభ్యత్వం ఇవ్వాలా లేక అసోసియేట్గా గుర్తించాలా అనే విషయంపై సెపె్టంబర్లో నిర్ణయం తీసుకుంటాం. రీ ఫైనాన్స్ 80 శాతానికి పెంచాల్సిందే సహకార స్ఫూర్తితో ఏర్పాటైన బ్యాంకులు లాభాపేక్షతో పనిచేయడం సరికాదు. నాబార్డు 80 శాతం రీఫైనాన్స్ చేస్తేనే అపెక్స్ బ్యాంకులు డీసీసీబీలకు, వాటి పరిధిలోని ప్యాక్స్కు ఆ స్థాయిలో రీఫైనాన్స్ చేస్తాయి. నాబార్డు రీఫైనాన్స్ను 50 శాతం నుంచి 80 శాతానికి పెంచేలా నాఫ్స్కాబ్ కృషి చేస్తోంది. నష్టాల్లో ఉన్న ప్యాక్స్లకు ఆ ర్థిక సాయం చేయాల్సిన బాధ్యత అపెక్స్ బ్యాంకులదే. ఈ రంగంలో రెండంచెల వ్యవస్థ కంటే మూడంచెల వ్యవస్థ చాలా మంచిది. రైతు ఉత్పత్తిదారుల సంఘాల (ఎ‹ఫ్పీవో)ను ప్రోత్సహించడం మంచిదే కానీ, సహకార చట్టం ప్రకారం వాటికి రిజి్రస్టేషన్ తప్పనిసరి చేయాలి. భారత్ సహకార వ్యవస్థ బలంగా ఉంది భారత్లో సహకార వ్యవస్థ చాలా బలంగా ఉంది. సుమారు 15 కోట్ల మంది భాగస్వాములైన వ్యవస్థ ప్రపంచంలో మరెక్కడా లేదు. అయితే, దేశంలో సగానికిపైగా రాష్ట్రాల్లో ఏళ్ల తరబడి ఎన్నికలు నిర్వహించకుండా నామినేటెడ్ పద్ధతిలో నియామకాలు చేపడుతున్నారు. ఇది సహకార స్ఫూర్తికి విరుద్ధం. క్రమం తప్పకుండా ఎన్నికలు నిర్వహించి, ఎన్నికైన పాలక మండళ్ల ద్వారా పాలన సాగిస్తే సహకార వ్యవస్థ మరింత బలోపేతమవుతుంది. ఆర్బీకేలతో అనుసంధానం మంచి ఆలోచనే దేశంలో ఏపీ, తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకులు బాగా పనిచేస్తున్నాయి. మంచి వృద్ధి రేటు నమోదు చేస్తున్నాయి. ఏపీలో మంచి పురోగతి కన్పిస్తోంది. దశాబ్దాలుగా నష్టాల్లో ఉన్న బ్యాంకులు లాభాల బాట పట్టాయంటే దాని వెనుక ఎంతో కృషి ఉంది. ఆర్బీకేలతో పీఏసీఎస్లను అనుసంధానించడం మంచి ఆలోచనే. దీనివల్ల గ్రామ స్థాయిలో రైతులకు మరింత మంచి జరుగుతుంది. -
డీసీసీబీల్లో కామన్ క్యాడర్ బదిలీలు
సాక్షి, అమరావతి: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ)ల్లో ఏళ్ల తరబడి పనిచేస్తున్న జనరల్ మేనేజర్(జీఎం), డిప్యూటీ జనరల్ మేనేజర్(డీజీఎం) స్థాయి అధికారుల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటివరకు ఎక్కడి బ్యాంకులో విధుల్లో చేరితే ఆ బ్యాంకులోనే పదోన్నతులు పొందడమే కాదు.. పదవీ విరమణ వరకు కొనసాగేవారు. దశాబ్దాలుగా ఒకే బ్యాంకులో పాతుకుపోవడం వల్ల పెద్ద ఎత్తున ఆర్థిక అవకతవకలకు పాల్పడిన ఘటనలున్నాయి. వీటన్నింటికీ చెక్ పెడుతూ డీసీసీబీల్లో కామన్ క్యాడర్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం సహకార చట్టాన్ని సవరిస్తూ అసెంబ్లీలో ప్రత్యేక చట్టం చేసింది. 2, 3 స్థాయిల్లో పనిచేసే అధికారుల(జీఎం, డీజీఏం)ను కామన్ క్యాడర్ కిందకు తీసుకొచ్చారు. జోనల్ పరిధిలో సీనియారిటీ ప్రాతిపదికన ప్రతి మూడేళ్లకోసారి బదిలీ చేయబోతున్నారు. నైపుణ్యం, పనితీరు ఆధారంగా ఈ బదిలీలు జరగనున్నాయి. రాష్ట్రంలోని 13 డీసీసీబీ బ్యాంకుల పరిధిలో జీఏం పోస్టులు 24, డీజీఏం పోస్టులు 47 ఉండగా.. ప్రస్తుతం 22 మంది జీఎం, 43 మంది డీజీఏంలుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మిగిలిన పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీరికి తొలుత బదిలీలు ఆ తర్వాత పదోన్నతులు కల్పించనున్నారు. ఇందుకోసం మార్గదర్శకాల రూపకల్పన బాధ్యతను ఆప్కాబ్కు అప్పగించారు. ఈ నెలాఖరులోగా మార్గదర్శకాలు రూపొందించి ఆ వెంటనే బదిలీలకు నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఉగాదికల్లా బదిలీల ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు చేపట్టారు. సహకార బ్యాంకుల ప్రక్షాళనే లక్ష్యం సహకార బ్యాంకులను ప్రక్షాళన చేయడం.. వాటిని ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా సీఎం జగన్ ఆదేశాల మేరకు చర్యలు చేపట్టాం. ఏళ్ల తరబడి ఒకేచోట ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్న వారికి స్థానచలనం కల్పించాలని నిర్ణయించాం. ఇందుకు అనుగుణంగానే చట్టాన్ని సవరించాం. కోర్టుల్లో అడ్డంకులు తొలిగిపోగానే హెచ్ఆర్ పాలసీని కూడా అమలు చేస్తాం. – కాకాణి గోవర్థన్రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి -
కోట్ల కుంభకోణం: టీడీపీ నేత వరుపుల పరారీ
సాక్షి ప్రతినిధి, కాకినాడ/ప్రత్తిపాడు: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ను కొల్లగొట్టిన అప్పటి డీసీసీబీ చైర్మన్, ప్రత్తిపాడు టీడీపీ ఇన్చార్జి వరుపుల రాజా పోలీసుల కళ్లుగప్పి పరారయ్యారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రత్తిపాడులో రాజా ఇంటివద్ద తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఒకపక్క పోలీసులు, మరోపక్క టీడీపీ శ్రేణులు మోహరించారు. అయితే, రాత్రి 8.30 గంటల సమయంలో తాము రాజా ఇంటిలోకి ప్రవేశించే ముందు విద్యుత్ సరఫరా నిలిపివేశారని, అదే సమయంలో రాజా పరారయ్యారని పోలీసులు భావిస్తున్నారు. రాజా చైర్మన్గా ఉన్న సమయంలో బినామీ పేర్లతో డీసీసీబీ బ్రాంచిలు, పలు సహకార సంఘాల నుంచి కోట్లు రుణాలు స్వాహా చేశారని సహకార చట్టం 51 ప్రకారం జరిపిన విచారణలో ప్రాథమికంగా నిర్థారణ అయింది. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం ఈ కుంభకోణం నిగ్గు తేల్చేందుకు కేసును సీఐడీకి అప్పగించింది. మరోపక్క ప్రత్తిపాడు డీసీసీబీ బ్రాంచి పరిధిలోని ధర్మవరం సొసైటీలో రైతుల క్రాప్ ఇన్సూ్యరెన్స్ నిధులు సుమారు రూ.45 లక్షలు గోల్మాల్ అయ్యాయంటూ పలువురు రైతులు ఫిర్యాదు చేశారు. దీంతో సీఐడీ రంగంలోకి దిగింది. ఈ కేసులో కొంతకాలంగా రాజా తప్పించుకు తిరుగుతున్నారు. రాజా ఇంటిలో ఉన్నారన్న కచ్చితమైన సమాచారంతో శుక్రవారం సీఐడీ ఏఎస్పీ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో ఇద్దరు డీఎస్పీలు, పలువురు సీఐలు, ఎస్ఐలు ప్రత్తిపాడులోని రాజా ఇంటికి వెళ్లారు. ఇంటి చుట్టూ పోలీసులను మోహరించారు. ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నేతలు, శ్రేణులు రాజా ఇంటి వద్దకు చేరుకున్నారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు నవీన్కుమార్, మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ వర్మ, తుని టీడీపీ ఇన్చార్జి యనమల కృష్ణుడు ఆధ్వర్యంలో పార్టీ నేతలు రాజా తదితరులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎటువంటి నోటీసు ఇవ్వకుండా ఎలా అరెస్టు చేస్తారంటూ వాదించారు. గతంలో ఉన్న డీసీసీబీ పెండింగ్ కేసుల్లో నోటీసు ఇచ్చినా తప్పించుకు తిరుగుతుండటం వల్లే నేరుగా అరెస్టుకు వచ్చామని సీఐడీ పోలీసులు చెప్పినా వినలేదు. అరెస్టు చేయడానికి వీల్లేదంటూ గొడవ చేశారు. తలుపులు వేసుకుని ఇంటిలో ఉన్న రాజాను బయటకు తీసుకువచ్చేందుకు సీఐడీ డీఎస్పీలు రామకృష్ణ, జి.రమేష్బాబు, సీఐలు ప్రయత్నించారు. లొంగిపోవాలని పదేపదే విజ్ఞప్తి చేశారు. ఇంతలో టీడీపీ నేతలు బయట పోలీసులతో సంప్రదింపులంటూ హైడ్రామా నిర్వహించారు. 8.30 గంటల సమయంలో రాజా ఇంటిలోకి సీఐడీ పోలీసులు ప్రవేశించారు. మహిళా పోలీసులు ఇంటిలో ఉన్న రాజా తల్లి వరుపుల సత్యవతి, మేనకోడలు కొమ్ముల వాణిని ప్రశ్నించారు. గదులు అన్నింటినీ వెతికి ఇంటిలో రాజా లేకపోవడంతో పోలీసులు బయటకు వచ్చేశారు. అంతకంటే ముందుగా మూడు నిమిషాలు విద్యుత్ సరఫరా నిలిచిపోవడం, ఇంటి బయట టీడీపీ నేతలు పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం వంటి నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయిన సమయంలోనే రాజా తమ కళ్లుగప్పి పరారైనట్టుగా పోలీసులు నిర్థారణకు వచ్చారు. రాజా పరారైన విషయాన్ని సీఐడీ రాజమహేంద్రవరం అదనపు ఎస్పీ గోపాలకృష్ణ ధృవీకరించారు. -
సహకార రంగం పునర్వ్యవస్థీకరణ
సాక్షి, అమరావతి: ఎన్నికల హామీ మేరకు సహకార రంగాన్ని అవినీతికి తావులేకుండా పునర్వ్యవస్థీకరిస్తున్నట్లు వ్యవసాయ, సహకార శాఖ మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. కొత్తగా తెచ్చిన హెచ్ఆర్ పాలసీకి అనుగుణంగా ఐదేళ్లు పూర్తయిన ప్రతి ఒక్కరినీ త్వరలో బదిలీ చేయనున్నట్లు తెలిపారు. క్యాడర్ వారీగా ఉద్యోగుల జీతభత్యాలను సరిచేస్తున్నట్లు వివరించారు. మండలానికో సహకార బ్యాంక్ ఏర్పాటు చేసి రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా ఆర్బీకేల స్థాయిలో ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాలను వికేంద్రీకరిస్తున్నట్లు తెలిపారు. రికార్డుల ట్యాంపరింగ్కు అడ్డుకట్ట వేసేందుకు పీఏసీఎస్ స్థాయిలో కంప్యూటరైజేషన్ చేస్తున్నట్లు చెప్పారు. విజయవాడలోని ఓ çహోటల్లో బుధవారం డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ల పునశ్చరణ సదస్సుకు కన్నబాబు హాజరై మాట్లాడారు. గత పాలకులు సహకార చట్టంలోని లొసుగులను ఆసరాగా చేసుకొని పీఏసీఎస్లు, సహకార బ్యాంకులను జేబు సంస్థలుగా మార్చుకొని అడ్డగోలుగా దోచుకు తిన్నారని చెప్పారు. నకిలీ డాక్యుమెంట్లతో కాజేసిందంతా కక్కిస్తామని, ఎవరినీ వదలబోమని స్పష్టం చేశారు. హోదా రాజకీయ పదవి కాదు బ్యాంకులకు నష్టం చేకూర్చేవారిని ఉపేక్షించొద్దని ఇటీవల ఎస్ఎల్బీసీ సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ స్పష్టమైన ఆదేశాలిచ్చారని మంత్రి కన్నబాబు గుర్తు చేశారు. కొత్తగా నియమితులైన చైర్మన్లు తమ హోదాను రాజకీయ పదవిగా భావించవద్దని సూచించారు. ఆడిటింగ్ వ్యవస్థను పటిష్టం చేసి అక్రమాలు వెలుగు చూసిన బ్యాంకుల పరిధిలో ఆడిటర్లపై చర్యలు తీసుకోవాలన్నారు. పీఏసీఎస్, డీసీసీబీ, డీసీఎంఎస్లకు సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని వెల్లడించారు. ఈసారి పాలక మండళ్లల్లో సహకార రంగ నిపుణులను డైరెక్టర్లుగా నియమించేలా చట్టంలో మార్పులు తీసుకొస్తున్నామని చెప్పారు. డీసీసీబీ–డీసీఎంఎస్ల అభివృద్ధికి రోడ్ మ్యాప్ డీసీసీబీలు, డీసీఎంఎస్లపై ఉన్నత స్థాయి కమిటీ నివేదిక ఆధారంగా ప్రక్షాళనకు రోడ్మ్యాప్ రూపొందిస్తామని మంత్రి కన్నబాబు తెలిపారు. నాడు–నేడు పథకం కింద వీటి అభివృద్ధికి కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. వాణిజ్య బ్యాంకులకు ధీటుగా పంట రుణాలివ్వాలని సూచించారు. సదస్సులో ఆప్కాబ్ చైర్మన్ మల్లెల ఝాన్సీరాణి, మార్క్ఫెడ్ చైర్మన్ నాగిరెడ్డి, మార్కెటింగ్ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ మధుసూదన్రెడ్డి, ఆర్సీఎస్ కమిషనర్ అహ్మద్బాబు, మార్కెటింగ్ శాఖ కమిషనర్ పీఎస్ ప్రద్యుమ్న, ఆప్కాబ్ ఎండీ శ్రీనాథ్రెడ్డి, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ తదితరులు పాల్గొన్నారు. -
'సహకార రంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది'
సాక్షి, అమరావతి: సహకార రంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. బుధవారం డీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లతో చేపట్టిన సమీక్ష సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం సహకార వ్యవస్థని పూర్తిగా అవినీతిమయం చేసిందని విమర్శించారు. ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లాలో రెండు చోట్ల తప్పుడు పత్రాలతో కోట్లాది రూపాయిలు దిగమింగేశారని, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రెండు చోట్లా కుంభకోణాలని వెలికి తీసామన్నారు. బ్యాంకులని నష్టపరిచే చర్యలని ఏ మాత్రం ఉపేక్షించవద్దని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆదేశించారని చెప్పారు. డీసీసీబీ, డీసీఎంఎస్ పదవులని రాజకీయ పదవులగా చూడొద్దని, బ్యాంకింగ్ రంగాన్ని పటిష్టం చేయడంలో డీసీసీబీ చైర్మన్లు, డీసీఎంఎస్ చైర్మన్ల పాత్ర కీలకమని తెలిపారు. రైతుకి అప్పుకావాలంటే కోఆపరేటివ్ బ్యాంకులే గుర్తుకు వచ్చేలా పనితీరు ఉండాలని అధికారులకు సూచించారు. అయిదేళ్లుగా ఒకే బ్రాంచ్లో పనిచేస్తున్న మేనేజర్లని తప్పనిసరిగా బదిలీ చేయాలని, రుణాల మంజూరులో చేతివాటానికి పాల్పడే వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సొసైటీ బైఫరికేషన్ త్వరలోనే పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. చదవండి: వ్యవసాయం దండగ అన్న చంద్రబాబుకు ఇప్పుడు రైతులు గుర్తుకు వచ్చారా? -
సహకార వ్యవస్థను పూర్తి స్థాయిలో ఆధునీకరిస్తాం: మంత్రి కన్నబాబు
సాక్షి, తూర్పుగోదావరి: సహకార వ్యవస్థను పూర్తి స్థాయిలో ఆధునీకరిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా100 డీసీసీబీ బ్రాంచ్లను ఏర్పాటు చేస్తామన్నారు. రైతులతో పాటుగా డ్వాక్రా సంఘాలకు సహకార రంగం ద్వారా ఋణాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి డా.వై.ఎస్.రాజశేఖర్రెడ్డి పోలవరం ప్రాజెక్ట్కు శ్రీకారం చుట్టారని, ఆయన వారసునిగా పోలవరం పూర్తి చేయడానికి సీఎం జగన్ అన్ని చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు వచ్చినా రాకపోయిన పర్వాలేదు.. కాంట్రాక్టులు తమకు వస్తే చాలన్న విధంగా ఆప్పుడు చంద్రబాబు వ్యవహరించారని మండిపడ్డారు. చదవండి: అక్కడ రూపాయికే ఇడ్లీ: ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజమే. -
మరో 332 మండలాల్లో డీసీసీబీ శాఖల ఏర్పాటు
సాక్షి, అమరావతి: మారుమూల గ్రామాలకు చెందిన రైతులకు సైతం ఆర్థిక చేయూతనిచ్చే లక్ష్యంతో మండలానికో జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ) శాఖలను ఏర్పాటు చేయబోతున్నట్టు రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖమంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతానికి సంబంధించి ప్రస్తుతం 343 మండలాల్లో మాత్రమే డీసీసీబీ బ్రాంచ్లున్నాయని, మరో 332 మండలాల్లో బ్రాంచ్ల్లేవని, ఆయా మండలాల్లో రానున్న మూడేళ్లలో కొత్త బ్రాంచ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఏడాది కనీసం 30 శాతం మండలాల్లో బ్రాంచ్లు ఏర్పాటు చెయ్యాలని ఆదేశించారు. డీసీసీబీ శాఖల విస్తరణ, ఇతర అంశాలపై ఆప్కాబ్ఎండీ శ్రీనాథ్రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో విజయవాడలో సమీక్ష జరిపారు. డీసీసీబీల ద్వారా మహిళా స్వయం సహాయక సంఘాలతో పాటు కౌలు రైతులకు అధికంగా రుణాలు ఇచ్చే విషయంలో ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. దీని వల్ల ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అమలు చేసేందుకు దోహదపడతాయని చెప్పారు. రాష్ట్రంలో 675 మండలాలుండగా, వాటి పరిధిలో 416 బ్రాంచ్లున్నాయని తెలిపారు. వాటిలో 73 బ్రాంచ్లు పట్టణాలు, నగరాల్లో ఉన్నాయన్నారు. గడచిన మూడేళ్లలో 21 బ్రాంచ్లు కొత్తగా ఏర్పాటు చేయగా, ప్రస్తుతం గుంటూరు జిల్లాలో 20,చిత్తూరు జిల్లాలో 10, నెల్లూరు జిల్లాలో 4బ్రాంచ్లు ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను ఆప్కాబ్ ద్వారా నాబార్డుకు పంపినట్టు అధికారులు వివరించగా, సాధ్యమైనంత త్వరగా వాటిని ప్రారంభించాలని మంత్రి సూచించారు. -
పీఏసీఎస్లకు 'ఆర్థిక' దన్ను
సాక్షి, అమరావతి: సాగులోనే కాదు వ్యక్తిగత అవసరాల్లో కూడా అన్నదాతలకు బాసటగా నిలిచే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్, సొసైటీ)ను బహుళ సేవా కేంద్రాలు (మల్టీ సర్వీసెస్ సెంటర్స్)గా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. వాటిలో పెద్దఎత్తున మౌలిక సదుపాయాలు కల్పించి ప్రతి సొసైటీని ‘వన్ స్టాప్ షాపు’గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. నాబార్డు చేయూతతో ప్రత్యేక చర్యలు చేపట్టబోతోంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో–ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (ఆప్కాబ్) ఆధ్వర్యంలో పనిచేసే 13 జిల్లా కేంద్ర సహకార బ్యాంక్(డీసీసీబీ)ల పరిధిలో 1,992 పీఏసీఎస్లు అన్నదాతలకు సేవలందిస్తున్నాయి. వీటిని వైఎస్సార్ ఆర్బీకేలకు అనుబంధంగా బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రూ.1,584.61 కోట్లతో.. వ్యవసాయ సదుపాయాల నిధి కింద రూ.1,584.61 కోట్ల నాబార్డు రుణంతో పీఏసీఎస్లలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం ప్రతి సొసైటీకి కనీసం రూ.10 లక్షల నుంచి గరిష్టంగా రూ.2 కోట్ల వరకు నాబార్డు నుంచి రుణంగా అందించేలా చర్యలు చేపట్టింది. ఈ రుణంలో 10 శాతం పీఏసీఎస్లు భరిస్తే.. మిగిలిన మొత్తాన్ని 4 శాతం వడ్డీపై నాబార్డు అందిస్తుంది. గడువులోగా రుణాల్ని చెల్లిస్తే ఇంట్రస్ట్ సబ్వెన్షన్ కింద వడ్డీలో 3 శాతం సబ్సిడీ రూపంలో సొసైటీలకు తిరిగి ఇస్తారు. ఈ లెక్కన ఒక్క శాతం వడ్డీకే పీఏసీఎస్లకు రుణాలు అందుతాయి. తొలి దశలో రూ.659.48 కోట్లతో 1,282 పీఏసీఎస్ల్లోను, రెండో దశలో రూ.925.13 కోట్లతో 710 పీఏసీఎస్ల్లోను మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. తొలివిడత పనులను 2021–22 ఆర్థిక సంవత్సరంలోనే పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. సొసైటీల్లో కల్పించే మౌలిక సదుపాయాలివే పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టుల కింద ఇ–మార్కెటింగ్ ప్లాట్ఫామ్లు, గిడ్డంగులు, ప్యాకింగ్ హౌస్లు, సార్టింగ్ అండ్ గ్రేడింగ్ యూనిట్లు, కోల్డ్ చైన్స్, లాజిస్టిక్ సౌకర్యాలు, ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్లు, రైపెనింగ్ (మగ్గించే) చాంబర్స్, కమ్యూనిటీ ఫార్మింగ్ ప్రాజెక్ట్ కింద సేంద్రియ ఉత్పత్తులు, బయో స్టిమ్యులెంట్ ప్రొడక్షన్ యూనిట్లు వంటివి ఏర్పాటు చేస్తారు. ఇక సభ్యుల అవసరాలను బట్టి అద్దె ప్రాతిపదికన అందించే లక్ష్యంతో అధునాతన వ్యవసాయ పరికరాలతో వ్యవసాయ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా రూ.10 లక్షల నుంచి రూ.60 లక్షల అంచనా వ్యయంతో కస్టమ్ హైరింగ్ సెంటర్లు, రూ.కోటి నుంచి రూ.2.50 కోట్ల వరకు హైటెక్, హై వేల్యూ ఫార్మ్ పరికరాలతో హబ్లు ఏర్పాటు చేస్తారు. వీటి కోసం ఇచ్చే రుణాలపై 40 శాతం సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. పీఏసీఎస్లను ఆర్థికంగా బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆప్కాబ్ ఎండీ ఆర్.శ్రీనాథ్రెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వం ద్వారా నాబార్డుకు పంపించామని, త్వరలోనే నిధులు మంజూరవుతాయని పేర్కొన్నారు. -
వేట మొదలైంది... వేటు పడింది..
అన్నదాతలకు మేలు చేసే సమున్నత లక్ష్యంతో ఏర్పాటు చేసిన ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను.. సకుటుంబ సపరి‘వాటం’గా దోచుకున్న అక్రమార్కుల భరతం పట్టేందుకు డీసీసీబీ పాలకవర్గం కొరడా ఝళిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో సొసైటీలకు అణువణువునా పట్టిన అవినీతి చీడను వదిలిస్తోంది. గండేపల్లి సొసైటీలో జరిగిన రూ.23 కోట్ల కుంభకోణంలో ఇద్దరు అధికారులపై వేటు వేసింది. మిగిలిన వారి కోసం వేట కొనసాగిస్తోంది. సాక్షి, రాజమహేంద్రవరం: గత టీడీపీ పాలనలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల(సొసైటీలు) నిధులను కొంతమంది అక్రమార్కులు పీల్చి పిప్పి చేశారు. బినామీ పేర్లతో కోట్లాది రూపాయలు కొట్టేసి, సహకార వ్యవస్థను నిర్వీర్యం చేసి, రైతులను నిలువునా ముంచేశారు. డీసీసీబీతో పాటు సొసైటీల్లో కూడా ‘పచ్చ’నేతలు సొసైటీ ప్రెసిడెంట్ల ముసుగులో తిష్ట వేసి, కోట్లాది రూపాయలు కొల్లగొట్టారు. ఈ అవినీతి బాగోతాలను ‘సాక్షి’ వరుస కథనాలతో వెలుగులోకి తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ) పాలకవర్గం ఆ అవినీతిపరుల భరతం పడుతోంది. రైతులకు చెందాల్సిన సొమ్మును యథేచ్ఛగా దోచుకున్న వారితో కుమ్మక్కయిన అధికారులపై వేటు మీద వేటు వేస్తోంది. టీడీపీ హయాంలో గండేపల్లి సొసైటీలో అప్పటి ప్రెసిడెంట్ తన కుటుంబ సభ్యులు, బినామీ పేర్లతో నకిలీ డాక్యుమెంట్లు, పాసు పుస్తకాలు తయారు చేసి రూ.23 కోట్లు కాజేసిన విషయాన్ని ‘సాక్షి’ వరుస కథనాలతో బయట పెట్టింది. గత సెప్టెంబర్ 24న ‘‘ఆ అవినీతి మూట.. రూ.23 కోట్లు పైమాటే’’, అక్టోబరు 6న ‘‘సకుటుంబ సపరి‘వాట’ంగా’’, నవంబరు 3న ‘‘రాబంధువుల లెక్కల చప్పుడు’’ శీర్షికలతో గండేపల్లి సొసైటీలో జరిగిన కోట్లాది రూపాయల అవినీతిని బట్టబయలు చేసింది. వీటిపై స్పందించిన డీసీసీబీ చైర్మన్ అనంత ఉదయభాస్కర్ డీసీ సీబీ డీజీఎంలు కె.వెంకటేశ్వరరావు, ఎం.శ్రీధర్చౌదరి ఆధ్వర్యాన రెండు నెలల పాటు విచారణ చేసి, జరిగిన అవినీ తి నిగ్గు తేల్చారు. ఈ కుంభకోణంపై సమగ్ర దర్యాప్తున కు సహకార రంగంలో కీలక మైన 51 విచారణ చేయాలని నిర్ణయించారు. ఈ కుంభకోణంలో ప్రాథమికంగా బాధ్యులుగా తేలిన గండేపల్లి సొసై టీ ప్రస్తుత మేనేజర్ ఆర్.శ్యామల, గతంలో ఇక్కడ పని చేసి ప్రస్తుతం కొత్తపేటలో పని చేస్తున్న మేనేజర్ హెచ్ ఎస్ గణపతిలపై అనంతబాబు ఆదేశాల మేరకు డీసీసీ బీ సీఈఓ ప్రవీణ్కుమార్ స స్పెన్షన్ వేటు వేశారు. వీరితో పాటు విచారణలో బాధ్యులు గా గుర్తించిన డీసీసీబీ అసిస్టెంట్ మేనేజర్ డీవీ సూర్యం, లీగల్ అధికారులు త్రినాథ్, ఎ.శ్రీనివాసరావుతో పాటు రిటైరైన మరో ముగ్గురు అధికారులపై చర్యలు తీసుకోవాల్సి ఉంది. వీరిపై కూడా త్వరలో వేటు పడే అవకాశం ఉంది. ఈ కుంభకోణంలో ఆ సొసైటీతో పాటు, డీసీసీబీ బ్రాంచిలో పని చేస్తున్న వారి పాత్ర ఏమేరకు ఉందో నిగ్గు తేల్చే పనిలో డీసీసీబీ వర్గాలున్నాయి. చదవండి: (దేవుళ్లకే శఠగోపం!) రికవరీ సవాలే.. ఈ అవినీతి బాగోతానికి తెర వెనుక సహకరించిన వారిపై వేటు వేసిన డీసీసీబీ.. చంద్రబాబు హయాంలో రూ.23 కోట్లు దారి మళ్లించిన సొసైటీ అధ్యక్షుడు పరిమి బాబు సహా ఇతరుల నుంచి సొమ్ము రికవరీ చేయాల్సి ఉంది. ఈ పని డీసీసీబీకి పెద్ద సవాల్ కానుందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. గండేపల్లి సొసైటీలో 2017, 2018, 2019 సంవత్సరాల్లో ఇచ్చిన రుణాల్లో సుమారు రూ.23 కోట్లను అధ్యక్షుడు, తన బంధువర్గం పేరిట మంజూరు చేసుకుని దారి మళ్లించేశారు. సొసైటీలో 155 మంది పేర్లతో రూ.22.83 కోట్ల రుణాలు మంజూరైతే సింహభాగం అప్పటి సంఘం అధ్యక్షుడి కుటుంబ సభ్యులు, సంఘం సీఈఓ, సిబ్బంది ఖాతాలకు జమ అవడాన్ని ప్రస్తుత డీసీసీబీ చైర్మన్ అనంతబాబు తీవ్రంగా పరిగణించారు. విచారణను నీరుగార్చి, అవినీతిపరులను కాపాడేందుకు పలువురు చేసిన ప్రయత్నాలను కూడా చైర్మన్ తిప్పికొట్టారు. చదవండి: (టీడీపీ హయాంలో విచ్చలవిడి అవినీతి) చంద్రబాబు హయాంలో నొక్కేసిన కోట్లాది రూపాయలు తిరిగి రాబట్టేందుకు డీసీసీబీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అప్పట్లో సొసైటీ అధ్యక్షుడిగా పని చేసిన పరిమి సత్యనారాయణ (బాబు) రూ.7.13 కోట్లు, ఆయన భార్య వెంకట సత్య మంగతాయారు రూ.1.08 కోట్లు, ఆయన బంధువు పి.కృష్ణ శ్రీనివాస్ రూ.6.76 కోట్లు, సీఈ ఓ పి.సత్యనారాయణ రూ.53.92 లక్షలు, స్టాఫ్ అసిస్టెంట్ జి.సత్యనారాయణ రూ.7.85 లక్షలు, సబ్ స్టాఫ్ వెంకటలక్ష్మి రూ.2 లక్షలు, పరిమి బాబు కారు డ్రైవర్ సత్యనారాయణ రూ.4 లక్షలు, కంప్యూటర్ ఆపరేటర్ శ్రీహరి రూ.4 లక్షలు, స్టాఫ్ అసిస్టెంట్ కనకరాజు రూ.5.90 లక్షలు, డ్రైవర్ భార్య పేరిట రూ.2 లక్షలు బదిలీ చేసినట్టు ఈ కుంభకోణంపై విచారణ చేస్తున్న అధికారులు లెక్క తేల్చారు. నిబంధనలకు విరుద్ధంగా సోమన కిశోర్బాబుకు రూ.44.54 లక్షలు, చల్లాప్రగడ సత్య నాగ భాస్కర్ శ్రీనివాసరావుకు రూ.43 లక్షలు, మదడ శ్రీనివాసుకు రూ.42.09 లక్షలు ఇచ్చినట్టు తేల్చారు. వారి నుంచి ఈ సొమ్మును ఎలాగైనా రికవరీ చేయాలని చైర్మన్ గట్టి పట్టుదలతో ఉన్నారు. దీనిపై డీసీసీబీ కసరత్తు చేస్తోంది. ఒక కుటుంబం స్వార్థంతో అవినీతికి పాల్పడి గండేపల్లి సొసైటీని నష్టాల్లోకి నెట్టేసింది. దీంతో ఆ సొసైటీ పరిధిలోని రైతులకు రుణాలు అందకుండా పోయాయి. ఇప్పుడు కొత్తగా రుణాలు ఇవ్వాలన్నా సొసైటీలో అవకాశం లేకుండా చేశారు. కోట్ల రూపాయల అవినీతి సొమ్మును ఎప్పటికి రాబడతారోనని రైతులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎవరినీ విడిచిపెట్టేది లేదు సహకార వ్యవస్థను భ్రష్టు పట్టించిన వారు ఎంతటి వారై నా విడిచిపెట్టేది లేదు. వారు ఏ పార్టీలో ఉన్నా ఉపేక్షించే ప్రశ్నే లేదు. గండేపల్లి సొసైటీలో బినామీ పేర్లతో కోట్ల రూపాయలు స్వాహా చేసి, రైతులను తీవ్రంగా దెబ్బ తీసిన ప్రెసిడెంట్ పరిమి బాబు నుంచి ప్రతి పైసా తిరిగి రాబట్టేందుకు ఉన్న ఏ మార్గాన్నీ డీసీసీబీ విడిచిపెట్టదు. టీడీపీ హయాంలోని సొసైటీ పాలకవర్గాల్లో వ్యక్తిగత స్వార్థం కోసం సహకార వ్యవస్థను నిర్వీర్యం చేసిన వారందరి జాతకాలూ బయట పెడతాం. గండేపల్లి సొసైటీలో బయటపడిన రూ.23 కోట్ల కుంభకోణంతో పాటు మిగిలిన సొసైటీల అవినీతి వ్యవహారాలను కూడా సీఎం జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్తాను. ఈ అవినీతి బాగోతంతో గండేపల్లి సొసైటీ పూర్తిగా నష్టాల్లోకి పోయింది. సొసైటీ పరిధిలోని గండేపల్లి, ఎన్టీ రాజాపురం, రామయ్యపాలెం, సింగరంపాలెం గ్రామాల్లోని 934 మంది సభ్యులకు రుణాలివ్వలేని పరిస్థితి తీసుకువచ్చారు. కొత్త సభ్యులను చేర్చుకున్నా వారికి కూడా రుణాలు ఇవ్వలేని దుస్థితి నెలకొంది. – అనంత ఉదయభాస్కర్, డీసీసీబీ చైర్మన్ -
జాతీయ స్థాయిలో ‘ఆప్కాబ్’కు ప్రథమ స్థానం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంక్ (ఆప్కాబ్) దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. రుణాల మంజూరు, వసూళ్లతోపాటు వివిధ అంశాల్లో మెరుగైన పనితీరుతో ముందుకు సాగుతోందని, రైతులు, వివిధ వర్గాల ప్రజలకు బ్యాంకు సేవలు అందుబాటులో ఉన్నాయని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్ కో–ఆపరేటివ్ బ్యాంక్స్ (నాఫ్కాబ్) పేర్కొంది. 2018–19 సంవత్సరంలో రాష్ట్ర, జిల్లా సహకార బ్యాంకులు, సహకార సంఘాల పనితీరును నాఫ్కాబ్ పరిశీలించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన వాటి వివరాలను వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వాల ప్రాధాన్యతలను పరిగణనలోకి తీసుకుంటూనే రుణాల రికవరీ, మంజూరు విషయంలో ఆప్కాబ్ గత రెండేళ్లుగా ఉత్తమ ప్రతిభ కనబరుస్తోందని, గతేడాది (2017–18) కూడా రెండోస్థానాన్ని దక్కించుకుందని వివరించింది. సిబ్బంది, అధికారులు నిబద్ధతతో పని చేయడం వల్లనే ఈ గుర్తింపు వచ్చిందని ఆప్కాబ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనాథ్రెడ్డి తెలిపారు. అదే విధంగా డీసీసీబీ స్థాయిలోనూ కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంక్(డీసీసీబీ)కు ఉత్తమ పనితీరులో ద్వితీయ స్థానం లభించిందని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా డీసీసీబీ పరిధిలోని కొమ్ముగూడెం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం సుభాష్ యాదవ్ అవార్డును పొందినట్టు చెప్పారు. ఈ అవార్డులను నాఫ్కాబ్ డిసెంబర్లో ప్రదానం చేస్తుందని చెప్పారు. -
అక్రమాలు చేసి.. ముఖం చాటేశారు..
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: గండేపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అవినీతి, అక్రమాలపై విచారణకు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ), జిల్లా సహకార అధికారులు కదిలారు. అక్రమాలకు సంబంధించిన రికార్డులు తారుమారు కాకుండా చూసేందుకు వాటిని స్వాధీనం చేసుకునేందుకు శుక్రవారం వారు ప్రయత్నించారు. సొసైటీ సిబ్బంది సహకరించకపోవడంతో చివరకు సొసైటీ భవనాన్ని, అందులో కీలకమైన రికార్డులు ఉన్న బీరువాలను సీజ్ చేశారు. బినామీ పేర్లు, నకిలీ డాక్యుమెంట్లతో గండేపల్లి సొసైటీలో కొంతమంది ప్రబుద్ధులు రూ.23 కోట్లు కొల్లగొట్టిన కుంభకోణంపై.. డీసీసీబీలోని ఇద్దరు డిప్యూటీ జనరల్ మేనేజర్లతో చైర్మన్ అనంత ఉదయ భాస్కర్ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. దీని నుంచి ఏదో ఒకలా బయట పడదామనుకుంటున్న సూత్రధారులు విచారణ ముందుకు సాగకుండా రకరకాల ఎత్తులు వేస్తున్నారు. ఈ కుంభకోణానికి సంబంధించిన రికార్డులను మాయం చేసే ప్రయత్నాలకు బుధవారమే తెర తీశారు. తొలిగా సొసైటీలో సిబ్బందిని అందుబాటులో లేకుండా చేశారు. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకూ సొసైటీలో 156 మంది బినామీ పేర్లు, నకిలీ బాండ్లతో విడుదల చేసిన రుణాల రికార్డుల కోసం విచారణాధికారులు అనేక ప్రయత్నాలు చేశారు. విచారణ కోసం సొసైటీ కార్యాలయానికి వెళ్లేసరికి సిబ్బంది ముఖం చాటేయడంతో వారు అవాక్కయ్యారు. శుక్రవారం సొసైటీ వద్దకు వెళ్లగా రికార్డులు, కార్యాలయంలోని బీరువాల తాళాలు కూడా అందుబాటులో లేవనే సమాధానం వారికి ఎదురైంది. తద్వారా విచారణను అడ్డుకునేందుకు అక్రమార్కులు ఎత్తు వేశారు. సొసైటీలోని బీరువాల్లో ఉన్న రికార్డులను మార్చేసే ప్రయత్నం కూడా జరుగుతోందని స్థానికులు డీసీసీబీ అధికారులకు ఉప్పందించారు. ఈ పరిణామాలన్నింటినీ నిశితంగా గమనించిన డీసీసీబీ అధికారులు అక్రమార్కుల ఎత్తులకు పై ఎత్తులు వేశారు. విచారణ ముందుకు సాగాలంటే రికార్డులు తారుమారు కాకుండా చూడాలని, ప్రధాన ఆధారాలుగా భావిస్తున్న 156 మంది రైతుల పేర్లతో నమోదై ఉన్న డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో విచారణ ముగిసే వరకూ సొసైటీలోని రికార్డులను భద్రంగా ఉంచాల ని జిల్లా సహకార అధికారి పాండురంగారావును డీసీసీబీ చైర్మన్ అనంతబా బు కోరారు. జిల్లా సహకార అధికారి ఆదేశాల మేరకు పెద్దాపురం, ప్రత్తిపా డు సబ్ డివిజన్ల సహకార అధికారులు బీఎన్ శివకుమార్, శివకామేశ్వరరావు లు గండేపల్లి సొసైటీకి వెళ్లారు. సిబ్బందిని రికార్డుల గురించి అడగగా వారు ఇవ్వలేదు. అటెండర్కు కరోనా వచ్చినందు వల్ల తాళాలు లేవని చెప్పారు. వారి మాటలను విశ్వసించని అధికారు లు రికార్డులు ఉన్న మూడు బీరువాల తో పాటు, గండేపల్లి సొసైటీ కార్యాలయాన్ని కూడా సీజ్ చేశారు. డీసీసీబీ జారీ చేసిన నోటీసులను సొసైటీ ప్రధాన ద్వారం తలుపులపై అతికించారు. ఈ అక్రమాలపై రెండు మూడు రోజుల్లో పూర్తిస్థాయి విచారణ చేపడతామని డివిజనల్ సహకార ఆఫీసర్ రాధాకృష్ణ తెలిపారు. అక్రమార్కుల నుంచి ప్రతి పైసా తిరిగి రాబట్టే వరకూ విశ్రమించేది లేదన్నారు. బాధ్యులుగా తేలిన వారిపై సహకార చట్టం ప్ర కారం చర్యలు తప్పవన్నారు. విచారణ ను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తే పోలీసుల సాయం కూడా తీసుకుంటామని హెచ్చరించారు. -
ఆ అవినీతి మూట.. రూ.23 కోట్లపై మాటే
ఓ సారి అధికారం ఇస్తే పది కాలాలపాటు ప్రజల సేవలో తరించాలనుకోవాలి...ప్రజల మన్ననలు పొందుతూ వారి మదిలో పదిలంగా స్థానం సంపాదించాలని ప్రజాప్రతినిధి తపన పడాలి. కానీ టీడీపీ హయాంలో ప్రజాప్రతినిధులంటే నిధుల స్వాహాకే వచ్చినట్టుగా...అందుకే పదవిని చేపట్టినట్టుగా యథేచ్ఛగా దోపిడీకి పాల్పడ్డారు. ఆ ఐదేళ్లే కాకుండా రానున్న ఐదేళ్లలో కూడా దోపిడీకి స్కెచ్ వేసుకొని మరీ స్వాహాకు ఉపక్రమించడం మరీ విడ్డూరం. అదృష్టవశాత్తూ వారు అధికారానికి దూరమయ్యారు కాబట్టి సరిపోయింది గానీ లేదంటే నిలువు దోపిడీ జరిగేది. సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: పచ్చ నేతల ముందు చూపుతో సహకార సంఘాల్లో కోట్ల రూపాయలను కొల్లగొట్టారు. జిల్లాలోని ఏ సహకార సంఘాన్ని కదిలించినా గత టీడీపీ ఏలుబడిలో ఎటు చూసినా అవినీతి కుంభకోణాలు బట్టబయలవుతున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు అధికారంలో ఉన్న చంద్రబాబు సర్కార్ అండాదండా చూసుకుని తెలుగు తమ్ముళ్లు చెలరేగిపోయారు. మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమనే ధీమాతో టీడీపీ నేతలు సహకార సంఘాల్లో దొంగలు పడ్డట్టుగా చొరబడి దొరికినంత దోచుకున్నారు. చంద్రబాబు మరోసారి సీఎం అవుతారు, పంట రుణాలు మాఫీ చేస్తారని ఆ పార్టీ ఏలుబడిలోని సహకార సంఘాల పాలక వర్గాలు సార్వత్రిక ఎన్నికలకు ముందు గట్టి నమ్మకంతో ఉన్నారు. అతి విశ్వాసంతోనే బినామీ పేర్లతో కోట్లు రుణాలు లాగేశారు. తీరా ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీకి ఘోర పరాభవాన్ని రుచి చూపించారు. ఈ పరిస్థితుల్లో తెలుగు తమ్ముళ్లు పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. ప్రభుత్వం వచ్చేస్తుంది, చంద్రబాబు రుణ మాఫీ అమలవుతుందనే గుడ్డి నమ్మకంతో జిల్లాలోని పలు సహకార సంఘాల ప్రతినిధులు నకిలీ పాస్ పుస్తకాలు, బినామీ పేర్లతో రూ.కోట్లకు పడగలెత్తారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్గా అనంత ఉదయభాస్కర్ బాధ్యతలు స్వీకరించాక ఈ కుంభకోణాలను ఒకటొకటిగా ఛేదిస్తున్నారు. గతం దొంగల దోబూచులాట కొన్ని సంఘాలు, బ్రాంచీల్లో కోట్ల రూపాయలు కొల్లగొట్టిన కుంభకోణాలు బయటకు రాకుండా సంఘాల్లో పనిచేస్తున్న అధికారులు దాచిపెడుతున్నారు. గత పాలకవర్గాల్లో సంఘాలపై పడి నిలువునా దోచుకున్న వారే కావడం గమనార్హం. గత టీడీపీలో జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ వరుపుల రాజా, సీఈఓల హయాంలో డీసీసీబీ, సహకార సంఘాలు కుంభకోణాలమయంగా మారిపోయాయి. ఈ కుంభకోణాల గుట్టును ‘సాక్షి’ వరుస కథనాలతో రట్టు చేస్తున్న సంగతి పాఠకులకు విదితమే. ఇలా ఏజెన్సీలోని మొల్లేరు, మెట్ట ప్రాంతంలో లంపకలోవ, కోనసీమలో వద్దిపర్రు...తదితర సొసైటీలపై పడి రూ.కోట్లు కొట్టేసిన వైనాన్ని సాక్షి’ వెలుగులోకి తేవడం, డీసీసీబీ చైర్మన్ అనంతబాబు విచారణ జరిపించి బాధ్యులపై చర్య తీసుకుంటున్నారు. గండేపల్లిలో తాజాగా... ఈ వరుసలోనే తాజాగా మెట్ట ప్రాంతంలోని గండేపల్లి సహకార సంఘం, గండేపల్లి డీసీసీ బ్రాంచీలో రూ.కోట్లు కొల్లగొట్టిన కుంభకోణం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. 2017 నవంబరు నెల నుంచి గండేపల్లి బ్రాంచి పరిధిలోని గండేపల్లి పీఏసీఎస్లో నకిలీ డాక్యుమెంట్లు, నకిలీ బాండ్లు, బినామీ రైతుల పేరుతో స్వాహా బాగోతమిదీ. గండేపల్లి డీసీసీబీ బ్రాంచి సూపర్వైజర్గా నేదూరి వాసుదేవరెడ్డి గతేడాది అక్టోబరు 28న జాయినయ్యారు. 2020 జనవరి 30న జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం, చైర్మన్ ఆదేశాల మేరకు గండేపల్లి సొసైటీ రికార్డులను బ్యాంకులో పరిశీలించేందుకు సూపర్వైజర్ ప్రయత్నించారు. అందుకు సొసైటీ, బ్రాంచిల నుంచి సహాయ నిరాకరణ ఎదురైంది. ఈ క్రమంలో 2017 నవంబరు 28 నుంచి ఇచ్చిన రుణాలకు సంబంధించి రికార్డులు బ్యాంక్కు ఇవ్వలేదనే విషయం గుర్తించారు. గండేపల్లి బ్రాంచిలో సైతం రికార్డులను దాచిపెట్టారు. లోతుగా పరిశీలించే క్రమంలో బ్యాంకులో ఉన్న షాడో రిజిస్టర్, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాల ద్వారా కొంత సమాచారాన్ని సూపర్వైజర్ సేకరించడంతో విషయం డీసీసీబీ ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్లిందని విశ్వసనీయ సమాచారం. సూపర్వైజర్ సంతకం లేకుండానే.. సూపర్వైజర్ సంతకం లేకుండా పది మంది సభ్యుల రుణాలు రెన్యువల్ చేసిన వైనం ఆ సందర్భంలోనే బయటపడింది. తన ప్రమేయం లేకుండా రుణాలు రెన్యువల్ చేయడంతో ఇందులో పెద్ద కుంభకోణమే దాగి ఉందనే అనుమానం, ఈ వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి ఎక్కడ తన మెడకు చుట్టుకుంటుందనే భయం వెరసి సూపర్వైజర్ డీసీసీబీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారని తెలియవచ్చింది. ఈ క్రమంలోనే రికార్డులు పరిశీలించే సరికి తీగ లాగితే డొంక కదిలినట్టు గండేపల్లి సొసైటీలో కోటి రూపాయల బినామీ రుణాల బాగోతం బయటకు వచ్చిందంటున్నారు. 10 మంది సభ్యుల రుణాలకు సంబంధించి అడ్వాన్సు స్టేట్మెంట్, రికవరీ స్టేట్మెంట్పై సొసైటీ సూపర్వైజర్ సంతకాలు లేకపోవడం గమనార్హం. మేనేజర్ ఒక్క కలం పోటుతో రూ.99,93,000 లక్షలు స్వల్పకాలిక, దీర్ఘకాలిక పంట రుణాలను 2020, ఫిబ్రవరి 17న రెన్యువల్ చేయడం విశేషం. మొదట గుర్తించిన పది మంది సభ్యుల బినామీ రుణాలు రెన్యువల్ చేయడంతో మరిన్ని రుణాలు ఇదే రీతిన రెన్యువల్ చేశారని తెలియవచ్చింది. అలా గండేపల్లి సొసైటీలో మొత్తం 156 మంది సభ్యుల పేరుతో బినామీ పాస్పుస్తకాలు, నకిలీ డాక్యుమెంట్లు, నకిలీ బాండ్ పేపర్లతో సుమారు రూ.23 కోట్లు రుణాలు అప్పటి పాలకవర్గం హయాంలో విడుదలయ్యాయి. ఈ 156లో మొత్తం 50 మంది సభ్యుల(బినామీలు) రుణాలను రెన్యువల్ చేయగా, మిగిలిన 106 మంది రెన్యువల్ చేసే క్రమంలోనే విషయం బయటకు పొక్కడంతో బ్రేక్ పడిందంటున్నారు. ఈ నకిలీ పాస్పుస్తకాలు, డాక్యుమెంట్ల కోసం ప్రత్యేకంగా ఒక ప్రింటింగ్ మెషీన్ను గండేపల్లిలో ఏర్పాటు చేశారని, చివరకు బాండు పేపర్లను సబ్ రిజిస్ట్రార్ సీల్ను కూడా టేంపరింగ్ చేశారని విశ్వసనీయంగా తెలిసింది. ఈ బినామీ రుణాలకు సంబంధించిన మొత్తం జాబితా జిల్లా కేంద్ర సహకార బ్యాంక్కు కూడా చేరినట్టు తెలిసింది. ఈ జాబితా ఆధారంగా డీసీసీబీ నిష్పక్షపాతమైన విచారణ జరిపితే కుంభకోణం వెలుగులోకి రానుంది. ఇంకా మా దృష్టికి రాలేదు గండేపల్లి బ్రాంచ్ పరిధిలో రుణాల అవకతవకల విషయం నా దృష్టికి రాలేదు. జిల్లాలో ఏ సొసైటీ, బ్రాంచ్లో అవకతవకలు జరిగినట్టు మా దృష్టికి వచ్చినా వెంటనే చైర్మన్ అనంతబాబు ఆదేశాల మేరకు విచారణ చేస్తున్నాం. బాధ్యులపై చర్యలు తీసుకుని రికవరీ కూడా చేస్తున్నాం. గండేపల్లి సొసైటీ విషయం చైర్మన్తో మాట్లాడతాను. – ప్రవీణ్కుమార్, డిసీసీబీ ఇన్చార్జ్ సీఈవో -
సాక్షి ఎఫెక్ట్: నిగ్గు తేలిన నిజాలు..
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: అక్రమార్కులపై వేటు పడింది. సెంటు భూమి లేకపోయినా కమీషన్లకు కక్కుర్తి పడి, నకిలీ డాక్యుమెంట్లతో భూములు సృష్టించి, ఎడాపెడా రుణాల పేరుతో దోచేసిన వారిని ఎట్టకేలకు ఇంటికి సాగనంపారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ) ఆత్రేయపురం బ్రాంచి వద్దిపర్రు ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీలో అక్రమ రుణాల బాగోతంపై విచారణ పూర్తయింది. ఈ కుంభకోణంలో బాధ్యులుగా నిగ్గు తేల్చిన డీసీసీబీ, సహకార ఉద్యోగు లు నలుగురిపై డీసీసీబీ చైర్మన్ అనంత ఉదయభాస్కర్ శుక్రవారం వేటు వేశారు. ఉద్యోగంలో ఉన్న వారిని సస్పెండ్ చేయాలని, రిటైరైన సూపర్వైజర్, డీజీఎంల బెనిఫిట్లు నిలుపు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ విచారణలో రూ.కోటిన్నర రుణాలు అక్రమ మార్గంలో విడుదల చేసినట్టు నిర్ధారణయింది. ఇందులో బాధ్యుల నుంచి 90 శాతం రికవరీ చేయడం డీసీసీబీకి కొంతలో కొంత ఊరట కలిగించే అంశం. (చదవండి: అంతర్వేది ఘటన వెనుక చంద్రబాబు హస్తం) ‘అవినీతిలో సహకారం.. రూ.కోటిన్నర మాయం’ శీర్షికన ‘సాక్షి’లో ఇటీవల ప్రచురితమైన కథనంపై డీసీసీబీ చైర్మన్ స్పందించి, విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. వద్దిపర్రు వ్యవసాయ సహకార పరపతి సంఘంలో గత తెలుగుదేశం ఏలుబడిలో నేతలు, సహకార అధికారులు కుమ్మక్కై బినామీ రైతుల పేర్లతో రూ.కోటిన్నర నొక్కేసిన వైనాన్ని ‘సాక్షి’ బట్టబయలు చేసింది. దీనిపై తీవ్రంగా స్పందించిన చైర్మన్ ఈ కుంభకోణంపై లోతైన విచారణ జరిపించాలని డీసీసీబీ సీఈఓ ప్రవీణ్కుమార్ను ఆదేశించారు.. ఆగమేఘాల మీద డీసీసీబీ డిప్యూటీ జనరల్ మేనేజర్ వెంకటేశ్వరరావును విచారణాధికారిగా నియమించారు. వెంకటేశ్వరరావు విచారణ ముగించి ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆత్రేయపురం బ్రాంచి మేనేజర్ క్రాంతికృష్ణ, వద్దిపర్రు సొసైటీ రిటైర్ సూపర్వైజర్ ఎం.మహాలక్ష్మిరాజు, రిటైర్డ్ డీజీఎం పి.పట్టాభి రామయ్య, మేనేజర్/లీగల్ ఆఫీసర్ పి.సత్తయ్యలపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశించారు. సీఈఓ మునేశ్వరరావును ఇదివరకే విధుల నుంచి తప్పించిన విషయం విదితమే. (చదవండి: ఆ ఇద్దరితో శ్రావణి ప్రేమాయణం..) నిగ్గు తేల్చిన అక్రమాలివే... ►వద్దిపర్రు సొసైటీ సభ్యుడు కొండ్రు నాంచారావు పేరున భూమి లేకపోయినా నకిలీ డాక్యుమెంట్లతో రూ.17.21 లక్షలు స్వాహా. ►మరో సభ్యుడు వాకలపూడి హరిబాబు ఎకరం భూమికి రూ.2.50 లక్షలకు అర్హత ఉండగా..రూ.5 లక్షలు. ఎల్టీ రుణంగా ఎకరం భూమి ఉంటే రూ.4 లక్షలు ఇవ్వాల్సి ఉండగా..రూ.6.28 లక్షలు ఇచ్చారు. టైటిల్ డీడ్ లేకుండానే ఇతని సోదరుడు విశ్వేశ్వరరావుకు రుణం మంజూరు. ►మూడెకరాలున్న మల్లాది వెంకటరామారావుకు రూ.7.65 లక్షలు రుణం ఇచ్చే అవకాశం ఉండగా.. రూ.14.65 లక్షలు ఇచ్చారు. ►కరుటూరి శ్రీనివాసరావుకు ఒక రుణంగా రూ.20 లక్షల వరకు ఇవ్వవచ్చు..కానీ అడ్డగోలుగా రూ.33 లక్షల రుణం మంజూరు చేశారు. ►భూమి తక్కువగా ఉన్నా..అర్హతకు మించి ఆచంట మంగాదేవి, ఆచంట పద్మావతి, కరుటూరి వెంకటలక్షి్మలకు బాండ్లు లేకపోయినా క్రెడిట్ లిమిట్ లేకుండా రుణాలివ్వడం. ►క్రెడిట్ లిమిట్ మంజూరు లేకుండా 40 మందికి ఏకంగా రూ.62.79 లక్షలు రుణాలు మంజూరు చేశారు. ఈ మంజూరులన్నీ బ్రాంచ్ మేనేజర్ నిర్లక్ష్యం కారణంగానే జరిగాయని విచారణలో నిగ్గుతేల్చారు. ►రిటైరైన సూపర్వైజర్ ఎం.మహాలక్ష్మిరాజు బ్రాంచ్ మేనేజర్కు తెలియకుండా డీ నమూనా పట్టాలపై 21 మందికి రుణాలు మంజూరు చేసినట్లు వెల్లడైంది. ►నిబంధనలకు విరుద్ధంగా సీఈఓ మునేశ్వరావుతోపాటు మహాలక్ష్మిరాజు వాయిదా మీరిన రుణాలపై న్యాయ పరమైన చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ►ఎల్ఈసీ కార్డులు రెన్యూవల్ చేయకుండా రుణాలు రెన్యూవల్ చేయడంలో సీఈఓతోపాటు సూపర్ వైజర్ బాధ్యులు. ►సంఘంలో క్రెడిట్ లిమిట్ మంజూరు ఉందా? లేదా? అని పరిశీలించకుండా 40 మంది సభ్యులకు రూ.62.79 లక్షలు లోన్లు మంజూరు చేశారు. ►31.03.2019 నాటికి రూ.31.68.150 మొండిబకాయిలుండగా.. ఇందులో మూడేళ్లు దాటిన రూ.24 లక్షలు ఉండగా..వాటి వసూళ్లకు ఎటువంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ►భూములను పరిశీలించకుండా..డాక్యుమెంట్లు లేనప్పటికీ కొండ్రు నాంచారావుకు రుణం మంజూరు చేయడం. ఫేక్ డాక్యుమెంట్లను గుర్తించకుండా రుణాలు ఇచ్చిన సూపర్వైజర్, మేనేజర్, ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసిన ప్పటి డీజీఎం పి.పట్టాభి రామయ్య బాధ్యునిగా తేల్చారు. ►వాకలపూడి హరిబాబు, సోదరుడు విశ్వేశ్వరావు, రాంబాబులకు రాజవరం సిండికేట్ బ్యాంకులో రుణాలున్నాయి. వీరికి డీసీసీబీ వెబ్ల్యాండ్ చూడకుండా అదనంగా రుణాలు మంజూరు చేయడం, వెబ్ ల్యాండ్ చూసి ఉంటే రుణాలు మంజూరు చేసే పరిస్థితి ఉండేది కాదు. బ్రాంచ్ మేనేజర్, సూపర్వైజర్ నిర్లక్ష్యం వల్ల బ్యాంక్ నష్టపోయింది. లీగర్ ఆఫీసర్ సత్తయ్య ఒక రుణం అవుట్ స్టాండింగ్ ఉండగా...మరో రుణానికి సిఫార్సు చేస్తూ వద్దిపర్రు సొసైటీ చేసిన తప్పును గుర్తించలేకపోవడం బాధ్యతారాహిత్యంగా గుర్తించి చర్యలకు ఉపక్రమించారు. ‘బాధ్యతగా లేకుంటే ఇంటికే’ సొసైటీ, బ్రాంచి, చివరకు డీసీసీబీలో సైతం అధికారులు, ఉద్యోగులు బాధ్యతగా లేకుంటే ఇంటికి పంపించేస్తా. రైతులకు రుణాలు మంజూరు చేయడంలో ఏ దశలో అయినా నిర్లక్ష్యం, అవినీతి, కమీషన్లకు కక్కుర్తి పడితే కఠిన చర్యలు తప్పవు. డీసీసీబీ సీఈఓ స్థాయి నుంచి డీజీఎంలు, ఏజీఎంలు, లీగల్ ఆఫీసర్లు, సూపర్వైజర్ వరకూ ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను తు.చ. తప్పకుండా నిర్వర్తించాలి. లేకుంటే ఏ ఒక్కరినీ విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఎంతటి సిఫారసులతో వచ్చినా రైతులను మోసం చేసిన వారిని, బ్యాంకుకు నష్టం కలిగించిన వారిని ఉపేక్షించేది లేదు. – అనంతబాబు, చైర్మన్, డీసీసీబీ -
‘పచ్చ’నేతలు దొరికారు!
గత టీడీపీ ప్రభుత్వంలో ఐదేళ్లూ అవినీతి తమ హక్కు అన్నట్టుగా ఆ నేతలు చలాయించడంతో కోట్ల రూపాయలకు కాళ్లు వచ్చాయి. రానున్న ఐదేళ్లూ కూడా తమవే అన్న రీతిలో రెచ్చిపోవడంతో మృతులు కూడా వీరికి ఆదాయ వనరులుగా మారిపోయారు. సహకార వ్యవస్థకు తూట్లు పొడిచిన ‘పచ్చ’ నేతలు రైతులను మోసం చేశారు. సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: తెలుగుదేశం ప్రభుత్వంలో జిల్లాలో సహకార రంగాన్ని భ్రష్టు పట్టించి కోట్లు కొట్టేసిన ప్రబుద్ధుల బండారాలు ఒక్కొక్కటిగా బట్టబయలవుతున్నాయి. పచ్చ నేతలు పచ్చని పొలాలను పావులుగా వాడుకుని, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించడం, మృతుల పేర్లతో పాస్పుస్తకాలు, బినామీ ఆస్తులను కుదువ పెట్ట డం ద్వారా సహకార వ్యవస్థను అధఃపాతాళంలోకి నెట్టేశారు. టీడీపీ ఐదేళ్ల పాలనా కాలంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంక్(డీసీసీబీ)ను లూటీ చేసేశారు. ఈ కుంభకోణాలను ‘సాక్షి’ వరుస కథనాలతో వెలుగులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే డీసీసీబీ సీఈఓ మంచాల ధర్మారావు సహా పలు బ్రాంచీల మేనేజర్లు, ఇతర అధికారులు, ఉద్యోగులపై డీసీసీబీ చైర్మన్ అనంత ఉదయభాస్కర్ సస్పెన్షన్ వేటు వేశారు. గత పాలకవర్గంలో జరిగిన ఆర్థిక అవకతవకలపై వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విచారణ కు ఆదేశించి, అవినీతి కుంభకోణాల మూలాలను తవ్వి తీస్తోంది. ఈ క్రమంలో తాజాగా మెట్ట ప్రాంతంలో అప్పటి డీసీసీబీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రస్తుత ఇన్చార్జి వరుపుల రాజా అధ్యక్షుడిగా వ్యవహరించిన లంపకలోవ సొసైటీలో కోట్ల రూపాయల అవినీతి గుట్టును 51 విచారణ రట్టు చేసింది. ఇప్పుడైతే లంపకలోవలో అవినీతి కుంభకోణం బయట పడింది కానీ ఆ ఐదేళ్ల పాలనా కాలంలో జిల్లాలో ఏ సహకార సంఘాన్ని కదలించినా భారీగానే అక్రమాలు బయటపడుతున్నాయి. గత నెలలో ఆత్రేయపురం బ్రాంచి పరిధిలోని వద్దిపర్రు సొసైటీలో అంతా కుమ్మక్కై వ్యవసాయ కూలీలను రైతులుగా చూపించి రూ.1.50 కోట్లు కొట్టేసిన సంగతి ‘సాక్షి’ బయటపట్టిన నేపథ్యంలో పలువురిపై చర్యలు తీసుకున్నారు. పలు కేసుల నమోదు దాదాపు ఇదే రీతిన ప్రత్తిపాడు మండలం లంపకలోవ పీఏసీఎస్లో ఒకటీ రెండూ కాదు ఏకంగా రూ.16 కోట్లు పైనే నొక్కేసినట్టు నిర్థారణ కావడం జిల్లా సహకారశాఖను ఒక కుదుపు కుదిపేస్తోంది. ఈ సొసైటీలో రూ.16,47,59,023 దుర్వినియోగానికి పాల్పడ్డ అప్పటి సొసైటీ అధ్యక్షుడు, నాటి డీసీసీబీ చైర్మన్ వరుపుల రాజాతోపాటు మరో నలుగురిపై శుక్రవారం ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదవడం తీవ్ర సంచలనమైంది. రాజాతో పాటు ఇద్దరు మాజీ సీఈఓలు, మాజీ బ్రాంచి మేనేజర్లపై పెద్దాపురం డివిజనల్ కో ఆపరేటివ్ ఆఫీసర్ రాధాకృష్ణారావు పోలీసుల కు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. డొంక కదిలింది ఇలా... లంపకలోవ సొసైటీలో 2018 మే 11 నుంచి 2019 జూలై 30 మధ్య కాలంలో నిధులు అడ్డంగా దోచేశారంటూ ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణ చంద్ర ప్రసాద్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లడంతో ఈ అవినీతి డొంక కదిలింది. ఎమ్మెల్యే పర్వత శాసనసభలో ప్రస్తావించడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ప్రాథమిక విచారణలో నిధు ల దుర్వినియోగం రుజువుకావడంతో ప్రత్తిపాడు డీసీసీబీ మేనేజర్ ఎం.నరసింహమూర్తిని సస్పెండ్ చేశారు. ఈ చర్య ఎంత మాత్రం సరిపోదని, లోతైన విచారణ జరిపి ప్రతిపైసా తిరిగి సొసైటీకి జమవ్వాలని ఎమ్మెల్యే పర్వత, ఇటు డీసీసీబీ చైర్మన్ అనంతబాబు పట్టుబట్టి మరీ ఏపీ సహకార చట్టం 1964 ప్రకా రం 51 విచారణ జరిపించారు. ఈ అవినీతిని వెలుగులోకి తీసుకురావడానికి జిల్లా సహకార అధికారి డి.పాండురంగారావు సొసైటీ పరిధిలో 5050 మంది సభ్యులలో రుణాలు పొందిన సుమారు 4000 మంది సభ్యులను సుమారు రెండు నెలల పాటు విచారించిన మీదట నిధుల దుర్వినియోగాన్ని నిర్థారించారు. అడ్డగోలుగా రుణాలు మంజూరు ఒకరి పేరునే రెండు, మూడు రుణాలు తీసుకోవడం, మృతుల పేర్ల మీద, నకిలీ పాస్ పుస్తకాలపైన అడ్డగోలుగా రుణాలు మంజూరు చేయడం వంటి అనేక అవకతవకలు ఈ విచారణలో వెలుగులోకి వచ్చాయి. గత నవంబర్ నెలలో రెవెన్యూ అధికారులు పాస్ పుస్తకాలను తనిఖీ చేసి, అధిక శాతం నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలతో రుణాలు పొందినట్టు నిర్ధారించారు. ఇదే లంపకలోవ సొసైటీలో అవకతవకలపై గత అక్టోబర్ నెలలో కుంభకోణంలో క్రియాశీలక పాత్ర పోషించిన డీసీసీబీ మాజీ చైర్మన్ వరుపుల రాజాతోపాటు సొసైటీ డైరెక్టర్లు, మాజీ సీఈఓ చాగంటి వెంకట్రావుల ఆస్థులపై జప్తు నోటీసులను కూడా జారీ చేశారు. ఇప్పుడు రాజాతోపాటు ఈ కుంభకోణ బాధ్యులుపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వరుపుల రాజాతో పాటు నలుగురిపై కేసులు ప్రత్తిపాడు: మండలంలోని లంపకలోవ వ్యవసాయ సహకార పరపతి సంఘం (సొసైటీ)లో నిధుల అవకతవకలపై అప్పటి సొసైటీ అధ్యక్షుడు, మాజీ డీసీసీబీ చైర్మన్ వరుపుల రాజాతోపాటు మరో నలుగురిపై శుక్రవారం ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. స్థానిక పోలీసుల కథనం మేరకు లంపకలోవ సొసైటీలో 2018 మే 11–2019 జూలై 30 మధ్య కాలంలో తప్పుడు లెక్కలు నమోదు చేయడం, అవకతవకలకు పాల్పడి రూ.16,47,59,023 నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని పెద్దాపురం డివిజన్ కోఆపరేటివ్ అధికారి ఎ. రాధాకృష్ణారావు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు అప్పటి లంపకలోవ సొసైటీ అధ్యక్షుడు, మాజీ డీసీసీబీ చైర్మన్ వరుపుల జోగిరాజు అనే రాజా, సొసైటీ మాజీ సీఈఓ సీహెచ్ వెంకట్రావు, సీఈఓ కె.అప్పారావు, ప్రత్తిపాడు డీసీసీబీ మాజీ బ్రాంచ్ మేనేజర్లు ఎం.నరసింహమూర్తి, పి.మురళీకృష్ణలపై 409, 419, 420, 468, 471, 477(ఎ), 109 రెడ్విత్ 34 సెక్షన్ల ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రత్తిపాడు సీఐ వై.రాంబాబు ఆధ్వర్యంలో ఏఎస్సై సత్యనారాయణ కేసు నమోదు చేశారు. పెద్దాపురం డీఎస్పీ ఎ.శ్రీనివాసరావు శుక్రవారం సాయంత్రం లంపకలోవ సొసైటీలో విచారణ చేపట్టారు. ప్రత్తిపాడు, జగ్గంపేట సీఐలు వై.రాంబాబు, సురేష్, సొసైటీ అధ్యక్షుడు గొంతిన సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
త్వరలోనే రుణమాఫీ
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక మందగమనం ఉన్నా రైతులకు ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ ప్రక్రియ త్వరలోనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. రైతుల సంఘటిత శక్తిని వారి సంక్షేమానికి ఉపయోగపడేలా కొత్తగా ఎన్నికైన సహకార సంఘాల ప్రతినిధులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇటీవల కొత్తగా ఎన్నికైన జిల్లా కేంద్ర సహకార సంఘాలు (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీల (డీసీఎంఎస్) చైర్మన్లు సోమవారం తెలంగాణ భవన్లో కేటీఆర్తో భేటీ అ య్యారు. సహకార ఎన్నికలను సవాల్గా తీసుకుని టీఆర్ఎస్కు భారీ విజయాన్ని అందించిన మంత్రులను కేటీఆర్ అభినందించారు. డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 48 శాతం మేర ప్రాతినిథ్యం కల్పించామని చెప్పారు. ఆదిలాబాద్లో ఎస్సీ, మహబూబ్నగర్లో మైనారిటీ వర్గానికి చెందిన వారిని చైర్మన్లుగా ఎంపిక చేసిట్లు గుర్తు చేశారు. సహకార ఎన్నికల్లో రిజర్వేషన్లు లేకున్నా సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో బలహీన, బడుగు వర్గాలకు ప్రాతినిథ్యం కల్పించేలా డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ పేర్లను ఖరారు చేశారన్నారు. ఖర్చుకు వెనుకాడకుండా రైతు సంక్షేమం: ఖర్చుకు వెనుకాడకుండా రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం పనిచేస్తున్నందునే రాష్ట్రంలోని 906 సహకార సంఘాల్లో 94 శాతానికి పైగా తమ పార్టీ మద్దతుదారులే గెలుపొందారని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో వ్యవసాయరంగం కొత్త పుంతలు తొక్కుతోందని, రైతు బీమా, రైతుబం ధు లాంటి ప్రత్యేక పథకాలను దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందన్నారు. కేంద్ర అసంబద్ధ నిర్ణయాలతో దేశవ్యాప్తంగా ఆర్థిక మందగమనం నెలకొందని ఆరోపించారు. సమావేశంలో మంత్రులు జగదీశ్రెడ్డి, సత్యవతిరాథోడ్, నిరంజన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లను ఉద్దేశించి మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్ -
డీసీసీబీ, డీసీఎంఎస్ పదవులన్నీ టీఆర్ఎస్ ఖాతాలోకే
-
సహకార పీఠాలన్నీ ఏకగ్రీవం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ), జిల్లా సహకార సంఘాల మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ శనివారం ముగిసింది. డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులన్నీ ఏకగ్రీవం కాగా అధికార టీఆర్ఎస్ మద్దతుదారులే జిల్లా సహకార పీఠాలను కైవసం చేసుకున్నారు. సహకార ఎన్నికలకు తొలిమెట్టుగా పేర్కొనే పీఏసీఎస్ డైరెక్టర్ స్థానాలు మొదలుకొని ఉమ్మడి జిల్లా స్థాయిలో చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల వరకు పార్టీ మద్దతుదారులే గెలుపొందేలా టీఆర్ఎస్ పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తూ వచ్చింది. పీఏసీఎస్ డైరెక్టర్లు, చైర్మన్లు మొదలుకొని డీసీసీబీ, డీసీఎంఎస్ డైరెక్టర్ల ఎంపిక వరకు స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు క్రియాశీల పాత్రపోషించారు. అయితే డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ పదవులకు పార్టీలోనే అంతర్గత పోటీ నెలకొనడంతో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పార్టీ, సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని అభ్యర్థులను ఖరారు చేశారు. తొమ్మిది డీసీసీబీలకుగాను ఆరు జిల్లాల్లో ఓసీలు, ఖమ్మం, మహబూబ్నగర్లో బీసీ, ఆదిలాబాద్లో ఎస్సీ కేటగిరీకి చైర్మన్ పదవి దక్కింది. డీసీఎంఎస్లలోనూ ఆరుగురు ఓసీలతోపాటు నల్లగొండ, నిజామాబాద్లో బీసీ, వరంగల్లో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన నేతను చైర్మన్ పదవి వరించింది. పరిశీలకుల సమక్షంలో అభ్యర్థుల ప్రకటన... డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికకు శనివారం ఉదయం 9 గంటలకు నోటిఫికేషన్ వెలువడగా క్యాంపుల్లో ఉన్న టీఆర్ఎస్ మద్దతుదారులు అంతకు రెండు గంటల ముందే ఉమ్మడి జిల్లా కేంద్రాలకు చేరుకున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా శుక్రవారం సీల్డ్ కవర్లు అందుకున్న పార్టీ పరిశీలకులు శనివారం ఉదయం డీసీసీబీ, డీసీఎంఎస్ డైరెక్టర్లతో భేటీ అయ్యారు. సంబంధిత జిల్లా మంత్రులు కూడా ఈ భేటీలో పాల్గొని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఖరారు చేసిన అభ్యర్థులకు మద్దతు ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఆ తర్వాత సీల్డ్ కవర్లలో ఉన్న పేర్లను పార్టీ పరిశీలకులు వెల్లడించి నామినేషన్ల ప్రక్రియను సమన్వయం చేశారు. అయితే ఆదిలాబాద్, నల్లగొండ, మహబూబ్నగర్, మెదక్లో డీసీసీబీ చైర్మన్ పదవులకు బహుముఖ పోటీ నెలకొనడంతో అవకాశం దక్కని ఆశావహులను మంత్రులు బుజ్జగించారు. కొందరికి వైస్ చైర్మన్ పదవి దక్కగా అవకాశం దక్కని నేతలకు ఇతరత్రా అవకాశం ఇస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని డీసీసీబీ చైర్మన్ పదవులకు ఆదిలాబాద్లో నామ్దేవ్ (ఎస్సీ), మహబూబ్నగర్లో నిజాంపాషా (బీసీ) పేర్లు అనూహ్యంగా తెరమీదకు వచ్చాయి. మెదక్ డీసీసీబీ అధ్యక్ష పదవిని ఆశించిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి భర్త దేవేందర్రెడ్డికి అవకాశం లభించలేదు. టెస్కాబ్ చైర్మన్గా కొండూరు ఎన్నిక లాంఛనమే డీసీసీబీ, డీసీఎంఎస్ల చైర్మ న్, వైస్ చైర్మన్ పదవులకు ఎన్నిక ముగియడం తో అందరి దృష్టి రాష్ట్రస్థాయిలో తెలంగాణ స్టేట్ కో–ఆపరేటివ్ అపెక్స్ బ్యాంకు లిమిటెడ్ (టెస్కాబ్) చైర్మన్ ఎన్నికపై పడింది. ఈ ఎ న్నికకు సంబంధించి ఈ నెల 2 లేదా 3 తేదీల్లో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉండగా 5న ఎన్నిక జరగనుంది. టెస్కాబ్ తాజా మాజీ చైర్మన్ కొండూరు రవీందర్రావు కరీంనగర్ డీసీసీబీ చైర్మన్గా శనివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గానికి చెందిన నేత కావడంతో రవీందర్రావు ఎన్నిక లాంఛనప్రాయంగా కనిపిస్తోంది. -
పార్టీ, సామాజిక సమీకరణాలకు పెద్దపీట
సాక్షి, హైదరాబాద్: సహకార ఎన్నికల ఘట్టం ముగింపు దశకు చేరుకోగా పూర్వపు ఉమ్మడి జిల్లాల పరిధిలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు పార్టీ మద్దతుదారులకే దక్కేలా చూడాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశించారు. శనివారం డీసీసీబీ, డీఎస్ఎంఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఆయా జిల్లా పరిశీలకులతో పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణభవన్లో శుక్రవారం సాయంత్రం కేటీఆర్ గంటన్నర పాటు భేటీ అయ్యారు. శనివారం జరిగే ఎన్నికల్లో పార్టీ నిర్ణయించిన మద్దతుదారులే విజయం సాధించేలా జాగ్రత్తలు తీసుకోవాలని పార్టీ ఎన్నికల పరిశీలకులకు దిశా నిర్దేశం చేశారు. డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థులను పార్టీ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్రావు నిర్ణయించిన నేపథ్యంలో వారి ఎంపిక సాఫీగా జరిగేలా చూడాలన్నారు. జిల్లాలకు పరిశీలకులు.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా సీల్డ్ కవర్లు అందుకున్న టీఆర్ఎస్ సహకార ఎన్నికల పరిశీలకులు శుక్రవారం రాత్రే జిల్లాలకు బయ ల్దేరి వెళ్లారు. శనివారం ఉదయం 9 గంటల నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండగా, క్యాం పుల్లో ఉన్న డీసీసీబీ, డీసీఎంఎస్ డైరెక్టర్లు శనివారం ఉదయం 7 గంటలకల్లా ఆయా జిల్లా కేంద్రాలకు చేరుకోవాల్సిందిగా కేటీఆర్ ఆదేశించారు. వీరితో ఉదయం 7 గంటలకు పార్టీ పరిశీలకులు సమావేశమై పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నిర్ణయించిన వారికి మద్దతు పలకాలని కోరతారు. సీల్డ్ కవర్లను తెరిచి పార్టీ నిర్ణయించిన చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థుల పేర్లను వెల్లడిస్తారు. ఇక మధ్యాహ్నం 2 గం. వరకు నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ జరిగి న తర్వాత ఒక్కో పదవికి ఒకటి కంటే ఎక్కువ నా మినేషన్లు వస్తే సాయంత్రం 5 గం. వరకు పోలింగ్ నిర్వహించి ఫలితం ప్రకటిస్తారు. సంఖ్యా బలం పరంగా టీఆర్ఎస్కు అన్ని డీసీసీబీ, డీసీఎంఎస్ల్లో స్పష్టమైన బలం ఉండటంతో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది. సామాజిక సమీకరణాల కోణంలో.. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ పదవులకు సంబంధించి పార్టీ సమీకరణాలు, డీసీఎంఎస్ చైర్మన్ పదవులను సామాజిక సమీకరణాలను దృష్టి లో పెట్టుకుని పార్టీ అభ్యర్థులను సీఎం కేసీఆర్ ఖరా రుచేసినట్లు తెలిసింది. రాష్ట్ర స్థాయిలో టెస్కాబ్ చైర్మన్ పదవిని ఆశిస్తున్న కొండూరు రవీందర్రావును కరీంనగర్ డీసీసీబీ చైర్మన్గా ఖరారు చేశారు. వీరితోపాటు పోచారం భాస్కర్రెడ్డి (నిజామాబాద్), మార్నేని రవీందర్రావు (వరంగల్), అడ్డి బోజారెడ్డి లేదా శరత్చంద్రారావు (ఆదిలాబాద్), మనోహర్రెడ్డి (రంగారెడ్డి), గొంగిడి మహేందర్రెడ్డి(నల్లగొండ), ఎం.దేవేందర్రెడ్డి లేదా చిట్టి దేవేందర్రెడ్డి (మెదక్), మనోహర్ (మహబూబ్నగర్), కూరాకుల నాగభూషణం లేదా తూళ్లూరు బ్రహ్మయ్య (ఖమ్మం) పేర్లు జాబితాలో ఉన్నట్లు సమాచారం. డీసీఎంఎస్కు సంబంధించి మల్కాపు రం శివకుమార్ (మెదక్), శ్రీనివాస్గౌడ్ (నిజామాబాద్), పి.క్రిష్ణారెడ్డి (రంగారెడ్డి) పేర్లున్నట్లు సమా చారం. సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టు కుని డీసీసీబీ వైస్ చైర్మన్, డీసీఎంఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసిన నేపథ్యంలో శనివారం ఉదయం జాబితాపై స్పష్టత రానున్నది. -
టీఆర్ఎస్ ‘సహకార’ శిబిరాలు
సాక్షి, హైదరాబాద్: పాత ఉమ్మడి జిల్లాల పరిధిలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) మేనేజింగ్ కమిటీ ఎన్నికలు ముగియడంతో ఈ నెల 29న జరిగే చైర్మన్ ఎన్నికపై టీఆర్ఎస్ పార్టీ దృష్టి సారించింది. పూర్వపు 9 జిల్లాల పరిధిలోని డీసీసీబీ, డీసీఎంఎస్ డైరెక్టర్ స్థానాలకు మంగళవారం నామినేషన్లు స్వీకరించగా టీఆర్ఎస్ మద్దతుదారులే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కరీంనగర్ మినహా ఇతర జిల్లాల్లో డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ స్థానాలను పలువురు టీఆర్ఎస్ నేతలు ఆశిస్తుండటంతో పదవులకు బహుముఖ పోటీ నెలకొంది. జిల్లాల వారీగా డైరెక్టర్ల స్థానాలకు పార్టీ మద్దతుదారులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించిన టీఆర్ఎస్.. చైర్మన్ పదవులకు కూడా పార్టీ మద్దతుదారులే ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు పావులు కదుపుతోంది. డీసీసీబీ, డీసీఎంఎస్ డైరెక్టర్లు దాదాపు అందరూ పార్టీ మద్దతుదారులే కావడంతో చైర్మన్ పదవులు అన్ని టీఆర్ఎస్ ఖాతాలో చేరనున్నాయి. జిల్లాల వారీగా చైర్మన్ పదవులు ఆశిస్తున్న నేతల జాబితాను పార్టీ ఎమ్మెల్యేలతో సంబంధిత జిల్లా మంత్రులు చర్చించి పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఆమోదం కోసం పంపించారు. ఈ నెల 29న డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ ఎన్నిక జరగనుండగా, అదేరోజు ఉదయం జాబితాను ప్రకటించే అవకాశముంది. క్యాంపులకు తరలిన డైరెక్టర్లు డీసీసీబీ, డీసీఎంఎస్ మేనేజింగ్ కమిటీలకు ఎన్నికైన డైరెక్టర్లను మంగళవారం రాత్రి పొరుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన శిబిరాలకు తరలించారు. శిబిరాల నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతను సంబంధిత జిల్లా మంత్రులకు అప్పగించినట్లు సమాచారం. గోవా, బెంగళూరుతో పాటు తిరుపతి తదితర పుణ్యక్షేత్రాల సందర్శన అనంతరం ఈ నెల 29న ఉదయం పూర్వ ఉమ్మడి జిల్లా కేంద్రాలకు చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. చైర్మన్ పదవులకు బహుముఖ పోటీ నెలకొనడంతో వివిధ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని ఆశావహుల జాబితాను రూపొందించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ మేరకు తాము సహకార ఎన్నికల బరిలోకి దిగినట్లు కొందరు పార్టీ నేతలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించిన వారినే చైర్మన్లుగా ఎన్నుకునేలా జిల్లాల వారీగా మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు సమన్వయంతో వ్యవహరిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల స్థాయి చర్చల్లో డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ అభ్యర్థులు ఎవరనే అంశంపై స్పష్టత వచ్చినప్పటికీ, తుది జాబితాను సీఎం కేసీఆర్ ప్రకటిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
డీసీసీబీ, డీసీఎంఎస్లన్నీ ఏకగ్రీవం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్)ల మేనేజింగ్ కమిటీ సభ్యుల (డైరెక్టర్ల) పదవులు మంగళవారం ఎన్నికలు జరగకుండానే అన్నీ ఏకగ్రీవమయ్యాయి. ఉపసంహరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత అవన్నీ ఏకగ్రీవమైనట్లు తెలంగాణ సహకార శాఖ అడిషనల్ రిజిస్ట్రార్ సుమిత్ర ఒక ప్రకటనలో వెల్లడించారు. టీఆర్ఎస్కు చెందిన వారే ఎక్కువ కైవసం చేసుకోవడం గమనార్హం. రాష్ట్రంలో పాత జిల్లాల ప్రకారం 9 డీసీసీబీ, 9 డీసీఎంఎస్లకు ఎన్నికల ప్రక్రియ జరిగిన సంగతి తెలిసిందే. ఇక డీసీసీబీ, డీసీఎంఎస్లకు చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికలు ఈ నెల 29న జరుగుతాయని ఆమె తెలిపారు. దీని కోసం ఆ రోజు నామినేషన్లు స్వీకరిస్తామని, పరిశీలన అనంతరం రహస్య విధానంలో ఓటింగ్ జరిపి ఎన్నుకుంటామన్నారు. కాగా డీసీసీబీలకు 20 మంది చొప్పున గ్రూప్ ఏలో 16, గ్రూప్ బీలో నలుగురు, అలాగే డీసీఎంఎస్లకు 10 మంది చొప్పున గ్రూప్ ఏలో ఆరుగురు, గ్రూప్ బీలో నలుగురు డైరెక్టర్లను ఎన్నుకునేందుకు నోటిఫికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి 1 గంట వరకు డైరెక్టర్ల పదవుల ఎన్నికకు నామినేషన్లు స్వీకరించారు. ఈ క్రమంలో కొన్నిచోట్ల ఒక్కో డైరెక్టర్ పోస్టుకు ఇద్దరు లేదా ముగ్గురు చొప్పున నామినేషన్లు వేసినట్లు అధికారులు తెలిపారు. అయితే కొన్ని రిజర్వుడు స్థానాల్లో అభ్యర్థులు లేక వాటికి నామినేషన్లు దాఖలుకాలేదు. 9 డీసీసీబీల్లో 180 డైరెక్టర్ పదవులకు ఎన్నికలు జరగాల్సి ఉండగా, వివిధ జిల్లాల్లో 33 రిజర్వుడ్ డైరెక్టర్ పదవులకు సభ్యులు లేక ఎవరూ నామినేషన్ వేయలేదు. అలాగే 9 డీసీఎంఎస్లలో 90 డైరెక్టర్ పదవులకు నామినేషన్లు వేయాల్సి ఉండగా, 16 డైరెక్టర్ పదవులకు రిజర్వుడ్ సభ్యులు లేక నామినేషన్లు దాఖలుకాలేదు. మిగిలిన వాటికి ఇద్దరు లేదా ముగ్గురు నామినేషన్లు వేశారు. అయితే మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన నామినేషన్ల ఉపసంహరణతో అన్ని డీసీసీబీ, డీసీఎంఎస్లు ఏకగ్రీవమైనట్లు ప్రకటించారు. రిజర్వుడ్ స్థానాలకు కొన్నిచోట్ల సభ్యులు లేకపోవడంతో అన్ని డీసీసీబీల్లోని 180 డైరెక్టర్ పదవులకుగాను, 147 మంది మాత్రమే ఎన్నికయ్యారు. ఇక అన్ని డీసీఎంఎస్లకు 90 మంది డైరెక్టర్ పదవులకుగాను, 74 మంది మాత్రమే ఎన్నికయ్యారు. ఇదిలావుండగా రిజర్వుడ్ కేటగిరీలో ఎన్నిక జరగని 33 డీసీసీబీ డైరెక్టర్, 16 డీసీఎంఎస్ డైరెక్టర్ పదవులకు ఆరు నెలల్లో ఎన్నిక నిర్వహించే అవకాశముంది. సంబంధిత చైర్మన్లు, వైస్ చైర్మన్లు కోరితే వాటికి ఎన్నిక జరుగుతుందని సహకారశాఖ అడిషనల్ రిజిస్ట్రార్ సుమిత్ర తెలిపారు. 5న టెస్కాబ్ చైర్మన్ ఎన్నిక.. ఇదిలావుండగా తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్) చైర్మన్ను వచ్చే నెల ఐదో తేదీన ఎన్నుకోనున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ను మూడో తేదీన జారీ చేస్తామని సహకార ఎన్నికల అథారిటీ వర్గాలు తెలిపాయి. ఇటీవల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ప్యాక్స్) ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం 904 ప్యాక్స్లకు ఇటీవల చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకున్న అనంతరం, వారు డీసీసీబీ, డీసీఎంఎస్ డైరెక్టర్లను ఏకగ్రీవం చేసుకున్నారు. -
పదవులు 8.. ఓట్లు 3!
సాక్షి, ఆదిలాబాద్: డీసీసీబీ, డీసీఎంఎస్ పాలకవర్గాల ఎన్నికలకు సంబంధించి శనివారం కోఆపరేటివ్ ఎన్నికల అధికారులు ఓటరు జాబితా విడుదల చేశారు. అందులో పీఏసీఎస్ అధ్యక్షులను ఏ–క్లాస్ ఓటర్లుగా, ప్రభుత్వ సంబంధిత సొసైటీల అధ్యక్షులను బీ–క్లాస్ ఓటర్లుగా లెక్క తేల్చారు. అయితే విచిత్రమేమిటంటే.. ఏ–క్లాస్ నుంచి ఈ రెండు పాలకవర్గాలకు కలిపి 22 డైరెక్టర్ పదవులు ఉంటే ఇందులో ఓటర్లుగా 77 మంది ఉన్నారు. ఇక బీ–క్లాస్ నుంచి ఈ పాలకవర్గాలకు 8 డైరెక్టర్ పదవులు ఉండగా, ఓటర్లు కేవలం ముగ్గురు మాత్రమే ఉండటం చోద్యంగా కనిపిస్తోంది. దీంతో ఐదు డైరెక్టర్ పదవులు ఎన్నిక కాకుండా మిగిలిపోనున్నాయి. క్రియాశీలకంగా లేవు.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వరంగ సొసైటీలు 272 ఉండగా, ప్రస్తుతం ఇవి క్రియాశీలకంగా లేకపోవడంతోనే ఈ పరిస్థితి ఎదురైంది. కుల, ఉద్యోగ, చేనేత ఇలా పలు సొసైటీలను ఏర్పాటు చేసుకొని దానికి అధ్యక్ష, ఉపాధ్యక్షులను నియమించుకోవాలి. దీనికి సంబంధించి ప్రభుత్వ పరంగా ఓ కమిటీ పర్యవేక్షిస్తుంది. పర్సన్ ఇన్చార్జి నిరంతరంగా సొసైటీల ఎన్నికలు జరిగి అధ్యక్ష, ఉపాధ్యక్షుల నియామకం జరిగేలా జాగ్రత్తగా వ్యవహరిస్తుండాలి. అయితే ఉమ్మడి జిల్లాలో వందలాది ఇలాంటి సొసైటీలు ఉండగా, సరైన పర్యవేక్షణ లేనికారణంగా కేవలం మూడు సొసైటీలు మాత్రమే క్రియాశీలకంగా ఉండటం గమనార్హం. వాటిలో టెలికం ఎంప్లాయీస్ కోఆపరేటీవ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ ఆదిలాబాద్, మహరాణా ప్రతాప్సింగ్ బీసీ లేబర్ కాంట్రాక్ట్ కోఆపరేటీవ్ సొసైటీ లిమిటెడ్, ఆదిలాబాద్తోపాటు మమతా సూపర్బజార్ మంచిర్యాల సొసైటీలు మాత్రమే క్రియాశీలకంగా ఉన్నాయి. మిగతా సొసైటీలు ఉండీ లేనట్టుగా తయారయ్యాయి. ముగ్గురే మహిళలు.. డీసీసీబీ, డీసీఎంఎస్ పాలకవర్గాల ఎన్నిక కోసం శనివారం ఓటరు జాబితా విడుదల చేయగా ఏ–క్లాస్లోని 77 మంది ఓటర్లలో కేవలం ముగ్గురే మహిళా ఓటర్లు ఉన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరిగిన సహకార సంఘాల ఎన్నికల్లో వివిధ సొసైటీల నుంచి ముగ్గురు మహిళలు మాత్రమే అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. మిర్జాపూర్ సొసైటీ నుంచి దీపారెడ్డి, పాండ్వపూర్ సొసైటీ నుంచి ఆర్.శైలజ, ధర్మరావుపేట్ సొసైటీ నుంచి బడావత్ నీల ఇందులో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏ–క్లాస్లోని 22 డైరెక్టర్ పదవుల్లో మహిళలకు ప్రాతినిధ్యం లభి స్తుందా? అనేది ఆసక్తికరం. డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ పదవుల కోసం కొంతమంది నేతలు రాజధానిలో జిల్లా ముఖ్యనేతలతో కలిసి పైరవీ చేస్తున్నారు. వారి ప్రయత్నాలు ఎంతవరకు సఫలీకృతమవుతాయో వేచిచూడాల్సిందే. ఈనెల 25న డైరెక్టర్ పదవుల ఎన్నిక కోసం నామినేషన్ల స్వీకరణ ఉండనుంది. ఐదు పదవులు మిగిలిపోనున్నాయి బీ–క్లాస్ నుంచి కేవలం ముగ్గురు ఓటర్లు మాత్రమే ఉన్నారు. ఇందులో 8 డైరెక్టర్ పదవులు ఉండగా, ఈ ముగ్గురు పోను మిగతా ఐదు డైరెక్టర్ పదవులు ఖాళీగా మిగలనున్నాయి. ప్రభుత్వరంగ సొసైటీలు ఎన్నికలు చేపట్టి అధ్యక్షులను నియమించుకొని క్రియాశీలకంగా ఉంటే దీంట్లో పరిగణలోకి తీసుకునే అవకాశం ఉండేది. ఉమ్మడి జిల్లాలో కేవలం మూడు సొసైటీలు మాత్రమే క్రియాశీలకంగా ఉన్నాయి. – మోహన్, డీసీవో, ఆదిలాబాద్ -
'ఢీ'సీసీబీ
సాక్షి, హైదరాబాద్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) పాలక మండళ్లకు శనివారం ఎన్నిక జరిగి ఫలితాలు వెలువడగా, కొత్తగా ఎన్నికైన డైరెక్టర్లు ఆదివారం సొసైటీలకు చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకున్నారు. పీఏసీఎస్ స్థాయిలో ఎన్నికలు ముగియడంతో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) పాలక మండలి ఎన్నిక నిర్వహణకు సహకార శాఖ కసరత్తు చేస్తోంది. సహకార శాఖ కమిషనర్ అధ్యక్షతన సోమవారం జరిగే సమావేశంలో డీసీసీబీ పాలక మండలి ఎన్నిక షెడ్యూలు విడుదల కానుంది. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పాలక మండలి ఎన్నికలో ఏ క్లాస్ (పీఏసీఎస్ చైర్మన్లు), బీ క్లాస్ (గొర్రెల కాపరులు, మత్స్య తదితర సహకార సంఘాలు) సొసైటీల చైర్మన్లకు ఓటు హక్కు అవకాశం ఉంటుంది. దీంతో పూర్వపు ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన హైదరాబాద్ను మినహాయించి మిగతా తొమ్మిది జిల్లాల్లోనూ ఏ, బీ క్లాస్ సొసైటీ చైర్మన్ల జాబితాను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పీఏసీఎస్ చైర్మన్లుగా గెలిచి డీసీసీబీ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్ తదితర పాలక మండలి పోస్టులను ఆశిస్తున్న టీఆర్ఎస్ ఆశావహ నేతలు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అన్నీ టీఆర్ఎస్ ఖాతాలోకే? సహకార ఎన్నికల్లో 90%కు పైగా పీఏసీఎస్ డైరెక్టర్ స్థానాల్లో టీఆర్ఎస్ మద్దతుదారులే గెలుపొందారు. దీంతో ఆదివారం జరిగిన పీఏసీఎస్ చైర్మన్ పదవులు కూడా 90% మేర టీఆర్ఎస్ మద్దతుదారులకే దక్కాయి. దీంతో పూర్వపు ఉమ్మడి జిల్లా పరిధిలో మెజారిటీ సొసైటీ పీఠాలు టీఆర్ఎస్ మద్దతుదారులకు దక్కడంతో తొమ్మిది డీసీసీబీలు టీఆర్ఎస్ మద్దుతుదారులకే దక్కుతాయని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో డీసీసీబీ పీఠాలను ఆశిస్తున్న టీఆర్ఎస్ ఆశావహ నేతలు పీఏసీఎస్ సొసైటీ చైర్మన్లుగా ఎంపికై ఉమ్మడి జిల్లా స్థాయి పదవిపై కన్నేసి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. పీఏసీఎస్ డైరెక్టర్, చైర్మన్ అభ్యర్థులను టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జులు ఖరారు చేయగా, డీసీసీబీ చైర్మన్ అభ్యర్థుల పేర్లను మాత్రం సీఎం కేసీఆర్ ఖరారు చేయనున్నారు. ఈ నేపథ్యంలో పూర్వపు ఉమ్మడి జిల్లాల వారీగా డీసీసీబీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్న నేతల జాబితాను ఇవ్వాల్సిందిగా సంబంధిత జిల్లా మంత్రులను ఆదేశించారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలతో చర్చించి ఆశావహుల జాబితాను సిద్ధం చేయాలని మంత్రులను ఆదేశించినట్లు సమాచారం. డీసీసీబీ అధ్యక్ష పదవి దక్కని నేతలు కొందరికి జిల్లా కేంద్ర సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) చైర్మన్ పదవిని ఇవ్వడం ద్వారా సంతృప్తి పరచాలనే యోచనలో పార్టీ ఉన్నట్లు సమాచారం. కరీంనగర్లో కొండూరుకు! టెస్కాబ్ తాజా మాజీ చైర్మన్ కొండూరు రవీందర్రావు కరీంనగర్ డీసీసీబీ అధ్యక్ష పదవికి దాదాపు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. టెస్కాబ్ చైర్మన్ పదవిని ఆశిస్తూ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి తనయుడు పోచారం భాస్కర్రెడ్డి ప్రయత్నాలు ప్రారంభించారు. వీరితో పాటు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా తండ్రి కృష్ణమూర్తి గుప్తా, రమేశ్రెడ్డి, గిర్దావర్ గంగారెడ్డి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఆదిలాబాద్ నుంచి రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు అడ్డి బోజారెడ్డితో పాటు డీసీసీబీ తాజా మాజీ అధ్యక్షులు దామోదర్రెడ్డి, గోవర్దన్రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. వరంగల్ డీసీసీబీ పీఠాన్ని మార్నేని రవీందర్రావుతో పాటు గుండేటి రాజేశ్వర్రెడ్డి, చల్లా రాంరెడ్డి, మోటపోతుల జీవన్ ఆశిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో తుళ్లూరు బ్రహ్మయ్య, సత్వాల శ్రీనివాస్రావు (ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్రావు మేనల్లుడు), తాజా మాజీ డీసీసీబీ అధ్యక్షులు మువ్వా విజయ్బాబు, కూరాకుల నాగభూషణం ప్రయత్నాలు సాగిస్తున్నారు. జిల్లాల వారీగా మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి అందే ప్రతిపాదనలను పరిశీలించి సామాజిక సమీకరణాలు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని డీసీసీబీ అధ్యక్షుల పేర్లను సీఎం కేసీఆర్ ఖరారు చేయనున్నారు. టెస్కాబ్ బరిలో.. రాష్ట్ర సహకార సంఘాల సమాఖ్య (టెస్కాబ్) చైర్మన్ పదవిని ఆశిస్తున్న కొందరు నేతలు డీసీసీబీ చైర్మన్ పదవి కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. టెస్కాబ్ చైర్మన్ పదవిని ఆశిస్తున్న టీఆర్ఎస్ నేతల జాబితాలో ప్రధానంగా కొండూరు రవీందర్రావు (కరీంనగర్), పోచారం భాస్కర్రెడ్డి (నిజామాబాద్), పల్లా ప్రవీణ్రెడ్డి (నల్లగొండ) ఉన్నారు. డీసీసీబీ చైర్మన్ పీఠాల విషయానికి వస్తే నల్లగొండ నుంచి పల్లా ప్రవీణ్రెడ్డి, గొంగిడి మహేందర్రెడ్డి (ఆలేరు ఎమ్మెల్యే సునీత భర్త), మల్లేశ్ గౌడ్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మహబూబ్నగర్ నుంచి గురునాథ్రెడ్డి పేరు వినిపిస్తోంది. మామిళ్లపల్లి విష్ణువర్ధన్రెడ్డి, జూపల్లి భాస్కర్రావు పేర్లను పార్టీ ఎమ్మెల్యేలు కొందరు ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. డీసీసీబీ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ పాత జిల్లాల ప్రాతిపదికనే ఎన్నికలు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) అధ్యక్షుల ఎన్నికకు సోమవారం నోటిఫికేషన్ జారీ కానుందని రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ వర్గాలు వెల్లడించాయి. డీసీసీబీ అధ్యక్షుల ఎన్నిక ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికనే జరగనుంది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు (ప్యాక్స్) ఎన్నికైన చైర్మన్లు డీసీసీబీ అధ్యక్షులను ఎన్నుకుంటారు. ప్రస్తుతం ఉన్న విధానం ప్రకారం డీసీసీబీ, డీసీఎంఎస్లకు ఒక్కో వ్యవస్థకు 20 మంది డైరెక్టర్లను ఎన్నుకుంటారు. ఈ ప్రక్రియను ఈ నెల 24వ తేదీకల్లా పూర్తి చేయనున్నట్లు రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ వర్గాలు తెలిపాయి. -
15న సహకార ఎన్నికలు
సాక్షి, హైదరాబాద్: ప్రాథమిక సహకార సంఘాల (ప్యాక్స్) ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ గురువారం ప్రకటించింది. ఈ మేరకు వచ్చే నెల 15న రాష్ట్రంలోని 906 ప్యాక్స్లకు ఎన్నికలు నిర్వహించనున్నారు. జిల్లాల వారీగా వచ్చే నెల 3న నోటిఫికేషన్లు జారీ చేస్తారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు ఎన్నికల అధికారులను నియమించాల్సి ఉంటుంది. అన్ని ప్యాక్స్లలో మొత్తంగా 18,42,412 మంది ఓటర్లు ఉన్నారు. హైదరాబాద్ మినహా మిగిలిన పూర్వ తొమ్మిది జిల్లాల్లో (కొత్తగా 32) మొత్తం 909 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. ప్రస్తుతం 906 ప్యాక్స్లకే ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉమ్మడి వరంగల్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో ఒక్కొక్క సహకార సంఘానికి ఎన్నికలు జరగడం లేదు. వీటిలో వరంగల్, నల్లగొండ జిల్లాల్లో ఉన్న ఒక్కొక్క సహకార సంఘానికి ఆగస్టు చివరి వరకు పాలక వర్గానికి కాలపరిమితి ఉంది. రంగారెడ్డి జిల్లాలోని మామిడిపల్లి పనితీరు సక్రమంగా లేకపోవడంతో దాన్ని రద్దు చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో సహకారశాఖ తక్షణమే ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసింది. వాస్తవంగా కొత్తగా ఏర్పడిన మండలాలతో పాటు, ప్రతీ మండలాన్ని ఒక యూనిట్గా తీసుకుని కచ్చితంగా రెండు ప్రాథమిక సహకార సంఘాలు (ప్యాక్స్) ఉండాలని ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆ ప్రక్రియలో సహకార శాఖ నిమగ్నమైంది. ఆ ప్రకారం కొత్త వాటిని ఏర్పాటు చేసి మొత్తం 1,343 ప్యాక్స్లకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని అనుకున్నారు. ప్రస్తుతం మొత్తం 584 మండలాలకు 909 సహకార సంఘాలున్నాయి. 81 మండలాల్లో ఒక్క ప్యాక్స్ కూడా లేదు. మరికొన్ని మండలాల్లో 2 నుంచి 3 వరకు ఉన్నాయి. ప్రస్తుతమున్న 584లో 272 మండలాల్లో ఒక్కో ప్యాక్స్ మాత్రమే ఉంది. కొత్త నిబంధనల ప్రకారం వీటన్నింటిలో అదనంగా మరొక ప్యాక్స్ ఏర్పాటు చేయాలని అనుకున్నారు. 81 మండలాల్లోనూ రెండు చొప్పున మొత్తం 162 ఏర్పాటు చేయాలన్నది ఆలోచన. దీంతో కొత్తగా 434 ప్రాథమిక సహకార సంఘాలు ఏర్పాటు కావాల్సి ఉంది. ఈ ప్రక్రియ అంతా జరగాలంటే జూన్ వరకు సమయం పడుతుంది. కానీ ప్రభుత్వం తక్షణమే నియమించాలని కోరడంతో ప్రస్తుతమున్న ప్యాక్స్కు మాత్రమే ఎన్నికలు జరుగుతాయి. డీసీసీబీలకు మాత్రమే.. ఉమ్మడి జిల్లాల ప్రకారం ఉన్న జిల్లా కేంద్ర సహకార బ్యాంకులకే (డీసీసీబీ) ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్యాక్స్కు ఒక్కసారి కూడా ఎన్నికలు జరగలేదు. 2018లోనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ వరుస ఎన్నికలతో వాయిదా పడుతూ వస్తోంది. ప్యాక్స్లకు ఎన్నికలు పూర్తయ్యాక తదుపరి డీసీసీబీలకు, టెస్కాబ్కు ఎన్నికలు నిర్వహిస్తారు. వాటి షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు. ఆ ఎన్నికల్లో డీసీసీబీ, టెస్కాబ్లకు చైర్మన్లను ఎన్నుకుంటారు. -
ఎమ్మెల్యే ఫిర్యాదుతో అవినీతి డొంక కదిలింది!
సాక్షి, రాజమహేంద్రవరం: జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో జరిగిన ఆర్థిక అవకతవకలకు బాధ్యులను గుర్తించడంలో ప్రభుత్వం వేగం పెంచింది. రైతుల రెక్కల కష్టంతో లాభాల బాటలో నడుస్తున్న బ్యాంకు సొమ్మును అడ్డగోలుగా దుబారా చేసిన తీరును ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. గడచిన ఐదేళ్ల డీసీసీబీ పాలనతోపాటు పొడిగించిన రెండేళ్ల ప్రత్యేక పాలనలో అవకతవకలు భారీగా జరిగినట్టు ప్రభుత్వానికి అందిన ప్రాథమిక నివేదికలో స్పష్టమైంది. ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ ఫిర్యాదుతో డీసీసీబీలో కదిలిన అవినీతి డొంక చాంతాడును మించిపోతోంది. ఎమ్మెల్యే పది అంశాలపై చేసిన ఫిర్యాదులపై పరిశీలన ప్రారంభిస్తే అవి చివరకు 33 అంశాలకు చేరుకున్నాయి. డీసీసీబీలో జరిగిన ఆర్థిక అవకతవకలను ‘సాక్షి’ వరుస కథనాలతో వెలుగులోకి తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలు విభాగాల్లో అవసరానికి మించి అదనంగా లక్షలు ఖర్చు చేసినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. రైతుల సొమ్మును మంచినీళ్లప్రాయంగా ఖర్చు చేశారన్నది ప్రభుత్వానికి అందిన ప్రాథమిక నివేదిక సారాంశంగా ఉంది. సహకార శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా సహకార అధికారి పాండురంగారావు, కాకినాడ డివిజనల్ సహకార అధికారి కె.పద్మ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అధికారుల బృందం శాఖాపరమైన విచారణ నిర్వహించింది. ఏడేళ్ల పాలనపై ప్రాథమిక నివేదిక డీసీసీబీ పాలకవర్గం గడువు 2018 ఫిబ్రవరి 17తో ముగిసిపోయింది. కానీ అప్పటి పాలకుల ఆదేశాల మేరకు సహకార శాఖ కమిషనర్, రిజిస్ట్రార్ పాలకవర్గ పదవీ కాలాన్ని రిఫరెన్స్ నంబర్ 1447/2018–సీ ద్వారా 2018 ఫిబ్రవరి 16వ తేదీ నుంచి ఒకసారి, అదే ఏడాది ఆగస్టు 12 వరకూ రెండోసారి, 2019 ఫిబ్రవరి 12 వరకూ మూడోసారి పొడిగించారు. పొడిగింపుతో కలిపి డీసీసీబీ పాలకవర్గం మొత్తం పాలనా కాలంలో 45 పాలకవర్గ సమావేశాలు నిర్వహించి 881 తీర్మానాలను ఆమోదించింది. మొత్తం పాలనాకాలంలో ఆమోదించిన తీర్మానాలపై విచారణాధికారుల బృందం డీసీసీబీలో రేండమ్గా (మచ్చుకు) కొన్ని విభాగాలు, కొన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్) పరిశీలించగా గుర్తించిన ఆర్థిక అవకతవకలను ప్రభుత్వానికి నివేదించారు. చైర్మన్ వరుపుల రాజా రుణాల కోసం ఆరుగురు సభ్యులతో ఒక కమిటీ, హెచ్ఆర్డీ, ఆడిట్ ఇలా మొత్తంగా ఆరు కమిటీలను అధికార, అనధికారులతో ఏర్పాటు చేశారు. ఆ తరువాత విడుదలైన రుణాలు, ఉద్యోగులకు 40 రోజుల ఎక్స్గ్రేషియా తీవ్ర అభ్యంతరకంగా ఉన్నాయని ప్రాథమిక విచారణ నిగ్గు తేల్చింది. ఈ క్రమంలో గడచిన ఐదేళ్ల పూర్తి కాలంతోపాటు పొడిగించిన రెండు సంవత్సరాల కాలంలో డీసీసీబీలో ఆర్థిక అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. రైతుల రెక్కల కష్టాన్ని ఇష్టారాజ్యంగా దుబారా చేసిన వ్యవహారాలపై ప్రాథమిక విచారణ నివేదిక చేతికొచ్చాకనే 51 విచారణకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. విచారణ షురూ అమలాపురం డివిజనల్ సహకార అధికారి బొర్రా దుర్గాప్రసాద్ విచారణాధికారిగా బాధ్యతలు తీసుకొని పక్షం రోజులైంది. గత పాలనాకాలంలో తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలు తీరును సోదాహరణంగా విచారణ జరుగుతోంది. గుర్తించిన అవకతవకలను ఎప్పటికప్పుడు సహకారశాఖ ఉన్నతాధికారులకు నివేదిస్తున్నారు. ఓ పక్క 51 విచారణ చురుగ్గా జరుగుతుండగా మరోవంక ఇవే అంశాలపై క్షేత్రస్థాయిలో వాస్తవాలను స్టేట్ ఇంటెలిజెన్స్ తెలుసుకుంటోంది. ప్రభుత్వానికి కచ్చితమైన సమాచారాన్ని సేకరించే పనిలో పోలీసు అధికారి ఆధ్వర్యంలో ఒక బృందం రెండు రోజుల కిందటే రంగంలోకి దిగింది. ఆ బృందం ఆర్థిక అవకతవకలు జరిగినట్టు ప్రాథమికంగా నిర్దారణకు వచ్చిన అంశాలకు సంబంధించిన సమాచారాన్ని రహస్యంగా సేకరిస్తోంది. అవకతవకలకు ఆస్కారం ఎక్కువగా ఉన్నట్టు గుర్తించిన పీఏసీఎస్లు, డీసీసీబీలో పలు సెక్షన్ల సమాచారాన్ని సేకరించడంలో నిమగ్నమైందని విశ్వసనీయ సమాచారం. అవకతవకలపై సహకార అధికారులు తయారుచేసిన ప్రాథమిక నివేదికపై కూడా ఇంటెలిజెన్స్ కూపీ లాగుతోంది. ఇతర విచారణలతో మాకు సంబంధం లేదు సహకార శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జరుపుతున్న 51 విచారణకు మిగిలిన విభాగాలు చేసే విచారణలతో సంబంధం లేదు. మా దృష్టికి వచ్చిన ఆరోపణలకు సంబంధించిన ప్రతి అంశంపై నిశితంగా దర్యాప్తు చేస్తున్నాం. ఇందుకు కొంత సమయం పడుతుంది. ఇంటిలిజెన్స్ వంటి ఇతర విచారణలు మా పరిధిలోకి రావు. వాటితో సంబంధం లేకుండా మా విచారణ స్వతంత్రంగా జరుగుతుంది. – బి.దుర్గాప్రసాద్, డివిజినల్ కో ఆపరేటివ్ అధికారి, అమలాపురం -
మాజీ టీడీపీ నేత ఆస్తుల జప్తుకు నోటీసులు
సాక్షి, తూర్పు గోదావరి : జిల్లాకు చెందిన మాజీ టీడీపీ నేత, డీసీసీబీ చైర్మన్ వరుపుల రాజాకు గట్టి షాక్ తగిలింది. ఆయన ఆస్తుల జప్తుకు రిజస్టర్ ఆఫ్ కోపరేటివ్ సోసైటీ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు రాజా నివాసానికి అధికారులు నోటీసులు అంటించారు. వివరాల్లోకి వెళితే.. ప్రత్తిపాడు మండలం లంపకలోప వ్యవసాయ సహకార పరపతి సంఘంలో రూ. 18,96,38,222 అవినీతి బాగోతం వెలుగుచూసింది. చనిపోయిన వ్యక్తులు, బినామీ పేర్ల మీద లోన్లు మంజూరు చేసి నిధులు కాజేశారని రాజాతోపాటు 12 మంది డైరెక్టర్లు, సోసైటీ సీఈవో వెంకటరావుపై ఆరోపణలు వచ్చాయి. అయితే ఆ ఆరోపణలపై విచారణ జరిపించాలని ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కోరారు. ఈ నేపథ్యంలోనే సహకార సంఘం అధికారులు లంపకలోప వ్యవసాయ సహకార పరపతి సంఘం మీద వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ చేపట్టారు. కాగా, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం అనంతరం రాజా ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. టీడీపీకి మనుగడ లేదని, మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాల్లేవని వ్యాఖ్యానించారు. -
నోటీసులపై న్యాయ పోరాటం
సాక్షి , నెల్లూరు: జిల్లా కేంద్ర సహకార బ్యాంక్లో నిధులు దుర్వినియోగం అయ్యాయని వాటిపై వివరణ ఇవ్వాలని కలెక్టర్ ముత్యాలరాజు జారీ చేసిన నోటీసులు రాజకీయ దుమారం రేపాయి. వీటిపై కోర్టులో న్యాయపోరాటం చేయాలని పాలకమండలి నిర్ణయించింది. జిల్లా కేంద్ర సహకార బ్యాంక్(డీసీసీబీ) చైర్మన్ మెట్టుకూరు ధనుంజయరెడ్డి నివాసంలో పాలకమండలి సభ్యులతో ఆయన సమావేశం అయ్యారు. ఈ క్రమంలో నోటీసులు జారీవెనుక జరుగుతున్న పరిణామాలు, దీని వెనుక ఉన్న సహకార శాఖ అధికారుల పాత్ర చర్చించారు. అనంతరం అందరూ రాజకీయ పార్టీలకు అతీతంగా ఏకమై న్యాయపోరాటం ద్వారానే దీనిని తేల్చుకోవాలని నిర్ణయించి న్యాయవాదితో చర్చలు జరిపారు. నోటీసులకు తిరిగి వివరణ ఇవ్వడంతో పాటు కోర్టులో దీనిని సవాలు చేయాలని నిర్ణయించారు. రాజధాని నిర్మాణానికి విరాళం ఇవ్వడం. అలాగే బ్యాంక్ శత జయంతి వేడుకులను అట్టహాసంగా నిర్వహించడం కూడా నిధుల దుర్వినియోగంలో భాగం అయ్యాయని నోటీసుల్లో సారాంశం. ఇవన్నీ కూడా గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు చేసినవే. అవి కూడా పాలకమండలి తీర్మానంతో పాటు సబ్ కమిటీ అనుమతితో చేసిన కార్యక్రమాలు ఇప్పుడు డీసీసీబీ చైర్మన్గా ఉన్న మెట్టుకూరు ధనుంజయరెడ్డి సార్వత్రిక ఎన్నికలకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడడంతో నోటీసులు జారీ చేసి వేధింపుల పర్వం మొదలుపెడుతున్నారనే ఆరోపణలున్నాయి. పార్టీ మారగానే నోటీసుల హడావుడి ఇదిలా ఉంటే మెట్టుకూరు ధనుంజయరెడ్డికి నోటీసులు జారీ చేయడం అటు రాజకీయ వర్గాలతో పాటు సహకారశాఖలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పార్టీ మారడంతో అధికారులపై అధికారపార్టీ నేతలు ఒత్తిడి తీసుకురావడంతో వారికి ఒక అధికారి సహకారం తోడైంది. దీంతో హడావుడిగా బ్యాంక్ అధికారులను 14,15 తేదీలు పిలిచి మాట్లాడి అప్పటికప్పుడు వారితో నివేదికలు సిద్ధం చేసి 16వ తేదీతో నోటీసులు జారీ చేశారు. గతంలో సహకార శాఖలో పనిచేసిన ఒక మహిళా అధికారి డైరెక్షన్తోనే ఈ తతంగం అంతా నడిచినట్లు తెలుస్తుంది. సదరు మహిళా అధికారి గతంలో బ్యాంక్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. ఈమెపై కొన్ని ఆరోపణలు రావడంతో ఆమెను తప్పించారు. ఈ క్రమంలో అప్పట్లో ఆమె అధికారులను తప్పుదోవ పట్టించేలా నివేదికలు ఇచ్చిందని దానిలో భాగంగానే తాజాగా జారీ అయిన నోటీసులు అని పాలకవర్గ సభ్యులు మండిపడుతున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు పిలుపుతోనే రాజధాని నిర్మాణానికి 2014లో రూ.6 లక్షలు విరాళం బ్యాంక్ ప్రకటించారు. దాదాపు ఐదేళ్ల క్రితం ప్రకటించిన విరాళం ఇది. అది కూడా బ్యాంక్ పాలకవర్గం అనుమతితో జరిగిన విషయం. అలాగే సీఎంను ఆహ్వానించిన శతజయంతి వేడుకలకు రూ.35 లక్షలు ఖర్చు చేశారు. దీనికి కలెక్టర్ కూడా హాజరయ్యారు. అలాగే బ్యాంక్ కాంప్లెక్స్లోని షాపుల అద్దెలు బాగా తక్కువగా ఉండటం, పాలక మండలి తీర్మానంతో బిడ్లు ఆహ్వానించి షాపులను కేటాయించారు. ఈ క్రమంలో అద్దెలు తగ్గించడం వల్ల, అప్పటి నుంచి ఇప్పటి వరకు దాని వల్ల రూ.42.30 లక్షలు నష్టం వాటిల్లిందని దీనిని దుర్వినియోగంగా చూపారు. ఈ మూడు అంశాలపై ఈ నెల 25న పాలకవర్గం తరుపున న్యాయవాది హాజరుకావాలని పాలకమండలి నిర్ణయించింది. -
నోట్ల రద్దు.. షాకింగ్ రిపోర్ట్
సాక్షి, ముంబై: పెద్దనోట్ల రద్దుకు సంబంధించి దిగ్భ్రాంతికి గురిచేసే నివేదిక ఒకటి బయటపడింది. ముంబైకి చెందిన మనోరంజన్ రాయ్ అనే వ్యక్తి సమాచార హక్కు ద్వారా ఓ పిటిషన్ దాఖలు చేయగా.. విస్మయానికి గురి చేసే విషయాలు వెలుగు చూశాయి. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాకు చెందిన ఓ బ్యాంకులో రద్దైన నోట్లు భారీగా డిపాజిట్ అయినట్లు వెల్లడైంది. ఇందుకు సంబంధించి ‘ది వైర్’ పూర్తి కథనం ప్రచురించింది. స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకులతోపాటు, డిస్ట్రిక్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకుల్లో రద్దైన పాత నోట్లు ఏ మేర జమ అయ్యాయో తెలపాలంటూ ముంబైకి చెందిన మనోరంజన్.. నాబార్డ్కు ఆర్టీఐ కింద దరఖాస్తు చేశారు. దీనికి స్పందించిన నాబార్డ్ పూర్తి లెక్కలతోసహా వివరాలను అందించింది. ముఖ్యంగా గుజరాత్లో రెండు పెద్ద జిల్లా సహకార బ్యాంకులు అత్యధికంగా రద్దైన నోట్లను స్వీకరించినట్లు వెల్లడైంది. అందులో ఒకటి అహ్మదాబాద్ డీసీసీబీ కాగా, రెండోది రాజ్కోట్ డీసీసీబీ. ఐదు రోజుల్లోనే... అహ్మదాబాద్ డీసీబీకి అమిత్ షా 2000 సంవత్సరంలో చైర్మన్గా వ్యవహరించారు. గతకొన్నేళ్లుగా డైరెక్టర్లలో ఒకరిగా ఉన్నారు. నవంబర్ 8, 2016న ప్రధాని మోదీ రూ. 500, రూ. 1000 నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించిన విషయం తెలిసిందే. రద్దైన నోట్లను డిపాజిట్ చేసేందుకు గడువు కూడా ఇచ్చారు. అయితే కేవలం ఐదంటే ఐదు రోజుల్లోనే రూ.745. 59 కోట్ల విలువైన నోట్లు ఏడీసీబీలో డిపాజిట్ అయ్యాయి. విషయం ఏంటంటే కొన్నిరోజులకే డీసీసీబీల ద్వారా అనేక మంది నల్లధనాన్ని వైట్గా మార్చుకున్నారన్న ఆరోపణలు వెలువెత్తాయి. దీంతో నవంబర్ 14 నుంచి కేంద్రం డీసీసీబీల్లో నోట్ల డిపాజిట్ను నిలిపివేసింది. అయితే అప్పటికే రికార్డు స్థాయిలో డిపాజిట్లు జరిగిపోగా... ఎలాంటి విచారణకు ప్రభుత్వం ఆదేశించలేదు కూడా. 2017 మార్చి 31 నాటికి అహ్మదాబాద్ డీసీసీబీలో మొత్తం డిపాజిట్లు రూ. 5050 కోట్లు. ఇది రాష్ట్ర సహకార బ్యాంకు కంటే చాలా రెట్లు ఎక్కువ. ఎంతలా అంటే ఎస్సీబీలో డిపాజిట్లు కేవలం రూ.1.11 కోట్లు మాత్రమే. మరోవైపు రాజ్కోట్ డీసీసీబీలో కూడా రూ. 693.19 కోట్ల విలువైన నోట్ల డిపాజిట్ జరిగింది. ఈ బ్యాంకు చైర్మన్ అయిన జయేష్ భాయ్ విఠల్భాయ్ రదాదియా.. ప్రస్తుతం గుజరాత్ కేబినెట్ మంత్రిగా ఉన్నారు. మొత్తానికి పెద్ద నోట్ల రద్దు ద్వారా బడాబాబులకే లబ్ధి చేకూరిందన్నది తేటతెల్లమైందని మనోరంజన్ అంటున్నారు. -
రైతాంగానికి... రాజకీయ సెగ!
సాక్షిప్రతినిధి, నల్లగొండ : పంట రుణాల రూపంలో రైతాంగానికి ఏటా రూ.200 కోట్ల సాయం అందించే సంస్థ ఇప్పుడు నిరుపయోగంగా మారింది. స్వల్ప, దీర్ఘకాలిక, గోల్డ్ లోన్స్ కలిసి మొత్తంగా రూ.500 కోట్ల నుంచి రూ.600 కోట్ల మేర రుణాలు అందించాల్సిందిపోయి.. పాత రుణాల రెన్యువల్స్, రికవరీలకే పరిమితం అవుతోంది. ఖరీఫ్ అదును ముంచుకు రావడంతో రుణాలు ఎలా పొందాలో తెలియక రైతాంగం సతమతమవుతోంది. దీనికంతటికీ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ)లో చోటు చేసుకున్న రాజకీయాలే కారణం. డీసీసీబీ చైర్మన్ సీటు కోసం అధికార టీఆర్ఎస్ నేతల మధ్య జరుగుతున్న దోబూచులాట రైతుల పాలిట శాపంగా మారింది. పాలకవర్గం సమావేశం కాకుండా, బోర్డు నిర్ణయం తీసుకోకుండా ఏమీ చేయలేని అశక్తతలో డీసీసీబీ అధికారులు ఉన్నారు. గడిచిన మూడేళ్లుగా జరుగుతున్న ఈ వ్యవహారం నానుతున్నా, దీనికో పరిష్కారం చూపెట్టే ప్రయత్నాన్ని అధికార పార్టీ నేతలు చేయడం లేదు. వ్యవసాయ సీజన్లో రైతులకు సేవలు అందించాల్సిన ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలపై (పీఏసీఎస్) డీసీసీబీ రాజకీయాల ప్రభావం పడింది. దీంతో ఈ సంఘాల్లోనూ రైతులకు ఎలాంటి రుణాలూ లభించడం లేదు. ఫలితంగా సహకార సంఘాలు, సహకార బ్యాంకులను వదిలేసి పూర్తిగా ఇతర బ్యాంకులు, ప్రైవేటు వడ్డీ వ్యాపారులపైనే రైతులు ఆధారపడాల్సి వస్తోంది. అసలేం జరిగింది...? ఐదేళ్ల కిందట జరిగిన సహకార ఎన్నికల్లో అత్యధిక సింగిల్ విండోలను గెలుచుకున్న కాంగ్రెస్ సహజంగానే డీసీసీబీని కూడా దక్కించుకుంది. యడవెల్లి విజయేందర్రెడ్డి చైర్మన్గా కొలువు దీరిన డీసీసీబీ పాలకవర్గం రెండున్నరేళ్లపాటు ఎలాంటి సమస్యలు లేకుండా పనిచేసింది. కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా జరిగిన పరిణామాలు, తీసుకున్న నిర్ణయాలతో చైర్మన్గా రెండున్నరేళ్లు పనిచేసిన విజయేందర్రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. దీంతో అప్పటిదాకా వైస్ చైర్మన్గా ఉండిన పాండురంగారావును చైర్మన్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. కానీ, డీసీసీబీ పాలకవర్గంలో డైరెక్టర్గా ఉన్న పిల్లలమర్రి శ్రీనివాస్ పోటీ చేయడంతో తిరిగి ఎన్నిక అనివార్యమై రెండు ఓట్ల తేడాతో పాండురంగారావు చైర్మన్గా ఎన్నిక కావడం, కాంగ్రెస్ నుంచి గెలిచిన డైరెక్టర్లంతా టీఆర్ఎస్లో చేరడం చకచకా జరిగిపోయాయి. ఈలోగా పాండురంగారవు సింగిల్ విండో చైర్మన్గా ఉన్న కాపుగల్లు సొసైటీలో అక్రమాలు జరిగాయని రుజువు కావడంతో ఆ పాలక మండలిని రద్దు చేశారు. దీంతో డీసీసీబీ చైర్మన్గా కూడా ఆయన అర్హత కోల్పోయారు. ఆ సమయానికి వైస్ చైర్మన్గా ఎవరూ లేకపోవడం, పాండురంగారవు సహకార కమిషన్ నుంచి ఉత్తర్వులు తెచ్చుకుని చైర్మన్గా కొనసాగారు. కానీ, హైకోర్టు ఆ ఉత్తర్వులను కొట్టి వేసింది. ఈలోగా ఈ ఏడాది మార్చిలో సహకార సంఘాల కాలపరిమితి ముగిసిపోయింది. ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకుండా ఆరునెలల పాటు సంఘాల కాలపరమితిని పొడిగించింది. అయితే.. కోర్టు ఉత్తర్వులతో పాండురంగారావు చైర్మన్గా కొనసాగే పరిస్థితి లేకపోవడం, కాలపరిమితిని పొడిగించిన కారణంగా స్పెషల్ ఆఫీసర్ను నియమించే అవకాశం లేకపోవడంతో నల్లగొండ డీసీసీబీ వ్యవహారాలు కుంటుపడ్డాయి. కొత్త చైర్మన్కు అవకాశమే లేదు ! మరోవైపు ఉన్న డైరెక్టర్లలోనే ఒకరిని చైర్మన్గా నియమించాలన్న డిమాండ్ ఉంది. రెండు ఓట్లతో ఓడిపోయిన తనకు అవకాశం ఇవ్వాలని పిల్లలమర్రి శ్రీనివాస్ అధికార టీఆర్ఎస్ నేతలను కోరారు. కానీ, పదవీకాలం పూర్తయి, పొడిగింపు కాలంలో ఉన్న సంస్థకు కొత్త వారిని నియమించే అవకాశం లేదన్నది సహకారశాఖ అధికారుల వివరణ. మరోవైపు చైర్మన్పై అనర్హత వేటు పడినందున, బోర్డు మీటింగులూ లేవు. ఈ కారణంగా ఎలాంటి తీర్మానాలూ లేవు. ఫలితంగా ఇప్పటిదాకా ఎలాంటి రుణ ప్రణాళికను ఖరారు చేయలేదు. చేతులెత్తేసిన సొసైటీలు, బ్రాంచ్లు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న 121 సహకార సొసైటీలు, 21 డీసీసీబీ బ్రాంచులు రైతులకు సేవలు అందించడంలో పూర్తిగా చేతులు ఎత్తేశాయి. ప్రభుత్వం ప్రస్తుతం 6నెలలపాటు సొసైటీ పదవీ కాలాన్ని పొడిగించినా, మరో ఏడాదిపాటు ఇదే పొడిగింపు పరంపర కొనసాగే అవకాశం ఉందని, ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశాల్లేవని అంటున్నారు. దీంతో నల్లగొండ డీసీసీబీ పేరుకే మినహా రైతులకు ఏమాత్రం ఉపయోగ పడేలా లేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. -
ఖమ్మం, నల్లగొండ డీసీసీబీలకు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం, నల్లగొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల (డీసీసీబీ) పాలకవర్గాలను పొడిగిస్తూ ప్రభుత్వం అంతర్గత ఉత్తర్వులు జారీచేసింది. ఉత్తర్వుల ప్రకారం వాటి ప్రస్తుత పాలకవర్గాలకే ఇన్చార్జి బాధ్యతలు అప్పగించింది. ఆర్థిక అక్రమాలు వెలుగుచూడటంతో వాటిని రద్దు చేయాలని సిఫార్సు చేసిన సహకార శాఖనే, చివరకు రాజకీయ ఒత్తిళ్లతో పొడిగింపు ఇస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. సహకార సంఘాల కాలపరిమితి ఈనెల 3తో, డీసీసీబీల కాలపరిమితి ఈనెల 17తో ముగిసింది. సహకార ఎన్నికలను ప్రభుత్వం వాయిదా వేయడంతో వాటన్నింటికీ పర్సన్ ఇన్చార్జులను నియమించాల్సి వచ్చింది. అధికారులను కాకుండా ఆయా పాలకవర్గాలకే పర్సన్ ఇన్చార్జ్ బాధ్యతలుఇచ్చి ఆరు నెలలపాటు పొడిగింపు ఇచ్చారు. ఇక ఖమ్మం, నల్లగొండ పాలకవర్గాలపై అవినీతి అక్రమాలు బయటపడటంతో వాటి అధ్యక్షులు, డైరెక్టర్లను తదుపరి కొనసాగించకూడదని సహకారశాఖ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆయా జిల్లాల నుంచి మంత్రుల స్థాయిలో తీవ్ర ఒత్తిడి రావడంతో అధికారులు వెనకడుగు వేసి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధ్యక్షులను, డైరెక్టర్లనే కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఖమ్మంలో ఆసుపత్రి నిర్మాణంపై ఆరోపణలు... రైతులకు రుణాలు, బ్యాంకు లావాదేవీలు జరపాల్సిన డీసీసీబీ ఒక ట్రస్టు ఏర్పాటు చేసి ఆసుపత్రి నిర్మించడం రిజర్వుబ్యాంకు నిబంధనలకు విరుద్ధం. ఖమ్మం డీసీసీబీ రైతు సంక్షేమ నిధి పేరుతో రైతులకిచ్చే పంటరుణాల నుంచి వసూళ్లకు పాల్పడిందని గతంలో జరిపిన విచారణలో వెల్లడైన సంగతి తెలిసిందే. రూ.8.11 కోట్లు వసూలుచేసి ఆస్పత్రి నిర్మించింది. అంతేగాక రైతు సంక్షేమ నిధి పేరిట పెద్ద ఎత్తున నిధులను ఆసుపత్రికి వెచ్చిస్తూ, వాహనాల కొనుగోళ్లకు భారీగా ఖర్చు చేస్తున్నారని కూడా చెబుతున్నారు. వసూలుచేసిన సొమ్మును రైతుల సంక్షేమం కోసం ఖర్చుపెడుతున్నట్లు పాలకవర్గం ఇచ్చిన వివరణ రిజర్వుబ్యాంకు నిబంధనలకు విరుద్ధమని టెస్కాబ్ స్పష్టంచేసింది. గతంలో వసూలు చేసిన నిధులు అయిపోతుండటంతో మళ్లీ వసూళ్లకు పాల్పడుతుండటంపై భారీగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంలోనే ఖమ్మం డీసీసీబీపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. మరోవైపు ఒక సహకార బ్యాంకు బ్రాంచిని తెరిచి రైతుల నుంచి ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేసిందన్న ఆరోపణలున్నాయి. ఖమ్మం డీసీసీబీ పాలకవర్గం అవకతవకలకు పాల్పడుతుందని, దాన్ని రద్దు చేయాలని ప్రభుత్వానికి సహకార శాఖ సిఫార్సు చేసినా, చివరకు అదే పాలకవర్గానికి పర్సన్ ఇన్చార్జులుగా పొడిగింపు ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. -
‘వేటు’ కాస్తా లేటు!
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం, నల్లగొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల(డీసీసీబీ) పాలకవర్గాలపై వేటు వేయాలని సహకార శాఖ నిర్ణయించినా దాని అమలులో ఆటంకాలు ఎదురవుతున్నాయి. రాజకీయ ఒత్తిడి పెరగడంతో వేటు నిర్ణయాన్ని వాయిదా వేశారు. ఈ నెల 17 వరకు నిర్ణయం తీసుకోవడానికి అవకాశముండటంతో వాయిదా పద్ధతిని ఎంచుకు న్నారు. ఆ రెండు పాలకవర్గాలపై అవినీతి అక్రమాలు బయటపడటంతో వాటి అధ్యక్షులు, డైరెక్టర్లను ఇంకా కొనసాగించకూడదని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రాథమిక సహకార సంఘాల (ప్యాక్స్) పాలకవర్గాల పదవీకాలం శనివారం ముగిసింది. డీసీ సీబీలు, జిల్లా సహకార మార్కెటింగ్ సంఘాలు (డీసీఎంఎస్), తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్(టెస్కాబ్)ల పదవీకాలం ఈ నెల 17 వరకు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఖమ్మం, నల్లగొండ డీసీసీబీలపై వాయిదా వేశారు. మొత్తం 906 ప్యాక్స్లలో 90 ప్యాక్స్లపై అభియోగాలు నమోదయ్యాయి. వాటి పాలకవర్గాలను రద్దు చేసి అధికారులను నియమించాలని నిర్ణయించారు. మిగతా సంఘాల చైర్మన్లు పర్సన్ ఇన్చార్జులుగా నియమితులయ్యారు. కొన్ని సంఘాల సభ్యులు సహకార శాఖకు బకాయిపడ్డారు. పాలకవర్గ గడువు తీరడం, మళ్లీ కొనసాగాలంటే బకాయిలు చెల్లించాల్సి రావడంతో అనేకమంది వాటిని తీర్చినట్లు చెబుతు న్నారు. రూ.20 కోట్లకుపైగా బకాయి సొమ్ము తమకు చేరినట్లు అధికారులు చెబుతున్నారు. మంత్రి పోచారం సమీక్ష... సహకార శాఖపై మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి పార్థసారథి, సహకారశాఖ కమిషనర్ వీరబ్రహ్మయ్య శని వారం సమీక్ష జరిపారు. జిల్లా సహకార అధికారులతో ఆయన సమావేశమై పలు వివరాలు తీసుకున్నారు. సహకార సంఘాల పదవీ కాలం ముగియడం, పర్సన్ ఇన్చార్జుల నియామకం నేపథ్యంలో మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. -
‘సహకారం’ పొడిగింపు
సాక్షి, ఆదిలాబాద్అర్బన్ : ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్)కు నిర్వహించే ఈ దఫా ఎన్నికలకు బ్రేక్ పడింది. పీఏసీఎస్ పాలక వర్గాల పదవీ కాలాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్ సంఘం (డీసీఎంఎస్)ల పదవీ కాలాన్ని కూడా మరో ఆరు నెలలు పాటు పొడిగించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. హైదరాబాద్లో జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగానే ప్రభుత్వ కార్యదర్శి సి. పార్థసారథి జిల్లా అధికారులకు ఆదేశాలిచ్చారు. ఇదిలా ఉండగా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 77 ప్రాథమిక వ్యవసాయ సహకాల పరపతి సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలకు 2013లో ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం 2018 జనవరి 30తో పాలక వర్గాల పదవీ కాలం పూర్తయింది. ఇప్పుడు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. దీనిపై రెండు నెలలుగా సందిగ్దం నెలకొంది. అయితే తాజాగా పీఏసీఎస్, డీసీసీబీ, డీసీఎంఎస్ల పాలక వర్గాల పదవీ కాలం పొడిగింపు చేస్తూ సర్కారు ఆదేశాలివ్వడంతో సందిగ్దానికి తెరపడింది. ఉన్నవే కొనసాగింపు.. జిల్లాల పునర్విభజనతో కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 77 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (పీఏసీఎస్) ఉన్నాయి. ఇవి ప్రస్తుతం కొత్తగా ఏర్పడిన ఆయా జిల్లాల పరిధిలో ఉన్నాయి. కానీ వీటన్నింటికీ ఒకే జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, ఒకే మార్కెటింగ్ సంఘం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉంది. ఆయా జిల్లాల పరిధిలో ఉన్న పీఏసీఎస్లకు ఎన్నికలు నిర్వహించినట్లైతే వాటి పరిధిలోని డీసీసీబీలకు, డీసీఎంఎస్లకు కూడా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. నాలుగు జిల్లాలకు ఒకే డీసీసీబీ, డీసీఎంఎస్ ఉంది. నూతనంగా ఏర్పాటైన జిల్లాలకు డీసీసీబీ, డీసీఎంఎస్లను ఏర్పాటు చేస్తే తప్పా.. ఎన్నికలు నిర్వహించడమనేది సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో పాలక వర్గాల పదవీ కాలం పొడిగింపు తప్పా.. వేరే మార్గం లేకపోవడంతో ప్రభుత్వం ఈ రకంగా ముందడుగేసినట్లు తెలుస్తోంది. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు ప్రస్తుతం ఉన్న పాలకవర్గాల పదవీ కాలాన్నే మరో ఆరు నెలల పాటు పొడిగించింది. వీటితో పాటు డీసీసీబీ, డీసీఎంఎస్ పాలక వర్గాల పదవీ కాలం కూడా పొడిగిస్తూ ఆదేశాలిచ్చింది. దీంతో ప్రస్తుతం ఉన్న పాలక వర్గాలే మరో ఆరు నెలల పాటు కొనసాగనున్నాయి. అప్పుడు మేనేజ్మెంట్.. ఇప్పుడు పర్సన్ ఇన్చార్జి.. ఎన్నికల సమయంలో రైతులతో ఎన్నుకోబడిన పాలకవర్గాలను మేనేజ్మెంట్ కమిటీగా పిలుస్తారు. పదవీ కాలం ముగిసిపోయి ప్రభుత్వం పొడిగింపు చేస్తే ఆ కమిటీ అధ్యక్షుడిని పర్సన్ ఇన్చార్జీగా పిలవడం జరుగుతుందని సహకార శాఖ అధికారులు పేర్కొంటున్నారు. అంటే పదవీలో ఉన్నప్పుడు మేనేజ్మెంట్ కమిటీకి అధ్యక్షుడిగా ఉన్న వారే ఇప్పుడు పీఏసీఎస్కు పర్సన్ ఇన్చార్జి అన్నమాట. ఇదిలా ఉండగా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 52 పాత మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలో మూడు సహకార శాఖ డివిజన్లు ఉన్నాయి. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్ డివిజన్లలో మొత్తం 77 ప్రాథమిక వ్యవసాయ సహకాల పరపతి సంఘాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో గెలుపొందిన డైరెక్టర్లు, సహకార శాఖ కార్యదర్శులు ఉన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న డైరెక్టర్ల పదవీ కాలం జనవరి 30తో పూర్తయింది. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ప్రభుత్వం తప్పని చర్యగా ఇలా చేపట్టినట్లు తెలుస్తోంది. వివరాలు కోరిన ప్రభుత్వం.. పీఏసీఎస్ పాలక వర్గాల పనితీరుపై జిల్లా సహకార శాఖను ప్రభుత్వం వివరణ కోరింది. పీఏసీఎస్లకు ఉన్న పాలక వర్గాల వివరాలు, అందులోని సభ్యులు, సొసైటీ నుంచి పొందిన రుణాలు, తిరిగి రుణాలు చెల్లిస్తున్న సభ్యు ల వివరాలను పంపాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు ఫారం–1, ఫా రం–2ను పూర్తి చేసి రెండు రోజుల్లో సమర్పించాలని సహకార శాఖ అధికారులను ఆదేశించింది. పాలకవర్గాల పనితీరును దృష్టిలో ఉంచుకొని ఎవరికి పర్సన్ ఇన్చార్జీలుగా నియమించాలనే దానిపై ప్రభుత్వం జిల్లా అధికారులకు స్పష్టత ఇవ్వనుంది. అయితే ఉమ్మడి జిల్లాలోని కొన్ని సంఘాల్లోని సభ్యులు సొసైటీ నుంచి పంట రుణాలు తీసుకొని ఇప్పటి వరకు కట్టలేదు. దీనిపై దృష్టి సారించిన ప్రభుత్వం ప్రతి ఏడాది సొసైటీ నుంచి రుణాలు తీసుకుంటున్న, తిరిగి చెల్లిస్తున్న సభ్యుల వివరాలు తెలియజేయాలని జిల్లా అధికారులను ఆదేశించడంతో అధికారులు ఆ వివరాల సేకరణలో తలామునకలవుతున్నారు. పర్సన్ ఇన్చార్జీలను నియమిస్తాం. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్) పాలక వర్గాల పదవీకాలం పూర్తి కావడంతో వాటికి పర్సన్ ఇన్చార్జీలను నియమించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఇప్పుడు నియమించే పర్సన్ ఇన్చార్జీలు ఫిబ్రవరి నుంచి 3 నుంచి కొనసాగుతారు. ఈ రెండు రోజుల వ్యవధిలో ప్రభుత్వం ఆదేశించిన కొన్ని వివరాలను సమర్పించాల్సి ఉంది. ప్రస్తుతం అదే పనిలో నిమగ్నమయ్యాం. ఆదేశాల ప్రకారం పర్సన్ ఇన్చార్జీలను నియమిస్తాం. – మోహన్, జిల్లా సహకార శాఖ అధికారి, ఆదిలాబాద్ -
సహకారానికి స్సష్టత వచ్చేనా?
సంగారెడ్డి : జిల్లా కేంద్ర సహకార బ్యాంకుతో పాటు జిల్లాలోని 53 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్) పాలక మండళ్ల పదవీ కాల పరమితి ఫిబ్రవరి 3న ముగియనుంది. ఈ నేపథ్యంలో నాలుగో తేదీ నుంచి సహకార సంఘాల పాలనా పగ్గాలు ఎవరి చేతికి వెళ్తాయనే అంశంపై ఆసక్తి నెలకొంది. సహకార చట్టం ని బంధనల మేరకు సహకార సంఘాల పాలక మండళ్ల గడువును మూడు నుంచి ఆరు నెలల పాటు పొడిగించే అవకాశం ఉంది. లేని పక్షంలో ప్రత్యేక అధికారులను నియమించి కొత్త పాలక మండళ్లు ఎన్నికయ్యేంత వరకు నెట్టుకొచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుత పాలక మండళ్ల కొనసాగింపు లేదా ప్రత్యేక అధికారుల నియామకానికి సంబంధించి ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వ పరంగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పరిధిలో 104 పీఏసీఎస్లు, ఎఫ్ఏసీఎస్లు ఉండగా, సంగారెడ్డి జిల్లా పరిధిలో 53 ఉన్నాయి. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో కొత్త డీసీసీబీల ఏర్పాటు, కొత్తగా ఆవర్భివించిన మండలాల్లో పీఏసీఎస్ల ఏర్పాటు వంటి అంశాలపై స్పష్టత రాకపోవడంతో ఇప్పట్లో సహకార ఎన్నికలు జరిగే అవకాశం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పునర్విభజన మూలంగా ఆవిర్భవించిన అమీన్పూర్, మొగుడంపల్లి, నాగల్గిద్ద మండలాల్లో పీఏసీఎస్లు లేవనే అంశంపై సహకార శాఖ ప్రభుత్వానికి గతంలోనే నివేదిక సమర్పించింది. అల్లాదుర్గం, రేగోడు పీఏసీఎస్లు మెదక్ జిల్లా పరిధిలోకి వెళ్లగా.. కొన్ని గ్రామాలు వట్పల్లి మం డలంలోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో రెండు జిల్లాల పరిధిలో ఉన్న పీఏసీఎస్ల పరిధిని నిర్వచిస్తూ.. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి విడివడి కొత్తగా ఆవిర్భించిన మెదక్, సిద్దిపేట జిల్లాలకు నూతన డీసీసీబీల ఏర్పాటుకు నాబార్డ్, రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపాల్సి ఉంటుంది. కొత్త డీసీసీబీల ఏర్పాటుకు కనీసం ఏడాది నుంచి రెండేళ్లు పడుతుందనే వార్తల నేపథ్యంలో.. సహకార ఎన్నికలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫిబ్రవరి 4 నుంచి ఓటరు నమోదు.. సహకార ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం తొలి సారిగా తెలంగాణ రాష్ట్ర సహకార ఎన్నికల సంఘంను ఏర్పాటు చేసింది. సహకార ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఫిబ్రవరి 4 నుంచి 27వ తేదీ వరకు పీఏసీఎస్ల వారీగా ఓటరు జాబితాను రూపొందించేందుకు సహకార అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఓటరు జాబి తా రూపకల్పనలో పాటించాల్సిన నిబంధనలపై ఇప్పటికే క్షేత్రస్థాయి అధికారులకు శిక్షణ ఇచ్చారు. సంగారెడ్డి జిల్లా పరిధిలోని 53 పీఏసీఎస్లలో 60,172 మంది ఓటర్లు ఉన్నారు. ఓటరు జాబితా రూపకల్పన తర్వాత ఈ సంఖ్యలో హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉంది. వ్యవసాయ భూమి కలిగి పీఏసీఎస్లో రూ.300 మూలధన వాటా కలిగిన సభ్యులను ఓటరు జాబితా లో చేరుస్తారు. పీఏసీఎస్లో సభ్యత్వం తీసుకుని కనీ సం ఏడాది పూర్తయి ఉండాలనే నిబంధన విధిం చారు. ప్రస్తుత పీఏసీఎస్, డీసీసీబీ పాలక మండళ్ల భవితవ్యంతో సంబంధం లేకుండానే ఓటరు జాబితా రూపకల్పన తయారీలో సహకార శాఖ నిమగ్నం కానుంది. ఎన్నికలయ్యేంత వరకు కొనసాగించాలి తిరిగి సహకార ఎన్నికలు నిర్వహిం చేంత వరకు పీఏసీఎస్లకు ప్రస్తుతమున్న పాలక మండళ్లనే కొనసాగించాలి. ప్రత్యేక అధికారులను నియమించడం ద్వారా సహకార సంఘాల లక్ష్యం దెబ్బతినడంతో పాటు, పాలన గాడి తప్పే అవకాశం ఉంటుంది. రైతు సమస్యలపై అవగాహన ఉన్న పాలక మండలి ఉంటేనే వారి సమస్యలకు పరిష్కారం దొరకడంతో పాటు, తోడ్పాటు అందుతుంది. సహకార సంఘాల ఎన్నికల నిర్వహణలో జాప్యం చేయకుండా పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలి. అర్హులైన రైతులందరినీ సహకార సంఘాల్లో సభ్యులుగా చేర్చుకోవడంతో పాటు, ఓటు హక్కు కల్పించాలి. – శంకర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్, పీచేర్యాగడి ఎన్నికలు వాయిదా వేసేందుకే.. జిల్లాల పునర్విభజన జరిగి ఏడాది గడుస్తున్నా.. కొత్త పీఏసీఎస్లు, డీసీసీబీల ఏర్పాటుకు సంబం «ధించి ప్రభుత్వం ఎలాంటి చొరవ తీసుకోలేదు. కొత్త డీసీసీబీల ఏర్పాటుకు ఆర్బీఐ ఆమోదం పొందా లంటే కనీసం ఏడాదికి పైనే పడుతుంది. ఐదేళ్లుగా సహకార సంఘా ల బలోపేతానికి ఎలాంటి చర్యలు చేపట్టని ప్రభుత్వం.. ఎన్నికలు నిర్వహించకుండా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికలపై ఏడాది ముందే దృష్టి పెటి సహకార సంఘాల ఎన్నికలపై మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. – జైపాల్రెడ్డి, మాజీ చైర్మన్, మెదక్ డీసీసీబీ ఉమ్మడి మెదక్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకుతో పాటు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలక మండళ్ల పదవీ కాల పరిమితి మరో మూడు రోజుల్లో ముగియనుంది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు తక్షణమే ఎన్నికలు జరిగే పరిస్థితి కనిపిం చడం లేదు. దీంతో సహకార సంఘాల పాల నా పగ్గాలు.. ప్రస్తుత కమిటీలకే అప్పగిస్తారా లేక ప్రత్యేక అధికారులను నియమిస్తారా అనే అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఇదిలా ఉంటే రాష్ట్ర సహకార ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల నాలుగో తేదీ నుంచి సహకార సంఘాల్లో ఓట ర్ల జాబితా తయారీకి సహకార శాఖ సన్నాహాలు చేస్తోంది. –సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి -
రచ్చ.. రచ్చే!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: పీడీసీసీబీ గొడవ ఇప్పట్లో సర్దుమణిగేలా కనిపించటం లేదు. చైర్మన్ ఈదర మోహన్ అవినీతికి పాల్పడ్డాడంటూ ఆరోపణలకు దిగి ఏకంగా ముఖ్యమంత్రికే ఫిర్యాదు చేసిన మెజార్టీ డైరెక్టర్లు ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. శుక్రవారం సైతం టీడీపీ జిల్లా కార్యాలయంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసిన డైరెక్టర్లు చైర్మన్ ఈదర మోహన్ ముందు పదవి నుంచి తప్పుకోవాల్సిందేనంటూ డిమాండ్ చేశారు. తాము కూడా ఏ విచారణకైనా సిద్ధమని అయితే మెజార్టీ సభ్యులు వ్యతిరేకిస్తున్నందున చైర్మన్ ముందు పదవి నుంచి దిగిపోవాలని వారు డిమాండ్ చేశారు. మరోవైపు చైర్మన్ ఈదర మోహన్ తనపై ఆరోపణలు చేస్తున్నది కొందరు ఆర్థిక నేరగాళ్లేనంటూ ఎదురుదాడికి దిగారు. మాటలతో సరిపెట్టకుండా ఆరు మంది డైరెక్టర్లు మరికొంత మంది బ్యాంకు ఉద్యోగులు, మాజీ ఉద్యోగులపై అవినీతి ఆరోపణలు చేశారు. ఆ వివరాలను సైతం ముఖ్యమంత్రికి లేఖ ద్వారా పంపి గొడవను పతాకస్థాయికి చేర్చారు. డైరెక్టర్లు, చైర్మన్ పరస్పర ఆరోపణలతో డీసీసీబీ రచ్చ మరింత తీవ్ర స్థాయికి చేరింది. గొడవను సర్దుబాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినా ఫలితం కనిపించలేదు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ ఈ నెల 4న ఇరువర్గాలతో సమావేశం ఏర్పాటు చేశారు. అయితే సమావేశానికి డైరెక్టర్లు మాత్రమే హాజరయ్యారు. చైర్మన్ ఈదర మోహన్ హాజరుకాలేదు. తాను అక్కడకు వెళ్లి చెప్పుకోవాల్సిందేమీ లేదంటూ ఆయన సెల్ స్విచ్ఛాఫ్ చేసుకున్నారు. దీంతో చేసేదేం లేక జనార్దన్ సమావేశాన్ని వాయిదా వేశారు. శనివారం జిల్లా మంత్రి శిద్దా రాఘవరావుతో కలిసి డైరెక్టర్లు, ఇటు చైర్మన్తో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఇరువర్గాలను ఒప్పించి రాజీ ప్రయత్నాలు కుదర్చాలని అధిష్టానం ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో మంత్రి శిద్దా సమక్షంలో దామచర్లతో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తదితరులు సమావేశంలో పాల్గొని ఇరువర్గాలను ఒప్పించే ప్రయత్నాలు చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి కూడా ఈదర మోహన్ రావటం ప్రశ్నార్థకంగా మారింది. కానీ నేడు సమావేశం జరిగే పరిస్థితి కనిపించడం లేదు. మంత్రి శిద్దా కూడా జిల్లాలో ఉండే అవకాశం లేకపోవడంతో సమావేశం మరోమారు వాయిదా పడేలా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో డీసీసీబీ గొడవ పెరగడం తప్ప ఇప్పట్లో సర్దుమణిగేలా లేదు. మరోవైపు డైరెక్టర్లు సైతం అమీతుమీకి సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చైర్మన్ ఈదర మోహన్పై అవిశ్వాసం నోటీస్ ఇచ్చినందున ఆ మేరకు చర్యలు చేపట్టాలని వారు సహకార శాఖ రిజిస్ట్రార్పై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. -
గజపతిరాజుకు ఎందుకంత అసహనం?
సాక్షి ప్రతినిధి, విజయనగరం : జిల్లా కలెక్టరేట్లో ఆ మధ్య జరిగిన అధికారుల సమీక్షలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) రీజనల్ అధికారిపై కేంద్ర మంత్రి అశోక్గజపతిరాజు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘నన్ను పీఏగా రమ్మంటారా’ అని మండి పడ్డారు. ♦ గరుగుబిల్లి మండలం ఉల్లిభద్రలోని ఉద్యానకళాశాలలో జరిగిన ఓ కార్యక్రమంపై రైతులకు సమాచారం అందించలేదన్న కారణంతో అక్కడి అధికారులపై విరుచుకుపడ్డారు. అంతేనా... రైతులకు ప్రభుత్వం తరఫున క్షమాపణలు కూడా చెప్పారు. ♦ తాజాగా విజయనగరంలోని సిరిమానోత్సవం సందర్భంగా డీసీసీబీ ఎదుట అనుకోకుండా సిరిమాను ఆగడంపై ఆలయ ఈఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల జరుగుతున్న ఈ సంఘటనలన్నింటికీ కారణం వేరే ఏదో ఉందనీ... అత్తమీది కోపం దుత్తమీద చూపుతున్నారన్న ప్రచారం విస్తృతంగా సాగుతోంది. పక్క జిల్లా నుంచి వచ్చి పెత్తనం చెలాయిస్తున్న మంత్రి గంటా శ్రీనివాసరావు వైఖరి వల్లే ఆయనలో అసహనం పెరిగిపోతోందన్న ప్రచారం సాగుతోంది. జిల్లాలో సమస్యలే లేవా? సిరిమానోత్సవంలో డీసీసీబీ కార్యాలయం ఎదుట సిరిమాను ఆగడాన్ని కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు లేవనెత్తిన అభ్యంతరం, అధికారులపై ఆయన వ్యక్తం చేసిన ఆగ్రహం జిల్లాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఈ అంశం చుట్టూ తిరిగి ఆయన హోదా కే భంగం కలిగేలా చేసింది. వాస్తవానికి జిల్లాలో అనేక సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారు. ఇల్లు లేక, రేషన్ కార్డులు రాక, ప్రాజెక్టులు పూర్తికాక, రుణ మాఫీ జరగక, పింఛన్లు అందక నానా బాధలు పడుతున్నారు. గ్రామాల్లో తాగునీరు, రహదారులకు సైతం నోచుకోక నరకం చూస్తున్నారు. అన్నిటికీ మిం చి పాలనలో కీలకమైన ప్రభుత్వ ముఖ్య విభాగాలకు అధికారులు లేరు. జిల్లాలో కీలక విభాగాలైన డీఆర్డీఏ, డ్వామా, మున్సిపాలిటీ, హౌసింగ్, డీపీవో, డీఎంహెచ్ఓ తదితర 6 శాఖల్లో అధికారులు లేక ఇన్చార్జిలతో నడిపిస్తున్నారు. ఈ పోస్టులను భర్తీ చేసే విషయంలో కేంద్ర మంత్రి ఇంత వరకు కనీస శ్రద్ధ కనబర్చలేదనే విమర్శలు నిత్యం వినిపిస్తున్నాయి. సిరిమాను సమస్య అంత తీవ్రమైనదా? జిల్లా పాలన, అభివృద్ధిపై తన ముద్ర వేసుకోవాల్సిన పెద్దాయన... యాదృచ్ఛికంగానో... రహదారుల నాణ్యత లోపం కారణంగానో కొద్దిసేపు సిరిమాను నిలిచిపోవడాన్ని తీవ్రంగా పరిగణించడం జిల్లా ప్రజలను విస్మయపరుస్తోంది. దీంతో అసలు ఆయన ఇంతలా రియాక్ట్ అవ్వడానికి కారణాలు ఏమిటా అని ఆరా తీసే పనిలో పడ్డారు. అసలు సిరిమాను డీసీసీబీ వద్ద ఆగిపోవడానికి మంత్రి ఆశోక్, ఇతరులు అనుమానిస్తున్న కారణాలు కాకుండా ఏర్పాట్లలో లోపాలే ప్రధానంగా కనిపిస్తున్నాయి. నగరంలో రహదారుల విస్తరణ కొన్ని నెలల క్రితం ప్రారంభించారు. అమ్మవారి పండుగకు ముందే అవి పూర్తి కావాలని నిర్దేశిం చా రు. కానీ అలా జరగలేదు. పనులు పూర్తి కాకుం డానే అమ్మవారి పండుగ రావడంతో రహదారి పనులను తాత్కాలికంగా సిద్ధం చేశారు. రహదారుల్లో నాణ్యతాలోపం రహదారుల్లో నాణ్యత సైతం లోపించింది. ఈ కారణంగానే డీసీసీబీ వద్దకు వెళ్ళే సరికి రహదారికి పడిన గోతిలో చక్రం దిగి సిరిమాను ఇరుసు ఇబ్బంది పెట్టింది. దానివల్ల కొంత సేపు అక్కడ సిరిమాను నిలపాల్సి వచ్చింది. కానీ ఈ విషయాన్ని పక్కన పెట్టి రాజకీయ రంగు పులిమి కేంద్ర మంత్రి దేవాదా య శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు బాధ్యులను చేయాల్సి వస్తే ముందుగా తన అనుచర గణాన్ని చేయాలి. పట్టణంలో రహదారుల విస్తరణ కాంట్రాక్టును మంత్రి అనుచరుడికే అప్పగించారు. సిరిమాను ఆగడం వెనుక రహదారుల నాణ్యతా లోపం ఉందని బయట పడితే తమ వారికి ఇబ్బంది కలుగుతుందనే ఆ నెపాన్ని అధికారులపైకి నెట్టేసే యత్నం జరుగుతోందని తెలుస్తోంది. ఇదే విషయాన్ని దేవాదాయ శాఖ అధికారులు జిల్లా ఎస్పీకి విన్నవించినట్లు సమాచారం. పార్టీ అంతర్గత వ్యవహారాలే కారణం మంత్రి ఆశోక్లో చిన్నచిన్న విషయాలకు అసహనం, అధికారులపై ఆగ్రహానికి పార్టీలో అంతర్గత పోరులో ఆధిపత్యం సాధించాలన్న భావనే కారణంగా తెలు స్తోంది. జిల్లా ఇన్చార్జి మంత్రిగా గంటా శ్రీనివాసరావును టీడీపీ అధిష్టానం నియమించిన నాటి నుంచి అశోక్ గజపతిరాజు అసంతృప్తితో ఉంటున్నారు. ఇప్పటివరకు జరిగిన అనేక పరిణామాల్లో ఆ విషయం తేటతెల్లమైంది. ఇటీవల జిల్లా కలెక్టరేట్లో జరిగిన అధికారుల సమీక్షలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) రీజనల్ అధికారిపై ఇదే విధంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘నన్ను పీఏగా రమ్మంటారా’ అని మండి పడ్డారు. అంతకుముందు పురపాలక, వైద్య ఆరోగ్యశాఖతో పాటు పలు శాఖల అధికారులపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిష్టానం కూడా ఆశోక్ పనితీరుపై ఒకింత అసంతృప్తితో ఉందని చర్చ జిల్లాలో ఉంది. బుధవారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేరుగా జిల్లా టీడీపీ పెద్దలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమన్వయంతో పనిచేయకపోతే చర్యలు తప్పవని, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల మధ్య విభేదాల వల్ల పార్టీ చులకనవుతోందని నియోజక వర్గాలకు గ్రేడులు ఇచ్చి మరీ హెచ్చరించారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో తన మాట నెగ్గించుకునేందుకు , తన ఉనికిని చాటుకునేందుకు కొన్ని నెలలుగా ఆయన అప్పుడప్పుడు అధికారులపై విరుచుకు పడుతున్నారు. ఈ క్రమంలోనే సిరిమాను డీసీసీబీ వద్ద ఆగడాన్ని తీవ్రంగా పరగణించి అధికారులపై మండిపడ్డారన్న చర్చ జరుగుతోంది. అయితే ఇది ఆయనకు మైనస్గా మారుతోందని తెలుగు తమ్ముళ్లే చెప్పుకుంటుండడం కొసమెరుపు. -
వరంగల్ డీసీసీబీ పాలకవర్గం రద్దు
పూర్తిస్థాయి విచారణ తర్వాత సహకార శాఖ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: వరంగల్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) పాలకవర్గాన్ని రద్దు చేస్తూ సహకార శాఖ రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ సహకార సొసైటీల చట్టం, 1964లోని సెక్షన్ 34 ప్రకారం సహకార శాఖ రిజిస్ట్రార్ ఎం. వీరభద్రయ్య గురువారం ఈ ఉత్తర్వులు జారీ చేశారు. బ్యాంకు వ్యవహారాల్లో అవినీతి జరిగిందంటూ వరంగల్కు సంబంధించిన పలువురు ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఉద్యోగ నియామకాలు, లోన్లు, నోట్ల రద్దు సమయంలో అక్రమాలు జరిగినట్టు ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరపాలని ముఖ్యమంత్రి కార్యదర్శి కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు సహకార శాఖ ప్రాథమిక విచారణ చేపట్టింది. ఈ ఫిర్యాదుపై విచారణ చేసిన తర్వాత పాలకవర్గాన్ని ఈ ఏడాది ఏప్రిల్ 18న సహకార శాఖ ఆరునెలల పాటు రద్దు చేస్తున్నట్టు ఉత్తర్వులిచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు సహకార శాఖ నిర్ణయాన్ని రద్దు చేసింది. ఆ తర్వాత సహకార శాఖ పాలకవర్గానికి నోటీసులిచ్చి సమగ్ర విచారణ జరిపింది. ఈ విచారణలో పలు అక్రమాలు జరిగాయని నిర్ధారించుకున్న తర్వాత, నివేదిక ఆధారంగా పాలకవర్గాన్ని రద్దు చేస్తున్నట్టు సహకార శాఖ రిజిస్ట్రార్ తాజా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సొసైటీ ప్రత్యేక పాలనాధికారిగా వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్కు బాధ్యతలు అప్పగించారు. డీసీసీబీ చైర్మన్తో పాటు 16 మంది పాలకమండలి సభ్యులు నిధుల దుర్వినియోగం, బంగారం లేకుండానే రుణాలివ్వడం, పదోన్నతుల్లో అక్రమాలు, చైర్మన్కు నిబంధనలకు విరుద్ధంగా వాహన రుణం ఇవ్వడం లాంటి 20 అంశాల్లో పాలకవర్గం సహకార చట్టాలకు అనుగుణంగా నడుచుకోలేదని విచారణ నివేదికలో పేర్కొన్నారు. ఈ విచారణ నివేదికను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కూడా సమర్పించారు. ఆర్బీఐతోపాటు నాబార్డు, టీఎస్క్యాబ్లు కూడా విచారణ జరిగిన తీరుపై సంతృప్తి వ్యక్తం చేశాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
నికరంగా రూ. 2.02 కోట్ల లాభం
- 2016-17లో డీసీసీబీ లావాదేవీలపై చైర్మన్ మల్లికార్జునరెడ్డి - బ్యాంకు టర్నోవర్ను రూ.1340 కోట్లకు పెంచాం - 62 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా సహకారకేంద్రబ్యాంకు 2016-17లో నిర్వహించిన లావాదేవీలపై నికరంగా రూ.2.02 కోట్ల లాభం వచ్చిందని బ్యాంకు చైర్మన్ మల్లికార్జునరెడ్డి తెలిపారు. డీసీసీబీకి ఏటా లాభాలు వస్తుండటంతో మొదటి నుంచి ఉన్న నష్టాలు తగ్గుతున్నాయని, మరో రెండు, మూడేళ్లలో నష్టాలను పూర్తిగా అధిగమిస్తామని పేర్కొన్నారు. గత ఏడాది లావాదేవీలపై నాబార్డు స్టాచ్యుటరీ ఆడిట్ పూర్తయి నివేదిక ఇచ్చిన నేపథ్యంలో చైర్మన్ సోమవారం సీఈఓ రామాంజనేయులుతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. 2015-16లో రూ.1040 కోట్లుగా ఉన్న బ్యాంకు టర్నోవర్ 2016-17కు రూ.1340 కోట్లకు పెరగడం, రికవరీలు మెరుగ్గా ఉండటంతో లాభాలు వచ్చాయని తెలిపారు. ఈ కారణంగా బ్యాంకు నష్టాలు రూ.16.81 కోట్ల నుంచి రూ.14.78 కోట్లకు తగ్గినట్లు చెప్పారు. నిరర్థక ఆస్తులు స్టేట్ యావరేజ్ 5 శాతం ఉండగా డీసీసీబీకి 4.96 శాతం మాత్రమే ఉన్నాయన్నారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెస్ రేషియో(సీఆర్ఎఆర్) విధిగా 9 శాతం ఉండి తీరాలని, ప్రస్తుతం డీసీసీబీకి 9.61 శాతంగా ఉందన్నారు. 2016-17లో ఆప్కాబ్ లాభాలపై డీసీసీబీకి 5శాతం డెవిడెంట్ రూపంలో రూ.99 లక్షలు విడుదలవుతున్నాయన్నారు. కేడీసీసీబీలో ఉన్న 62 స్టాప్ అసిసెంటు పోస్టుల భర్తీ కోసం మూడు, నాలుగు రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలిపారు. 50శాతం పైగా రికవరి ఉన్న çసహకార సంఘాలకు దీర్ఘకాలిక రుణాల కింద రూ.80 లక్షలు ప్రకారం రూ.56 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. రైతు నేస్తం, కర్షకజ్యోతి, పంట రుణాల పంపిణీకి కొత్తగా రూ.200 కోట్ల వరకు రుణాలుగా అందిస్తామన్నారు. రూ.లక్ష చెక్ అందచేత... బండిఆత్మకూరు మండలం పరమటూరు సహకార సంఘంలో సభ్యుడిగా ఉన్న రైతు నాగపుల్లయ్య ప్రమాదవశాత్తు మరణించడంతో వ్యక్తిగత ప్రమాద బీమా కింద రూ.లక్ష చెక్కును మృతుడి భార్య శివలక్ష్మమ్మకు చైర్మన్ మల్లికార్జునరెడ్డి అందించారు. కార్యక్రమంలో సీఈఓ రామాంజనేయులు, డైరెక్టర్ విజయసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గోల్డ్లోన్లపై వడ్డీరేటు తగ్గింపు
- రైతునేస్తం రుణ పరిమితి రూ. 5లక్షలకు పెంపు - 1997కు ముందటి రుణాల రికవరీ కోసం వన్టైమ్ సెటిల్మెంట్ - డీసీసీబీ బోర్డు, సర్వసభ్య సమావేశాల్లో చైర్మన్ కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా సహకార కేంద్రబ్యాంకు నుంచి తీసుకునే గోల్డ్లోన్లపై వడ్డీరేటును 11.50 శాతానికి తగ్గించినట్లు బ్యాంకు చైర్మన్ ఎం.మల్లికార్జునరెడ్డి తెలిపారు. ఇంతవరకు 12 నుంచి 14శాతం వరకు వడ్డీ రేటుందని, ఇక నుంచి కామన్గా తగ్గించిన వడ్డీ రేటు వసూలు చేస్తామన్నారు. నగర శివారులోని రాగమయూరి రిసార్ట్స్లో శుక్రవారం చైర్మన్ అధ్యక్షతన డైరెక్టర్ల బోర్డు సమావేశం, సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను చైర్మన్ వెల్లడించారు. 1997కు ముందు రుణాలు తీసుకొని ఇప్పటి వరకు బకాయి పడిన వారికి వన్టైమ్ సెటిల్మెంట్ స్కీమ్ అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. రుణాలపై వడ్డీ అసలుకు రెండు, మూడు రెట్లు అయి ఉంటుందని చెప్పిన చైర్మన్.. వన్టైమ్ సెటిల్మెంట్లో భాగంగా అసలుకు సమానంగా వడ్డీ చెల్లిస్తే సరిపోతుందన్నారు. రైతు నేస్తం కింద ఇప్పటి వరకు సహకార సంఘాలు రూ.3లక్షల వరకు రుణాలు ఇస్తున్నాయని, ఈ పరిమితిని రూ.5లక్షలకు పెంచినట్లు తెలిపారు. జిల్లా సహకార కేంద్రబ్యాంకులో ఎర్రగుంట్ల, రామదుర్గం,పెద్దహరివాణం, పాములపాడు రైతు సహకార సేవా సంఘాలకు సభ్యత్వం ఇచ్చినట్లు తెలిపారు. ఇందువల్ల డీసీసీబీకి దాదాపు రూ. 11కోట్లకు పైగా డిపాజిట్లు పెరిగాయన్నారు. రుణాలు తీసుకున్న రైతులందరికీ రూపే కార్డులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్.. రూపే కార్డును ఆవిష్కరించారు. 1.05 లక్షల కార్డుల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామన్నారు. అన్ని సహకార సంఘాలకు మైక్రో ఏటీఎంలు ఇస్తున్నామని, వీటి ద్వారా నగదు తీసుకోవడంతో పాటు జమ కూడా చేసుకోవచ్చన్నారు. ఎరువుల వ్యాపారానికి అవసరమైన బ్యాంకు గ్యారంటీని కూడా ఇస్తున్నామన్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని యాళ్లూరుకు మినరల్ వాటర్ ప్లాంట్ మంజూరు చేసినట్లు తెలిపారు. ఐసీడీపీ కింద జిల్లాకు రూ.126 కోట్లు విడుదలయ్యాయన్నారు. రానున్న రోజుల్లో అన్ని సహకార సంఘాలు ధాన్యం సేకరణకు ముందుకు వస్తున్నాయని, ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. సమావేశాల్లో ఆప్కాబ్ జీఎం బాణుప్రసాద్, కేడీసీసీబీ సీఈఓ రామాంజనేయులు, జిల్లా సహకార అధికారి సుబ్బారావు, జేడీఏ ఉమామహేశ్వరమ్మ, డీసీసీబీ ఉపాధ్యక్షుడు, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
వంద దాటిన డీసీసీబీ సభ్యత్వం
- తాజాగా 4 రైతు సేవా సహకార సంఘాలకు సభ్యత్వం - రూ.11కోట్లకుపైగా డిపాజిట్లు - డీసీసీబీ చైర్మన్ మల్లికార్జునరెడ్డి కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా కేంద్రసహకార బ్యాంకులో మరో నాలుగు రైతు సేవ సహకార సంఘాలకు సభ్యత్వం లభించింది. ఇప్పటి వరకు ఈ బ్యాంకులో 95 సహకార సంఘాలు, 4 జాయింట్ పార్మింగ్ కో ఆపరేటివ్ సొసైటీలకు మొత్తంగా 99 సంఘాలకు సభ్యత్వం ఉంది. తాజాగా ఎర్రగుంట్ల, పాములపాడు, పెద్దహరివానం, రామదుర్గం రైతు సేవా సహకార సంఘాల (ఫార్మర్స్ సర్వీస్ కో ఆపరేటివ్ సొసైటీ)కు సభ్యత్వం ఇవ్వడంతో 103కు చేరిందని కేడీసీసీబీ చైర్మన్ మల్లికార్జునరెడ్డి తెలిపారు. ఇంతవరకు ఈ సంఘాలు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయి. గురువారం ఏపీజీబీ కర్నూలు రీజినల్ మేనేజర్ వీసీకే ప్రసాద్, నంద్యాల రీజినల్ మేనేజర్ శివశంకర్రెడ్డి వీటిని డీసీసీబీకి అప్పగించారు. ఈ సంఘాలు అభివృద్ధి పథంలో నడుస్తున్నాయని చైర్మన్ తెలిపారు. వీటిలో జనవరి 31నాటికి ఎర్రగుంట్ల సంఘం ఆదాయం రూ.165.34 లక్షలు, పాములపాడు రూ.39.26 లక్షలు, పెద్దహరివానం రూ.79.80గా ఉందన్నారు. వీటికి డీసీసీబీలో సభ్యత్వం ఇవ్వడం వల్ల బ్యాంకుకు రూ.11కోట్లకుపైగా డిపాజిట్లు రానున్నాయని తెలిపారు. ఈ సంఘాలను అన్ని విధాలా ఆదకుంటామన్నారు. కేడీసీసీబీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి రామాంజనేయులు మాట్లాడుతూ.. సభ్యులు పెరగడంతో బ్యాంకు మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో డీజీఎంలు ఉమామహేశ్వరరెడ్డి, సునీల్కుమార్, శివలీల తదితరులు పాల్గొన్నారు. -
రోజుకో హైడ్రామా
సాక్షి, నల్లగొండ :జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) వ్యవహారంలో రోజుకో హైడ్రామా నడుస్తోంది. 90 రోజులుగా నాటకీయ మలుపులు తిరుగుతున్న సెంట్రల్ బ్యాంకు పరిణామాలు రోజులు గడిచే కొద్దీ రసవత్తరంగా మారుతున్నాయి. సహకార శాఖ అధికారులు ఒకలా వ్యవహరిస్తుంటే.. హైకోర్టు ఉత్తర్వులు మరోలా ఉన్నాయి. చైర్మన్ వ్యవహారశైలి ఓ విధంగా ఉంటే.. రెబల్ డైరెక్టర్లు మరోలా వ్యవహరిస్తూ గందరగోళానికి తెర లేపుతున్నారు. ఈ నేపథ్యంలో నాటకీయంగా పాండురంగారావే చైర్మన్ అంటూ సహకార రిజిస్ట్రార్ ఉత్తర్వులు ఇవ్వడం, అసలు కాపుగల్లు సొసైటీని రద్దు చేయడంపై స్టే ఇస్తూ సహకార ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడం, తన అధ్యక్షతనే గురువారం డీసీసీబీ పాలకమండలి సమావేశం జరుగుతుందని పాండురంగారావు ప్రకటించడం వంటి అంశాలు సెంట్రల్ బ్యాంకు రాజకీయాలను మరింత వేడెక్కిస్తున్నాయి. అప్పటి నుంచీ.. వాస్తవానికి కాపుగల్లు సహకార సొసైటీలో జరిగిన నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపిన అనంతరం ఆ సొసైటీని రద్దు చేస్తూ గతేడాది జనవరి 8న సూర్యాపేట జిల్లా సహకార అధికారి లక్ష్మినారాయణ ఉత్తర్వులు ఇచ్చారు. కాపుగల్లు సొసైటీ పాలకమండలిని రద్దు చేయడంతో ఆ సొసైటీ చైర్మన్గా ఉన్న పాండురంగారావు తన పదవిని కోల్పోయి, తదనుగుణంగా డీసీసీబీ చైర్మన్గా కూడా అనర్హులవుతారని చట్టం చెబుతోంది. అయితే, డీసీఓ తీసుకున్న నిర్ణయంపై పాండురంగారావు హైకోర్టును ఆశ్రయించడంతో సహకార ట్రిబ్యునల్కి వెళ్లాలని సూచిస్తూ హైకోర్టు ఆయనకు రెండు వారాల గడువిచ్చింది. ఈ మేరకు సహకార ట్రిబ్యునల్ను జనవరి 5న పాండురంగారావు ఆశ్రయించడంతో సూర్యాపేట డీసీఓ ఇచ్చిన ఉత్తర్వులపై ట్రిబ్యునల్ స్టే ఇచ్చింది. అయితే దీన్ని సవాల్ చేస్తూ జనవరి 11న కొందరు హైకోర్టుకెళ్లారు. మళ్లీ హైకోర్టు నాలుగు వారాల పాటు ట్రిబ్యునల్ స్టేపై సస్పెన్షన్ విధించింది. ఈ నేపథ్యంలో సూర్యాపేట డీసీఓ తీసుకున్న నిర్ణయం అమల్లోకి వచ్చినట్టయింది. అయితే హైకోర్టు నాలుగు వారాలకే ఇచ్చిన ఉత్తర్వుల గడువు అయిపోవడంతో కాపుగల్లు సొసైటీ చైర్మన్గా తనకు అవకాశం ఇవ్వాలని కోరుతూ పాండురంగారావు సూర్యాపేట డీసీఓను ఫిబ్రవరి 11న కోరారు. అయితే దీనిపై న్యాయ అభిప్రాయం కోసం సూర్యాపేట డీసీఓ హైకోర్టు ప్రభుత్వ న్యాయవాదికి అదే రోజు లేఖ రాయగా, ఆయన 16న సమాధానమిచ్చారు. సదరు హైకోర్టు న్యాయవాది డీసీఓ రాసిన లేఖకు బదులిస్తూ హైకోర్టు ఇచ్చిన స్టే గడువు ముగిసినప్పటికీ, స్టేను ఎత్తివేసేంతవరకు అమల్లోనే ఉంటుందని తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఇందుకు 2016లో జస్టిస్ సురేశ్కుమార్కైత్ ఇచ్చిన ఉత్తర్వులను కూడా ఉటంకించారు. పాండురంగారావు ప్రాతినిధ్యం వహిస్తోన్న సొసైటీని రద్దు చేస్తూ సూర్యాపేట డీసీఓ ఇచ్చిన ఉత్తర్వులు హైకోర్టు ఆదేశాల మేరకు కొనసాగుతాయనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. మళ్లీ బెంచ్ మీదకు.. అయితే సూర్యాపేట డీసీఓ ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇస్తూ సహకార ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టులో సవాల్ చేసిన కేసు ఈనెల 2 న మళ్లీ బెంచ్ మీదకు వచ్చింది. ఈలోపే పాండురంగారావు వ్యూహాత్మకంగా వ్యవహరించి కాపుగల్లు సొసైటీ చైర్మన్గా ప్రత్యేకాధికారి నుంచి బాధ్యతలను మార్చి 1న లిఖితపూర్వకంగా తీసుకుని మినిట్స్ బుక్లో రాశారు. ఈనెల 2న హైకోర్టు ట్రిబ్యునల్ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. ట్రిబ్యునల్ ఉత్తర్వులు, దానిపై హైకోర్టులో సవాల్ చేసిన ఉదంతం ఇలా ఉండగా, బ్యాంకు డైరెక్టర్లు 10 మంది గత నెల 22న హైకోర్టును మళ్లీ ఆశ్రయించారు. డీసీసీబీ చైర్మన్ విషయంలో ఎన్నికలు నిర్వహించాలని బ్యాంకు వర్గాలు ఎన్నిసార్లు లేఖలు రాసినా సహకార రిజిస్ట్రార్ స్పందించడం లేదని, ఈ విషయంలో తగిన ఉత్తర్వులు జారీ చేయాలని వారు కోర్టు మెట్లెక్కారు. దీంతో హైకోర్టు డీసీసీబీలో నెలకొన్న సమస్యను 15 రోజుల్లోగా పరిష్కరించాలని అదే రోజున ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సహకార శాఖతో పాటు జిల్లా కలెక్టర్కు నోటీసులు జారీ చేసింది. ఇదిలావుండగా సహకార చట్టాలు డీసీసీబీ చైర్మన్ ఎన్నిక నిర్వహించేందుకు తమను అనుమతించబోవని, దీనిపై నిర్ణయం మీరే తీసుకోవాలంటూ జిల్లా కలెక్టర్ డాక్టర్ గౌరవ్ఉప్పల్ సహకార రిజిస్ట్రార్కు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో 1వ తేదీన కాపుగల్లు చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నందున డీసీసీబీ చైర్మన్గా ఉంటారని, ఇప్పుడు ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేదని సహకార రిజిస్ట్రార్ ఈనెల 6న ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులు అందుకున్న పాండురంగారావు వెంటనే 7న డీసీసీబీలో సమావేశం నిర్వహించారు. అధికారులతో సమీక్షించి 9 న పాలకవర్గం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. మళ్లీ 8న రెబల్ డైరెక్టర్లు ఈనెల 2న హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రతులను మీడియాకు అందజేశారు. దీంతో పాటు నేడు జరగనున్న పాలకమండలి సమావేశానికి పాండురంగారావు హాజరు కాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ విధంగా మూడు నెలలుగా సెంట్రల్ బ్యాంకు చేయాల్సిన కార్యకలాపాలు నిర్వీర్యమయ్యాయి. ఒకరిపై ఒకరు ఎత్తులకు పైఎత్తులు వేస్తూ కోర్టులు, ట్రిబ్యునళ్ల చుట్టూ తిరుగుతూ సెంట్రల్ బ్యాంకు ను వివాదాలకు కేంద్ర బిందువుగా చేయడం గమనార్హం. మరీ, గురువారం జరగనున్న పాలకమండలి సమావేశం అసలు జరుగుతుందా.. లేదా ? ఎలా జరుగుతుంది. హైకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పును సహకార శాఖ ఏ విధంగా పరిగణిస్తుంది.. చైర్మన్ ఏం చేస్తారు? డైరెక్టర్లు ఏ విధంగా వ్యవహరిస్తారు? సమావేశానికి సరిపడా కోరం ఉంటుందా? రెబల్స్ సమావేశానికి వస్తారా.. రారా.. వస్తే ఏం చేస్తారు? అనేది ఇప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్ను తలపిస్తోంది. -
డీసీసీబీ ద్వారా రూ.15కోట్ల పంట రుణాలు
కర్నూలు(అగ్రికల్చర్): కొత్త రైతులకు పంట రుణాలు ఇచ్చేందుకు జిల్లా సహకార కేంద్రబ్యాంకు(డీసీసీబీ) ముందుకు వచ్చింది. దాదాపు రూ.15 కోట్ల మేర కొత్త పంట రుణాలు ఇచ్చేందుకు జిల్లాలోని 85 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు బడ్జెట్ కేటాయించింది. ఆప్కాబ్ కొంత , డీసీసీబీ మరికొంత బడ్జెట్ ఇస్తుంది. డీసీసీబీ.. ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకు పాత రుణాలను రెన్యువల్ చేయడం మినహా కొత్త రుణాలు ఇవ్వలేదు. ఆర్థిక సంవత్సరం ముగిసే సమయంలో పంటరుణాలకు బడ్జెట్ ఇవ్వడం విశేషం. -
ఢీసీసీబీ
నల్లగొండ అగ్రికల్చర్ : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) వ్యవహారం ఓ కొలిక్కి రావడం లేదు. బ్యాంకు చైర్మన్గా ఉన్న ముత్తవరపు పాండురంగారావు ప్రాతినిధ్యం వహిస్తోన్న కాపుగల్లు సొసైటీ పాలక వర్గాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత 77 రోజులుగా సాగుతున్న పరిణామాలు ఎటు వైపు దారితీస్తాయో తెలియక డైరెక్టర్లు తీవ్ర ఉత్కంఠకు గురవుతున్నారు. అయితే.. డీసీసీబీ వ్యవహారంలో పొరుగు జిల్లాకుచెందిన ఓ మంత్రి జోక్యం చేసుకోవడంతో సమస్య మరింత జటిలంగా మారినట్లు తెలుస్తోంది. ప్రస్తుత పాలకవర్గానికి కేవలం 11నెలల గడువు మాత్రమే ఉన్నందున చైర్మన్ ఎన్నిక నిర్వహించాల్సిన అవసరం లేదని.. ప్రత్యేకాధికారి పాలనతో సరిపెట్టాలని ఆ మంత్రి సహకార రిజిస్ట్రార్పై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి జగదీశ్రెడ్డి ఈ వ్యవహారంపై పెద్దగా దృష్టి సారించకపోయినా.. చైనా పర్యటన తర్వాత ఓ నిర్ణయం తీసుకుంటానని చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో డీసీసీబీ రాజకీయం మరింత రసకందాయంగా మారింది. ఏం జరుగుతుందో.. వాస్తవానికి డీసీసీబీలో సందిగ్ధ పరిస్థితులు ఏర్పడి నేటికి 77 రోజులు కావొస్తోంది. పాలకవర్గం లేని కారణంగా అధికారులు కీలక నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితిలో పాలన కుంటుపడింది. అయితే.. కాపుగల్లు సొసైటీ రద్దు తర్వాత లేచిన దుమారానికి ఇప్పట్లో ఫుల్స్టాప్ పడే పరిస్థితి కనిపించడం లేదు. చైర్మన్ ఎన్నికను నిర్వహించి బ్యాంకు వ్యవహారాలు సజావుగా సాగేలా చూడాలని బ్యాంకు సీఈఓ.. సహకార రిజిస్ట్రార్ (ఆర్సీఎస్), జిల్లా సహకార అధికారి (డీసీఓ)కి లేఖలు రాసి నెల రోజులు గడుస్తున్నా.. నేటికీ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదు. ఇందుకు రాజకీయ ఒత్తిళ్లే కారణమనే చర్చ జరుగుతోంది. ముత్తవరపు పాండురంగారావు సదరు మంత్రిని కలిసి తమ తప్పు లేదని.. అధికారుల తప్పిదాలకు బలి చేశారని, తనకు తీవ్ర అన్యాయం జరిగిందని విన్నవించుకున్నట్లు సమాచారం. దీంతో ముత్తవరపు పక్షాన నిలబడ్డ ఆ మంత్రి.. చైర్మన్ ఎన్నికను ఎట్టి పరిస్థితిలో నిర్వహించొద్దని పట్టుపడుతున్నారు. ఎలాగూ ప్రస్తుత పాలకవర్గం పదవీకాలం 11 నెలలే ఉందని.. అవసరమైతే పాలకవర్గాన్ని రద్దు చేసి ప్రత్యేక అధికారి పాలన పెట్టాలని ఆయన ప్రతిపాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాండురంగారావుకు వ్యతిరేకంగా పనిచేస్తోన్న పలువురు డైరెక్టర్లు జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి జగదీశ్రెడ్డిని కలిశారు. వారి వాదన విన్న ఆయన చైనా పర్యటన తర్వాత డీసీసీబీ వ్యవహారాన్ని తేల్చేస్తానని ఆ డైరెక్టర్లకు చెప్పారు. ఈ నేపథ్యంలో మంత్రి విదేశీ పర్యటనను ముగించుకుని రాష్ట్రానికి వచ్చినందున డీసీసీబీ చైర్మన్ ఎన్నికపై ఏ నిర్ణయాన్ని ప్రకటిస్తారనే ఉత్కంఠ బ్యాంకు వర్గాలతో పాటు డైరెక్లర్లలో నెలకొంది. చైర్మన్ ఎన్నిక కోసం పట్టువీడకుండా పోరాడుతున్న డైరెక్టర్లు మాత్రం నైరాశ్యంలో పడిపోయారు. సహకార శాఖ అధికారులు మాత్రం ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకున్నా అమలు చేస్తామని, ఎన్నికలకు అనుమతిస్తే పది రోజుల్లో ప్రక్రియ పూర్తి చేస్తామని అంటున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి జగదీశ్రెడ్డి ఏం నిర్ణయం తీసుకుంటారో... పొరుగు జిల్లాకు చెందిన మంత్రి ఏం చేస్తారోననే మీమాంసకు ఎప్పుడు తెరపడుతుందో.. వేచిచూడాల్సిందే. -
మ‘ధనం’
- డీసీసీబీలో తగ్గుతున్న మూలధనం వాటా - 9 శాతం కన్నా పడిపోతే ఆర్బీఐ లైసెన్స్ రద్దు అయ్యే ప్రమాదం - రుణ పథకాల ద్వారా వాటాను పెంచుకునేందుకు యత్నాలు - నోట్ల రద్దుతో నిలిచిపోయిన రుణ పథకాలు కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ) కష్టాల్లో కూరుకుపోయింది. మూలధన నిల్వలు పడిపోతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. బ్యాంకులో సమస్యాత్మక ఆస్తులు (వసూలు కాని రుణాలు) పెరిగిపోతున్నాయి. వీటికి తోడు..కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడంతో సహకార బ్యాంకు అమలు చేస్తున్న రుణ పథకాలకు గడ్డుకాలం ఎదురైంది. మూలధనం వాటా తొమ్మిది శాతం కన్నా పడిపోతే ఆర్బీఐ లైసెన్స్ రద్దయ్యే ప్రమాదం పొంచి ఉంది. మార్చినాటికి పరిస్థితి మెరుగయ్యేనా? డీసీసీబీ.. గత ఏడాది నుంచి కర్షకజ్యోతి, కాంపోజిట్, దీర్ఘకాలిక రుణపథకాలు అమలు చేస్తోంది. రాబోయే రోజుల్లో ఈ రుణ పథకాల ద్వారా మూల ధనాన్ని పెంచుకొని ఆర్బీఐ లైసెన్స్ రద్దు ప్రమాదం నుంచి బయట పడటానికి ప్రయత్నిస్తోంది. జిల్లా సహకార కేంద్రబ్యాంకు ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తే సమస్యాత్మక ఆస్తులకు తగ్గట్టు మూలధన వాటా ( క్యాపిటల్ రిస్క్ వైటెడ్ అసెస్ట్స్ రేషియో) విధిగా 9శాతం ఆపైన ఉండాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను పరిశీలిస్తే మార్చి 31 నాటికి అది మరింత పడిపోయో ప్రమాదం ఉందని అధికారులు అంచనాకు వచ్చారు. ఇలా జరిగితే బ్యాంకు ఉనికి ప్రశ్నార్థకం అవుతుంది. ఐదేళ్ల క్రితమే జిల్లా సహకార కేంద్రబ్యాంకుకు ఆర్బీఐ లైసెన్స్ ఇచ్చింది. మూలధనం పెంచుకోవడానికి ప్రతిపాదనలు ఇవీ.. ప్రస్తుతం కర్షకజ్యోతి పథకంలో రుణాలు పొందే రైతుల నుంచి 5 శాతం కాలపరిమితి డిపాజిట్, 5 శాతం బీ క్లాస్ వాటా మూలధనం సేకరిస్తున్నారు. తాజాగా రుణం మొత్తంలో 10 శాతం పూర్తిగా బీ క్లాస్ వాటా మూలధనాన్ని సేకరించాలని నిర్ణయించారు. కాంపోజిట్పథకం కింద తీసుకునే రుణాలలో ప్రస్తుతం 6 శాతం ప్రకారం రూ.1.50 లక్షలకు మించకుండా బీ క్లాస్ వాటా మూలధనాన్ని సేకరిస్తున్నారు. తాజాగా రుణ మొత్తంపై 10శాతం బీ క్లాస్ వాటా మూలధనం సేకరించాలని డీసీసీబీ నిర్ణయించింది. దీర్ఘకాలిక( ఎల్టీ నాబార్డు)పథకం కింద తీసుకునే రుణాలపై 7.5శాతం లేదా గరిష్టంగా రూ.20 వేలు (ఇందులో ఏదీ తక్కువైతే ఆ మొత్తం) వాటా ధనంగా సేకరిస్తున్నారు. ఇక నుంచి ఇచ్చే రుణాలలో 7.50 శాతం విధిగా మూల ధనంగా సేకరిస్తారు. ఇలా చేయడం వల్ల కేడీసీసీబీ సమస్యాత్మక ఆస్తులకు తగ్గట్టు మూలధన దామాషా 9 శాతానికి వచ్చే అవకాశం ఉందని అంచనావేస్తున్నారు. ప్రతిపాదనలు సాధ్యమేనా? కేంద్రప్రభుత్వం నవంబరు 8న రూ.500, 1000 నోట్లను రద్దు చేయడంతో అన్ని బ్యాంకులకు ఆర్థిక కష్టాలు పెరిగిపోయాయి. రద్దయిన నోట్ల జిల్లా సహకార కేంద్రబ్యాంకు డిపాజిట్లుగా తీసుకోవడాన్ని ఆర్బీఐ మొదటి నాలుగు రోజుల్లోనే బంద్ చేసింది. నోట్ల రద్దు కారణంగా ఉత్పన్నం అయిన పరిణామాల్లో ఆప్కాబ్ జిల్లా సహకార కేంద్రబ్యాంకు అమలు చేస్తున్న అన్ని రుణ పథకాలను నిలుపుదల చేసింది. ఆప్కాబ్ మళ్లీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతనే వీటిని అమలు చేయాల్సి ఉంది. రుణ పథకాలు ఎక్కడివక్కడ నిలిచిపోవడంతో మూలధన వాటాను పెంచుకోవడం ప్రశ్నార్థకమే. -
డీసీసీబీ... కొత్త ట్విస్ట్
సాక్షి, నల్లగొండ : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ)లో నెల రోజులకు పైగా సాగుతున్న వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఈనెల 21న డీసీసీబీ పాలకవర్గ సమావేశం నిర్వహిస్తున్నట్టు బ్యాంకు సీఈఓ కె.మధన్మోహన్ సోమవారం డైరెక్టర్లకు నోటీసులు జారీ చేశారు. దీంతో ఈనెల 21న పాలకవర్గ సమావేశం ఖరారైంది. డీసీసీబీ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు ప్రాతినిధ్యం వహిస్తోన్న కాపుగల్లు సొసైటీ పాలకవర్గాన్ని రద్దు చేస్తూ గతనెల 8న సూర్యాపేట డీసీఓ ఇచ్చిన ఉత్తర్వులతో మొదలైన రాజకీయ పరిణామాలు అనేక మలుపులు తిరుగుతున్నాయి. రెండు వర్గాలుగా విడిపోయిన బ్యాంకు డైరెక్టర్లు ఎవరికి వారే పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. హైకోర్టు, సహకార ట్రిబ్యునల్ను ఆశ్రయించి ఉత్తర్వులు తెచ్చుకున్నారు. అయితే డీసీసీబీ నిబంధనల మేరకు 90 రోజుల్లోపు పాలకవర్గం సమావేశం జరగాలి..ఆ తర్వాత నెల గ్రేస్ పీరియడ్ ఉంటుంది. మొత్తానికి 120 రోజుల్లోపు సమావేశం జరగకుంటే పాలకవర్గం రద్దవుతుంది. ఆ గడువు ఈనెల 26న ముగియనుండడంతో 21న సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుండడం గమనార్హం. ఈ సమావేశానికి చైర్మన్ పాండురంగారావు హాజరవుతారా.. తాత్కాలిక చైర్మన్ను ఎన్నుకుంటారా..పేరు సిఫారసు చేసి పంపిస్తారా.. ఏం తీర్మానం చేసి పంపుతారనే ఉత్కంఠ నెలకొంది. డీసీసీబీ చైర్మన్ రేసులో ఉన్నవారంతా అధికార పార్టీ∙వారే కావడంతో రాజకీయం వేడెక్కింది. కోర్టులు.. స్టేలు గతనెల 8న కాపుగల్లు సొసైటీ రద్దు ఉత్తర్వులు వచ్చిన నాటి నుంచి డీసీసీబీ చైర్మన్తో పాటు డైరెక్టర్లంతా కోర్టుల చుట్టూనే తిరుగుతున్నారు. తన సొసైటీని రద్దు చేస్తూ సూర్యాపేట డీసీఓ లక్ష్మీనారాయణ ఇచ్చిన ఉత్తర్వులపై చైర్మన్ పాండురంగారావు మరుసటి రోజే హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు తమ పరిధిలోనికి రాదని చెపుతూనే డీసీఓ ఇచ్చిన ఉత్తర్వులను స్టేటస్ కో చేస్తూ అదే నెల 11న హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. పాండురంగారావు సహకార ట్రిబ్యునల్కు Ððవెళ్లేందుకు నాలుగు వారాల గడువు కూడా ఇచ్చింది. దీంతో ఆయన మళ్లీ ట్రిబ్యునల్కు వెళ్లారు. తాము చేయని తప్పుకు సొసైటీని ఎలా బాధ్యురాలిని చేస్తారంటూ సూర్యాపేట డీసీఓ ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేయాలని ట్రిబ్యునల్ను కోరారు. పాండురంగారావు వాదనలతో ఏకీభవించిన ట్రిబ్యునల్ డీసీఓ ఉత్తర్వులు సమంజసం కాదని, తహసీల్దార్ ఇచ్చిన నివేదిక ఆధారంగా సొసైటీని ఎలా రద్దు చేస్తారని ప్రశ్నిస్తూ అదే నెల 17న స్టే విధిం చింది. దీంతో పాండురంగారావుకు ఊరట లభించినట్టయింది. అయితే సహకార ట్రిబ్యునల్ను సవాల్ చేస్తూ మళ్లీ కొందరు డైరెక్టర్లు హైకోర్టుకెళ్లారు. ట్రిబ్యునల్ తమ వాదనలు వినకుండానే ఆదేశాలిచ్చిందని, ఆ తీర్పును నిలిపివేయాలని కోరారు. కేసు విచారించిన హైకోర్టు ఈనెల11న ట్రిబ్యునల్ తీర్పుపై నాలుగు వారాల పాటు స్టే ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలతోపాటు డీసీసీబీ పాలకవర్గ సమావేశం 120 రోజుల్లోపు జరగాలన్న నిబంధన మేరకు ఈనెల 21న పాలకవర్గం సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పుడేం జరుగుతుంది? డీసీసీబీ పాలకవర్గ సమావేశం కోసం నోటీసు జారీ అయిన నేపథ్యంలో ఇప్పుడేం జరుగుతుందన్న దానిపై అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు సెంట్రల్ బ్యాంకు వర్గాల్లోనూ అనేక చర్చలు జరుగుతున్నాయి. అసలు ఈ సమావేశానికి చైర్మన్ హోదాలో పాండురంగారావు వస్తారా? లేదా సీనియర్ డైరెక్టర్ను అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టి సమావేశం నిర్వహిస్తారా అన్నది ట్విస్ట్గా మారింది. అసలు సమావేశ నోటీసును పాండురంగారావుకు పంపారా లేదా అనే విషయంపై ఆరా తీయగా... రాతపూర్వక నోటీసు పంపలేదు కానీ సమావేశం ఉంటుందనే సమాచారం ఇచ్చామని బ్యాంకు వర్గాలు చెపుతున్నాయి. సమావేశ తేదీని ఖరారు చేస్తూ చైర్మన్ హోదాలో పాండురంగారావు సంతకం చేశారనే అంశం కొత్త చర్చలకు దారితీస్తోంది. ఈ నేపథ్యంలో 21న ఏం జరుగుతుందనేది ఉత్కంఠను రేపుతోంది. ఈ సమావేశానికి పాండురంగారావు హాజరు కావాలంటే మళ్లీ కోర్టు ఉత్తర్వులు రావాల్సిందనే వాదన కూడా వినిపిస్తోంది. సహకార ట్రిబ్యునల్ ఉత్తర్వులపై స్టే ఇస్తూ తాజాగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం కాపుగల్లు సొసైటీ రద్దు అంశం ఉనికిలోనే ఉంటుందని, అలాంటప్పుడు పాండురంగారావు బ్యాంకు చైర్మన్ పదవిలో కొనసాగలేరని, తాజాగా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఈనెల 21లోపు స్టే తెచ్చుకుంటే ఆయన అధ్యక్ష స్థానంలో కూర్చోవచ్చని న్యాయ నిపుణులు చెపుతున్నారు. దీంతో తాజా హైకోర్టు ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ పాండురంగారావు హైకోర్టు మెట్టు ఎక్కేందుకు మళ్లీ రంగం సిద్ధం చేసుకుంటున్నారు. -
రైతుల సంక్షేమానికి డీసీసీబీ కృషి
చిట్యాల (నకిరేకల్) : రైతుల సంక్షేమానికి డీసీసీబీ కృషి చేస్తుందని డీసీసీబీ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు అన్నారు. చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామంలోని సింగిల్ విండో కార్యాలయాన్ని బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో సింగిల్ విండో ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలను ఆయన స్థానిక సంఘం చైర్మన్ అంతటి శ్రీనివాస్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంఘం సభ్యుడు బోడిగె లింగయ్య ఇటీవల మృతిచెందగా సంఘం ద్వారా మంజూరైన రూ.పది వేల చెక్కును బాధిత కుటుంబానికి అందజేశారు. కార్యక్రమంలో డీసీసీబీ సీఈఓ మధన్మోహన్రావు, వైస్ చైర్మన్ పకీరు పద్మారెడ్డి, డైరెక్టర్లు వెంకట్రెడ్డి, బాలరాజు, సీఈఓ ఎల్లారెడ్డి, రైతులు భిక్షం, వెంకటేశం పాల్గొన్నారు. -
‘ఢీ’సీసీబీ..!
నల్లగొండ అగ్రికల్చర్ : జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో అనిశ్ఛితి నెలకొంది. కాపుగల్లు సొసైటీ రద్దు వ్యవహారం డీసీసీబీ పాలకమండలిలో దుమారం లేపుతోంది. సొసైటీ రద్దు అయిన నాటి నుంచి ఇప్పటి వరకు 24 రోజులు బ్యాంకులో పరిపాలన పరమైన నిర్ణయాలను తీసుకునే పరిస్థితి లేకుండాపోయింది. రూ. వందల కోట్ల టర్నోవర్తో ఉన్న బ్యాంకుకు పూర్తి స్థాయి పాలకవర్గం లేకపోతే పరిస్థితి ఏమిటని పలువురు డైరెక్టర్లు ప్రశ్నిస్తున్నారు. సొసైటీని రద్దు చేసినందున చైర్మన్ పాండురంగారావుపై అనర్హత వేటుపడుందని, చైర్మన్ పదవి ఖాళీ అయినట్లేనని మెజార్టీ డైరెక్టర్లు వాదిస్తున్నారు. చైర్మన్పై వేటు తప్పదా..? గతంలో కాపుగల్లు సొసైటీలో ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని, రూ.86 లక్షలను కాజేశారని ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా కాపుగల్లు సహకార సంఘం పాలకవర్గాన్ని రద్దు చేస్తూ డిసెంబర్ 8న సూర్యాపేట జిల్లా జిల్లా సహకార అధికారి ఉత్తర్వులను జారీ చేసింది . అయితే కాపుగల్లు సొసైటీ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు డీసీసీబీ చైర్మన్గా కూడా వ్యవహరిస్తున్నారు. కాగా, సహకర చట్టాల ప్రకారం ఆయనపై అనర్హత వేటు పడుతుందని మెజార్టీ బ్యాంకు డైరెక్టర్లు పేర్కొంటున్నారు. సీఈఓపై డైరెక్టర్ల గుర్రు సహకార బ్యాంకుకు వైస్ చైర్మన్ లేనందున 32బి సహకార చట్టం ప్రకారం సీనియర్ డైరెక్టర్గా ఉన్న పీరునాయక్కు తాత్కాలిక చైర్మన్గా బాధ్యతలను అప్పగించాలని సీఈఓ కె.మదన్మోహన్కు పలువురు డైరెక్టర్లు వినతిపత్రం అందజేశారు. సీఈఓ డిసెంబర్ 13న జిల్లా సహకార అధికారికి బ్యాంకు పరిస్థితిపై నివేదికను అందజేశారు. అయితే జిల్లా సహకార అధికారి డిసెంబర్ 17న 32 బి ప్రకారం సీనియర్ డైరెక్టర్ పీరునాయక్కు ఇన్చార్జి చైర్మన్ బాధ్యతలను అప్పగించాలని ఆదేశాలను కూడా జారీ చేశారు. కానీ బ్యాంకు సీఈఓ పీరునాయక్కు బాధ్యతలను అప్పగించకుండా కాలయాపన చేస్తున్నారని డైరెక్టర్లు గుర్రుగా ఉన్నారు. వెంటనే తక్షణమే పాలకవర్గ సమావేశం ఏర్పాటు చేసి సహకార యాక్ట్ ప్రకారం పీరునాయక్కు ఇన్చార్జి బాధ్యతలను అప్పగించాలని డిమాం డ్ చేస్తున్నారు. గతంలో దేవరకొండ సహకార బ్యాంకు బ్రాంచీలో జరిగిన కోట్లాది రూపాయల కుంభకోణాలతో అప్రతిష్టను మూటగట్టుకున్న డీసీసీబీ ఇటీవల జరుగుతున్న పరిణామాలతో చర్చనీయంశంగా మారింది. ట్రిబ్యునల్ను ఆశ్రయించిన చైర్మన్ అయితే కాపుగల్లు సొసైటీ రద్దుపై చైర్మన్ పాండురంగారావు తొలుత హైకోర్టును ఆశ్రయించారు. దీంతో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం సొసైటీ రద్దుపై స్టేటస్ కో విధిస్తూ సహకార ట్రిబ్యునల్ను ఆశ్రయించాలని సూచించింది. కాగా, చైర్మన్ స్టే కోసం సహకార ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. సీఈఓపై చర్య తీసుకోవాలి : డైరెక్టర్లు జిల్లా సహకార అధికారి ఇచ్చిన ఆదేశాలను బుట్టదాఖలు చేస్తున్న బ్యాంకు సీఈఓ కె.మదన్మోహన్పై తక్షణమే చర్య తీసుకోవాలని డైరెక్టర్లు పీరునాయక్, పిల్లలమర్రి శ్రీనివాస్, చాపల లింగయ్య డిమాండ్ చేశారు. సోమవారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 32బి ప్రకారం పీరునాయక్కు ఇన్చార్జి బాధ్యతలను అప్పగించాలని ఆదేశాలు ఉన్నప్పటికీ అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. విధులకు హాజరుకాకుండా, ఎవరికి ఇన్చార్జి బాధ్యతలను అప్పగించకుండా, పాలకవర్గం అనుమతి లేకుండా ఇష్టానుసారంగా సెలవులు పెడుతున్నారని ఆరోపించారు. పాలకమండలి తీర్మానం లేకుండానే అనేక కార్యకలాపాలను నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. సహకార చట్టాన్ని అమలు చేసి పీరునాయక్ అధ్యక్షతన పాలకవర్గ సమావేశం ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. -
నేడు డీసీఓకు డీసీసీబీ వ్యవహారం
నల్లగొండ అగ్రికల్చర్ : కాపుగల్లు సొసైటీ రద్దుతో డీసీసీబీలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై బ్యాంకు సీఈఓ మంగళవారం జిల్లా సహకార అధికారికి నివేదికను సమరించనున్నట్లు సమాచారం. అవసపరమైన సలహాలను తీసుకోవడం, సొసైటీ రద్దు, పాలకమండలి సమావేశం, తాత్కాలిక చై ర్మన్ నియామకం, అనంతరం చైర్మన్ ఎన్నిక తదితర అం శాలపై సలహాల కోసం పూర్తి నివేదికను అందించనున్న ట్లు తెలుస్తోంది. బ్యాంకు అధికారి అందించిన నివేదికను డీసీఓ రాష్ట్ర సహకార రిజిస్ట్రార్కు పంపనున్నారు. రాష్ట్ర రిజిస్ట్రార్ ఇచ్చిన సూచనల మేరకు జిల్లా సహకార అధికారి వారంలోపు బ్యాంకు పాలకమండలి అత్యవసర స మావేశాన్ని ఏర్పాటు చేసే అవకా«శం ఉంటుంది. ఈ సమావేశంలోనే తాత్కాలిక చైర్మన్గా సీనియర్ డైరెక్టర్గా ఉన్న వ్యక్తికి బాధ్యతలను అప్పగిస్తారు. నూ తన చైర్మన్ ఎన్నికకు సంబంధించిన షె డ్యూల్నూ ప్రకటించే అవకాశం ఉంటుందని సహకార శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు. మూడోసారి ఎన్నిక తప్పదా.. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్కు మూడోసారి ఎన్నిక తప్పని పరిస్థితి కనబడుతోంది. రద్దయిన సొసైటీ చైర్మనే డీసీసీబీ చైర్మన్గా వ్యవహరిస్తుండడంతో ఆయన చైర్మన్గా అనర్హత పొందే అవకాశం ఉంటుందని సహకార శాఖ అధికారులు పే ర్కొంటున్నారు. మొదట ఫిబ్రవరి 2013న యడవెల్లి విజ యేందర్రెడ్డి డీసీసీబీ చైర్మన్గా ఎన్నికయ్యారు. అనంత రం ఎన్నికల ముందు తమ మధ్య ఉన్న ఒప్పందం ప్రకా రం తనకు చైర్మన్గా అవకాశం కల్పించాలని వైస్చైర్మన్గా వ్యవహరిస్తున్న ముత్తవరపు పాండురంగారావు కోరండంతో యడవెల్లి తన పదవికి రాజీనామా చేశారు. దీంతో తిరిగి రెండోసారి చైర్మన్ పదవికి ఎన్నికలను నిర్వహించా రు. సెప్టెంబర్ 2014 ఎన్నికల్లో చైర్మన్గా ముత్తవరపు పాండురంగారావు పిల్లలమర్రి శ్రీనివాస్పై గెలుపొందారు. ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పరిణామాలతో తిరిగి చైర్మన్ పదవికి మూడోసారి ఎన్నికలు తప్పని పరిస్థితి కనబడుతుంది. -
స్తంభించిన ‘సహకారం’ !
– డీసీసీబీ బ్రాంచీల్లో నిలిచిన లావాదేవీలు – కొత్త నోట్లులేక స్తంభించిన సేవలు - ఆందోళనలో రైతులు కోడుమూరు: పెద్దనోట్ల రద్దు ఎఫెక్ట్ సహకార వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గత కొన్ని రోజుల నుంచి జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ పరిధిలోని జిల్లా సహకార కో–ఆపరేటివ్ బ్యాంక్(డీసీసీబీ)లలో లావాదేవీలు పూర్తిగా నిలిచిపోయాయి. రద్దయిన రూ.500, రూ.1000 నోట్లు తీసుకోకూడదని జిల్లా సహకార కో–ఆపరేటివ్ బ్యాంక్కు ఆర్బీఐ నిబంధనలు విధించడంతో ఈపరిస్థితి తలెత్తింది. కర్నూలు జిల్లాలో 22 డీసీసీబీ బ్రాంచీలు, 95 సహకార సంఘాలున్నాయి. వీటిలో లక్ష ఇరవైవేల మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. వివిధ పథకాల కింద వారికి దాదాపు రూ. 872 కోట్లు అప్పులిచ్చారు. రూ. 475 కోట్లను రైతుల నుంచి డిపాజిట్లు సేకరించారు. దాదాపు రూ.1350 కోట్లు లావాదేవీలతో వాణిజ్య బ్యాంకులతో సమానంగా డీసీసీబీ బ్రాంచీలు పనిచేస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దు ప్రకటనతో రైతులకు చేదోడువాదోడుగా ఉంటున్న సహకార సంఘాల సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎంతో నమ్మకంగా చేసిన డిపాజిట్లను సహకార బ్యాంకులు తిరిగి ఇవ్వలేని పరిస్థితి. కనీసం తీసుకున్న రుణాలను చెల్లిస్తామని రైతులు ముందుకొచ్చినా పెద్దనోట్ల తీసుకోకూడదు. దీంతో రైతన్నలకు వడ్డీ బారం మరింత పెరిగే అవకాశముంది. సేద్యం ఆధారంగా జీవించే రైతులకు నల్ల కుబేరులకు విధించిన పెద్దనోట్ల ఆంక్షలను వర్తింపజేయడం, అన్నపెట్టే రైతును అవమానించినట్టేనని భూమాత రైతు సంఘం అధ్యక్షుడు బీవీ కృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం రూ.2000 కూడా ఇవ్వని పరిస్థితి డబ్బు అవసర నిమిత్తం ఖాతాదారులు డీసీసీబీ బ్రాంచీలకు వెళ్లితే రూ.2000 కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. వాణిజ్య బ్యాంకులకు కొత్త కరెన్సీ నోట్లు ఎంతో కొంత సరఫరా అవుతున్నాయి. డీసీసీబీ బ్రాంచీలకు మాత్రం ఆర్బీఐ నుంచి కొత్తనోట్లను సరఫరా చేయడంలేదు. ఇప్పటి వరకు కేవలం రూ.3 కోట్లు సహకార బ్యాంకు నుంచి ఖాతాదారులకు అందజేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అప్పుదారులకు ఓవర్ డ్యూ ముప్పు : డీసీసీబీ బ్రాంచీలల్లో వివిధ పథకాల కింద రైతులు తీసుకున్న అప్పుల వాయిదాలను చెల్లించేందుకు వెళ్తుండగా బ్యాంక్ ఉద్యోగులు పాతనోట్లను తీసుకోవడంలేదు. కొత్త నోట్లు కావాలని ఖాతాదారులకు వెనక్కి పంపుతున్నారు. నెల వాయిదాలు సరిగ్గా చెల్లించకపోతే వడ్డీలు పెరిగిపోతాయని ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. రూ. 100 కోట్ల లావాదేవీలకు బ్రేక్ : ఆర్బీఐ ఆంక్షలతో జిల్లాలోని 22 జిల్లా సహకార కో–ఆపరేటివ్ బ్యాంక్ బ్రాంచుల్లో రోజుకు రూ. 4 కోట్లు సహకార లావాదేవీలు, వ్యాపారాలు స్థంభించిపోయాయి. పెద్దనోట్లు రద్దయి దాదాపు 25 రోజులు పూర్తవుతుంది. ఇప్పటివరకు దాదాపు రూ.100 కోట్లు లావాదేవీలను ఆ బ్యాంకు కోల్పోయింది. ఈ ప్రభావం సహకార రంగంపైనే కాకుండా జిల్లా వ్యవసాయ రంగంపై తీవ్రంగా పడిందని డీసీసీబీ అధికారులు ఆందోళన చెందుతున్నారు. తమ బ్రాంచ్లలో దాదాపు రూ.25 కోట్లు విలువైన బంగారు నగలు తాకట్టు పెట్టి రైతులు రుణాలు తీసుకున్నారు. పెళ్లిళ్ల కోసం వాటిని విడిపించుకునేందుకు వెళ్లిన రైతులకు బంగారు ఆభరణాలు ఇవ్వడంలేదు. కొత్తనోట్లు ఇస్తేనే నగలు ఇస్తామని బ్యాంక్ సిబ్బంది మెలిక పెడుతున్నారు. దీంతో రైతులకు దిక్కుతోచడం లేదు. అప్పు మంజూరైనా ఇవ్వడంలేదు : సామేల్, రైతు రెండున్నర ఎకరా మార్టిగేజీ చేసి కోడుమూరు డీసీసీబీలో రూ.2.59 వేలు అప్పు మంజూరు చేయించుకున్నా. వారం రోజుల నుంచి డబ్బుల కోసం తిరుగుతున్నా బ్యాంక్ అధికారులు ఇవ్వడంలేదు. ఈ నెల 9వ తేదీన నా కొడుకు పెళ్లి ఉంది. చేతిలో చిల్లిగవ్వలేదు. ఎలా చేయాలో అర్థం కావడం లేదు. ఆర్బీఐ ఆంక్షలను సడలించాలి : సునీల్ కుమార్, కేడీసీసీ డీజీఎం నోట్ల రద్దుపై ఆంక్షలను సడలించాలి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న జిల్లా సహకార కేంద్రాల్లోని లావాదేవీలన్నీ ఆన్లైన్లోనే కొనసాగుతున్నాయి. నోట్ల రద్దుతో లావాదేవీలు నిలిచిపోవడంతో రైతాంగానికి తీరని అన్యాయం జరుగుతోంది. బ్రాంచీలన్నీ ఆర్థికంగా నలిగిపోతాయి. -
డీసీసీబీల్లో పాత నోట్లు తీసుకోవాలి: చాడ
సాక్షి, హైదరాబాద్: రద్దు చేసిన రూ.1,000, రూ.500 నోట్లను జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల్లో మార్చుకోడానికి వీలు కల్పించాలని, ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వానికి సీపీఐ విజ్ఞప్తి చేసింది. ఈ నెల 8 నుంచి 14 వరకు సహకార బ్యాంకుల్లో పాత నోట్ల మార్పితో పాటు ఇతర లావాదేవీలు జరిగినప్పటికీ రిజర్వ్ బ్యాంక్ ఆకస్మికంగా లావాదేవీలు రద్దు చేస్తూ ఉత్తర్వులిచ్చిందని, దీంతో లావాదేవీలు నిలిచి ఖాతాదారులు ఇబ్బందులు పడుతున్నారని సీఎం కేసీఆర్కు రాసిన లేఖలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తెలిపారు. పెట్రోల్ బంకులు, అర్బన్ బ్యాంక్, పోస్టాఫీసులకు వెసులుబాటు కల్పించి సహకార బ్యాంక్ల్లో లావాదేవీలు రద్దు చేయడం సహకార వ్యవస్థ స్ఫూర్తికే విరుద్ధమన్నారు. సహకార బ్యాంకులు డిపాజిట్లు సేకరిస్తూ రిజర్వ్ బ్యాంకు నిబంధనలకు అనుగుణంగా రైతులకు రుణాలిస్తున్నా యని.. సేవింగ్, కరెంట్ ఖాతాల లావాదేవీలు నిర్వహిస్తున్నాయని గుర్తుచేశారు. -
ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలి
• వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి పిలుపు • డీసీసీబీల్లో నోట్ల మార్పిడిపై ఆంక్షలా! సాక్షి, హైదరాబాద్: జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ)ల్లో పెద్ద నోట్ల మార్పిడిని నిలిపివేస్తూ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) విధించిన ఆంక్షలు ఇంకా కొనసాగుతున్నా యని, ఇది దారుణమని వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం లోటస్పాండ్లోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయలో పార్టీ జిల్లాల అధ్యక్షుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొదట్లో దాదాపు వారం పాటు పెద్ద నోట్లను మార్పుచు కోవడానికి రైతులను అంగీకరించి ఆ తర్వాత నిలిపివేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. మార్పిడితో పాటు తమ సొమ్మును బ్యాంకుల్లో జమ చేసుకోవడానికి కూడా అవకాశం లేకపోవడంతో గగ్గోలు పెడుతున్నారన్నారు. ప్రస్తుతం ఆ బ్యాంకులు రబీ రుణాలను ఇచ్చే పరిస్థితి లేకుండా పోరుుందన్నారు. రాష్ట్రంలో 35 లక్షల మంది రైతులు పంట రుణాలు తీసుకుంటుండగా... అందులో 12 లక్షల మందికి డీసీసీబీకి చెందిన 272 బ్యాంకు బ్రాంచీల్లో ఖాతాలు ఉన్నాయన్నారు. రైతుల కోసమే పుట్టిన డీసీసీబీలకు రిజర్వు బ్యాంక్ పూర్తి స్వేచ్ఛను ఇచ్చి రైతుల కష్టాలు తీర్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజల పక్షాన, నూత నంగా ఎన్నికై న జిల్లాల నాయకత్వం ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. వైఎస్సార్ పథకాలే లక్ష్యంగా... దివంగత సీఎం వైఎస్సార్ తొమ్మిదేళ్ల పాలన లో చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు గుర్తు చేస్తూ, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పార్టీ నూతన జిల్లాల అధ్యక్షులు పనిచే యాలని గట్టు సూచించారు. పార్టీ పరువు, ప్రతిష్టకు భంగం కలిగించేందుకు ఎవరు ప్రయత్నించినా ఉపేక్షించేది లేదని హెచ్చరిం చారు. 20 మందితో ఏర్పాటయ్యే మండల కమిటీలో అన్ని గ్రామాల నుంచి అన్ని కులాల వారికి చోటు కల్పించాలన్నారు. ఇప్పటికి 23 జిల్లాల అధ్యక్షుల నియామకం పూర్తరుుం దన్నారు. జిల్లా కమిటీల్లో 15 మందికి చోటు ఇవ్వాలని చెప్పారు. పార్టీ అభివృద్ధే తన ధ్యేయం అని చెప్పారు. పార్టీ ప్రధాన కార్యదర్శి జె.మహేందర్రెడ్డి, పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు అమృత సాగర్, న్యాయవాదుల విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలెం రఘునాథరెడ్డి, టీచర్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు అధ్యక్షుడు పర్వతరెడ్డి, బాలకృష్ణారెడ్డి, జి.రాంభూపాల్రెడ్డి, జిల్లాల అధ్యక్షులు బొడ్డు సారుునాథ్ రెడ్డి (జీహెచ్ఎంసీ), ఎం.భగవంత్రెడ్డి (నాగర్ కర్నూల్), బీస మరియమ్మ (మహబూబ్ నగర్), మద్దిరాల విష్ణువర్థన్రెడ్డి(వనపర్తి), లక్కినేని శ్రీధర్(ఖమ్మం), బి.అనిల్ కుమార్(ఆదిలాబాద్), వొడ్నాల సతీష్ (మంచిర్యాల), సుధాకర్ (కుమ్రంభీం ఆసిఫాబాద్), శాంతికుమార్ (వరంగల్ రూరల్),సంగాల ఇర్మాయ (వరంగల్ అర్బ న్), అప్పం కిషన్(జయశంకర్ భూపాలపల్లి), కాందాడి అచ్చిరెడ్డి(మహబుబాబాద్), నీలం రమేష్ (కామారెడ్డి) పాల్గొన్నారు. -
సహకారం ఎలా?
• ఆర్బీఐ నిర్ణయంతో డీసీసీబీ ఉక్కిరిబిక్కిరి • రూ.500, రూ.వెరుు్య నోట్లు డీసీసీబీలో చెల్లుబాటు కావంటూ ఉత్తర్వులు • ఇప్పటికే లావాదేవీలన్నీ నిలిపేసిన బ్యాంక్ • డీసీసీబీలో పాతనోట్ల రద్దుతో1.35 లక్షల మంది రైతులకు ఇబ్బంది • నాలుగు రోజుల వ్యవధిలో రూ.42 కోట్లు డిపాజిట్లు • యాసంగి రుణాలపై కమ్ముకున్న నీలినీడలు • ఇప్పటివరకు యాసంగి రుణాలు కేవలం రూ.6కోట్లు మాత్రమే విడుదల సహకారబ్యాంకులకు పెద్ద కష్టాలే వచ్చిపడ్డారుు. వీటిలో పాత రూ.500, రూ.1000 నోట్ల మార్పిడిని రద్దు చేస్తూ రిజర్వ్బ్యాంక్ మంగళవారం ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇది వ్యవసాయ సీజన్. రుణాలు చెల్లింపులు, జమచేసే సమయం. అరుుతే పెద్దనోట్లు తీసుకోవద్దని చెప్పడం..కొత్తవారికి రుణాలు ఇవ్వాల్సి ఉండడంతో ఏమి చేయాలో అధికారులకు పాలుపోవడం లేదు. మోదీ పెద్దనోట్ల రద్దు ప్రకటన తర్వాత నాలుగు రోజుల వ్యవధిలో సహకారబ్యాంకుల్లో రూ.42 కోట్లు రికవరీ కావడం, చెల్లింపులన్నీ పెద్దనోట్లతో చేయడం గమనార్హం. సాక్షి, మహబూబ్నగర్ : రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ఇచ్చిన షాక్తో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ)లు ఉక్కిరిబిక్కిరవుతున్నారుు. పాత రూ.500, వె రుు్య నోట్ల మార్పిడిని నిలిపేస్తూ ఆర్బీఐ ఆదేశాలిచ్చింది. దీంతో జిల్లాలోని డీసీసీ బ్యాంకులు షాక్కు గురయ్యా రుు. పాతనోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన తర్వాత అన్ని బ్యాంకుల మాదిరి గానే డీసీసీబీలు కూడా పెద్ద నోట్లను స్వీకరించారుు. కానీ డీసీసీబీ పాలక మండళ్లన్నీ రాజకీయ పార్టీలకు చెందిన వారి చేతుల్లో ఉండడంతో కేంద్రం కఠి న చర్యలు తీసుకుంది. బ్లాక్మనీ ఈ బ్యాంకుల్లోని రైతు ఖాతాల ద్వారా వైట్ మనీగా మార్చుకునే అవకాశం ఉందనే అనుమానంతో పెద్దనోట్లను నిషేధిం చింది. రూ.500,వెరుు్యనోట్లు డీసీసీబీలో చెల్లుబాటు కావం టూ రిజర్వుబ్యాంకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నాలుగు రోజులుగా స్వీకరించిన పెద్దనోట్లను డీసీసీ బ్యాంకులు నిరాకరిస్తున్నారుు. ఈ నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని 20బ్రాంచీల ఆధ్వర్యంలోని 77ప్రాథమిక సహకా ర బ్యాంకుల సేవలు నిలిచిపోయారుు. నాలుగురోజుల వ్యవధిలోనే రూ.42కో ట్ల రుణాలను రికవరీ చేశారుు. ఆర్బీఐ చర్యల కారణంగా బుధవారం నాలుగు జిల్లాల పరిధిలోని డీసీసీ బ్యాంకుల న్నీ ఖాతాదారులు లేక వెలవెలబోయారుు. రుణాల రికవరీ ఎలా? ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిధిలోని 20శాఖల డీసీసీబీల పరిధిలో మొత్తం 1.35లక్షల మంది రైతులకు ఖాతాలున్నారుు. వీరికి వానాకాలం సీజన్కు సంబంధించి రూ.300కోట్ల రుణాలు టార్గెట్గా పెట్టుకొని రూ.291కోట్ల రుణాలు ఇచ్చారుు. సీజన్ పంటలు ఇప్పుడిప్పుడే రైతుల చేతికి రావడంతో తీసుకున్న అప్పులు చెల్లించి, తిరిగిలోన్ల రెన్యువల్ చేసుకోవాలని భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా నెలరోజుల కాలంగా ఖాతాదారులు తమ రుణాలను రెన్యువల్ చేసుకుంటున్నారు. వారం క్రితం ప్రధాని నరేంద్రమోది పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రకటించారు. దీంతో పాత నోట్లు కేవలం బ్యాంకుల్లో మాత్రమే చెల్లుబాటు అవుతాయని పేర్కొనడంతో సహకార బ్యాంకుల రుణాల రికవరీలో వేగం పెరిగింది. కేవలం నాలుగురోజుల్లోనే రూ.42కోట్లు వసూలయ్యారుు. కానీ మంగళవారం ఆర్బీఐ వెలువరించిన ఉత్తర్వులతో లావాదేవీలన్నీ నిలిపేసింది. పెద్ద నోట్లతో రుణాలను చెల్లించేందుకు వస్తున్న రైతులు అధికారుల సమాధానంతో తిరిగి వెళ్లిపోతున్నారు. ఆర్బీఐ చర్యల కారణంగా రుణాల రికవరీ నిలిచిపోవడంతో బ్యాంకు పాలకమండళ్లు, అధికారులు నిట్టూరుస్తున్నా రు. అదేవిధంగా యాసంగి సీజన్కు సంబంధించి రుణాల విడుదలపై నీలినీడలు కమ్ముకున్నారుు. వాన కా లం సీజన్లోరుణాలు రెన్యువల్ చేస్తే... యాసంగి రుణాలు విడుదల చేసేం దుకు అధికారులు అన్నిరకాల చర్యలు చేపట్టారు. అందుకు అనుగుణంగా ఇప్పటివరకు రూ.6కోట్ల రుణాలను విడుదల చేశారు. కానీ 77 ప్రాథమిక సహకార బ్యాంకుల పరిధిలో రూ.290కోట్లు లక్ష్యంగా పెట్టుకోగా.. అది నెరవేరే అవకాశం లేదని అధికారులు పేర్కొంటున్నారు. -
అన్నదాతలకు అందని సహకారం
• డీసీసీబీల్లో పాత నోట్ల మార్పిడి నిలిపివేతతో తంటాలు • రైతులకు సహకారం అందించలేని దుస్థితిలో డీసీసీబీలు • పెట్టుబడులకు ఇబ్బందులు పడుతున్న రైతులు నల్లగొండ అగ్రికల్చర్ః రిజర్వ్ బ్యాంకు తీసుకున్న నిర్ణయం అన్నదాతలకు శాపంగా మారింది. రబీ పెట్టుబడుల కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ఉన్న పాతనోట్లను జిల్లా సహకార బ్యాంకుతో పాటు బ్రాంచీలలో జమచేసే అవకాశం లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. జిల్లా సహకార బ్యాంకు లు, సహకార బ్యాంకుల బ్రాంచీలలో పాత రూ.1000, రూ.500లను ఖాతాదారులు జమచేయడాన్ని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రాజకీయ నాయకులు నోట్ల మార్పిడీలో నిబంధనలను తుంగలో తొక్కారనే కారణాన్ని చూపుతూ భారతీయ రిజర్వ్బ్యాంకు సహకార బ్యాంకుల్లో నోట్ల మార్పిడిని నిలిపివేయడం అటు రైతుల్లో, ఇటు సహకార బ్యాంకు ఉద్యోగుల్లో అందోళన కలిగిస్తోంది. రబీ సీజన్ ఆరంభమై నెల రోజులు గడుస్తుండడంతో పాటు నోట్ల మార్పిడి కా రణంగా బ్యాంకులు అన్ని బిజీబిజీగా ఉండడంతో రబీ రుణాలను అందించలేని పరిస్థితుల్లో బ్యాం కులు ఉన్నాయి. సీజన్ నెత్తిన కూర్చుండడంతో రైతులు విత్తనాలు, ఎరువుల కొనుగోలుతో పాటు దుక్కలు దున్నకాల వంటి పనులకు పెట్టుబడుల కోసం పరుగులు పెడుతున్నారు. తమ దగ్గర ఉన్నపాటి డబ్బులను కనీసం సహకార బ్యాంకుల్లో జమచేసుకుని తరువాత డ్రా చేసుకుని పెట్టుబడులకు ఉపయోగించుకోవచ్చన్న ఆలోచనలో ఉన్న రైతులకు ఆర్బీఐ దెబ్బకొట్టింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జిల్లా సహాకార కేంద్ర బ్యాంకుతో పాటు 30 సహకార బ్యాంకుల బ్రాంచీలు, 107 సహకార సంఘాలు ఉన్నాయి. అయితే సహకార సంఘాల సభ్యులు మొత్తం 2లక్షల 20 వేల మంది ఉండగా అందులో లక్షా 19 వేల 47 మంది రైతులు రుణాలు పొందారు. అందులో సేవింగ్ ఖాతాలు ఉన్న రైతులు 86 వేల 904 మంది ఉన్నారు. ఆర్బీఐ నిర్ణయం కారణంగా ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రైతుల ఖాతాల్లో పాతనోట్లను జమచేసి వారికి సహకారం అందించలేని పరిస్థితుల్లో సహకార బ్యాంకు ఉద్యోగులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం పాతనోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న తరువాత ఈ నెల 10 నుంచి 14 వ తేదీ వరకు జిల్లా సహకార బ్యాంకుతో పాటు 30 బ్రాంచీల్లో ఖాతాదారులు సుమారు రూ.20 కోట్ల మేరకు తమ ఖాతాల్లో జమచేసుకున్నారు. ఆర్బీఐ నిర్ణయం వలన బ్యాం కు ఖాతాదారులకు తీవ్రంగా నష్టం వాటిల్లి ఖాతాలను ఉపసంహరించుకునే ప్రమాదం ఉందని, బ్యాంకు ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంటుందని బ్యాంకు ఆధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని రైతులతో పాటు బ్యాంకు సిబ్బంది కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఆర్బీఐ నిర్ణయాన్ని తక్షణమఉపసంహరించుకోవాలి సహకార బ్యాంకులలో పాతనోట్ల మార్పిడిని నిలిపివేస్తూ భారతీయ రిజర్వ్ బ్యాంకు తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని, ఉపసంహరించుకునే విధంగా ముఖ్యమంత్రిలో పాటు కేంద్రమంత్రులపై వత్తిడి తేవడానికి డీసీసీబీల చైర్మన్లు కృషి చేయాలని తెలంగాణ కోఆపరేటీవ్ సెంట్రల్ బ్యాంకు ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు బీఎల్ఎన్ రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.జనార్దన్రావు డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక డీసీసీబీలో జరిగిన యూనియన్ సమావేశంలో వారు మాట్లాడారు. కొన్ని కారణాలు చూపుతూ బ్యాంకుకు వ్య వస్థకే భంగం కలిగే విధంగా ఆర్బీఐ నిర్ణయిం చడం సరికాదన్నారు. కోర్బ్యాంగింగ్ సిస్టం ఉన్న డీసీసీబీల్లో నోట్ల మార్పిడిని రద్దు చేసి గ్రామీణ స్థాయిలో ఉన్న చిన్నచిన్న బ్యాంకులకు అనుమతినివ్వడం సరికాదన్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో సహకార బ్యాంకు చైర్మన్లు ఆర్బీఐ నిర్ణయాన్ని ఉపసంహరించుకునే విధంగా ప్రభుత్వంపై వత్తిడిని తీసుకురావాలని కోరారు. ఆర్బీఐ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఈ నెల 18 నుంచి 21 వరకు భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమాలు, 22న అన్ని రాష్ట్రా ల రాజధానిల్లో రైతులతో కలిసి ఆందోళనలు, 25న సహకార బ్యాంకులను బంద్ చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో యూనియన్ జిల్లా ప్ర ధాన కార్యదర్శి ఎం.కరుణాకర్రెడ్డి ఉన్నారు. -
డీసీసీబీల్లో నోట్ల మార్పిడి బంద్
• పాత నోట్ల జమను నిలిపివేస్తూ ఆర్బీఐ ఆదేశాలు.. • రైతుల పాట్లు సాక్షి, హైదరాబాద్: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ)లల్లో పాత పెద్ద నోట్ల మార్పిడిని నిలిపివేస్తూ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఖాతాల్లో ఇప్పటికే ఉన్న సొమ్మును విత్డ్రా చేసుకోవడానికి మాత్రం అవకాశం కల్పించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని డీసీసీబీల్లో రూ.500, రూ.వెరుు్య నోట్ల డిపాజిట్లను, మార్పిడి ప్రక్రియను నిలిపేశ ారు. ‘ఇక్కడ పెద్ద నోట్ల మార్పిడికి అవకాశం లేదు’ అంటూ బ్రాంచీల ముందు బోర్డులు పెట్టారు. ఆర్బీఐ అకస్మాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. తమ వద్ద ఉన్న పాత పెద్ద నోట్లను మార్చుకుని.. కొత్త నోట్లతో విత్తనాలు, ఎరువులు, ఇతర వస్తువులు కొనుక్కోవాల్సి ఉందని రైతులు పేర్కొంటున్నారు. ఆర్బీఐ నిర్ణయాన్ని సమీక్షించాలని, పెద్ద నోట్ల మార్పిడిని కొనసాగించాలని తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్(టెస్కాబ్) అధ్యక్షు డు కొండూరు రవీందర్రావు మంగళవారం రిజర్వుబ్యాంక్ గవర్నర్కు, కేంద్ర ఆర్థిక మంత్రి, సీఎంకు లేఖలు రాశారు. రిజర్వు బ్యాంకు నిర్ణయంతో రైతులు అనేక చోట్ల ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నారన్నారు. 12 లక్షల మంది రైతులకు ఇబ్బంది... స్కాబ్ ఆధ్వర్యంలోని 9 డీసీసీబీల పరిధిలో 272 బ్రాంచీలున్నారుు. వాటిలో 12 లక్షల మంది రైతులకు ఖాతాలున్నారుు. రైతులంద రికీ కలిపి మొత్తంగా రూ.4 వేల కోట్ల వరకు డిపాజిట్లు కూడా ఉన్నారుు. ప్రస్తుతం రబీ సీజన్ నడుస్తోంది. కీలకమైన ఈ సమయం లో చాలా మంది రైతులు బ్యాంకుల నుంచి, ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచి రుణాలు తెచ్చుకున్నారు. అరుుతే ఆ సొమ్మంతా పాత రూ.500, రూ.వెరుు్య కరెన్సీ నోట్ల రూపంలో ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నా రు. ‘‘సోమవారం వరకు పాత నోట్ల మార్పిడి లేదా జమ చేసి కొత్త నోట్లు తీసుకునే సదుపాయం సహకార బ్యాంకుల్లో ఉండేది. దీనిని నిలిపేస్తూ రిజర్వు బ్యాంకు నిర్ణయం తీసుకుంది. ఎందుకీ నిర్ణయం తీసుకున్నారో అర్థంకావడం లేదు..’’ అని టెస్కాబ్ ఎండీ మురళీధర్ పేర్కొన్నారు. బ్యాంకుల నుంచి రూ.24 వేలు విత్డ్రా చేసుకునే సదుపాయం మాత్రం కొనసాగుతుందని చెప్పారు. సోమ వారం నాటికి సహకార బ్యాంకుల్లో రూ.350 కోట్ల పాత నోట్లను రైతులు జమ చేశారని, రూ.40కోట్ల మేరకు కొత్త నోట్లను అందజేశా మన్నారు. అరుుతే టెస్కాబ్ పరిధిలో హైదరాబాద్లోని 35 బ్రాంచీల్లో మాత్రం యథావిథిగా రద్దయిన పెద్ద నోట్ల మార్పిడి కొనసాగుతుందని వెల్లడించారు. రాజకీయ ప్రమేయం? రిజర్వుబ్యాంకు దేశవ్యాప్తంగా డీసీసీబీ బ్రాంచీల్లో పాత నోట్ల మార్పిడి నిలిపివే యడానికి రాజకీయ నేతలు, వారి ప్రతిని ధుల వ్యవహారమే కారణమనే అభిప్రా యాలు వ్యక్తమవుతున్నారుు. డీసీసీబీల కు అధ్యక్షులు, డెరైక్టర్లుగా ఉండేదంతా రాజకీయ నేతలే. వారి ద్వారా నల్లధనం రైతుల పేరుతో మార్పిడి జరుగుతోందనే ఉద్దేశంతో రిజర్వు బ్యాంకు ఈ నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. -
డీసీసీబీ వైస్ చైర్మన్గా అహ్మద్హుసేన్
– ఏడాదిగా ఖాళీగా పదవి ఎట్టకేలకు భర్తీ – అసంతృప్తి వ్యక్తం చేసిన కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ డైరెక్టర్లు కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా సహకార కేంద్రబ్యాంకు వైస్ చైర్మన్గా వెలుగోడు మండలం మద్దూరు పీఏసీఎస్ అధ్యక్షుడు, డీసీసీబీ డైరెక్టర్ ఎస్.అహ్మద్హుసేన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పటికే నంద్యాల పార్లమెంటు నియోజకవర్గానికి పలు పదవులు ఉండగా కేడీసీసీబీ వైస్ చైర్మన్ పదవిని కూడా నంద్యాల పార్లమెంటు నియోజకవర్గానికి చెందిన వారికే ఇవ్వడంపట్ల అసంతృప్తి వెల్లువెత్తుతోంది. కర్నూలు పార్లమెంటు నియోజకవర్గానికి చెందిన బీసీ, ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన పలువురు డైరెక్టర్లు వైస్ చైర్మన్ పదవిని ఆశించినప్పటికి ఫలితం లేకపోవడంతో ఆగ్రహంతో ఉన్నారు. కర్నూలు మండలం పంచలింగాలకు చెందిన డీసీసీబీ డైరెక్టర్ సుధాకర్ ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. ఏప్రిల్ నెల 12న వైస్ చైర్మన్ ఎన్నికను నిర్వహించేందుకు సహకార శాఖ రిజిస్రా్టర్ నోటిఫికేషన్ ఇచ్చినా అపుడు ఏకాభిప్రాయం లేక ఎవరు నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో ఎన్నిక వాయిదా పడింది. దాదాపు ఏడాదిగా ఖాళీగా ఉన్న వైస్ చైర్మన్ పదవి ఎట్టకేలకు భర్తీ అయింది. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు నామినేషన్లు స్వీకరించారు. కర్నూలు నగరపాలక సంస్థ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మ్ మైనార్టీ ఓటర్లను ఆకట్టుకునేందుకు అదే సామాజిక వర్గానికి చెందిన అహ్మద్హుసేన్ను దేశం నేతలు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. దేశం నేతల సూచనల మేరకు అహ్మద్హుసేన్ ఒక్కరే వైస్ చైర్మన్గా నామినేషన్ దాఖలు చేశారు. డైరెక్టర్ కేఈ వేమనగౌడు ప్రతిపాదించగా, మరో డైరెక్టర్ పెద్ద మారెన్న బలపరిచారు. డీసీసీబీ చైర్మన్ మల్లికార్జునరెడ్డి, పలువురు డైరెక్టర్లతో కలసి అహ్మద్హుసేన్ నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారి అయిన శ్రీనివాసరెడ్డికి అందజేశారు. ఒక్క నామినేషన్ మాత్రమే రావడంతో అహ్మద్హుసేన్ వైస్ చైర్మన్గా ఏకగ్రీంగా ఎన్నికయినట్లుగా ఎన్నికల అధికారి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. వెంటనే దేశం కార్యకర్తలు, అహ్మద్హుసేన్ అభిమానులు బాణ సంచా పేల్చి సందడి చేశారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు 2గంటల తర్వాత డిక్లరేషన్ కాపీని ఎన్నికల అధికారి అహ్మద్హుసేన్కు అందచేశారు. అనంతరం బాధ్యతలు కూడా స్వీకరించారు. వైస్ చైర్మన్గా ఎన్నికయిన అహ్మద్హుసేన్ను మాజీ మంత్రి, కేఈ ప్రభాకర్, డీసీసీబీ చైర్మన్ మల్లికార్జునరెడ్డి, సీఇఓ రామాంజనేయులు, పలువురు డైరెక్టర్లు, దేశం నాయకులు అభినందించారు. అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని వైస్ చైర్మన్ ప్రకటించారు. -
'సహకార' సేవలకు బ్రేక్
- డిపాజిట్లు స్వీకరించరాదని ఆర్బీఐ ఉత్తర్వులు - రైతుల పడిగాపులు ఎమ్మిగనూరు: ఆప్కాబ్ పరిధిలో డీసీసీబీ (జిల్లా సహకార పరపతి బ్యాంక్)ల్లో డిపాజిట్లు స్వీకరించరాదంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మంగళవారం జిల్లాలోని 24 బ్రాంచ్ల్లో సేవలకు బ్రేక్ పడ్డాయి. డిపాజిట్లు చేసేందుకు వచ్చి రైతులు నిరాశ చెందారు. ఒక పక్క ఖరీఫ్ దిగుబడులు విక్రయించే కాలం, మరో పక్క బ్యాంకుల్లో తీసుకున్న అప్పులు, లోన్లు చెల్లించే సమయం కావటంతో రైతులు కేడీసీసీ బ్యాంకుల ముందు క్యూ కట్టారు. రూ. 500, రూ. 1000 నోట్లతో బ్యాంకులకు వచ్చే రైతులను బ్యాంక్ సిబ్బంది వెనక్కి పంపించారు. మూన్నాళ్ల ముచ్చటే.. పెద్ద నోట్ల రద్దుతో జిల్లా సహకార బ్యాంక్కు మూడురోజుల్లోనే రూ. 35 కోట్లు డిపాజిట్ రూపంలో చేరాయి. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులకు డిసెంబర్ 31 వరకు డిపాజిట్లు స్వీకరించే వెసలుబాటు ఉంది. రైతుల బ్యాంక్లకు మాత్రం నోట్ల డిపాజిట్లు మూన్నాళ్ళ ముచ్చటగానే సాగింది. జిల్లాలో మొత్తం 1.12 లక్షల మంది రైతులు సహకార బ్యాంకుల్లో ఖాతాదారులుగా ఉన్నారు. వీరందరికీ తాము పండించిన పంట ఉత్పత్తుల సొమ్మును బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునే అవకాశం లేకుండా పోయింది. ఇటు రైతులకు, అటు సహకార బ్యాంక్ల పటిష్టతను దృష్టిలో ఉంచుకొనే అన్ని ప్రభుత్వ ప్రైవేట్ బ్యాంకుల మాదిరిగానే సహకార బ్యాంకుల్లో రైతులు డిపాజిట్లు చేసుకొనే వెసలు బాటు కల్పించాలని పలువురు కోరుతున్నారు. అదేవిధంగా రైతులు డిపాజిట్ చేసిన మొత్తంలో వ్యవసాయఖర్చులకు డబ్బులు విత్డ్రా చేసుకోవాలన్నా ఆయా బ్యాంక్లకు ప్రధాన బ్యాంక్లనుంచీ 1శాతం డబ్బులు కూడా ఇవ్వకపోవటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్క ఎమ్మిగనూరు కేడీసీసీ బ్యాంక్లో ఇప్పటికే రూ.2కోట్లుకుపైగా డిపాజిట్ చేస్తే మార్పిడి కోసం ఆ బ్యాంక్కు వచ్చిన కొత్తనోట్లు కేవలం రూ.2.5లక్షలే. -
తగ్గుతున్న సహకార బలం
10 శాతం వాటా ధనంలో 7.5 శాతం డీసీసీబీకే 5 శాతం చెల్లింపునకు 2.5 శాతం పెంపు అంతంత మాత్రం సంఘాలకు మరింత ఆర్థిక భారం చెల్లించి తీరాల్సిందేనని డీసీసీబీ ఒత్తిడి అమలాపురం టౌ¯ŒS : రైతులకు పంట రుణాలు అందించి వ్యవసాయానికి బాసటగా నిలిచే ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఆర్థిక పరిస్థితి అంతకంతకూ తీసికట్టుగా తయారవుతోంది. ఆ సంఘాల ఆర్థిక మూలాలు, ఆదాయ మార్గాలకు గండికొట్టే చర్యల వల్ల క్రమేపీ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నాయి. జిల్లాలోని 300 వ్యవసాయ సహకార సంఘాల్లో దాదాపు 70 సంఘాలు తప్ప మిగిలినవన్నీ ఖజానా ఖాళీతో సతమమవుతున్నాయి. సంఘాల్లో సభ్యులు (రైతులు) రుణాలు తీసుకున్నప్పుడు సహకార చట్టం ప్రకారం వారి నుంచి ఆ రుణం విలువలో పది శాతం సొమ్ములను వాటా ధనం (షేర్ ధనం)గా సంఘాలు జమ చేసుకుంటాయి. ఆ వాటా ధనం అయిదు శాతం డీసీసీబీకి చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన అయిదు శాతం సంఘాభివృద్ధికి వినియోగించుకుంటుంది. గత కొన్నేళ్లుగా వాటా ధనంపరంగా సంఘాలు, డీసీసీబీల మధ్య సాగుతున్న వాటా నిష్పత్తి ఇదే. అయితే నాలుగు నెలల కిందట డీసీసీబీ జిల్లాలోని సహకార సంఘాలకు ఓ సర్క్యులర్ జారీ చేసింది. వాటా ధనంలో ఇప్పటి వరకూ డీసీసీబీకి జమ చేస్తున్న అయిదు శాతాన్ని ఇక నుంచి 7.5 శాతానికి పెంచుతున్నట్లు ఆ సర్క్యులర్లో స్పష్టం చేసింది. ఒక్కసారిగా అయిదు శాతం నుంచి 2.5 శాతం మేర అదనంగా పెంచటంపై జిల్లాలోని సహకర సంఘాల మెజారిటీ అధ్యక్షులు వ్యతిరేకిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో రైతుల నుంచి తాము వసూలు చేసి జమ చేసుకునే వాటా ధనంలో మూడొంతులు డీసీసీబీ పట్టుకునిపోతే ఇక సంఘాలను ఎలా నిర్వహించాలి... ఆర్థికంగా ఎలా పటిష్టం చేయాలని ప్రశ్నిస్తున్నారు. ఈ విధానం వల్ల జిల్లాలో ఇబ్బంది పడుతున్న 200కి పైగా సంఘాలకు సంబంధించి ఒక్కో సంఘం రూ.రెండు లక్షల నుంచి రూ.అయిదు లక్షల వరకూ కోల్పోయే పరస్థితి కనిపిస్తోందని ఆయా సంఘాల పాలక వర్గాలు ఆందోళనలో పడ్దాయి. ఎందుకిలా....? ఆర్బీఐకి అనుసంధానంగా పనిచేస్తున్న డీసీసీబీ సహకార సంఘాలకు రుణాలు ఇవ్వటం.. వాటిని వసూలు చేయటం..తద్వారా వ్యాపారం చేయటం వంటి ప్రక్రియలు సాధారణమే. అందుకు డీసీసీబీ ఆర్బీఐ నుంచి కొన్ని అనుమతులు పొందుతుంది. క్యాష్ రిజర్వు రేషియో (సీఆర్ఆర్)కు లోబడే ఆర్బీఐ అనుమతులు ఇస్తుంది. అయితే డీసీసీబీలో ఇటీవల కాలంలో సీఆర్ఆర్ కాస్త తగ్గటంతో తిరిగి ఆ స్థాయిలో దానిని పెంచుకోవాల్సి ఉందని తెలిసింది. ఇందు కోసం సహకార సంఘాలు సభ్యుల నుంచి వసూలు చేసే వాటా ధనం నుంచి అప్పటికే తీసుకుంటున్న అయిదు శాతం వాటాను ఏడున్నర శాతానికి పెంచి వసూలు చేసేందుకు చర్యలు చేపడుతోంది. అయితే లాభాల్లో ఉండి ఆర్థిక పరిపుష్టితో ఉన్న కొన్ని సంఘాలు ఇప్పటికే వాటా ధనాన్ని ఏడున్నర శాతం వంతున డీసీసీబీకి చెల్లించేస్తున్నాయి. అయితే నష్టాల్లో ఉండి నిర్వహణా భారంతో సతమతమవుతున్న సంఘాలు మాత్రం వాటా ధనానికి పెంచిన మేర చెల్లింపులు చేసేందుకు ససేమిరా అంటున్నాయి. ప్రస్తుతం జిల్లాలో 70 శాతం సంఘాలు పెంచిన వాటా ధనం శాతాన్ని చెల్లించకుండా అయిదు శాతమే చెల్లిస్తామని భీష్మించుకుని ఉన్నాయి. ఛైర్మన్, డైరక్టర్లూ సంఘాల అధ్యక్షులైనా సమస్యకు పరిష్కారమేది...?: సీఆర్ఆర్ కోసమే అయితే ఆ సమస్యను వేరే మార్గాల్లో పరిష్కరించుకావాలే తప్ప ఇలా సంఘాలకు క్షేత్ర స్థాయిలో డిపాజిట్ రూపంలో ఆదాయ వనరుగా ఉండే వాటా ధనం తీసుకునే శాతాన్ని అమాంతంగా పెంచటం సమంసజం కాదని సంఘాల అధ్యక్షులు అంటున్నారు. డీసీసీడీ చైర్మన్, 20 మంది డీసీసీబీ డైరెక్టర్లు జిల్లాలో ఏదో ఒక సహకార సంఘానికి అధ్యక్షులే... కనీసం వారైనా డీసీసీబీ పాలక వర్గ సమావేశాల్లో చర్చించి సంఘాల ఆర్ధిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని లోతుగా ఆలోచించే ప్రయత్నం చేయటం సంఘాల అధ్యక్షులు వాపోతున్నారు. -
15న డీసీసీబీ వైస్చైర్మన్ ఎన్నిక
– ఎన్నికల అధికారిగా శ్రీనివాసరెడ్డి నియామకం కర్నూలు (అగ్రికల్చర్): జిల్లా సహకార కేంద్రబ్యాంకు వైస్ చైర్మన్ ఎన్నిక నవంబరు 15న నిర్వహించనున్నారు. ఈ మేరకు సహకార శాఖ రిజిస్ట్రార్ మురళి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల అధికారిగా డీసీసీబీ ఓఎస్డీ శ్రీనివాసరెడ్డి వ్యవహరిస్తారు. ఇటీవలి వరకు డీసీసీబీ చైర్మన్గా గుండం సూర్యప్రకాష్రెడ్డి వ్యవహరించారు. ఆయన రాజీనామా తర్వాత ఈ పోస్టు ఖాళీగా ఉంది. గతంలో జరిగిన డీసీసీబీ బోర్డు సమావేశంలో వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించేలా తీర్మానం చేసి సహకార శాఖకు పంపారు. ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఒకే రోజు నామినేషన్లు, ఎన్నికల ప్రక్రియ జరుగుతాయి. ఈ పదవి కోసం ప్రస్తుత డైరెక్టర్లు సుధాకర్, శ్రీనివాసులు, అహ్మద్హుసేన్ పోటీ పడుతున్నారు. -
సహకారం..చెరి సగం
- డీసీసీబీలో కమీషన్ల పర్వం - ముఖ్యనేత పేరు మీద వసూళ్లు - కొత్త పథకాలతో సరికొత్త వ్యూహం - అవసరార్థం వచ్చిన రైతులను పీల్చిపిప్పి చేస్తున్న వైనం కర్నూలు(అగ్రికల్చర్)/ కోవెలకుంట్ల: జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ)..రైతుల అభ్యున్నతి దీని లక్ష్యం. కష్టాల్లో ఉన్న అన్నదాతలకు ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా రుణాలు ఇవ్వాలి. అయితే జిల్లాలో అందుకు విరుద్ధంగా జరుగుతోంది. కమీషన్ల పేరుతో రైతులను అధికారులు పీల్చి పిప్పిచేస్తున్నారు. టీడీపీకి చెందిన డీసీసీబీ పాలకమండలిలోని ముఖ్యనేత పేరు మీదనే ఈ వ్యవహారం నడుస్తోంది. కమీషన్లను అధికారులు, ముఖ్యనేత చెరి సగం పంచుకుంటున్నట్లు విమర్శలున్నాయి. నిబంధనలు ఇలా.. జిల్లా సహకార కేంద్రబ్యాంకు ద్వారా 2015–16 నుంచి కాంపోజిట్ రుణ పథకం, రైతు నేస్తం, కర్షకజ్యోతి, డెయిరీ కింద రుణాలు ఇస్తున్నారు. కాంపోజిట్ పథకం కింద గరిష్టంగా రూ.25 లక్షలు రుణంగా ఇస్తారు. మిగిలిన పథకాల కింద రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రుణాలు ఇస్తున్నారు. రైతుల భూములను క్షేత్ర స్థాయిలో పరిశీలించి అన్ని సక్రమంగా ఉంటే డాక్యుమెంట్లను తీసుకొని మాల్టిగేజ్ చేసుకున్న తర్వాత రుణాలు ఇస్తారు. రైతులు ఏ కారణంతోనైనా రుణాలు చెల్లించకపోతే భూములను స్వాధీనం చేసుకొని వేలం వేసే అవకాశం ఉంది. వసూళ్లు ఇలా.. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు మొదలు కొని కేడీసీసీబీ బ్రాంచిల వరకు ముఖ్యనేత పేరుమీదనే వసూళ్ల పర్యం సాగుతోంది. సదరు ముఖ్యనేతకు 2 శాతం, స్థానిక సిబ్బంది మరో 2 శాతం వరకు కమీషన్లు ఉన్నట్లు జిల్లాలో చర్చ జరుగుతోంది. మామూళ్ల వ్యవహారాన్ని ప్రశ్నించిన వారిపై సదరు నేత ఎదురుదాడి చేస్తున్న సంఘటనలు ఉన్నాయి. భూములను పరిశీలించేందుకు వెళ్లిన అధికారులు సైతం మామూళ్లు దండుకుంటున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఎటువంటి దీర్ఘకాలిక రుణమైనా కేడీసీసీబి ప్రధాన కార్యాలయానికి వస్తుంది. అక్కడ అడ్వైజ్ సర్టిఫికెట్ ఇవ్వాల్సిఉంది. ఇది ఇవ్వాలంటే కమీషన్లు ముట్టాల్సిందే. లక్షకు రూ.వెయ్యి ఇస్తే అడ్వైజ్ సర్టిఫికెట్ వస్తుంది. రుణపంపిణీ ఇలా.. కాంపోజిట్, రైతు నేస్తం, కర్షకజ్యోతి, డెయిరి పథకాల కింద 2015–16లో దాదాపు రూ.500 కోట్లు రుణాలు ఇచ్చారు. ఈ ఏడాది దాదాపు రూ.1000 కోట్లు రుణాలుగా ఇవ్వాలని లక్ష్యంగా తీసుకున్నారు. ఇప్పటికి రూ.175 కోట్ల వరకు రుణాలు పంపిణీ చేశారు. రుణపంపిణీ బట్టి కమీషన్లు ఏ స్థాయిలో ఉన్నాయో ఊహించుకోవచ్చు. ఇదీ ఉదాహరణ.. - గోనెగండ్ల మండలానికి చెందిన ఓ రైతు కాంపోజిట్ పథకం కింద రూ.25 లక్షల రుణం కోసం ముఖ్యనేతకు ముందుగానే రూ.75వేలు ఇచ్చుకున్నట్లు సమాచారం. ఆయనకున్న భూములకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ విలువల ప్రకారం రూ. 15 లక్షలకే రుణానికి అర్హత లభించింది. రూ.25 లక్షల కోసమని రూ.75వేలు ఇస్తే రూ. 15 లక్షలే ఇచ్చారని అ రైతు అందోళన అంతాఇంతా కాదు. రుణంలో 2 శాతం పట్టుకున్నారు: యల్లావత్తుల శివశంకర్, సంజామల (27కేఎన్ఎల్16ఏ) వరి, జొన్న సాగుకు పెట్టుబడుల కోసం సంజామల సహకార సంఘంలో మూడు నెలల క్రితం 5.40 ఎకరాల పొలం తనఖా పెట్టాను. కర్షక జ్యోతి పథకం కింద ఎకరాకు రూ. లక్ష చొప్పున రూ. 5.40 లక్షల రుణం అందాల్సి ఉంది. అయితే రెండుశాతం కమిషన్ పట్టుకొని రూ. 4.85 లక్షలు చేతికిచ్చారు. ఇదేమని అడిగితే పెద్దోళ్లకు ఇవ్వాలని అధికారులు చెప్పారు. రూ.15 వేలు పట్టుకున్నారు: మహమ్మద్ రఫీ, కానాల, సంజామల మండలం (27కేఎన్ఎల్16బీ) నేను రెండున్నర ఎకరా పొలం తనఖా పెట్టి రెండు నెలల క్రితం బర్రెల కొనుగోలుకు రూ. 2.50 లక్షలు రుణం కావాలని అడిగాను. మొదటి విడత రూ. 1.25 లక్షలు అందజేయాల్సి ఉంది. అయితే రూ. 15వేలు పట్టుకొని రూ. 1.10 లక్షలు చేతికిచ్చారు. మిగిలిన మొత్తం ఆరు నెలల తర్వాత ఇస్తామన్నారు. సహకార సంఘాల్లో క్రాప్ లోన్లు ఎత్తివేసి ఎల్టీ, కర్షక జ్యోతి పథకాల కింద మాత్రమే రుణాలు ఇస్తున్నారు. -
కొత్త డీసీసీబీలపై మల్లగుల్లాలు
విభజిస్తే నష్టదాయకమంటున్న అధికారులు సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల్లో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ)లను ఏర్పాటు చేసే అంశంపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇతర ప్రభుత్వ శాఖల మాదిరిగా డీసీసీబీలను విడగొట్టి జిల్లాకు ఒకటి చొప్పున ఏర్పాటు చేయడం అంత సులువైన వ్యవహారం కాదు. సహకార బ్యాంకుల విభజనగాని, కొత్తగా ఏర్పాటు చేయడంగాని ఆర్బీఐ పరిధిలోకే వస్తుంది. కాబట్టి ఆర్బీఐ అనుమతి తీసుకుంటేనే ఉన్న వాటిని విభజించడం... లేదా కొత్త వాటిని ఏర్పాటు చేయడం సాధ్యపడుతుంది. అది కూడా లాభనష్టాల ఆధారంగానే కొత్త వాటి ని ఏర్పాటు చేయాలా.. లేదా.. అన్న అంశా న్ని ఆర్బీఐ అధ్యయనం చేసి అనుమతిపై నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పటికిప్పుడు కొత్త జిల్లాలతోపాటు డీసీసీబీల ఏర్పాటు ఉండబోదని... జిల్లాల ఏర్పాటు అనంతరం పాలకవర్గాల నిర్ణయం మేరకు నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్) ఎండీ మురళీధర్ ‘సాక్షి’తో అన్నారు. అయితే, కొత్త జిల్లాలతోపాటు డీసీసీబీలను కూడా ఏర్పాటు చేయాలని కొందరు డీసీసీబీ సభ్యులు కోరుతున్నారు. డీసీసీబీల నేతృత్వంలో ఉన్న సహకార బ్యాంకుల్లో దాదాపు 30లక్షల మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. రూ.5వేల కోట్ల వరకు డిపాజిట్లు ఉన్నాయి. వాటిని విడగొట్టి కొత్త జిల్లాల్లో ఏర్పాటు చేస్తే నష్టాలబాట పట్టే పరిస్థితులు ఏర్పడతాయని టెస్కాబ్ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లాభాలు ఉంటాయన్న నమ్మకం వస్తేనే కొత్త జిల్లాల్లో డీసీసీబీలను ఏర్పాటు చేస్తామని, దాని ప్రకారం పాలకవర్గాల తీర్మానంతో ఆర్బీఐ అనుమతి తీసుకుంటామని మురళీధర్ పేర్కొంటున్నారు. -
ఖాతాదారులకు మెరుగైన సేవలు
డీసీసీబీ చైర్మన్ మెట్టుకూరు ధనుంజయరెడ్డి నెల్లూరు రూరల్ : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ద్వారా ఖాతా దారులకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు డీసీసీబీ చైర్మన్ మెట్టుకూరు ధనుంజయరెడ్డి తెలిపారు. నెల్లూరు గాంధీబొమ్మ సెంటర్లోని ఆ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఆవరణలో తొలి ఏటీఎంను ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకు సేవలను విస్తరిస్తున్నట్లు చెప్పారు. వాణిజ్య బ్యాంకులకు దీటుగా బ్యాంకు సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లా వ్యాపితంగా 10 ఏటీఎం కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది రూ.190 కోట్లు డిపాజిట్లు సేకరించామని, రూ.వెయ్యి కోట్ల వ్యాపాల లావాదేవీలతో బ్యాంకు లాభాల బాటలో పయనిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు వైస్ చైర్మన్ నల్లపరెడ్డి జగన్మోహన్రెడ్డి, సీఈఓ రాజారెడ్డి, డీసీఎంలు సరితా, ఉషారాణి, డైరెక్టర్లు పాల్గొన్నారు. -
ఖాతాదారులకు మెరుగైన సేవలు
శ్రీకాకుళం అర్బన్: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పరిధిలోని రైతులకు, ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమని ఆ బ్యాంక్ చైర్మన్ డోల జగన్మోహనరావు అన్నారు. నగరంలోని జీటీరోడ్లోని డీసీసీబీ బ్యాంకు కార్యాలయంలో బుధవారం ఏటీఎం కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమర్షియల్ బ్యాంకుల పోటీతత్వాన్ని ఎదుర్కొనేందుకు ఖాతాదారులకు ఏటీఎం సౌకర్యం కల్పించామని తెలిపారు. భవిష్యత్లో పంట రుణాలు, ఇన్పుట్ సబ్సిడీ, సహకార సంఘాల ద్వారా తీసుకున్న అప్పులను రైతు ఖాతాలో జమ చేస్తామని తెలిపారు. బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా ఏటీఎంకు వెళ్లి డబ్బులు డ్రా చేసుకోవచ్చన్నారు. డీసీసీబీ బ్యాంకు ఖాతాదారులందరికీ రూపే కార్డు జారీ చేస్తున్నామని చెప్పారు. 49 సహకార సంఘాల పరిధిలోని లక్షా 25వేల మంది సభ్యులు ఉండగా అందులో లక్షా 13వేల 500 ఖాతాలు ఉన్నాయని కావాల్సిన వారందరికీ రూపే కార్డు జారీ చేస్తామని తెలిపారు. మొత్తం బ్రాంచిలు 15 ఉండగా కొత్తగా రణస్థలం, హిరమండలం, వీరఘట్టం, మందస ప్రాంతాల్లో బ్రాంచిలు ఏర్పాటు చేయనున్నామన్నారు. మొదటి విడతగా శ్రీకాకుళం బ్రాంచిలో ఏటీఎం కేంద్రాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. మిగతా బ్రాంచిల్లోనూ వీటిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. అన్ని సంఘాలకు పాస్ మిషన్ ఏర్పాటు చేసి ప్రతి సభ్యునికీ రూపే కార్డు ఏర్పాటు చేసి ఏటీఎంల ద్వారా వ్యాపార లావాదేవీలను జరిపేలా చూస్తామన్నారు. ఈ ఏటీఎం కార్డులతో ఇతర అన్ని బ్యాంకుల ఏటీఎంలలో లావాదేవీలు చేసుకోవచ్చని చెప్పారు. కార్యక్రమంలో డీసీసీబీ సీఈఓ డి.సత్యన్నారాయణ, జిల్లా కో–ఆపరేటివ్ అధికారి బి.శ్రీహరిరావు, డీజీఎంలు పి.జ్యోతిర్మయి, వరప్రసాద్, ఏజీఎంలు ఎస్వీఎస్ జగదీష్, రమేష్, సునీల్, సహకార సంఘాల అధ్యక్షుడు సనపల లక్ష్మునాయుడు, నర్తు నరేంద్రయాదవ్, గొండు కృష్ణమూర్తి, బొడ్డేపల్లి నారాయణరావు, నాగమ్మ, సీతమ్మ, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. -
లాభాల బాటలో డీసీసీబీ
రుణాల మంజూరు, రికవరీలో మొదటి స్థానం దివంగత సీఎం వైఎస్ చలువతోనే సహకార బ్యాంకులకు జీవం డీసీసీబీ చైర్మన్ రాఘవరెడ్డి వరంగల్ : జిల్లా కేంద్ర సహకార బ్యాంక్(డీసీసీబీ) వాణిజ్య బ్యాంకులకు ధీటుగా వ్యాపారం చేసి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అన్నారు. డీసీసీబీ కార్యాలయ ఆవరణలో ఆదివారం బ్యాంకు మహాజన సభ(జనరల్ బాడీ) సమావేశం జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 2015–16 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు ద్వారా రూ.435 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. లక్ష్యానికి మించి గత ఆర్థిక సంవత్సరంలో రైతులు, ఇతర వర్గాలకు రూ.501 కోట్ల రుణాలు ఇచ్చామన్నారు. రుణాల రికవరీలోనూ 98.8 శాతం వృద్ధి సాధించామన్నారు. రూ.235 కోట్ల డిపాజిట్లు సేకరించి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో వరంగల్ డీసీసీబీ నిలిచిందన్నారు. సుమారు రూ.2 కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదాయపు పన్నుగా చె ల్లించామన్నారు. సహకార రంగంలోని బ్యాం కులు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన రుణమాఫీతోనే బతికి బట్ట కట్టాయన్నారు. దివంగత సీఎం వైఎస్.రాజశేఖర్రెడ్డి హయాంలో సహకార రంగంలోని బ్యాంకులు జీవం పోసుకున్నాయన్నారు. అనంతరం నాబార్డ్ డీడీఎం కృష్ణమూర్తి మాట్లాడుతూ బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకోవడంతో పాటు అదే విధంగా చెల్లింపులు ఉంటే రుణాల టార్గెట్ పెంచే అవకాశాలు ఉన్నాయన్నారు. జీఎం సురేందర్ సేవలతోనే బ్యాంకు అభివృద్ధి డీసీసీబీలో 1986లో సాధారణ ఉద్యోగిగా చేరిన వి.సురేందర్ నేడు జీఎం స్థాయి వరకు చేసిన సేవల వల్లే బ్యాంకు అభివృద్ధి బాటలో పయనించిందని డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అన్నారు. జీఎం సురేందర్ పదవీ విరమణ సందర్భంగా ఆత్మీయ వీడ్కోలు సమావేశం జరిగింది. రాఘవరెడ్డి మాట్లాడుతూ అంచెలంచెలుగా ఎదిగిన జీఎం సురేందర్ బ్యాంకును లాభాల బాట పట్టించారన్నారు. అనంతరం సురేందర్ దంపతులను జ్ఞాపికలు అందజేసి సన్మానించారు. బ్యాంక్ వైస్ చైర్మన్ రాపోలు పుల్లయ్య, డైరెక్టర్లు బిల్లా సుధీర్రెడ్డి, పోతరాజు శ్రీనివాసు, ఎ.జగన్మోçßæన్రావు, కేడల జనార్ధన్, డీసీఓ చక్రధర్, సీఈఓ యాదగిరి, జీఎం సురేందర్, డీజీఎం శ్రీనివాస్, పీఏసీఎస్ల చైర్మన్లు, సీఈఓలు పాల్గొన్నారు. -
రోస్టర్ పాయింట్ పాటిస్తే ఒట్టు
– డీసీసీబీ పోస్టుల భర్తీలో సీఫారసులకే పెద్దపీట – బడుగు, బలహీన వర్గాలకు మొండిచెయ్యి – ప్రభుత్వ ఉత్తర్వులకు తూట్లు కర్నూలు(అగ్రికల్చర్): అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వరంగ సంస్థలు, స్థానిక సంస్థల్లో చేపట్టే నియామకాల్లో రోస్టర్ విధానం పాటించాలి. ఈ మేరకు ప్రభుత్వం సర్కులర్ మెమో కూడా జారీ చేసింది. అయితే జిల్లా సహకార కేంద్ర బ్యాంకుకు మాత్రం సర్కారు ఉత్తర్వులు వర్తించడం లేదు. అవుట్ సోర్సింగ్ పోస్టులకు నోటిఫికేషన్, రోస్టర్ విధానం పాటించడమేమింటని ప్రశ్నిస్తుండటం గమనార్హం. జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో ఏడాదిన్నర కాలంగా 35 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు, 15 వరకు అటెండర్ కమ్ మెసెంజర్ పోస్టులు అవుట్ సోర్సింగ్పై భర్తీ చేశారు. ఇందుకు నోటిఫికేషన్ ఇవ్వడంకానీ, రోస్టర్ విధానం పాటించడం కానీ జరగలేదు. జిల్లా సహకార కేంద్ర బ్యాంకుకు పొలిటికల్ బాడీ ఉండటం, దానిపై అధికార పార్టీ ప్రభావం అధికంగా ఉండడంతో పోస్టులన్నీ సిఫారసుల మేరకు భర్తీ చేశారు. రాజకీయ పలుకుబడి లేని బడుగు, బలహీనవర్గాల వారికి ఏ ఒక్క పోస్టూ దక్కిన దాఖలాలు లేవు. స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల పంపకాలు.. జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో స్టాఫ్ అసిస్టెంట్ల కొరత ఉంది. స్టాఫ్ అసిస్టెంట్లు అంటే క్యాషియర్, క్లర్క్తో సమానమైన ఉద్యోగాలు. ఈ పోస్టులను రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేసుకునేందుకు అనుమతి లేకపోవడంతో అవుట్ సోర్సింగ్పై 35 పోస్టుల భర్తీకి బోర్డు సమావేశంలో తీర్మానించారు. అయితే నిబంధనల ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చి రోస్టర్ విధానం ప్రకారం భర్తీ చేయాల్సి ఉంది. అయితే పాలకవర్గ సభ్యులు ఈ పోస్టులను పంచుకున్నట్లు తెలుస్తుంది. ఒక్కో పోస్టుకు రూ.50 వేలు, అంతకు మించి తీసుకుని అనుకూలమైన వారిని సిఫారసు చేసినట్లు ఆరోపణలున్నాయి. మెసెంజర్ కమ్ అటెండర్ పోస్టుల భర్తీదీ ఇదే పరిస్థితి కావడం గమనార్హం. రోస్టర్ విధానం పాటించాల్సిందే.. స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీలో రోస్టర్ విధానం పాటించాల్సి ఉందని బ్యాంకు అధికారులే చెబుతున్నారు. అయితే పొలిటికల్ బాడీ ఉన్నందునా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. పాలకవర్గంలో 21 మంది డైరెక్టర్లుంటారు. ఇటు అధికారపార్టీ నేతలు, అటు డైరెక్టర్ల సిఫారసులు వెల్లువెత్తుతుండటంతో సాధారణ వ్యక్తులకు ఉద్యోగాలు దక్కని పరిస్థితి ఏర్పడింది. ఎవరికి వారు అవుట్ సోర్సింగ్ పోస్టులను అమ్ముకున్నారనే విమర్శలున్నాయి. టెంపరరీ పోస్టులు, ఆపై అవుట్ సోర్సింగ్.. అందుకే పాటించలేదు... స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికపై అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేశాం. ఆరు నెలలు, ఏడాది పని చేసే పోస్టులకు నోటిఫికేషన్, రోస్టర్ అవసరం ఏముంది. త్వరలోనే రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నాం. అప్పుడు నోటిఫికేషన్, రోస్టర్ అన్నీ పాటిస్తాము. ఆరు నెలలు, ఏడాది పనిచేయడానికి ఎవ్వరూ డబ్బులు ఇవ్వరు. అవుట్ సోర్సింగ్పై భర్తీ చేసే కిందిస్థాయి పోస్టులకు రోస్టర్ పాయింట్ అవసరం లేదు. – రామాంజనేయులు, సీఈఓ, కేడీసీసీబీ -
డీసీసీబీ మెడకు మరో ఉచ్చు!
సాక్షి ప్రతినిధి, కడప: డీసీసీబ్యాంకుపై అవినీతి ఆరోపణల పరంపర కొనసాగుతోంది. అనధికార కార్యక్రమాలు ఒక్కోక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ముడుపులే ధ్యేయంగా యంత్రాంగం వ్యవహరిస్తోన్న ధోరణి బహిర్గతమవుతోంది. తాజాగా జీఎం, ఆర్బిట్రేటర్లపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టాల్సిందిగా సహకార మంత్రి ఆదేశించారు. ఆ మేరకు స్పెషల్ చీఫ్ సెక్రెటరీ, డీసీఓను విచారణాదికారిగా నియమించారు. వివరాలిలా ఉన్నాయి. డీసీసీబ్యాంకు మునుపటి జీఎం వెంకటేశ్వర్లు, ఆర్బిట్రేటర్ ప్రభాకర్రావులపై ఆరోపణలు చేస్తూ సహకారశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి ఫిర్యాదు చేశారు. బి వెంటకట్రామిరెడ్డి, ఆర్ మణి, ఎస్ కృష్ణమూర్తి అనేవారి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టాల్సిందిగా సహకారశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీని మంత్రి ఆదేశించారు. పరిశీలించిన స్పెషల్ సెక్రెటరీ విచారణ చేపట్టాల్సిందిగా కడప డీసీఓను ఆదేశిస్తూ జిల్లా కేంద్రానికి సిఫార్సు లేఖ పంపారు. యథేచ్ఛగా వసూళ్ల పర్వం డీసీసీబీలో పనిచేస్తున్న ఉద్యోగులకు పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లకు పొడిగిస్తామని జీఎం వెంకటేశ్వర్లు, ఆర్బిట్రేటర్ ప్రభాకర్రావులు రూ.20 లక్షల వరకు వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపించారు. అలాగే సొసైటీల నుంచి బ్యాంకులోకి 10మందిని క్లర్కులుగా తీసుకున్నారు. వారికి చట్టవిరుద్ధంగా సర్వీసు కండీషన్లు కల్పించారని తెలిపారు. అదేవిధంగా ముగ్గురు అసిస్టెంటు మేనేజర్లను నిబంధనలకు విరుద్ధంగా మేనేజర్లుగా నియమించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. సొసైటీల్లో పనిచేస్తున్న కొందరు సీఈఓలను బ్యాంకు ఉద్యోగులుగా తీసుకుంటామని చెప్పి వారి నుంచి రూ.40లక్షలు వసూలు చేశారని ఆరోపించారు. ఆమేరకు బ్యాంకులోకి తీసుకునేందుకు చర్యలు చేపట్టారని వివరించారు. ఈక్రమంలో బ్యాంకు నిబంధనలు, చట్టాన్ని ఖాతరు చేయకుండా వ్యవహరించారని ఆరోపించారు. లంచంగా తీసుకున్న మొత్తం డీసీసీబీలో ఫిక్స్డ్ డిపాజిట్గా వేశారని, ఎఫ్డి అకౌంటు నంబర్ 110124010025163 జీఎం వెంకటేశ్వర్లు పేరున వేసి, నామినీగా ఆర్బిట్రేటర్ ప్రభాకర్రావును చేర్చారని ఆరోపించారు. పై విషయాలను దర్యాప్తు చేయించి అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు మంత్రిని కోరారు. ఆ మేరకు జూన్17 విచారణ చేపట్టాల్సిందిగా డీసీఓ కార్యాలయానికి సిఫార్సు లేఖ అందినట్లు తెలుస్తోంది. కాగా ఈవిషయమై డీసీఓ సుబ్బారావు వివరణ కోరగా కడప డీసీఓగా అదనపు బాధ్యతలను చూస్తున్నానని పూర్తి విషయాలు తెలుసుకోవాల్సి ఉందని, ఆ తర్వాత స్పందిస్తానని తెలిపారు. -
సహకారం శూన్యం
సహకార రైతుపై సర్కారు చిన్నచూపు చూస్తోంది. సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం కనబరుస్తోంది. సహకార బ్యాంకునే నమ్ముకున్న అన్నదాతకు అప్పులే మిగుల్చుతోంది. రుణమాఫీ వర్తింపజేయడంలో తాత్సారం చేస్తోంది. ఇతర బ్యాంకుల్లో రుణ బకాయిలకు నగదు జమచేసి... డీసీసీబీకి మాత్రం శూన్యహస్తం చూపిస్తోంది. విజయనగరం అర్బన్: ఎన్నికల హామీల్లో ప్రధానమైన రుణమాఫీని అరకొరగా అమలు చేసిన సర్కారు సహకార బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న రైతులకు వర్తింపజేయడంలో తాత్సారం చేస్తోంది. తొలి విడత రైతులకు మాత్రమే ప్రకటించిన మేరకు రుణమాఫీ జరిగింది. రెండో విడతగా ప్రకటించిన రుణమాఫీ నిధులు అన్ని బ్యాంక్లకు నూరుశాతం విడుదల చేసినా... సహకార బ్యాంకులకు 79 శాతం మాత్రమే విడుదల చేసింది. దీనివల్ల రుణాలు పూర్తిగా మాఫీకాక దాని పరిధిలోని రైతులకు వడ్డీ భారంగా మారుతోంది. రుణమాఫీ బకాయి నిధుల కోసం సహకార బ్యాంకుల అధికారులు పలుమార్లు ప్రభుత్వాన్ని అడిగితే పట్టించుకోవడం లేదు. 16,282మంది ఎదురుచూపు గత ఏడాది చివరి క్వార్టర్లో ప్రకటించిన రెండవ విడత రుణమాఫీ జాబితాలో జిల్లాలోని 16,282 మంది రైతులకు సుమారు రూ.20 కోట్ల నిధులు విడుదల కావాల్సి ఉంది. ఈ మేరకు ప్రభుత్వం సంబంధిత ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంక్ (ఆప్కాబ్)కి నిధులు పంపాలి. అయితే కారణం చెప్పకుండా కేవలం రూ.16 కోట్లు(మంజూరైన మొత్తంలో 79%) మాత్రమే అప్పట్లో విడుదల చేశారు. అరకొరగా వచ్చిన సొమ్మును అందరికీ సమానంగా పంచి మిగిలిన 21 శాతం రణమాఫీ బకాయి ఉంచాలని ఆప్కాబ్ ఆదేశించింది. ఈ మేరకు జిల్లా సహకార బ్యాంక్ అధికారులు రెండవ విడత రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేశారు. ఇది జరిగి దాదాపు ఐదు నెలలు అవుతోంది బకాయి రుణమాఫీపై ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మూడో విడత రుణమాఫీ అర్హత జాబితా కూడా మూడునెలల క్రితమే ప్రకటించారు. కానీ రెండో విడత రుణమాఫీ బకాయి నిధుల విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. బకాయి రుణమాఫీ నిధులు రాకపోవడం వల్ల 16,282 మంది రైతులపై వడ్డీ భారం పడుతోంది. -
ఇది టీడీపీ గెలుపుకాదు.. వైఎస్సార్సీపీ ఓటమి కాదు
ప్రజాస్వామ్యానికి పాతరేశారు కోట్లు పోసి పదవిని కొనుక్కొన్నారు... వీరేం సేవ చేస్తారు ఈ ఎన్నిక చెల్లదు.. ఎప్పటికైనా డీసీసీబీ మాదే డీసీసీబీ ఎన్నికపై వైఎస్సార్సీపీ నేతల వ్యాఖ్యలు కడప కార్పొరేషన్ : జిల్లా సెంట్రల్ కో ఆపరేటివ్ బ్యాంకు(డీసీసీబీ)ని టీడీపీ కైవసం చేసుకోవడం ఆ పార్టీకి గెలుపుకాదని, వైఎస్సార్సీపీకి ఓటమి కాదని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి అభిప్రాయపడ్డారు. స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశ ంలో ఆకేపాటి అమర్నాథ్రెడ్డి మాట్లాడుతూ ప్రజాభిమానంతో డీసీసీబీని వైఎస్సార్సీపీ కైవసం చేసుకోగా, టీడీపీ అప్రజాస్వామికంగా వ్యవహరించి దాన్ని లాక్కుందన్నారు. డెరైక్టర్లందరికీ డబ్బులు ఎరగా వేసి, లొంగని వారిని ఎర్రచందనం కేసుల్లో ఇరికిస్తామని భయబ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు. అనేక ఆరోపణలు చేసి ఇద్దరు డెరైక్టర్లకు ఓటు హక్కు లేకుండా చేశారన్నారు. పుల్లయ్య అనే డెరైక్టర్ రెండు సంఘాలకు అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడని, తమ ఎంపీ, ఎమ్మెల్యేలు రాతమూలకంగా ఫిర్యాదు చేసినా అధికారులు కనీసం విచారణ చేసిన పాపాన పోలేదన్నారు. శ్రీమన్నారాయణ అనే వ్యక్తి కో ఆప్షన్ పదవికి నామినేషన్ దాఖలు చేస్తే అది చెల్లదని ప్రక్కనబెట్టారన్నారు. ఇలా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా వ్యవహరించి డీసీసీబీ ఎన్నిక నిర్వహించారన్నారు. ఈ వ్యవహారం కోర్టులో నడుస్తున్నందున ఈ ఎన్నిక చెల్లదని తె లిపారు. భవిష్యత్తులో తామే డీసీసీబీని కైవసం చేసుకొంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. జిల్లాలో అప్రజాస్వామ్యం రాజ్యమేలుతోంది జిల్లాలో అప్రజాస్వామ్యం రాజ్యమేలుతోందని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్రెడ్డి అన్నారు. ఈ ఎన్నిక ద్వారా టీడీపీ అప్రతిష్ట మూటగట్టుకోక తప్పదన్నారు. 21 మంది డీసీసీబీ డెరైక్టర్లలో టీడీపీకి చెందిన వారు ఆరుమంది, వైఎస్సార్సీపీకి 15 మంది డెరైక్టర్లు ఉన్నారన్నారు. సహకార వ్యవస్థలోని లొసుగులను ఆసరాగా చేసుకొని, అధికారాన్ని, డబ్బును ఆశచూపి తమ డెరైక్టర్లను వారివైపు లాక్కున్నారని ధ్వజమెత్తారు. కోట్లు పోసి డీసీసీబీ పదవిని కొనుక్కొన్నవారు ప్రజలకు, రైతులకు మేలు చేస్తారా అని సూటిగా ప్రశ్నించారు. ఈ సమావేశంలో కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు జి. రాజేంద్రప్రసాద్రెడ్డి, ఎస్. ప్రసాద్రెడ్డి పాల్గొన్నారు. ఎనిమిది మంది డెరైక్టర్లకు ధన్యవాదాలు- ఎంపీ అధికారం, డబ్బు ఆశచూపినా, అక్రమ కేసులు పెడతామని బెదిరించినా చెక్కు చెదరని విశ్వాసంతో పార్టీ వెంట ఉన్న 8 మంది డెరైక్టర్లకు కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. వారి విశ్వాసాన్ని, నిబద్ధతను పార్టీ గుర్తుంచుకొంటుందని చెప్పారు. -
డీసీసీబీ చైర్మన్ పీఠం మాదే:అమర్నాథ్ రెడ్డి
కడప : ఎర్రచందనం కేసులు పెడతామంటూ డీసీసీబీ చైర్మన్ ఎన్నికలో వైఎస్ఆర్ సీపీ డైరెక్టర్లను టీడీపీ లాక్కునే ప్రయత్నం చేస్తోందని పార్టీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్రెడ్డి ఆరోపించారు. వైఎస్ఆర్ సీపీకి అనుకూలంగా ఉన్న సొసైటీలపై అక్రమ కేసులు బనాయించి జైళ్లలో పెడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీ ఎన్ని కుయుక్తులు పన్నినా డీసీసీబీ చైర్మన్ పీఠం తామే దక్కించుకుంటామని అమర్నాథ్రెడ్డి స్పష్టం చేశారు. కాగా కోరం లేక డీసీసీబీ అధ్యక్ష ఎన్నిక ఆదివారానికి వాయిదా పడిన విషయం తెలిసిందే. -
కడప డీసీసీబీ అధ్యక్ష ఎన్నిక వాయిదా
కడప : అనుకున్నట్లుగానే అయ్యింది. డీసీసీబీ అధ్యక్ష ఎన్నిక వాయిదా పడింది. తగినంత కోరం లేకపోవటంతో ఎన్నికను అధికారులు ఆదివారానికి వాయిదా వేశారు. కాగా రేపు కోరం లేకున్నా చైర్మన్, కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక జరుగుతుందని ఎన్నికల అధికారి శనివారమిక్కడ తెలిపారు. మొత్తం 21మంది డైరెక్టర్లు ఉండగా వారిలో 11మంది డైరెక్టర్లు మాత్రమే ఉన్నారు. వారిలో టీడీపీ శిబిరంలో ఏడుగురు, వైఎస్ఆర్ సీపీ శిబిరంలో ఎనిమిదిమంది ఉన్నట్లు సమాచారం. కాగా డీసీసీబీ చైర్మన్ ఐ.తిరుపేలురెడ్డి పదవి రద్దు కావడంతో వైస్ చైర్మన్ ఆంజనేయులు యాదవ్ ఇన్చార్జ్గా బాధ్యతలు స్వీకరించారు. ఈలోగా అతని డైరెక్టర్ పదవిని రద్దు చేస్తూ అధికార యంత్రాంగం నిర్ణయించిన విషయం తెలిసిందే. -
టీడీపీ డెరైక్షన్.. కలెక్టర్ యాక్షన్!
► డీసీసీబీ చైర్మన్గిరి కైవసం దిశగా టీడీపీ ఎత్తులు ► మరో ఇద్దరు డెరైక్టర్ల పదవుల రద్దుకు రంగం సిద్ధం ► ఆగమేఘాలపై నిర్ణయాలు అమలు చేస్తున్న యంత్రాంగం సాక్షి ప్రతినిధి, కడప : అధికారాన్ని అడ్డుపెట్టుకుని డీసీసీబీ చైర్మన్ పీఠాన్ని కైవశం చేసుకోడానికి టీడీపీ స్క్రీన్ ప్లే, డెరైక్షన్లో జిల్లా కలెక్టర్ కె.వి రమణ యాక్షన్ను రక్తికట్టిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ నేతల కనుసైగతో ఆగమేఘాలపై ఆదేశాలు జారీ అవుతున్నాయి. ప్రస్తుతం ఇద్దరు డెరైక్టర్లను ఆ పదవిలోంచి తప్పించడానికి రంగం సిద్ధమైంది. వివరాల్లోకి వెళితే.. డీసీసీబీ చైర్మన్గా ఉన్న ఐ.తిరుపేలురెడ్డిని అధికార యంత్రాంగం అనూహ్యంగా పదవీచ్యుతున్ని చేసింది. నిబంధనలకు విరుద్ధంగా శరవేగంగా పావులు కదిపి ఆయన్ను పదవి నుంచి దింపారు. అధ్యక్షుడు అన్న కనీస విచక్షణ లేకుండా ఆగమేఘాలపై నిర్ణయాలను అమలు చేశారు. అదే పంధాను కొనసాగిస్తూ, సహకార శాఖ యాక్టులోని లొసుగుల ఆధారంగా మరి కొందరు డెరైక్టర్లును తొలగించేందుకు టీడీపీ నేతలు చురుగ్గా పావులు కదుపుతున్నారు. వారి నిర్ణయాలకు తగ్గట్టుగా అంతే వేగంగా కలెక్టర్ సైతం ఆదేశాలు జారీ చేస్తున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. కింది స్థాయి సిబ్బందికి సైతం అందుకు తగ్గట్టుగానే తర్పీదు ఇచ్చినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. అందులో భాగంగా కొన్ని రికార్డులను సైతం తొలగిస్తూ వారికి అనువుగా మలుచుకుంటున్నట్లు డీసీసీబీ డెరైక్టర్లు ఆరోపిస్తున్నారు. సింగిల్ విండో డెరైక్టర్గా ఉన్న వారిని డీసీసీబీ డెరైక్టర్గా నియమించవచ్చు. అయితే ఆయా సొసైటీల పరిధిలోని అధ్యక్షుడి నేతృత్వంలో ఆ మేరకు తీర్మానం చేసి ఉండాలి. అప్పట్లో ఆ నిబంధనల మేరకే పలువురు డెరైక్టర్లుగా ఎంపికయ్యారు. కాగా ప్రస్తుతం అధికార పార్టీ ఒత్తిడికి తలొగ్గిన కొందరు సిఈఓలు వారికి అనుగుణంగా రికార్డులు రూపొందిస్తున్నట్లు సమాచారం. ఆమేరకు అధికారిక ఉత్తర్వులు అందుతున్నట్లు తెలుస్తోంది. వేల్పుల, సరస్వతిపల్లె డెరైక్టర్లపై దృష్టి డీసీసీబీ చైర్మన్ పదవి నుంచి తిరుపేలురెడ్డిని తప్పించడంతో ఉపాధ్యక్షుడిగా ఉన్న ఎన్ ఆంజనేయులు యాదవ్ డీసీసీబీ అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టారు. టీడీపీ నేతల దృష్టి ప్రస్తుత అధ్యక్షుడు ఆంజనేయులు యాదవ్, సరస్వతిపల్లె సొసైటీ నుంచి డెరైక్టర్గా ఎంపికైనా ఓబులేసులపై పడింది. వీరద్దరూ అప్పట్లో నిబంధనల మేరకే డీసీసీబీ డెరైక్టర్లుగా ఎంపికయ్యారు. ప్రస్తుతం అధికార పార్టీకి చెందిన ఓ ఎంపీ జిల్లా కలెక్టర్తో నిర్వహించిన సమావేశం అనంతరం శరవేగంగా వారిని పదవి నుంచి తప్పించేందుకు శ్రీకారం చుట్టారని తెలుస్తోంది. ఆ మేరకు ఇద్దరు డెరైక్టర్లు నిబంధనల మేరకు ఎంపిక కాలేదని టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడం, వారి ఫిర్యాదుపై విచారణ చేపట్టాల్సిందిగా కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడం, 24 గంటలు గడవక మునుపే ఆయా సొసైటీల పరిధిలోని సీఈఓలు రికార్డులు అధికార పార్టీకి అనుగుణంగా ఇవ్వడం చకచకా చేపట్టినట్లు సమాచారం. ఇవన్నీ కలెక్టర్ కనుసన్నల్లోనే నడుస్తున్నాయని, పూర్తి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రాజకీయ పరమైన ఈ విషయాల్లో టీడీపీ జిల్లా అధ్యక్షుడి కంటే కలెక్టరే వేగంగా స్పందిస్తున్నారని వారు పేర్కొంటున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నారని డీసీసీబీ డెరైక్టర్లు ఆరోపిస్తున్నారు. చట్టంలోని లొసుగులను అనువుగా చూపి రికార్డులను మార్చడంలో సహకార శాఖ సిబ్బంది సైతం అండగా నిలుస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. అందుకు కారణం జిల్లా కలెక్టర్ కెవి రమణ తెరవెనుక ఆదేశాలేనని వైఎస్సార్సీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఆ ఇద్దరు డెరైక్టర్లను పద వి నుంచి తప్పించాల్సిందేనన్న కలెక్టర్ మౌఖిక ఆదేశాల కారణంగా అందుకు తగిన విధంగా రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ విషయమై కలెక్టర్ కెవి రమణను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులో లేరు. వ్యక్తిగత పనిపై సెలవులో విజయవాడకు వెళ్లినట్లు అధికారులు తెలిపారు. -
కుంభకోణం..రూ.9.3 కోట్లు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) పరిధిలోని దేవరకొండ బ్రాంచిలో జరిగిన కోట్లాది రూపాయల కుంభకోణం కథ క్లైమాక్స్కు చేరింది. మొత్తం రూ.9.3 కోట్ల కుంభకోణంలో కీలకపాత్ర పోషించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై జిల్లా సహకార అధికారి (డీసీఓ) సెక్షన్ 51 కింద చేపట్టిన విచారణ నివేదిక ఆధారంగా, ఇందుకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సహకార శాఖ రిజిస్ట్రార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు గత నెల 16న సహకార శాఖ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి డీసీఓకు సర్క్యులర్ నంబర్ 19567/2013-సీఆర్-2 పేరిట ఉత్తర్వులు వచ్చాయి. ఈ ఉత్తర్వుల్లో కుంభకోణ ంతో ప్రమేయం ఉందని 51 విచారణలో తేలిన 13 మందిపై క్రిమినల్ కేసులు పెట్టడంతోపాటు 21మంది ఉద్యోగులపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. క్రిమినల్ కేసుల విషయంలో కలెక్టర్ అనుమతి తీసుకుని ముందుకెళ్లాలని, అదే విధంగా రిజిస్ట్రార్ నుంచి వచ్చిన సమీక్ష ఉత్తర్వులను, డీసీఓ విచారణ నివేదికను డీసీసీబీ జనరల్ బాడీ, ప్రత్యేక జనరల్ బాడీ సమావేశాన్ని ఏర్పాటు చేసి నెలరోజుల్లోపు ఆమోదం పొందాలని సూచించింది. ఈ కుంభకోణంలో బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునేందుకు జాయింట్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావుకు అధికారాలు కట్టబెట్టింది. అసలేం జరిగిందంటే.. దేవరకొండ బ్రాంచి పరిధిలోని దేవరకొండ, పీఏపల్లి, తిమ్మాపూర్, చితిర్యాల, కొండమల్లేపల్లి, డిండి, తౌక్లాపూర్ ప్రాథమిక సహకార పరపతి సంఘాల్లో రైతులకు రుణాలిచ్చే విషయంలో పెద్దఎత్తున అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. 2010 నుంచి 2014 వరకు ఆయా సొసైటీల చైర్మన్లు, సీఈఓలు, బ్యాంకు ఉద్యోగులు కుమ్మక్కై మొత్తం 12.33 కోట్ల రూపాయలు కాజేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై సహకార చట్టంలోని సెక్షన్ 51 కింద డీసీఓ విచారణ జరిపి సహకార శాఖ రిజిస్ట్రార్కు నివేదిక పంపారు. ఈ నివేదికలో బోగస్ టైటిల్ డీడ్లు, నకిలీ పాసు పుస్తకాల మీద రుణాలిచ్చారని, చనిపోయిన వారికి, నివాసేతరులకు, విదేశాల్లో ఉంటున్న వారికి కూడా రుణాలు మంజూరు చేశారని నివేదికలో పేర్కొన్నారు. అసలు రుణాలు ఎవరి పేరు మీద తీసుకున్నారో వారికి తన పేరు మీద రుణం తీసుకున్నట్టు కూడా తెలియదని కూడా తేలింది. ఇందుకు బాధ్యులైన వారి పేర్లను తెలియజేస్తూ వీరిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిని సమీక్షించిన సహకార శాఖ ఇన్చార్జ్ రిజిస్ట్రార్ ఎం.సురేందర్ ఈ నివేదిక ప్రకారం బాధ్యులపై చర్యలను సిఫారసు చేస్తూ గతనెల 16న సమీక్ష ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని రకాల చర్యలకూ సిఫారసు ఈ ఉత్తర్వుల ప్రకారం కుంభకోణంలో బా ధ్యులైన వారిపై క్రిమినల్,శాఖా పరమైన చర్య లు తీసుకోవాలని సహకార శాఖ రిజిస్ట్రార్ సురేందర్ జిల్లా సహకార అధికారిని ఆదేశించారు. మొత్తం 13 మందిపై క్రిమినల్, 21 మంది ఉద్యోగులపై శాఖా పరమైన చర్యలకు సిఫారసు చేశారు. వీరినుంచి మొత్తం 9.27 కోట్ల రూపాయలను రికవరీ చేయాలని, రికవరీ చేసే నాటికి 12 శాతం వడ్డీతో సహా రా బట్టాలని సూచించారు. అవసరమైతే ఈ కుంభకోణంలో బాధ్యులైన వారి ఆస్తులను కూడా అటాచ్ చేసుకోవాలని సూచించారు. ఈ సమీక్ష ఉత్తర్వుల ప్రకారం జిల్లా కలెక్టర్ను సంప్రదించి ఎలా ముందుకెళ్లాలన్నది అనుమతి తీసుకోవాలని సూచించారు. అదే వి ధంగా విచారణ నివేదికతోపాటు సమీక్ష ఉత్తర్వులను కూడా డీసీసీబీ బోర్డు మీటింగ్లో ఆమోదం తీసుకుని ముందుకెళ్లాలని తెలి పా రు. ఆయా సొసైటీల్లో బోగస్ రుణాలుగా తేలి న 9.27 కోట్ల రూపాయల మేర పంటరుణాల కు రుణమాఫీని కూడా వర్తింపజేయవద్దని సొ సైటీల మేనేజింగ్ కమిటీలను ఆదేశించింది. పాస్ పుస్తకాలు తెప్పించండి.. దేవరకొండ, పీఏపల్లి, తిమ్మాపూర్, చితిర్యాల, కొండమల్లేపల్లి, డిండి, తౌక్లాపూర్ పరిధిలో అక్రమంగా రుణాలు తీసుకున్న వారి పాసు పుస్తకాలు, టైటిల్డీడ్లు తిరిగి స్వాధీనం చేసుకోవాలని ఆయా సొసైటీల మేనేజింగ్ కమిటీలను సహకార రిజిస్ట్రార్ ఆదేశించారు. ఈ ఏడాది మార్చి 15లోగా వీటిని తెప్పించాలని, ఆయా సొసైటీలను సమన్వయం చేసుకుని ఆయా పుస్తకాలను తెప్పించే బాధ్యతను జిల్లా సహకార అధికారి తీసుకోవాలని, ఈ విషయంలో ఎలాంటి ప్రగతి సాధించారో పాసుపుస్తకాలు, టైటిల్డీడ్ల వారీగా ప్రతి 15 రోజులకు ఒకసారి నివేదికను పంపాలని సూచించారు. అదే విధంగా ఈ ఏడాది మార్చి 15లోపు పాసుపుస్తకాలు, టైటిల్డీడ్లను స్వాధీనం చేసుకోని పక్షంలో డీసీసీబీ బ్రాంచి మేనేజర్తో పాటు ఆయా సొసైటీల అధ్యక్షులు, సీఈవోలను బాధ్యులను చేసి దుర్వినియోగమైన రూ.9.27 కోట్ల రూపాయలను వారి నుంచి రాబట్టాలని, క్రిమినల్, సివిల్ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరి, సహకార రిజిస్ట్రార్ సమీక్ష ఉత్తర్వులు ఏ మేరకు అమలవుతాయనేది వేచి చూడాల్సిందే. -
అవిశ్వాసానికి రెడీ
జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) అధ్యక్షుడిపై అవిశ్వాసం పెట్టే విషయంలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు మరింత దూకుడు పెంచారు. మెజార్టీ డెరైక్టర్ల మద్దతు కూడగట్టిన నాయకులు అధిష్టానం ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు. దాదాపు ఈ నెలాఖరుకు గంగాధర్ పట్వారీని ‘సహకార’ పీఠం నుంచి దించేందుకు రంగం సిద్ధమవుతోంది. మరోవైపు ఈ గండం నుంచి గట్టెక్కేందుకు పట్వారీ సకల యత్నాలు చేస్తున్నారు. ⇒ సీఎం పేషీకి డీసీసీబీ వ్యవహారం ⇒ కేసీఆర్ ఆదేశాల కోసం ఎదురుచూపు ⇒ టీఆర్ఎస్ ఖాతాలో మెజారిటీ డెరైక్టర్లు ⇒ జిల్లా నేతలంతా ఏకతాటి పైకి ⇒ నెలాఖరులోగా గంగాధర్ పీఠానికి ఎసరు ⇒ స్వీయ రక్షణ యత్నాలలో పట్వారీ ⇒ సంపూర్ణ విజయం దిశగా గులాబీ దళం సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఇందూరు సహకార రాజకీయం ఊపందుకుంటోంది. 2103 ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికలలో నాలుగైదు స్థానాలకు పరిమితమైన టీఆర్ఎస్ డెరైక్టర్ల సంఖ్య, ఇటీవల 15కు చేరింది. ఈ విషయంలో జిల్లాకు చెందిన శాసనసభ్యులందరూ ఏకతాటిపైకి వచ్చారని తెలుస్తోంది. నేతలంతా కలిసి, ఢిల్లీ పర్యటనకు వెళ్లే ముందు డీసీసీబీ అధ్య క్షుడిపై అవిశ్వాసం పెట్టే విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అనంతరం అధినేత మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి, విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డితో ప్రత్యేకంగా మాట్లాడినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో గంగాధర్ పట్వారీపై అవిశ్వాసం పెట్టే విషయమై త్వరలోనే నిర్ణయం తీసుకుంటారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో డీసీసీబీ ప్రస్తుత అధ్యక్షుడు స్వీయ రక్షణలో పడిపోయారు. ఎలాగైనా గండం నుంచి గట్టెక్కే ప్రయత్నాలు మొదలెట్టారు. అప్పుడంతా అనుకూలం 2013 ఫిబ్రవరిలో జరిగిన డీసీసీబీ ఎన్నికలలో బోధన్ నుంచి గెలుపొం దిన గంగాధర్ పట్వారీకి అప్పుడున్న రాజకీయ పరిస్థితులు పూర్తిగా అనుకూలించాయి. కానీ, తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు తర్వాత పరిస్థితులు పూర్తిగా మారాయి. సాధారణ ఎన్నికలలో ఘన విజయాన్ని అందుకున్న టీఆర్ఎస్ అనంతరం నగర కార్పొరేషన్, జడ్పీ, మున్సిపాలిటీ పదవువులను దక్కించుకుంది. అప్పట్లో జరిగిన డీసీసీబీ ఎన్నికలలో మొత్తం 20 మంది డెరైక్టర్లకుగాను 11 మంది కాంగ్రెస్, ఐదుగు రు వైఎస్ఆర్ సీపీ, నలుగురు టీఆర్ఎస్కు చెందినవారు ఎన్నికయ్యా రు. కాంగ్రెస్ పార్టీకి చెందిన గంగాధర్ పట్వారీకి అధ్యక్ష పదవి దక్కిం ది. జిల్లాలో దాదాపుగా అన్ని పదవులను సాధించుకున్న ఇపుడు డీసీసీబీపై కన్నేసి, ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఎట్టకేలకు మె జారిటీ సభ్యుల మద్దతును కూడగట్టుకుంది. సీఎం కేసీఆర్ ఆమోదమే తరువాయి. ఆయన ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన రెండు మూడు రోజు లలో నిర్ణయం ఉంటుందని భావిస్తున్నారు. దాదాపుగా ఈ నెలాఖరులోగా ఆవిశ్వాసం పెట్టాలని జిల్లా నేతలు యోచిస్తున్నట్లు తెలిసింది. గద్దెనెక్కేది ఎవరో! డీసీసీబీ అధ్యక్ష స్థానంపై కన్నేసిన టీఆర్ఎస్ గంగాధర్ పట్వారీ అవిశ్వాసం మోపేందుకు సిద్ధమవుతుండటం రాజకీయవర్గాలలో చర్చనీయాంశంగా మారింది. జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఈ మే రకు డీసీసీబీ డెరైక్టర్ల సమీకరణలో తమ శక్తియుక్తులను ప్రదర్శించడం, ఉన్న ఒక్క జిల్లాస్థాయి డీసీసీబీ చైర్మన్ పదవిని కూడా తమ ఖాతాలో కలుపుకునేందుకు వేదికను రూపొందించింది. దీంతో ఇందూరు రాజ కీయం రసకందాయంలో పడింది. సంపూర్ణ విజయం కోసం గులాబీదళం తహతహలాడుతోంది. అవిశ్వాసం నెగ్గిన తర్వాత టీఆర్ఎస్ నుంచి చైర్మన్ అభ్యర్థి ఎవరన్న అంశంపై కూడ నేతల సమీకరణలు మొదలయ్యాయి. ఎల్లారెడ్డి, ఆర్మూరు, బాన్సువాడ నియోజకవర్గాలకు చెందిన ముగ్గురు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా, డీసీసీబీ డైరక్టర్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్నవారి పేర్లు, వారు ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘాల వివరాలు ఇలా ఉన్నాయి. -
డీసీసీబీలో చోరీకి విఫలయత్నం
ఆమనగల్లు : పట్టణంలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ)లో దుండగులు శనివారం రాత్రి దోపిడీకి విఫలయత్నం చేశారు. బ్యాంకు వెనుకవైపు ఉన్న గ్రిల్స్ను పగులగొట్టి దొంగలు లోపలికి ప్రవేశించినా దోచుకునేందుకు వారు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. షాద్నగర్ డీఎస్పీ ద్రోణాచార్యుల కథనం మేరకు.. శనివారం రాత్రి దొంగలు స్థానిక ప్రధాన రహదారిపై ఉన్న డీసీసీబీ వెనుక వైపు నుంచి కిటికీ గ్రిల్స్ను తొలగించి బ్యాంకు లోపలికి ప్రవేశించారు. పథకం ప్రకారం వారు బ్యాంకు లోపల ఉన్న సీసీ కెమెరాలను తొలగించి, ఆటోమెటిక్ అలారం వైర్ను కట్చేశారు. అనంతరం బ్యాంకు లాకర్ రూమ్ను తెరిచేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో వారు తిరిగి వెళ్లారు. ఆదివారం ఉదయం బ్యాంకు వెనుకవైపు ఉన్న ఖాళీ స్థలంలో షటిల్ ఆడేందుకు వచ్చిన యువకులు బ్యాంకు గ్రిల్స్ను తొలగించినట్లు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. సీఐ వేణుగోపాల్రెడ్డి, ఎస్ఐ సాయికుమార్, రెండో ఎస్ఐ వెంకట్రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. బ్యాంకు మేనేజర్ దమయంతి సమాచారం అందించడంతో ఆమె అక్కడికి చేరుకున్నారు. బ్యాంకు తాళాలు తీసి లోపల తనిఖీలు చేయగా ఎలాంటి చోరీ జరగలేదని మేనేజర్ దమయంతి పేర్కొన్నారు. కాగా బ్యాంకు సమీపంలోని అటవీ కార్యాలయం పక్కన ఐదు కిలోల గ్యాస్ సిలిండర్, కొన్ని పరికరాలను చిత్తుకాగితాలు ఏరుకునే రాములమ్మ గుర్తించి పోలీసుల దృష్టికి తెచ్చింది. షాద్నగర్ డీఎస్పీ ద్రోణాచార్యులు సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామన్నారు. దొంగలు బ్యాంకులోకి ప్రవేశించినప్పటికి ఎలాంటి చోరీ జరగలేదని ఆయన వివరించారు. ఆధారాల సేకరణ బ్యాంకులో చోరీకి సంబందించి జిల్లా కేంద్రం నుంచి వచ్చిన క్లూస్టీం సభ్యులు ఆధారాలు సేకరించారు. అలాగే జిల్లా కేంద్రం నుంచి వచ్చిన డాగ్స్క్వాడ్ బృందం ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించగా, జాగిలం సంఘటన స్థలం నుంచి నేరుగా బస్టాండ్ వరకు వెళ్లి తిరిగి బ్యాంకు వద్దకు చేరింది. ఖాతాదారుల్లో కలవరం డీసీసీబీలో దొంగతనం సంఘటన ఆమనగల్లులో కలకలం సృష్టించింది. బ్యాంకులో చోరీ జరిగిందనే వార్త తెలుసుకున్న ఖాతాదారులు పెద్ద సంఖ్యలో బ్యాంకు వద్దకు చేరుకుకున్నారు. అయితే ఎలాంటి చోరీ జరగకపోవడంతో చాలామంది ఊపిరి పీల్చుకున్నారు. -
అన్నదాత మెడపై బకాయి కత్తి!
ఎల్టీ రుణాల వసూలుకు డీసీసీబీ ఒత్తిళ్లు బకాయిలు చెల్లించాలని నోటీసులు జారీ ముగిసిన వన్టైం సెటిల్మెంట్ గడువు పంటలు చేతికొస్తున్న వేళ కర్షకులకు కష్టాలు దీర్ఘకాలిక (ఎల్టీ) పంట రుణాల బకాయిల వసూలుకు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) రైతులపై ఒత్తిడి తీసుకువస్తోంది. నిర్దేశించిన గడువులోగా బకాయిలు చెల్లించనిపక్షంలో న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు డీసీసీబీ అధికారులు సన్నద్ధమవుతున్నారు. దీనికోసం కార్యాచరణ ప్రణాళికను సైతం సిద్ధం చేశారు. రూ.కోట్లలో ఎల్టీ రుణాలు పేరుకుపోవడంతో వసూలుకు ఒత్తిడి తీసుకురాక తప్పడంలేదని వారంటున్నారు. కందులు, పత్తి, వేరుశనగ, శనగ పంటలు ఇప్పుడిప్పుడే చేతికొస్తున్న తరుణంలో ఈ పరిణామం అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తోంది. - తాండూరు తాండూరు: దీర్ఘకాలిక (ఎల్టీ) పంట రుణాలు తీసుకున్న రైతులపై బకాయి చెల్లించాలంటూ డీసీసీబీ ఒత్తిడి పెంచుతోంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. డిసెంబర్ 31తో వన్టైం సెటిల్మెంట్ కింద రాయితీతో బకాయిల చెల్లింపునకు గడువు ముగియడంతో బ్యాంకు అధికారులు వసూలుకు సిద్ధమయ్యారు. తమకు కొంత గడువు ఇస్తే బకాయిలు చెల్లిస్తామని రైతులు చెబుతున్నారు. ఇప్పటికే బకాయిల వసూలుకు నోటీసులు జారీ చేసిన అధికారులు మరికొంత గడువు ఇవ్వడంపై ససేమిరా అంటుండటంతో అన్నదాతలు చిక్కుల్లో పడ్డారు. డీసీసీబీ పరిధిలో ఎల్మకన్నె, తట్టేపల్లి, యాలాల, నవాంద్గీ సహకార సంఘాలు ఉన్నాయి. ఈ నాలుగు సంఘాల పరిధిలో 1,279 మంది రైతులు ట్రాక్టర్లు, గేదెలు, బోరు మోటార్ల కోసం ఎల్టీ రుణాలు తీసుకున్నారు. 2008 నుంచి ఇప్పటి వరకు 12 శాతం వడ్డీతో కలుపుకొని సుమారు రూ.6,97,50,000 బకాయిలు పేరుకుపోయాయి. వాయిదాలపై అదనంగా మరో 12 శాతం వడ్డీ వేసే ఆలోచనలో కూడా అధికారులు ఉన్నారు. దీంతో రైతులపై బకాయి భారం మరింత పెరగనుంది. అసలులో 35 శాతం, వడ్డీలో 35 రాయితీతో మొత్తం రైతుల్లో 162 మందికి వన్టైం సెటిల్మెంట్ కింద బకాయిలు చెల్లించేందుకు గత డిసెంబర్ 31 వరకు గడువు ఇచ్చారు. ఒక్కో రైతు ఎంతలేదన్న రూ.1-2లక్షల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. పంటలు చేతికొస్తున్న తరుణంలో అంత డబ్బు లేక గడువులోపు బకాయిలను చెల్లించలేకపోయారు. దీంతో వడ్డీ సహా మొత్తం బకాయిలను వసూలు చేయాలని బ్యాంకు అధికారులు సన్నద్ధమయ్యారు. ప్రత్యేకంగా సూపర్వైజర్ నియామకం బకాయిల వసూలుకు ప్రత్యేకంగా ఓ సూపర్వైజర్ను కూడా నియమించనున్నారు. అతను గ్రామాల్లో పర్యటించేందుకు జీపును సైతం కేటాయించనున్నారు. మార్చి 31 వరకు బకాయిలు చెల్లించకపోతే సదరు రైతులపై కో-ఆపరేటివ్ చట్టం ప్రకారం న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని బ్యాంకు అధికారులు నిర్ణయించారు. బకాయిల వసూలు వ్యవహారంలో అధికారులు కచ్చితంగా ఉండటంతో రైతులు దిగాలు చెందుతున్నారు. రూ.లక్షల్లో బకాయిలను ఎలా చెల్లించాలని మథనపడుతున్నారు. కొంత గడువు ఇస్తే ఎలాగో బకాయిలు చెల్లిస్తామని.. ఈ విషయంలో ప్రభుత్వం, సంబంధిత అధికారులు చొరవ చూపాలని రైతులు కోరుతున్నారు. -
డీఛీఛీబీ
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఇంటిపేరు కస్తూరి వారు..ఇల్లంతా గబ్బిలాల కంపు అన్నట్టు ఉంది జిల్లాలో డీసీసీబీ(జిల్లా కేంద్ర సహకార బ్యాంకు) పరిస్థితి. నమ్మకమే పెట్టుబడిగా ఈ బ్యాంకులో ఇన్నాళ్లూ లావాదేవీలు జరిగాయి. ప్రజలకు చెందిన కోట్లాది రూపాయల డిపాజిట్లు ఇందులో ఉన్నాయి. జిల్లాలోని రైతులకు వెన్నుదన్నుగా నిలిచింది. దానిపై ఆధారపడి సుమారు రూ.350మంది ఉద్యోగులు ఉన్నారు. ఇదంతా గతం. అయితే బ్యాంకు వ్యవహారాల్లో మాత్రం ఎప్పుడూ అంత పారదర్శకత కనిపించడం లేదు. తరచూ అక్రమాల ఆరోపణలతో వార్తల్లోకి వస్తోంది. దీనికంతటికీ ఇక్కడ కేంద్రంగా తిష్ఠ వేసిన రాజకీయ పక్షాలు, వాళ్ల ఇష్టారాజ్యమే కారణమన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఫిర్యాదులొచ్చినప్పుడు సంబంధిత శాఖల ఉన్నత స్థాయి వర్గాలు విచారణ చేసి వీరికి భయపడి చేతులు దులిపేస్తున్నాయి తప్పిస్తే..విచారణలో తేలిన అక్రమాలను బహిర్గతం చేయడం లేదు. ఇక అక్రమార్కులపై చర్యలు సరేసరి. డీసీసీబీలో పలు అక్రమాలు జరుగుతున్నట్లు విజయనగరానికి చెందిన హరోన్ రషీద్ అనే వ్యక్తి నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్, ఆప్కాబ్ మేనేజింగ్ డెరైక్టర్కు 2013డిసెంబర్లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై ఆప్కాబ్ చీఫ్ జనరల్ మేనేజర్ (విజిలెన్స్)తో ప్రాథమిక విచారణ చేయించారు. ఈ ప్రాథమిక విచారణలో గుర్తించిన అంశాలతో విచారణాధికారి నివేదిక ఇచ్చారు. అందులో పలు అవినీతి అభియోగాలను పొందుపరిచారు. -
డీసీసీబీపై విచారణ తప్పదా ?
* ఏ క్షణంలోనైనా ఆదేశాలు వచ్చే అవకాశం ఉందంటున్న సహకార వర్గాలు * అక్రమాలు జరిగాయంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదుల వెల్లువ * వాటికి తోడైన సొసైటీల్లో బినామీ రుణాల వ్యవహారం సాక్షి ప్రతినిధి, విజయనగరం: జిల్లాలో దాదాపు 23 సొసైటీల్లో విచారణలు జరిగాయి. వాటిలో జరిగిన అక్రమాలు వెలుగు చూశాయి. మిగతా సొసైటీలు కూడా చాలావరకు ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. కాకపోతే గతంలో జిల్లాలో ఓ కీలక నేత అండగా ఉండడంతో వాస్తవాలు బయటకు రాలేదు. ఆ నేత ఇప్పుడు మాజీ అయ్యారు. దీంతో లొసుగులు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. ఇంతలా అవినీతి జరిగిందంటే సొసైటీలకు ఫైనాన్స్ బ్యాంకింగ్గా ఉన్న డీసీసీబీ ప్రమేయం కూడా ఉండొచ్చనే వాదన విన్పిస్తోంది. డీసీసీబీలో కూడా అదే తరహా అక్రమాలు జరిగాయని, ఇష్టమొచ్చినట్టు రుణాలు మంజూరు చేశారని, బినామీల పేరుతో రుణాలు కాజేశారని, పీఏసీఎస్లకు అదనంగా ఫైనాన్స్ ఇచ్చేందుకు పెద్ద ఎత్తున పర్సంటేజీలు చేతులు మారాయని, స్టేషనరీ, ఫర్నీచర్, కంప్యూటర్ల కొనుగోలులో అక్రమాలు జరిగాయని, నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగుల నియామకాలు చేపట్టారని, దినసరి వేతన కార్మికుల నియామకాల్లో చేతివాటం ప్రదర్శించారని, ఇవ్వకుండానే రికార్డుల్లో కన్స్యూమర్ డ్యూరబుల్ రుణాలు ఇచ్చినట్టు నమోదు చేశారని, అంచనాలకు మించి పార్వతీపురం, చీపురుపల్లి జిల్లా కేంద్ర సహకార బ్రాంచ్ల భవన నిర్మాణాలకు ఖర్చు పెట్టారన్న ఆరోపణలొచ్చాయి. వీటిపై అప్పట్లో హైదరాబాద్కు చెందిన డిప్యూటీ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ హోదాలో పనిచేస్తున్న ఇద్దరు ఆప్కాబ్ అధికారులు, నాబార్డు నుంచి ఒక ప్రతినిధి సంయుక్తంగా ఇక్కడికొచ్చి విచారణ చేశారు. వీరితో పాటు సమాంతరంగా విజిలెన్స్ అధికారులు కూడా విచారణ చేపట్టారు. ఉన్నతాధికారులకు నివేదిక కూడా ఇచ్చారు. కాకపోతే, దానిపై చర్యలు తీసుకోకుండా అప్పట్లో ఓ నేత అడ్డుకున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఆదాయ పన్ను ఆడిట్ చేసేందుకు గాను చార్టెడ్ అకౌంటెంట్కు రూ.55లక్షలను డీసీసీబీ అడ్డగోలుగా చెల్లించింది. దీనివెనుక కుతంత్రం ఉందని, చార్టెడ్ అకౌంటెంట్కు ఆ మొత్తం పూర్తిగా అందలేదని, డీసీసీబీకి చెందిన పలువురు పెద్దలకు అందులో కొంత సొమ్ము చేరిందని ఆరోపణలొచ్చాయి. నాబార్డ్, ఆప్కాబ్ అధికారులకు ఫిర్యాదులు కూడా వెళ్లాయి. దీనిపై విచారణ జరిపిన నాబార్డు, ఆప్కాబ్ అధికారులు జరిగిన తప్పును గుర్తించారు. అనవసరంగా చార్టెడ్ అకౌంటెంట్కు రూ.55లక్షలు చెల్లించారని, ఘోర తప్పిదమని తేల్చారు. సత్వరమే రికవరీ చేయాలని ఆదేశించారు. దీంతో చేసేదేమీ లేక చార్టెడ్ అకౌంటెంట్ నుంచి ఆ మొత్తాన్ని డీసీసీబీ అధికారులు రికవరీ చేశారు. కానీ, బాధ్యులైన వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోలేదు. దీని వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయన్న ఆరోపణలొచ్చాయి. నాటి కీలక నేత లక్ష్యంగా ఫిర్యాదులు: ఈ వ్యవహారాలన్నింటినీ ఇప్పుడు కొందరు తవ్వుతున్నారు. ఆ ఆరోపణలనే ఉన్నతాధికారులకు ఫిర్యాదు రూపంలో పంపిస్తున్నారు. ప్రత్యక్షంగా డీసీసీబీపై ఉన్న ఆరోపణలు, మరోవైపు సొసైటీల్లో వెలుగు చూస్తున్న అక్రమాలు దృష్ట్యా లోతుగా విచారణ చేపడితే వాస్తవాలు బయటికొస్తాయని ఫిర్యాదుల్లో పేర్కొంటున్నారు. ఆ దిశగా ఉన్నత స్థాయి వర్గాలు కూడా దృష్టి సారిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే నాటి కీలక నేతను లక్ష్యంగా చేసుకుని టీడీపీ నేతలు పావులు కదుపుతూ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ఏ క్షణంలోనైనా సొసైటీలతో పాటు డీసీసీబీపై కూడా విచారణ చేపట్టే అవకాశం ఉందని భోగట్టా. -
బిగుసుకున్న ఉచ్చు !
సాక్షి ప్రతినిధి, విజయనగరం :డీసీసీబీ చైర్పర్సన్ మరిశర్ల తులసీకి బినామీ రుణాల ఉచ్చు బిగుసుకుందా? ఆమె చిక్కుల్లో పడ్డారా? రావివలస పీఏసీఎస్ (ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి) డెరైక్టర్లకు కష్టాలు తప్పవా? అధికారులు తీసుకుంటున్న చర్యలతో ఈ బినామీ రుణాల బాగోతం బయటపడనుందా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. రికార్డుల్లో పేర్కొన్న ప్రకారం రుణం తీసుకున్నారా? లేదా? అని ఈనెల 16న రావివలస సొసైటీ వద్దకొచ్చి తమ ముందు చెప్పాలని నాలుగు రోజులుగా విచారణాధికారి, పార్వతీపురం డిప్యుటీ రిజిస్ట్ట్రార్ పి.చిన్నయ్య నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ నోటీసులందుకున్నాక రుణగ్రహీతలు ఆశ్చర్యానికిలోనై తాము అంత మొత్తంలో రుణం తీసుకోలేదని కొందరు, అసలు రుణమే తీసుకోలేదని మరికొందరు పీఏసీఎస్ వద్దకొచ్చి అధికారుల వద్ద మొర పెట్టుకుంటున్నారు. ఈ బకాయిలను ఎవరు చెల్లిస్తారో చెప్పాలని పలువురు బాధితులు బుధవారం సీఈఓ సీహెచ్ సింహచలాన్ని నిలదీశారు. సెంటు భూమి లేనివారి పేరున రూ. 75 వేలు, ఒకే ఇంటిలో కుటుంబ సభ్యులందరి పేరున చెరో రూ. 75 వేలు, చనిపోయిన వారి పేరున రూ.75 వేలు, వలస వెళ్లినవారి పేరున రూ.75 వేలు ఎలా మంజూరు చేశారని ప్రశ్నించారు. ఇలా రుణ గ్రహీతల జాబితాలో ఉన్న వారంతా తిరగబడుతున్నారు. దీంతో గ్రామంలో కలకలం రేగింది. ఇప్పటి వరకు రుణగ్రహీతల వివాదమే నడుస్తుండగా ఇప్పుడా వివాదానికి కారకులగా ఆరోపణలు ఎదుర్కొంటున్న డెరైక్టర్ల వంతు వచ్చింది. సొసైటీ ప్రతినిధుల ఆస్తుల క్రయ,విక్రయాల రిజిస్ట్రేషన్లకు బ్రేక్ సెక్షన్ 51ప్రకారం విచారణ జరుగుతున్న నేపథ్యంలో వాస్తవమేంటో తేలనుంది. ఒకవేళ బినామీ రుణాలు తీసుకోవడం వాస్తవమని తేలితే బాధ్యులైన వారిపై ఆర్థిక పరమైన చర్యలు తీసుకోవల్సి ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణాధికారి చిన్నయ్య మరిన్ని చర్యలు తీసుకున్నారు. బినామీల రుణాల ఆరోపణల నేపథ్యంలో 2012కి ముందు, 2012తర్వాత రావివలస సొసైటీ పాలక వర్గం సభ్యులు, సిబ్బందికి సంబంధించిన ఆస్తుల క్రయ, విక్రయాల రిజిస్ట్రేషన్లను నిలిపేయాలని పార్వతీపురం, కురుపాం సబ్ రిజిస్ట్రార్లకు ఆదేశాలు జారీ చేశారు. డెరైక్టర్లగా పనిచేసి, పని చేస్తున్న 22 మందికి, సొసైటీలో పనిచేస్తున్న మరో ఐదుగురు సిబ్బందికి ఈ ఉత్తర్వులు వర్తింపచేశారు. ఆ సొసైటీ అధ్యక్షురాలు, ప్రస్తుత డీసీసీబీ చైర్మన్ మరిశర్ల తులసీ, డెరైక్టర్లుగా కొనసాగిన దూడి గుంపస్వామి, మంత్రపూడి జగ్గునాయుడు, బొత్స అప్పలస్వామి, మర్రాపు సత్యనారాయణ, గుంట్రెడ్డి వెంకటనాయుడు, గంటా తాతబాబు, ఏగిరెడ్డి రామునాయుడు, రెడ్డి అప్పలనర్సమ్మ, మూడడ్ల నాగమణి, అక్కెన కృష్ణంనాయుడు, గొట్టాపు శ్రీరాములు, మారుకొండ సీతంనాయుడు, మరిశర్ల అప్పలనాయుడు, గుంట్రెడ్డి సూర్యప్రభావతి, కుప్పిలి బంగారమ్మ, గుల్ల సూర్యనారాయణ, వానపల్లి సత్యనారాయణ, గాడి అప్పల స్వామినాయుడు, ముడిద అప్పలనర్సమ్మ, గంటా రత్నాలమ్మ, జామి రమణమ్మలకు సంబంధించిన ఆస్తుల క్రయ, విక్రయాల రిజిస్ట్రేషన్లు చేయరాదని సబ్ రిజిస్ట్రార్లను కోరారు. సొసైటీ ముఖ్య కార్య నిర్వాహక అధికారి చింతల సింహాచలం, అకౌంటెంట్ గొల్లపల్లి ముసలినాయుడు, గుమస్తాలు మర్రాపు వేణుగోపాలనాయుడు, గంటా మాధవనాయుడు ఆస్తుల క్రయ, విక్రయాల రిజిస్ట్రేషన్లు కూడా విచారణ ముగిసే వరకు నిలిపేయాలని ఆదేశాల్లో పేర్కొన్నట్టు అసిస్టాంట్ రిజిస్టార్ రామకృష్ణ ‘సాక్షి’కి తెలిపారు. ఆస్తులపై ఆరా డెరైక్టర్లగా పని చేసి, పని చేస్తున్న 22 మందితో పాటు ఐదుగురు సిబ్బంది ఆస్తులపై కూడా ఆరా తీస్తున్నారు. వారికి ఎక్కడెక్కడ ఆస్తులున్నాయో తెలుసుకునే పనిలో పడ్డారు. ఈ మేరకు గరుగుబిల్లి తహశీల్దార్కు విచారణాధికారి ప్రత్యేక లేఖ రాశారు. తాము సూచించిన వ్యక్తుల స్థిర, చరాస్థులకు సంబంధించిన వివరాలు సమర్పించాలని కోరారు. ఆ మేరకు ఆస్తులపై నిఘా పెట్టి, ఒక వేళ బాధ్యులని తేలితే ఆర్థిక పరమైన చర్యలు తీసుకోనున్నారు. -
‘మాఫీ’ నిర్లక్ష్యంపై.. ‘ధర్నా’కోలా
ఒకపక్క పగబట్టిన ప్రకృతి.. మరోపక్క ఏమీ పట్టని సర్కారు.. వెరసి రైతన్నలకు పుట్టెడు కష్టాలు. రుణమాఫీ నాటకంతో వ్యవసాయమే పితలాటకంగా మారింది. బ్యాంకుల్లో పాత బకాయిలకు వడ్డీ పెరిగిపోయి, పంటల బీమా వర్తించక, కొత్త అప్పులు పుట్టక ఈ ఖరీఫ్ సాగుకు రైతాంగం అష్టకష్టాలు పడింది. ఎలాగో ప్రైవేటుగా పెట్టుబడులు సమకూర్చుకొని సాగుకు సిద్ధపడిన రైతులను సుడిదోమ, ఎండుతెగులు దెబ్బతీశాయి. దిగుబడి దారుణంగా పడిపోతుందని ఆందోళన చెందుతున్న ఈ దశలో రుణాలను చెల్లించని రైతుల ఆస్తులను జప్తు చేయాలని, వారిపై దావాలు వేయాలని డీసీసీబీ నిర్ణయించింది. ఈ పరిస్థితుల్లో రైతులకు అండగా నిలిచి సర్కారు తీరును ఎండగట్టేందుకు బుధవారం అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించాలని వైఎస్సార్ సీపీ నిర్ణయించింది. సాక్షి ప్రతినిధి, ఏలూరు : పశ్చిమ రైతుపై ప్రభుత్వమే కాదు ప్రకృతి కూడా కక్ష కట్టినట్టుంది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చివరి దశకు చేరుకున్న తరుణంలో సుడిదోమ, ఎండుతెగులు దెబ్బకు అన్నదాత విలవిల్లాడిపోతున్నాడు. రుణమాఫీ జాప్యం.. ఈ సాకుతో బ్యాంకర్లు కొత్త రుణాలు ఇవ్వకపోవడం వెరసి ప్రైవేటు అప్పులే పెట్టుబడిగా సాగు చేసిన రైతుకు చివరకు కన్నీళ్ల దిగుబడే మిగులుతోంది. ఈ దశలో సాయం చేయాల్సిన సర్కారు కనీస కనికరం లేకుండా పంట రుణాలను తక్షణమే చెల్లించాలంటూ కొరడా ఝుళిపిస్తోంది. ఇక జిల్లా సహకార కేంద్రబ్యాంకు (డీసీసీబీ) ఏకంగా రుణాలు చెల్లించని వారిపై దావాలు వేయాలని, అవసరమైతే ఆస్తులు జప్తు చేయాలని సొసైటీలకు ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో రైతన్నలకు అండగా నిలవాలన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుతో పార్టీ శ్రేణులు బుధవారం జిల్లావ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టనున్నాయి. పరిహారం అడిగే నాధుడెక్కడ? రైతులకు కొత్త రుణాలు లభించని ఫలితంగా జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో సాగు భారీగా తగ్గింది. ఖరీఫ్లో సుమారు ఆరు లక్షల ఎకరాల్లో వరిని పండించాల్సి ఉండగా, రైతులకు సమయానికి అప్పులు దొరక్క ఐదున్నర లక్షల ఎకరాలకే ఈసారి సాగు పరిమితమైంది. మొత్తంగా ఈ ఖరీఫ్ సీజన్లో 11లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. అయితే అనూహ్యంగా దోమ దెబ్బకు ఇప్పుడు సగానికి సగం తగ్గే ప్రమాదం కనిపిస్తోంది. హుదుహుద్ తుపాను ముప్పు తప్పిందని పశ్చిమ రైతాంగం ఊపిరిపీల్చుకున్నా వాతావరణంలో వచ్చిన మార్పులతో సుడిదోమ, ఎండుతెగులు దెబ్బకు పంట పూర్తిగా దెబ్బతింది. ఫలితంగా దిగుబడి 40 శాతం తగ్గుతుందని స్వయంగా అధికారులే అంచనా వేస్తున్నారు. పెట్టుబడులు కూడా రాని ఈ పరిస్థితుల్లో రైతాంగం అల్లాడిపోతున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. ఇటీవల ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంలోనైనా ఒక్క నేత కూడా ప్రస్తుతం జిల్లా రైతాంగం ఎదుర్కొంటున్న సుడిదోమ కష్టాలను, నష్టాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లే యత్నం చేయలేదు. చీడపీడల వల్ల నష్టపోతున్న అన్నదాతలకు పంటల బీమా పథకం వర్తించే పరిస్థితి లేకపోవడంతో ప్రభుత్వమే పరిహారం చెల్లించి ఆదుకోవాలని ఆయన్ను అడిగే నాధుడే కానరాలేదు. అన్నదాతల ఆస్తుల్ని జప్తు చేయాలని ఆదేశాలు రుణమాఫీ అమల్లో జాప్యం జరిగినా త్వరలోనే ఏ రైతుకు ఎంత సొమ్ము జమ అవుతుందనేది ఆన్లైన్లో చూసుకోవచ్చని ఒకవైపు స్వయంగా ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు చెప్పుకొస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ అజమాయిషీలో పనిచేసే జిల్లా సహకార కేంద్ర బ్యాంకు మాత్రం డిఫాల్టర్లుగా మారిన రైతులపై దావాలు వేసేందుకు సిద్ధమవుతోంది. జిల్లాలో సుమారు 2 లక్షల మంది రైతులకు డీసీసీబీ 258 సహకార సంఘాల ద్వారా రూ.1100 కోట్లను పంట రుణాలుగా అందించింది. ఎవరూ రుణాలు చెల్లించవద్దని చంద్రబాబు పదేపదే చెప్పడంతో రైతులు ఆ మాటలు నమ్మి వాయిదా మీరిన బకాయిదారులు (డిఫాల్టర్లు)గా మిగిలారు. డీసీసీబీ వీరిపై దావాలు వేసేందుకు సిద్ధమవుతోంది. అవసరమైతే ఆస్తుల జప్తునకు కూడా వెనుకాడవద్దని సొసైటీలకు ఆదేశాలు జారీచేస్తోంది. డీసీసీబీ ఇలా రైతాంగంపై విరుచుకుపడుతున్నా కనీసం జిల్లా స్థాయిలో అడ్డుకునే అధికార పార్టీ నాయకుడు కానరావడం లేదు. డ్వాక్రా రుణాలదీ అదే దారి ఇక డ్వాక్రా రుణాలదీ అదే పరిస్థితి. గడువులోగా డ్వాక్రా రుణాలు చెల్లిస్తే ఒక్క రూపాయి కూడా వడ్డీ పడదని, ఇప్పుడు జాప్యం కారణంగా 13 నుంచి 15 శాతం వడ్డీ పడుతుందని బ్యాంకర్లు చెబుతున్నారు. డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామని చెబుతున్న సీఎం వాటిపై వడ్డీ ప్రభుత్వమే చెల్లిస్తుందా అనేదానిపై ఇంకా స్పష్టతనివ్వలేదు. రుణ వంచనపై రణభేరి : ఆళ్లనాని రైతన్నలను, డ్వాక్రా మహిళలను దారుణంగా మోసం చేస్తున్న ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు తీరును నిరసిస్తూ బుధవారం జిల్లావ్యాప్తంగా ధర్నాలు చేపట్టనున్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) తెలిపారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు నిర్వహించే ఈ నిరసన కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొనాలని ఆయన కోరారు. బాబు చేసిన మోసాలను ఎండగడుతూ జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లోనూ రైతన్నలకు మద్దతుగా వినూత్న నిరసన ప్రదర్శనలు చేపట్టనున్నట్టు నాని తెలిపారు. -
అన్నదాతపై ‘దావా’నలం
అక్కరకు వస్తుందనుకున్న రుణమాఫీ నేటికీ అన్నదాతకు అందలేదు. కనీసం పంట రుణాలైనా ఇవ్వలేదు. వరి పంట చివరి దశకు చేరుతున్న తరుణంలో సుడిదోమ, ఎండు తెగులుతో చేలు మాడిపోతున్నాయి. శాస్త్రవేత్తలు రంగంలోకి దిగినా.. రైతులు ఎన్నిరకాల పురుగు మందులు వాడినా దోమల బెడద నివారణ కావడం లేదు. పులిమీద పుట్రలా పంట రుణాలను తక్షణమే చెల్లించాలంటూ సొసైటీలు కొరడా ఝుళిపిస్తున్నాయి. బకాయిలున్న రైతులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టొద్దని.. తక్షణమే దావాలు వేయూలని.. అవసరమైతే ఆస్తులు జప్తు చేసి బకాయిలు రాబట్టాలని డీసీసీబీ ఆదేశాలిచ్చింది. లేదంటే సొసైటీ పాలకవర్గాలు, వాటి కార్యదర్శులపై చర్యలు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేసింది. కాళ్ల : రైతులపై సర్కారు కక్ష కట్టింది. రుణమాఫీ మాట దేవుడెరుగు.. తక్షణమే పాత రుణాలు వసూలు చేయూలంటూ డీసీసీబీని ఉసిగొల్పింది. ఈ నేపథ్యంలో పంట రుణాలు బకాయిపడిన రైతులపై తక్షణమే దావాలు వేయూలంటూ డీసీసీబీ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ డి.విజయలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. బకాయిలు చెల్లించని రైతులపై ప్రాథమిక సహకార సంఘాలు (పీఏసీఎస్లు), విశాల వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (ఎల్ఏసీఎస్లు) చట్టపరమైన చర్యలు చేపట్టాలని డీసీసీబీ ఉత్తర్వుల్లో పేర్కొంది. సొసైటీల్లో రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించని రైతులపై సహకార సంఘాల చట్టంలోని సెక్షన్-71 ప్రకారం, డీసీసీబీ శాఖల నుంచి రుణాలు తీసుకున్న రైతులకు అదే చట్టంలోని సెక్షన్-61 ప్రకారం వెంటనే దావాలు వేయూలని ఆదేశించింది. పంట రుణాలతోపాటు అన్నిరకాల రుణాలకూ ఈ ఆదేశాలు వర్తిస్తాయని పేర్కొంది. ఈ పనిని వెనువెంటనే చేపట్టాలని ఆదేశిం చింది. లేదంటే అందుకు సొసైటీ పాలకవర్గాలు, కార్యదర్శులు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించడం కొసమెరుపు. 2 లక్షల రైతులు.. రూ.1,100 కోట్లు జిల్లాలో సుమారు 2 లక్షల మంది రైతులకు డీసీసీబీ 258 సహకార సంఘాల ద్వారా రూ.1,100 కోట్లను పంట రుణాలుగా అందించింది. ఏటా రైతులు ఏప్రిల్, మే, జూన్ నెలల్లో రుణాలు పొందుతుం టారు. మరుసటి ఏడాది అదే నెలల్లో తిరిగి చెల్లిస్తూ ఉంటారు. ఈ ఏడాది ఎన్నికల హామీల్లో భాగంగా రైతులందరికీ రుణాలు మాఫీ చేస్తామని, ఎవరూ రుణాలు చెల్లించవద్దని చంద్రబాబు పదేపదే చెప్పారు. దీంతో రైతులెవరూ రుణాలు చెల్లించలేదు. దీంతో అందరూ వాయిదా మీరిన బకాయిదారులు (డిఫాల్టర్లు) మిగిలారు. సాధారణంగా వాయిదా తేదీ అనంతరం 3 నెలల్లోగా బకారుులను చెల్లించకపోతే వాటిని మొండి బకాయిలుగా పరిగణిస్తారు. ఆ బకాయిలు రాబట్టడానికి చట్టపరమైన చర్యలు తీసుకునే అధికారం డీసీసీబీకి ఉంది. సహకార సంఘాల చట్టంలోని సెక్షన్-61 ప్రకారం డీసీసీబీ, సెక్షన్-71 ప్రకారం సొసైటీలు రైతులకు నోటీసులు ఇవ్వకుండానే దావా వేసే వెసులుబాటు ఉంది. అనంతరం ఒక తేదీని ఖరారు చేసి ఆలోగా రుణాలు చెల్లించకపోతే ఆస్తులపై డిక్రీ ఇస్తారు. తరువాత డిక్రీ అమలు కోరుతూ ఎగ్జిక్యూషన్ పిటిషన్ (ఈపీ) ఫైల్చేసి ఆస్తులను జప్తు చేస్తారు. బకాయిదారులపై దావాలు వేసి, వాటిని తమ కార్యాలయానికి పంపించాలని సొసైటీలను డీసీసీబీ ఆదేశించింది. సవరించిన సహకార సంఘాల చట్టాల ప్రకారం బకారుులను రాబట్టకపోతే సహకార సంఘ కార్యదర్శితోపాటు పాలకవర్గం కూడా బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించడంతో సహకార సిబ్బంది రైతులపై దావాలు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే అసలు, వడ్డీలతో కలిపి రైతులు తీసుకున్న రుణాలు తడిసిమోపెడయ్యూరుు. దావాలు వేస్తే ఆ ఖర్చులు కూడా రైతులే మోయూల్సి వస్తుంది. ప్రభుత్వ అజమారుుషీలో పనిచేసే డీసీసీబీ ఇలాంటి చర్యలకు దిగడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
రుణమాఫీ.. రైతుకు టోపీ
కాళ్ల : రుణమాఫీ ముసుగులో రైతుల నెత్తిన సర్కారు టోపీ పెడుతోంది. వారుుదా మీరిన రుణాలపై 13 శాతం (నూటికి సుమారు రూ.1.08 పైసలు) వడ్డీ విధిస్తూ అన్నదాతలకు షాకిచ్చింది. సెప్టెంబర్ 1 నాటికి గడువు దాటిన రుణాలపై 13 శాతం వడ్డీ వసూలు చేయూలంటూ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) నుంచి సొసైటీలకు సర్క్యులర్లు అందాయి. ఆప్కాబ్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సర్క్యులర్లో డీసీసీబీ పేర్కొంది. జిల్లాలోని 258 సహకార సంఘాల ద్వారా సుమారు 2 లక్షల మంది రైతులకు ఏటా సుమారు రూ.1,110 కోట్లను డీసీసీబీ పంట రుణాలుగా అందజేస్తోంది. రెండేళ్లుగా సున్నా శాతం వడ్డీకే (వడ్డీ లేని) రుణాలు అందిస్తోంది. ఈ ఏడాది రుణమాఫీని సాకుగా చూపించి సున్నా శాతం వడ్డీ అమలును మాయం చేశారు. అసలుకే ఎసరు రాష్ట్ర ప్రభుత్వం పంట రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించడంతో చాలామంది రైతులు రుణాలను చెల్లించలేదు. సర్కారు ప్రకటనపై నమ్మకం లేని కొందరు మాత్రం రుణాలను సొసైటీలకు కట్టేశారు. సకాలంలో చెల్లించిన రైతులకు సున్నా శాతం వడ్డీని అమలు చేయాల్సి ఉంది. రుణమాఫీ సంగతి దేవుడెరుగు కనీసం సకాలంలో సొమ్ములు కట్టిన రైతుల నుంచీ ఏడా ది వరకు 7 శాతం, తదనంతరం 11.75 శాతం చొప్పున సహకార సంఘాలు వడ్డీ వసూలు చేస్తున్నాయి. తాజాగా ఏడాది దాటిన బకాయిలపై సెప్టెంబర్ 1నుంచి 13 శాతం వడ్డీ వసూలు చేయాలని గుట్టుచప్పుడు కాకుండా ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇది ఆప్కాబ్ తీసుకున్న నిర్ణయమని, ఇందులో తాము చేయగలిగిందేమీ లేదని సహకార సంఘాలు చేతులెత్తేస్తున్నాయి. మాఫీ చేసినా భారమే వాయిదా మొత్తాలు చెల్లించిన రైతులపై వడ్డీ భారం రోజురోజుకూ పెరుగుతోంది. మిగిలిన వారికి రుణం మాఫీ అవుతుందో లేదో తెలియదుకానీ.. వడ్డీ మాత్రం తడిపి మోపెడయ్యేలా కనపడుతోంది. 2013 డిసెంబర్ వరకు తీసుకున్న రుణాలు మాత్రమే మాఫీ అవుతాయని, 2014 జనవరి నుంచి తీసుకున్న రుణాలకు సంబంధించి ఒక్క పైసా కూడా మాఫీ కాదని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ముందుగా రుణమాఫీలో 20 శాతం మాత్ర మే ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ ప్రకారం చూస్తే సర్కారు ఇచ్చే 20 శాతం మాఫీ సొమ్ము వడ్డీలకు మాత్రమే సరిపోతుంది. దీనివల్ల రైతులు కొత్త రుణాలు పొందే అవకాశం కోల్పోతున్నారు. పోనీ.. పాత రుణాలు చెల్లించి, కొత్తగా రుణాలు తీసుకుందామంటే వడ్డీ భారం మోయలేని పరిస్థితి నెలకొంది. రుణమాఫీ విషయంలో సర్కారు అనుసరిస్తున్న సాచివేత ధోరణి వల్ల అన్నదాతలు అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతున్నారు. ప్రభుత్వం రుణమాఫీ ప్రక్రియను కొలిక్కి తీసుకువచ్చి రైతులకు సున్నా శాతం వడ్డీకే రుణా లు అందించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
డీసీసీబీలో ముసలం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ)లో ముసలం పుట్టింది. కొన్నాళ్లుగా ఇక్కడ పనిచేస్తున్న ముఖ్య కార్యనిర్వాహకాధికారి (సీఈవో)ని అర్ధాంతరంగా మాతృశాఖకు పంపించేసి ఏ అర్హతా లేని వ్యక్తిని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టారన్న ఆరోపణలు బ్యాంకు చైర్మన్, పాలకవర్గం మధ్య చిచ్చు రగిల్చాయి. బ్యాంకు చైర్మన్ అడ్డగోలుగా వ్యవహరించి ఇన్చార్జి సీఈవో నియామక ఉత్తర్వులు తెప్పించారని సహచర డెరైక్టర్లు మండిపడుతున్నారు. బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ అంగీకారం లేకుండా, తీర్మానాలు చేయకుండా ఇలా వ్యవహరించడం నిబంధనలు ఉల్లంఘించడమేనని, దీనిపై త్వరలోనే ఓ సమీక్ష ఏర్పాటు చేసి ఇన్చార్జి సీఈవో నియామకాన్ని పునఃసమీక్షించాలని అధికారులను కోరుతామని హెచ్చరిస్తున్నారు. ఇదీ నేపథ్యం డీసీసీబీ సీఈవోగా మొన్నటి వరకూ కె.జనార్ధనరావు పనిచేసేవారు. ఆప్కాబ్ నుంచి డిప్యూటేషన్పై వచ్చిన ఆయన కాలపరిమితి ముగిసిపోవడంతో మరో టెర్మ్ ఆయన్నే కొనసాగించాలని బోర్డు సభ్యులు తీర్మానం చేశారు. సంస్థ కొన్నాళ్లుగా లాభాలబాటలో పయనించడం, భారీస్థాయిలో డిపాజిట్ల సేకరించడం, బహుళ సేవల ద్వారా రైతులకు మేలు చేకూర్చడంలో సఫలీకృతుడైనందున జనార్థనరావునే కొన్నాళ్లపాటు కొనసాగించాలని కోరుతూ ఆప్కో ముఖ్య అధికారిని కోరుతూ బోర్డు సభ్యులు గత జూలైలో తీర్మానించారు. ఇందుకు బ్యాంకు చైర్మన్ కూడా అంగీకరించారని సభ్యులు చెబుతున్నారు. ఇప్పుడు ఆయన్ను వెనక్కి పంపించేయాలని ఆదేశిస్తూ ఐదు రోజుల క్రితం లేఖ రావడం, ఆయన స్థానంలో ఎస్.వి.సత్యనారాయణ అనే అధికారిని ఇన్చార్జిగా నియమించడం కూడా జరిగిపోయాయి. ఆయన కంటే ముందు వరుసలో ఇద్దరు డీజీఎంలు, ముగ్గురు ఏజీఎంలూ ఉన్నా వారిని కాదని సత్యనారాయణను నియమించడమేమిటని బ్యాంకుకు చెందిన 21మంది డెరైక్టర్లు ప్రశ్నిస్తున్నారు. ఏకపక్ష నిర్ణయం చైర్మన్ ఏకపక్షంగా వ్యవహరించి ఇన్చార్జి సీఈవోను నియమింపజేశారని ైడె రెక్టర్లు ఆరోపిస్తున్నారు. సభ్యుల అంగీకారం లేకుండా ఎలా నిర్ణయం తీసుకున్నారని చైర్మన్ను ప్రశ్నించేందుకు డెరైక్టర్లు సిద్ధమయ్యారు. సూమోటోగా నిర్ణయం తీసుకునే అధికారం చైర్మన్కు లేదని, పాత సీఈవో స్థానంలో ఇక్కడే ఉద్యోగం చేస్తున్న దిగువస్థాయి అధికారిని ఎలా నియమిస్తారని, ‘కో ఆపరేటివ్ మేనేజ్మెంట్ కమిటీ’కి సంబంధించి ఆయన్ను ప్రశ్నించనున్నామని ‘సాక్షి’తో మాట్లాడుతూ ఓ డెరైక్టర్ చెప్పారు. నాబార్డు నిబంధనలు పాటించకుండా ఇలా చేయడం వల్ల ఆ సంస్థ నుంచి నిధులొచ్చే అవకాశం లేకుండాపోతుందని వాపోయారు. సర్వీస్ రూల్స్, హెచ్ఆర్డీ సూచనలే లేకుండా ఇలా చేయడంతో బ్యాంకు కూడా కుదేలైపోయే పరిస్థితి కనిపిస్తుందన్నారు. సత్సంబంధాల కోసమే.. ఈ విషయమై డీసీసీబీ చైర్మన్ డోల జగన్ను వివరణ కోరగా నాబార్డ్, ఆప్కాబ్ సంస్థలతో సత్సంబంధాల కోసమే అలా చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. నిధుల కోసం తాము ఆయా సంస్థల వెంట పడుతుంటామని, అలాంటప్పుడు ఆప్కాబ్ అధికారుల ఆదేశాల మేరకే సీఈవో జనార్ధన్ను మాతృశాఖకు పంపిస్తే తప్పేంటన్నారు. ఆప్కాబ్లో బాధ్యతగా పనిచేసే అధికారుల సంఖ్య తక్కువగా ఉందని అందుకే మేనేజర్ స్థాయి ఉన్న జనార్దన్ను వెనక్కు పిలిపించుకున్నారన్నారు. బ్యాంకు, ఉద్యోగులు, రైతులు బాగుండాలనే ఉద్దేశంతోనే తాత్కాలికంగా సీఈవోను నియమించామని జగన్ వివరించారు. సీఈవోను తాను రిలీవ్ చేయకపోయినా జనార్థన్ ఆయన అంతట ఆయనే వెళ్లిపోయేందుకు సిద్ధమయ్యారన్నారు.