Department of Agriculture
-
ప్రకృతి చోద్యం!
ఎలాంటి రసాయనాలు వాడకుండా పంటలు పండించడమే ప్రకృతి వ్యవసాయం. దీనివల్ల భూసారం పెరగడంతో పాటు రైతులకు పెట్టుబడి తగ్గుతుంది. అంతేకాకుండా ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థాలు అందుబాటులోకి వస్తాయి. అందువల్లే గత ప్రభుత్వాలు కూడా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాయి. ఇందుకోసం వ్యవసాయశాఖలోనే ఒక విభాగాన్ని ఏర్పాటు చేశాయి. కానీ జిల్లాలో ప్రకృతి వ్యవసాయం లెక్కలు ఘనంగా కనిపిస్తున్నా... క్షేత్రాలు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు.కర్నూలు(అగ్రికల్చర్): ప్రకృతి వ్యవసాయం జిల్లాలో రికార్డుల్లోనే సాగుతోంది. అధికారులు వేలాది ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం సాగుతోందని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం నామమాత్రానికే పరిమితమైంది. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక విభాగం ఉన్నా... ఉత్తుత్తి హడవుడే తప్ప ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. ప్రకృతి వ్యవసాయం కింద జిల్లాలో సాగుచేసిన ఆహార పంటల్లో కెమికల్స్ అవశేషాలు ఉన్నట్లుగా శాస్త్రీయంగా నిర్ధారణ కావడంతో ప్రకృతి సేద్యం...అంతా చోద్యంగా మారింది. లెక్కల్లో మాత్రం 34,024 ఎకరాల్లో... 2024–25 సంవత్సరంలో జిల్లాలోని 141 గ్రామ పంచాయతీల్లో ప్రకృతి వ్యవసాయం జరుగుతున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది 53,834 మంది రైతులతో 75,534 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేపట్టాలన్నది వ్యవసాయ శాఖ లక్ష్యం. ప్రకృతి వ్యవసాయ విభాగం లెక్కల ప్రకారం ఇప్పటికే 32,607 మంది రైతులు 34,024 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నట్లుగా చెబుతున్నారు. కానీ 32,707 మంది రైతుల్లో 5 శాతం మంది కూడా ప్రకృతి వ్యవసాయం చేయడం లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అందువల్లే జిల్లాలో వేలాది మంది ప్రకృతి వ్యవసాయం చేస్తున్నట్లు చెబుతున్నప్పటికి.. సరి్టఫికేషన్ మాత్రం అతి కొద్ది మందికే వస్తోంది. అది కూడా స్వచ్ఛందంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకే దక్కుతోంది. సాగుకు సిబ్బంది వెనుకంజ ప్రకృతి వ్యవసాయ విభాగంలో 367 మంది పనిచేస్తున్నారు. వాస్తవానికి వీరంతా వారికున్న భూమిలో ఎకరా, అర ఎకరా విస్తీర్ణంలో తప్పనిసరిగా ప్రకృతి వ్యవసాయం చేయాలి. ప్రధానంగా ఎల్–1, ఎల్–2, ఎల్–3 కేటగిరీ వరకు ప్రకృతి వ్యవసాయం చేస్తూ రైతులకు అదర్శంగా నిలవాలి. కానీ వీరిలోనే 60 శాతం మంది ప్రకృతి వ్యవసాయాన్ని పట్టించుకున్న దాఖలాల్లేవు. రైతులకు ఆదర్శంగా ఉండాల్సిన సిబ్బందే కాడికిందపడేస్తే ఇక రైతులు ఎందుకు పట్టించుకుంటారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు కొందరు మాస్టర్ ట్రైనర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. విచ్చలవిడిగా కెమికల్స్ వాడుతున్నా.. ప్రకృతి వ్యవసాయం అంటూ నమ్మిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విచ్చల విడిగా కెమికల్స్ వాడకం జిల్లాలో చాలా మంది పేరుకే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఆచరణలో మాత్రం అంతా కెమికల్స్ వ్యవసాయమే. ప్రకృతి వ్యవసాయం పెద్ద ఎత్తున జరుగుతుంటే రసాయన ఎరువుల వినియోగం గణనీయంగా తగ్గాలి. కానీ వివిధ మండలాల్లో లెక్కకు మించి రసాయన ఎరువులు వినియోగిస్తుండటం గమనార్హం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2.50 లక్షల టన్నుల వరకు రసాయన ఎరువుల వినియోగం ఉంది. జిల్లాల పునరి్వభజన తర్వాత కర్నూలు జిల్లాలో 1.50 లక్షల టన్నుల వరకు వినియోగమవుతోంది. 2024–25 ఖరీఫ్లో 1,27,567.657 టన్నుల రసాయన ఎరువులను వినియోగించినట్లు తెలుస్తోంది. దీన్నిబట్టి చూస్తే జిల్లాలో ప్రకృతి వ్యవసాయం ఎలా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. సాగు విస్తీర్ణం పెంచుతాం జిల్లా రైతులు ప్రకృతి వ్యవసాయంపై మొగ్గు చూపుతున్నారు. ఆసక్తి ఉన్న వారిని గుర్తించి శిక్షణ ఇస్తున్నాం. జీవామృతం, కషాయాల తయారీపై కూడా అవగాహన కల్పిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయ విభాగంలో పనిచేసే సిబ్బంది కూడ ఎకరా, అర ఎకరా విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఈ ఏడాది 54,834 మంది రైతులతో ప్రకృతి వ్యవసాయం చేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. రానున్న రోజుల్లో ప్రకృతి వ్యవసాయ సాగు విస్తీర్ణం మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటాం. – పీఎల్ వరలక్ష్మి, జిల్లా వ్యవసాయ అధికారిప్రకృతి వ్యవసాయం అంటే... ప్రకృతి వ్యవసాయం అంటే ఎలాంటి పురుగు మందులు, రసాయన ఎరువులు వాడకుండా పంటలు పండించడం. పంటల సాగులో ద్రవ, ఘన జీవామృతాన్ని మాత్రమే వినియోగించడం. చీడపీడల నివారణకు కషాయాలు, బ్రహ్మస్త్రం, అగ్ని అస్త్రం, దశపర్ణి కషాయం తదితర వాటిని వినియోగించడం. ఏ రకంగానూ ఇటు పురుగుమందులు, అటు రసాయన ఎరువులు వినియోగించకపోవడం. అలా..వరుసగా మూడేళ్లు సాగు చేస్తే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నట్లుగా పరిగణిస్తారు. కానీ అధిక దిగుబడుల కోసం చాలా మంది వి చ్చల విడిగా రసాయన మందులు వాడుతున్నారు. కల్లూరు మండలం లక్ష్మీపురం పంచాయతీలో 631 మంది మహిళలు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి ఆ పంచాయతీలో ముగ్గురు మాత్రమే 100 శాతం ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. అందుకే సరి్టఫికేషన్ కూడా ఎవరూ వెళ్లడం లేదు. అధికారులు చెబుతున్న లెక్కలన్నీ ఇలాగే ఉంటున్నాయి. పాలేకర్ స్ఫూర్తితో 150 మంది రైతులు.. ఎవరి ప్రమేయం లేకుండా స్వచ్ఛందగా జిల్లాలోని 150 మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. వీరు దాదాపు పదేళ్లుగా ప్రకృతి వ్యవసాయంలో రాణిస్తున్నారు. వీరు సుబాష్ పాలేకర్ స్ఫూర్తితో ప్రకృతి వ్యవసాయం చేస్తుండటం విశేషం. ప్రకృతి వ్యవసాయ విభాగం చెబుతున్న వారిలో 5 శాతం కూడ ప్రకృతి వ్యవసాయం చేసే వారు లేరు. ఈ 150 మంది రైతుల ఉత్పత్తులతోనే ప్రకృతి వ్యవసాయ సిబ్బంది హడావుడి చేస్తున్నారు.34,024 ఎకరాలు అధికారుల లెక్కల ప్రకారం ప్రకృతి సాగు విస్తీర్ణం367 ప్రకృతి సాగు విభాగంలోని సిబ్బంది75,534 ఎకరాలు ఈ ఏడాది ప్రకృతి వ్యవసాయం లక్ష్యం? ? ప్రస్తుతం జిల్లాలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు -
చేతులు కాలినా విధానాలు మారవా?
పంజాబ్ రైతులు పత్తిలో భయంకరమైన బోల్వార్మ్ తెగుళ్ళను ఎదుర్కోవడానికి ఏళ్లుగా వాడిన బీటీ–1, బీటీ– 2 రెండూ విఫలమైనాయి. చేతులు కాలిన తర్వాత కూడా విధాన నిర్ణేతలు ఎలాంటి పాఠాలూ నేర్చుకోలేదు. హెర్బిసైడ్(కలుపు నివారిణి గ్లైఫోసేట్)ను తట్టుకోగల జన్యుపరివర్తిత కొత్త తరం పత్తి (హెచ్టీబీటీ)ని అనుమతించే ప్రయత్నం కలవరపెడుతోంది. బీటీ పత్తి సాగు వల్ల అధిక దిగుబడి వస్తుందనే అపోహను బద్దలుకొట్టే విషయం ఏమిటంటే, పత్తి దిగుబడిలో భారత్ కంటే ముందున్న చాలా దేశాలు వాస్తవానికి జన్యుమార్పిడి రకాలను పండించడం లేదు. జీఎం మొక్కజొన్న, జీఎం సోయా, జీఎం అల్ఫాల్ఫా పైలట్ ప్రాజెక్ట్లకు అమెరికా ప్రయత్నిస్తోంది. నెమ్మదిగా ఇవి జన్యుమార్పిడి ఆహార పంటల తుది ప్రవేశానికి తలుపులు తెరుస్తాయి.ఏదో తప్పు జరుగుతోంది. 2070 నాటికి భారతదేశం నికర–జీరో ఉద్గారాలకు కట్టు బడి ఉన్న సమయంలో, మన విధాన ప్రతిస్పందన కూడా అలాగేఉండాలి. రసాయన రహిత వ్యవసాయ పద్ధతుల కోసం మార్గదర్శకా లను రూపొందించడంపై దృష్టి పెట్టాలి. కానీ హానికరమైన కలుపు నివారిణి గ్లైఫోసేట్ (గడ్డిమందు)ను పత్తి సాగులోకి విస్తృతంగా అను మతించడానికి వ్యవసాయ శాఖ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారులు పరిశ్రమల శ్రేణులతో జతకట్టడం కలవర పెడుతోంది.ఇది ఇక్కడితోనే ఆగదు. హెర్బిసైడ్(కలుపు నివారిణి)ని తట్టుకో గల జన్యుపరివర్తిత కొత్త తరం పత్తి(హెచ్టీబీటీ)ని ఆమోదించడంలోని చిక్కులను కూడా ప్రత్యేక కమిటీ పరిశీలిస్తోందని నివేది కలు చెబుతున్నాయి. భారతదేశంలో వాణిజ్య సాగు కోసం ఆమోదించిన ఏకైక జన్యుమార్పిడి పంట అయిన బీటీ పత్తి విస్తీర్ణం పంజాబ్, హరియాణా, రాజస్థాన్ లలో కుప్పకూలిన సమయంలో ఇది వస్తోంది. సాగులో 46 శాతం క్షీణత, వాయవ్య ప్రాంతాల్లో పత్తి దెబ్బతినడం మన కళ్లు తెరిపించాల్సి ఉంది. దీనికి విరుద్ధంగా, అదే పరిష్కారంగా ముందుకు సాగడం కలవరపెడుతోంది (ఇప్పుడు కలుపు సంహారిణిని తట్టుకునే అదనపు జన్యువుతో).గతంలోనూ ఇలాగే చెప్పారు!రైతులపై, పర్యావరణంపై బీటీ పత్తిపంట కలిగించిన విధ్వంసం నుండి ఏదైనా పాఠాలు నేర్చుకుంటే తక్షణ దిద్దుబాటు జరగాలి. కానీ పరిశ్రమ లాబీ ఎంత బలమైనదంటే, మన విధాన రూపకర్తలు వాళ్ల ఒత్తిడికి ప్రతిస్పందిస్తున్నట్లు కనిపిస్తోంది. బీటీ పత్తి సాగు విస్తీర్ణం కనిష్ఠ స్థాయికి పడిపోయిన పంజాబ్ నుండే ఇది మొదలైంది. బీటీ–3 విత్తనాలను కేంద్రం అందుబాటులోకి తేవాలని ఆ రాష్ట్రం డిమాండ్ చేసింది. పంజాబ్ రైతులు భయంకరమైన బోల్వార్మ్ తెగుళ్ళను ఎదు ర్కోవడానికి సంవత్సరాలుగా వాడిన బీటీ పత్తి రకాలైన బీటీ–1, బీటీ– 2 (బోల్గార్డ్ అని పిలుస్తారు) రెండూ విఫలమై దెబ్బతిన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం వినాశకరమైన తెల్లదోమ దాడి అనేకమంది రైతుల ఆత్మహత్యలకు కారణమైంది. ఈ నేపథ్యంలో పంజాబ్ రెండింతలు జాగ్రత్తగా ఉంటుందని నేను అనుకున్నాను. చేతులు కాలి పోయిన తర్వాత కూడా పంజాబ్ ఎలాంటి పాఠాలూ నేర్చుకోలేదు. జాతీయ స్థాయిలో విధాన నిర్ణేతలు సరేసరి.మరింత ముందుకు వెళ్ళేముందు, హెర్బిసైడ్లను తట్టుకునే జన్యు మార్పిడి పత్తి అంటే ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. సులువుగా చెప్పాలంటే, హెర్బిసైడ్ని తట్టుకోవడం కోసం ఒక అద నపు జన్యువును పత్తి రకంలో చొప్పిస్తారు. ఇక్కడ గ్లైఫోసేట్ అని భావించాలి. ఇంతకుముందు మోన్ శాంటోను కొనుగోలు చేసిన బేయర్ కంపెనీ వెబ్సైట్లో, బోల్గార్డ్–3 (రైతులు దీనిని బీటీ–3 అని పిలుస్తున్నారు) ‘మూడు ప్రోటీన్ లతో మీ పత్తి మొక్కలను బోల్వార్మ్ నుండి, ఇతర తెగుళ్ల నుండి రక్షించడంలో సహాయపడుతుంది’ అని పేర్కొన్నారు. పురుగు నియంత్రణను తక్కువ పిచికారీలతో అరికట్ట వచ్చనీ, పత్తికి అన్ని సీజన్లలోనూ తక్కువ నష్టం కలిగిస్తుందనీ చెప్పారు.జన్యుమార్పిడి పత్తికి చెందిన మునుపటి రెండు జాతుల పనితీరుపై కూడా ఇలాగే అతిశయించి చెప్పారు. వాస్తవ సత్యాలను మాత్రం చాలా సౌకర్యవంతంగా ఫుట్నోట్లలో పెట్టేశారు. ‘నేచర్ ప్లాంట్స్ జర్నల్’ 2020 మార్చిలో ప్రచురించిన ఒక పత్రంలో, నాగ్ పూర్లోని సెంట్రల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కాటన్ రీసెర్చ్ మాజీ డైరెక్టర్ కె.ఆర్. క్రాంతి, ప్రసిద్ధ మానవ శాస్త్రవేత్త, వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన గ్లెన్ డేవిస్ స్టోన్ ఇద్దరూ భారతదేశంలో బీటీ పత్తి దీర్ఘకాలిక ప్రభావాన్ని పరిశీలించారు. వారి అంతిమ నిర్ధారణ ఏమిటంటే, దిగుబడి విషయంలో జన్యుమార్పిడి పత్తి పేలవంగా పనిచేసింది. పురుగుమందుల వాడకం తగ్గిన ప్రారంభ దశ తర్వాత, రసాయనాల వినియోగం వాస్తవానికి పెరిగింది. బీటీ పత్తిని విడుదల చేసిన తర్వాత భారతదేశం చూసిన ఉత్పత్తి పెరుగుదల వాస్తవానికి ఎరు వులు, నీటిపారుదల వంటి ప్రధాన ఇన్ పుట్ల పెరుగుదల కారణంగా జరిగిందే.పురుగుమందుల వాడకం విషయానికొస్తే, 2002–2013 మధ్య పత్తిపై పురుగుమందుల వాడకం 93 శాతం పెరిగింది. ఎరువుల విని యోగం 2004–2016 మధ్య 58 శాతం పెరిగింది. జన్యుమార్పిడి పత్తి సాగును చేపట్టిన 24 సంవత్సరాల తర్వాత భారత్, దిగుబడి పని తీరుకు సంబంధించి 70 దేశాలలో 36వ స్థానంలో ఉంది. బీటీ పత్తి సాగు వల్ల అధిక దిగుబడి వస్తుందనే అపోహను బద్దలు కొట్టే విషయం ఏమిటంటే, భారత్ కంటే ముందున్న చాలా దేశాలు వాస్తవా నికి జన్యుమార్పిడి రకాలను పండించడం లేదు.పత్తి సాగును మార్చడానికి విధాన నిర్ణేతలకు ఇది గుణపాఠం కాదా? ఆ విషయానికి వస్తే, ఇప్పటికే సాగులో ఉన్న రకాలతో పోలిస్తే తక్కువ దిగుబడిని ఇస్తున్నప్పటికీ జీఎం ఆవాలు అధిక దిగుబడిని ఇస్తున్నాయంటున్న వాదనలను కూడా వారు చూడకూడదా? తద్వారా, దీర్ఘకాలిక ఆరోగ్యం, పర్యావరణ ప్రభావాలను (పంటల ఉత్పాదకతలో ఎలాంటి తగ్గుదల లేకుండా) పట్టించుకుంటూ, వాతా వరణాన్ని తట్టుకోగల వ్యవసాయ పద్ధతులకు మారడం వైపు దృష్టి కేంద్రీకరించవద్దా?బీటీ పత్తితో దుర్భరమైన అనుభవం వ్యవసాయ రోడ్మ్యాప్ను మళ్లీ గీయవలసిన అవసరాన్ని చూపుతుంది. స్థిరమైన ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇటీవల అగ్రిబిజినెస్ దిగ్గజం బేయర్తో పరిశోధనా సహకారం నెలకొల్పుకున్న ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్(ఐకార్) వాస్తవాలను చూడటానికి నిరాకరించింది.జంట వ్యూహంఅభివృద్ధి చెందుతున్న దేశాల్లోకి జీఎం పంటలను నెట్టడానికి అమెరికా ప్రయత్నిస్తోంది. ఈ విషయంలో మెక్సికో ప్రతిఘటించిన తర్వాత నెమ్మదిగా పెద్ద మార్కెట్ అయిన భారత్ వైపు దృష్టి పెట్టింది. ఆహార భద్రతను పెంపొందించడానికి అమెరికా జన్యుమార్పిడి పంటల దిగుబడిపై దృష్టి సారించింది (వాణిజ్యపరంగా ప్రవేశపెట్టిన జన్యుమార్పిడి పంటల నుండి దిగుబడి పెరిగినట్లు ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి ఆధారాలు లేవు). ఇథనాల్ ఉత్పత్తిలో వాడేందుకు జీఎం మొక్కజొన్న, ఇంకా జీఎం సోయా, ఎండుగడ్డి పశుగ్రాసం కోసం జీఎం అల్ఫాల్ఫా లాంటి కొన్ని పైలట్ ప్రాజెక్ట్లను ఏర్పాటు చేయడా నికి కూడా ప్రయత్నిస్తోంది. జీఎం అల్ఫాల్ఫా లాంటిది వెంటనే ఆహార గొలుసులోకి వెళ్లదు కాబట్టి ప్రజల ఆమోదం పొందుతుంది. జన్యుమార్పిడి మొక్కల లోకి చొచ్చుకుపోవడానికి కూడా కొన్ని ప్రయ త్నాలు జరుగుతున్నాయి. నెమ్మదిగా ఈ పైలట్ ప్రాజెక్ట్ ప్రతిపాదనలు జన్యుమార్పిడి ఆహార పంటల తుది ప్రవేశానికి తలుపులు తెరుస్తాయి. అయితే వీటిని విమర్శించేవారి వాదనలను కొట్టిపారేసేందుకూ, జీఎం పంటలు, రసాయనాల ప్రమాదాలను తక్కువచేసి చూపేందుకూ పెద్ద ప్రయత్నాలే జరుగుతున్నాయని ఇంటర్నేషనల్ మీడియా కలెక్టివ్ పరిశోధన చెబుతోంది. ఆఖరికి సహజ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయాల సంభావ్యతను తగ్గించేందుకు కూడా దీన్ని పొడిగి స్తున్నారు. ఉదాహరణకు హార్వర్డ్ పబ్లిక్ హెల్త్ స్కూల్లోని ఒక ప్రొఫె సర్కు చక్కెర పరిశ్రమ భారీ సొమ్మిచ్చి, సుక్రోజుకూ, గుండె వ్యాధికీ సంబంధం లేదని చెప్పించినట్టు! వంగడానికి సిద్ధంగా ఉండే అధికార వ్యవస్థ(శాస్త్రీయ సంస్థలతో సహా) ద్వారా జీఎం పంటలను చొప్పించడం, విమర్శకులను తీవ్రంగా ఎదుర్కోవడం అనే జంట వ్యూహం రాబోయే రోజుల్లో మరింత పదునెక్కనుంది. జాగ్రత్త!దేవీందర్ శర్మ వ్యాసకర్త ఆహార, వ్యవసాయ రంగ నిపుణులుఈ–మెయిల్: hunger55@gmail.com -
మీరే అసిస్టెంట్లు మీకెందుకు అసిస్టెంట్లు!
సాక్షి, హైదరాబాద్:‘మీరే అసిస్టెంట్లు.. మీకెందుకు అసిస్టెంట్లు’అని వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్రావు మాట్లాడటంపై ఏఈవోలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. డిజిటల్ క్రాఫ్ట్ సర్వే సందర్భంగా తమకు అసిస్టెంట్లు కావాలని వారు కోరుతున్న నేపథ్యంలో రఘునందన్రావు ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు బుధవారం వ్యవసాయ విస్తరణ అధికారులతో రఘునందన్రావు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. చర్చల్లో భాగంగా ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ రాకపోవడంతో ఏఈఓలు చర్చలను మధ్యలోనే బహిష్కరించి వచ్చేశారు. డిజిటల్ క్రాఫ్ట్ సర్వే చేయడం లేదనే కారణంగా ఉన్నతాధికారులు వేధింపులకు చేస్తున్నారని ఏఈఓలు విమర్శించారు.మహిళల భద్రతపై కనీసం కనికరం చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 30 రోజులుగా శాంతియుత నిరసనలు తెలుపుతున్న తమపై ఉన్నతాధికారుల ఏకపక్ష వైఖరిపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన బాట పట్టనున్నట్లు తెలిపారు. దీపావళి తర్వాత స్పష్టమైన కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఈ నేపథ్యంలో డిజిటల్ క్రాఫ్ట్ సర్వే మూలన పడింది. వారం రోజుల కిందట 160 మంది ఏఈఓలను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. వారి సస్పెన్షన్ ఎత్తివేతపై ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అంతేకాకుండా మంత్రి తుమ్మల నాగేశ్వరావు ఇప్పటివరకు చర్చలు జరపలేదు. -
ఏఈవోల్లో చీలిక!
సాక్షి, హైదరాబాద్: డిజిటల్ క్రాప్ సర్వేను బహిష్కరిస్తున్న వ్యవసాయ విస్తరణాధికారుల్లో చీలిక ఏర్పడింది.ప్రభుత్వం 165 మంది ఏఈవోలను సస్పెండ్ చేయడంతో అనేకమంది వెనక్కి తగ్గినట్టు వ్యవసాయశాఖ వర్గాలు వెల్లడించాయి. వ్యవసాయశాఖ డైరెక్టర్ డాక్టర్ గోపితో బుధవారం జరిగిన చర్చల్లో కొందరు ఏఈవోలు సానుకూలత వ్యక్తం చేశారు. వారి సమస్యలపై వచ్చే సోమవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో చర్చలు జరిపేందుకు అవకాశం కల్పిస్తానని డైరెక్టర్ హామీ ఇవ్వడంతో ఏఈవోలు తమ సహాయ నిరాకరణ కార్యక్రమాన్ని ఉపసంహరించుకుంటున్నామని, డిజిటల్ క్రాప్ సర్వే చేసేందుకు సిద్ధమేనని ఆయనకు తెలిపారు. వచ్చే వారం రోజుల్లోగా సమస్యను పరిష్కరిస్తామని, ఏఈవోల సస్పెన్షన్ను కూడా ఎత్తివేస్తామని డైరెక్టర్ హామీ ఇచ్చారన్నారు. ఈ మేరకు ఏఈఓలు డిజిటల్ సర్వేలో పాల్గొంటారంటూ డైరెక్టర్ గోపీ ఒక ప్రకటన విడుదల చేశారు. దీంతో కొందరు ఏఈవో సంఘం నేతలు గురువారం నుంచి డిజిటల్ క్రాప్ సర్వే యాప్ను డౌన్లోడ్ చేసుకొని సర్వే చేస్తామని తెలిపారు. మొత్తంగా సగం మంది ఏఈఓలు సర్వే చేస్తామని చెబుతుండగా, సగంమంది సర్వే చేసేది లేదని తేల్చి చెబుతున్నారు. ముఖ్యంగా మహిళా ఏఈఓలు ఎట్టి పరిస్థితుల్లోనూ సర్వే చేయమని చెబుతున్నట్టు తెలిసింది.దీంతో ఏఈవోలు రెండు వర్గాలుగా చీలిపోయినట్టు వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. కాగా, బుధవారం జిల్లాల నుంచి వందల సంఖ్యలో వచ్చిన ఏఈవోలు వ్యవసాయ కమిషనరేట్ వద్ద నిరసనకు దిగారు. సర్వేలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించాలని, సస్పెండ్ చేసిన ఏఈవోలను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక దశలో కమిషనరేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికారులు ముందస్తుగా పోలీసులను మోహరించారు. ఏఈవోల సస్పెన్షన్తో వ్యవసాయ కార్యక్రమాలపై ప్రభావం కక్ష సాధింపు చర్య వల్లే సస్పెండ్ చేశారని ఏఈవోలు మండిపడుతున్నారు. డిజిటల్ క్రాప్ సర్వే విషయంలో ఇంతమందిని సస్పెండ్ చేయడం వల్ల అనేక పథకాలు, వ్యవసాయశాఖ చేపట్టే కార్యక్రమాలకు విఘాతం కలగనుంది. ఇప్పుడు గ్రామాల్లో ధాన్యం, పత్తి మార్కెట్లోకి వస్తుంది. ఈ సమయంలో ఏఈవోలు కీలకంగా వ్యవహరిస్తారు. కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు తలెత్తితే, రైతులకు అందుకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాల్సింది కూడా ఏఈవోలే. ఇలాంటి కీలక సమయంలో ఏఈవోలపై ఉక్కుపాదం మోపడం పట్ల వ్యవసాయ ఉద్యోగులు మండిపడుతున్నారు. కాగా, ఏఈవోలు దారికొస్తే సరేసరి లేకుంటే మరికొందరిపైనా కఠిన చర్యలు చేపడతామని వ్యవసాయశాఖ అధికారులు అంటున్నారు. ఏఈవోలకు ప్రత్యేక భారం ఏమీ ఉండదని, వారం పది రోజులపాటు నిర్వహించే డిజిటల్ క్రాప్ సర్వేను బహిష్కరించాల్సిన అవసరం ఏంటని వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు అంటున్నారు. కావాలని ఏఈవోలు ఇదంతా చేస్తున్నారని, వారిని ప్రతిపక్ష పార్టీలు రెచ్చగొడుతున్నాయని అంటున్నారు. మరోవైపు సమ్మెకు సిద్ధమైన ఏఈవోలకు కొన్ని ఉద్యోగ సంఘాలు మద్దతు ప్రకటిస్తుండగా, మరోవైపు పేరొందిన పలు ఉద్యోగ సంఘాల నేతలు బెదిరింపులకు దిగినట్టుగా తెలిసింది. ఏ విధంగానైనా సరే ఏఈవోలను సమ్మెకు వెళ్లకుండా వారు తీవ్ర ప్రయత్నాలు చేసినట్టు తెలిసింది. -
165 మంది ఏఈవోల సస్పెన్షన్
సాక్షి, హైదరాబాద్/గన్ఫౌండ్రీ: గ్రామాల్లో పనిచేసే వ్యవసాయ విస్తరణ అధికారుల (ఏఈవో)పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఏకంగా 165 మంది ఏఈవోలను సస్పెండ్ చేస్తూ వ్యవసాయశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. సస్పెన్షన్ నేపథ్యంలో రగిలిపోయిన ఏఈవోలు మంగళవారం జిల్లాల నుంచి హైదరాబాద్ లోని వ్యవసాయ కమిషనరేట్కు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నాలుగు గంటల పాటు ధర్నా చేశారు.పోలీసులు రావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భారీగా ధర్నా జరుగుతున్నా వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి ఏమాత్రం పట్టించుకోకుండానే పోలీసుల భద్రత నడుమ అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో మరింత ఆగ్రహంతో ఉన్న ఏఈవోలు బుధవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేస్తామని ప్రకటించారు. కమిషనరేట్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. 2,600 మంది ఏఈవోలు సెలవుల్లో ఉంటామని వెల్లడించారు. నేతలు రాజ్కుమార్ రాజు, పరశురాములు, సుమన్, వెంకన్న శ్రీనివాస్ జానయ్య, వినోద్, సత్యంల నాయకత్వంలో ధర్నాలో పెద్ద సంఖ్యలో ఏఈవోలు పాల్గొన్నారు.కక్ష సాధింపు ధోరణిడిజిటల్ క్రాప్ సర్వే చేయకపోవడమే 165 మంది ఏఈవోల సస్పెన్షన్కు కారణమని ఏఈవోలు ఆరోపిస్తున్నారు. వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు మాత్రం రైతుబీమా నిబంధనల ప్రకారం మృతి చెందిన రైతుల వివరాల నమోదులో ఏఈవోలు నిర్లక్ష్యంగా వహించారని, అందుకే సస్పెండ్ చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కక్ష సాధింపులో భాగంగానే ఈ సస్పెన్షన్లని ఉద్యోగులు మండిపడుతున్నారు. వ్యవసాయ శాఖ సంచాలకులు గోపి ఏఈవోలను సస్పెండ్ చేస్తూ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం ఉదయం నుంచి మొదలైన సస్పెన్షన్ల పరంపర సాయంత్రం వరకు కొనసాగింది. బుధవారం మరో కారణంతో మరికొంతమందిని సస్పెండ్ చేయడానికి రంగం సిద్ధం చేశారని వారు ఆరోపిస్తున్నారు. నాలుగు రోజుల్లో ఎలా అప్లోడ్ చేయాలి?నిబంధనల ప్రకారం రైతు చనిపోయిన తర్వాత నాలుగు రోజుల్లో మరణ ధ్రువీకరణ పత్రంతోపాటు అన్ని రకాల పత్రాలను జత చేసి..సదరు ఏఈవో రైతుబీమా పోర్టల్లో వివరాలు నమోదు చేయాలి. అయితే రైతు చనిపోయిన తర్వాత వారి కుటుంబ సభ్యులు కనీసం 11 రోజుల వరకు బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. ఆ తర్వాత మరణ ధ్రువీకరణ పత్రం పొందడానికి సమయం పడు తుంది. ఈ విధంగా కుటుంబ సభ్యులు వివరాలు అందించేందుకు కనీసం 15 రోజుల సమయం పడుతుందంటున్నారు. ఇది గతం నుంచి కొనసాగుతుందంటున్నారు. అలాంటప్పుడు కేవలం నాలుగు రోజుల్లో వివరాలు ఏ విధంగా అప్లోడ్ చేయాలని ఏఈవోలు ప్రశ్నిస్తున్నారు. సస్పెండ్ చేయడం సరికాదు డిజిటల్ క్రాప్ సర్వేను నిరాకరించినందుకు తనను సస్పెండ్ చేయడం సరికాదని హనుమకొండ జిల్లా శాయంపేట క్లస్టర్ ఏఈఓ అర్చన అన్నారు. 15వేల మందితో చేయించాల్సిన సర్వేని 2,600 మందితో చేయించాలని ప్రభుత్వాలు చూస్తున్నాయని అన్నారు. రైతు బీమాలో ఎటువంటి అవకతవకలు జరగకపోయినా సస్పెండ్ చేశారని తెలిపారు. షోకాజ్ నోటీసు ఇవ్వకుండా సస్పెండ్ చేశారు డిజిటల్ సర్వే చేసే విషయంలో భయభ్రాంతులకు, మానసిక ఒత్తిడికి గురిచేశారని వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం పెద్దాపూర్ ఏఈఓ ప్రవళిక చెప్పారు. కనీస వసతులు లేకుండా సర్వే చేయలేమని విన్నవించినా, వినకుండా రైతు బీమా కారణం చూపించారన్నారు. కనీసం మెమో గానీ షోకాజ్ నోటీస్ గానీ ఇవ్వకుండా సస్పెండ్ చేశారని వాపోయారు.పంట సర్వే ఏఈవోల ప్రాథమిక బాధ్యత వ్యవసాయశాఖ డైరెక్టర్ డాక్టర్ గోపీపంట నమోదు కార్యక్రమం ఏఈవోల ప్రాథమిక బాధ్యత అని రాష్ట్ర వ్యవసాయశాఖ డైరెక్టర్ డాక్టర్ గోపీ తెలిపారు. కొందరు ఏఈవోలు పంట పొలాన్ని సందర్శించకుండా సర్వే చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. 165 మంది ఏఈవోలను వ్యవసాయశాఖ సస్పెండ్ చేసిన నేపథ్యంలో సంచాలకుడు డాక్టర్ గోపీ స్పందించి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతి గుంటలో సాగైన పంట వివరాలు కచ్చితంగా తెలుసుకో వడానికి, పంటలకు కావాల్సిన ఉత్పాదకాలను అంచనా వేయడానికి, పంట కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, కొనుగోలు నిర్ణయాలు తీసుకోవడానికి, పంట బీమా అమలు, పంట రుణాలు పొందటానికి రైతు బీమా, రైతు భరోసా పథకాల అమలుకు సర్వే ఉపయోగపడుతుందన్నారు. -
50 లక్షల టన్నుల సన్నాలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్ల కోసం పౌర సరఫరాల సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. దసరా పండుగ తర్వాత వరి కోతలు మొదల య్యే అవకాశమున్న నేపథ్యంలో.. జిల్లాల్లోని పౌర సరఫరాల శాఖ, కార్పొరేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అదనపు కలెక్టర్ల నేతృత్వంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ డిసెంబర్ నెలాఖరు వరకు సాగనుంది. రాష్ట్రంలోని 32 జిల్లాల్లో (హైదరాబాద్ మినహా) 7,185 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వ్యవసాయ శాఖ వివరాల ఆధారంగా.. రాష్ట్రవ్యాప్తంగా ఖరీఫ్లో 60.8 లక్షల ఎకరాల్లో వరిసాగు జరిగింది. మొత్తంగా 146.70 లక్షల మెట్రిక్ టన్నులు (ఎంఎల్టీ) దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందులో 91 లక్షల టన్నుల మేర కొనుగోలు కేంద్రాలకు వస్తుందని.. అందులో 50 లక్షల టన్నుల మేర సన్న ధాన్యం వచ్చే అవకాశం ఉందని భావిస్తోంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ నుంచి ఆయా వివరాలు తీసుకొని జిల్లాల వారీగా సన్నాల కోసం ప్రత్యేకంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. మొత్తంగా 7,185 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుండగా.. ఇందులో సగానికిపైగా సన్న ధాన్యం సేకరణ మాత్రమే చేస్తాయని ఆ శాఖ అధికారి ఒకరు తెలిపారు.వ్యవసాయ శాఖ లెక్కల ఆధారంగా జిల్లా కలెక్టర్లే సన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటారని వివరించారు. ఐకేపీ, పీఏసీఎస్తోపాటు ఇతర సహకార సంఘాల నేతృత్వంలో కొనుగోలు కేంద్రాలు ఉంటాయన్నారు. ఎంపిక చేసిన రకాలు, కొలతలతో.. ‘బోనస్’ రాష్ట్రంలో పండించే ధాన్యానికి కనీస మద్ధతు ధర గ్రేడ్–ఏ రకాలకు రూ.2,320 సాధారణ రకాలకు రూ.2,300గా నిర్ణయించారు. సన్నరకాలకు రూ. 500 బోనస్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడంతో.. ఆయా రకాల ధాన్యానికి క్వింటాల్కు రూ. 2,800 చొప్పున చెల్లించనున్నారు. వ్యవసాయ శాఖ ఇప్పటికే 33 రకాలను సన్నాలుగా గుర్తించింది. బీపీటీ–5204, ఆర్ఎన్ఆర్– 15048, హెచ్ఎంటీ, సో నా, జైశ్రీరాం తదితర రకాలను ప్రామాణికంగా తీసుకుంటారు. ఇవేకాకుండా.. బియ్యం గింజ పొడ వు 6 మిల్లీమీటర్లు, వెడల్పు 2 మిల్లీమీటర్ల కన్నా తక్కువగా ఉన్న ఇతర రకాలను కూడా సన్నాలుగా గుర్తిస్తారు. బియ్యం గింజ పరిమాణాన్ని గుర్తించడానికి ‘గ్రెయిన్ కాలిపర్’యంత్రాలను వినియోగిస్తా రు. ఈ మేరకు కొనుగోలు కేంద్రాల కోసం అవసరమైన గ్రెయిన్ కాలిపర్లను కొనుగోలు చేసినట్లు ప్రొ క్యూర్మెంట్ విభాగం అధికారి ఒకరు తెలిపారు. పెరిగిన సన్నాల సాగు..సన్న ధాన్యానికి క్వింటాల్కు రూ.500 బోనస్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో.. చాలా జిల్లాల్లో సన్నాల సాగు పెరిగింది. వ్యవసాయ శాఖ నిర్దేశించిన 33 రకాల్లో మేలిమి రకమైన హెచ్ఎంటీ, జైశ్రీరాం వంటివాటితోపాటు ఎక్కువ దిగుబడి ఇచ్చే బీపీటీ లోని పలు వెరైటీలను రైతులు భారీ ఎత్తున సాగు చేశారు. ఆసిఫాబాద్ జిల్లాలో వరి వేసిన 45 వేల ఎకరాల్లో పూర్తిస్థాయిలో సన్నాల సాగే జరగగా.. పెద్దపల్లి, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, నల్లగొండ, సూర్యాపేట, మహబూ బాబాద్, మంచిర్యాల జిల్లాల్లోనూ సన్నాల సాగు ఎక్కువగా జరిగింది. జనవరి నుంచే రేషన్ దుకాణాలకు ఇవ్వాలని భావిస్తున్న సన్న బియ్యానికి అవసరమైన ధాన్యం సమకూరుతుందని పౌరసరఫరాల శాఖ భావిస్తోంది. -
‘ఫసల్ బీమా’లో కొత్త పద్ధతి!
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకానికి సంబంధించి కొత్త పద్ధతిని అమలు చేయాలని తెలంగాణ వ్యవసాయశాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. ప్రీమియం సొమ్ము కంటే పరిహారపు సొమ్ము రైతులకు ఎక్కువగా చెల్లించే పరిస్థితి నెలకొంటే, బీమా కంపెనీకి నష్టం రాకుండా నిర్ణీత మొత్తంలో ప్రభుత్వం చెల్లించాలని యోచిస్తోంది.పరిహారపు సొమ్ము కంటే ప్రీమియం ఎక్కువెక్కువగా ఉంటే ముందనుకున్న లెక్క ప్రకారం నిర్ణీత మొత్తం ప్రభుత్వానికి కంపెనీ చెల్లించేలా, అటు వ్యవసాయ బీమా కంపెనీకి, ఇటు ప్రభుత్వానికి ఏ మాత్రం నష్టం జరగకుండా ఈ పథకాన్ని తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. ఇప్పటివరకు అనేక సందర్భాల్లో ప్రీమియం ఎక్కువ చెల్లించగా, క్లెయిమ్స్ మాత్రం చాలా తక్కువగా ఉండేవి. ఇలా కంపెనీలు తెలంగాణ నుంచి రూ. వందల కోట్ల లాభాలు పొందాయి. దీంతో గత ప్రభుత్వం ఈ పథకం నుంచి బయటకొచ్చిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో కొత్త పద్ధతి ప్రకారం అటు రైతులకు, ఇటు ప్రభుత్వానికి, మరోవైపు కంపెనీలకు కూడా నష్టం జరగకుండా ఉంటుందని వ్యవసాయశాఖ వర్గాలు అంటున్నాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో బీమా పథకం అమలు పంటల బీమా పథకంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. ఇప్పటికే ఈ పద్ధతిలో పంటల బీమాను అమలు చేస్తున్న మధ్యప్రదేశ్ను అనుసరించాలని యోచి స్తోంది. ఈ మేరకు ఆ రాష్ట్రంలో ఇటీవల వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు, డైరెక్టర్ గోపి పర్యటించి.. అక్కడ అమలవుతున్న పంటల బీమాను అధ్యయనం చేశారు. బీమా అమలు చేస్తున్న కంపెనీలతోనూ చర్చించారు. ఏఐ పరిజ్ఞానంతో పంట నష్టాన్ని అత్యంత సక్రమంగా అంచనా వేయొచ్చని అంటున్నారు. ప్రస్తుతం మాన్యు వల్ పద్ధతిలో నష్టాన్ని అంచనా వేస్తుండగా, పారదర్శకంగా ఉండటం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒకవైపు మాన్యువల్గానూ... మరోవైపు ఏఐ ద్వారానూ పంటల నష్టాన్ని అంచనా వేయాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. ఆ ప్రకారం నష్టాన్ని అంచనా వేస్తే, నష్టపోయిన పంటలకు బీమా కంపెనీలు పరిహారం ఇస్తాయని వ్యవసాయశాఖ వర్గాలు వెల్లడించాయి. సింగిల్ రైతుకూ పరిహారం ఇచ్చేలా...!జీవిత బీమాలో వ్యక్తులకు ఏదైనా ప్రమాదం జరిగితే పరిహారం ఎలా వస్తుందో...పంట నష్టం జరిగిన సింగిల్ రైతుకు కూడా పరిహారం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అంటే రైతు యూనిట్గా రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని అమలు చేస్తారు. గతంలో అమలు చేసినప్పుడు గ్రామం లేదా మండలం యూనిట్గా వివిధ రకాలుగా పంటలను బట్టి పథకం ఉండేది. అంతేగాక సంబంధిత యూనిట్లో ఉన్న వ్యవసాయ పంటల్లో 33 శాతం దెబ్బతింటేనే బీమా పథకం వచ్చేది. అంటే వందెకరాలుంటే... 33 ఎకరాలు దెబ్బతింటేనే పథకం కింద రైతులకు పరిహారం అమలు చేసేవారు. కానీ ఇప్పుడు ఒక ఎకరా, అరెకరా ఉన్న ఒక్క రైతుకు కూడా పరిహారం అందుతుంది. అయితే ఈ వెసులుబాటును అమలుచేయాలంటే బీమా కంపెనీలు ఎక్కువ ప్రీమియం వసూలు చేస్తాయని వ్యవసాయశాఖ అధికారులు అంటున్నారు. కాగా, రాష్ట్రంలో దాదాపు 70 లక్షల మంది రైతులు ఉన్నారు. గతంలో పంటల బీమా పథకాలు అమల్లో ఉన్నప్పుడు సుమారు 8 లక్షల నుంచి 10 లక్షల మంది పంటల బీమా చేయించేవారు. ఇప్పుడు బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయించింది. దీనివల్ల బీమా పరిధిలోకి వచ్చే రైతుల సంఖ్య 50 లక్షలు ఉంటుందని వ్యవసాయశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రీమియం కూడా రూ. 2,500 కోట్ల మేరకు చెల్లించాల్సి వస్తుందని చెబుతున్నారు. » ఓ ఉన్నతాధికారి లెక్క ప్రకారం ఉదాహరణకు ప్రభుత్వం రైతుల తరఫున బీమా కంపెనీకి కోటి రూపాయల ప్రీమియం చెల్లించిందనుకుందాం. ఒక సీజన్లో పంటల నష్టం వల్ల రైతులకు బీమా కంపెనీ రూ. 1.20 కోట్లు చెల్లిస్తే...కంపెనీకి రూ. 20 లక్షల నష్టం వచ్చినట్టు లెక్క. అప్పుడు ప్రభుత్వం రూ. 40 లక్షలు చెల్లించి... ఆ కంపెనీకి రూ. 20 లక్షలు లాభం జరిగేలా చూస్తుంది.» అలా కాకుండా అదే కోటి ప్రీమియం ప్రకారం చూసుకుంటే... పంట నష్టం జరిగి రైతులకు కంపెనీ రూ. 60 లక్షలు చెల్లిస్తే... అప్పుడు ప్రభుత్వానికి రూ.40 లక్షలు నష్టం జరిగినట్టు లేదా అదనంగా కంపెనీకి 40 శాతం ఎక్కువ ప్రీమియం సొమ్ము చెల్లించినట్టు లెక్క. అప్పుడు ప్రభుత్వానికి అంతగా నష్టం జరగకుండా కంపెనీ రూ.20 లక్షలు ఇచ్చి కొంత వెసులుబాటు ఇస్తుంది. అయితే దీనిపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. -
పత్తి కాదు..వరే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పత్తి సాగు పడిపోయింది. సాధారణ విస్తీర్ణంతో పోల్చితే గణనీయంగా తగ్గింది. ప్రభుత్వం ఈసారి పత్తి విస్తీర్ణాన్ని సాధారణ సాగు లక్ష్యం కంటే పెంచాలని పిలుపు ఇచ్చినా రైతులు పట్టించుకోలేదు. వరివైపే మొగ్గుచూపారు. ఈ నెలాఖరుతో వానాకాలం సీజన్ ముగుస్తున్న నేపథ్యంలో వ్యవసాయ శాఖ బుధవారం ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఈ సీజన్లో ఏకంగా 60 లక్షలకు పైగా ఎకరాల్లో పత్తి సాగు చేయించాలని వ్యవసాయ శాఖ లక్ష్యంగా పేర్కొంది. సాధారణ సాగు విస్తీర్ణం ప్రకారం చూసినా కనీసం 50.48 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కావాలి. కానీ సర్కారు ప్రత్యేకంగా నిర్దేశించిన లక్ష్యాన్ని పక్కనపెడితే, సాధారణ విస్తీర్ణంతో పోల్చినా 86.67 శాతానికే పత్తి సాగు పరిమితమైంది. ఈ సీజన్లో కేవలం 43.76 లక్షల ఎకరాల్లోనే ఈ పంట సాగయ్యింది. సర్కారు లక్ష్యంతో పోల్చుకుంటే.. ఏకంగా 16.24 లక్షల ఎకరాలు తగ్గగా, సాధారణ విస్తీర్ణంతో పోల్చుకుంటే 6.72 లక్షల ఎకరాలు తగ్గడం గమనార్హం. వరి వైపు రైతుల మొగ్గు రాష్ట్రంలో అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1.29 కోట్ల ఎకరాలు కాగా, ఈ సీజన్లో ఇప్పటివరకు నూటికి నూరు శాతం సాగైనట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. వరి సాధారణ సాగు విస్తీర్ణం 57.18 లక్షల ఎకరాలు కాగా గతేడాది 64.61 లక్ష ల ఎకరాల్లో సాగైంది. తాజా సీజన్లో దాన్ని అధిగమించి 65.49 లక్షల ఎకరాల్లో నాట్లు పడ్డాయి. సాధారణ సాగు విస్తీర్ణంతో పోలిస్తే 114.53 శాతం పెరిగింది. ప్రభుత్వం సన్నాలకు క్వింటాల్కు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించడంతో రైతు లు వరి వైపు మొగ్గు చూపారని అంటున్నారు. తగ్గిన పప్పు ధాన్యాల సాగు పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణం మాత్రం గణనీయంగా తగ్గడం గమనార్హం. అన్ని రకాల పప్పుధాన్యాల సాధారణ సాగు విసీర్ణం 8.52 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 5.90 లక్షల (69.30 శాతం) ఎకరాల్లోనే సాగైంది. కీలకమైన కంది సాధారణ సాగు విస్తీర్ణం 7.11 లక్షల ఎకరాలు కాగా, కేవలం 4.99 లక్షల ఎకరాల్లోనే సాగైంది. అలాగే పెసర సాధారణ సాగు విస్తీర్ణం 1.01 లక్షల ఎకరాలు అయితే, కేవలం 68,556 (67.38 శాతం) ఎకరాల్లోనే సాగైంది. మొక్కజొన్న 6.09 లక్షల ఎకరాలకు గాను ఇప్పటివరకు 5.46 లక్షల (89.73 శాతం) ఎకరాల్లో, సోయాబీన్ 4.29 లక్షల ఎకరాలకు గాను ఇప్పటివరకు 4.01 లక్షల (93.47 శాతం) ఎకరాల్లో, జొన్న 70,068 ఎకరాలకు గాను 41,782 ఎకరాల్లో సాగైంది. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి యాసంగి పంటల సీజన్ ప్రారంభం కానుంది. -
6 లక్షల ఎకరాల్లో పంట నష్టం?
సాక్షి, హైదరాబాద్ /సాక్షి ప్రతినిధి నల్లగొండ/సాక్షి మహబూబాబాద్: కుండపోత వర్షాలు, వరదలతో రాష్ట్రవ్యాప్తంగా 15 లక్షల ఎకరాల్లో పంటలు నీట మునగగా, అందులో దాదాపు 6 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ అంచనా వేసింది. సోమవారం నాటికి 4.15 లక్షల ఎకరాల్లో నష్టం వాటిల్లిందని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మంగళవారం నాటికి పంట నష్టం పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో నష్టం అంచనా ప్రక్రియ కొనసాగుతోందని అంటున్నారు. ప్రధానంగా ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట, జనగాం, ములుగు తదితర జిల్లాల్లో భారీగా నష్టం వాటిల్లినట్లు అంచనా. ఇప్పుడిప్పుడే పొలాల్లో నీరు తగ్గుతుండటంతో అధికారులు అంచనాలను వేగవంతం చేశారు. ఎన్ని ఎకరాల్లో పంటలు చేతికి వస్తాయో పరిశీలిస్తున్నారు. పంట నష్టం జరిగిన రైతులకు ఎకరాకు రూ.10 వేల పరిహారం ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పంట నష్టం పరిహారానికి సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేస్తామని వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ సీజన్లో బీమా ఇక అనుమానమే? పంట నష్టం జరిగినప్పుడు బీమా రైతులకు ధీమా ఇస్తుంది. ఈ వానాకాలం సీజన్ నుంచి ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేయాలని వ్యవసాయశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. అందుకు కేంద్రం నుంచి కూ డా అనుమతి లభించింది. అనంతరం ముఖ్యమంత్రి కూడా ఆమోదం తెలిపారు. అయినా మార్గదర్శకాలు విడుదల చే యడంలోనూ... అమలు చేయడంలో వ్యవసాయశాఖ విఫల మైంది. పార్లమెంటు ఎన్నికలకంటే ముందునుంచే వ్యవసాయ డైరెక్టర్ కంపెనీలతో చర్చిస్తున్నారు. అయినప్పటికీ ఇప్పటివరకు ఈ ప్రక్రియ టెండర్ వరకు వెళ్లకపోవడం విమర్శలు తావిస్తోంది. సీఎం ఆమోదం తర్వాత వెంటనే అమలు చేసినట్లయితే ఇప్పటికే బీమా అమల్లోకి వచ్చేది. ఒక కీలక ప్రజాప్రతినిధి పంటల బీమా విషయంలో అధికారులకు అవసరమైన ఆదేశాలు ఇవ్వడంలో విఫలమయ్యారన్న విమర్శలు ఉన్నాయి. ఈ నెలాఖరుకు వానాకాలం సీజన్ ముగుస్తుంది. ఇక ఈ సీజన్లో ఇప్పటికిప్పుడు బీమాను అమలు చేసే పరిస్థితి ఉండబోదని అధికారులు అంటున్నారు. 550 ఎకరాల్లో కొట్టుకుపోయిన వరి మహబూబాబాద్ జిల్లాలోని నెల్లికుదురు మండలం రావి రాల గ్రామంలోని పెద్ద చెరువు, కోమటి చెరువు తెగిపోయాయి. వీటి కింద 420 మంది రైతులు సాగుచేసే 550 ఎకరాల వరి మొత్తం కొట్టుకుపోయింది. 200 ఎకరాలు ఇసుక, రాళ్లతో నిండిపోయాయి. ఎకరానికి రూ.50 వేల నష్టం జరిగిందనుకున్నా, ఈ ఒక్క గ్రామంలోనే రూ.2.75 కోట్ల పంటనష్టంతో పాటు పొలం మరమ్మతు చేయాలంటే మరో రూ. కోటికి పైగా డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. పొలం నిండా ఇసుక మేటలు నర్సింహులపేట మండలంలోని కొమ్ములవంచ గ్రామానికి చెందిన మైదం వెంకన్న అనే రైతుకు మూడు ఎకరాల పొలం ఉంది. సాగుకు అవసరమైన విత్తనాల కొనుగోలు, దున్నడం, నాట్లు మొదలైన ఖర్చుల కోసం లక్షా 20 వేల రూపాయలు ఖర్చుపెట్టాడు. భారీ వర్షం కారణంగా పడమటిగూడెంలోని గుండ్ల చెరువు తెగడంతో వరద నీరు కొమ్ముల వంచ పాత చెరువు మత్తడి తెగింది. దీంతో కింద ఉన్న వెంకన్న పొలంపై ఇసుక మేటలు కట్టా యి. పంటపోయింది. పెట్టుబడి పోయింది. రూ.2 లక్షలు ఖర్చు పెట్టి ఇసుక మేటలు తొలగిస్తే కానీ పొలం చేతికిరాదు.ఆనవాలే లేకుండా పోయిన పొలం సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం దూదియా తండా గ్రామానికి చెందిన గుగులోతు లోక్యాకు జానకీనగర్ రోడ్డులో రెండెకరాల భూమి ఉంది. అందులో 20 రోజుల కిందట వరినాట్లు వేశారు. మూడు రోజుల కిందట కురిసిన వర్షానికి వాగు ఉధృతంగా ప్రవహించి పొలమంతా ఇసుక మేట వేసింది. పొలం ఆనవాళ్లే లేకుండా పోయింది. తిరిగి నాటు వేసే పరిస్థితి కూడా లేదు. ఇప్పటికే అప్పు చేసి రూ.40 వేల పెట్టుబడి పెట్టాడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థంకాక లబోదిబోమంటున్నాడు. -
రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేశాం
సాక్షి, హైదరాబాద్/ నల్లగొండ టౌన్: తాము ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో రూ.2 లక్షలలోపు రుణాలున్న రైతులందరికీ రుణమాఫీ చేశామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తెలిపారు. రాష్ట్రంలోని 3,292 బ్యాంకుల బ్రాంచీలు, 909 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల నుంచి సేకరించిన పంట రుణాల వివరాలతో.. డిసెంబర్ 9వ తేదీని కటాఫ్గా తీసుకుని రుణమాఫీ అమలు చేశామని వివరించారు. ఈ మేరకు శనివారం మంత్రి తుమ్మల ఒక ప్రకటన విడుదల చేశారు. రుణమాఫీ విధివిధానాలను ప్రకటించిన మూడు రోజుల్లోనే తొలివిడత కింద రూ.లక్ష లోపు రుణాలున్న 11.50లక్షల మంది రైతులకు రూ.6,098.93 కోట్లు, రెండో విడతలో రూ.1.50 లక్షలలోపు రుణాలున్న 6,40,823 ఖాతాదారులకు రూ.6190.01 కోట్లు, పంద్రాగస్టు నాడు రూ.2లక్షలలోపు రుణాలున్న 4,46,832 ఖాతాల్లో రూ.5,644.24 కోట్లు.. కలిపి మొత్తంగా 22.37 లక్షల ఖాతాల్లో రూ.17,933.19 కోట్లను జమ చేయడం ద్వారా వారందర్నీ రుణవిముక్తులను చేశామని తెలిపారు. తగిన రికార్డులిస్తే మాఫీ చేస్తాం.. రేషన్కార్డు కేవలం కుటుంబ నిర్ధారణ కోసమే పరిగణనలోకి తీసుకున్నామని, అది మాఫీకి ప్రామాణికం కాదని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. ఆధార్కార్డులో తప్పులు, రేషన్కార్డు లేనివారు, ఇతర కారణాలతో రూ.2 లక్షల్లోపు రుణమాఫీ కాని వారు దగ్గరలోని వ్యవసాయ అధికారిని సంప్రదించి, తగిన రికార్డులు సమర్పిస్తే త్వరలో రుణమాఫీ వర్తింపజేస్తామని వివరించారు. రూ.2 లక్షల కంటే అధికంగా రుణాలున్నవారు.. సదరు అధిక మొత్తాన్ని బ్యాంకు లో జమచేస్తే, వారికి రుణమాఫీ చేయడానికి సిద్ధమవుతున్నామని తెలిపారు. కానీ రైతులను అయోమయానికి గురిచేసేలా ప్రతిపక్ష నాయకులు ప్రవర్తించడం దురదృష్టకరమని మండిపడ్డారు. తొలి, రెండో విడతలలో తప్పులు దొర్లిన 7,925 ఖాతాలను సరిచేసి, వాటికి సంబంధించిన 44.95 కోట్ల నిధులను ఇప్పటికే విడుదల చేశామని మంత్రి పేర్కొన్నారు. ఇక కొన్ని బ్యాంకుల నుంచి సాంకేతిక సమ స్యల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ.70,000 నుండి రూ.80,000లోపు రుణాలున్న ఖాతాలకు సంబంధించిన వివరాలు కూడా తెప్పించుకుంటున్నట్టు వివరించారు. ప్రతిపక్ష నేతలు ని జంగా రైతు సంక్షేమాన్ని కోరేవారే అయితే.. ముందుగా వారు గత పదేళ్లలో చెల్లించకుండా వదిలేసిన రుణాల వివరాలు తెప్పించుకొని చెల్లించాలని వ్యా ఖ్యానించారు. గత ప్రభుత్వం చెల్లించని పలు పథ కాల బకాయిలను తాము చెల్లించామని తెలిపారు. రుణమాఫీపై అర్థంలేని విమర్శలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రుణమాఫీ విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు అర్థంలేనివని మంత్రి తుమ్మల మండిపడ్డారు. శనివారం నల్లగొండలోని ఎన్జీ కళాశాల మైదానంలో రైతుబడి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘అగ్రి షో’ను శనివారం ఆయన శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డితో కలిసి ప్రారంభించారు. రూ.2 లక్షలకు మించి ఉంటే ముందు కట్టండిఆ తర్వాత రుణమాఫీ చేస్తామంటూ రైతులకువ్యవసాయ శాఖ సూచనసాక్షి, హైదరాబాద్: రూ.2 లక్షలకు మించి రుణాలున్న రైతులు.. అదనపు సొమ్మును బ్యాంకులో కట్టాలని, మిగతా రెండు లక్షలను ప్రభుత్వం మాఫీ చేస్తుందని వ్యవసాయ శాఖ పేర్కొంది. ఉదాహరణకు ఒక రైతుకు రూ.2.10 లక్షల రుణముంటే.. అదనంగా ఉన్న రూ.10 వేలు బ్యాంకులో జమ చేస్తే, తర్వాత ప్రభుత్వం రూ.2 లక్షలను బ్యాంకులో జమ చేస్తుందని తెలిపింది. ఈ మేరకు శనివారం రాత్రి ఒక ప్రకటన జారీ చేసింది.ఆధార్, పాస్బుక్, రేషన్కార్డు తదితర వివరాలు సరిగా లేనివారి రుణమాఫీ పెండింగ్లో ఉందని తెలిపింది. రైతులు మండల వ్యవసాయ అధికారిని కలిసి, వివరాలను సరిచేసుకుంటే వారి ఖాతాల్లో రుణమాఫీ సొమ్ము జమ అవుతుందని ప్రకటించింది. బ్యాంకులు, ఖాతాల్లో పలు సాంకేతిక పొరపాట్ల వల్ల దాదాపు 22 వేల ఖాతాల్లో వేసిన డబ్బులు వెనక్కి వచ్చాయని... ఆ తప్పులను సరిచేసి, ఇప్పటికే 8 వేల ఖాతాలకు తిరిగి నిధులు పంపిస్తున్నామని తెలిపింది. అందువల్ల రూ.2 లక్షలలోపు రుణాలుండి ఇప్పటికీ మాఫీ కాని రైతులు మండల వ్యవసాయ అధికారిని కలిసి, అందుకు కారణం తెలుసుకోవాలని సూచించింది. కుటుంబ నిర్ధారణ జరగని కారణంగా రుణమాఫీ కాలేదని ఫిర్యాదులుంటే అధికారులు క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ చేస్తారని.. ఆ రైతు కుటుంబంలోని వారి ఆధార్ కార్డులు, ఇతర వివరాలను తీసుకుని పోర్టల్లో అప్లోడ్ చేస్తారని వివరించింది. రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదులను నెలరోజుల్లోగా పరిశీలించి, అర్హులైన వారికి రుణమాఫీ వర్తింపజేస్తామని ప్రకటించింది. -
తగ్గిన ‘సాగు’పై అధికారుల ఆరా
మహబూబ్నగర్ (వ్యవసాయం): ‘సాగు ఢమాల్.. రాష్ట్రంలో గణనీయంగా తగ్గిన సాగు విస్తీర్ణం’శీర్షికన ‘సాక్షి’మెయిన్లో శనివారం ప్రచురితమైన కథనంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఈ కథనంలో వచ్చిన వివరాలను ఆరా తీయడంకోసం వ్యవసాయశాఖ.. మహబూబ్నగర్ జిల్లాలోని రైతు వద్దకు సంబంధిత అధికారులను పంపి వివరాలు సేకరించింది. ‘సాక్షి’కి తన అభిప్రాయాన్ని తెలియజేసిన మహబూబ్నగర్ రూరల్ మండలంలోని మాచన్పల్లికి చెందిన రైతు మల్లు వెంకటేశ్వర్రెడ్డి వద్దకు ఏఈఓ ఎండీ హనీఫ్ వెళ్లి ఆయన పొలాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. తనకు సొంతంగా నాలుగున్నర ఎకరాల పొలం ఉందని, దాంతోపాటు 20 ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తుంటానని, ఇప్పటి వరకు వర్షాలు సమృద్ధిగా కురవకపోవడంతో కేవలం మూడున్నర ఎకరాల్లో మాత్రమే వరి పంట సాగు చేశానని, మిగతా 17 ఎకరాల్లో పంట సాగు చేయడానికి భారీ వర్షాలు రాకపోవడమే కాకుండా బోర్లలో సరిపడా నీరు ఇంకా పెరగలేదని ఆ రైతు ఏఈఓకు వివరించారు. 17 ఎకరాలకు సరిపడా నారుమడి సిద్ధంగా ఉందని, భారీ వర్షం కోసం ఎదురు చూస్తున్నానని ఆయన తెలిపారు. కాగా మహబూబ్నగర్ జిల్లాలో పంటల సాగు ఇంత అధ్వానంగా ఉండటంపై రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పెదవి విరిచినట్లు విశ్వసనీయ సమాచారం. అందుకే వాస్తవాలు తెలుసుకోవడానికి అధికారులను రైతుల వద్దకు పంపినట్లు తెలిసింది. -
రైతు రుణమాఫీపై రగడ!
సాక్షి, హైదరాబాద్: రుణమాఫీపై గందరగోళం కొనసాగుతూనే ఉంది. తమకు రుణమాఫీ జరగలేదంటూ రైతుల నుంచి వ్యవసాయ శాఖకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. గ్రామాలు, మండలాలు, జిల్లాల్లో ఏఈవో, ఏవో, ఏడీఏ, డీఏవో స్థాయి అధికారులకు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. కొందరు వ్యవసాయ శాఖ అధికారులకు ఫోన్లు చేసి ఆరా తీస్తున్నారు. అలాగే కొన్నిచోట్ల ఎమ్మార్వో కార్యాలయాలకు కూడా ఫిర్యాదులు వచి్చనట్లు సమాచారం. వ్యవసాయ శాఖ అంచనా ప్రకారమే రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం వేలాది ఫిర్యాదులు అందాయి. మరోవైపు అనేకచోట్ల రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు.తమకు లక్ష రూపాయల లోపే రుణం ఉన్నా ఎందుకు మాఫీ జరగలేదంటూ నిలదీస్తున్నారు. అయితే ఇటు వ్యవసాయ శాఖ అధికారుల నుంచి గానీ, బ్యాంకర్ల నుంచి గానీ సరైన సమాధానం రావడంలేదని రైతులు చెబుతున్నారు. ఎందుకు రాలేదో తమకు తెలియదంటున్నారని వాపోతున్నారు. ఏ నిబంధనల వల్ల లక్షలాది మంది రైతులకు రుణమాఫీ జరగలేదో తమకూ అంతుబట్టడం లేదని అధికారులంటున్నట్లు తెలిసింది. అయితే పీఎం కిసాన్ నిబంధనలు, రేషన్కార్డు లేకపోవడం వంటివే అనేకమంది రైతులను రుణమాఫీకి అనర్హులుగా చేశాయని వ్యవసాయ శాఖ అధికారులు కొందరు పేర్కొంటున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ప్రచారం జరుగుతుండగా, దీనిపై స్పష్టత లేకపోవడం, మరోవైపు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులందుతుండటంతో.. ఏం చేయాలో పాలుపోని స్థితిలో అధికారులున్నారు. గురువారం లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేసిన ప్రభుత్వం.. దాదాపు 11.50 లక్షల మంది రైతులకు సంబంధించి సుమారు రూ.6,098 కోట్లు బ్యాంకుల్లో జమ చేసిన సంగతి తెలిసిందే. కాగా లక్ష రూపాయల లోపే రుణం ఉన్నప్పటికీ మాఫీ జరగని లక్షలాది మంది రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఖమ్మం జిల్లాలో 20% నుంచి 30% లోపుగానే.. ఖమ్మం జిల్లాలో 20 శాతం నుంచి 30 శాతం లోపుగానే లక్ష లోపు రుణాలు మాఫీ అయ్యాయి. ఖమ్మం డీసీసీబీలో ఏకంగా లక్ష మందికి పైగా రుణమాఫీ కాకపోవడంపై చర్చ జరుగుతోంది. జిల్లాలో 57,857 మంది రైతులకు రుణమాఫీ జరిగింది. అయితే చాలామందికి రుణమాఫీ కాకపోవడంతో శుక్రవారం రైతులు సహకార సొసైటీలు, బ్యాంకుల వద్దకు వెళ్లి ఆరా తీశారు. తమకు అన్ని అర్హతలున్నా ఎందుకు మాఫీ కాలేదంటూ అధికారులను అడిగారు. టోల్ప్రీ నంబర్లు ఏర్పాటు ఈ నేపథ్యంలో రైతులు తమ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి వీలుగా ఖమ్మం కలెక్టరేట్లో 1950తో పాటు 90632 11298 టోల్ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేశారు. అలాగే జిల్లా స్థాయిలో ఐటీ పోర్టల్, మండల స్థాయిలో సహాయ కేంద్రాల ద్వారా తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చునని అధికారులు తెలిపారు. ఎవరూ పట్టించుకోవడం లేదు నాకు రెండెకరాల వ్యవసాయ భూమి ఉంది. 2022 నవంబర్లో మహబూబాబాద్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రూ.70 వేల పంట రుణం తీసుకున్నా. దానిని 2023లో రెన్యువల్ చేయించుకోగా బ్యాంకు అధికారులు తిరిగి రూ.85 వేల రుణం ఇచ్చారు. ఈ రూ.85 వేల రుణం మాఫీ కాలేదు. నాక్కూడా రుణమాఫీ వర్తింపజేయాలని బ్యాంకు చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. – అజీ్మర వెంకన్న, దామ్యతండా, మహబూబాబాద్ మండలం నాతోటి వ్యక్తికయ్యింది..నాకు కాలేదు నాకు తడ్కల్ ఏపీజీవీబీ బ్యాంకులో రూ.42 వేల పంట రుణం ఉంది. ఏటా లోన్ను రెన్యువల్ చేస్తున్నా. ఈసారి నా రుణం మాఫీ అవుతుందని అనుకున్నా. కానీ కాలేదు. నాతో పాటు రుణం తీసుకొన్న వారి పేరు రుణమాఫీ జాబితాలో ఉంది. దీనిపై వ్యవసాయాధికారులను అడిగినా ఏమీ చెప్పడం లేదు. – కొండాపురం పెద్దగోవింద్రావు, బాన్సువాడ, కంగ్టి మండలం, సంగారెడ్డి జిల్లా అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉమ్మడి మెదక్ డీసీసీబీ పరిధిలో సుమారు 42 వేల మంది రైతులు లక్ష లోపు రుణమాఫీ అర్హులు. వీరికి రూ.162 కోట్లు మాఫీ కావాల్సి ఉంది. కానీ కేవలం 19,542 మంది రైతులకు రూ.75 కోట్లు మాత్రమే మాఫీ అయ్యాయి. అంటే కేవలం 45 శాతం మంది రైతులకు మాత్రమే మాఫీ అయింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా డీసీసీబీ పరిధిలో రూ.లక్షలోపు రుణాలు తీసుకున్న రైతులు 51,417 మంది ఉండగా.. వీరికి రూ.236.54 కోట్లు మాఫీ కావాల్సి ఉంది.కానీ 20,130 మంది రైతులకు రూ.92.02 కోట్లు మాత్రమే మాఫీ అయ్యాయి. దీంతో మాఫీకాని వారు వ్యవసాయశాఖ అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. అలాగే ఉమ్మడి నల్లగొండ డీసీసీబీ పరిధిలో రూ.లక్ష లోపు రుణాలు తీసుకున్న వారు 72,513 మంది ఉండగా, 33,913 మందికి సంబంధించిన రూ.143.10 కోట్లు మాత్రమే మాఫీ అయ్యాయి. మిగతా వారికి మాఫీ జరగలేదు. ఇక వరంగల్ డీసీసీబీ పరిధిలో లక్ష లోపు రుణం తీసుకున్న రైతులు 57,129 మంది కాగా 23,841 మంది రైతుల ఖాతాల్లోనే మాఫీ సొమ్ము జమైంది. దీంతో మిగిలిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
నేడే లక్ష రుణమాఫీ.. ట్రయల్ రన్ నిర్వహించిన అధికారులు
సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీ ప్రక్రియలో మొదటి విడతగా గురువారం రూ.లక్ష వరకు రుణాన్ని ప్రభుత్వం మాఫీ చేయనుంది. ఇందుకు సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు ఏర్పా ట్లు చేస్తున్నారు. వ్యవసాయ శాఖ కార్యాలయంలో అధికారులు బుధవారం ఇందుకు సంబంధించి ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి ఆధ్వర్యంలో ఈ ట్రయల్ రన్ జరిగింది. రుణమాఫీ ప్రక్రియ సజావుగా జరిగేందుకు దీనిని నిర్వహించారు. అన్నీ సక్రమంగా ఉన్నాయో లేదో సరిచూసుకున్నారు. గురువారం సాయంత్రం 4 గంటలకు రుణమాఫీ ప్రక్రియ పూర్తి కాగానే రాష్ట్రవ్యాప్తంగా 500 రైతు వేదికల్లో సంబురాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రుణమాఫీ నిధులను విడుదల చేసిన తర్వాత సీఎం రేవంత్రెడ్డి ఆన్లైన్లో రైతులతో మాట్లాడనున్నారు. కొన్ని గ్రామాల్లో గందరగోళం రైతు వేదికల్లో వేడుకలకు సంబంధించి స్థానిక అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతి గ్రామం నుంచి రైతులను తరలించనున్నారు. ఇలావుండగా రుణమాఫీకి సంబంధించి అధికారులు రూపొందించిన జాబితాపై అక్కడక్కడ కొన్ని గ్రామాల్లో గందరగోళం నెలకొంది. జాబితాలో తమ పేర్లు లేవంటూ కొందరు రైతులు ఫిర్యాదు చేస్తున్నారు. -
రాష్ట్రంలో డీఏపీ కొరత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డీఏపీ కొరత నెలకొంది. ఫలితంగా కీలకమైన వానాకాలం పంటల సీజన్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వరి నాట్లు పుంజుకుంటున్న తరుణంలో కొరత ఏర్పడటంతో అనేక చోట్ల డీఏపీ బ్లాక్ మార్కెట్లోకి వెళుతున్నట్లు అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. దీంతో కొన్నిచోట్ల అధిక ధరకు కొనుగోలు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్, మే నెలల్లో రాష్ట్రానికి 1.12 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా చేయాల్సి ఉండగా, కేంద్రం 43 వేల మెట్రిక్ టన్నులను మాత్రమే సరఫరా చేసింది. దీంతో కొరత ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. ఈ విషయంపై గత నెల రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు కేంద్ర రసాయన, ఎరువులశాఖ మంత్రి జె.పి.నడ్డాకు ఎరువుల కేటాయింపుల పెంపుపై లేఖ రాశారు. జూలై నెలలో 80 వేల మెట్రిక్ టన్నులు సరఫరా చేయాలని కోరారు. దీనికి కేంద్ర మంత్రి స్పందించి తెలంగాణ రాష్ట్ర అవసరాలకు తగ్గట్టు ఎరువులను, ముఖ్యంగా డీఏపీని కేటాయిస్తామని హామీయిచ్చారని అప్పట్లో తుమ్మల తెలిపారు. అయితే ఇప్పుడు డీఏపీ సరఫరాపై కేంద్రం స్పష్టత ఇవ్వడంలేదని రాష్ట్ర వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ సీజన్లో కావాల్సిన డీఏపీ 2.40 లక్షల మెట్రిక్ టన్నులు ఈ వానాకాలం సీజన్కు 24.40 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని వ్యవసాయశాఖ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందులో యూరియానే 10.40 లక్షల మెట్రిక్ టన్నులు ఉండటం గమనార్హం. యూరియాతోపాటు డీఏపీ 2.40 లక్షల మెట్రిక్ టన్నులు, ఎన్పీకే 10 లక్షల మెట్రిక్ టన్నులు, ఎంఓపీ 60 వేల మెట్రిక్ టన్నులు, ఎస్ఎస్పీ లక్ష టన్నులు రైతులకు అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. ఆ క్రమంలోనే అత్యధికంగా మే, జూన్ నెలల్లో 4.60 లక్షల మెట్రిక్ టన్నుల చొప్పున ఎరువులు కేటాయించారు. అంటే ఆ రెండు నెలలకే 9.20 లక్షల మెట్రిక్ టన్నులు కేటాయించారు. కానీ కేంద్రం నుంచి డీఏపీ సరైన సమయానికి రాలేదు. ఏప్రిల్, మే నెలలకు కేటాయించాల్సిన దాంట్లో కేవలం మూడో వంతే రాష్ట్రానికి సరఫరా అయింది. ఈ విషయంలో రాష్ట్ర వ్యవసాయశాఖ సరిగ్గా పర్యవేక్షణ చేయలేదన్న విమర్శలు ఉన్నాయి. మరోవైపు ఎరువులు అందుబాటులో ఉన్నాయని రైతులను అధికారులు మభ్యపెడుతున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. -
విత్తన సహకార సంస్థ ఏర్పాటు చేస్తాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా విత్తన ఉత్పత్తి, సేంద్రియ ఉత్పత్తుల సహకార సంస్థ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వ్యవసాయ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఈ సంస్థ ద్వారా సేంద్రియ వ్యవసాయం, విత్తన ఉత్పత్తుల్లో నిమగ్నమైన రైతులకు నేరుగా ప్రయోజనం కలుగుతుందని వివరించారు. రాష్ట్రంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సహకార సంఘాలకు గురువారం జాతీయ సహకార అభివృద్ధి సంస్థ ద్వారా అవార్డులు అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి.. రైతులనుద్దేశించి ప్రసంగించారు. దేశంలో సహకార ఉద్యమం దాదాపు 125 సంవత్సరాల నుంచి ఉందని, కానీ సకాలంలో మార్పులు చేయకపోవడం వల్ల అది కాలం చెల్లినట్లు కనిపిస్తోందని అన్నారు. సహకార రంగం ఈ కాలపు అవసరాలకు అనుగుణంగా బలోపేతం కావాలని అభిప్రాయపడ్డారు. సహకార రంగం పటిష్టతకు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను బలోపేతం చేయడం చాలా ముఖ్యమని, ఇందు కోసం ప్రభుత్వం ద్వారా అనేక చర్యలు తీసు కుంటామని హామీ ఇచ్చారు. కాగా, ఈ కార్య క్రమంలో ఐదు సహకార సంఘాలకు అవార్డు లతో పాటు రూ.25 వేల నగదు బహుమతిని అందజేశారు. టీజీకాబ్ చైర్మన్ ఎం.రవీందర్రావు, ఎండీ గోపి, ఎన్సీడీసీ రీజనల్ డైరెక్టర్ వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.ఉద్యోగుల హాజరుపై నివేదిక ఇవ్వండివ్యవసాయ శాఖ డైరెక్టరేట్ పరిధిలో ఉద్యోగుల హాజరుపై సమగ్ర నివేదిక ఇవ్వాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆ శాఖ సంచాలకుడిని ఆదేశించారు. గురువారం మంత్రి బషీర్బాగ్లోని వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు సమయానికి రాని విషయాన్ని గుర్తించిన ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల హాజరు తీరుపై సమగ్ర నివేదిక సమర్పించాలని మంత్రి ఈ సందర్భంగా డైరెక్టర్ను ఆదేశించారు. -
46 లక్షల ఎకరాల్లో పంటల సాగు
సాక్షి, హైదరాబాద్: వానాకాలం పంటల సాగును ఈ సారి పెద్ద ఎత్తున చేపడుతున్నారు. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఇప్పుడు అధికంగా పంటలు వేస్తున్నారు. గత సంవత్సరం వానాకాలంలో ఇదే సమయానికి 25.79 లక్షల ఎకరాల్లో పంటలు సాగవగా, ఈ సీజన్లో బుధవారం నాటికి 46.85 లక్షల ఎకరాల్లో పంటలు సాగైనట్లు వ్యవసాయశాఖ తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ ఏడాది వానాకాలం అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1.31 కోట్ల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 35.76 శాతం విస్తీర్ణంలో పంటలు వేశారు. ఇప్పటివరకు వేసిన పంటల్లో అత్యధికంగా పత్తి ఏకంగా 33.81 లక్షల ఎకరాల్లో సాగైంది. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 50.48 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 66.97 శాతం వేశారు. ఈ ఏడాది పత్తిని 60 లక్షల ఎకరాల్లో పండించాలని చేయాలని ప్రభుత్వం రైతులకు పిలుపునిచ్చింది. కాగా, వరి సాధారణ సాగు విసీర్తం 57.18 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 1.71 లక్షల ఎకరాల్లో నాట్లు పడ్డాయి. అంటే మూడు శాతానికే పరిమితమైంది. పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 8.52 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 2.81 లక్షల ఎకరాల్లో వేశారు. అందులో ఒక్క కంది పంటనే 2.37 లక్షల ఎకరాలు కావడం గమనార్హం. మొక్కజొన్న సాధారణ సాగు విసీర్ణం 6.09 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 1.92 లక్షల ఎకరాలు సాగైంది. సోయాబీన్ సాధారణ సాగు విస్తీర్ణం 4.29 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 2.55 లక్షల ఎకరాల్లో పంట వేశారు. ఆదిలాబాద్ జిల్లాలో 99.96 శాతం.. ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో పంటల సాగు నమోదైంది. ఇప్పటివరకు సాగైన జిల్లాల్లో అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలోనే నమోదు కావడం విశేషం. ఈ జిల్లా సాధారణ పంటల సాగు విస్తీర్ణం 5,62,594 ఎకరాలు కాగా, 5,62,386 ఎకరాల్లో సాగైంది. అంటే 99.96 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. ఇంత తక్కువ కాలంలో ఇంత సాగు కావడం విశేషం. అత్యంత తక్కువగా వనపర్తి జిల్లాలో కేవలం 8.16 శాతం విస్తీర్ణంలోనే పంటలు సాగయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో ఆయా ప్రాంతాలను బట్టి సాధారణం, అధికం, అత్యధిక వర్షపాతం నమోదైందని వ్యవసాయశాఖ తెలిపింది. 17 జిల్లాల్లో అధికం నుంచి అత్యధిక వర్షపాతం నమోదైందని పేర్కొంది. నారాయణపేట, నాగర్కర్నూలు, వనపర్తి, గద్వాల, నల్లగొండ జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇక హైదరాబాద్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్, మహబూబాబాద్, జనగాం, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, వికారాబాద్, మహబూబ్నగర్ జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ఏ జిల్లాలోనూ లోటు వర్షపాతం నమోదు కాలేదని వ్యవసాయ శాఖ తెలిపింది. -
నాలుగు పథకాలకు రూ.60 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: రానున్న 3 నెలల్లో రుణమాఫీ, రైతు భరోసా, పంటల బీమా, రైతు బీమా పథకాలకు రూ.50 వేల కోట్ల నుంచి రూ.60 వేల కోట్ల వరకు ఖర్చు చేయనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మంగళవారం ఆయన అన్ని జిల్లాల వ్యవసాయ, ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇది ప్రభుత్వానికి భారమైనా.. సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి సాహసోపేతమైన నిర్ణయాలు అమలు చేస్తున్నామని చెప్పారు. రానున్న కాలంలో ఆర్థిక వెసులుబాటును బట్టి ఒక్కొక్కటిగా అన్ని పథకాలను పునరుద్ధరిస్తామని, ఇప్పటికే మట్టి నమూనా పరీక్ష కేంద్రాలను తిరిగి వాడుకలోకి తెచ్చి భూసార పరీక్షలు ప్రారంభించిన విషయాన్ని తుమ్మల గుర్తుచేశారు. రైతుబీమాలో 1,222 క్లెయిమ్స్ వివిధ దశల్లో పెండింగ్లో ఉన్నాయన్నారు. ఇంత పెద్ద మొత్తంలో పెండింగ్ ఉంటే చనిపోయిన రైతు కుటుంబాలకు మనం అందించే ఆసరా సకాలంలో అందుతుందా? లేదా? అన్నది పరిశీలించాలని పేర్కొన్నారు. పంటల నమోదులో కచ్చితత్వం ఉండాలని, ఇది అన్నింటికీ ప్రాతిపదిక అన్నారు. ఆయిల్ పామ్ ప్రాజెక్ట్ చేపట్టి మూడేళ్లయినా ఇంకా రెండు శాఖల మధ్య క్షేత్రస్థాయిలో సమన్వయం లేదని తుమ్మల అసంతృప్తి వ్యక్తంచేశారు. 2023–24 సంవత్సరంలో 2.30 లక్షల ఎకరాల లక్ష్యానికి గాను కేవలం 59,200 ఎకరాలు మాత్రమే పురోగతి ఉందన్నారు. హెచ్ఈవోలు లేనిచోట ఏఈవోలు పూర్తి బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. రైతును ఎంపిక చేయడం నుంచి డ్రిప్ ఇన్స్టాల్ చేయించడం, మొక్కలు నాటించడం వరకు అన్నింటిపై ఏఈవో, ఏవో బాధ్యత తీసుకోవాలన్నారు. డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు సబ్సిడీపై ఇతర పంటలు సాగుచేసే రైతులకు కూడా ఈ సంవత్సరం నుంచి ఇస్తున్నామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్యదర్శి రఘునందన్, డైరెక్టర్ గోపి, ఉద్యాన డైరెక్టర్ యాస్మిన్ బాషా పాల్గొన్నారు. -
మూడు రోజులు వర్షాలే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న మూడు రోజులపాటు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మరికొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు ఉత్తర, తూర్పు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వివరించింది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతం, అలాగే వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతోనే రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సగటు వర్షపాతం సాధారణ స్థితిలో నమోదైనప్పటికీ.. కొన్ని జిల్లాల్లో మాత్రం లోటు వర్షపాతం ఉంది. ఈ మూడు రోజుల పాటు వర్షాలు ఆశాజనకంగా ఉంటే రాష్ట్రంలో వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగా నమోదు కావొచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. 13.07 సెంటీమీటర్ల వర్షపాతం రాష్ట్రంలో నైరుతి సీజన్లో జూన్ నెలలో కురవాల్సిన సగటు వర్షపాతం 12.94 సెంటీమీటర్లు. ఈ నెలలో గురువారం నాటికి నమోదు కావాల్సిన సగటు వర్షపాతం 11.14 సెంటీమీటర్లు కాగా.. 13.07 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కాగా, మూడు జిల్లాల్లో సగటు కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కామారెడ్డి జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. 16 జిల్లాల్లో సాధారణ వర్షపాతం, 8 జిల్లాల్లో అధిక వర్షపాతం, 6 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. రానున్న మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనాలు చెపుతున్నాయి. సాగు పనులు ముందుకెళ్లాలంటే ఈ వారం వర్షాలే కీలకం కానున్నాయి. సాగు విస్తీర్ణం పెరుగుదలకు ఈ వర్షాలు ఉపయోగపడతాయని వ్యవసాయ శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. -
రైతు భరోసాకు పదెకరాలు పరిమితి పెట్టండి
సాక్షి, హైదరాబాద్: రైతు భరోసా పథకానికి పరిమితులు విధించాలని.. గతంలో మాదిరి అందరికీ కాకుండా, పదెకరాల వరకు భూములున్న రైతులకే పెట్టుబడి సాయం అందించాలని రైతులు పేర్కొన్నారు. కొందరు రైతులు మాత్రం ఐదెకరాల వరకు పరిమితి పెట్టినా మంచిదేనని అన్నారు. చాలా మంది రైతులు సాగులో ఉన్న భూమికి, సాగుచేసే వారికే పెట్టుబడి సాయం అందించాలని కోరారు. ఆదాయ పన్ను చెల్లించే రైతులకు కూడా రైతు భరోసా ఇవ్వాలని కోరారు. విదేశాలకు వెళ్లే తమ పిల్లల విద్యా రుణాల కోసం బ్యాంకులకు ఆదాయ పన్ను స్టేట్మెంట్లు చూపించాల్సి వస్తుందని.. కాబట్టి ఆదాయ పన్ను చెల్లించేవారికి కూడా రైతుభరోసా ఇవ్వాలని సూచించారు. ప్రతీ వారం నిర్వహించే ‘రైతు నేస్తం’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ‘రైతు భరోసా’పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు పలు అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. కొండలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ భూములు వంటి వాటికి రైతు భరోసాను నిలిపివేయాలని కోరారు.దొడ్డు రకాల వరికీ బోనస్ ఇవ్వాలిసన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో.. చాలా మంది రైతులు దొడ్డు రకం వరికి కూడా బోనస్ ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో దొడ్డు వరి సాగు చేసేవారే ఎక్కువని, వారికీ బోనస్ ఇస్తేనే గిట్టుబాటు ధర లభిస్తుందని పేర్కొన్నారు. సన్న రకాలకు ఎటూ డిమాండ్ ఉంటుందని.. మార్కెట్లోనూ మద్దతు ధర కంటే ఎక్కువగా రేటు పలుకుతుందని వివరించారు. ఇక సీజన్ సమయంలో పంటల సాగుకు అవసరమైన కూలీల కొరత ఉంటుందని.. దొరికినా ఖర్చు ఎక్కువ అవుతుందని అనేక మంది రైతులు వాపోయారు. అందువల్ల వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు. దాదాపు ఐదేళ్లుగా వ్యవసాయ యంత్రాల సరఫరా నిలిచిపోయిందని, దాంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.రైతుబంధుతో రూ.25,670 కోట్లు వృథా: మంత్రి తుమ్మలగతంలో సాగులో లేని భూములకు కూడా రైతుబంధు వర్తింపజేసి.. 12 విడతల్లో దాదాపు రూ.25,670 కోట్ల ప్రజాధనం వృధా చేశారని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఆరోపించారు. 93 శాతం వాటా ఉన్న సన్న, చిన్నకారు రైతుల వాటా రైతుబంధు మొత్తంలో 68 శాతం కూడా లేదని.. దానికితోడు 17.5 శాతం ఉన్న కౌలు రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. తమ ప్రభుత్వం రైతుబంధు స్థానంలో రైతుభరోసా పథకాన్ని తీసుకొస్తోందని, పెట్టుబడి సాయాన్ని ఎకరానికి రూ.15 వేలకు పెంచుతున్నామని చెప్పారు. అయితే రైతుబంధు తరహాలో ప్రజాధనం వృథా కాకుండా ఉండేలా పటిష్ట విధానాల రూపకల్పనకు తమ ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు. రైతునేస్తం కార్యక్రమంలో రైతులు వెల్లడించిన, రాత పూర్వకంగా సేకరించిన సూచనలను క్రోడీకరించి నివేదిక తయారు చేయాలని వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపిని మంత్రి ఆదేశించారు. తమ ప్రభుత్వం రైతుభరోసాకు సంబంధించి ఎటువంటి విధానపరమైన నిర్ణయాలు ఇంకా తీసుకోలేదని.. పూర్తిగా అందరి అభిప్రాయాలు తీసుకున్నాక, శాసనసభలో చర్చించాక పథకాన్ని తీసుకొస్తామని చెప్పారు. ఆలస్యమైనప్పటికీ అర్హులకు మాత్రమే అందేలా రైతుభరోసాకు రూపకల్పన చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, రైతుసంఘం నాయకుడు అన్వేశ్రెడ్డి, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు తదితరులు పాల్గొన్నారు. -
ఉచిత పంటల బీమాను కొనసాగించాల్సిందే
సాక్షి, అమరావతి: మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన హామీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలని ఏపీ రైతు సంఘం డిమాండ్ చేసింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడుకు రాసిన లేఖను సంఘ అధ్యక్షుడు వి.కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శులు కె.ప్రభాకరరెడ్డి ఆదివారం మీడియాకు విడుదల చేశారు. రైతు భరోసా పథకం కింద ప్రతి రైతుకు రూ.20 వేల చొప్పున ఇస్తామన్న పెట్టుబడి సాయం వెంటనే రైతుల ఖాతాలకు జమ చేయాలని, రబీలో దెబ్బతిన్న పంటలకు సంబంధించి రైతులకు పరిహారం, సున్నా వడ్డీ రాయితీలను జమ చేయాలని, వ్యవసాయ విద్యుత్ మీటర్ల ఏర్పాటు జీవోను వెనక్కి తీసుకోవాలని రైతు సంఘం కోరింది. రైతు భరోసా కేంద్రాలను అభివృద్ధి చేసి, రైతులకు మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకురావాలని, సొసైటీలకు పాలు పోసే రైతులకు లీటర్కు రూ.5, బోనస్ ఇవ్వాలని, మూతపడిన డెయిరీలను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేసింది. మద్దతు ధరపై ప్రతి పంటకు రూ.500 బోనస్ ఇవ్వాలని, ఆహార, పప్పుధాన్యాలు, వాణిజ్య, ఉద్యాన పంటలన్నిటికి మద్దతు ధరలు ప్రకటించాలని కోరింది. రబీలో రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి సంబంధించిన రూ.1,600 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని, ఉచిత పంటల బీమా పథకాన్ని కొనసాగించాలని, రైతుల చెల్లించాల్సిన ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించాలని, అప్పుల పాలైన రైతులు బకాయిపడిన రూ.2 లక్షల వ్యవసాయ రుణాలను రద్దు చేయాలని కోరింది.చక్కెర కర్మాగారాల్ని పునరుద్ధరించాలిరాష్ట్రంలోని 32 లక్షల కౌలు రైతులకు యజమాని సంతకంతో సంబంధం లేకుండా గుర్తింపు కార్డులు ఇవ్వడంతో పాటు వారికి అవసరమైన బ్యాంక్ రుణాలు, ఇతర సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకోవాలని రైతు సంఘం కోరింది. రాష్ట్రంలో మూతపడిన 25 చక్కెర కర్మాగారాలను వెంటనే పునరుద్ధరించాలని, పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసి నిర్వాసితులకు పునరావాసం, నష్టపరిహారం పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేసింది. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలను పూర్తి చేయాలని కోరింది. -
17 లక్షల ఎకరాల్లో సాగు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ నెల 19 వరకు 17 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పత్తి 15.60 లక్షల ఎకరాలు, కంది 76 వేల ఎకరాల్లో సాగయిందని చెప్పారు. రానున్న రోజుల్లో వరినాట్లు, ఆరుతడి పంటల సాగు ఊపందుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం సచివాలయంలో వానాకాలం పంటల సాగు, ఎరువుల నిల్వ, సరఫరాపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎరువుల సరఫరా పారదర్శకంగా జరగాలని, ఎవరైనా నిబంధనలు అతిక్రమించి అమ్మకాలు చేస్తే కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఎక్కడికక్కడ తనిఖీలు చేయాలని, అదే విధంగా విక్రయాలను పరిశీలించాలని సూచించారు. 10.40 ఎల్ఎంటీల యూరియా కేటాయింపు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 10.40 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) యూరియా, 2.40 ఎల్ఎంటీల డీఏపీ, 10.00 ఎల్ఎంటీల కాంప్లెక్స్ , 0.60 ఎల్ఎంటీల ఎంవోపీ ఎరువులు కేటాయించిందని మంత్రి తెలిపారు. జూలై చివరి నాటికి 5.65 ఎల్ఎంటీల యూరియా అవసరం కాగా ఇప్పటికే 8.35 ఎల్ఎంటీల యూరియా, అలాగే 1.57 ఎల్ఎంటీల డీఏపీ, 1.30 ఎల్ఎంటీల కాంప్లెక్స్, 0.38 ఎల్ఎంటీల ఎంవోపీ అందుబాటులో తెచ్చామన్నారు. 1.07 ఎల్ఎంటీల యూరియా, 0.54 ఎల్ఎంటీల డీఏపీ, 1.06 ఎల్ఎంటీల కాంప్లెక్స్ ఎరువులను రైతులు కొనుగోలు చేశారని మంత్రికి అధికారులు వివరించారు. ఆగస్టు వరకు సరిపడా ఎరువుల కోసం కేంద్ర మంత్రికి లేఖఆగస్టు నెల వరకు సరిపడా ఎరువులను వీలైనంత త్వరగా రాష్ట్రానికి సరఫరా చేయాలని కోరుతూ కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వశాఖ మంత్రి జేపీ నడ్డాకు మంత్రి లేఖ రాశారు. వానాకాలం పంటలు తెలంగాణలో ముందుగా ప్రారంభమవుతాయని, దానికి తగ్గట్లుగా రాష్ట్ర ప్రభుత్వం వచ్చే రెండు నెలలకు సరిపడా ఎరువులను ముందుగానే తెప్పించి రైతులకు అందుబాటులో ఉంచేందుకు ప్రణాళిక సిద్ధం చేసిందని తెలిపారు. రాష్ట్ర కేటాయింపుల ప్రకారం ఆగస్టు నెల వరకు కేటాయించిన డీఏపీ, ఇతర ఎరువులను వెంటనే సరఫరా చేసేలా తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు. -
వ్యవసాయానికి రూ.1.34 లక్షల కోట్లు
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది వ్యవసాయ రంగానికి రూ.1.34 లక్షల కోట్ల రుణాలు ఇవ్వాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) నిర్ణయించింది. 2024–25 రాష్ట్ర స్థాయి రుణ ప్రణాళికను రూ.6.33 లక్షల కోట్లుగా ఖరారు చేసింది. ఇది గత ఏడాది కంటే 161 శాతం అధికం కావడం గమనార్హం. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు బుధవారం ఈ రుణ ప్రణాళికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఎస్ఎల్బీసీ సమావేశంలో భట్టి మాట్లాడారు. బ్యాంకర్లకు సామాజిక, మానవీయ కోణం ఉండాలని సూచించారు. బ్యాంకర్లకు పాజిటివ్ ధృక్పథం లేకపోతే ఏ రాష్ట్రం అభివృద్ధి చెందదన్నారు. నిరుపేదలు, మధ్యతరగతి వర్గాలకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు రావాలని కోరారు. బలహీన వర్గాలకు విరివిగా రుణాలు ఇస్తేనే రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందుతుందన్నారు. హైదరాబాద్ పెట్టుబడులకు స్వర్గధామంగా మారిందని, రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంతో తెలంగాణ రూపురేఖలు మారిపోతాయని పేర్కొన్నారు. త్వరలో కొత్త విద్యుత్ పాలసీ వ్యవసాయ, పారిశ్రామిక రంగాల అభివృద్ధితో రాష్ట్రం అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడనుందని భట్టి చెప్పారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన చెల్లింపుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రూపాయి కూడా పెండింగ్లో పెట్టదని హామీ ఇచ్చారు. ఆయిల్ పామ్ సాగుకు రాష్ట్ర ప్రభుత్వం అన్నిరకాల ప్రోత్సాహకాలు అందిస్తుందన్నారు. మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉందని, రెప్పపాటు కూడా కరెంటు కోతలు లేవని పేర్కొన్నారు. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త విద్యుత్ పాలసీని తీసుకురాబోతోందని తెలిపారు. సన్న చిన్నకారు రైతులపై చిన్నచూపు: మంత్రి తుమ్మల వ్యవసాయ రంగానికి సంబంధించి గత సంవత్సరం కంటే రూ.13 వేల కోట్ల రుణాలు అధికంగా మంజూరు చేసినప్పటికీ, సన్న చిన్నకారు రైతుల వాటా అనుకున్నంత మేర లేదని మంత్రి తుమ్మల అన్నారు. రాష్ట్రంలో 73.11 శాతం భూములు వారి చేతిలోనే ఉన్నాయని, వీరికి ఇచ్చే రుణాలను పెంచాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. రాష్ట్రంలో వివిధ బ్యాంకులకు చెందిన 6,415 శాఖల ద్వారా సేవలందిస్తున్నప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో కేవలం 1,874 మాత్రమే ఉన్నాయన్నారు. వాటిని పెంచాల్సిన అవసరం ఉందని తుమ్మల చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆయిల్ పామ్ సాగుకు బ్యాంకుల నుండి ప్రోత్సాహం కరువైందన్నారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణరావు, ఆర్బీఐ ప్రాంతీయ డైరెక్టర్ కమల్ ప్రసాద్ పటా్నయక్, నాబార్డు సీజీఎం సుశీల్ చింతల, ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ రాజేశ్కుమార్, ఎస్బీఐ జనరల్ మేనేజర్ దేబశిష్ మిత్ర తదితరులు పాల్గొన్నారు. రుణాల కేటాయింపులు ఇలా... – 2024–25 వార్షిక రుణ ప్రణాళిక మొత్తం రూ.6,33,777 కోట్లు – ప్రాధాన్య రంగాలకు అడ్వాన్సులు రూ.2,80,550 కోట్లు – వ్యవసాయ రంగానికి రూ.1,34,138 కోట్లు – వ్యవసాయ రంగ కేటాయింపుల్లో పంట రుణాలకు రూ.81,478 కోట్లు. (గతం కంటే 10.95% పెరుగుదల), వ్యవసాయ పెట్టుబడులకు రూ.28,222 కోట్లు, వ్యవసాయ మౌలిక సదుపాయాలకు రూ.5,197 కోట్లు, వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలకు రూ.19,239 కోట్లు – సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు రూ.1,29,635 కోట్లు – గృహ రుణాలు రూ.10,768 కోట్లు – విద్యా రుణాలు రూ.2,706 కోట్లు – ఇతర రంగాలకు రూ.3,301 కోట్లు – 2023–24లో మొత్తం డిపాజిట్లు రూ.7,79,953 కోట్లు (గతం కంటే రూ. 96,547 కోట్లు వృద్ధి) – మొత్తం అడ్వాన్సులు రూ.9,79,058 కోట్లు (గతం కంటే రూ.1,65,162 కోట్ల వృద్ధి) – పంట రుణాలు రూ.64,940 కోట్లు. (లక్ష్యంలో 88.42% మంజూరు) – వ్యవసాయ పెట్టుబడి రుణాలు, అనుబంధ రంగాలు, కార్యక్రమాలకు రూ. 47,935 కోట్లు (లక్ష్యంలో 121.89% ఇచ్చారు) -
పాత పద్ధతిలోనే రైతుభరోసా!
సాక్షి, హైదరాబాద్: ఈ వానాకాలం సీజన్ వరకు పాత పద్ధతిలోనే రైతుభరోసా (రైతుబంధు) అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటివరకు ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు ఖరారు కాకపోవడం, వానాకాలం సీజన్ ప్రారంభమై రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో సర్కారు ఈ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. వ్యవసాయ శాఖ కూడా ఇదే ప్రతిపాదనను ప్రభుత్వం ముందుంచింది. గత యాసంగి సీజన్లో ఇచ్చిన రైతులకే ఈసారి కూడా రైతుభరోసా సొమ్ము ఇస్తారు. వాస్తవంగా ప్రతి ఏడాది జూన్లోనే రైతుబంధు సొమ్ము ఇస్తారు. వానాకాలం సీజన్ ప్రారంభానికి ముందే ఇవ్వాలన్నది రైతుబంధు నిబంధన. సీజన్కు ఎకరానికి రూ.7,500 ఇస్తామన్న కాంగ్రెస్ రైతుబంధు పథకాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం 2018 వానాకాలం సీజన్ నుంచి ప్రారంభించిన సంగతి తెలిసిందే. మొదట్లో ప్రతి సీజన్కు ఎకరాకు రూ.4 వేల చొప్పున ప్రతి రైతుకు అందజేశారు. అలా ఏడాదికి ఎకరానికి రూ.8 వేల చొప్పున రైతులకు అందేవి. ఆ తర్వాత సీజన్కు రూ.5 వేల చొప్పున ఏడాదికి రూ.10 వేలు అందజేశారు. కాంగ్రెస్ పార్టీ సీజన్కు ఎకరానికి రూ.7,500కు పెంచి ఇస్తామని హామీ ఇచ్చింది. ఆ ప్రకారం రెండు సీజన్లకు కలిపి రూ.15 వేలు ఇవ్వాలి. అయితే అధికారంలోకి వచ్చాక తొలిసారిగా యాసంగి సీజన్లో మాత్రం పెరిగిన సొమ్మును కాకుండా పాత పద్ధతిలోనే ఎకరాకు రూ.5 వేలే ఇచ్చింది. వానాకాలం సీజన్ నుంచి ఎకరాకు రూ.7,500 ఇస్తామని పేర్కొంది. అయితే వానాకాలం సీజన్ ఇప్పటికే ప్రారంభమైంది. కానీ రైతుభరోసా మార్గదర్శకాలు ఇంకా ఖరారు కాలేదు. పైగా ఈ మార్గదర్శకాలను అసెంబ్లీలో చర్చించి ఖరారు చేస్తామని గతంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. అయితే ఇప్పటికిప్పుడు అది సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. అయితే ఈ వానాకాలం సీజన్లో రైతులకు నిర్ణీత సమయంలోగా రైతుభరోసా సొమ్మును ఇవ్వాలని భావిస్తున్న ప్రభుత్వం.. పాత పద్ధతిలో సొమ్ము అందజేయనుంది. అంటే ఎకరాకు తొలుత రూ.5 వేలే ఇస్తారు. ఆ తర్వాత రైతుభరోసా మార్గదర్శకాలు ఖరారు చేసి వచ్చే నెల మరో రూ.2,500 ఎకరాకు ఇవ్వాలనేది సర్కారు ఆలోచనగా ఉన్నట్లు వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. యాసంగిలో 1.52 కోట్ల ఎకరాలకు రూ.7,625 కోట్లు విడుదల చేసింది. ఈ వానాకాలంలోనూ ఇదే మొత్తం రైతులకు ఇచ్చే అవకాశముంది. మార్గదర్శకాలపై కసరత్తు రైతుభరోసా మార్గదర్శకాలపై వ్యవసాయ శాఖ కసరత్తు ప్రారంభించింది. సీలింగ్ ప్రకారం ఇవ్వాలా? ఎలా చేయాలన్న దానిపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. పంట వేసినట్లు నిర్ధారణ అయిన భూముల రైతులకే ఆర్థిక సాయం అందించాలని కూడా భావిస్తున్నారు. అంతేకాదు దీనిని గరిష్టంగా ఐదెకరాలకే పరిమితం చేసే అంశమూ చర్చకు వస్తోంది. గత యాసంగి సీజన్లో 1.52 కోట్ల ఎకరాలకు చెందిన 68.97 లక్షల మంది రైతులకు రూ.7,625 కోట్లు అందజేశారు. అందులో ఐదెకరాలోపు భూమి ఉన్న రైతుల సంఖ్య 62.32 లక్షల మంది కాగా, వారి చేతిలో కోటి ఎకరాల భూమి ఉంది. అంటే మొత్తం రైతుభరోసా అందుకుంటున్న రైతుల్లో ఐదెకరాలోపు రైతులే 90.36 శాతం ఉండటం గమనార్హం. దీంతో ఐదెకరాలకు పరిమితం చేసినా 90 శాతం మందికి రైతుభరోసా ఇచ్చినట్లు అవుతుందని అంటున్నారు. రాష్ట్రంలో ఎకరాలోపున్న రైతులు 22.55 లక్షల మంది, ఎకరా నుంచి రెండెకరాల వరకున్న రైతులు 16.98 లక్షల మంది, రెండెకరాల నుంచి మూడెకరాల లోపున్న రైతులు 10.89 లక్షల మంది ఉన్నారు. మూడెకరాల నుంచి నాలుగెకరాల లోపున్న రైతులు 6.64 లక్షల మంది, నాలుగెకరాల నుంచి ఐదెకరాల లోపున్న రైతులు 5.26 లక్షల మంది ఉన్నారు. ఇక ఐదెకరాలకు పైగా భూమి ఉన్న రైతులు 6.65 లక్షల మంది ఉన్నారు. కొండలు, గుట్టలను కూడా రైతుభరోసా నుంచి మినహాయిస్తారు. ఉపగ్రహ ఛాయా చిత్రాల ఆధారంగా అటువంటి భూములను గుర్తిస్తారు. -
అపరాలలోనూ విత్తన మార్పిడి
సాక్షి, అమరావతి: విత్తన మార్పిడిపై వ్యవసాయ శాఖ దృష్టి పెట్టింది. ఏళ్ల తరబడి సాగులో ఉన్న రకాల స్థానంలో కొత్తగా అభివృద్ధి చేసిన వంగడాలను ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఖరీఫ్, రబీ సీజన్లలో విస్తారంగా సాగయ్యే అపరాలతో పాటు రబీ సీజన్లో ఎక్కువగా సాగయ్యే శనగలో కొత్త వంగడాలను ప్రవేశపెట్టాటలని నిర్ణయించింది. ఖరీఫ్లో వరి తర్వాత ఎక్కువగా 5.9 లక్షల ఎకరాల్లో కందులు, 1.5 లక్షల ఎకరాల్లో మినుములు, పెసలుతో పాటు ఇతర అపరాలు సాగువుతుంటాయి.రబీలో వరి తర్వాత 10.92 లక్షల ఎకరాల్లో శనగ, 7.25 లక్షల ఎకరాల్లో మినుము, 1.75 లక్షల ఎకరాల్లో పెసలు, మరో 1.10 లక్షల ఎకరాల్లో ఇతర అపరాలు సాగవుతుంటాయి. అపరాలు, శనగలలో కొన్ని రకాలు 30 ఏళ్లకు పైబడి సాగులో ఉన్నాయి. ప్రధానంగా ఖరీఫ్లో కందులులో ఎల్ఆర్జీ 52 (2015) వంగడం 1.50 లక్షల ఎకరాలలో సాగవుతుండగా, ఎల్ఆర్జీ 41 రకం (2007) 29వేల ఎకరాలు, ఆషా (1992) వంగడం 11వేల ఎకరాల్లో సాగవుతోంది. మినుములో పీయూ–31 (2005) రకం 58 వేల ఎకరాల్లో సాగవుతోంది. రబీలో శనగలు అత్యధికంగా 1999లో విడుదలైన జేజీ–11 రకం ఏకంగా 7.25 లక్షల ఎకరాల్లో, కేఏకే–2 (2000) రకం 44 వేల ఎకరాల్లో సాగవుతోంది. ఈ రకాలు చీడ పీడలను తట్టుకోలేకపోతున్నాయి. తుపాన్లు, వర్షాల సమయంలో ముంపునకు గురై రైతులకు భారీ నష్టాన్ని మిగులుస్తున్నాయి. వీటికి ప్రత్యామ్నాయంగా ఇటీవల విడుదలైన తెగుళ్లను తట్టుకుంటూ అధిక దిగుబడినిచ్చే వంగడాలను ప్రోత్సహించేలా వ్యవసాయ శాఖ కార్యాచరణ రూపొందించింది. దశలవారీగా విస్తరణ డీఏఏటీఐ, కేవీకే శాస్త్రవేత్తలు, విత్తనాభివృద్ధి సంస్థ అధికారులతో జిల్లా స్థాయిలో నిర్వహించిన సదస్సులతో కొత్త విత్తనాల సాగుపై వ్యవసాయ శాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. దశలవారీగా కొత్త రకాల సాగును విస్తరించనుంది. 2024–25 సీజన్లో 10 శాతం, 2025–26 సీజన్లో 15 శాతం, 2026–27లో 25 శాతం విస్తీర్ణంలో విత్తన మారి్పడి చేయనున్నారు. తరువాత సంవత్సరాల్లో ఇదే విధానం కొనసాగుతుంది. ఈ విత్తనాలపై గ్రామ స్థాయిలో అవగాహన కల్పించనున్నారు. కొత్త రకాల ప్రత్యేకతను అందరికీ అర్ధమయ్యే రీతిలో వాల్ పోస్టర్లు, కరపత్రాలు, శాస్త్రవేత్తలు, అభ్యుదయ రైతుల సందేశాలతో కూడిన వీడియోలు, వాట్సాప్ గ్రూప్ల ద్వారా వివరిస్తారు. మినుములో ప్రత్యామ్నాయ రకాలు » పీయూ–31కు బదులుగా ఖరీఫ్ సీజన్లో ఎల్బీజీ 884, టీబీజీ 104, వీబీఎన్8, ఎల్జీబీ 904, జీబీజీ1, టీబీజీ 129, ఎల్బీజీ 787, ఎల్బీజీ 752 ప్రవేశపెడతారు. రబీలో ఎల్బీజీ 752 మినహా మిగిలిన వంగడాల సాగును ప్రోత్సహిస్తారు. » తరచూ తెగుళ్ల బారిన పడుతున్న ఐపీయూ 2–43 కి ప్రత్యామ్నాయంగా రెండు సీజన్లలో ఎల్బీజీ 904 రకం » ఎల్బీజీ 752కు బదులుగా ఖరీఫ్లో టీబీజీ 129, రబీలో టీబీజీ 104, వీబీఎన్ 8, ఎల్బీజీ 904, జీబీజీ1, ఎల్బీజీ 787 » టీ–9కు బదులుగా రెండు సీజన్లలో ఎల్బీజీ 884 రకాన్ని, టీబీజీ 104కు బదులుగా ఎల్బీజీ 904 రకం ఏపీ సీడ్స్ ద్వారా సర్టిఫైడ్ సీడ్ ఉత్పత్తి బ్రీడర్ విత్తనాన్ని ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం ఉత్పత్తి చేసింది. ఎంపిక చేసిన రైతుల క్షేత్రాల్లో బ్రీడర్ సీడ్ నుంచి మూల విత్తనాన్ని పండిస్తారు. ఈ మూల విత్తనాన్ని ఏపీ సీడ్స్ ఎంపిక చేసిన రైతుల క్షేత్రాల్లో నాటి సరి్టఫైడ్ సీడ్ను పండిస్తారు. వీటిని ఏపీ విత్తన ధ్రువీకరణ అథారిటీ ధ్రువీకరిస్తుంది. బ్రీడర్, ఫౌండేషన్ సీడ్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ముందుగా ప్రాధాన్యతనిస్తారు. పూర్తిస్థాయిలో విత్తనం అందుబాటులోకి తెచ్చిన తర్వాత సబ్సిడీపై రైతులకు సరఫరా చేస్తారు. పెసలులో ప్రత్యామ్నాయ రకాలు: » ఐపీఎం 2–14కు ప్రత్యామ్నాయంగా రెండు సీజన్లలో ఎల్జీజీ 574, ఎల్జీజీ 607,ఎల్జీజీ 630 ఎల్జీజీ 600 రకాలు. రబీలో వీటితో పాటు అదనంగా విరాట్, శిఖ రకాలు » ఎల్జీజీ 407కు ప్రత్యామ్నాయంగా రెండు సీజన్లలో ఎల్జీజీ 607 రకాలు, ఎల్జీజీ 460కు బదులుగా ఐపీఎం 2–14, ఎల్జీజీ 630, ఎల్జీజీ 607 రకాలు కందులులో ప్రత్యామ్నాయ వంగడాలు ళీ ఎల్ఆర్జీ 52 స్థానంలో ఖరీఫ్లో టీఆర్జీ 59 (తిరుపతి కంది), ఎల్ఆర్జీ 105, ఎల్ఆర్జీ 133–33, పీఆర్జీ 176 రకాలను, రబీలో ఎల్ఆర్జీ 105 (కృష్ణ) రకాలను ప్రవేశపెడతారు. » ఎల్ఆర్జీ 41 స్థానంలో ఖరీఫ్లో పీఆర్జీ 158, టీఆర్జీ 59, ఎల్ఆర్జీ 105, ఎల్ఆర్జీ 133–33 (సౌభాగ్య), పీఆర్జీ 176, ఎల్ఆర్జీ 52 రకాలను, రబీలో ఎల్ఆర్జీ 105 రకాలు » ఐసీపీహెచ్ 2740, ఐసీపీఎల్ 87119, పీఆర్జీ 158 రకాలకు బదులుగా రెండు సీజన్లలోనూ ఎల్ఆర్జీ 105 రకం » ఐసీపీహెచ్ 87063 కు బదులుగా రెండు సీజన్లలోనూ ఎల్ఆర్జీ 105, ఎల్ఆర్జీ 133–33 రకాలను ప్రవేశపెడతారు. శనగలో ప్రత్యామ్నాయ రకాలు శనగలో కేఏకే 2కు బదులుగా ఎన్బీఈజీ 119 రకాన్ని, జేజీ 11కు బదులుగా ఎన్బీఈజీ 776 రకాలు, ఎన్ఈజీ 452 (నంద్యాల గ్రామ్ 452), ఎన్బీఈజీ 810 (నంద్యాల గ్రామ్ 810), ఎన్బీఈజీ 857 (నంద్యాల గ్రామ్) వంటి కొత్త వంగడాల సాగును ప్రోత్సహించనున్నారు -
కాడి.. మేడి.. ఖరీఫ్కు రెడీ
సాక్షి, అమరావతి: మృగశిర కార్తె మొదలైంది. వ్యవసాయ పనిముట్లయిన కాడిమేడిలకు పూజలు చేస్తున్న రైతులు సాగు కోసం భూమిని రైతన్నలు సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యేందుకు సన్నద్ధం అవుతున్నారు. అక్కడక్కడా కొన్ని చోట్ల దుక్కిదున్ని పచ్చి రొట్ట వేసుకుంటున్నారు. మరికొన్ని చోట్ల నారుమడులు వేసేందుకు సిద్ధమవుతున్నారు. రాయలసీమ జిల్లాల్లో వేరుశనగ, ఏజెన్సీ జిల్లాల్లో వరి పంట విత్తుకుంటున్నారు. ఈసారి ముందుగానే నైరుతి రుతు పవనాలు పలకరించడంతో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ ప్రకటన రైతుల్లో ఉత్సాహం నింపింది. పలుచోట్ల ఇప్పటికే సాధారణం కంటే ఎక్కువగానే వర్షపాతం నమోదైనట్టుగా చెబుతున్నారు. ఆర్బీకేల వద్ద అన్నదాతల సందడి ఎన్నికలలో బిజీబిజీగా ఉన్నప్పటికీ ఖరీఫ్ సీజన్లో అదును దాటిపోకుండా రైతులు విత్తుకునేందుకు వీలుగా వైఎస్ జగన్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులను పంపిణీకి సిద్ధం చేసింది. రైతులు ఆర్బీకేల్లో నిల్వ చేసిన విత్తనాల మొలక శాతం కట్టి నాణ్యతను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ దాదాపు పూర్తి కావచ్చి0ది. మరోవైపు రాయలసీమ జిల్లాల్లో వేరుశనగ విత్తన పంపిణీ జోరందుకుంది. వరి సహా ఇతర విత్తనాలను సైతం ఆర్బీకేల్లో నిల్వ చేశారు. విత్తనం కోసం తమ వివరాల నమోదు కోసం వస్తున్న రైతులు, ఇప్పటికే నమోదు చేసుకున్న వారు విత్తనాల కోసం వస్తుండటంతో ఆర్బీకేల్లో సందడి మొదలైంది. పరిహారం ఆదుకుంది గత ఖరీఫ్లో ఏర్పడిన కరువుకు సంబంధించిన పరిహారంతో పాటు రబీలో మిచాంగ్ తుపాన్ వల్ల పంటలు నష్టపోయిన 10.44 లక్షల మంది రైతులకు రూ.1,289.57 కోట్ల పెట్టుబడి రాయితీ కౌంటింగ్కు ముందే జమ చేసేందుకు జగన్ ప్రభుత్వం ఏర్పాట్లు చేయగా.. ఇప్పటికే 8.89 లక్షల మందికి రూ.1,126.45 కోట్లు జమైంది. ఇంకా 1.54 లక్షల మందికి రూ.163.12 కోట్లు జమ కావాల్సి ఉంది. ఖరీఫ్ సీజన్కు ముందు జగన్ ప్రభుత్వం పెట్టుబడి రాయితీ అందించడం రైతులకు కొంత ఊరటనిచ్చి0ది.ఇప్పటికే 2.30 లక్షల క్వింటాళ్ల విత్తనాల పంపిణీ ఖరీఫ్ సాగు లక్ష్యం 85.65 లక్షల ఎకరాలుగా నిర్ణయించారు. ఇందులో వరి 39.07 లక్షల ఎకరాలు, 14.80 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 14.67 లక్షల ఎకరాల్లో పత్తి, 6.35లక్షల ఎకరాల్లో కందులు, 3.55 లక్షల ఎకరాల్లో మొక్కజొన్నతో పాటు ఇతర పంటలు సాగు చేయనున్నారు. ఇందుకోసం 6.32 లక్షల క్వింటాళ్లు అవసరమవుతాయని అంచనా వేయగా.. 6.50 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని అందుబాటులో ఉంచారు. ఇప్పటికే ఆర్బీకేల్లో 3.92 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని నిల్వ చేశారు. 3.09 లక్షల క్వింటాళ్ల విత్తనాల కోసం 4.84 లక్షల మంది రైతులు ఆర్బీకేల్లో నమోదు చేసుకున్నారు. 3.52 లక్షల మంది రైతులు 2.30 లక్షల క్వింటాళ్ల విత్తనాలను తీసుకెళ్లారు. 17.50 లక్షల టన్నుల ఎరువులు అవసరం కాగా.. ఇప్పటికే 10 లక్షల టన్నుల ఎరువులు అందుబాటులో ఉంచారు. 5 లక్షల బాటిళ్ల నానో యూరియా, 2 లక్షల బాటిళ్ల నానో డీఏపీ ఇఫ్కో ద్వారా పంపిణీకి సిద్ధం చేశారు. కనీసం 5.60 లక్షల టన్నుల ఎరువులను ఆర్బీకేల ద్వారా సరఫరాకు సన్నాహాలు చేస్తున్నారు.పెట్టుబడి సాయం కోసం ఎదురుచూపులు ఐదేళ్లుగా ఏటా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున వైఎస్ జగన్ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం అందించింది. ఐదేళ్లలో 53.58 లక్షల మంది రైతులకు రూ.34,288.17 కోట్ల పెట్టుబడి సాయం అందింది. ఖరీఫ్ సీజన్ ఆరంభానికి ముందే మే, జూన్ నెలల్లో రూ.7,500 చొప్పున రైతులు తొలివిడత పెట్టుబడి సాయం అందుకునేవారు. ఈ సొమ్ములు ఖరీఫ్లో విత్తనాల కొనుగోలు, వ్యవసాయ పనులకు ఎంతగానో ఉపయోగపడేవి. మళ్లీ జగన్ ప్రభుత్వం వచ్చి ఉంటే తమకు ఈపాటికే పెట్టుబడి సాయం అంది ఉండేదని రైతులు చెప్పుకుంటున్నారు. తాము అధికారంలోకి రాగానే ఏటా రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించిన కూటమి ప్రభుత్వం ఇంకా కొలువుతీరలేదు. ఈ పరిస్థితుల్లో పెట్టుబడి సాయం ఎప్పుడు చేతికి అందుతుందో తెలియక రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. -
సాగు సీజన్ షురూ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతున్నారు. దుక్కులు దున్నడం మొదలుపెట్టారు. మరికాస్త వర్షం పడితే చాలు వెంటనే విత్తనాలు చల్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించడం, వచ్చే మూడు నాలుగు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో.. వానాకాలం వ్యవసాయ సీజన్ గతం కంటే ముందుగా ప్రారంభమైనట్లేనని వ్యవసాయశాఖ వెల్లడించింది. ఈ వానాకాలం సీజన్లో 1.34 కోట్ల ఎకరాల్లో పంటల సాగు జరుగుతుందని అంచనా వేసింది. గతేడాది వానాకాలం సీజన్లో 1.26 కోట్ల ఎకరాల్లో పంటలు సాగవగా.. ఈసారి 8 లక్షల ఎకరాల్లో అధికంగా పంటల సాగు జరుగుతుందని పేర్కొంది. ఈ మేరకు ఇటీవలే పంటల సాగు ప్రణాళికను విడుదల చేసింది. అత్యధికంగా 66 లక్షల ఎకరాల్లో వరి, ఆ తర్వాత 60 లక్షల ఎకరాల్లో పత్తి సాగు అవుతుందని తెలిపింది. గతేడాది వరి 65 లక్షల ఎకరాల్లో, పత్తి 44.77 లక్షల ఎకరాల్లో సాగు అయ్యింది. ఈసారి పత్తి మరో 15.23 లక్షల ఎకరాల్లో సాగయ్యేలా రైతులను ప్రోత్సహించనున్నారు. వరి కంటే ఎక్కువగా పత్తిని ప్రోత్సహించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఆ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. విత్తన ప్రణాళిక ఖరారు సాగుకనుగుణంగా విత్తన ప్రణాళికను కూడా వ్యవసాయ శాఖ ఖరారు చేసింది. ఈ వానాకాలం సీజన్కు 19.39 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమని నిర్ణయించారు. అందులో అత్యధికంగా 16.50 లక్షల క్వింటాళ్లు వరి విత్తనాలే కావడం గమనార్హం. పత్తి విత్తనాలు 54 వేల క్వింటాళ్లు, సోయాబీన్ విత్తనాలు 1.49 లక్షల క్వింటాళ్లు అందుబాటులోకి తెస్తారు. మొక్కజొన్న విత్తనాలు 48 వేల క్వింటాళ్లు, కంది విత్తనాలు 16,950 క్వింటాళ్లు, వేరుశనగ విత్తనాలు 13,800 క్వింటాళ్లు, పెసర విత్తనాలు 4,480 క్వింటాళ్లు సిద్ధం చేశారు. అలాగే జొన్న, సజ్జ, రాగి, మినుములు, ఆముదం, పొద్దు తిరుగుడు విత్తనాలను కూడా సిద్ధం చేయాలని నిర్ణయించారు. కొందరు రైతులు ఇప్పటికే విత్తనాలు కొనుగోలు చేయగా, మరికొందరు విత్తనాలు, ఎరువుల కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు రైతులకు అవసరమైన అన్ని రకాల ఎరువులు సిద్ధంగా ఉన్నాయని మార్క్ఫెడ్ వెల్లడించింది. వ్యవ‘సాయానికి’సన్నాహాలు ఈ వానాకాలం సీజన్ నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రైతుబంధు స్థానంలో రైతుభరోసా ద్వారా పెంచిన పెట్టుబడి సాయం అందజేయనుంది. ఎకరాకు రూ.7,500 చొప్పున ఇవ్వనుంది. అయితే సాగయ్యే భూములకే ఇవ్వాలని, సీలింగ్ విధించాలని నిర్ణయించారు. అందుకు సంబంధించిన మార్గదర్శకాలు ఖరారు చేసే పనిలో వ్యవసాయశాఖ నిమగ్నమైంది. కౌలుదారులకు కూడా రైతు భరోసా ఇవ్వనున్నారు. ఇక రైతులకు రూ.2 లక్షల వరకు పంట రుణమాఫీని ఆగస్టు 15వ తేదీ నాటికి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. అందుకు సంబంధించిన మార్గదర్శకాలు కూడా ఖరారు దశలో ఉన్నాయి. మరోవైపు ఈ వానాకాలం సీజన్ నుంచే రైతులకు పంటల బీమాను కూడా పునరుద్ధరించనున్నారు. 33 మందిపై కేసులు: మంత్రి తుమ్మల అనుమతి లేకుండా పత్తి విత్తనాల ప్యాకెట్లు విక్రయిస్తున్న 33 మందిపై కేసులు పెట్టి రూ. 2 కోట్ల విలువగల 118.29 క్వింటాళ్ళ విత్తనాలను స్వా«దీనం చేసుకున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విత్తనాలు బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారని తెలిసి ఇద్దరు డీలర్లపై కేసులు పెట్టామని వెల్లడించారు. పత్తి విత్తనాలు మార్కెట్లలో అవసరం మేరకు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. రైతులందరూ అ«దీకృత డీలర్ల వద్దే విత్తనాలు కొనుగోలు చేయాలని, ప్రైవేట్ వ్యక్తులు, మోసగాళ్ల వద్ద విత్తనాలు కొనుగోలు చేయవద్దని సూచించారు. ఇప్పటివరకు 84.43 లక్షల పత్తి విత్తనాల ప్యాకెట్లను సరఫరా చేశామని, అందులో రైతులు ఇప్పటికే 25.10 లక్షల ప్యాకెట్లు రైతులు కొనుగోలు చేశారని వివరించారు. -
కల్తీ విత్తన విక్రేతలపై ఉక్కుపాదం
సాక్షి, అమరావతి: రైతులు కల్తీల బారిన పడి నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కల్తీ విత్తనాలు అమ్మేవారిపై ఉక్కుపాదం మోపుతోంది. తయారీ, పంపిణీ, సరఫరాపై ప్రత్యేక బృందాలతో నిఘా ఉంచడంతోపాటు గ్రామస్థాయిలో వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేల) ద్వారా నాన్సబ్సిడీ విత్తనాలు అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తోంది. జిల్లా అధికారులకు విస్తృత అధికారాలు ఖరీఫ్ సీజన్కు 3 నెలల ముందే పత్తి, మిరప ఇతర విత్తనాలను సాగు విస్తీర్ణానికి తగినట్టుగా సరఫరా చేసేలా రాష్ట్ర ప్రభుత్వం కంపెనీలను సిద్ధం చేసింది. ముఖ్యంగా పత్తి విత్తనం 29 లక్షల ప్యాకెట్లు అవసరం కాగా, ప్రస్తుతం 30 లక్షల ప్యాకెట్లు అందుబాటులో ఉంచింది. ఇలా ఇతర విత్తనాలనూ సిద్ధం చేసింది. గతంలో మార్కెట్లోకి వచ్చిన తర్వాత నమూనాలు సేకరించి, నిషేధిత హెచ్టీ విత్తనాలను గుర్తిస్తే సంబంధిత డీలర్లపై చర్యలు తీసుకునే వారు. ప్రస్తుతం విత్తన తయారీ నుంచే నిఘాను కట్టుదిట్టం చేశారు. ప్రొసెసింగ్ ప్లాంట్లపై నిరంతర నిఘా ఉంచారు. డీలర్ల నుండి విత్తన నమూనాలతో పాటు ప్యాకింగ్, ధ్రువీకరణ, లేబులింగ్ వంటి వివిధ దశల్లో విత్తన నమూనాలను సేకరించి పరీక్షలు చేస్తున్నారు. ముఖ్యంగా నిషేధిత హెచ్టీ విత్తన విక్రయాలపై ప్రత్యేక నిఘా ఉంచారు. నకిలీ విత్తనాల నిరోధానికి జిల్లా వ్యవసాయాధికారులకు విస్తృత అధికారాలు ఇచ్చారు. వీరి పర్యవేక్షణలో సీడ్ ఇన్స్పెక్టర్లతో కూడిన క్షేత్ర స్థాయి ప్రత్యేక నిఘా బృందాల ద్వారా ప్రాసెసింగ్ యూనిట్లు, స్టోరేజీ పాయింట్లు, డీలర్లు, రిటైల్ షాపులు, డెలివరీ యూనిట్లలో నిరంతరం తనిఖీలు చేస్తున్నారు. జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయాల్లో ‘సీడ్ మానటరింగ్ సెల్’ ఏర్పాటు చేశారు. వ్యవసాయ శాఖ కమిషనరేట్ కార్యాలయంలో ‘సీడ్ రెగ్యులేషన్ సెల్’ (ఫోన్ నెం 8331056032), రైతు సమీకృత సమాచార కేంద్రం (టోల్ ఫ్రీ నెం. 155251)కు ఫోన్ చేస్తే వెంటనే చర్యలు తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పటివరకు ముగ్గురు డీలర్లపై 6ఏ కేసులు నమోదు చేశారు 7.77 లక్షల విలువైన పత్తి, మిరప విత్తనాలను జప్తు చేశారు. రూ.2.13 కోట్ల విలువైన 435 క్వింటాళ్ల పత్తి, మిరçప, కూరగాయల విత్తనాల అమ్మకాలను నిలిపివేశారు. ఆర్బీకేల ద్వారా నాన్ సబ్సిడీ విత్తనాలు సరి్టఫై చేసిన నాణ్యమైన పత్తి, మిరప, ఇతర నాన్సబ్సిడీ విత్తనాలను జూన్ రెండో వారం నుంచి ఆర్బీకేల ద్వారా ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది. ఇందు కోసం ఆయా కంపెనీలతో ఏపీ సీడ్స్ అవగాహన ఒప్పందం చేసుకోనుంది. ఈ విత్తనాల నాణ్యతను నాలుగు దశల్లో పరీక్షిస్తారు. శుద్ధి చేసిన విత్తనాన్ని ప్యాకింగ్ చేసి రైతులకు పంపిణీ చేసే ముందు ఆర్బీకేల్లో పరీక్షిస్తారు. ఆర్బీకే ఇన్చార్జితో పాటు గ్రామంలోని కొంతమంది రైతులతో కలిసి గ్రామ స్థాయిలో మరోసారి నాణ్యతను పరీక్షిస్తారు. కల్తీ విత్తనాలపై నిఘా పెంచాం గతంలో 2, 3 పత్తి విత్తన రకాలకు మాత్రమే డిమాండ్ ఉండగా, ప్రస్తుతం అనేక కంపెనీలు నిబంధనల మేరకు నాణ్యమైన విత్తనాలను మార్కెట్లోకి తెస్తున్నాయి. సర్టిఫై చేసిన పత్తి విత్తనాలను ఎమ్మార్పి కి మించి విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు సంబంధిత వ్యాపారుల లైసెన్సులను రద్దు చేసేలా ఆదేశాలిచ్చాం. తీవ్రతనుబట్టి క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తాం. – చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ ఆర్బీకేల ద్వారా అవగాహన నాణ్యమైన, సర్టిఫై చేసిన విత్తనాల ఎంపికపై రైతులకు ఆర్బీకేల ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. కల్తీ విత్తన విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా సరి్టఫై చేసిన నాణ్యమైన నాన్ సబ్సిడీ విత్తనాలను ఆర్బీకేల్లో అందుబాటులోకి తెస్తున్నాం. – ఎం.శివప్రసాద్, ఎండీ, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ కల్తీ విత్తనాల విక్రేతలపై ఫిర్యాదుకు ఈ నంబర్లకు ఫోన్ చేస్తే చాలు.. సీడ్ రెగ్యులేషన్ సెల్– 8331056032రైతు సమీకృత సమాచార కేంద్రం – 155251 (టోల్ ఫ్రీ నంబర్) -
కొత్త విత్తనాలు వేద్దాం
వరి సాగులో విత్తన మార్పిడిని ప్రోత్సహించేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. దశాబ్దాలుగా అన్నదాతలు సాగు చేస్తున్న పాత రకాల వరి వంగడాలకు బదులుగా శాస్త్రవేత్తల సిఫార్సుల మేరకు నవీకరించిన రకాల సాగును ప్రోత్సహించాలని భావిస్తోంది. దశలవారీగా వీటి సాగును విస్తరించేలా చర్యలు చేపట్టింది. ఆ దిశగా రైతులను కార్యోన్ముఖులను చేసేందుకు వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ద్వారా విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయించారు. సాక్షి, అమరావతి: వరి సాగులో విత్తన మారి్పడిని ప్రోత్సహించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. శాస్త్రవేత్తల సిఫార్సుల మేరకు నూతన విత్తనాల సాగును ప్రోత్సహించాలని భావిస్తోంది. ఈ మేరకు వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ద్వారా విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో వరి ఖరీఫ్ సీజన్లో 37 లక్షల ఎకరాల్లో, రబీలో 20 లక్షల ఎకరాల్లో సాగవుతోంది. ఖరీఫ్లో 20 లక్షల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో మూడు దశాబ్దాల క్రితం అభివృద్ధి చేసిన వంగడాలనే నేటికీ సాగు చేస్తున్నారు. వీటిలో ప్రధానంగా బీపీటీ 5204తో పాటు ఎంటీయూ 7029, ఎంటీయూ 1061, ఎంటీయూ 1064 రకాలు ఎక్కువగా పండిస్తున్నారు. దశాబ్దాలుగా సాగవుతుండడంతో చీడపీడలను తట్టుకోలేకపోతున్నాయి. తుఫాన్లతోపాటు కొద్దిపాటి వర్షాలను సైతం తట్టుకోలేక పంటచేలు నేలచూపులు చూస్తున్నాయి.భారీ వర్షాలొస్తే ముంపు బారిన పడుతున్నాయి. వీటికి సరైన ప్రత్యామ్నాయం లేక, కొత్తగా అభివృద్ధి చేసిన వంగడాలపై అవగాహన లేక రైతన్నలు వీటిపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. అందుబాటులో ప్రత్యామ్నాయ రకాలు శాస్త్రవేత్తల సుదీర్ఘ పరిశోధనల అనంతరం ఎంటీయూ 7029, ఎంటీయూ 1061, ఎంటీయూ 1064 రకాలకు ప్రత్యామ్నాయంగా ఎంటీయూ 1318 రకం వరి విత్తనాన్ని అందుబాటులోకి తెచ్చారు. గింజ రాలకపోవడంతోపాటు తెగుళ్లను సమర్థంగా తట్టుకుని మిల్లర్లకు నూక శాతం లేని రకంగా ఈ కొత్త వరి వంగడం ప్రాచుర్యం పొందింది. ఇక బీపీటీ 5204 రకానికి ప్రత్యామ్నాయంగా ఎంటీయూ 1271, ఎన్డీఎల్ఆర్ 7 రకాలు అందుబాటులోకి వచ్చాయి. తెగుళ్లు, పురుగులను తట్టుకునే సామర్థ్యంతో అభివృద్ధి చేసిన ఈ వంగడాలు గింజ రాలకుండా అధిక దిగుబడులు ఇస్తున్నట్లు శాస్త్రవేత్తలు ధృవీకరించారు. ఆర్జీఎల్ 2537 రకం వరికి ప్రత్యామ్నాయంగా ఎంటీయూ 1232 రకాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఇది సన్న గింజ రకం కావడంతోపాటు అధిక దిగుబడినిస్తుంది. వేరుశనగలో కే–6కు ప్రత్యామ్నాయం ఖరీఫ్లో సాగు చేసే నూనె గింజల్లో అత్యధిక విస్తీర్ణం (15 లక్షల ఎకరాలు)లో సాగయ్యే వేరుశనగలో కే–6 రకాన్నే దాదాపు మూడు దశాబ్దాలుగా పండిస్తున్నారు. తెగుళ్లు, చీడపీడలతో పాటు బెట్ట పరిస్థితులను తట్టుకోలేక, ఆశించిన దిగుబడులు రాకపోవడంతో రైతులు తీవ్ర నష్టాలను చవి చూస్తున్నారు. కే–6కు ప్రత్యామ్నాయంగా టీసీజీఎస్ 1694, కదిరి లేపాక్షి రకాలను అందుబాటులోకి తెచ్చారు. బెట్టనే కాకుండా తెగుళ్లను కూడాసమర్థంగా తట్టుకునే ఈ రకాలు అధిక దిగుబడినిస్తున్నాయని శాస్త్రవేత్తలు ధ్రువీకరించారు. దశలవారీగా విస్తరణ.. వ్యవసాయ శాఖాధికారులు, డీఏఏటీఐ, కేవీకే శాస్త్రవేత్తలు, విత్తనాభివృద్ధి సంస్థ అధికారులతో జిల్లా స్థాయిలో నిర్వహించిన సదస్సులతో కొత్త విత్తనాల సాగుపై వ్యవసాయ శాఖ పక్కాగా కార్యాచరణ సిద్ధం చేసింది. దశలవారీగా కొత్త రకాల సాగును విస్తరించేలా ప్రణాళిక రూపొందించారు. 2024–25 సీజన్లో 10 శాతం, 2025–26 సీజన్లో 15 శాతం, 2026–27లో 25 శాతం విస్తీర్ణంలో విత్తన మార్పిడి చేయనున్నారు. తరువాత సంవత్సరాల్లో ఇదే విధానం కొనసాగుతుంది. బ్రీడర్ విత్తనాన్ని ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉత్పత్తి చేసింది. ప్రభుత్వ క్షేత్రాలు/ఏపీ సీడ్స్ ఎంపిక చేసిన రైతుల క్షేత్రాల్లో బ్రీడర్ సీడ్ నుంచి మూల విత్తనాన్ని పండిస్తారు. ఏపీ సీడ్స్ ఎంపిక చేసిన రైతుల క్షేత్రాల్లో మూల విత్తనాన్ని నాటి సర్టిఫైడ్ సీడ్ను పండిస్తారు. వీటిని ఏపీ విత్తన ధ్రువీకరణ అథారిటీ ధ్రువీకరిస్తుంది. బ్రీడర్, ఫౌండేషన్ సీడ్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ముందుగా వీటి సాగుకు ప్రాధాన్యతనిస్తారు. పూర్తిస్థాయిలో విత్తనం అందుబాటులోకి తెచి్చన తర్వాత సబ్సిడీపై రైతులకు సరఫరా చేసి దశల వారీగా సాగు విస్తీర్ణం పెరిగేలా ప్రోత్సహిస్తారు. ఆర్బీకేల ద్వారా అవగాహన రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎంపిక చేసిన ప్రాంతాల్లో రైతుల వారీగా సమావేశాలు నిర్వహించి తొలుత అవగాహన కల్పించనున్నారు. కొత్త రకాల ప్రత్యేకతను అందరికీ అర్థమయ్యే రీతిలో వాల్ పోస్టర్లు, కరపత్రాల ద్వారా విç్తత ప్రచారం కల్పిస్తారు. ఆర్బీకే ఛానల్ ద్వారా శాస్త్రవేత్తలు, అభ్యుదయ రైతుల సందేశాలతో కూడిన వీడియోల ద్వారా వీటి సాగును ప్రోత్సహిస్తారు.చిన్న చిన్న వీడియో, ఆడియో సందేశాలను రూపొందించి పంటల వారీగా ఏర్పాటు చేసిన వాట్సప్ గ్రూపుల ద్వారా రైతులకు చేరవేసి వాటిపై అవగాహన కల్పిస్తారు. ప్రత్యామ్నాయ రకాల విస్తరణే లక్ష్యంరాష్ట్రంలో కొన్ని రకాల వంగడాలు దాదాపు 20–30 ఏళ్లకుపైగా సాగులో ఉన్నాయి. కనీసం 10–15 ఏళ్ల పాటు సాగు చేసిన వంగడాలను క్రమేపీ తగ్గించాలి. వాటి స్థానంలో ఇటీవల కొత్తగా అభివృద్ధి చేసిన వంగడాలను సాగులోకి తేవాల్సిన అవసరం ఉంది. వచ్చే మూడేళ్లలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో కనీసం 50 శాతం విస్తీర్ణంలో పాత వంగడాల స్థానంలో శాస్త్రవేత్తలు సిఫార్సు చేసిన కొత్త రకాల సాగును ప్రోత్సహించేలా కార్యాచరణ సిద్ధం చేశాం. –చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ -
పత్తి విత్తనాల కొరత లేదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పత్తి విత్తనాల కొరత ఎక్కడా లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. 2023–24 సంవత్సరంలో 44.92 లక్షల ఎకరాల పత్తి పంట సాగు కాగా, ఈ వానాకాలం సీజన్లో 55 లక్షల ఎకరాలలో పత్తి పంట సాగవుతుందని అంచనా వేసి 1.24 కోట్ల పత్తి విత్తన ప్యాకెట్లను రైతులకు అందుబాటులో ఉంచాలని నిర్ణయించామని వెల్లడించారు. దీనికనుగుణంగా బుధవారం వరకు 51,40,405 పత్తి ప్యాకెట్లను వివిధ జిల్లాలలో రైతులకు అందుబాటులో ఉంచినట్లు వివరించారు. ఇందులో వివిధ కంపెనీలకు చెందిన 10,39,040 పత్తి ప్యాకెట్లను ఇప్పటికే రైతులు కొనుగోలు చేశారని తెలిపారు. ఈ మేరకు మంత్రి తుమ్మల బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు.క్యూల్లో ప్యాకెట్ల పంపిణీ ఎక్కడ.. ఎందుకంటే..కొన్ని జిల్లాల్లోని రైతులు ఒకే కంపెనీకి చెందిన, ఒకే రకం పత్తి విత్తనాల కోసం డిమాండ్ చేస్తున్నారని మంత్రి తెలిపారు. అయితే ఆ రకం విత్తనాలు డిమాండ్ మేరకు లేకపోవడం వల్ల ఉన్న వాటిని రైతులందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో, ఒక్కొక్కరినీ వరుసలో నిల్చోబెట్టి ఆ రకానికి చెందిన పత్తి విత్తన ప్యాకెట్లు రెండేసి చొప్పున ఇచ్చామని ఆయన వివరించారు. అంతేతప్ప ఆ మార్కెట్లలోగానీ, ఆ జిల్లాల్లో గానీ పత్తి విత్తన ప్యాకెట్లలో ఎటువంటి కొరత లేదని స్పష్టం చేశారు. రైతులు ఒకటే కంపెనీ కోసం పోటీ పడొద్దురైతులు కేవలం ఒకటే కంపెనీ, ఒకటే రకానికి చెందిన విత్తనాల కోసమే పోటీ పడకుండా మార్కెట్లో అందుబాటులో ఉన్న, గతంలో మంచి దిగుబడులు ఇచ్చిన రకాలను కూడా కొనుగోలు చేయాలని మంత్రి సూచించారు. విత్తన చట్టాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని, ఈ సీజన్లో ఇప్పటి వరకు రూ.2.49 కోట్ల విలువైన 188.29 క్వింటాళ్ళ నకిలీ పత్తివిత్తనాలు స్వాధీనం చేసుకొని 33 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. 1.95 లక్షల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాన్ని పంపిణీ చేస్తాంఈ వానాకాలంలో 109.15 కోట్ల సబ్సిడీ విలువతో 1.95 లక్షల క్వింటాళ్ళ పచ్చి రొట్ట విత్తనాన్ని పంపిణీ చేయాలని ప్రతిపాదించి, ఇప్పటివరకు 79,261 క్వింటాళ్ళు పంపిణీ చేశామని, అందులో 54,162 క్వింటాళ్ళు రైతులు కొనుగోలు చేశారని మంత్రి తుమ్మల తెలిపారు. ఎరువులకు సంబంధించి కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుందని, యూరియా, డీఏపీ, కాంప్లెక్స్, ఎంఓపీ, ఎస్ఎస్పీ ఎరువులను 12.28 లక్షల మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంచినట్లు ఆయన వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పత్తి విత్తన దుకాణం వద్ద మండుటెండను సైతం లెక్కచేయకుండా విత్తనాలను కొనుగోలు చేసేందుకు గంటల తరబడి బారులు తీరి రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇదే సమయంలో బుధవారం విత్తన దుకాణాల తనిఖీకి వచ్చిన కలెక్టర్ రాజర్షి షా రైతుల ఇబ్బందులను చూసి.. టెంట్లు ఏర్పాటు చేయాలని షాపు యజమానిని ఆదేశించారు. దీంతో అప్పటికప్పుడు టెంట్లు ఏర్పాటు చేయడంతో రైతులు కాస్త సేద తీరారు.–సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ -
సాగుకు చక్కనైన సాయం
ఎన్నికలు ముగిసినా ఇంకా ఈనాడు దుగ్ధ తీరలేదు. ఏదోలా ప్రభుత్వంపైనా... అనుసరిస్తున్న విధానాలపైనా లేనిపోని విమర్శలు గుప్పించడమే పనిగా పెట్టుకుంది. ప్రజలను తప్పుదారి పట్టించేలా కథనాలు అందిస్తూ పైశాచికానందం పొందుతోంది. తాజాగా ప్రభుత్వం అందిస్తున్న రైతుభరోసా, పశు మత్స్యదర్శిని మ్యాగజైన్స్పైనా తన అక్కసును వెళ్లగక్కింది. దురుద్దేశంతో ఇచ్చిన ఈ కథనాన్ని ప్రభుత్వాధికారులు నిర్ద్వందంగా ఖండించారు. వారి ఆరోపణలను తిప్పి కొట్టారు.సాక్షి, అమరావతి: వ్యవసాయంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు సమగ్రంగా... సచిత్రంగా ఆకర్షణీయంగా అందించేందుకు రైతు భరోసా, పశుమత్స్య దర్శిని మ్యాగజైన్స్ను ఐదేళ్లుగా ప్రభుత్వం అందిస్తోంది. గతంలో మూస పద్ధతిలో బ్లాక్ అండ్ వైట్ కలర్లో నాణ్యత లేని మెటీరియల్తో ‘పాడి పంటలు’ పేరిట వ్యవసాయ అనుబంధ శాఖలన్నింటికీ కలిపి ఒకే మాస పత్రిక అందించేవారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా గతం కంటే మెరుగ్గా... ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఆయిల్ ప్రింట్ కవర్, అన్ని పేజీలు రంగుల్లో 44 పేజీలతో కూడిన ఈ మ్యాగజైన్ను ముద్రిస్తూ కేవలం రూ.25లకే అందిస్తున్నారు. గన్నవరం సమీకృత రైతు సమాచార కేంద్ర పరిధిలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి దాదాపు పది మంది పర్యవేక్షణలో ఈ మ్యాగజైన్ రూపొందుతోంది.ఆర్బీకేలకు ఉచితంగా సరఫరావ్యవసాయ అనుబంధ శాఖలకు సంబంధించి ఆర్బీకేల ద్వారా అందుబాటులో ఉంచే సాగు ఉత్పాదకాల వివరాలతో పాటు వ్యవసాయ, ఉద్యాన, పట్టు, ఆక్వా సాగులో పంటల వారీగా మెలకువలు, ఉత్తమ యాజమాన్య పద్ధతులు, శాస్త్రవేత్తలు, ఆయా రంగాల నిపుణుల సలహాలు, సూచనలు, ఆదర్శ రైతుల అభిప్రాయాలతో విభిన్న కథనాలను అందిస్తున్నారు. 2020 జూలైలో ఈ మ్యాగజైన్కు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం రైతులకు అవసరమైన సమాచారాన్ని నిక్షిప్తం చేస్తోంది. నాటి నుంచి నేటి వరకు ప్రతి నెల దాదాపు 14,300 ప్రతులను ముద్రించి ఆర్బీకేలకు వ్యవసాయ శాఖ అధికారులకు ఉచితంగా ఇస్తున్నారు. లక్షన్నర మంది చందాదారులుఆర్బీకే పరిధిలో 400–500 మంది రైతులు ఉండగా ఆర్బీకేలోని డిజిటల్ లైబ్రరీలో ఒక మాస పత్రిక మాత్రమే ఉంచడం వల్ల మెజారిటీ రైతులు చదవలేకపోతున్నారు. వీరి కోసం ఓ వైపు వ్యవసాయ, అనుబంధ శాఖల వెబ్సైట్లలో ఈ పత్రికను డిజిటల్ రూపంలో అందుబాటులో ఉంచారు. అయినప్పటికీ మెజార్టీ రైతుల నుంచి వస్తున్న ఒత్తిళ్ల మేరకు స్వచ్ఛందంగా చందాదారులుగా చేరుతున్న వారికి నేరుగా మ్యాగజైన్స్ అందజేస్తున్నారు. లాభ, నష్టాలతో సంబంధం లేకుండా ఉచితకాపీలు ఏ ధరతో ముద్రిస్తున్నారో అదే ధరకు రైతులకు అందిస్తున్నారు. చందాదారులుగా చేరగోరే రైతుల నుంచి మొత్తాన్ని వసూలు చేసే బాధ్యతను ఆర్బీకే సిబ్బందికి అప్పగించారు. ప్రస్తుతం ఈ పత్రికల చందాదారులు లక్షన్నరకు పైగా ఉన్నారు. ఉన్నతాశయంతో నిర్వహిస్తున్న ప్రభుత్వంపై ఈనాడు బురద జల్లడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.స్వచ్ఛందంగానే చేరుతున్నారుఈ మాసపత్రికల కోసం రైతులు స్వచ్ఛందంగానే చందాదారులుగా చేరుతున్నారు. వారిపై ఎలాంటి ఒత్తిళ్లు లేవు. వీటి ప్రాముఖ్యతపై గ్రామ స్థాయిలో రైతులకు అవగాహన కల్పించే బాధ్యతను ఆర్బీకే సిబ్బందికి అప్పగించాం. చందా దారులంతా ఆర్బీకే పరిధిలో ఉండే రైతులే కాబట్టి, వారికి ప్రతీ నెలా ఈ మాసపత్రికలు అందజేసే బాధ్యతను అప్పగించాం. చందాదారులుగా చేర్పించేందుకు ఆర్బీకే సిబ్బందిపై ఎలాంటి లక్ష్యాలు నిర్దేశించలేదు. – చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ -
సన్న విత్తనాలు సిద్ధం
సాక్షి, హైదరాబాద్: సన్న రకం ధాన్యానికే బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో వానాకాలం సీజన్కు ముందు రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఆ విత్తనాల కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వివిధ సన్న రకాల విత్తనాలను రైతులకు అందజేసేందుకు రంగం సిద్ధం చేసింది. మరోవైపు సన్నాలతో పాటు రైతులకు వివిధ రకాల నాణ్యమైన విత్తనాలను విక్రయించాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఈ క్రమంలో శుక్రవారం (24న) వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విత్తన మేళా నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. మేళాలో వ్యవసాయ వర్సిటీతో పాటు రాజేంద్రనగర్ పరిధిలోని భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి సంస్థలు ఐఐఓఆర్, ఐఐఎంఆర్,ఐఐఆర్ఆర్, ఉద్యాన, పశు వైద్య విశ్వవిద్యాలయం, వ్యవసాయ, ఉద్యాన అనుబంధ శాఖలు టీఎస్ఎస్డీసీ, ఎన్ఎస్సీ, టీఎస్ఎస్ఓసీఏలు పాల్గొననున్నాయి. అదే రోజున విశ్వవిద్యాలయ పరిధిలోని మూడు (జగిత్యాల, పాలెం, వరంగల్) ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానాలు, అలాగే వర్సిటీ పరిధిలోని కృషి విజ్ఞాన కేంద్రాలలో కూడా విత్తన మేళా నిర్వహించనున్నారు. వర్సిటీ ప్రాంగణంలో ఉదయం 10 గంటలకు మేళా ప్రారంభం కానుంది. విత్తనాలతో పాటు వర్సిటీ రూపొందించిన వ్యవసాయ సంబంధిత ఉత్పత్తులు రైతుల కొనుగోలు నిమిత్తం అందుబాటులో ఉంటాయి. మొత్తం 16 పంటలకు సంబంధించిన 67 రకాల విత్తనాలు కూడా ఉంటాయి. మేళాలో భాగంగా వ్యవసాయంలో ఆధునిక సాంకేతికత వినియోగంపై రైతుల సందేహాలు తీర్చటానికి ఆయా పంటల ప్రధాన శాస్త్రవేత్తలతో చర్చా గోష్టి ఏర్పాటు చేస్తున్నారు. అలాగే రైతులకు నూతన సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించటానికి వీలుగా వ్యవసాయ, అనుబంధ రంగాలతో కూడిన వ్యవసాయ ప్రదర్శన కూడా 24న నిర్వహిస్తున్నారు. ఈ 19 రకాలకే బోనస్? విత్తన మేళాలో వ్యవసాయ వర్సిటీలో రూపొందించిన 19 రకాల సన్న వరి విత్తనాలు విక్రయిస్తారు. బి.పి.టి. 5204, డబ్ల్యూ.జి.ఎల్–44, డబ్ల్యూ.జి.ఎల్ –962, డబ్ల్యూ.జి.ఎల్. 1119, డబ్ల్యూ.జి.ఎల్.1246, డబ్ల్యూ.జి.ఎల్ 1487, ఆర్.డి.ఆర్ 1162, ఆర్.డి.ఆర్ 1200, కె.ఎన్.ఎం 1638, కె.పి.ఎస్. 6251, జె.జి.ఎల్– 28545, జె.జి.ఎల్ 27356, జె.జి.ఎల్ 33124, ఆర్.ఎన్.ఆర్.15435, ఆర్.ఎన్.ఆర్– 2465, ఆర్.ఎన్.ఆర్– 11718, ఆర్.ఎన్.ఆర్. 21278, ఆర్.ఎన్.ఆర్. 29325, ఆర్.ఎన్.ఆర్. 15048 రకాలు అందబాటులో ఉంటాయి. అయితే ఈ 19 రకాల సన్న రకం విత్తనాలకే రూ. 500 బోనస్ ఇస్తారా అన్న చర్చ జరుగుతోంది. పైగా ఇవి వ్యవసాయ వర్సిటీ అభివృద్ధి చేసినవి కావడంతో ప్రభుత్వం వీటినే సిఫారసు చేస్తుందన్న ప్రచారమూ జరుగుతోంది. రైతులను సన్నాల వైపు మళ్లించాలన్న ఆలోచనతోనే బోనస్ ప్రకటించిందని అధికారులు చెబుతున్నారు. దీనిపై స్పష్టత రావాల్సి ఉందని అంటున్నారు. 8 రకాల దొడ్డు విత్తనాలు దొడ్డు గింజలకు సంబంధించి 8 రకాలు.. ఆర్.ఎన్.ఆర్–28361, ఆర్.ఎన్.ఆర్. 15459, కె.ఎన్.ఎం 118, ఎమ్.టి.యు. 1010, డబ్ల్యూ.జి.ఎల్– 915, జె.జి.ఎల్ 24423, జె.జి.ఎల్ 28639 అందుబాటులో ఉంచుతారు. సువాసన కలిగిన రకం ఆర్.ఎన్.ఆర్–2465 కూడా విక్రయిస్తారు. ఇక మొక్కజొన్నలో 5 హైబ్రిడ్లు డి.హెచ్.యం 117, డి.హెచ్.యం 121, బి.పి.సి.హెచ్. 6, కరీంనగర్ మక్క, కరీంనగర్ మక్క–1 ఉంటాయి. జొన్నలో పి.వై.పి.ఎస్–2, సి.ఎస్.వి–41, రాగిలో పి.ఆర్.ఎస్.38, ఆముదంలో పి.సి.హెచ్. 111, నువ్వుల్లో జె.జి.యస్–1020, వేరుశనగలో ధరణి విత్తనాలను అందుబాటులో ఉంచుతున్నట్లు వ్యవసాయ వర్సిటీ ప్రకటించింది. అలాగే అపరాలకు సంబంధించి పెసరలో డబ్ల్యూ.జి.జి 42, ఎమ్.జి.జి 295, ఎమ్.జి.జి 347, ఎమ్.జి.జి 385, మినుములో యం.బి.జి. 1070, కందిలో 8 రకాలు.. హనుమ, డబ్ల్యూ.ఆర్.జి.ఇ– 97, డబ్ల్యూ.ఆర్.జి.ఇ–93, డబ్ల్యూ.ఆర్.జి.ఇ–121, డబ్ల్యూ.ఆర్.జి.ఇ–255, పి.ఆర్.జి–176, టి.డి.ఆర్.జి–59, ఆశ అందుబాటులో ఉంచుతారు. సోయా చిక్కుడులో 4 రకాలు.. బాసర, కె.డి.ఎస్–726, ఎం.ఎ.యు.యస్–612, ఎ.ఐ.ఎస్.బి–50తో పాటు పశుగ్రాస పంటల విత్తనాలు కూడా అందుబాటులో ఉంచుతామని ప్రకటించారు. -
‘పంటల బీమా’కి రూ.3 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం రూ.3 వేల కోట్లు ఖర్చు చేయనుందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు వెల్లడించారు. ప్రభుత్వమే రైతుల ప్రీమియాన్ని చెల్లిస్తుందని స్పష్టం చేశారు. ఈ వానాకాలం పంటల సీజన్ నుంచే అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ మేరకు బుధవారం మంత్రి తుమ్మల ఒక ప్రకటన జారీచేశారు. తడిచిన ధాన్యాన్ని సైతం తమ ప్రభుత్వం సేకరిస్తుందని వివరించారు. గతంతో పోలిస్తే ముందస్తుగానే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, ధాన్యం కొనుగోళ్ల పర్యవేక్షణకు జిల్లాకొక ఐఏఎస్ను నియమించి ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నామని వివరించారు. తరుగు, తాలు పేరుతో కోతలు లేవని స్పష్టం చేశారు. గతంలో ప్రతి క్వింటాకు 7 నుంచి 10 కేజీల వరకు తరుగు పేరుతో మిల్లర్ల దోపిడీ జరిగిందనీ, ఈ దఫా మిల్లర్ల దోపిడీపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంతో కోతలకు మిల్లర్లు స్వస్తి చెప్పారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో ప్రతి కింటాపై రైతుకు రూ.150 నుంచి రూ.200 రూపాయల వరకు అదనపు లబ్ధి చేకూర్చామని తెలిపారు. పంట అమ్ముకున్న ఐదు రోజుల్లోనే రైతుల ఖాతాల్లోకి నగదు చేరుతుందని మంత్రి స్పష్టం చేశారు. గతంలో 45 రోజులు పట్టేదని, దాంతో రైతు ఎంతో వడ్డీ నష్ట పోయేవాడని గుర్తు చేశారు. భవిష్యత్లో దొడ్డు వడ్లకు కూడా రూ.500 బోనస్ తెలంగాణలో సన్న వడ్ల సాగును పెంచేందుకు ప్రభుత్వం రూ.500 బోనస్ ప్రకటించిందని మంత్రి తుమ్మల పునరుద్ఘాటించారు. రైతులు నాట్లేసుకునే సమయం దగ్గర పడిన నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన ఈ స్కీంను ప్రవేశపెట్టామని తెలిపారు. భవిష్యత్లో దొడ్డు వడ్లకు కూడా ఈ స్కీం వర్తింపచేస్తామని హామీనిచ్చారు. రాష్ట్రంలో దొడ్డు వడ్లు తినడం చాలా తగ్గిపోయిందనీ, పేదలు కూడా పెద్దోళ్లు తినే సన్న బియ్యం తినాలనే సంకల్పంతో రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం ధ్యేయంగా పెట్టుకుందని తెలిపారు. వచ్చే ఎన్నికల నాటికి అన్ని హామీలను పూర్తి చేసి తీరుతామనీ, లేకుంటే ఓట్లే అడగబోమని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. -
బోనస్ అంటే తెలియనోళ్లు మొరుగుతున్నారు
ఖమ్మం వన్టౌన్: కేబినెట్లో తీసుకున్న నిర్ణయం మేరకు సన్న బియ్యం పంపిణీ చేయనున్నామని, అందుకే సన్నాలు పండించే రైతులకు రూ.500 బోనస్ ప్రకటించామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. బోనస్ అంటే అర్థం తెలియని వారు కాంగ్రెస్పై మొరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఖమ్మంలో మంగళవారం నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం, జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన రాజీవ్గాంధీ వర్థంతి వేడుకల్లో పాల్గొని మంత్రి మాట్లాడారు. మా ప్రభుత్వం మూడు రోజుల్లోనే కూలిపోతుందని బీఆర్ఎస్ నేతలు భావించారని, అది సాధ్యం కాకపోవడంతో పొద్దున లేచింది మొదలు కాంగ్రెస్ పార్టీపై పడి ఏడుస్తున్నారన్నారు. ఎప్పుడు ఎవరి మీద ఏడవాలో తెలియని సన్నాసులు బీఆర్ఎస్ వాళ్లని పేర్కొన్నారు. పదేళ్ల పాటు వ్యవస్థలను నాశనం చేసిన వారు నీతులు చెబుతున్నారని విమర్శించారు. కాగా, ప్రతీ ఎన్నికలోనూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేసి గెలిపిస్తున్నారని.. ఈక్రమంలోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ తీన్మార్ మల్లన్నను గెలిపించాలని కోరారు. ప్రపంచ దేశాల్లో భారత్ను అగ్రస్థానంలో నిలబెట్టిన నేత రాజీవ్గాంధీ అని, ప్రపంచంలో అనేక సంస్థలకు భారతీయులే సీఈఓలుగా ఉండడానికి రాజీవ్ ఇచ్చిన స్ఫూర్తే కారణమని తెలిపారు. ఈ సమావేశాల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
పద్ధతి ప్రకారం పరిహారం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ప్రక్రియలో దేనికైనా ఓ పద్ధతి అనుసరించడం తప్పనిసరి. నిబంధనల ప్రకారం నడుచుకుంటే వ్యవస్థలూ సజావుగా పనిచేస్తాయి. రైతన్నలకు ఓ రైతు భరోసా అయినా ఇన్పుట్ సబ్సిడీ అయినా టంఛన్గా క్యాలండర్ ప్రకారం అందుతున్నాయంటే ఇదే కారణం! గతేడాది దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితుల కారణంగా అన్నదాతలు ఇబ్బంది పడ్డారు. 2023 రబీలో కరువు బారిన పడ్డ ప్రాంతాల జాబితాను నిబంధనల ప్రకారం ఈ ఏడాది మార్చి 31 నాటికి ప్రకటించాలి. ఇందుకు ఆరు ప్రామాణికాలను పాటించడం తప్పనిసరి.ఈ క్రమంలో రబీ సీజన్లో రాష్ట్రంలో ఆరు జిల్లాల పరిధిలో 87 మండలాలు కరువు ప్రభావానికి గురైనట్లు నిర్ధారించారు. 63 మండలాల్లో తీవ్రంగా, 24 మండలాల్లో స్వల్పంగా కరువు ఉన్నట్లు లెక్క తేల్చారు. 2.37 లక్షల మంది రైతులు నష్టపోయినట్లు అంచనా వేశారు. 2.52 లక్షల హెక్టార్లలో 33 శాతానికిపైగా వ్యవసాయ పంటలకు నష్టం వాటిల్లినట్లు తేలింది. ఈ మేరకు మార్చి 16వతేదీన గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదలైంది. కరువు మండలాలను గుర్తించిన సమయంలోనే ప్రాథమిక నష్టాన్ని అంచనా వేశారు. నిబంధనల ప్రకారం ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది.చంద్రబాబు బృందం ఫిర్యాదుతో రెండు నెలల పాటు ర్యాండమ్ శాంపిల్ సర్వేను ఎన్నికల సంఘం నిలిపివేసింది. పోలింగ్ ముగిశాక ఈసీ ఆంక్షలు సడలించడంతో ర్యాండమ్ శాంపిల్ సర్వే జరిపి తుది అంచనాల నివేదిక తయారీలో అధికారులు నిమగ్నమయ్యారు. మరి ఇందులో అలసత్వానికి ఎక్కడ తావుంది? రైతుల నోటి కాడ ముద్దను నేల పాలు చేస్తూ చంద్రబాబు బృందం ఫిర్యాదు చేయడం వల్లే కదా ఈసీ అడ్డుకుంది? జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీఏంఏ) విధివిధానాల ప్రకారమే కరువు మండలాలను ప్రకటిస్తారు. అంతేగానీ డ్రైస్పెల్స్ ఆధారంగా కాదు. దీని ప్రకారమే 2023 ఖరీఫ్ సీజన్లో 80 మండలాల్లో తీవ్రంగా, 23 మండలాల్లో స్వల్పంగా కరువు ఉన్నట్లు గుర్తించారు. రూ.2,558.07 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ ఎగ్గొట్టిన బాబు కరువు మండలాల్లో ఆ సీజన్లో తీసుకున్న పంట రుణాలను ఆర్నెళ్ల పాటు రీ షెడ్యూల్ చేస్తారు. పంటలు కోల్పోయిన వారికి ఇన్పుట్ సబ్సిడీ (పంట నష్టపరిహారం) చెల్లిస్తారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ సీజన్లో నష్టపోతే అదే సీజన్ చివరిలో ఇన్పుట్ సబ్సిడీ అందించి ఆదుకుంటోంది. గత ఖరీఫ్లో కరువు ప్రభావిత మండలాల్లో పంట నష్టపోయిన 6.60 లక్షల మంది రైతులకు రూ.847.22 కోట్లు జమ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తే ఎన్నికల కోడ్ సాకుతో చంద్రబాబు బృందం రెండు నెలల పాటు అడ్డుకుంది.పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత కరువు సాయాన్ని జమ చేసి సీఎం జగన్ ప్రభుత్వం రైతుల పట్ల తన చిత్తశుద్ధిని చాటుకుంది. చంద్రబాబు అధికారంలో ఉండగా ఏనాడూ సీజన్లో కరువు మండలాలను ప్రకటించిన పాపాన పోలేదు. సకాలంలో పరిహారం జమ చేసి రైతులకు అండగా నిలిచిన దాఖలాలు లేవు. 24.80 లక్షల మంది రైతన్నలకు రూ.2,558.07 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని ఎగ్గొట్టిన చరిత్ర చంద్రబాబుదే. ఈసీని పలుమార్లు అభ్యర్థించాం.. ⇒ ప్రాథమిక అంచనా ప్రకారం ఆరు జిల్లాల్లో 87 మండలాలు కరువు ప్రభావానికి గురైనట్లు గుర్తించాం. ప్రాథమిక నివేదిక తయారీ సమయంలోనే నష్టపోయిన పంటల వివరాలు సేకరించాలని ఆదేశించాం. ఏప్రిల్లో పలుమార్లు ఎన్నికల కమిషన్ను కలిసి అనుమతి కోసం అభ్యరి్థంచాం. పంట కోతలు పూర్తయినప్పటికీ పొలంలో పంట ఉన్నప్పుడు సేకరించిన వివరాల ఆధారంగా ఎన్యుమరేషన్ పూర్తి చేసి సామాజిక తనిఖీతో జాబితాలు సిద్ధం అవుతాయి. తద్వారా రైతులెవరూ నష్టపోయే ఆస్కారం ఉండదు. – చేవూరు హరికిరణ్, వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ ఎలాంటి జాప్యం జరగలేదు.. ⇒ కేంద్ర వ్యవసాయ శాఖ కరువు మాన్యువల్ 2020 ప్రకారం ఖరీఫ్ కరువు మండలాలను అక్టోబర్ 31వ తేదీలోగా, రబీ కరువు మండలాలను మార్చి 31లోపు ప్రకటించాలి. దీని ప్రకారమే రబీ కరువు మండలాలను మార్చి 16న ప్రకటించారు. ఇందులో ఎలాంటి జాప్యం జరగలేదు. కరువు మాన్యువల్ ప్రకారం డ్రైస్పెల్ ఒక్కటే పరిగణలోకి తీసుకోడానికి వీల్లేదు. దేశవ్యాప్తంగా దశల వారీ ఎన్నికల దృష్ట్యా కేంద్ర బృందం పర్యటన కొంత ఆలస్యమైంది. – కూర్మనాథ్, ఏపీ విపత్తుల సంస్థ ఎండీ -
పదోన్నతులు ఎలా ?
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయశాఖలో పదోన్నతులు ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ)పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏఈఓ నుంచి ఏఓకు, ఏఓ నుంచి ఏడీఏ పోస్టులకు పదోన్నతులు నిర్వహించేందుకు వ్యవసాయ కార్యదర్శి రఘునందన్రావు ఉత్తర్వు లు ఇచ్చారు. వ్యవసాయశాఖ డైరెక్టర్ కన్వీనర్గా, సహకార శాఖ కమిషనర్, ఉపకార్యదర్శి లేదా సంయుక్త కార్యదర్శులు సభ్యులుగా రెండేళ్ల కాల పరిమితితో డీపీసీని ఏర్పాటు చేశారు. వ్యవసాయశాఖలోని మొదటి, రెండోస్థాయి గెజిటెడ్ పోస్టుల్లో పదోన్నతులు కల్పించడమే దీని ఉద్దేశమని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే ఈ పోస్టుల్లో పదోన్నతులు కల్పించాలంటే, ఆయా పోస్టుల్లో ప్రస్తుతమున్న వారికి ప్రమోషన్లు ఇవ్వాలి. ఉదాహరణకు ఏఓ నుంచి ఏడీఏ పోస్టుల్లోకి ప్రమోషన్ ఇవ్వాలంటే, ఏడీఏ పోస్టుల్లో ఖాళీలు ఉండాలి. కానీ ఏడీఏ నుంచి డిప్యూటీ డైరెక్టర్ పోస్టులకు పదోన్నతులు జరపకుండా, ఖాళీలు ఎలా ఏర్పడతాయని వ్యవసాయ ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. అతి కొద్దిగా మాత్రమే రిటైర్మెంట్లు ఉంటాయి. కాబట్టి పూర్తిస్థాయిలో ప్రమోషన్లు ఇవ్వడం సాధ్యం కాదు. ఇక ఏఈఓ నుంచి ఏఈలుగా పదోన్నతులు ఇవ్వాలన్నా అటువంటి క్లిష్టమైన పరిస్థితే తలెత్తుతుంది. పైస్థాయిలో కూడా ప్రమోషన్లు ఇవ్వకుండా మొదటి, రెండోస్థాయి గెజిటెడ్ ఆఫీసర్ల పదోన్నతులు చేయడం కుదరదని అంటున్నారు. ఏళ్లుగా ఎదురుచూపులువ్యవసాయశాఖలో దాదాపు 500 మందికి పైగా పదోన్నతు లకు ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వంలో ఒకేసారి అన్ని శాఖల్లో పదోన్నతులు జరిగినా, వ్యవసాయశాఖలో మాత్రం చేయలేదు. ఉద్యోగ సంఘాల మధ్య సమన్వయం లేదని సాకులు చెబుతూ పదోన్నతులు ఆపేశారని అంటున్నారు. ఏఓ స్థాయి నుంచి అడిషనల్ డైరెక్టర్ కేడర్ వరకు పదోన్న తులు జరగాలి. సర్వీస్ రూల్స్ ప్రకారం పదోన్నతులు నిర్ణీత కాలంలో జరపకపోవడం అధికారుల నిర్లక్ష్యమేనని సంఘాల నేతలు అంటున్నారు. పదోన్నతులు రాకపోవడం వల్ల సీనియర్లు మనోవేదనకు గురవుతున్నారు. దీనివల్ల పోస్టింగ్ల్లోనూ అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తున్నా రు. ఇప్పుడు కేవలం రెండు కేడర్లలో పదో న్నతులకు మాత్రమే డీపీసీని ఏర్పాటు చేశారు. దీని వల్ల పైస్థాయిలో కద లిక రాకుంటే వీటికి కూడా ప్రమోషన్లు ఇచ్చే పరి స్థితి ఉండదని అంటున్నారు. ఆయా విషయాలపై ఇటీవ ల అగ్రి డాక్టర్స్ అసోసియేషన్ వ్యవ స్థాపక అధ్యక్షుడు కె.రాము లు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఎన్నికలకు ముందే విజ్ఞప్తి చేశారు. కానీ ప్రక్రియ మాత్రం అసంపూర్ణంగానే మిగిలిపోయింది. బదిలీల మాటేంటి?గత ప్రభుత్వంలో అంటే దాదాపు ఐదారేళ్ల క్రితం వ్యవసాయ శాఖలో బదిలీలు జరిగాయి. అవి కూడా పూర్తిస్థాయిలో జరగలేదు. దీంతో అనేకమంది ఉద్యోగులు ఒకే చోట తిష్టవే యగా, కొందరు కుటుంబాలకు దూరంగా ఉంటూ అన్యా యానికి గురవుతున్నారు. దీనిపై ఉద్యోగ సంఘాలు వ్యవసా య ఉన్నతాధికారులకు మొరపెట్టుకుంటున్నాయి. ఉద్యోగు ల్లో దాదాపు 2 వేల మందికి పైగా బదిలీలకు ఎదు రుచూస్తున్నారు. కొందరైతే అక్రమ బదిలీలు చేయించుకుంటున్నారన్న విమర్శ లున్నాయి. మరికొందరైతే డిప్యూ టేషన్లు చేయించుకుంటున్నారు. వ్యవసాయ శాఖ లో చాలామంది డిప్యూటేషన్లు, ఓడీలు, ఫారిన్ సర్వీసులపై ఉంటున్నారు. బదిలీలు జరగకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఇప్పటికీ డిప్యూటేషన్లకు వందల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని ఆ అధికారి వెల్లడించారు. నిర్ణీత సమయం ప్రకారం బదిలీ లు జరగాలని, అది ఉద్యోగుల హక్కు అని ఆయన వ్యాఖ్యానించారు. -
వానాకాలం సాగు..1.34 కోట్ల ఎకరాలు
సాక్షి, హైదరాబాద్: ఈ వానాకాలం 1.34 కోట్ల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఈ మేరకు పంటల ప్రణాళికను విడుదల చేసింది. ఆ ప్రణాళిక ప్రకారం రైతులకు విత్తనాలు, ఎరువులు అందుబాటులోకి ఉంచనున్నారు. ఈ వానాకాలం అత్యధికంగా 66 లక్షల ఎకరాల్లో వరి, ఆ తర్వాత పత్తి 60 లక్షల ఎకరాల్లో పత్తి సాగు అవుతుందని పేర్కొంది. గతేడాది వానాకాలం సీజన్లో 1.26 కోట్ల ఎకరాల్లో అన్ని రకాల పంటలు సాగయ్యాయి. ఈసారి 8 లక్షల ఎకరాల్లో అధికంగా పంటల సాగు జరుగుతుందని అంచనా వేసింది. » గతేడాది 65 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా, ఈసారి 66లక్షల ఎకరాల్లో నాట్లు పడనున్నాయి. » గతేడాది 44.77 లక్షల ఎకరాల్లో పత్తి సాగుకాగా, ఈసారి అదనంగా మరో 15.23 లక్షల ఎకరాల్లో పత్తి సాగయ్యేలా ప్రోత్సహించనున్నారు. » వరిసాగు కంటే పత్తినే ప్రోత్సహించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. అవసరమైతే వరిని తగ్గించి, పత్తినే 70 లక్షల ఎకరాలకు పెంచే ఆలోచన కూడా చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. 19.39 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరం సాగుకనుగుణంగా విత్తన ప్రణాళికను కూడా వ్యవసాయశాఖ విడుదల చేసింది. ఈ వానాకాలం సీజన్కు 19.39 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమని నిర్ణయించింది. » అత్యధికంగా 16.50 లక్షల క్వింటాళ్లు వరి విత్తనాలే కావడం గమనార్హం. పత్తి విత్తనాలు 54 వేల క్వింటాళ్లు అవసరం, సోయాబీన్ విత్తనాలు 1.49లక్షల క్వింటాళ్లు రైతులకు అందుబాటు లోకి తెస్తారు. మొక్కజొన్న విత్తనాలు 48 వేల క్వింటాళ్లు, కంది విత్తనాలు 16,950 క్వింటాళ్లు, వేరుశనగ విత్తనాలు 13,800 క్వింటాళ్లు, పెసర విత్తనాలు 4,480 క్వింటాళ్లు సిద్ధం చేశారు.» జొన్న, సజ్జ, రాగి, మినుములు, ఆముదం, పొద్దు తిరుగుడు విత్తనాలను సిద్ధం చేయాలని నిర్ణయించారు. కొంత మేరకు అందు బాటులో ఉంచామని, మిగిలిన వాటిని త్వరలో రైతులకు అందజేస్తామని అధికారులు వెల్లడించారు. » పత్తి విత్తనాలను పూర్తిస్థాయిలో ప్రైవేట్ కంపెనీలే అందుబాటులోకి తీసుకొస్తాయి. అయితే కొన్ని కంపెనీల విత్తనాలనే రైతులు కోరుకుంటారు. ఆ మేరకు ఆయా కంపెనీల విత్తనాలను అందుబాటులో ఉంచాలని కంపెనీలను వ్యవసాయశాఖ ఆదేశించింది.» ఈసారి 24.40 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు వానాకాలం కోసం సిద్ధం చేయనున్నారు. అందు లో 10.40 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా, 10 లక్షల మెట్రిక్ టన్నులు ఎన్పీకేను రైతులకు అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. -
రైతుబంధు సొమ్ము వెనక్కి
సాక్షి, హైదరాబాద్: అధికార యంత్రాంగ నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారింది. రైతుబంధు సొమ్ము సక్రమంగా రైతుల ఖాతాల్లో వేయకపోవడంతో అవి తిరిగి ప్రభుత్వ ఖాతాల్లోకే వచ్చిపడుతున్నాయి. ఇటీవల యాసంగి సీజన్కు సంబంధించి వేసిన రైతుబంధు సొమ్ము వేలాదిమంది రైతులకు వెళ్లకుండానే వెనక్కి రావడంపై వారు భగ్గుమంటున్నారు. వ్యవసాయశాఖ లెక్కల ప్రకారమే 19 వేల మంది రైతుల ఖాతాల్లోకి వెళ్లాల్సిన రైతుబంధు సొమ్ము బ్యాంకుల వరకు వెళ్లి తిరిగి వెనక్కి వచ్చింది. అనేకమంది రైతులకు ఇంకా పూర్తిస్థాయిలో రైతుబంధు సొమ్ము అందలేదన్న ఆరోపణలు ఉన్నాయి. రైతుబంధు సొమ్ము వెనక్కి వచ్చినట్టు లెక్కలు తీసిన వ్యవసాయశాఖ అధికారులు, వాటిని ఇంకా పూర్తిస్థాయిలో సరిదిద్దలేదు. తిరిగి రైతుబంధు చెల్లింపులు చేయకపోవడంపైనా విమర్శలు ఉన్నాయి. అధికారుల తప్పుల వల్లే ఈ పరిస్థితి... » వ్యవసాయశాఖ అధికారుల తప్పుల వల్లే ఈ పరిస్థితి నెలకొందన్న ఆరోపణలు ఉన్నాయి. » ఇంటిపేర్లు, రైతుల పేర్లు తప్పుగా రాయడం, బ్యాంకు ఖాతాల నంబర్లు సరిచూసుకోకుండా నంబర్లలో తప్పులు దొర్లడం వంటి కారణాల వల్ల రైతుల ఖాతాలకు వేసిన డబ్బులు వెనక్కి వస్తున్నాయి. » ఒక్క అక్షరం తప్పుగా వచ్చినా కూడా బ్యాంకులు తిరిగి వెనక్కి వేస్తున్నాయి. » కొందరు రైతుల బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ కావడం, ఖాతాదారులు డిఫాల్టర్గా మారడం, కొందరి ఖాతాలు క్లోజ్ అవ్వడం, రుణాలు రెన్యువల్ చేసుకోవడంతో పాత ఖాతాలు పోయి కొత్త ఖాతాలు రావడం, పాత ఖాతాల వివరాలే వ్యవసాయశాఖ వద్ద ఉండటం తదితర కారణాలు కూడా రైతుబంధు సొమ్ము తిరిగి వెనక్కి రావడానికి కారణంగా ఉంటుందని ఒక వ్యవసాయ ఉన్నతాధికారి తెలిపారు. » వ్యవసాయశాఖకు రైతులు ఫిర్యాదు చేస్తున్నా, పూర్తిస్థాయిలో స్పందించడం లేదన్న విమర్శలొస్తున్నాయి. » సాంకేతిక సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. » బ్యాంకులతో వ్యవసాయ శాఖ సమన్వయం చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. యాసంగిలో ఐదెకరాలకే రైతుబంధు పరిమితం... రైతుభరోసా పథకం వచ్చే వానాకాలం నుంచి ప్రారంభిస్తామని, అప్పటివరకు గత రైతుబంధు మార్గదర్శకాలనే అమలు చేస్తామని కాంగ్రెస్ సర్కారు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. రైతుబంధు మార్గదర్శకాల ప్రకారం భూమి విస్తీర్ణంతో సంబంధం లేకుండా రైతులందరికీ రైతుబంధు సొమ్ము వేయాలి. కానీ ఇప్పటివరకు ఐదు ఎకరాలున్న రైతులకు మాత్రమే రైతుబంధు సొమ్ము అందజేసినట్టు వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి.కాగా, కొందరు రైతులు మాత్రం ఐదెకరాల వరకే ఉన్నా తమకు అందలేదంటున్నారు. దీనిపై కొంత గందరగోళం నెలకొంది. గత వానాకాలం సీజన్ లెక్కల ప్రకారం రైతుబంధు సొమ్ము తీసుకున్న రైతులు 68.99 లక్షలు ఉన్నారు. ఈ యాసంగి సీజన్లోనూ అంతే మంది రైతులకు సొమ్ము విడుదల చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొంది. ఆ ప్రకారం 1.52 కోట్ల ఎకరాలకు రూ. 7,625 కోట్లు విడుదల చేయాలి. ఇప్పటివరకు ఐదెకరాల వరకున్న రైతులకు మాత్రమే రూ. 5,202 కోట్ల రైతుబంధు సాయం అందిందని వ్యవసాయ వర్గాలు తెలిపాయి. -
యాసంగికి పంట గోస.. తగ్గనున్న ధాన్యం దిగుబడి
సాక్షి, హైదరాబాద్: యాసంగిలో వరి దిగుబడి గణనీయంగా తగ్గిపోనుంది. సాగు విస్తీర్ణం తగ్గడం.. కీలక సమయంలో సాగునీరు అందుబాటులో లేక ఎండిపోవడం, అకాల వర్షాలు, వడగళ్ల నష్టం వంటివి దీనికి కారణమవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయి.. రైతులు తీవ్రంగా నష్టపోయారు కూడా. ఈ నేపథ్యంలో యాసంగికి సంబంధించిన రెండో ముందస్తు అంచనాల నివేదికను వ్యవసాయశాఖ తాజాగా విడుదల చేసింది. గత యాసంగిలో వరి దిగుబడి 1.20 కోట్ల టన్నులుకాగా.. ఈసారి 1.06 కోట్ల టన్నులకు తగ్గుతుందని.. అంటే 14 లక్షల టన్నుల మేర తగ్గుదల ఉంటుందని అంచనా వేసింది. అలాగే మొక్కజొన్న గత యాసంగిలో 17.20 లక్షల టన్నుల దిగుబడి వస్తే.. ఈసారి 15.37 లక్షల టన్నులే వస్తుందని అంచనా. దీని దిగుబడి 1.83 లక్షల టన్నుల మేర తగ్గిపోనుంది. వేరుశనగ కూడా గత యాసంగిలోని 2.32 లక్షల టన్నుల కంటే 59వేల టన్నులు తగ్గి.. ఈసారి 1.73 లక్షల టన్నులకే పరిమితం కానుంది. ఇక గత యాసంగిలో మొత్తం నూనె గింజల ఉత్పత్తి 2.70 లక్షల టన్నులుకాగా.. ఇప్పుడు 61వేల టన్నులు తక్కువగా 2.09 లక్షల టన్నులకు పడిపోనుంది. మొత్తంగా యాసంగిలో కీలక పంటల దిగుబడులన్నీ తగ్గనున్నాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. గత ఏడాది సాగు రికార్డులు.. 2022–23 వానాకాలం, యాసంగి సీజన్ల పంటల సాగు విస్తీర్ణంలో తెలంగాణ చరిత్రలోనే ఆల్టైం రికార్డు నమోదైంది. ఆ రెండు సీజన్లలో కలిపి ఏకంగా 2.08 కోట్ల ఎకరాల్లో పంటల సాగు నమోదైంది. ఆ ఏడాది వానాకాలంలో 1.36 కోట్ల ఎకరాల్లో సాగుకాగా.. యాసంగిలో 72.59 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. రాష్ట్ర ఏర్పాటు నాటి సాగు విస్తీర్ణంతో పోలిస్తే.. అది రెండింతలకు దగ్గరగా రావడం గమనార్హం. 2014–15లో రాష్ట్రంలో రెండు సీజన్లు కలిపి 1.31 కోట్ల ఎకరాల్లో పంటలు సాగవగా.. 2020–21 నాటికి 2.03 కోట్ల ఎకరాలకు, 2022–23 నాటికి 2.08 కోట్ల ఎకరాలకు చేరాయి. కానీ ఈసారి రెండు సీజన్లు కలిపి 1.93 కోట్ల ఎకరాలకే సాగు పరిమితమైంది. అలాగే 2022–23 వరకు వరి సాగులో రికార్డుల మోత మోగింది. 2014–15లో రెండు సీజన్లకు కలిపి 35 లక్షల ఎకరాల్లోనే వరి సాగవగా.. 2022–23 నాటికి ఏకంగా 1.22 కోట్ల ఎకరాలకు పెరగడం విశేషం. అదే ఇప్పుడు 2023–24లో వరి సాగు 1.14 కోట్ల ఎకరాలకే పరిమితమైందని వ్యవసాయశాఖ నివేదిక స్పష్టం చేసింది. సన్న బియ్యానికి డిమాండ్ యాసంగిలో ధాన్యం దిగుబడి తగ్గనున్న నేపథ్యంలో రోజువారీ ఆహారంగా తీసుకునే సన్న బియ్యానికి డిమాండ్ పెరగనుంది. దీన్ని గుర్తించిన మిల్లర్లు, వ్యాపారులు నేరుగా పొలాల వద్దకు వెళ్లి కొనుగోలు చేస్తున్నారు. యాసంగి ధాన్యం సేకరణ కోసం ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా.. నిజామాబాద్, నల్లగొండ, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల్లోనే కొంత మేర ధాన్యం ఆ కేంద్రాలకు వస్తోంది. సన్నబియ్యం పండించే నిజామాబాద్, కామారెడ్డి, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్నగర్ ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలకు ధాన్యం రావడం లేదు. పొలాల వద్దకే మిల్లర్లు, వ్యాపారులు రాష్ట్రవ్యాప్తంగా కోటి టన్నుల మేర ధాన్యం దిగుబడి వస్తే.. అందులో 7 లక్షల నుంచి 10 లక్షల టన్నుల మేర మాత్రమే సన్నధాన్యం ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనా. దీంతో సన్నరకాలను మిల్లర్లు, వ్యాపారులు నేరుగా రైతుల కల్లాల నుంచే కొనుగోలు చేసుకొని పోతున్నారు. రాష్ట్ర మిల్లర్లు, వ్యాపారులతోపాటు మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఏపీలకు చెందిన వ్యాపారులు వచ్చి క్వింటాలుకు రూ.2,300 నుంచి రూ.3,000 వరకు చెల్లించి పచ్చి ధాన్యాన్ని కొంటున్నారు. కాస్త మెరుగైన ధరే కావడంతో.. రైతులు కూడా విక్రయిస్తున్నారు. – నిజామాబాద్ జిల్లాలో గంగ, కావేరి సన్న రకాలను 2.30 లక్షల ఎకరాల్లో, కామారెడ్డి జిల్లాలో 63 వేల ఎకరాల్లో సాగు చేశారు. ఇక మహబూబ్నగర్లో కృష్ణా తీరం వెంట సన్నాలను పండించారు. ఇక్కడి రైతులు పండించిన సన్న ధాన్యాన్ని మిల్లర్లే కొనేస్తుండటంతో కొనుగోలు కేంద్రాలకు రావడం లేదు. దొడ్డు రకాల ధాన్యం మాత్రమే కొనుగోలు కేంద్రాలకు వస్తోంది. ఈ సీజన్లో 70 లక్షల టన్నుల ధాన్యం సేకరణకు పౌరసరఫరాల శాఖ లక్ష్యంగా పెట్టుకున్నా.. దిగుబడి తగ్గిన నేపథ్యంలో 50 లక్షల టన్నులు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదని వ్యవసాయ వర్గాలు చెప్తున్నాయి. సన్న బియ్యం ధరలు పెరిగే చాన్స్ మేలు రకం సన్న బియ్యానికి ఖరీఫ్ సీజన్లోనే క్వింటాల్ రూ.6,000 వరకు ధర పలికింది. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో జైశ్రీరాం, హెచ్ఎంటీ, బీపీటీ, ఆర్ఎన్ఆర్, తెలంగాణ సోనా రకాలకు.. నాణ్యతను బట్టి రూ.6,500 నుంచి రూ.8,500 వరకు ధర పలుకుతోంది. యాసంగిలో తగ్గిన దిగుబడి, బియ్యం కొరత కారణంగా ఈసారి బియ్యం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. బియ్యం ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించినా.. మార్కెట్లో ధరలు తగ్గడం లేదని, ఇప్పుడు తగ్గిన దిగుబడితో మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నాయి. పొట్టదశలో ఎండిన వరి నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం యాద్గార్పల్లిలో రైతు బంటు లక్ష్మయ్యకు చెందిన పొలంలో ఎండిపోయిన వరి ఇది. లక్ష్మయ్య తనకున్న మూడెకరాల భూమిలో వరి వేశాడు. బోరు వట్టిపోయి నీరు లేక వరి పంట మొత్తం ఎండిపోయింది. – మిర్యాలగూడ తొమ్మిదెకరాల్లో.. ఒక్క ఎకరమూ మిగల్లేదు.. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం జయరాంతండాలో ఎండిపోయిన వరి పొలం ఇది. ఈ తండాకు చెందిన రైతు రమావత్ కీమా తనకున్న ఆరు ఎకరాలతోపాటు మరో మూడెకరాలను కౌలుకు తీసుకుని యాసంగిలో వరి సాగుచేశాడు. మూడు బోర్లు ఉన్నా భూగర్భజలాలు అడుగంటి ఎండిపోయాయి. దాంతో మరో బోర్ వేయించినా లాభం లేకపోయింది. మొత్తం తొమ్మిదెకరాల్లో వరి ఎండిపోయింది. దీంతో ఆ వరి కోయించి.. పశువులకు గ్రాసంగా వేస్తున్నాడు. – పెద్దవూర పంటను పశువులకే వదిలేసి... వేలేరు: హనుమకొండ జిల్లా వేలేరు మండలం పీచరకు చెందిన రైతు కొయ్యడ బొందయ్య రెండున్నర ఎకరాల్లో వరి వేశాడు. ఇరవై రోజుల నుంచి నీళ్లు లేక వరి పంట అంతా ఎండిపోయింది. చేసేదేం లేక వరి పంటను ఇలా పశువులకు వదిలేశాడు. -
గడచిన ఐదేళ్లలో 40శాతం గోదాముల సామర్థ్యం పెంపు
గన్నవరం: గడిచిన ఐదేళ్లలో గోదాముల సామర్థ్యాన్ని 40 శాతం పెంచడం రైతుల పట్ల సీఎం వైఎస్ జగన్కు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి తెలిపారు. కృష్ణాజిల్లా, గన్నవరం వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ రూ.11.88 కోట్లతో నిర్మించిన 10వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములు, 60 టన్నుల కెపాసిటీ కలిగిన లారీ వేబ్రిడ్జిని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్నదాతల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చినట్లు కాకాణి పేర్కొన్నారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ స్థాపించిన 65 ఏళ్లలో 8.86 లక్షల మెట్రిక్ టన్నుల సామర్ధ్యం కలిగిన సొంత గోదాములను నిర్మించినట్లు చెప్పారు. వీటిలో 2,23,300 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములను వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే నిర్మించినట్లు తెలిపారు. మరో 24,600 మెట్రిక్ టన్నుల సామర్ధ్యం కలిగిన గోదాముల నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయన్నారు. పాత గోదాములను రూ.21 కోట్లతో ఆధునికీకరించినట్లు తెలిపారు. ఈ గోదాముల్లో నిల్వ చేసుకునే పంట ఉత్పత్తులకు సంస్థ జారీ చేసే నిల్వ రశీదుపై బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణ సదుపాయం కల్పించనున్నట్లు తెలిపారు. నిల్వ చార్జీల్లో 25 శాతం రైతులకు రిబేటు కల్పిస్తామన్నారు. గిడ్డంగుల సంస్థ రాష్ట్ర చైర్మన్ జనాబ్ కరిముల్లా షేక్ అమీన్ మాట్లాడుతూ.. ఈ గోదాముల్లో పంట ఉత్పత్తులు దెబ్బ తినకుండా కెమికల్ ట్రిట్మెంట్తోపాటు శిక్షణ పొందిన సిబ్బంది పర్యవేక్షణలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వ్యవసాయ మార్కెటింగ్, కో ఆపరేషన్ ముఖ్య కార్యదర్శి బాబు.ఏ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ వైస్ చైర్మన్ ఎండీ జి.ఓంకార్రెడ్డి, పలువురు ఏఎంసీ డైరెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు. -
ఐదెకరాలా.. పదెకరాలా?
సాక్షి, హైదరాబాద్: రైతులకు పంట పెట్టుబడికోసం ఆర్థిక సాయం అందించే రైతుభరోసా (రైతుబంధు) పథకానికి సీలింగ్ విధించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. ఈ సాయాన్ని ఐదెకరాలకా లేదా పదెకరాలకా.. ఎంతకు పరిమితం చేస్తే బాగుంటుందన్న దానిపై తర్జనభర్జన పడుతోంది. ఐదెకరాలకే పరిమితం చేస్తే బాగుంటుందని అధికారులు సూచిస్తున్నట్లు సమాచారం. అంతేగాకుండా ఆదాయ పన్ను చెల్లిస్తున్నవారు, రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, సెలబ్రిటీలకు రైతుభరోసా ఇవ్వకూడదని భావిస్తున్నట్టు తెలిసింది. ఇటీవలి బడ్జెట్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధును పునఃసమీక్షిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పథకంతో అనర్హులు కూడా లబ్ధి పొందుతున్నారన్నది కొత్త సర్కారు ఉద్దేశం. దీనికి అనుగుణంగా ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు ఢిల్లీలోని ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్’ను సంప్రదించారు. ఉపగ్రహ చిత్రాల ద్వారా సాగు, బీడు భూములను గుర్తించి.. ఆ వివరాల ఆధారంగా రైతు పెట్టుబడి సాయానికి పరిమితులు విధించనున్నారు. దీనిపై మార్గదర్శకాలను రూపొందించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆధారంగా వచ్చే వానాకాలం సీజన్ నుంచి కొత్త మార్గదర్శకాల ప్రకారం రైతుభరోసా అమలులోకి రానుంది. ఇచ్చే మొత్తం పెంచి.. 90% మందికే ఇచ్చి.. రైతుబంధు పథకం 2018 వానాకాలం సీజన్ నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. మొదట్లో ప్రతీ సీజన్కు ఎకరాకు రూ.4 వేల చొప్పున రైతులందరికీ ఇచ్చారు. ఇలా ఏడాదిలో రెండు సీజన్లకు కలిపి ఎకరానికి రూ.8 వేల చొప్పున అందేవి. తర్వాత ఈ సొమ్మును ప్రభుత్వం సీజన్కు రూ.5 వేల చొప్పున ఏడాదికి రూ. 10 వేలు చేసింది. అంటే రెండు సీజన్లు కలిపి 1.52 కోట్ల ఎకరాలకు చెందిన 68.99 లక్షల మంది రైతులకు ఏటా సుమారు రూ.15,250 కోట్లు అందజేశారు. కాంగ్రెస్ సర్కారు రైతుభరోసా కింద ఎకరాకు ఏటా రూ.15 వేలు ఇస్తామని ప్రకటించింది. ఈ లెక్కన 1.52 కోట్ల ఎకరాలకు సంబంధించి రూ.22,800 కోట్లు అవుతుంది. అలాకాకుండా ఐదెకరాలలోపు భూమి ఉన్న రైతులనే పరిగణనలోకి తీసుకుంటే.. పెట్టుబడి సాయం అందుకుంటున్న రైతుల్లో వారు 62.34 లక్షల మంది ఉన్నారు. అంటే.. మొత్తం లబ్దిదారుల్లో 90.36 శాతం. వీరికి మాత్రమే రైతుభరోసా పరిమితం చేయాలనుకుంటే.. రూ. 15వేల కోట్లు ఇస్తే సరిపోతుందని అంచనా. దీనివల్ల గత ప్రభుత్వం కన్నా రూ.5 వేలు ఎక్కువ ఇచ్చినట్టు ఉంటుందని.. అదే సమయంలో ఏటా ఇచ్చే మొత్తంలో పెద్దగా మార్పు ఉండదని అధికార వర్గాలు చెప్తున్నాయి. పైగా రూ. 7,800 కోట్లు ఆదా చేసుకోవచ్చని అంటున్నాయి. వాళ్లందరికీ కట్..! సాగుభూములకే రైతుభరోసా ఇస్తామని కొత్త ప్రభుత్వం ప్రకటించింది. సాగుచేయని, సాగుకు పనికిరాని కొండలు, గుట్టలకు, ఆఖరికి రోడ్లు ఉన్న స్థలాలకు కూడా రైతుబంధు ఇచ్చారని ప్రస్తుత ప్రభుత్వం చెప్తోంది. ఈ నేపథ్యంలో రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ ద్వారా సాగు, బీడు భూములను గుర్తించనున్నామని.. తద్వారా అనర్హులను తొలగిస్తామని వ్యవసాయ శాఖ చెబుతోంది. అలాగే రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు, సెలబ్రిటీలు, ఆదాయ పన్ను కట్టేవారికి కూడా పెట్టుబడి సాయం ఇవ్వకూడదని భావిస్తున్న నేపథ్యంలో.. ప్రభుత్వంపై రైతుభరోసా భారం మరింత తగ్గుతుందని పేర్కొంటున్నారు. -
మిర్చి రైతులు నష్టపోవద్దు
సాక్షి, హైదరాబాద్: మిర్చి పంట భారీ ఎత్తున మార్కెట్లోకి వస్తోందనీ, ధర విషయంలో రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలంటూ మార్కెటింగ్ శాఖకు స్పష్టమైన ఆదేశాలిచ్చినట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఈ విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠినచర్యలు తీసుకొంటామని మంత్రి హెచ్చరించారు. రాష్ట్రంలో 3.91 లక్షల ఎకరాలలో మిర్చి సాగుచేయగా ఇప్పటికే 94395 మెట్రిక్ టన్నుల మిర్చి మార్కెట్కు వచ్చిందని వివరించారు. ఈ యాసంగిలో దాదాపు 2 లక్షల ఎకరాలలో వేరుశనగ సాగు కాగా 1.92 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశామని తెలిపారు. ఇప్పటికే 93 వేల మెట్రిక్ టన్నులు అమ్మకానికి రాగా, స్వంత అవసరాలకు పోను ఇంకా మార్కెట్లకు 46 వేల టన్నుల వేరుశనగ వచ్చే అవకాశం ఉందని మంత్రి తుమ్మల మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పంటలకు గిట్టుబాటు ధర అందించే విషయంలో గత ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి కారణంగా రైతులు నష్టపోయారని, ఈ పరిస్థితి రాకుండా ముందుస్తు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయిందని మంత్రి ఆ ప్రకటనలో పేర్కొన్నారు. రైతుల కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలి: తుమ్మల జంగారెడ్డిగూడెం రూరల్ (ఏపీ): రైతాంగ సమస్యల పరిష్కారం కోసం అన్ని రాష్ట్రాలూ కలిసికట్టుగా ముందుకొచ్చి కేంద్రంపై ఒత్తిడి తేవాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం శ్రీమద్ది ఆంజనేయస్వామి వారిని దర్శించుకున్న మంత్రి మీడియాతో మాట్లాడుతూ రైతులు నిర్వహిస్తున్న నిరసనలను కేంద్ర ప్రభుత్వం త్వరగా అర్థం చేసు కుని అన్నదాతలకు అనుకూల నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. స్వామినాథన్ కమిషన్ ఇచ్చిన రి పోర్టు ఆధారంగా ఖర్చులకు ఒకటిన్నర రెట్లు రైతు కు గిట్టుబాటు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
22లోగా రబీ ఈ క్రాప్, ఈ కేవైసీ పూర్తి చేయాలి
సాక్షి, అమరావతి: ప్రస్తుత రబీలో ఈ–క్రాప్, ఈకేవైసీల నమోదు ప్రక్రియను ఈ నెల 22లోగా పూర్తి చేయాలని వ్యవసాయశాఖ ఇన్చార్జి కమిషనర్ డాక్టర్ గెడ్డం శేఖర్ బాబు ఆదేశించారు. మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయం నుంచి జిల్లాల వ్యవసాయ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ.. రబీలో ఎక్కువ సాగయ్యే శనగ, మొక్కజొన్న, మినుము వంటి మెట్టపంటలు కోతకు వచ్చే సమయం దగ్గర పడుతుందని, అందువలన సాధ్యమైనంత త్వరగా ఈ క్రాప్, ఈ కేవైసీల నమోదు ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో నియమించిన సూపర్ చెక్ బృందాల ప్రగతిపై ఆయన సమీక్షించారు. ఈ కేవైసీలో నూరుశాతం సాధించే దిశగా ఈ నెల 12 నుంచి 21వ తేదీ వరకు జరుగుతున్న క్యాంపెయిన్ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. వచ్చే ఖరీఫ్ 2024లో అవసరమైన ఎరువులు, విత్తనాల కోసం జిల్లాల వారీగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సూచించారు. పీఎం కిసాన్ 16వ విడత నిధులు త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో ఇంకా ఆధార్తో బ్యాంక్ ఖాతాలను అనుసంధానం చేయని వారిని గుర్తించి సత్వరమే ఆ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. -
ఈ–క్రాప్తో అన్నదాతలకు భరోసా
సాక్షి, అమరావతి: రబీ సీజన్లో ఈ–క్రాప్ నమోదు వేగంగా సాగుతోంది. రైతులు వారి పొలాల్లో ఏ పంటలు సాగు చేస్తున్నారనే వివరాలను వ్యవసాయ శాఖ నమోదు చేస్తోంది. ఈ–క్రాప్ ప్రామాణికంగానే రైతులకు ప్రభుత్వం సంక్షేమ ఫలాలు అందిస్తోంది. దీంతో పంటలు వేసిన ఒక్క రైతును కూడా వదలకుండా.. రాష్ట్రంలోని ప్రతి ఎకరాలో ప్రతి పంటనూ నమోదు చేయడమే వ్యవసాయ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రంలో రబీ సాధారణ విస్తీర్ణం 55.95 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 38.25 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు వేశారు. వెబ్ల్యాండ్, సీసీఆర్సీ డేటాతోపాటు జియో ఫెన్సింగ్ ఆధారంగా డిసెంబర్లో ఈ–క్రాప్ నమోదుకు వ్యవసాయ శాఖ శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు 37,02,031 ఎకరాల్లో పంటలను ఈ–క్రాప్లో నమోదు చేశారు. ఇందులో 34,21,189 ఎకరాల్లో వీఏఏలు, 31,86,682 ఎకరాల్లో వీఆర్వోలు క్షేత్రస్థాయిలో పరిశీలన కూడా పూర్తి చేశారు. ఇప్పటివరకు 20,06,326 ఎకరాలకు సంబంధించి రైతుల ఈకేవైసీ (వేలిముద్రలు) నమోదు పూర్తయింది. జియో ఫెన్సింగ్ ద్వారా హద్దుల గుర్తింపు నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (ఎన్ఐసీ) సౌజన్యంతో ప్రత్యేకంగా డిజైన్ చేసిన యాప్లో ఆధార్, వన్బీ, జాతీయ చెల్లింపుల సహకార సంస్థ (ఎన్పీసీఐ), ఆధార్తో లింక్ అయిన బ్యాంక్ ఖాతా వివరాలు, ఫోన్ నంబర్, సీసీఆర్సీ కార్డుల వివరాలను నమోదు చేస్తున్నారు. క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత జియో ఫెన్సింగ్ ద్వారా సరిహద్దులు నిర్థారించి, రైతు ఫొటోను ఆర్బీకే సిబ్బంది అప్లోడ్ చేస్తున్నారు. గిరి భూమి వెబ్సైట్లో నమోదైన వివరాలు ఆధారంగా అటవీ భూముల్లో ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులు సాగు చేస్తున్న పంటల వివరాలను ఈ–క్రాప్లో నమోదు చేస్తున్నారు. మరోవైపు పంటసాగు హక్కు పత్రం (సీసీఆర్సీ) కలిగిన రైతులతోపాటు సీసీఆర్సీ కార్డుల్లేని రైతుల వివరాలను కూడా నమోదు చేస్తున్నారు. పొలం ఖాళీగా ఉంటే నో క్రాప్ జోన్ అని, రొయ్యలు, చేపల చెరువులుంటే ఆక్వా కల్చర్ అని, వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తుంటే నాన్ అగ్రిల్యాండ్ యూజ్ అని నమోదు చేసి లాక్ చేస్తున్నారు. డూప్లికేషన్కు తావులేకుండా ఈ–ఫిష్ డేటాతో ఇంటిగ్రేట్ చేశారు. జిరాయితీ, పట్టాదార్, అసైన్డ్, ఆర్ఓఎఫ్ఆర్, ఎండోమెంట్, వక్ఫ్, ఈనాం, లంక, సీజేఎఫ్ఎస్, మిగులు, ఆక్రమిత తదితర కేటగిరీల కింద గుర్తించిన ప్రభుత్వ భూముల్లో సాగవుతున్న ఆహార, నూనె గింజలు, పశుగ్రాసం, పంటలు, పండ్ల తోటలు, సుగంధ ద్రవ్యాలు, కూరగాయలు, పూలు, మల్బరీ పంటలను నమోదు చేశారు. ఈకేవైసీ నమోదు ప్రక్రియ పూర్తి కాగానే ప్రతి రైతుకు రసీదు అందించే ఏర్పాటు చేశారు. పారదర్శకంగా నమోదు ఈ–క్రాప్ను పారదర్శకంగా నమోదు చేయడంతోపాటు ఈకేవైసీ నమోదు ప్రక్రియను ఈ నెల 15వ తేదీలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ధేశించాం. సోషల్ ఆడిట్ కోసం 21 నుంచి 28వ తేదీ వరకు ప్రాథమిక ఈ క్రాప్ జాబితాలను ప్రదర్శిస్తాం. మార్చి 1 నుంచి 4వ తేదీ వరకు అభ్యంతరాలను పరిష్కరించి.. మార్చి 6న తుది జాబితాలను ఆర్బీకేల్లో ప్రదర్శిస్తాం. ఈ–క్రాప్ నమోదు ప్రామాణికంగానే సంక్షేమ ఫలాలు అందుతాయి. అందువల్ల ప్రతి రైతు వారు సాగు చేస్తున్న పంట వివరాలను నమోదు చేసుకోవడంతో పాటు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలి. – గెడ్డం శేఖర్బాబు,ఇన్చార్జి కమిషనర్, వ్యవసాయ శాఖ -
సాగుకు రూ.1.27లక్షల కోట్లు
న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2024–25)గాను వ్యవసాయ మంత్రిత్వ శాఖకు కేంద్రం రూ.1.27 లక్షల కోట్ల బడ్జెట్ను కేటాయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–2024)తో పోల్చుకుంటే కేటాయింపులు స్వల్పంగా పెంచింది. రూ.1,27,469.88 కోట్లలో వ్యవసాయ విభాగానికి రూ.1,17,528 కోట్లు కేటాయించగా, వ్యవసాయ పరిశోధన, విద్య (డేర్) విభాగానికి రూ.9,941 కోట్లు కేటాయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర సవరించిన అంచనాల ప్రకారం.. వ్యవసాయ విభాగానికి రూ.1,16,788.96 కోట్లు, డేర్కు రూ.9,876.60 కోట్లు కేటాయించారు. పీఎం కిసాన్ పథకానికివ్యవసాయ విభాగం పరిధిలోని ప్రతిష్టాత్మక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.60 వేల కోట్లు కేటాయించగా, వచ్చే ఏడాదికి ఎలాంటి హెచ్చుతగ్గులు లేకుండా రూ.60 వేల కోట్లే కేటాయించారు. ఈ పథకం కింద కేంద్రం రైతులకు మూడు వాయిదాలుగా సంవత్సరానికి రూ.6 వేలు చొప్పున అందజేస్తోంది. ప్రజా పంపిణీకి రూ.8 వేల కోట్ల తగ్గింపు.. వినియోగదారుల వ్యవహారాలు,ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే కేటాయింపులు తగ్గాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను ఈ శాఖకు రూ.2.13 లక్షల కోట్ల పైచిలుకు కేటాయించారు. ఇందులో వినియోగదారుల వ్యవహారా లకు 302.62 కోట్లు కేటాయించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దీని బడ్జెట్ రూ.309.26 కోట్లు కావడం గమనార్హం. ఇక ఆహార, ప్రజా పంపిణీ విభాగానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2,21,924.64 కోట్లు కేటాయించగా, ఈ ఏడాది కొంత కోత విధించి రూ.2,13,019 కోట్ల బడ్జెట్ మాత్రమే కేంద్రం కేటాయించింది. దేశవ్యాప్తంగా ఉన్న రేషన్ షాపుల ద్వారా 80 కోట్లకు పైగా ప్రజలకు ఈ విభాగం ఆహార ధాన్యాలు పంపిణీ చేస్తోంది. రసాయనాలు ఎరువుల శాఖకు రూ.1.68 లక్షల కోట్లు వచ్చే ఆర్థిక సంవత్సరానికి రసాయనాలు, ఎరువుల శాఖకు రూ.1.68 లక్షల కోట్లు కేటాయించారు. ఎరువుల విభాగానికి కేటాయింపులు రూ.1,88,947.29 కోట్ల నుంచి రూ.1,64,150.81 కోట్లకు తగ్గించారు. ఇక రసాయనాలు, పెట్రో రసాయనాల విభాగానికి కేటాయింపులు గణనీయంగా తగ్గాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.572.63 కోట్లు కేటాయించగా, వచ్చే ఏడాదికి కేవలం రూ.139.05 కోట్లు మాత్రమే కేటాయించారు. అయితే ఫార్మాస్యూటికల్స్ విభాగానికి మాత్రం కేటాయింపులు పెరగడం గమనార్హం. దీనికి కేటాయింపులు రూ.2,697.95 కోట్ల నుంచి రూ.4,089.95 కోట్లకు పెరిగాయి. అలాగే హోంమంత్రి అమిత్షా నేతృత్వంలోని సహకార శాఖకు కూడా రూ.747.84 కోట్ల నుంచి రూ.1,183.39 కోట్లకు కేటాయింపులు పెరిగాయి. ఇక మత్స్య, పశుసంవర్ధక, డెయిరీ శాఖకు రూ.7,105.74 కోట్లు, ఆహార శుద్ధి పరిశ్రమల శాఖకు రూ.3,290 కోట్లు కేటాయించారు. నీళ్లకు నిధులు పెరిగాయ్ ♦ జలశక్తి శాఖకు రూ. 98,418 కోట్లు కేటాయింపు ♦ గతేడాదికన్నా రూ. 2 వేల కోట్లు అధికం ♦ పీఎంకేఎస్వై ప్రాజెక్టుకు రూ. 11,391 కోట్లు ♦ గతంకన్నా రూ. 3 వేల కోట్లు పెరుగుదల సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం 2024 ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో కేంద్ర జలశక్తి శాఖకు నిధుల కేటాయింపులో ప్రాధాన్యతనిచ్చింది. గతేడాది జలశక్తి శాఖకు మొత్తంగా కేటాయించిన నిధుల కంటే దాదాపు రూ. 2 వేల కోట్ల మేర కేటాయింపులను పెంచింది. గతేడాది జలశక్తి శాఖకు రూ. 96,549 కోట్లు కేటాయించగా ఈ ఏడాది ఆ కేటాయింపులను రూ. 98,418 కోట్లకు పెంచింది. ముఖ్యంగా ప్రధానమంత్రి కృషి సించాయి యోజన (పీఎంకేఎస్వై) కింద నిధుల మొత్తాన్ని రూ. 8,781 కోట్ల నుంచి రూ. 11,391 కోట్లకు పెంచింది. దీనికిందే ఉన్న సమగ్ర సాగునీటి సత్వర ప్రాయోజిత కార్యక్రమం (ఏఐబీపీ) పథకానికి గతేడాదికి సమానంగా రూ. 2,500 కోట్లు కేటాయించింది. ఏఐబీపీ పథకంలో తెలంగాణ, ఏపీకి సంబంధించి వివిధ ప్రాజెక్టులకు ఈ నిధులు కేటాయించే అవకా శం ఉంది. దీంతోపాటే తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ఇటీవల కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్తో భేటీ సమయంలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కోరగా పీఎంకేఎస్వై పథకం కింద ప్రాజె క్టుకు ఆర్థిక సాయం అందిస్తా మని హామీ ఇచ్చారు. ఈ నిధు ల్లోనే ఆ మొత్తాలను కేటాయించాల్సి ఉంటుంది. ఇక ఆయకట్టు అభివృధ్ధి పథకం (కాడా) కింద రూ. 1,400 కోట్లు కేటాయించగా దీని కింద సైతం తెలంగాణకు సంబంధించి 11 ప్రాజెక్టులున్నాయి. నదుల అనుసంధానానికి పెరిగిన కేటాయింపులు... నదుల అనుసంధాన కార్యక్రమానికి కేంద్రం నిధులు పెంచింది. గతేడాది కేవలం రూ. 1,500 కోట్లు కేటాయించిన మోదీ ప్రభుత్వం.. ఈ ఏడాది దాన్ని రూ. 4 వేల కోట్లకు పెంచింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ సాగు, తాగునీటి అవసరాలను తీర్చే కెన్–బెత్వా నదుల అనుసంధాన ప్రక్రియ ఇప్పటికే మొదలవ్వడం, నాలుగు రోజుల కిందటే మధ్యప్రదేశ్, రాజస్తాన్ మధ్య పర్బతి–కాలిసింద్–చంబల్ నదులను తూర్పు రాజస్తాన్ కాలువతో కలిపే అనుసంధాన ప్రక్రియపై ఒప్పందాలు జరిగిన నేపథ్యంలో కేటాయింపులు పెంచినట్లు తెలుస్తోంది. అయితే గోదావరి–కావేరి అనుసంధాన ప్రక్రియపై ఎలాంటి ముందడుగు ఉంటుందన్నది తేలాల్సి ఉంది. గతేడాది తుంగభద్ర జలాలపై ఆధారపడి కర్ణాటక చేపట్టిన అప్పర్ భద్ర ప్రాజెక్టుకు కేంద్ర సాయం కింద రూ. 5,300 కోట్లు ఇస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించగా ఈ ఏడాది దాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. అలాగే తెలుగు రాష్ట్రాల ప్రాజెక్టులు ముఖ్యంగా ఏపీలోని పోలవరం ఎత్తిపోతల పథకానికి నిధుల కేటాయింపు అంశాల ప్రస్తావన లేదు. ‘లఖ్పతి దీదీ’ కిందకు 3 కోట్ల మంది మహిళలు న్యూఢిల్లీ: స్వయం సహాయక బృందాల్లో సభ్యత్వం తీసుకుని పొదుపు బాటలో పయనిస్తూ తమ దక్షతతో వ్యాపారం చేస్తూ లఖ్పతి దీదీ (లక్షాధి కారి)లుగా అవతరిస్తున్న మహిళల సంఖ్యను మరింత పెంచడంపై దృష్టిపెట్టినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈ విషయాన్ని తన బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించారు. ‘‘ 83 లక్షల స్వయం సహాయక బృందాలు(ఎస్హెచ్జీ)ల్లో దాదాపు తొమ్మిది కోట్ల మంది మహిళలు సభ్యులుగా కొనసాగుతున్నారు. వేల కోట్ల రుణాలు తీసుకుంటూ స్వయం ఉపాధి సాధిస్తూ, చిన్నపాటి వ్యాపారాలు చేసుకుంటున్నారు. కష్టించి వ్యాపారాన్ని నిలబెట్టుకుని తమ కుటుంబానికి ఆర్థిక ఆసరాగా నిలుస్తున్నారు. ఇలా దేశవ్యాప్తంగా దాదాపు కోటి మంది మహిళలు ఏటా కనీసం రూ. 1 లక్ష ఆర్జిస్తున్నారు. స్వయం ఉపాధి ద్వారా ఇలా పొదుపు సంఘాల మహిళలు దేశ సామాజిక, ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేస్తూ సాధికారత, స్వావలంభన సాధిస్తూ అందరికీ స్ఫూర్తిప్రదాతలయ్యారు. ఇలాంటి లక్షాధికారి(లఖ్పతి దీదీ)ల సంఖ్యను రెండు నుంచి మూడు కోట్లకు పెంచడమే మా ప్రభుత్వ లక్ష్యం’’ అని నిర్మల లోక్సభలో వ్యాఖ్యానించారు. ఆశ, అంగన్వాడీలకు ‘ఆయుష్మాన్ భారత్’ న్యూఢిల్లీ: ఆశా, అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు హెల్త్కేర్ కవరేజీని కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదించారు. వారిని ఆయుష్మాన్ భారత్ బీమా పథకం పరిధిలోకి తీసుకువస్తు న్నట్లు 2024–25 బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతా రామన్ ప్రకటించారు. సక్షం అంగన్వాడీ, పోషణ్ 2.0 కింద అంగన్వాడీ కేంద్రాలను ఉన్నతీకరించడం ద్వారా న్యూట్రిషన్ డెలివరీ వేగవంతం అవుతుందని చెప్పారు. ఇప్పుడున్న ఆస్పత్రుల మౌలిక వసతు లను వినియోగించుకుని మరిన్ని మెడికల్ కాలేజీలు ఏర్పా టు చేయాలనే ప్రణాళికలో ప్రభుత్వం ఉందని తెలిపారు. దీనిని పరిశీలించడానికి ఓ కమిటీని ఏర్పాటు చేస్తామ న్నారు. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (పీఎంజేఏవై) కేటాయింపులను రూ. 6,800 కోట్ల నుంచి రూ. 7,500 కోట్లకు పెంచినట్లు నిర్మల చెప్పారు. సర్వైకల్ క్యాన్సర్ నియంత్రణ కోసం 9 నుంచి 14 ఏళ్ల మధ్య ఉన్న బాలికలకు వ్యాక్సినేషన్ను ప్రోత్సహిస్తామన్నా రు. సమగ్ర ఆచరణ కోసం వివిధ మాతా శిశు హెల్త్కేర్ స్కీంలను ఒకే గొడుగు కిందకు తెస్తామన్నారు. మిషన్ ఇంద్రధనుష్ మరింత సమర్థంగా అమలు చేయడంలో భాగంగా కొత్తగా రూపొందించిన యు–విన్ పోర్టల్ను దేశవ్యాప్తంగా తీసుకొస్తున్నామని తెలిపారు. ఆదాయ పన్ను శ్లాబ్లు యథాతథం.. సాక్షి,అమరావతి: మధ్యతరగతి, వేతనజీవుల ఆశలపై ఆర్థిక మంత్రి నీళ్లు కుమ్మరించారు. ఎన్నికల వేళ ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో కాసింత ఉపశమన మాటలు వస్తాయనుకున్న వారికి గతంలో చేసిన గొప్పలను ఏకరువు పెట్టి సరిపెట్టారు. మధ్యంతర బడ్జెట్ కావడంతో ప్రత్యక్ష, పరోక్ష పన్నుల్లో ఎటువంటి మార్పులు చేయడం లేదన్నారు. వ్యక్తిగత ఆదాయ పన్నుల శ్లాబుల్లో ఎటువంటి మార్పులు లేవన్నారు. గత పదేళ్ల కాలంలో తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ప్రత్యక్ష పన్ను ల వసూళ్లూ 3 రెట్లకుపైగా పెరగ్గా పన్ను రిట ర్నులు దాఖలు చేసే వారి సంఖ్య 2.4 రెట్లు పెరిగిందని పేర్కొన్నారు. 2013– 14 ఆర్థిక సంవత్సరానికి దేశంలో పన్ను చెల్లించాల్సినవసరం లేని ఆదాయ పరిమితి రూ.2.2 లక్షలు ఉంటే ఇప్పుడు 7 లక్షల వార్షిక ఆదాయం ఉన్న వారు ఒక్క రూపాయి పన్ను చెల్లించా ల్సిన పని లేదన్నారు. కొత్త పన్నుల విధానం ఎన్నుకున్న వారికే ఇది వర్తింపు 7 లక్షల వరకు పన్ను చెల్లించక్కర్లేదన్న ఆర్థిక మంత్రి మాటలపై మధ్యతరగతి ప్రజలు పెదవి విరుస్తున్నారు. ఇది కేవలం కొత్త పన్నుల విధానం ఎంచుకున్నవారికి మాత్రమే వర్తిస్తుందని, పాత పన్ను ల విధానంలో ఉన్న వారికి ఈ రిబేటు పరిమితి రూ.5 లక్షలే ఉందన్న విషయాన్ని వారు గుర్తుచేశారు. నాలుగేళ్ల కిందట కొత్త పన్నుల విధానం తీసుకొచ్చారు. పాత విధానంతో పోలి స్తే తక్కువ పన్ను రేట్లతో అన్ని వయసుల వారికి ఒకే విధమైన శ్లాబ్ రేట్ల ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త విధానం ఎంచుకుంటే సెక్షన్ 80సీ, గృహ రుణాలు, స్టాండర్డ్ డిడక్షన్, ఆరోగ్య బీమా వంటి పలు సెక్షన్ల కింద లభించే ప్రయోజనాలను పొందడానికి వీలుండదు. మొత్తం ఆదాయం మీద పన్ను చెల్లించా ల్సి వస్తుంది. కొత్త పన్నుల విధానంలో 7 లక్షల వరకు ఎటువంటి పన్ను చెల్లించన వరం లేకుండా సెక్షన్ 87ఏ కింద రిబేటు ప్రకటించింది. దీనికింద రూ.25,000 ప్రయో జనం లభిస్తుంది. అదే పాత పన్నుల విధానం ఎంచుకుంటే సెక్షణ్ 87ఏ రిబేటు పరిమితిని రూ.5 లక్షల ఆదాయం వరకు పరిమితం చేశారు. పాత పన్నుల విధానం ఎంచుకున్న వారికి కేవలం రూ.12,500 మాత్రమే ప్రయోజనం లభిస్తుంది. పాత విధానం నుంచి కొత్త విధానంలోకి మార్చాలన్న ఉద్దే శ్యంతో నిర్మాల ఈ నిర్ణయం తీసుకున్నారు. రిటైల్ వ్యాపారుల ఊహాజనిత ఆదాయం పరిమి తిని రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్లకు, వృత్తినిపుణుల ఊహాజనిత ఆదాయ పరిమితిని రూ.50 లక్షల నుంచి రూ.75 లక్షలకు పెంచినట్లు పేర్కొన్నారు. గడిచిన ఐదేళ్ల కాలంలో పన్ను రిట ర్నులు సులభంగా దాఖలు చేసే విధంగా పలు చర్యలు తీసుకున్నామని, దీంతో 2013– 14లో 93 రోజులుగా ఉన్న రిఫండు సమయాన్ని ఇప్పుడు పదిరోజులకు తగ్గించినట్లుగా తెలిపారు. గ్రామీణాభివృద్ధికి..రూ.1.77 లక్షల కోట్లు 2024–25 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు రూ.1.77 లక్షల కోట్లు ప్రకటించారు. గతేడాది రూ.1.57 లక్షల కోట్ల కంటే 12 శాతం ఎక్కువగా కేటాయించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ.86,000 కోట్లు కేటాయించగా, గత బడ్జెట్లో చేసిన రూ.60,000 కోట్ల కంటే ఇది 43 శాతం ఎక్కువ. వచ్చే ఐదేళ్లలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన– గ్రామీణ్ పథకానికి రూ.54,500 కోట్లు కేటాయించారు. ‘లఖ్ పతి దీదీ’ల లక్ష్యాన్ని రెండు కోట్ల నుంచి 3 కోట్లకు పెంచినట్లు సీతారామన్ ప్రకటించారు. జాతీయ జీవనోపాధి మిషన్–అజీవికకు రూ.15,047 కోట్లు కేటాయించారు. గతేడాది కేటాయించిన రూ.14,129.17 కోట్ల కంటే ఇదిదాదాపు 6% ఎక్కువ. కాగా, ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజనకు కేటాయింపులు తగ్గాయి. ఈ బడ్జెట్లో రూ.12,000 కోట్లు కేటాయించారు. పర్యావరణ శాఖకు..రూ.3,265 కోట్లు కేంద్ర ప్రభుత్వం 2024–25 మధ్యంతర బడ్జెట్లో పర్యావ రణ శాఖకు రూ.3,265 కోట్లు కేటాయించింది. గత ఏడాది ఈ మొత్తం రూ.3,231 కోట్లు ఉండగా, ఈ సారి కొద్దిగా పెరి గింది. అలాగే కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు, కేంద్ర జూ అథారిటీ, జాతీయ బయోడైవర్సిటీ అథారిటీ,ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ సంస్థలకు గతేడాది బడ్జెట్లో 158.60 కోట్లు కేటాయించగా, ఈ సారి రూ.192 కోట్లు కేటాయించారు. కాగా, స్వయంప్రతిపత్తి సంస్థలైన జీబీ పంత్ హిమాలయన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎన్వి రాన్మెంట్, భారత అటవీ పరిశోధన, అభి వృద్ధి మండలి, వైల్డ్లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలకు కేంద్రం గతేడాది బడ్జెట్లో రూ.573.73 కోట్లు కేటాయించగా, తాజా మధ్యంతర బడ్జె ట్లో రూ.391 కోట్లు మాత్రమే కేటాయించింది. ఇక అడ వుల్లో జంతు ఆవాసాల సమీకృత అభివృద్ధికి రూ.450 కోట్లను కేటాయించింది. అలాగే అడవుల పరిరక్షణ, పచ్చ దనం పెంపునకు సంబంధించి జాతీయ గ్రీన్ ఇండియా మిషన్కు గత బడ్జెట్లో రూ.160 కోట్లు ఉన్న కేటాయింపులను ఈ సారి రూ.220 కోట్లకు పెంచింది. సామాజిక న్యాయం, సాధికారతకు..రూ.14,225 కోట్లు కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన 2024–25 మధ్యంతర బడ్జె ట్లో సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖకు రూ.14,225.47 కోట్లు కేటాయించారు. సామాజిక న్యాయం, సాధికారత శాఖకు రూ.13,000 కోట్లు కేటాయించగా.. వికలాంగుల సాధికారత శాఖకు రూ.1,225.27 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్ రూ.11,078.33 కోట్లతో పోలిస్తే ఈ ఏడాది 28.4% పెరిగింది. వికలాంగుల సాధికారత విభా గం కింద జాతీయ వికలాంగుల సంక్షేమానికి రూ.615 కోట్లు కేటా యించారు. సామాజిక న్యాయం, సాధికారత శాఖ కింద షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి పథకానికి రూ.9,559.98 కోట్లు కేటాయించగా, బలహీ న వర్గాల అభివృద్ధి కార్యక్రమానికి రూ.2,150 కోట్లు కేటా యించారు. జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్, వెనుక బడి న తరగతుల జాతీయ కమిషన్, సఫాయి కర్మచారుల జాతీ య కమిషన్కు మొత్తం రూ.7,175 కోట్లు కేటాయించారు. గిరిజన మంత్రిత్వ శాఖకు..రూ.13వేల కోట్లు 2024–25 మధ్యంతర బడ్జెట్లో గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు కేంద్రప్రభుత్వం రూ.13,000 కోట్లు కేటాయించింది. ఇది గత కేటాయింపుల కంటే భారీ అనగా 70 శాతం ఎక్కువ. 2023–24 ఆర్థిక సంవత్సరంలో గిరిజన మంత్రిత్వ శాఖకు రూ.7,605 కోట్లు కేటాయించారు. 2024– 25లో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (ఈఎమ్ ఆర్ఎస్) నిర్మాణానికి కేంద్రం రూ.6,399 కోట్లు కేటాయించింది. ఇది 2023–24లో కేటాయించిన రూ.2,471.81 కోట్ల కంటే 150 శాతం ఎక్కువ. ప్రధాన మంత్రి ఆది ఆదర్శ్ గ్రామ యోజనకు కేటాయింపులు రూ.300 కోట్ల నుంచి రూ.1,000 కోట్లకు పెంచారు. ఈ పథకం కింద విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి–ఆదాయ కల్పన వంటి రంగాల్లోని అంతరాలను తగ్గించడానికి గిరిజన ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం నిధులను అందిస్తారు. గిరిజన పరిశోధనా సంస్థలకు ఆర్థిక సహాయాన్ని రూ.50 కోట్ల నుంచి రూ.111 కోట్లకు పెంచారు. కాగా, జాతీయ ఫెలోషిప్, ఎస్టీ విద్యార్థుల ఉన్నత విద్య, స్కాలర్షిప్ కోసం బడ్జెట్ కేటాయింపులు 2023–24లో రూ.230 కోట్ల నుంచి 2024–25లో రూ.165 కోట్లకు తగ్గించారు. రాష్ట్రాలకు రూ. 75 వేల కోట్ల వడ్డీలేని రుణాలు వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాకారం చేసే చర్యల్లో భాగంగా సంస్కరణల బాటపట్టే రాష్ట్రాలకు 50 ఏళ్లపాటు రూ. 75 వేల కోట్ల వడ్డీలేని రుణాలను అందిస్తామని కేంద్రం తెలిపింది. 2047కల్లా భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలన్న లక్ష్యసాధన కోసం ఈ మేరకు ప్రతిపాదనలు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ఇందుకోసం రాష్ట్రాలు ఎన్నో అభివృద్ధి ఆధారిత సంస్కరణలను చేపట్టాల్సి ఉందన్నారు. అన్ని రంగాల సమ్మిళిత అభివృద్ధి సాధన దిశగా మోదీ ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోందని చెప్పారు. అంతరిక్షానికి అదనంగారూ. 2,000 కోట్లు అంతరిక్షంలో భారత కేంద్రం ఏర్పాటు లక్ష్యంగా కలిగిన అంతరిక్ష విభాగానికి కేంద్ర బడ్జెట్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కంటే రూ.2 వేల కోట్లు అదనంగా కేటాయించారు. ఈ విభాగానికి 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.13,042.75 కోట్లు కేటాయించారు. 2023–24 సవరించిన అంచనాల ప్రకారం ఈ విభాగానికి రూ.11,070.07 కోట్ల కేటాయింపులు జరిగాయి. 2035 కల్లా భారత్ అంతరిక్ష కేంద్రాన్ని నెలకొల్పాలని, 2040 కల్లా భారతీయ వోమగామి చంద్రునిపై కాలు మోపాలని ప్రధాని మోదీ లక్ష్యంగా నిర్దేశించిన సంగతి తెలిసిందే. ఇలావుండగా స్పేస్ టెక్నాలజీకి కేటాయింపులు గణనీయంగా పెరిగాయి. 2023–24లో రూ.8,180 కోట్లు కేటాయించగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.10,087 కోట్లుగా ప్రతిపాదించారు. మహిళా శిశు అభివృద్ధికి రూ.26 వేల కోట్లు మధ్యంతర బడ్జెట్లో మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖకు రూ.26 వేల కోట్ల కేటాయింపులు దక్కాయి. 2023–24 బడ్జెట్తో పోలిస్తే ఇది 2.52 శాతం అధికం. అత్యధికంగా సాక్షం అంగన్వాడీ, పోషణ్ 2.0లకు రూ.21,200 కోట్లు కేటాయించారు. మిషన్ శక్తికి రూ.3,145.97 కోట్లు ప్రతిపాదించారు. మహిళలకు భద్రత, రక్షణ అలాగే వారు తమ హక్కులు పొందడం, పలు ప్రభుత్వ పథకాలు చేరువ చేయడం లక్ష్యంగా మిషన్ శక్తి (సంబల్)కి కేంద్రం శ్రీకారం చుట్టింది. కాగా మిషన్ వాత్సల్య (బాలల రక్షణ సేవలు, బాలల సంక్షేమ సేవలు)కు రూ.1,472 కోట్లు కేటాయించారు. సవరించిన బడ్జెట్ అంచనాల ప్రకారం..2023–24లో మహిళా శిశు అభివృద్ధి శాఖకు రూ.25,448.68 కోట్లు కేటాయించారు. అటానమస్ సంస్థలకు రూ.168 కోట్ల నుంచి రూ.153 కోట్లకు బడ్జెట్ తగ్గింది. ఈ సంస్థల్లో సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ ఏజెన్సీ, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఉన్నాయి. ఇది కార్పొరేట్ల బడ్జెట్ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కార్పొరే ట్లకు లాభాలు కట్టబెట్టే, ఓటర్లను భ్రమల్లో పెట్టే బడ్జెట్ అని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. ఈ బడ్జెట్ దారిద్య్ర రేఖకు దిగువనున్నవారికి ప్రయోజనం కల్పించేది కాదని గురువారం ఒక ప్రకటనలో పేర్కొ న్నారు. కేంద్రం ఒకవైపు నిత్యావసర సరుకుల ధరలు పెంచుతూ, మరోవైపు రాయితీలకు కోత పెడుతోందన్నారు. -
‘కౌలు’కు ఏపీ తరహా చట్టం
సాక్షి, హైదరాబాద్: ఏపీలో అమలు చేస్తున్న పంటసాగు హక్కుల చట్టం–2019 తరహాలోనే తెలంగాణలో సైతం కొత్త చట్టం తీసుకొస్తే కౌలు రైతులకు ‘రైతు భరోసా’ పథకం వర్తింపజేయడానికి అవకాశం ఉంటుందని, ధరణి పోర్టల్ పునర్ని ర్మాణ కమిటీకి వ్యవసాయశాఖ ప్రతిపాదించింది. వ్యవసాయం, గిరిజన సంక్షేమం, అటవీశాఖల అధికారులతో శనివారం రాష్ట్ర సచివాలయంలో కమిటీ సమావేశమై చర్చించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కౌలుదారులకు రైతు భరోసా ఇచ్చేందుకు అనుసరించాల్సిన విధానంపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ప్రతి ఏటా నిర్దేశిత కటాఫ్తేదీ నాటికి ధరణి పోర్టల్లో ఉన్న భూరికార్డుల సమాచారం ఆధారంగా రైతుబంధు పంపిణీ చేస్తున్నామని వ్యవసాయశాఖ అధికారులు కమిటీకి నివేదించారు. రైతుబంధు సాయం పొందుతున్న లబ్ధిదారులు నిజంగా భూములను అనుభవిస్తున్నారా? పంటలు సాగు చేస్తున్నారా? ఖాళీ భూములకు కూడా రైతుబంధు చెల్లిస్తు న్నారా? అని కమిటీ ప్రశ్నించగా, తమ వద్ద ఎలాంటి సమాచా రం లేదని వ్యవసాయశాఖ అధికారులు బదులిచ్చారు. అటవీ భూములన్నింటిని ధరణిలోని నిషేధిత భూముల జాబితాలో చేర్చలేదని, అటవీశాఖ అధీనంలోని భూముల లెక్కకు, ధరణి లోని అటవీ భూముల లెక్కకు పొంతన లేదని అటవీఅధికారులు కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. అటవీ భూముల పరిరక్షణకు ధరణిలో లోటుపాట్లు సరిచేయాలని కోరారు. గిరిజన ప్రాంతా ల్లోని కొందరు రైతుల పట్టాభూముల వివరాలు పాత రికార్డుల్లో నమోదు కాకపోవడంతో, ధరణిలో ఎంట్రీకి నోచుకోలేదని గిరి జనశాఖ అధికారులు కమిటీకి తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో వారసత్వ బదిలీకి గ్రామసభలు నిర్వహించి తీర్మానం చేయాలని నిబంధనలు ఉండటంతో ఇబ్బందికరంగా మారిందని వివరించారు. క్షేత్ర స్థాయిలో గిరిజన రైతుల ఆధీనంలో ఉన్న భూము లను వారి పేరు మీద ధరణిలో ఎంట్రీ చేయాలని సూచించారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు కాంగ్రెస్ కిసాన్సెల్ నేత కోదండరెడ్డి, భూచట్టాల నిపుణుడు సునీల్కుమార్, రిటైర్డ్ రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రేమండ్ పీటర్, రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి నవీన్మిట్టల్, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ మధుసూదన్, సీఎంఆర్ఓపీడీ వి.లచ్చిరెడ్డి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. కమిటీ తదుపరిగా వచ్చేనెల 3వ తేదీన సచివాలయంలో స్టాంపులు, రిజి స్ట్రేషన్లు, వక్ఫ్, ఎండోమెంట్, స్వే అండ్ సెటిల్మెంట్ శాఖల అధికారులతో సమావేశమై ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పించనుంది. జిల్లాల పర్యటనల తర్వాత తుది నివేదిక ఇవ్వనుంది. -
యూరియా సరఫరాలో కోత
సాక్షి, హైదరాబాద్: రైతులు పంట పొలాల్లో అవసరానికి మించి యూరియా వాడుతున్నారని, దానివల్ల భూసారం తగ్గుతోందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అందువల్ల సరఫరాలో కోతలు విధించాలని నిర్ణయించింది. యూరియా వినియోగం వీలైనంత మేరకు తగ్గించేలా చూడాలని అన్ని రాష్ట్రాలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. యూరియా ఎంత తగ్గిస్తే, అంతే స్థాయిలో ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటించినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ వర్గాలు వెల్లడించాయి. యూరియా అధిక వాడకం వల్ల భూసారం తగ్గడమే కాకుండా, పంటలు కూడా విషపూరితమవుతున్నాయి. ఆయా ఆహార పదార్థాలు తింటున్న ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే యూరియా సహా ఇతరత్రా అన్ని రకాల ఎరువులు, పురుగు మందుల వాడకం తగ్గించాలని కేంద్రం సూచించింది. రసాయన ఎరువుల స్థానంలో సేంద్రీయ ఎరువులు, పురుగు మందులు వాడాలని తెలిపింది. కాగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలో యూరియా వాడకాలను తగ్గించేలా చూస్తామని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. సాగు తగ్గినా పెరిగిన యూరియా వాడకం రైతులు పంట పొలాల్లో యూరియాను కుమ్మరిస్తున్నారు. దీని వినియోగం ఏటా పెరుగుతోందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. అవసరమున్నా లేకున్నా కొందరు రైతులు అధిక దిగుబడి వస్తుందనే ఆశతో యూరియాను విరివిగా వాడుతున్నారని అంటున్నారు. రైతులు గత ఏడాది వానాకాలం సీజన్లో 10.34 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను పంట పొలాల్లో వాడారని వ్యవసాయ శాఖ వెల్లడించింది. 2022–23 వానాకాలం సీజన్లో 9.05 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వినియోగించగా, 2023–24 వానాకాలం సీజన్లో 1.29 లక్షల మెట్రిక్ టన్నులు అదనంగా వాడటం గమనార్హం. గత ఆగస్టు, సెపె్టంబర్ నెలల్లోనే అధికంగా యూరియాను వినియోగించారు. వాస్తవానికి గత వానాకాలం సీజన్లో యూరియా వాడకం తగ్గుతుందని భావించారు. కానీ పెరిగింది. దీంతో కేంద్ర కేటాయింపుల కంటే ఎక్కువగా యూరియాను రాష్ట్ర వ్యవసాయశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే అంతకుముందు వానాకాలం సీజన్ కంటే గత ఏడాది వానాకాలం సీజన్లో పంటల సాగు విస్తీర్ణం తగ్గడం గమనార్హం. 2022– 23 ఏడాది వానాకాలం సీజన్లో 1.47 కోట్ల ఎకరాల విస్తీర్ణంలో అన్ని రకాల పంటలు సాగు కాగా, 2023–24 వానాకాలం సీజన్లో 1.26 కోట్ల ఎకరాల్లోనే పంటలు సాగయ్యాయి. అంటే 21 లక్షల ఎకరాల్లో పంటల సాగు విస్తీర్ణం తగ్గింది. కానీ యూరియా వాడకం మాత్రం 1.29 లక్షల మెట్రిక్ టన్నులు పెరగడం గమనార్హం. పలుమార్లు వర్షంతోనూ పెరుగుతున్న వాడకం గత ఏడాది రుతుపవనాలు ఆలస్యమయ్యాయి. కీలకమైన సమయంలో వర్షాలు లేకపోవడంతో పత్తి, ఆరుతడి పంటల సాగు ఆలస్యమైంది. కొన్నిచోట్ల మాత్రం వర్షాలు కురవడంతో రైతులు పత్తి లాంటివి వేశారు. కానీ ఆ తర్వాత వర్షాలు రాకపోవడంతో వేసిన పంటలు ఎండిపోయాయి. మొక్కలు భూమిలోనే మాడిపోయాయి. తర్వాత వర్షాలు కురిశాక మళ్లీ దున్ని విత్తనాలు చల్లారు. ఇలా పలుమార్లు విత్తనాలు చల్లడం వల్ల యూరియా కూడా రెండు మూడుసార్లు వేయాల్సి వచ్చిందని రైతులు అంటున్నారు. దీంతో రెండు బస్తాలకు బదులు మూడు, నాలుగు బస్తాల వినియోగం జరిగిందని వ్యవసాయశాఖ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఆ తర్వాత భారీ వర్షాలు కురవడంతో అనేకచోట్ల పంటలు కొట్టుకుపోయాయి. పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. పంట చేలల్లో నీరు నిలిచిపోయింది. అటువంటి చోట్ల మళ్లీ విత్తనాలు వేయడం, కొన్నిచోట్ల నీటిని తొలగించడం చేశారు. దీనివల్ల కూడా యూరియాను మరోసారి వినియోగించాల్సి వచ్చింది. పైగా సబ్సిడీ వల్ల యూరియా ధర కూడా తక్కువగా ఉండటంతో రైతులు విరివిగా వినియోగించారని చెబుతున్నారు. ఈ అదనపు వినియోగాన్ని తగ్గించడమే లక్ష్యమని వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి. -
వ్యవసాయానికి బడ్జెట్ ప్రతిపాదనలు రూ.40,000 కోట్లు!
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ రంగానికి 2024–25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో రూ.40 వేల కోట్లు కేటాయించాలని వ్యవసాయ శాఖ కోరింది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. బడ్జెట్పై ప్రభుత్వం వివిధ శాఖల నుంచి ప్రతిపాదనలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కసరత్తు చేసిన వ్యవసాయ శాఖ గతం కంటే అధికంగా నిధులు కేటాయించాలని కోరడం విశేషం. 2022–23 బడ్జెట్లో ప్రభుత్వం వ్యవసాయ రంగానికి రూ.24,254 కోట్లు కేటాయించగా, 2023–24లో రూ.26,831 కోట్లు కేటాయించింది. కాగా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వ మొదటి బడ్జెట్లో ఏకంగా రూ.40 వేల కోట్లు కేటాయించాలంటూ వ్యవసాయ శాఖ ప్రతిపాదించడం.. రైతుల పట్ల సర్కారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందనడానికి నిదర్శనమని అధికార వర్గాలు అంటున్నాయి. రుణమాఫీ, రైతు భరోసాకే అధికం కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించింది. అలాగే రైతుభరోసా పేరుతో అన్నదాతలకు ఏడాదికి ఎకరాకు రూ.15 వేల పెట్టుబడి సాయం అందిస్తామని హామీ ఇచ్చింది. రెండు పథకాలను ఈ ఏడాది నుంచే అమలు చేయనుంది. దీనితో వీటికి అధిక మొత్తంలో నిధులు అవసరం. బీఆర్ఎస్ ప్రభుత్వం 36.68 లక్షల మంది రైతులకు రూ.లక్ష వరకు రుణమాఫీకి మొత్తం రూ.19,198.38 కోట్లు అవసరమని అంచనా వేసింది. అయితే దాదాపు రూ.13 వేల కోట్ల వరకు మాత్రమే మాఫీ చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 లక్షల వరకు మాఫీ చేయాలంటే మొత్తం రూ.30 వేల కోట్లు అవసరమవుతాయని, వడ్డీలతో కలిపి రూ.36 వేల కోట్లు కావాల్సి ఉంటుందని అంచనా. కాగా మొదటి సంవత్సరానికి గాను రూ.7,200 కోట్లు చెల్లించేలా వ్యవసాయ శాఖ ప్రతిపాదనలు చేసింది. బ్యాంకులకు నెలసరి వాయిదాల్లో.. రుణమాఫీ నిధులను బ్యాంకులకు ప్రతి నెలా రూ.600 కోట్ల చొప్పున ఐదేళ్ల పాటు చెల్లించే అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం నోడల్ బ్యాంకుతో ఒక దఫా చర్చలు కూడా జరిపినట్లు సమాచారం. అవసరమైతే ఆర్బీఐతోనూ చర్చించాలని, బ్యాంకులకు నెలసరి వాయిదాల్లో ఈ మొత్తాన్ని చెల్లించినప్పటికీ, రుణమాఫీ ఒకేసారి చేసేలా బ్యాంకులను ఒప్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇలావుండగా రుణమాఫీకి సంబంధించిన కట్ ఆఫ్ డేట్ (గడువు తేదీ)పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. రుణమాఫీ ఎలా చేయాలన్న దానిపై త్వరలో మార్గదర్శకాలు ఖరారు కానున్నాయి. ఇక రైతుబంధు కోసం 2023–24 బడ్జెట్లో రూ.15,075 కోట్లు కేటాయించారు. తాజాగా రైతుభరోసా సొమ్ము కూడా పెరగడంతో బడ్జెట్ కూడా పెంచాల్సి ఉంది. కాబట్టి రూ.22,500 కోట్లు కావాల్సి ఉంటుందని అంచనా కాగా.. ఆ మేరకు వ్యవసాయ శాఖ ప్రతిపాదనలు పంపింది. వ్యవసాయ యాంత్రీకరణకు రూ.500 కోట్లు వ్యవసాయ యాంత్రీకరణపైనా దృష్టి సారించాలని, ఆ మేరకు రూ.500 కోట్లు కేటాయించాలని వ్యవసాయశాఖ ప్రతిపాదించినట్లు తెలిసింది. రైతు బీమాకు ప్రభుత్వం 2022–23లో రూ.1,466 కోట్లు కేటాయిస్తే, 2023–24 బడ్జెట్లో రూ.1,589 కోట్లు కేటాయించింది. ఈసారి రూ.1,600 కోట్లు కేటాయించే అవకాశాలున్నాయి. ఆయిల్పాం సాగు విస్తీర్ణం పెంచేందుకు 2023–24 బడ్జెట్లో రూ.1,000 కోట్లు కేటాయించింది. ఈసారి కూడా అంతే మొత్తంలో కేటాయించాలని ఉద్యానశాఖ నుంచి ప్రతిపాదనలు వచ్చినట్లు సమాచారం. రైతులకు విత్తనాలు సరఫరా చేసేందుకు, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి, కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి, రైతు వేదికలకు, మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్, వ్యవసాయ విస్తరణ కార్యకలాపాలకు, మైక్రో ఇరిగేషన్ తదితరాలకు కూడా నిధులు కోరుతూ వ్యవసాయ శాఖ ప్రతిపాదనలు చేసింది. ఇక రాష్ట్రంలో కొత్తగా పంటల బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఎప్పటినుంచో ప్రతిపాదన ఉంది. దీన్ని అమలు చేయాలంటే ఆ మేరకు నిధులు కేటాయించాల్సి ఉంటుంది. -
కౌలురైతులు, అటవీ భూ సాగుదారులకు మరో ఛాన్స్
సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతుభరోసా కింద పెట్టుబడి సాయం దక్కని కౌలుదారులతో పాటు అటవీ భూ సాగుదారులకు రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. శాచ్యురేషన్ పద్ధతిలో రైతుభరోసా సాయం అందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అర్హత కలిగి ఇంకా పెట్టుబడి సాయం దక్కని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలుదారులతో పాటు అటవీ భూ సాగుదారులను గుర్తించి మూడోవిడత సాయంతో కలిపి ఈ ఏడాది రైతుభరోసా అందించేందుకు వ్యవసాయశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం రైతుభరోసా పోర్టల్లో ఈ నెల 30వ తేదీ వరకు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. వైఎస్సార్ రైతుభరోసా కింద అర్హత కలిగిన భూ యజమానులు, దేవదాయ, అటవీ భూ సాగుదారులతో పాటు సెంటు భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలుదారులకు ఏటా మూడువిడతల్లో రూ.13,500 చొప్పున పెట్టుబడిసాయం అందిస్తున్నారు. ఈ పథకం కింద ఈ నాలుగున్నరేళ్లలో 53.53 లక్షల రైతు కుటుంబాలకు మొత్తం రూ.33,209.81 కోట్ల పెట్టుబడి సాయం అందించారు. ఈ సాయం అందుకున్నవారిలో ఏటా సగటున 51 లక్షల మంది భూ యజమానులు, పంటసాగుదారు హక్కుపత్రం (సీసీఆర్సీ) ఆధారంగా 1.2 లక్షల మంది కౌలురైతులు, ఆర్వోఎఫ్ఆర్ పట్టాతో అటవీభూమి సాగుచేసుకుంటున్నవారు 90 వేలమంది ఉన్నారు. ఈ నాలుగున్నరేళ్లలో కౌలురైతులు (సీసీఆర్సీ), ఆర్వోఎఫ్ఆర్ సాగుదారులు మొత్తం 9.39 లక్షల మందికి రూ.1,219.68 కోట్ల పెట్టుబడి సహాయం అందింది. జనవరిలో మూడోవిడత.. ఈ ఏడాది ఇప్పటికే రెండు విడతల్లో 53.53 లక్షల రైతు కుటుంబాలకు రూ.6,147.72 కోట్ల పెట్టుబడి సాయం అందించారు. లబ్దిపొందిన వారిలో 51 లక్షల మంది భూ యజమానులు, 1,59,674 మంది కౌలుదారులు, 93,168 మంది అటవీ భూ సాగుదారులు ఉన్నారు. జనవరిలో మూడోవిడత సాయం పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో మరింతమంది కౌలుదారులు, అటవీ భూ సాగుదారులకు లబ్దిచేకూర్చాలని రైతుభరోసా పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ కు అవకాశం కల్పించారు. రెండో విడత సాయం పంపిణీ తర్వాత లాక్ అయిన ఈ పోర్టల్ లాగిన్ను ఈ నెల 18వ తేదీ నుంచి కొత్త రిజిస్ట్రేషన్ల కోసం ఓపెన్ చేశారు. లాగిన్ ఐడీలు ఆర్బీకే సిబ్బంది నియంత్రణలోనే ఉంటాయి. అర్హత ఉండి ఇంకా అవకాశం వినియోగించుకోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలుదారులు, ఆర్వోఎఫ్ఆర్ (అటవీ) పట్టాదారులు ఈ పథకంలో అర్హత సాధించటానికి రైతుభరోసా పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కౌలుదారులు సీసీఆర్సీతో పాటు ఆధార్ కార్డు, ఫోన్ నంబరు లింక్ అయిన బ్యాంక్ ఖాతా వివరాలు, అటవీ భూమి సాగుచేసేవారు ఆర్వోఎఫ్ఆర్ పట్టా, ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలతో సమీప ఆర్బీకేకి వెళ్లి పోర్టల్లో నమోదు చేసుకోవాలి. ఇలా నమోదు చేసుకున్న వారిలో అన్ని అర్హతలు ఉన్న వారికి జనవరిలో మూడువిడతల సాయం ఒకేసారి అందించనున్నారు. విస్తృత ప్రచారం చేస్తున్నాం సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు సంతృప్తకర స్థాయి (శాచ్యురేషన్)లో అర్హత ఉన్న వారికి పెట్టుబడి సాయం అందించే సంకల్పంతో అర్హత ఉండి ఇప్పటివరకు పెట్టుబడి సాయం పొందని కౌలుదారులు, అటవీ భూ సాగుదారులు రైతు భరోసా పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించాం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఈ నెల 30వ తేదీలోగా తమ వివరాలు నమోదు చేసుకోవాలి. ఈ మేరకు ఆర్బీకేల ద్వారా విస్తృత ప్రచారం కల్పిస్తున్నాం. – చేవూరు హరికిరణ్, వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్ -
నేటి నుంచే రైతుబంధు నిధుల విడుదల..
సాక్షి, హైదరాబాద్: రైతుల బ్యాంకుఖాతాల్లో రైతుబంధు నిధులు జమ చేసే ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. వ్యవసాయశాఖపై సోమవారం ఆయన డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ తెలంగాణ సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీని వాసరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంఓ కార్యదర్శి శేషాద్రి, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు తదితర అధికారులు పాల్గొన్నారు. 3 గంటల పాటు జరిగిన ఈ సమీక్ష సమావేశంలో వ్యవసాయశాఖ, సంబంధిత విభాగాల పనితీరు, రైతు సంక్షేమ కార్యక్ర మాల అమలుపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ ఏ ఒక్క రైతుకు ఇబ్బంది కలగకుండా పంట పెట్టుబడిసాయం అందించాలన్నారు. రైతుబంధు నిధులను రైతుల ఖాతాల్లో జమచేసే విధానం గతంలో ఉన్న మాదిరిగానే కొనసాగించాలని ఆయన స్పష్టం చేశారు. 68.99 లక్షల మంది రైతులకు రైతుబంధు సాయం అందనుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రెండు లక్షల మేరకు రుణమాఫీ చేసేందుకు తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. వారానికి రెండ్రోజులు ప్రతి మంగళ, శుక్రవారాల్లో ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజాదర్బార్ప్రజావాణిగా మార్పు ప్రజాదర్బార్ను ఇకనుంచి ప్రజావాణిగా పిలవాలని సీఎం ఆదేశించారు. దీనిని ప్రతీ మంగళ, శుక్రవారాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహిస్తామన్నారు. ప్రజావాణికి ఉదయం 10లోగా జ్యోతిరావు పూలే ప్రజాభవన్కు చేరుకున్న వారికి అవకాశం ఇవ్వాలని సూచించారు. వికలాంగులు, మహిళలకు ప్రత్యేక క్యూలు ఏర్పాటు చేయాలని, తాగునీరు, ఇతర సౌకర్యాలు కల్పించాలని సీఎం ఆదేశించారు. తొలి ప్రజాదర్బార్ శుక్ర వారం నిర్వహించగా, ఆ తర్వాత రెండు రోజులు శని ఆదివారాలు సెలవు కావడంతో ప్రజా దర్బార్ నిర్వహించలేదు, సోమ వారం ప్రజా దర్బార్ ఉన్నా, సీఎం రేవంత్రెడ్డి కాకుండా ఐటీ మంత్రి శ్రీధర్ బాబు నిర్వహించారు, ఇకపై దీనికి ఎవరెవరు హాజరవుతారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. సీఎం ప్రజావాణికి హాజరై విజ్ఞప్తులు స్వీకరిస్తే అవి త్వరితగతిన పరిష్కారం అవుతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
అన్నదాత సేవలో ఆర్బీకే సైన్యం
సాక్షి, అమరావతి: మిచాంగ్ తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, అధిక గాలులకు దెబ్బతిన్న పంటలను కాపాడటంలో ఆర్బీకై సైన్యం శక్తివంచన లేకుండా శ్రమిస్తోంది. వర్షం తెరిపివ్వడంతో పంటలను, పంట ఉత్పత్తులను కాపాడటంలో విశేష కృషి చేస్తూ రైతుల్లో ధైర్యాన్ని నింపుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు సహాయక చర్యలను వ్యవసాయ శాఖ ముమ్మరం చేసింది. క్షేత్రస్థాయి సిబ్బంది ఆర్బీకేల ద్వారా పూర్తిస్థాయిలో రైతులకు అందుబాటులో ఉంటూ.. పొలాల్లోని వరి పనలు మొలకెత్తకుండా ఉండేందుకు 5 శాతం ఉప్పు ద్రావణాన్ని రైతులతో కలిసి పనలపై సామూహికంగా చల్లుతున్నారు. పొలాల్లో నిలిచిపోయిన నీటిను కిందకు పోయేలా చేస్తున్నారు. తడిసిపోయిన పనలను రైతు కూలీలతో కలిసి ఒడ్డుకు తీసుకొచ్చి ఉప్పు ద్రావణం చల్లే ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారుల సమన్వయంతో కాలువలు, డ్రెయిన్లను ఉపాధి హామీ కూలీల సహకారంతో మరమ్మతులు చేసి పంట పొలాల నుంచి వర్షపు నీటిని బయటకు పంపుతూ రైతులకు ఇబ్బంది లేకుండా సహాయ సహకారాలు అందిస్తున్నారు. పంట కోతకు సిద్ధంగా ఉన్న పొలాల్లో నీరు నిలిచి ఉంటే.. చేలల్లో చిన్నపాటి బాటలు, బోదెలు తీసి మడుల నుంచి నీటిని బయటకు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఆర్బీకే సిబ్బంది స్వయంగా చేలలో నేలకు పడిపోయిన వరి దుబ్బులను లేపి.. కట్టలు కట్టే ప్రక్రియలో రైతులకు తోడ్పాటు అందిస్తున్నారు. పంట నష్టం అంచనాలకు ఎన్యుమరేషన్ బృందాలను ఏర్పాటు చేశామని, ముంపు నీరు పూర్తిగా చేల నుంచి తొలగిన తర్వాత పంట నష్టం అంచనా వేసేందుకు ఈ బృందాలు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తాయని వ్యవసాయ శాఖ కమిషనర్ చేవూరు హరికిరణ్ ఓ ప్రకటనలో తెలిపారు. -
దిగుబడులు దుమ్మురేపాయి
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో 2022–23 వ్యవసాయ సీజన్కు సంబంధించి దిగుబడులు దుమ్మురేపాయి. గతేడాది కంటే మిన్నగా నమోదయ్యాయి. ఆహార ధాన్యాల దిగుబడులే కాదు.. అపరాలు, నూనె గింజలు, వాణిజ్య పంటల దిగుబడులు కూడా ఈసారి రికార్డు స్థాయిలోనే వచ్చాయి. 2022–23 వ్యవసాయ సీజన్కు సంబంధించి తుది దిగుబడి అంచనాల నివేదికను అర్థగణాంక విభాగం (డైరెక్టర్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్) విడుదల చేసింది. దీని ప్రకారం 2022–23 వ్యవసాయ సీజన్లో 259.28 లక్షల టన్నుల దిగుబడులు రాగా.. ఇవి 2021–22తో పోలిస్తే 22.10 లక్షల టన్నులు అధికంగా నమోదయ్యాయి. రికార్డు స్థాయిలో పత్తి, మిరప దిగుబడులు.. ఇక వాణిజ్య పంటల విషయానికొస్తే.. పత్తి 2021–22లో 13.85 లక్షల ఎకరాల్లో సాగయితే 12.74 లక్షల టన్నుల దిగుబడులు వచ్చాయి. అలాగే, 2022–23లో 17.60 లక్షల ఎకరాల్లో పత్తి సాగవగా, 15.40 లక్షల టన్నుల దిగుబడులొచ్చాయి. మరోవైపు.. మిరప 2021–22లో 5.62 లక్షల ఎకరాల్లో సాగవగా, నల్లతామర ప్రభావంతో 4.18 లక్షల టన్నులకు పరిమితమైంది. అదే 2022–23లో 6.47 లక్షల ఎకరాల్లో సాగవగా, నల్లతామర నివారణకు ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా 14.63 లక్షల టన్నుల దిగుబడులొచ్చాయి. రైతు ఇంట ‘ధాన్యం’ సిరులు.. ♦ 2021–22 సీజన్లో కోటి 51 లక్షల ఎకరాల్లో పంటలు సాగవగా, 237.16 లక్షల టన్నుల దిగుబడులు వచ్చాయి. ఆ తర్వాత 2022–23 సీజన్లో వివిధ కారణాల వల్ల కోటి 39 లక్షల ఎకరాల్లోనే పంటలు సాగైనప్పటికీ దిగుబడులు మాత్రం రికార్డు స్థాయిలో 259.28 లక్షల టన్నులు నమోదయ్యాయని ఆ విభాగం వెల్లడించింది. ♦ వీటిలో ప్రధానంగా 2021–22లో 60.30 లక్షల ఎకరాల్లో వరి సాగవగా, హెక్టార్కు సగటున 5,048 కిలోల చొప్పున 121.76 లక్షల టన్నుల ధాన్యం దిగుబడులొచ్చాయి. ♦ అదే.. 2022–23లో 53.22 లక్షల ఎకరాల్లోనే వరి సాగవగా, హెక్టార్కు సగటున 5,932 కిలోల చొప్పున 126.30 లక్షల ధాన్యం దిగుబడులు నమోదయ్యాయి. ♦ మొత్తం మీద చూస్తే 2021– 22లో కోటి 03 లక్షల ఎకరాల్లో ఆహార పంటలు సాగవగా.. దిగుబడులు కోటి 55 లక్షల టన్నులు వచ్చాయి. 2022–23లో 92లక్షల ఎకరాలకుగాను కోటి 68 లక్షల టన్నుల దిగు బడులొచ్చాయి. అపరాలు, నూనె గింజలు కూడా.. ♦ అపరాల పంటలు 2021–22లో 30.67 లక్షల ఎకరాల్లో సాగవగా, 10.55 లక్షల టన్నుల దిగుబడులు వచ్చాయి. ♦ 2022–23లో 25.80 లక్షల ఎకరాల్లో సాగవగా, 10.87 లక్షల టన్నుల దిగుబడులు నమోదయ్యాయి. ♦ ఇక నూనెగింజల పంటలు 2021–22లో 25.05 లక్షల ఎకరాల్లో సాగవగా, 27.68 లక్షల టన్నులు.. 2022–23లో 20.30 లక్షల ఎకరాల్లో సాగవగా, 28.96 లక్షల టన్నుల దిగుబడులొచ్చాయి. ♦ వీటిలో ప్రధానంగా కందులు 2021–22లో 6.27 లక్షల ఎకరాల్లో సాగయితే.. 68 లక్షల టన్నుల దిగుబడులొచ్చాయి. అలాగే, 2022–23లో 6 లక్షల ఎకరాల్లో సాగవగా, 78 లక్షల టన్నుల దిగుబడులు వచ్చాయి. ♦ వేరుశనగ అయితే 2021–22లో 20.62 లక్షల ఎకరాల్లో సాగవగా, 5.15 లక్షల టన్నుల దిగుబడులు వచ్చాయి. 2022–23లో 14.85 లక్షల ఎకరాల్లోనే సాగవగా, 6 లక్షల టన్నుల దిగుబడులు నమోదయ్యాయి. సగటు దిగుబడులు పెరిగాయి.. ఆర్థిక, గణాంకాల శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం 2021–22 సీజన్తో పోలిస్తే సాగు విస్తీర్ణం తగ్గినప్పటికీ 2022–23లో రికార్డు స్థాయిలో దిగుబడులు నమోదయ్యాయి. తెగుళ్ల ప్రభావం తక్కువగా ఉండడంతో దాదాపు ప్రతీ పంటలోనూ హెక్టార్కు సగటు దిగుబడులు 2021–22తో పోలిస్తే పెరిగాయి.– చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ -
ఈ–క్రాప్ నమోదు 10కి పూర్తిచేయాలి
సాక్షి, అమరావతి: ఖరీఫ్ సీజన్ ముగిసినందున ఈ–క్రాప్ నమోదు ప్రక్రియను ఈ నెల 10వ తేదీకల్లా పూర్తిచేయాలని వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్ అధికారులను ఆదేశించారు. వ్యవసాయశాఖ జిల్లా అధికారులతో గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. ఇప్పటికే 97 శాతం ఈ–క్రాప్ నమోదు, 70 శాతం రైతుల ఈ–కేవైసీ నమోదు పూర్తయ్యాయని చెప్పారు. మిగిలిన 30 శాతం మంది రైతులతో ఈ నెల10వ తేదీ కల్లా ఈ–కేవైసీ పూర్తిచేయాలన్నారు. అధికారులందరూ ఈ–క్రాప్, ఈ–కేవైసీ నమోదులో వాస్తవికతను ధ్రువీకరించేందుకు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు. ఈ–క్రాప్ నమోదు ముగిసిన తర్వాత ఆర్బీకేల్లో సామాజిక తనిఖీ నిర్వహించాలన్నారు. గ్రామసభలో ముసాయిదా జాబితాలోని ప్రతి రైతు పంట వివరాలను విత్తిన తేదీతో సహా చదివి ధ్రువీకరించాలని సూచించారు. సామాజిక తనిఖీ అనంతరం ఈ నెల 20వ తేదీన తుది జాబితా ప్రదర్శించాలన్నారు. అక్టోబర్ రెండోవారంలో జమచేయనున్న పీఎం కిసాన్ 15వ విడత సాయం కోసం.. అర్హతగల రైతులందరూ ఆధార్తో భూమి రికార్డులు, బ్యాంకు ఖాతాలు, ఈ–కేవైసీ తప్పనిసరి చేసినందున ఈ నెల 15వ తేదీకల్లా వాటిని సరిచేసుకోవాలని కోరారు. యూరియా వ్యవసాయేతర అవసరాలకు తరలిపోకుండా విక్రయాలపై నిఘా పెట్టాల న్నారు. ప్రతి మండలంలో నెలవారీగా అత్యధిక యూరియా అమ్మకాలు జరిపే కొనుగోలు దారులను, డీలర్లను పరిశీలించి లోటుపాట్లపై నివేదికలు పంపించాలని ఆదేశించారు. ప్రతి మండలానికి కిసాన్ డ్రోన్ల ఏర్పాటులో భాగంగా గుర్తించిన రైతు పైలట్ల శిక్షణ కోసం జారీచేసిన మార్గదర్శకాలను మరింత సులభతరం చేస్తామని చెప్పారు. పాస్పోర్ట్ ఉండాలనే నిబంధనను తొలగించామన్నారు. ఆర్బీకేల వారీగా గుర్తించిన సీహెచ్సీల్లోని రైతులతో అంగీకారపత్రాలను సిద్ధం చేసుకోవా లన్నారు. గ్యాప్ పొలంబడులకు ఏపీ స్టేట్ ఆర్గానిక్ ప్రొడ్యూసర్స్ సర్టిఫికేషన్ అథారిటీ (ఏపీఎస్ఓపీసీఏ)తో రైతు ఉత్పత్తి సంఘాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన చెప్పారు. -
యూరియా గుప్పించారు
సాక్షి, హైదరాబాద్: రైతులు పంట పొలాల్లో యూరియాను గుప్పిస్తున్నారు. ఇలా ఏడాదికేడాదికి యూరియా వినియోగం పెరుగుతోందని వ్యవసాయ వర్గాలు చెబుతున్నాయి. అవసరమున్నా లేకున్నా కొందరు రైతులు యూరియాను విరివిగా వాడుతున్నారని అంటున్నారు. దీనివల్ల భూసారంపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. ఈ ఏడాది వానాకాలంలో 10.34 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను రైతులు పంట పొలాల్లో వాడారని వ్యవసాయశాఖ వెల్లడించింది. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక పంపించింది. 2021–22 వానాకాలం సీజన్లో 9.50 లక్షల మెట్రిక్ టన్నులు, 2022–23 వానాకాలం సీజన్లో 9.05 లక్షల ఎకరాల్లో యూరియా వినియోగించగా, ఈసారి ఏకంగా 1.29 లక్షల మెట్రిక్ టన్నులు అదనంగా వాడటం గమనార్హం. ఆగస్టు నెలలో 3.42 లక్షల మెట్రిక్ టన్నులు, సెపె్టంబర్ నెలలో 3.44 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వినియోగించారు. సాగు తగ్గినా పెరిగిన యూరియా వినియోగం... వాస్తవానికి ఈ ఏడాది యూరియా వాడకం తగ్గుతుందని భావించారు. కానీ పెరిగింది. దీంతో కేంద్ర కేటాయింపుల కంటే ఎక్కువగా యూరియాను రాష్ట్ర వ్యవసాయశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. వాస్తవంగా గత ఏడాది వానాకాలం సీజన్ కంటే ఈ ఏడాది వానాకాలం సీజన్లో పంటల సాగు విస్తీర్ణం తగ్గింది. గత ఏడాది వానాకాలం సీజన్లో 1.47 కోట్ల ఎకరాల విస్తీర్ణంలో అన్ని రకాల పంటలు సాగు కాగా, ఈ ఏడాది వానాకాలం సీజన్లో 1.26 కోట్ల ఎకరాల్లోనే పంటలు సాగయ్యాయి. అంటే 21 లక్షల ఎకరాల్లో పంటల సాగు విస్తీర్ణం తగ్గింది. కానీ యూరియా వాడకం మాత్రం గతేడాది కంటే ఏకంగా 1.29 లక్షల మెట్రిక్ టన్నులు అదనంగా పెరగడం విశేషం. పలుమార్లు విత్తనాలు విత్తడంతో పెరిగిన వినియోగం ఈసారి రుతుపవనాలు ఆలస్యమయ్యాయి. కీలకమైన సమయంలో వర్షాలు లేకపోవడంతో పత్తి, ఆరుతడి పంటల సాగు ఆలస్యమైంది. కొన్నిచోట్ల అక్కడక్కడ వర్షాలు కురవడంతో రైతులు పత్తి వంటి వాటిని వేశారు. కానీ ఆ తర్వాత వర్షాలు రాకపోవడంతో వేసిన పంటలు ఎండిపోయాయి. దీంతో మొక్కలు భూమిలోనే మాడిపోయాయి. తర్వాత వర్షాలు కురిశాక మళ్లీ దున్ని విత్తనాలు చల్లారు. ఇలా పలుమార్లు విత్తనాలు చల్లడం వల్ల యూరియా కూడా రెండు మూడు సార్లు వేయాల్సి వచ్చింది. దీంతో రెండు బస్తాలు వాడాల్సిన చోట మూడు నాలుగు బస్తాల యూరియా చల్లారని వ్యవసాయ శాఖ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఆ తర్వాత భారీ వర్షాలు కురవడంతో అనేకచోట్ల పంటలు కొట్టుకుపోయాయి. ఇసుకమేటలు వేశాయి. పంట చేలల్లో నీరు నిలిచిపోయింది. అటువంటి చోట్ల మళ్లీ విత్తనాలు వేయడం, కొన్నిచోట్ల నీటిని తొలగించడం చేశారు. దీనివల్ల కూడా యూరియాను మరోసారి వినియోగించాల్సి వచ్చింది. పైగా సబ్సిడీ వల్ల యూరియా ధర కూడా తక్కువగా ఉండటంతో రైతులు విరివిగా వినియోగించారని చెబుతున్నారు. -
పప్పుధాన్యాల ఉత్పత్తి తగ్గింది
సాక్షి, హైదరాబాద్: దేశంలో పప్పుల వినియోగం పెరిగిందని..అదే సమయంలో ఉత్పత్తి భారీగా తగ్గిపోయిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. దీంతో దేశ అవసరాలకు ఇతర దేశాల నుంచి పప్పులు దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఈ నేపథ్యంలో దేశంలో పప్పుల ఉత్పత్తి పెంచేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరముందన్నారు. రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ హాకా ‘భారత్ దాల్’పేరుతో పంపిణీ చేస్తున్న రాయితీ శనగపప్పు కార్యక్రమాన్ని ఆదివారం హెచ్ఐసీసీలో కేంద్ర వినియోగదారులశాఖ కార్యదర్శి రోహిత్కుమార్ సింగ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ విదేశాల నుంచి కందిపప్పును పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్నామన్నారు. కంది పండిస్తే మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు ప్ర భుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో భారత్దాల్ పేరుతో హాకా చేస్తున్న కార్యక్రమం ప్రశంసనీయమన్నారు. మధ్యతరగతి, పేద వినియోగదారులకు ఇది ఎంతో మేలు చేస్తుందన్నారు. బహిరంగ మార్కెట్లో కిలో రూ.90 ఉన్న శనగపప్పును రూ.60కే అందించడంపై అభినందనీయమని తెలిపారు. కేంద్ర వినియోగదారులశాఖ కార్యదర్శి రోహిత్కుమార్సింగ్ మాట్లాడుతూ రాయితీ శనగ పప్పు పంపిణీకి సంబంధించి తొలు త తమ జాబితాలో హాకా లేదన్నారు. అయితే హా కా చైర్మన్ మచ్చా శ్రీనివాస్రావు తన వద్దకు పలుమార్లు వచ్చి హాకా గొప్పతనాన్ని, తెలంగాణ ప్రభు త్వ మద్దతు వివరించారని తెలిపారు. ఒక అవకాశం ఇచ్చి చూద్దామని హాకాకు శనగల పంపిణీ బాధ్యత అప్పగించామన్నారు. హాకా పనితీరు, ఏర్పాట్లు చూశాకా మరింత నమ్మకం పెరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో హాకా చైర్మన్ మచ్చా శ్రీనివాసరావు, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు, హా కా ఎండీ సురేందర్, జీఎం రాజ మోహన్, ఆగ్రోస్ ఎండి కె.రాములు తదితరులు పాల్గొన్నారు. -
పొలం బాట పట్టిన విద్యార్థులు
తెనాలి: తెనాలిలోని కేంద్రీయ విద్యాలయం (కేవీ) విద్యార్థులు పొలం బాట పట్టారు. గ్రామాల్లో మట్టి నమూనాలను సేకరించారు. తమ విద్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటైన ల్యాబ్లో ఆయా నమూనాలకు భూసార పరీక్షలను నిర్వహిస్తారు. ఆ వివరాలతో భూమి ఆరోగ్య కార్డులు సిద్ధం చేస్తారు. సంబంధిత రైతులకు వారి భూమి ఆరోగ్య పరిస్థితులను ఆయా గ్రామాల్లో జరిగే గ్రామసభల్లో వెల్లడిస్తారు. విద్యార్థులేంటి.. నేల ఆరోగ్యాన్ని చెప్పడమేంటి! సాధారణంగా మట్టి నమూనాలు సేకరించి.. నేల ఆరోగ్యాన్ని గుర్తించేందుకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక విభాగం పని చేస్తుంది. సంబంధిత అధికారులు మట్టి నమూనాలు సేకరించి.. పరీక్షలు జరిపి.. వివరాలు వెల్లడిస్తారు. అందుకు భిన్నంగా కేంద్రీయ విద్యాలయం విద్యార్థులే ఈ పనికి పూనుకున్నారు. భారత వ్యవసాయ, రైతు సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో పైలట్ ప్రాజెక్ట్గా పాఠశాలల్లో భూసార మట్టి నమూనాల పరీక్షలు నిర్వహించే విధంగా చర్యలు చేపట్టారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా 10 కేంద్రీయ విద్యాలయాలను ఎంపిక చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెనాలి కేంద్రీయ విద్యాలయానికి మాత్రమే ఇందులో స్థానం లభించింది. భూసార పరీక్షల నిర్వహణకు విద్యాలయానికి అవసరమైన పరికరాలు, రసాయనాలను ప్రభుత్వం సమకూర్చింది. ఇద్దరు టీచర్లకు శిక్షణ ఇచ్చారు. వీరిలో ఒకరు ఈ ప్రాజెక్టుకు నోడల్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. వ్యవసాయ శాఖ, ఆత్మ విభాగం సహకారంతో వీరు పనిచే సేలా కార్యక్రమాన్ని రూపొందించారు. తెనాలి కేంద్రీయ విద్యాలయంలో 9, 11 తరగతుల విద్యార్థుల్లో 19 మంది ఈ ప్రాజెక్టులో ఇప్పటికే శిక్షణ తీసుకున్నారు. రెండు రోజులుగా తెనాలి మండలంలోని గుడివాడ, నందివెలుగు గ్రామాల్లోని మెట్ట పొలాల్లో మట్టి నమూనాలను సేకరించారు. ‘ఆత్మ’ గుంటూరు డిప్యూటీ డైరెక్టర్ రామాంజనేయులు పర్యవేక్షణలో స్కూల్ నోడల్ అధికారి కేవీ రాజేంద్రప్రసాద్, ఆర్.రామిరెడ్డి సమక్షంలో మొత్తం 52 నమూనాలను సేకరించారు. విద్యాలయంలో ఏర్పాటైన భూసార పరీక్షా కేంద్రంలో వీటికి పరీక్షలు నిర్వహిస్తారు. ప్రత్యేకంగా అందించిన రెండు యాప్ల్లో వివరాలను పొందుపరుస్తారు. తద్వారా రైతుల వారీగా భూమి ఆరోగ్య కార్డులు తయారవుతాయని రాజేంద్రప్రసాద్ వెల్లడించారు. అనంతరం ఆయా కార్డులతో సంబంధిత గ్రామ సభలు నిర్వహించి.. రైతుల వారీగా వారి భూమిలో నత్రజని, ఫాస్పరస్, పొటాíÙయం సహా 10 రకాల పోషకాల స్థాయిలను వివరిస్తారు. వ్యవసాయ వికాసానికి.. విద్యార్థులకు వ్యవసాయ విజ్ఞానాన్ని నేర్పించటం, రసాయనాలు అధికంగా వాడకుండా సహజ ఎరువులను వినియోగించేలా రైతులకు సూచిస్తూ భూమి ఆరోగ్యాన్ని పరిరక్షించటం ఆశయాలుగా కేంద్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టును చేపట్టింది. కేంద్రీయ విద్యాలయాలను భాగస్వాములను చేసింది. తగిన శిక్షణ ఇవ్వటంతో అమలుకు శ్రీకారం చుట్టాం. – కేవీ రాజేంద్రప్రసాద్, నోడల్ అధికారి ప్రాజెక్టులో చేరటం సంతోషంగా ఉంది చదువుతోపాటు వ్యవసాయంపై అవగాహనకు ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులో చేరటం చాలా సంతోషంగా ఉంది. భూసార పరీక్షలను చేసి రైతులకు ఉపయోగపడతాం. రైతుల కోసం పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉంది. – ఎన్.శివగగన్, 9వ తరగతి -
మట్టిని కాపాడుకోవాలి
సాక్షి, హైదరాబాద్: ‘మన జీవితాల్లో అత్యంత కీలకమైనది..అందుకు తగ్గ గుర్తింపు లేని అంశం ఏదైనా ఉంది అంటే.. అది మన పాదాల కింది మట్టేనని’ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి స్పష్టం చేశారు. సూక్ష్మజీవులు, క్రిమికీటకాలు, మొక్కలు, వృక్షాల వేళ్లతో కూడిన ఈ సంక్లిష్ట జీవావరణ వ్యవస్థను కాపాడుకోవడం ఇప్పుడు మనిషికి అత్యవసరమన్నారు. హైదరాబాద్ సమీపంలోని ‘కాన్హా శాంతివనం’లో ‘4 పర్ 1000’ పేరుతో మట్టి సంరక్షణ లక్ష్యంగా బుధవారం ప్రారంభమైన అంతర్జాతీయ సదస్సుకు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జర్మనీ, ఫిజీలతోపాటు సుమారు 18 దేశాల వ్యవసాయశాఖల మంత్రులు పాల్గొన్న ఈ సమావేశంలో నిరంజన్రెడ్డి మాట్లాడుతూ నీరు, పోషకాలతో కూడిన మట్టి అటు వాతావరణాన్ని నియంత్రించడమే కాకుండా, జీవవైవిధ్యాన్ని కాపాడేందుకూ సాయపడుతోందని చెప్పారు. అయితే వివిధ కారణాల వల్ల ప్రపంచవ్యాప్తంగా మట్టి సారం తగ్గిపోతుండటం, సారవంతమైన మట్టి కొట్టుకుపోవడం మానవాళి మనుగడకు ముప్పు కలిగించేవని ఆందోళన వ్యక్తం చేశారు. ఆహారభద్రత, పర్యావరణ సమతుల్యతలకూ ప్రమాదకరంగా మారిన ఈ సమస్యను పరిష్కరించేందుకు సమష్టిగా కృషి చేయాల్సిన అవసరముందన్నారు. ఆర్థిక విలువ జోడించాలి: దాజి, ఆధ్యా త్మిక గురువు దేశంలోనే అత్యంత వేగంగా పచ్చదనం పెంచుకుంటున్న రాష్ట్రంగా తెలంగాణ ఎదుగుతోందని, అయితే మొక్కల పెంపకం ఏదో మొక్కుబడి తంతుగా కాకుండా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేదిగా మార్చాలని ‘హార్ట్ఫుల్నెస్ ఇనిస్టిట్యూట్’ ఆధ్యాత్మిక మార్గదర్శి, రామచంద్రమిషన్ అధ్యక్షుడు దాజి తెలిపారు. బంజరుభూమిని కూడా ఎంత అద్భుతమైన, జీవవంతమైన నేలగా మార్చవచ్చో కాన్హా ద్వారా స్పష్టంగా తెలుస్తుందని ఆయన చెప్పారు. తెలంగాణలోని ప్రతిగ్రామంలో మొక్కల నర్సరీలు ఏర్పాటు చేయడం బాగుందని.. అయితే ప్రభుత్వం చెట్లు నరికేయకుండానే గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికదన్ను అందించేలా చర్యలు తీసుకోవాలని, ఇంధన అవసరాలు తీర్చే దిశగా ప్రయత్నాలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫిజీ వ్యవసాయశాఖ మంత్రి సకయాసీ రాల్సెవూ డిటోకా, ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్ (బెంగళూరు) థియరీ బెర్త్లాట్, వ్యవసాయశాఖ కార్యదర్శి ఎం.రఘునందన్రావు, ‘4 పర్ 1000’ ఎగ్జిక్యూటివ్ కార్యదర్శి డాక్టర్ పాల్లూ తదితరులు పాల్గొన్నారు. మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సులో వాతావరణ మార్పులు, ఆహార భద్రతను ఎదుర్కొనేందుకు మట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా అన్న అంశంపై చర్చలు జరుగుతాయి. -
మరింత మందికి రైతు భరోసా
సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతు భరోసా సాయం అందని రైతు ఒక్కరు కూడా ఉండకూడదన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. అర్హత కలిగి ఇంకా పెట్టుబడి సాయం దక్కని భూ యజమానులను గుర్తించి, వారి వివరాలను నమోదు చేసేందుకు అవకాశం కల్పించింది. ఆర్బీకే సిబ్బంది ద్వారా రైతు భరోసా పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిలో అర్హులకు అక్టోబర్లో రెండు విడతల సాయం కలిపి పంపిణీ చేయనున్నారు. ఏటా మూడు విడతల్లో పెట్టుబడి సాయం 2023–24 వ్యవసాయ సీజన్కు సంబంధించి ఇటీవల పంపిణీ చేసిన తొలి విడత సాయంతో కలిపి ఈ నాలుగేళ్లలో ఇప్పటివరకు 52,57,263 రైతు కుటుంబాలకు రూ.31 వేల కోట్ల పెట్టుబడి సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించింది. ఏటా తొలి విడత సాయం పంపిణీ సమయంలోనే రైతు భరోసా పోర్టల్ లాగిన్ను తెరుస్తుంటారు. ఆ సమయంలో చనిపోయిన వారి వివరాలను తొలగించడంతో పాటు ఆ ఏడాది అర్హత పొందిన భూ యజమానుల వివరాలను నమోదు చేసి పెట్టుబడి సాయం అందిస్తున్నారు. ఇలా తొలి ఏడాది (2019–20) 45,11,252 భూ యజమానులు అర్హత పొందగా.. ఆ తర్వాత వరుసగా 2020–21లో 50,04,874 మంది, 2021–22లో 50,66,241 మంది, 2022–23లో 49,26,041 మంది లబ్ధి పొందారు. 2023–24 వ్యవసాయ సీజన్లో 50,19,187 మంది భూ యజమానులు లబ్ధి పొందారు. ఏటా పెరుగుతున్న భూ యజమానులు ఇలా ఈ నాలుగేళ్లలో 5,07,935 మంది అదనంగా భూ యజమానులు అర్హత పొందారు. ఈ ఏడాది కూడా అన్ని అర్హతలు ఉండి ఈ పథకం కింద లబ్ధి పొందలేకపోయిన వారికి మరో అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్తగా భూములు కొనుగోలు చేసి పట్టాదార్ పాస్ పుస్తకాలు, టైటిల్ డీడ్స్ పొందిన వారు, తల్లిదండ్రులు మృతిచెందగా వారసత్వంగా భూములు పొందినవారు, అన్నదమ్ములు వాటాల కింద భూములు పంచుకున్న వారు, వివిధ రూపాల్లో మ్యుటేషన్ పొందిన వారు తమ వివరాలను రైతు భరోసా పోర్టల్లో నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. ఇప్పటివరకు లాక్ అయిన ఈ పోర్టల్ లాగిన్ను ఈ నెల 12నుంచి కొత్త రిజిస్ట్రేషన్స్ కోసం తెరిచారు. ఇంకా అర్హత ఉండి అవకాశం వినియోగించుకోని మిగిలిన రైతులతో పాటు కొత్తగా చేరిన రైతు కుటుంబాలు ఈ పథకంలో అర్హత సాధించటానికి ప్రస్తుతం భూ యజమాని రైతులకు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించింది. నమోదు చేసుకున్న వారిలో అన్ని అర్హతలు కల్గిన భూ యజమానులకు అక్టోబర్లో రెండు విడతల సాయం అందించనున్నారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు సంతృప్తికర స్థాయిలో అర్హత ఉన్న వారికి పెట్టుబడి సాయం అందించే సంకల్పంతో రైతు భరోసా పోర్టల్లో రిజిస్ట్రేషన్కు అవకాశం కల్పించాం. మ్యుటేషన్ చేయించుకున్న వారు, కొత్తగా భూములు కొనుగోలు చేసిన వారు, వారసత్వ హక్కులు పొందిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. తమ పరిధిలోని ఆర్బీకే సిబ్బందిని సంప్రదించి వివరాలను నమోదు చేయించుకోవాలి. – చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ -
ఎరువుల అక్రమ రవాణాకు చెక్
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి కేటాయించిన ఎరువులు ఇతర రాష్ట్రాలకు అనధికారిక రవాణా జరగకుండా అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక బృందాలతో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్టు వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్ వెల్లడించారు. మంగళగిరిలోని వ్యవసాయ కార్యాలయం నుంచి జిల్లా, మండల వ్యవసాయ అధికారులతో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ.. సరిహద్దు జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాలకు ఎరువుల రవాణా జరుగుతున్నట్టు గుర్తించామన్నారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకు వ్యవసాయ, పోలీస్ శాఖలతో సంయుక్త బృందాలను ఏర్పాటు చేశామన్నారు. విజిలెన్స్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్) సహకారంతో సరిహద్దు ప్రాంతాల్లో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశామన్నారు. కేటాయింపుల మేరకు రాష్ట్రానికి వచ్చే ప్రతి ఎరువు బస్తాను ఐఎఫ్ఎంఎఎస్ ద్వారా రికార్డు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎరువుల నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, రైతులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. ముమ్మరంగా వ్యవసాయ పనులు కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో వ్యవసాయ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని హరికిరణ్ చెప్పారు. గ్యాప్ సర్టిఫికేషన్ కోసం ఖరీఫ్ సీజన్లో జిల్లాకు 50 మంది రైతులతో 26 రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఇలా ఎంపిక చేసిన 1,300 మంది రైతులతో ఏర్పాటు చేసిన ఎఫ్పీవోలతో అవగాహనా ఒప్పందాలు చేసుకోవాలన్నారు. ఏపీ స్టేట్ ఆర్గానిక్ ఉత్పత్తుల సర్టిఫికేషన్ అథారిటీ (ఏపీఎస్ఓపీసీఏ) రిజిస్ట్రేషన్తో సేంద్రియ పద్ధతిలో సాగు చేసే పంటలకు ఎఫ్పీవోలతో అగ్రిమెంట్ చేయించి ఆయా ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాలని సూచించారు. పంట వేసిన నెల రోజులకు జియో రిఫరెన్సింగ్ ద్వారా ఈ–క్రాప్ నమోదు చేయాలన్నారు. -
ఎందుకంత తొందర రామోజీ!?
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని వ్యవసాయ శాఖా మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి తెలిపారు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్న ప్రాంతాల్లో ఇప్పటికే ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను అమలుచేస్తున్నామని చెప్పారు. అంతేకాక.. అన్నదాతలకు రైతుభరోసా సాయాన్ని అందజేయడంతోపాటు 60వేల క్వింటాళ్ల విత్తనాలను ఆర్బీకేల్లో పొజిషన్ కూడా చేశామన్నారు. డిమాండ్ మేరకు మరిన్ని విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లుచేస్తున్నామని ఆయన చెప్పారు. మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. రైతులను భయభ్రాంతులకు గురిచేసేలా ఈనాడులో వస్తున్న కథనాలపై ఆయన మండిపడ్డారు. గతంలో ఎన్నడూలేని విధంగా రైతు సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అహరహం శ్రమిస్తున్నారని చెప్పారు. ఎన్నో సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలతో రైతులకు ముఖ్యమంత్రి అండగా నిలుస్తుంటే ఎల్లో మీడియా ఓర్వలేక విషం కక్కుతోందన్నారు. సాధారణంగా ఖరీఫ్ సీజన్ సెప్టెంబర్ నెలాఖరు వరకు ఉంటుందని, ఆ మాత్రం అవగాహన లేకపోతే ఎలా అని రామోజీని కాకాణి ప్రశ్నించారు. ఆగస్టు నెలాఖరులోగా ఆశించిన స్థాయిలో వర్షాలు పడితే విత్తుకోవాలని రైతులు ఎదురుచూస్తున్నారని మంత్రి చెప్పారు. ఆ దిశగా ఆర్బీకేల ద్వారా అవగాహన కూడా కల్పిస్తున్నామన్నారు. ఇప్పటికే రాయలసీమ జిల్లాల్లో రైతులు ఆర్బీకేల ద్వారా విత్తనాలు తీసుకుంటున్నారని మంత్రి చెప్పారు. వచ్చే నెలాఖరు తర్వాత సమీక్ష.. మరోవైపు.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా ఖరీఫ్ సీజన్లో నెలకొన్న వాతావరణ పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అధికారులకు తగిన ఆదేశాలు జారీచేస్తున్నారని.. ఈ విషయంలో ఇప్పటికే సమీక్ష కూడా నిర్వహించారని ఆయన గుర్తుచేశారు. ఈ విషయం రామోజీకి తెలియకపోవచ్చని.. ఎందుకంటే ఆయన నిత్యం చంద్రబాబు పల్లకీ మోయటంలో మునిగితేలుతున్నారని ఎద్దేవా చేశారు. ఇక సెప్టెంబర్ నుంచి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతున్నప్పటికీ ఇంతలోనే రైతులకు లేని బాధ మీకెందుకని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. సెప్టెంబర్ నెలాఖరు తర్వాత పూర్తిస్థాయిలో పరిస్థితిని సమీక్షించి ఆ తర్వాత రైతులను ఆదుకునేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. నిజానికి.. చంద్రబాబు, కరువు కవల పిల్లలని, టీడీపీ ఐదేళ్లూ కరువు విలయతాండవం చేసిన విషయాన్ని మంత్రి కాకాణి గుర్తుచేశారు. చంద్రబాబు హయాంలో ఏటా కరువు మండలాలు ప్రకటించినా ఏ ఒక్క ఏడాది రైతులకు పైసా కూడా పరిహారం ఇవ్వలేదని.. అయినా ఏనాడు ఈనాడు సింగిల్ కాలమ్ వార్త కూడా రాసిన పాపాన పోలేదన్నారు. రైతులకు రూ.2,558 కోట్లు ఎగ్గొట్టిన బాబు ఐదేళ్లలో 24.80 లక్షల మంది రైతులకు రూ.2,558 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ (పంట నష్టపరిహారం) బకాయిలు ఎగ్గొట్టిన ఘనత చంద్రబాబుదేనన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైపరీత్యాల వేళ జరిగే పంట నష్టపరిహారాన్ని ఆ సీజన్ ముగియకుండానే ఇస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదేనని కాకాణి చెప్పారు. అలాగే, ఇప్పటివరకు 22.74 లక్షల మంది రైతులకు రూ.1,965 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ అందించామన్నారు. ఇక టీడీపీ ఐదేళ్లలో 30.85 లక్షల మందికి రూ.3,411.20 కోట్ల బీమా పరిహారం ఇస్తే.. ఈ నాలుగేళ్లలో రైతులపై పైసా భారం పడకుండా 54.48 లక్షల మందికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.7,802 కోట్ల బీమా పరిహారం చెల్లించిందన్నారు. ఈ నాలుగేళ్లలో రైతులకు ప్రత్యేకంగా రూ.1,70,769 కోట్ల లబ్ధిచేకూర్చిన ప్రభుత్వంపై బురద జల్లడం మానుకోవాలని మంత్రి కాకాణి హితవు పలికారు. -
ఏపీ బీమా.. ది బెస్ట్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింది. రైతులపై పైసా భారం పడకుండా నోటిఫై చేసిన పంటలకు సంబంధించి సాగు చేసిన ప్రతి ఎకరాకు ఈ క్రాప్ ఆధారంగా యూనివర్సల్ బీమా కవరేజ్ కల్పించడంపై పలు రాష్ట్రాలు ప్రశంసిస్తున్నాయి. ఈ పథకాన్ని తమ రాష్ట్రాల్లోనూ అమలు చేస్తామని మహారాష్ట్ర, ఒడిశా, పుదుచ్చేరి, మేఘాలయ ముందుకొచ్చాయి. 2023–24 వ్యవసాయ సీజన్ నుంచి కేవలం రూపాయి ప్రీమియంతో తమ రాష్ట్రాల్లోనూ అమలు చేస్తున్నట్టు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన అమలుపై ఉత్తరాఖండ్లోని రిషికేష్లో శని, ఆదివారాల్లో రెండు రోజులపాటు జరిగిన 10వ నేషనల్ కాన్ఫరెన్స్లో ఈ రాష్ట్రాలు అధికారికంగా ప్రకటించాయి. ఈ ఏడాది నుంచి రైతుల నుంచి రూపాయి మాత్రమే వసూలు చేస్తామని, మిగిలిన మొత్తాన్ని తమ ప్రభుత్వాలు భరిస్తాయని ఆ రాష్ట్రాల ప్రతినిధులు చెప్పారు. సెమినార్లో పాల్గొన్న మరికొన్ని రాష్ట్రాలు కూడా ఏపీలో అమలవుతున్న ఉచిత పంటల బీమా అమలును అధ్యయనం చేసేందుకు ఆసక్తి చూపించాయి. గతంలో పంటల బీమా రైతులకు అందని ద్రాక్షగా ఉండేది. స్వాతంత్య్రం వచ్చాక 1965లో కేంద్రం తీసుకొచ్చిన క్రాప్ ఇన్సూరెన్స్ బిల్లు ఆధారంగా తెచ్చిన మోడల్ ఇన్సూరెన్స్ పథకం.. ఆ తర్వాత వివిధ రూపాలు మార్చుకొని ప్రస్తుతం ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్బీవై)గా దేశ వ్యాప్తంగా అమలవుతోంది. అధిక ప్రీమియం కారణంగా ఈ పథకంలో చేరేందుకు సన్న, చిన్నకారు రైతులు ఆసక్తిచూపే వారు కాదు. ఆర్థిక స్తోమత, అవగాహన లేక లక్షలాది మంది రైతులు బీమాకు దూరంగా ఉండడంతో ఏటా రూ.వేల కోట్ల పెట్టుబడిని నష్టపోయే వారు. బీమా చేయించుకున్న వారు సైతం పరిహారం కోసం ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సి వచ్చేది. అధికారంలోకి రాగానే శ్రీకారం పాదయాత్రలో వైఎస్ జగన్ ఇచ్చిన హామీ మేరకు.. అధికారంలోకి రాగానే వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2019 జూలై 8న ఉచిత పంటల బీమా పథకానికి శ్రీకారం చుట్టింది. 2019 ఖరీఫ్ సీజన్లో ఒక్క రూపాయి ప్రీమియంతో ఈ పథకాన్ని అమలు చేయగా, ఆ తర్వాత సీజన్ నుంచి ఆ భారం కూడా రైతులపై పడకుండా వారు చెల్లించాల్సిన వాటా మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. ఈ–పంటలో నమోదే ప్రామాణికంగా పైసా భారం పడకుండా రైతులందరికీ వర్తింప చేస్తోంది. క్లెయిమ్ సెటిల్మెంట్లు, చెల్లింపుల బాధ్యతను కూడా తన భుజాన వేసుకుంది. ఈ–పంటలో నమోదైన నోటిఫైడ్ పంటలకు సీజన్ ముగియకుండానే లబ్ధిదారుల జాబితాలను సామాజిక తనిఖీల్లో భాగంగా ఆర్బీకేల్లో ప్రదర్శిస్తోంది. అభ్యంతరాల పరిష్కారం అనంతరం బీమా పరిహారం చెల్లిస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఇంకా ఎవరైనా మిగిలి పోయారేమోనని వెతికి మరీ అర్హులైన ప్రతి ఒక్కరికి పరిహారం చెల్లిస్తోంది. ఇలా ఏటా సగటున 13.62 లక్షల మందికి రూ.1,950.51 కోట్ల చొప్పున ఈ నాలుగేళ్లలో 54.48 లక్షల మంది రైతులకు రూ.7,802.05 కోట్ల పరిహారాన్ని వారి ఖాతాల్లో నేరుగా జమ చేసింది. ఇందులో టీడీపీ హయాంలో 6.19 లక్షల మంది రైతులకు చంద్రబాబు ఎగ్గొట్టిన రూ.715.84 కోట్ల బకాయిలు కూడా ఉన్నాయి. ఏపీ భేష్ అంటూ ముందుకొచ్చిన కేంద్రం పీఎంఎఫ్బీవైతో అనుసంధానించడం ద్వారా 2019–20లో రైతుల వాటాతో కలిపి రూ.971 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం రూపంలో చెల్లించింది. ఆ తర్వాత రెండేళ్లు బీమా కంపెనీలతో సంబంధం లేకుండా పరిహారం మొత్తం ప్రభుత్వమే చెల్లించింది. యూనివర్సల్ కవరేజ్ విషయంలో ఏపీ స్ఫూర్తిగా కేంద్రం కూడా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చింది. 2022–23లో పీఎంఎఫ్బీవైతో కలిసి ఉచిత పంటల బీమా పథకం అమలైంది. దిగుబడి ఆధారిత పంటల కోసం 2022 ఖరీఫ్లో రైతుల వాటాతో కలిపి రూ.1,213.37 కోట్లు కంపెనీలకు చెల్లించగా, వాతావరణ ఆధారిత పంటలకు గతంలో మాదిరిగా పరిహారం మొత్తం ప్రభుత్వమే చెల్లించింది. గతంలో ఏటా సగటున 16 లక్షల మంది రైతులు, 48 లక్షల ఎకరాలకు బీమా చేయించు కోగలిగితే.. ఈ ప్రభుత్వం వచ్చాక 2019 – 2022 మధ్య ఏటా సగటున 30 లక్షల మంది రైతులకు చెందిన 71.55 లక్షల ఎకరాలకు ఉచిత బీమా కవరేజ్ కల్పించింది. 2020 ఖరీఫ్లో 50 లక్షల ఎకరాలకు కవరేజ్ కల్పిస్తే, 2021 ఖరీఫ్లో బీమా కల్పించిన విస్తీర్ణం ఏకంగా 80 లక్షల ఎకరాలకు చేరింది. ఇలా యూనివర్సల్ కవరేజ్ సాధించిన తొలి రాష్ట్రంగా ఏపీ గుర్తింపు పొందింది. ఈ తరహా స్కీమ్ దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే ఎక్కడా లేదని బీమా రంగ నిపుణులే కాదు.. స్వయంగా కేంద్ర ప్రభుత్వం కూడా అధికారికంగా ప్రకటించింది. ఏపీ బాటలో పలు రాష్ట్రాలు ‘రాష్ట్రంలో అమలవుతున్న ఉచిత పంటల బీమా పథకాన్ని అధ్యయనం చేశాం. నోటిఫైడ్ పంటలు సాగు చేస్తున్న రైతులందరికీ ఈ క్రాప్ డేటా యూనివర్సల్ కవరేజ్ కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అందుకే రైతుల విశాల ప్రయోజనాల దృష్ట్యా ఫసల్ బీమా యోజనలో భాగస్వామి కావాల్సిందిగా ఏపీ ప్రభుత్వాన్ని కోరాం. 2023–24 సీజన్ నుంచి ఏపీ ప్రభుత్వంతో కలిసి ఈ పథకాన్ని అమలు చేస్తున్నాం. ఏపీ స్ఫూర్తితోనే ఫసల్ బీమాలో మార్పులు కూడా తీసుకొచ్చాం’ అని గత కాన్ఫరెన్స్లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రకటించడం తెలిసిందే. ఏపీ బాటలో మిగిలిన రాష్ట్రాలు కూడా అడుగులు వేయాలని అప్పట్లోనే ఆయన సూచించారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి జాతీయ స్థాయిలో ఎక్కడ ఏ మీటింగ్ జరిగినా కేంద్ర మంత్రితో సహా కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులందరూ ఏపీలో అమలవుతున్న ఉచిత పంటల బీమా అమలు తీరును ప్రస్తావించని సందర్భం లేదంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికే పలు రాష్ట్రాలు ఏపీలో అమలవుతున్న ఈ పథకాన్ని అధ్యయనం చేశాయి. 2019లో ఏపీ ప్రభుత్వం అమలు చేసినట్టుగానే రూపాయికే పంటల బీమా అమలు చేస్తున్నామని మహారాష్ట్ర, ఒడిశా, పుదుచ్చేరి, మేఘాలయ రాష్ట్రాలు అధికారికంగా ప్రకటించాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన సంస్కరణలు జాతీయ స్థాయిలో అమలు జరుగుతున్నాయనడానికి ఇదొక నిదర్శనం అని వ్యవసాయ రంగ నిపుణులు చెబుతున్నారు. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఏపీ ఈ–క్రాప్ ప్రామాణికంగా నోటిఫై చేసిన ప్రతి పంటకు ఉచిత పంటల బీమా పథకం అమలు చేస్తూ బీమా రక్షణ కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అంటూ 20 రాష్ట్రాలు పాల్గొన్న నేషనల్ కాన్ఫరెన్స్లో పలువురు కొనియాడారు. రైతులపై పైసా భారం పడకూడదన్న ఆలోచనతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఈ పథకాన్ని అత్యంత పారదర్శకంగా అమలు చేస్తోందని ప్రశంసించారు. పంటల బీమా పరిధిలో కవరేజ్ పెంచడానికి ఇతర రాష్ట్రాలకు ఏపీ మార్గదర్శకంగా వ్యవహరించిందని కేంద్ర ఉన్నతాధికారులు ప్రకటించారు. సర్వత్రా ప్రశంసలు వర్కుషాపులో ఏపీ ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిసింది. దేశంలోనే అతి తక్కువ ప్రీమియంతో యూనివర్సల్ బీమా కవరేజ్ని అమలు చేస్తుండడం పట్ల, సెమినార్లో పాల్గొన్న రాష్ట్రాలన్నీ ప్రశంసించాయి. తగిన మోడల్ను ఎంచుకోవడానికి రాష్ట్రాలకు నిర్ణయాధికారం ఇవ్వడం వల్ల 2023–24 సీజన్లో దేశంలోనే అతితక్కువ ప్రీమియం రేట్లను ఏపీ ప్రభుత్వం సాధించగలగడాన్ని కూడా ప్రశంసించారు. ఏపీ బాటలోనే తాము కూడా పయనిస్తున్నామంటూ సెమినార్లో ఆయా రాష్ట్రాలు ప్రకటించడం గొప్ప అచీవ్మెంట్. – చేవూరు హరికిరణ్, వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ అరుదైన గౌరవం రైతు సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాలుగేళ్లలో ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశారు. అందులో ఈ క్రాప్, వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాలు కీలకం. ఈ రెండు పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. వీటిని అనుసరించేందుకు పలు రాష్ట్రాలు క్యూ కడుతున్నాయి. ఒకేసారి నాలుగు రాష్ట్రాలు ఏపీ బాటలో అడుగులు వేస్తున్నట్టు ప్రకటించడం ఏపీ ప్రభుత్వానికి దక్కిన అరుదైన గౌరవం. – కాకాని గోవర్ధన్రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి -
‘సహకారం’ మరింత బలోపేతం
సాక్షి, అమరావతి: ‘మనది వ్యవసాయ ఆధారిత రాష్ట్రం.. మన రాష్ట్రంలో గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ బలంగా ఉండాలంటే రైతులు, మహిళల ఆర్థికంగా బలంగా ఉండాలి. వ్యవసాయ కార్యకలాపాలకు, స్వయం ఉపాధి కార్యక్రమాలకు తక్కువ వడ్డీకే రుణాలు అందించడం ద్వారా వారిని చేయిపట్టుకుని నడిపించగలుగుతాం. ఈ లక్ష్యసాధనలో ఆప్కాబ్, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు (డీసీసీబీలు), ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు (పీఏసీఎస్–ప్యాక్స్), రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు) భాగస్వామ్యం కావాలి. వీటి నెట్వర్క్ను విస్తృతం చేయాల్సిన అవసరం ఉంది’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో సహకార రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సీఎం ఏమన్నారంటే.. ఆర్బీకేల రూపంలో ప్రతీ గ్రామంలో ఓ బ్రాంచ్ ప్రతి పీఏసీఎస్ పరిధిలో 3 నుంచి 4 ఆర్బీకేలను తీసుకువచ్చాం. ప్రతీ ఆర్బీకేలోనూ ఓ బ్యాంకింగ్ కరస్పాండెంట్ను నియమించాం. వీరు గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో భాగం కావాలి. పీఏసీఎస్లు, ఆర్బీకేలు ఒకదానితో ఒకటి అనుసంధానం చేశాం. పీఏసీఎస్లు ఇప్పటికే ఆర్బీకేల ద్వారా రుణాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నాయి. క్రెడిట్, నాన్ క్రెడిట్ సేవలను గ్రామ స్థాయిలో పీఏసీఎస్లు ఆర్బీకేల ద్వారా అందిస్తున్నాయి. ఇలా పీఏసీఎస్ల మాదిరిగానే ఆర్బీకేల రూపంలో ప్రతి గ్రామంలో ఆప్కాబ్కు, డీసీసీబీలకు ప్రత్యేకంగా శాఖలు ఉన్నట్టుగానే పరిగణించాలి. దేశంలో మరే ఇతర బ్యాంకుకు లేని అవకాశం రాష్ట్రంలోని సహకార బ్యాంకులకు ఉంది. రైతులకు రుణాల విషయంలో ఆర్బీకేలకు ఒక ప్రాంతీయ కార్యాలయాల మాదిరిగా పీఏసీఎస్లు వ్యవహరించాలి. ఆర్బీకేల ద్వారా ఆర్ధిక కార్యకలాపాలను పూర్తి స్థాయిలో విస్తరించాలంటే గ్రామ స్థాయి వరకు ఉన్న ఈ నెట్వర్క్ను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. సహకారరంగంపై సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డీసీఎంఎస్లపై అధ్యయనం చేయాలి జిల్లా కేంద్ర మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్)ల పనితీరుపై పూర్తిస్థాయి అధ్యయనం చేయాలి. గ్రామ స్థాయిలో ఆర్బీకేలు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం స్థానికంగా ఉన్న అవసరాలకు అనుగుణంగా డీసీఎంఎస్ కార్యకలాపాలను మరింత విస్తరించాల్సిన అవసరం ఉంది. వాటి సేవలను మరింత విస్తృతం చేసే దిశగా, రైతులతో పాటు సంబంధిత వర్గాల వారికి మరింత ప్రయోజనం చేకూర్చేలా తీసుకోవాల్సిన చర్యలపై ఈ అధ్యయనం జరగాలి. వ్యవసాయ ఉత్పత్తులు వాటి ధరలపై ఎప్పటికప్పుడు సీఎం యాప్ ద్వారా వివరాలు వస్తున్నాయి. ఎక్కడైనా కనీస మద్దతు ధర లభించకపోయినా, ధరలు నిరాశాజనకంగా ఉన్నా సీఎం యాప్ ద్వారా వివరాలు తెలియగానే ప్రభుత్వం మార్కెట్లో జోక్యం చేసుకొని చర్యలు తీసుకుంటోంది. ఈ ప్రక్రియలో డీసీఎంఎస్లకు సముచిత పాత్ర కల్పించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా తగిన చర్యలు తీసుకోవాలి. దీంతో పాటు ప్రైమరీ, సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ వ్యవస్థలను కూడా డీసీఎంఎస్ల ద్వారా ఇంటిగ్రేట్ చేయాలి. ఇందుకోసం çసమగ్ర అధ్యయనం చేసి తగిన సిఫార్సులతో కూడిన నివేదిక సిద్ధం చేయాలి. స్వయం ఉపాధి కల్పించాలి గ్రామస్థాయిలో తక్కువ వడ్డీకే రుణాలివ్వడం వల్ల గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ మరింత బలోపేతమవుతుంది. వైఎస్సార్ చేయూత ద్వారా మహిళల స్వయం ఉపాధికి ఆప్కాబ్ చర్యలు తీసుకోవాలి. గుర్తించిన లబ్దిదారు చేతిలో వరుసగా నాలుగేళ్ల పాటు ఏటా రూ.18,750 చొప్పున ప్రభుత్వం డబ్బులు పెడుతుంది. వీటితో వారిని స్వయం ఉపాధి దిశగా నడిపించేలా చర్యలు తీసుకోవాలి. కమర్షియల్ బ్యాంకుల కన్నా తక్కువ వడ్డీలకే రుణాలివ్వాలి. బంగారంపై ఇచ్చే రుణాలపై కూడా తక్కువ వడ్డీ ఉండాలి. పీఏసీఎస్ల ద్వారా రుణాల మంజూరు ప్రక్రియ సరళతరంగా, సమర్థంగా ఉండేలా చూడాలి. వీటి కోసం ప్రత్యేకంగా ఎస్ఓపీలు తయారుచేయాలి. లాభాల బాట పట్టించేలా చూడాలి.. గతంలో చూడని పురోగతి ఈ నాలుగేళ్లలో ఆప్కాబ్లో కనిపిస్తోంది. ఆప్కాబ్ మన బ్యాంకు, మనందరి బ్యాంక్ అన్న భావనతో తీర్చిదిద్దాలి. మరింత ముందుకు తీసుకువెళ్లాలి. ఆప్కాబ్ మాదిరిగానే డీసీసీబీలు, పీఏసీఎస్లను కూడా నూటికి నూరు శాతం లాభాల బాట పట్టించేలా చర్యలు తీసుకోవాలి. నష్టాలు ఎందుకు వస్తున్నాయన్న దానిపై పూర్తి స్థాయిలో పరిశీలన చేయాలి. లాభాల బాట పట్టించడానికి తగిన చర్యలు తీసుకోవాలి. వెబ్ ల్యాండ్, రెవెన్యూ రికార్డులను పూర్తిగా అప్డేట్ చేయాలి. ఆ వివరాలు పీఏసీఎస్ల వద్ద అందుబాటులో ఉంచాలి. దీనివల్ల రికార్డుల స్వచ్చ్చికరణ జరుగుతుంది. తద్వారా పారదర్శకత పెరుగుతుంది. 84.32 శాతం పెరిగిన కార్యకలాపాలు: అధికారులు ప్రభుత్వ ప్రోత్సాహం, సంస్కరణల ఫలితంగా సహకార రంగంలో ఆర్థిక కార్యకలాపాలు ఈ నాలుగేళ్లలో అనూహ్యంగా పెరిగాయని అధికారులు సీఎం వైఎస్ జగన్కు వివరించారు. 2019తో పోలిస్తే 2023 నాటికి 84.32 శాతం పెరిగాయన్నారు. 2019 వరకూ పీఏసీఎస్లో ఆర్థిక కార్యకలాపాలు రూ. 11,884.97 కోట్లు కాగా, 2023 నాటికి ఈ మొత్తం రూ. 21,906 కోట్లకు చేరిందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 400 పీఏసీఎస్లు నష్టాల నుంచి లాభాల బాట పట్టాయని సీఎంకు చెప్పారు. ఆప్కాబ్లో 2019 మార్చి నాటికి రూ. 13,322.55 కోట్ల టర్నోవర్ ఉండగా, అది 2023 మార్చి నాటికి రూ. 36,732.43 కోట్లకు చేరిందన్నారు. నాలుగేళ్లలో 175 శాతం గ్రోత్ రేటు నమోదైందన్నారు. సమీక్షలో రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి, సహకార శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, ఆర్ధిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, పౌరసరఫరాల సంస్థ ఎండీ జీ.వీరపాండియన్, సహకార శాఖ కమిషనర్ అహ్మద్బాబు, వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్, ఆప్కాబ్ ఎండీ ఆర్ఎస్ రెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వృత్తి నైపుణ్యం పెంచాలి మనది వ్యవసాయ ఆధారిత రాష్ట్రం కావడం వలన సహకార రంగంలోని ప్రతి వ్యవస్థను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రంగంలో పూర్తి స్థాయిలో వృత్తి నైపుణ్యం తీసుకురాగలిగితే ఆ మేరకు నాణ్యమైన, పారదర్శకమైన సేవలు అందుతాయి. డీసీసీబీల్లో ఇప్పటికే ప్రొఫెషనలిజం తీసుకొచ్చాం. అదే రీతిలో పీఏసీఎస్లు, డీసీఎంఎస్లలో కూడా ప్రొఫెషనలిజాన్ని పెంచాలి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థల్లో పీఏసీఎస్లు కీలక పాత్ర పోషించాలి. పీఏసీఎస్లు, ఆర్బీకేల నెట్వర్క్ ద్వారా గ్రామ స్థాయిలో నాణ్యమైన సేవలు అందుతాయి. పీఏసీఎస్ల ద్వారా రైతులకు అందించే ఎరువులు, మిగిలిన వాటిలో నాణ్యత చాలాముఖ్యం. ఎట్టిపరిస్థితుల్లోనూ కల్తీలకు ఆస్కారం లేకుండా చూడాలి. పీఏసీఎస్ల కింద నడిచే పెట్రోలు బంకుల్లో ఎలక్ట్రిక్ వాహనాలకు చార్జింగ్ యూనిట్లు కూడా ఏర్పాటు చేయాలి. నవంబర్ నాటికి పీఏసీఎస్లలో పూర్తి స్థాయి కంప్యూటరీకరణ అందుబాటులోకి తీసుకురావాలి. ఆప్కాబ్, సహకార బ్యాంకులు, పీఏసీఎస్లలో క్రమం తప్పకుండా ఆడిట్ జరిగేలా చూడాలి. -
వర్షం తక్కువున్న జిల్లాల్లో ప్రత్యామ్నాయ పంటలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో లోటు వర్షపాతం ఉన్న జిల్లాల్లో ప్రత్యామ్నాయ పంటలు వేసేందుకు కంటింజెన్సీ ప్రణాళికను సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డా. కేఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో వర్షాలు, వ్యవసాయం, పశువుల గ్రాసం తదితర అంశాలపై ఆయన శనివారం వ్యవసాయ, పశు సంవర్థక, మత్స్య, ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖల అధికారులతో సమీక్షించారు. ఆరు జిల్లాల్లోని 130 మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదైందని, ఈ జిల్లాల్లో ఆగస్టులో కూడా వర్షాలు తక్కువ ఉంటే ప్రత్యామ్నాయ పంటల విత్తనాలు సిద్ధం చేయాలని సీఎస్ ఆదేశించారు. అధిక వర్షాల కారణంగా వరి నారు దెబ్బతిన్న రైతులకు స్వల్పకాలంలో దిగుబడినిచ్చే విత్తనాలు సరఫరా చేయాలని చెప్పారు. రాష్ట్రంలో వర్షాలు, వ్యవసాయంపై వ్యవసాయ, పశు సంవర్థక, మత్స్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో ఖరీఫ్ లో మొత్తం 34.39 లక్షల హెక్టార్లు సాధారణ విస్తీర్ణం కాగా ఇప్పటివరకు 9.22 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు వేశారని తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో సాధారణంకంటే 20 నుండి 50 శాతం అధిక వర్షపాతం నమోదైనట్లు చెప్పారు. కృష్ణా జిల్లాలో 60 శాతం పైగా అధిక వర్షపాతం నమోదైందని చెప్పారు. అంబేడ్కర్ కోనసీమ,పశ్చిమ గోదావరి, నెల్లూరు, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో 20 నుండి 59 మిల్లీ మీటర్ల తక్కువ వర్షపాతం నమోదైందన్నారు. వర్షపాతం తక్కువున్న జిల్లాల్లో ప్రత్యామ్నాయ పంటల కోసం సుమారు 10 వేల క్వింటాళ్ల మినుము, పెసర, కంది, ఉలవ, జొన్న, పొద్దుతిరుగుడు, వేరుశనగ తదితర విత్తనాలను ఏపీ సీడ్స్ వద్ద సిద్ధంగా ఉంచామని చెప్పారు. అధిక వర్షాలతో వరి నారు మడులు దెబ్బతిన్న రైతులకు స్వల్ప కాలంలో పంట దిగుబడినిచ్చే ఎంటీయూ 1010, 1121,1153, బీపీటీ 5204, ఎన్ఎల్ఆర్ 34449 వరి విత్తనాలను సుమారు 30 వేల క్వింటాళ్లు సిద్ధం చేసినట్టు తెలిపారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ సీహెచ్ హరికిరణ్, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ డా. బి.ఆర్.అంబేద్కర్, పశు సంవర్థక శాఖ సంచాలకులు అమరేంద్ర కుమార్, ఏపీ సీడ్స్ ఎండీ శేఖర్ బాబు, మత్స్య శాఖ అదనపు సంచాలకులు డా. అంజలి, ఉద్యాన శాఖ అదనపు సంచాలకులు బాలాజీ నాయక్, వెంకటేశ్వర్లు తదితర అధికారులుపాల్గొన్నారు. -
సూక్ష్మ సేద్యం.. విస్తరణే లక్ష్యం
సాక్షి, అమరావతి: సూక్ష్మసేద్యాన్ని విస్తరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 2022–23లో లక్ష్యానికి మించి తుంపర, బిందు సేద్య పరికరాలు అందించగా.. 2023–24లో రూ.902 కోట్లను వెచ్చించి కనీసం 2.5 లక్షల ఎకరాల్లో విస్తరణకు శ్రీకారం చుట్టింది. శనివారం రాష్ట్రవ్యాప్తంగా పరికరాల పంపిణీ ప్రారంభించింది. లక్ష్యానికి మించి పంపిణీ సూక్ష్మ సేద్యంలో దేశంలోనే మన రాష్ట్రం నాలుగో స్థానంలో ఉండగా.. టాప్–20 జిల్లాల్లో ఐదు జిల్లాలు మన రాష్ట్రంలోనే ఉన్నాయి. ఇటీవలే నూరు శాతం బోర్ల కింద బిందు, తుంపర పరికరాలు అమర్చిన గ్రామంగా వైఎస్సార్ జిల్లా పులివెందుల మండలం ఈ.కొత్తపల్లి గ్రామానికి జాతీయ పురస్కారం దక్కించుకుంది. రాష్ట్రంలో 12.62 లక్షల మంది రైతులు 35.50 లక్షల ఎకరాల్లో సూక్ష్మ సేద్యం చేస్తుండగా, ఏటా 2.50 లక్షల ఎకరాల చొప్పున మరో 18.65 లక్షల ఎకరాల్లో విస్తరణకు కార్యాచరణ సిద్ధం చేశారు. టీడీపీ ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.936 కోట్ల బకాయిలు చెల్లించడంతో రాష్ట్రంలో సూక్ష్మసేద్యం విస్తరణ వేగం పుంజుకుంది రాష్ట్రంలో 5 ఎకరాల్లోపు రైతులకు 90 శాతం, రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో 5–10 ఎకరాల్లోపు రైతులకు 70 శాతం, ప్రకాశం మినహా కోస్తా జిల్లాల్లో 5–12.5ఎకరాల్లోపు రైతులకు 50 శాతం రాయితీగా ప్రభుత్వం భరిస్తోంది. 2022–23లో 1.87 లక్షల ఎకరాల్లో విస్తరించాలని లక్ష్యం కాగా.. రికార్డు స్థాయిలో 82,289 మంది రైతులకు చెందిన 2.26 లక్షల ఎకరాల్లో విస్తరించారు. వీటికోసం రైతులు తమ వాటాగా రూ.174 కోట్లు చెల్లించగా, ప్రభుత్వం సబ్సిడీ రూపంలో రూ.465 కోట్లు భరించింది. 2023–24లో 2.50 లక్షల ఎకరాల్లో విస్తరణ 2023–24లో రూ.902 కోట్ల అంచనా వ్యయంతో 2.50 లక్షల ఎకరాల్లో విస్తరించాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్నారు. అంచనా మొత్తంలో రైతుల వాటా రూ.145 కోట్లు కాగా, సబ్సిడీ రూపంలో రూ.757 కోట్లు ప్రభుత్వం భరించనుంది. ఏప్రిల్ నుంచి ఆర్బీకేల ద్వారా రైతుల రిజిస్ట్రేషన్లకు శ్రీకారం చుట్టి ఇప్పటివరకు 5.07లక్షల ఎకరాల్లో బిందు, తుంపర పరికరాల అమరిక కోసం 1.72 లక్షల మంది రైతులు తమ వివరాలను నమోదు చేసుకున్నారు. అవసరం ఉన్న వారికి అర్హత ఉంటే చాలు ఎలాంటి సిఫార్సులు లేకుండా క్షేత్రస్థాయి పరిశీలనలో అర్హుల ఎంపిక చేపట్టారు. ప్రాథమిక పరిశీలనలో ఇప్పటివరకు 1.55 లక్షల ఎకరాల్లో సర్వే చేయగా.. 1.45 లక్షల ఎకరాల్లో ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు. పండగ వాతావరణంలో పరికరాల పంపిణీ 45,255 ఎకరాల్లో ఏర్పాటు కోసం 16,630 మంది రైతులు తమ వాటా సొమ్మును చెల్లించారు. 10,556 మంది రైతులకు చెందిన 29,070 ఎకరాల్లో అమర్చేందుకు అవసరమైన బిందు, తుంపర పరికరాల పంపిణీకి శనివారం శ్రీకారం చుట్టారు. వైఎస్సార్ జిల్లా పులివెందులలో రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బిందు, తుంపర పరికరాల వాహనాలకు జెండా ఊపి ప్రారంభించారు. అదేవిధంగా రాయలసీమలోని పలు జిల్లాల్లో స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో పరికరాల పంపిణీ పండుగ వాతావరణంలో ప్రారంభమైంది. -
మార్కెట్లోకి కొత్త విత్తనాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని రైతులకు కొత్త వంగడాలు అందుబాటులోకి వచ్చాయి. వరిలో 4, మినుములో 2, వేరుశనగ, పెసర, పొగాకులలో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 9 వంగడాలను బుధవారం వ్యవసాయ శాఖ స్పెషల్ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది మార్కెట్లోకి విడుదల చేశారు. వీటిని ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న నెల్లూరు, బాపట్ల, తిరుపతి, మారుటేరు, నంద్యాల, గుంటూరు లాం పరిశోధనా కేంద్రాల శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. వీటి ప్రత్యేకతలను ఆర్బీకేల్లో ప్రదర్శించడంతో పాటు వీటి వినియోగాన్ని పెంచేలా రైతులను ప్రోత్సహించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ సి.హరికిరణ్, వీసీ విష్ణువర్థన్రెడ్డి, ఏపీ సీడ్స్ ఎండీ డాక్టర్ గెడ్డం శేఖర్బాబు, వర్సిటీ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ ఎల్.ప్రశాంతి, డైరెక్టర్ ఆఫ్ సీడ్స్ ఎ.సుబ్బరావిురెడ్డి తదితరులు పాల్గొన్నారు. వేరుశనగలో.. టీసీజీఎస్ 1522: ఈ వంగడం కదిరి–6కు ప్రత్యామ్నాయం. తిరుపతి 4 ఎక్స్, కదిరి 9 రకాల నుంచి అభివృద్ధి చేశారు. పంటకాలం ఖరీఫ్లో 100 నుంచి 103 రోజులు, రబీలో 103 నుంచి 106 రోజులు. దిగుబడి హెక్టార్కు ఖరీఫ్లో 3.328 టన్నులు, రబీలో 4.031 టన్నులు. ఆకుమచ్చ, తుప్పు తెగులును కొంత మేర తట్టుకుంటుంది. కాయ నుంచి పప్పు దిగుబడి 75–76 శాతం, నూనె 48.5 శాతం, 100 గింజల బరువు 45–47 గ్రాములు, గింజలు లేతగులాబీ రంగులో ఉంటాయి. కాయలన్నీ ఒకేసారి పక్వానికి వస్తాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఖరీఫ్, రబీ సీజన్లకు అనుకూలం. పొగాకులో.. ఏబీడీ 132(నంద్యాల పొగాకు–2): ఈ వంగడం నంద్యాల పొగాకు–1కు ప్రత్యామ్నాయం. లైన్ 3–58–38, ఎక్స్ లైన్ (190–27–5–7–32), ఎక్స్ (303–3–38–13–11–40) రకాల నుంచి అభివృద్ధి చేశారు. ఇది తక్కువ హాని కారకాలను కలిగి ఉంటుంది. కిలో ఆకు ధర రూ.85 నుంచి రూ.90 పలుకుతుంది. ఒరోబాంకీని మధ్యస్థంగా తట్టుకోవడమేకాదు.. ఆకు కోత వరకు పచ్చగా ఉండి.. అధిక వర్షపాత పరిస్థితులను తట్టుకుంటుంది. నంద్యాల, కర్నూలు జిల్లాల్లో బీడీ పొగాకు సాగు చేసే అన్ని ప్రాంతాల్లో ఖరీఫ్లో సాగుకు అనుకూలం. పెసరలో.. ఎల్జీజీ 630: ఈ వంగడం ఎల్జీజీ 460, ఐపీఎం 2–14, టీఎం 96–2 రకాలకు ప్రత్యామ్నాయం. ఎల్జీజీ 460 ఎక్స్ పీ 109 రకాల నుంచి అభివృద్ధి చేశారు. పంట కాలం 65 నుంచి 70 రోజులు. దిగుబడి హెక్టార్కు 1.60 నుంచి 1.80 టన్నులు. పల్లాకు తెగులను పూర్తిగా తట్టుకునే రకం. ఒకేసారి కోత కోయటానికి అనువైనది. గింజలు మధ్యస్థ లావుకలిగి మెరుస్తుంటాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఖరీఫ్, రబీ సీజన్లకు అనుకూలం. మినుములో.. టీబీజీ 129: ఈ వంగడం ఎల్బీజీ 752కు ప్రత్యామ్నాయం. దీనిని పీయూ 31 ఎక్స్ ఎల్బీజీ 752 నుంచి అభివృద్ధి చేశారు. పంటకాలం 85 నుంచి 90 రోజులు. దిగుబడి హెక్టార్కు 1.60 నుంచి 1.80 టన్నులు. పల్లాకు తెగులును తట్టుకుంటుంది. గింజలు లావుగా ఉండి మెరుస్తుంటాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఖరీఫ్, రబీ సీజన్లకు అనుకూలం. ఎల్బీజీ 904: ఈ వంగడం ఎల్బీజీ 752, 787, పీయూ 31, టీబీజీ 104, జీబీజీ 1 రకాలకు ప్రత్యామ్నాయం. ఎల్బీజీ 645 ఎక్స్ టీయూ 94–2 రకాల నుంచి అభివృద్ధి చేశారు. పంట కాలం 85 నుంచి 90 రోజులు. దిగుబడి హెక్టార్కు 2.20 నుంచి 2.50 టన్నులు. పల్లాకు తెగులుతో పాటు కొంత మేర తలమాడుతట్టుకునే రకం. గింజలు మధ్యస్థ లావుకలిగి మెరుస్తుంటాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఖరీఫ్, రబీ సీజన్లకు అనుకూలం. నూతన వంగడాలు.. వాటి ప్రత్యేకతలు బీపీటీ 2841: ఈ వంగడం బర్మా బ్లాక్, కాలాబట్టి సాంప్రదాయ బ్లాక్ రైస్కు ప్రత్యామ్నాయం. ఎంటీయూ–7029, ఐఆర్జీసీ 18195, ఎంటీయూ–1081 రకాల నుంచి అభివృద్ధి చేశారు. పంటకాలం 130 నుంచి 135 రోజులు. దిగుబడి హెక్టార్కు 5.50 నుంచి 6 టన్నులు. అగ్గితెగులు, మెడవిరుపుతో పాటు దోమపోటును కొంతమేర తట్టుకుంటుంది. గింజలు పగిలిపోవడం తక్కువ. ముడి బియ్యానికి అనుకూలం. మధ్యస్థ సన్న గింజ రకం. కాండం దృఢంగా ఉండి చేనుపై వాలిపోదు. ఏపీలోని అన్ని ప్రాంతాల్లో ఖరీఫ్ సాగుకు అనుకూలం. బీపీటీ 2846: ఈ వంగడం బీపీటీ 5204కు ప్రత్యామ్నాయం. ఎంటీయూ–1061, ఐఆర్ 78585–64–2–4–3–1 రకాల నుంచి అభివృద్ధి చేశారు. పంటకాలం 140 నుంచి 150 రోజులు. దిగుబడి హెక్టార్కు 6.50 నుంచి 7 టన్నులు. అగ్గితెగులు, మెడవిరుపు, దోమపోటు, ఎండాకు తెగులును కొంతమేర తట్టుకుంటుంది. కాండం దృఢంగా ఉండి చేనుపై వాలిపోదు. మధ్యస్థ సన్న గింజ రకం. నిండు గింజల శాతం ఎక్కువ. ఏపీలో కృష్ణా, సదరన్ జోన్లలో ఖరీఫ్ సాగుకు అనుకూలం. ఎన్ఎల్ఆర్ 3238: బయో ఫోర్టిఫైడ్ స్వల్పకాలిక వరి రకమిది. బీపీటీ–5204, ఎంటీయూ 1010 రకాల నుంచి అభివృద్ధి చేశారు. పంటకాలం 120 నుంచి 125 రోజులు. దిగుబడి హెక్టార్కు 6.50 నుంచి 7 టన్నులు. ఇది కూడా చేనుపై వాలిపోదు. పాలిష్ చేసిన బియ్యంలో జింక్ మోతాదు 27–72 పీపీఎంగా ఉంటుంది. బియ్యం పారదర్శకంగా ఉండి నాణ్యతతో ఉంటాయి. అగ్గితెగులు, మెడవిరుపులను కొంత మేర తట్టుకుంటుంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఖరీఫ్, రబీ సీజన్లలో సాగుకు అనుకూలం. ఎంటీయూ 1271: ఈ వంగడం బీపీటీ 5204కు ప్రత్యామ్నాయం. ఎంటీయూ–1075, 1081 రకాల నుంచి అభివృద్ధి చేశారు. పంటకాలం 140 రోజులు. దిగుబడి హెక్టార్కు 6.50 నుంచి 7 టన్నులు. దోమ, ఎండాకు తెగులును కొంత మేర తట్టుకుంటుంది. మధ్యస్థ సన్న గింజ రకం. ఇది కూడా చేనుపై వాలిపోదు. నిండు గింజల శాతం ఎక్కువ. సాగునీటి వసతులున్న లోతట్టు, అప్ల్యాండ్స్లో ఖరీఫ్ సాగుకు అనుకూలం. -
57.24 లక్షల ఎకరాల్లో పంటల సాగు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వానాకాలం సీజన్లో ఇప్పటివరకు 57.24 లక్షల ఎకరాల్లో పంటలు సాగైనట్లు వ్యవసాయశాఖ వెల్లడించింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఈ సీజన్ సాధారణ సాగు విస్తీర్ణం 1.24 కోట్ల ఎకరాలు కాగా, 46.06 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. వాస్తవంగా గతేడాది వానాకాలం సీజన్లో ఇదే సమయానికి 53.66 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అంతకంటే ఇప్పుడు ఎక్కువ సాగు కావడం విశేషం. ఇటీవల వర్షాలు పుంజుకోవడంతో వ్యవసాయ పంటల సాగు ఊపు మీద ఉంది. కాగా, పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 50.59 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 37.98 లక్షల ఎకరాల్లో (75.07%) సాగైంది. ఇక వరి సాధారణ సాగు విస్తీర్ణం 49.86 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 7.94 లక్షల ఎకరాల్లో నాట్లు పడ్డాయి. పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 9.43 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 4.04 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. సోయాబీన్ సాధారణ సాగు విస్తీర్ణం 4.13 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 4.05 లక్షల ఎకరాల్లో (98.21%) సాగైంది. మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 7.13 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 3 లక్షల ఎకరాల్లో సాగైంది. ఆదిలాబాద్ జిల్లాల్లో 103 శాతం... రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాల్లో సాధారణం కంటే అధికంగా పంటలు సాగయ్యాయి. ఆ జిల్లాలో ఏకంగా 103.81 శాతం విస్తీర్ణంలో పంటలు సాగైనట్లు వ్యవసాయశాఖ నివేదిక వెల్లడించింది. ఆ తర్వాత కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 91.55 శాతం, వికారాబాద్ జిల్లాలో 74.30 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. అత్యంత తక్కువగా వనపర్తి జిల్లాలో కేవలం 3.93 శాతం విస్తీర్ణంలోనే పంటలు సాగయ్యాయి. కాగా, రాష్ట్రంలో సంగారెడ్డి, సిద్ధిపేట, వికారాబాద్ జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. మహబూబ్నగర్, మహబూబాబాద్, ఖమ్మం, నాగర్కర్నూలు, వనపర్తి, సూర్యాపేట, జోగుళాంబ జిల్లాల్లో వర్షపాతం తక్కువ నమోదైంది. మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైందని వ్యవసాయశాఖ వెల్లడించింది. జూన్లో 44 శాతం లోటు వర్షపాతం నమోదు కాగా, జూలైలో ఇప్పటివరకు 34.32శాతం అధిక వర్షపాతం నమోదైందని వెల్లడించింది. అందుబాటులో ఎరువులు, విత్తనాలు: నిరంజన్ రెడ్డి ఆలస్యమైనా వర్షాలు సాగుకు సహకరిస్తున్నాయని, ఆశాజనకంగా వ్యవసాయం సాగవుతోందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు.. సచివాలయంలో బుధవారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో మంత్రి నిరంజన్రెడ్డి, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు, ప్రత్యేక కమిషనర్ హన్మంతు కొండిబ పాల్గొన్నారు. మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది కొత్తగా వచ్చిన ఐదు జిల్లాలతో కలిపి 2.30 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగుకు లక్ష్యంగా నిర్ణయించామని తెలిపారు. -
డ్రోన్ సాగు సూపర్!
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయమంటే దుక్కి దున్నడం నుంచి పంట కోత దాకా ఎన్నో పనులు.. తీరిక లేని శ్రమ.. కూలీల కొరత ఓ వైపు, సమయాభావం మరోవైపు ఇబ్బందిగా మారిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి సమయంలో రైతన్నలకు వ్యవ‘సాయం’ కోసం డ్రోన్లతో ఆధునిక సాంకేతికతను అభివృద్ధి చేయడంపై ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం దృష్టి పెట్టింది. కేవలం పురుగు మందులు పిచికారీ చేయడానికే పరిమితం కాకుండా.. విత్తనాలు, ఎరువులు చల్లడం.. పంటలో చీడపీడలు, తెగుళ్లను, పూత, కాత పరిస్థితిని గుర్తించేలా ఫొటోలు తీయడం.. దిగుబడి ఏ మేరకు వచ్చే అవకాశం ఉందనే అంచనా వేసేందుకు వీలైన సమాచారం సేకరించడానికి వీలుగా డ్రోన్లను అభివృద్ధి చేస్తోంది. డ్రోన్లను సరైన తీరులో వినియోగించడం ద్వారా.. సాగులో పురుగు మందులు, ఎరువుల వృధాను అరికట్టవచ్చని, కూలీల కొరతకు చెక్పెట్టవచ్చని వర్సిటీ అధికారులు చెప్తున్నారు. వరిలో విత్తనాలు వెదజల్లేలా.. డ్రోన్ల ద్వారా వరి విత్తనాలను వెదజల్లి సాగు చేసే విధానాన్ని వ్యవసాయ వర్సిటీ అభివృద్ధి చేస్తోంది. దీనిపై పరిశోధన కొనసాగుతోందని, త్వరలో రైతులకు అందుబాటులోకి తెస్తామని వర్సిటీ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం వరి నారు పెంచడానికి కొన్ని రోజులు పడుతుందని, తర్వాత నారు తీసి నాట్లు వేయడానికి సమయం పడుతుందని.. ఇదే సమయంలో కూలీల కొరత, ఖర్చు సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అంటున్నారు. ఈ క్రమంలో వెదజల్లే పద్ధతిలో వరిసాగు చేస్తే బాగుంటుందని, దీనికి డ్రోన్ సాంకేతికతను వినియోగించేలా పరిశోధన చేస్తున్నామని వివరించారు. డ్రోన్తో రోజుకు ఏకంగా 30 ఎకరాల్లో ఐదు వరుసల్లో వరి విత్తనాలను వెదజల్లవచ్చని చెప్తున్నారు. దీనివల్ల రైతులకు కూలీల ఖర్చు తగ్గుతుందని, సమయం కలిసివస్తుందని అంటున్నారు. కలుపు మందును కూడా డ్రోన్ల సాయంతో చల్లేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొంటున్నారు. డ్రోన్లపై శిక్షణ కోసం అకాడమీ రాష్ట్రంలో నిరుద్యోగులకు, ఆసక్తి కలిగిన వారికి డ్రోన్ల నిర్వహణపై శిక్షణ ఇవ్వాలని.. ఇందుకోసం డ్రోన్ అకాడమీని నెలకొల్పాలని వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్ణయించింది. త్వరలోనే దీనిని ప్రారంభిస్తామని.. వ్యవసాయం, పరిశ్రమలు, ఇతర రంగాల్లో డ్రోన్లను ఎలా వాడాలో శిక్షణ ఇస్తామని అధికారులు తెలిపారు. 18 ఏళ్ల నుంచి 60ఏళ్ల మధ్య వయసున్న వారికి శిక్షణ అవకాశం ఉంటుందని.. ఇందుకోసం తప్పనిసరిగా పాస్పోర్ట్ ఉండాలని, కనీసం పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలని వెల్లడించారు. ఆరు రోజులపాటు సమగ్రంగా శిక్షణ ఇచ్చేందుకు రూ.45 వేలు ఫీజు ఖరారు చేశారు. ప్రధానంగా వ్యవసాయంలో డ్రోన్ల వినియోగంపై శిక్షణ ఉంటుంది. పురుగు మందులు చల్లడంపై ప్రత్యేకంగా.. రాష్ట్రంలో ప్రధానంగా సాగు చేసే వరి, పత్తి, వేరుశనగ, కంది, పొద్దు తిరుగుడు, ఆముదం, సోయాబీన్ పంటల్లో డ్రోన్ల ద్వారా పురుగు మందులను చల్లడంపై ప్రత్యేక శిక్షణ ఉంటుందని వ్యవసాయ వర్సిటీ వెల్లడించింది. దీనికి సంబంధించి కార్యాచరణ ప్రణాళిక (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్)ను రూపొందించింది. ఉదాహరణకు డ్రోన్ల ద్వారా పురుగు మందు చల్లేటపుడు వాటి రెక్కల నుంచి వచ్చే గాలి వేగానికి వరి చేను విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఎంత ఎత్తు నుంచి డ్రోన్లను ఉపయోగించాలి, ఎంత స్థాయిలో మందును విడుదల చేయాలన్నది నిర్ణయించారు. ► ఇక సాధారణ తైవాన్ స్ప్రేయర్ల ద్వారా ఎకరా పంటకు పురుగుమందు పిచికారీ చేయాలంటే 150 లీటర్ల నుంచి 200 లీటర్ల నీటిని వాడుతారు. అదే డ్రోన్ల ద్వారా అయితే కేవలం 20 లీటర్లతో పిచికారీ చేయొచ్చు. ఒక రోజులో ఏకంగా 30 ఎకరాల్లో మందును చల్లవచ్చు. ప్రత్యేక పరికరాలను అమర్చడం ద్వారా.. కాండం మొదట్లోకి పురుగు మందు చేరేలా చేయవచ్చు. ► కేంద్ర ప్రభుత్వం ఇటీవల అందుబాటులోకి తెచ్చిన నానో యూరియాను కూడా డ్రోన్ల ద్వారా పంటలపై చల్లవచ్చని వ్యవసాయ వర్సిటీ వరి పరిశోధన సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రాంగోపాల్ వర్మ తెలిపారు. పురుగు మందులను తక్కువ వ్యవధిలో, పొదుపుగా, సమర్థవంతంగా చల్లడానికి డ్రోన్లతో వీలవుతుందని వివరించారు. అదనపు పరికరాలను అమర్చి.. పంటలకు డ్రోన్ల ద్వారా ఎరువులు, పురుగు మందులు చల్లడానికి సంబంధించి అనేక అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది. ఎందుకంటే కొన్ని పంటలకు పైపైన స్ప్రే చేస్తే సరిపోతుంది. మరికొన్నింటికి కాండం మొదట్లో చల్లాల్సి ఉంటుంది. దీనితోపాటు పంట పరిస్థితి ఏమిటి? ఏవైనా చీడపీడలు ఆశించాయా? అన్నది తెలుసుకునేందుకు ఫొటోలు తీయాలి. వాటిని వ్యవసాయాధికారికి పంపాలి. ఈ క్రమంలోనే ఆయా అవసరాలకు అనుగుణంగా డ్రోన్లకు ప్రత్యేక పరికరాలను అమర్చాలని అధికారులు భావిస్తున్నారు. ఇక పంటల పూత, కాత ఎలా ఉంది? దిగుబడి ఏమేరకు వచ్చే అవకాశం ఉంది వంటి ప్రతి అంశాన్ని సూక్ష్మస్థాయిలోనూ పర్యవేక్షించేలా డ్రోన్లను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. రైతులకు సబ్సిడీపై డ్రోన్లు రాబోయే రోజుల్లో గ్రామాల్లో సాగు కోసం డ్రోన్ల వినియోగం పెరుగుతుందని అధికారులు అంచనా వేశారు. ఇప్పటివరకు వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా.. ట్రాక్టర్లు, స్ప్రేయర్లు, దుక్కు దున్నే యంత్రాలు, వరి కోత యంత్రాలు వంటివి ఇవ్వగా.. భవిష్యత్తులో డ్రోన్లను అందజేసేందుకు వ్యవసాయ శాఖ సన్నాహాలు మొదలుపెట్టింది. ఒక్కో డ్రోన్ ధర రూ.10 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. వాటిని ఆగ్రోస్ సేవా కేంద్రాల నిర్వాహకులకు సబ్సిడీపై ఇవ్వాలని యోచిస్తున్నారు. డ్రోన్ల సాగులో దేశానికే మార్గదర్శకంగా.. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగానికి సంబంధించి తెలంగాణ దేశానికే మార్గనిర్దేశం చేస్తోందని వ్యవసాయశాఖ అధికారులు చెప్తున్నారు. వివిధ పంటల్లో డ్రోన్ల వినియోగం, నిర్వహణకు సంబంధించి జయశంకర్ యూనివర్సిటీ రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక (ఎస్ఓపీ)నే కేంద్రం దేశవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించిందని అంటున్నారు. వ్యవసాయ డ్రోన్ల వినియోగంపై సాధారణ మార్గదర్శకాలివీ.. ► నీటి వనరులు, నివాస ప్రాంతాలు, పశుగ్రాసం పంటలు, ప్రజా వినియోగాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ మొదలైన వాటికి దూరంగా డ్రోన్లను వినియోగించాలి. ► డ్రోన్ వాడకానికి సంబంధించి గ్రామ పంచాయతీ, సంబంధిత వ్యవసాయ అధికారి కనీసం 24 గంటల ముందుగా అనుమతి ఇస్తారు. ► డ్రోన్ మంచి స్థితిలో ఉందని, సురక్షితంగా ప్రయాణించడానికి సరిపోతుందని ముందే సరిచూసుకోవాలి. ► దానితో పిచికారీ చేసే సమయంలో ఆయా ప్రాంతాల్లోకి జంతువులు, వ్యక్తులు ప్రవేశించకూడదు. ► ఆపరేటర్లు డ్రోన్ ఆపరేషన్, సురక్షితమైన పురుగు మందుల పిచికారీ.. ఈ రెండింటిపై శిక్షణ పొంది ఉండాలి. ► ముందుగానే ప్రతిపాదిత ప్రాంతం, సరిహద్దు, అడ్డంకులు (గోడలు, చెట్లు)ను పరిశీలించి ఆ ప్రకారం డ్రోన్ను ఆపరేట్ చేయాలి. ► ప్రభుత్వ సంస్థలు, సైనిక స్థావరాలపై లేదా డ్రోన్లకు అనుమతి లేని జోన్ల మీదుగా ఎగురవేయవద్దు. అనుమతి ఇవ్వని ప్రైవేట్ ఆస్తులపైనా డ్రోన్ ఎగరవేయవద్దు. -
కాటన్పై కాటు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 33 జిల్లాలకుగాను 16 జిల్లాల్లో వర్షాభావం నెలకొందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. ఈ సీజన్ సాధారణ సాగు విస్తీర్ణం 1.24 కోట్ల ఎకరాలు కాగా, సోమవారం నాటికి 42.48 లక్షల ఎకరాల్లో సాగైంది. వాస్తవంగా గతేడాది ఇదే సమయానికి 53.79 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అంటే ఈసారి ఏకంగా 11.31 లక్షల ఎకరాలు తక్కువగా సాగైనట్లు వ్యవసాయశాఖ గణాంకాలు చెబుతున్నాయి. సీజన్ ఆలస్యం కావడం వల్లే ఈ పరిస్థితి నెలకొంది. ఈసారి కొద్దిపాటి వర్షాలకు రాష్ట్రంలో 28.70 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. కానీ వాటిని కాపాడుకోవడం కూడా రైతులకు సవాల్గా మారింది. వర్షాలు లేకపోవడంతో అవి మొలకెత్తే పరిస్థితి లేకుండాపోతోంది. వ్యవసాయశాఖ తాజా అంచనా ప్రకారం దాదాపు 10 లక్షల ఎకరాల్లో కూడా పత్తి మొలకెత్తలేదని అధికారులు చెబుతున్నారు. మరికొన్నిచోట్ల పత్తి భూమిలోనే మాడిపోయిందని అంటున్నారు. దీంతో రైతులు మళ్లీ భూమిని దున్ని పత్తి వేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. వాస్తవంగా పత్తి వేయడానికి ఈ నెలాఖరు వరకే గడువు. చిట్టచివరకు ఆగస్టు మొదటి వారంలోగా పూర్తి చేయాలి. ఆ తర్వాత పత్తి వేయడానికి అదనుపోయినట్లే. ఆలస్యమైతే చీడపీడలు ఆశిస్తాయి. పైపెచ్చు మళ్లీ దున్ని విత్తనాలు వేయాలంటే మరింత ఖర్చుతో కూడిన వ్యవహారం. మరోవైపు అనుకున్న వెరైటీలు దొరక్క ఏదో ఒక రకం విత్తనం వేయాల్సిన దుస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈసారి ప్రభుత్వం కూడా పత్తి సాగును ప్రోత్సహించాలని పిలుపునిచ్చింది. కనీసం 65 లక్షల ఎకరాలకైనా పెంచాలని రైతులకు కోరింది. కానీ పరిస్థితి అందుకు అనుకూలంగా లేదు. గతేడాది మేరకైనా పత్తి సాగవుతుందా లేదా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. పత్తి అదను దాటిపోతే దానికి బదులుగా మొక్కజొన్న లేదా ఆముదం వంటి పంటలను రైతులు వేసుకోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రత్యామ్నాయ పంటలపై కసరత్తు వర్షాలు లేకపోవడం, కాల్వల్లో నీటి విడుదల లేకపోవడంతో అనేకచోట్ల ఇంకా వరి నార్లు పోయలేదు. ఈ పరిస్థితుల్లో ఖరీఫ్ సీజన్ ఎలా గట్టెక్కుతుందో అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెలాఖరు నాటికి కూడా ఇదే పరిస్థితి ఉంటే రాష్ట్రంలో ఈ సీజన్ సాగు ప్రమాదంలో పడినట్లేనని వ్యవసాయ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో కంటింజెన్సీ ప్రణాళికపై వ్యవసాయశాఖ సమాలోచనలు చేస్తోంది. సకాలంలో పంటలు వేయని పరిస్థితి ఏర్పడితే ఏం చేయాలన్న దానిపై ప్రొ.జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలతో మంతనాలు జరుపుతోంది. నార్లు వేయని పరిస్థితి నెలకొంటే వెదజల్లే పద్ధతిని ప్రోత్సహించాలని భావిస్తోంది. స్వల్పకాలిక రకాలైన వరి విత్తనాలను రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ మేరకు అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉండాలని కిందిస్థాయి సిబ్బందిని వ్యవసాయశాఖ ఆదేశించింది. రోజువారీగా జిల్లా అధికారులతో క్షేత్రస్థాయి పరిస్థితిని అంచనా వేస్తోంది. ఖర్చు రెట్టింపైంది నా రెండెకరాల భూమిలో 20 రోజుల క్రితం పత్తి గింజలు విత్తాను. కానీ వర్షాలు రాకపోవడంతో మొలకలు రాలేదు. దీంతో రెండోసారి పత్తి విత్తనాల ప్యాకెట్లు కొనుగోలు చేసి విత్తాను. పత్తి విత్తనాలకు రూ.3,500, సాగుకు రూ.6,000, విత్తడానికి రూ.1,000 ఖర్చయింది. వర్షం రాకపోవడంతో రెండుసార్లు విత్తనాలు వేయడంతో పెట్టుబడి రెట్టింపైంది. ఇప్పటివరకు రూ.21 వేలకుపైగా ఖర్చయింది. – రేఖ శ్రీధర్, రైతు, నర్సింహులపేట, మహబూబాబాద్ జిల్లా వానల్లేక మొలకెత్త లేదు జూన్ మొదటి వారంలో పొడి దుక్కుల్లో నాలుగెకరాల్లో పత్తి విత్తనాలు పెట్టాం. సమయానికి వర్షాలు పడలేదు. ఎండ తీవ్రత బాగా ఉంది. దీంతో విత్తనాలు మొలకెత్తలేదు. మరోసారి విత్తనాలు వేయాల్సి వచ్చింది. రెండోసారి పెట్టిన విత్తనాలు ఇప్పుడిప్పుడే మొలకెత్తుతున్నాయి. రెండుసార్లు వేయాల్సి రావడంతో ఖర్చు ఎక్కువైంది. – చామకూరి రమేష్, పిండిప్రోలు, తిరుమలాయపాలెం మండలం, ఖమ్మం జిల్లా -
పారదర్శకంగా పంటల బీమా
సాక్షి, అమరావతి: రైతుపై పైసా భారం లేకుండా ఈ–పంటలో నమోదే ప్రామాణికంగా ఉచిత పంటల బీమా అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని వ్యవసాయ శాఖ కమిషనర్ చేవూరు హరికిరణ్ స్పష్టం చేశారు. ‘ఉచిత పంటల బీమా.. అంతా మాయ’ శీర్షికన ఈనాడు ప్రచురించిన కథనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో సాగవుతున్న వ్యవసాయ, ఉద్యాన పంటలను జాయింట్ అజమాయిషీ కింద ఈ పంటలో నమోదు చేయడంతోపాటు 93 శాతం రైతుల బయోమెట్రిక్ అథంటికేషన్ పూర్తి చేశామన్నారు. ఈ–క్రాప్ నమోదు చేసి ప్రతి రైతుకు రసీదు కూ డా ఇస్తున్నామన్నారు. కొత్తగా ఎవరి పేర్లను చేర్చడం, తీ సేయడం కానీ చేయడం లేదన్నారు. ఖరీఫ్–2022 సీజన్కు సంబంధించి 10.20 లక్షల మంది అర్హత పొందితే. వారికి రూ.1, 117.21 కోట్ల బీమా పరిహారాన్ని జూలై 8న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పంపిణీ చేస్తా్తర న్నారు. ఈ పథకం ద్వారా గడిచిన నాలుగేళ్లుగా లబ్ధి పొందుతున్న రైతులను అయోమయానికి గురిచేయాలన్న ఏకైక లక్ష్యంతో ఈనాడు నిత్యం అబద్ధాలను అచ్చు వేస్తోందన్నారు. 30 వేల పంట కోత ప్రయోగాలు చేశాం దిగుబడి ఆధారిత పంట నష్టం అంచనాలను లెక్కించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 30 వేల పంట కోత ప్ర యోగాలు చేసినట్టు హరికిరణ్ పేర్కొన్నారు. వాతా వరణ ఆధారిత పంట నష్టం అంచనా కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,817 వాతావరణ కేంద్రాల్లో నమోదైన సమాచారాన్ని (అధిక/లోటు వర్షపాతం, ఉష్ణోగ్రతలు) పరిగణనలోకి తీసుకుని బీమా పరిహారాన్ని లెక్కించామన్నారు. సత్యదూరమైన ఇలాంటి కథనాలతో రైతులను గందరగోళానికి గురి చేయడం మానుకోవాలని హితవు పలికారు. -
ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికపై దృష్టి పెట్టండి
సాక్షి, అమరావతి: ఖరీఫ్ సీజన్లో వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొనేందుకు అవసరమైన కార్యాచరణ సిద్ధం చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యవసాయ అధికారులతో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ.. జూలై 15, జూలై 31, ఆగస్ట్ 15 నాటికి సరైన వర్షాలు పడకపోతే ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను సిద్ధం చేసుకోవాలన్నారు. పంటలు, పంట రకాల మార్పుపై దృష్టి సారించాలన్నారు. ఉత్తరకోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు వేర్వేరుగా పంటల కాలంలో అవసరమయ్యే వివిధ పంటల సరళి, అవసరమైన ఉత్పాదకలపై దృష్టి సారించాలన్నారు. వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ హరికిరణ్ మాట్లాడుతూ.. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికకు అనుగుణంగా జూలై 15 నాటికి వర్షాలు పడకపోతే.. 40 వేల క్వింటాళ్లు, జూలై 31 నాటికి వర్షాలు పడకపోతే 71 వేల క్వింటాళ్లు, ఆగష్టు 15 నాటికి వర్షాలు పడకపోతే లక్ష క్వింటాళ్ల విత్తనాలను 80 శాతం రాయితీపై పంపిణీ చేసేలా చర్యలు చేపడతామన్నారు. ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ గెడ్డం శేఖర్బాబు మాట్లాడుతూ.. ప్రత్యామ్నాయ పంటలకు అవసరమైన విత్తనాల పంపిణీకి కార్పొరేషన్ సిద్ధంగా ఉందన్నారు. అవసరమైతే నేషనల్ సీడ్స్, తెలంగాణ సీడ్స్, కర్ణాటక సీడ్స్ కార్పొరేషన్ల నుంచి విత్తనాలు సమీకరించి ఆర్బీకేల ద్వారా రైతులకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. -
పంటలకు మద్దతు ధర అరకొరేనా!
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వివిధ పంటలకు మద్దతు ధరలు ఆశాజనకంగా లేవని రాష్ట్ర వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. వివిధ పంటల సాగు ఖ ర్చుల ప్రకారం స్వామినాథన్ సిఫార్సులను అమలు చేయా లని తాము కోరితే కేంద్రం పెడచెవిన పెట్టిందని అంటున్నాయి. కేంద్రం విదిల్చే లెక్క ప్రకారం రైతులు పండించిన పంటకు వచ్చేది నష్టమే తప్ప లాభం లేదని అంటున్నాయి. 2023–24 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ సీజన్లలో రైతు లు పండించే పంటలకు కేంద్రం బుధవారం ప్రకటించిన కొత్త మద్దతు ధరలు భరోసా ఇచ్చే పరిస్థితి లేదంటున్నాయి. సీఏసీపీకి ఇచ్చిన నివేదికల ప్రకారం..: రాష్ట్రంలో రైతులు పంటల సాగుకు పెడుతున్న పెట్టుబడి ఖర్చులపై రాష్ట్ర వ్యవ సాయశాఖ భారత వ్యవసాయ వ్యయ, ధరల కమిషన్ (సీఏసీపీ)కి నివేదించింది. సీఏసీపీకి రాష్ట్ర వ్యవసాయశాఖ పంపిన నివేదికల ప్రకారం తెలంగాణలో క్వింటా వరి సాధారణ (కామన్) రకం ధాన్యానికి రూ. 3,300, ఏ గ్రేడ్ ధాన్యం పండించాలంటే రూ. 3,400, పత్తికి రూ. 11 వేలు, మొక్కజొ న్నకు రూ. 2 వేలు, సోయా పంటకు రూ. 4,500 రైతు గతే డాది ఖర్చు చేశారు. ఈ ఖర్చులకు స్వా మినాధన్ సిఫార్సుల ప్రకారం 50 శాతం అదనంగా కలపాల ని రాష్ట్రం సూచించింది. ఆ ప్రకారం మద్దతు ధరలను ఖరా రు చేయాలని కోరింది. ఉదాహరణకు పత్తి క్వింటాకు రూ. 11 వేలు ఖర్చు అయి తే, స్వామినాధన్ సిఫార్సుల ప్రకారం అందులో 50 శాతం కలపాలి. ఆ ప్రకారం మద్దతు ధరగా రూ. 16,500 ప్రకటించాలని రాష్ట్రం ప్రతిపాదించింది. అయితే కేంద్రం పత్తికి మద్ద తు ధర కేవలం రూ. 7,020 మాత్రమే ఖరారు చేసింది. స్వామినాధన్ సిఫార్సులను పక్కన పెట్టినా వాస్తవ ఖర్చు ప్రకారమైనా మద్దతు ధర ప్రకటించలేదన్న విమర్శలు ఉన్నాయి. స్వామినాథన్ సిఫార్సులు అమలుచేస్తున్నామని కేంద్రం చెప్పుకుంటోంది. కానీ క్షేత్రసాయి లెక్కలు అందుకు విరుద్ధంగా ఉన్నాయని వ్యవసాయశాఖ వర్గాలు అంటున్నాయి. -
‘రైతు వేదిక’లు ఇక ప్రజా వేదికలు
సాక్షి, హైదరాబాద్: ‘రైతు వేదిక’లు ఇక నుంచి ‘ప్రజా వేదిక’లుగా రూపాంతరం చెందనున్నాయి. రైతులకు సంబంధించిన సమావేశాలే కాకుండా ఇతర ప్రభుత్వ లబ్ధిదారులకు సంబంధించిన మీటింగులు పెట్టుకునేలా వీలు కల్పిస్తూ వ్యవసాయశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జిల్లాలకు అంతర్గత ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి అన్ని ప్రభుత్వ శాఖలూ తమ కార్యక్రమాలను రైతు వేదికగా ప్రజలకు తెలియజేసేందుకు ఏర్పాట్లు చేసుకోవచ్చు. ప్రభుత్వ పథక లబ్ధిదారులందరినీ రైతు వేదికల వద్దకు పిలిచి వారికి అవగాహన కల్పించొచ్చు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పింఛన్లు తదితర పథకాలపై అవగాహన కల్పించాలంటే ఇక రైతు వేదికలనే కేంద్రంగా చేసుకోవచ్చు. ఆ మేరకు మండల అధికారులు చర్యలు తీసుకోవాలని, వాటిని ఉపయోగించుకోవాలని వ్యవసాయశాఖ విజ్ఞప్తి చేసింది. వినియోగంలోకి తీసుకురావాలన్న ఉద్దేశంతోనే... వ్యవసాయ ఉత్పత్తిని పెంచాలన్న ప్రధాన లక్ష్యంతో పాటు సాంకేతిక వ్యవసాయంతో పాటు వివిధ అంశాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం రైతు వేదికలకు రూపకల్పన చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 2,601 రైతు వేదికలను ఏర్పాటు చేసింది. ఒక్కో రైతు వేదికకు ప్రభుత్వం రూ.12 లక్షలు ఖర్చు చేసింది. మైకులు, కుర్చీలు, ఇతర మౌలిక సదుపాయాలతో వీటిని సుందరంగా తీర్చిదిద్దారు. అయితే ఇప్పటివరకు అనుకున్నంత స్థాయిలో రైతు వేదికలు పూర్తి స్థాయిలో వినియోగంలోకి రాలేదన్న భావన సర్కారులో నెలకొంది. అందుకోసం ఇకపై అన్ని ప్రభుత్వ శాఖలు కూడా వీటిని వినియోగించుకోవాలని సూచించింది. వీటిని నిత్యం ఏదో ప్రభుత్వ కార్యక్రమం జరిగే కేంద్రాలుగా తీర్చిదిద్దాలన్నదే ప్రస్తుత నిర్ణయంలోని ఉద్దేశం. ప్రైవేట్ కార్యక్రమాలకూ ఇవ్వాలన్న ప్రతిపాదనలు... మండలానికి మూడు నాలుగు చొప్పున రైతు వేదికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రైతు వేదికలను ఆదాయ కేంద్రాలుగా మార్చాలని జిల్లాల్లోని కొందరు ప్రజాప్రతినిధులు వ్యవసాయశాఖ దృష్టికి తీసుకొచ్చారు. పెళ్లిళ్లు, పుట్టిన రోజు వేడుకలు, ఇతర శుభకార్యాలయాలకు ఇవ్వడం వల్ల ఆయా కేంద్రాలకు ఆదాయం సమకూరుతుందని, దీనివల్ల రైతు వేదికల నిర్వహణ భారం ప్రభుత్వంపై ఉండదని చెప్పుకొచ్చారు. అయితే దీనిపై ప్రభుత్వ వర్గాల్లో మాత్రం భిన్నమైన అభిప్రాయం నెలకొంది. అలా చేయడం వల్ల ప్రభుత్వ ఉద్దేశం పక్కదారి పడుతుందని అంటున్నారు. గతంలో ఒకట్రెండు చోట్ల ప్రభుత్వం దృష్టికి రాకుండానే రైతు వేదికలను పెళ్లిళ్లకు ఇచ్చారన్న ప్రచారం జరిగింది. దీంతో ప్రస్తుతానికి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ కార్యక్రమాలు, ఫంక్షన్లకు ఇవ్వొద్దని నిర్ణయించారు. -
ఎరువుల ప్రణాళిక ఖరారు...
సాక్షి, హైదరాబాద్: రాబోయే వానాకాలం సీజన్లో 24.60 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను అందుబాటులో ఉంచాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ఎరువుల ప్ర ణాళికను ఖరారు చేసింది. రాష్ట్రం పంపిన ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపిందని వ్యవసాయ వర్గాలు వెల్లడించాయి. కేంద్రం కేటాయించిన ఎరువులు వానాకాలం సీజన్కు పూర్తిస్థాయిలో సరిపోతాయని తెలిపాయి. ఎరువుల్లో అత్యధికంగా 9.50 లక్షల మెట్రిక్ ట న్నుల యూరియా కేటాయించారు. 9.40 లక్షల మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులను, 2.30 లక్షల మెట్రిక్ టన్నుల డీఏపీ, 1.25 లక్షల మెట్రిక్ టన్నుల పొటాష్, లక్ష మెట్రిక్ టన్నుల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను కేటాయించినట్లు వ్యవసాయశాఖ తెలిపింది. కాగా, ఏడాదికేడాదికి యూరియా వాడకం తగ్గుతోందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పచ్చరొట్ట విత్తనాలను సరఫరా చేయడం వల్ల, గతం కంటే ఐదారు వేల మెట్రిక్ టన్నుల యూరియా వాడకం తగ్గుతోందంటున్నారు. మండలాలకు ఎరువుల సరఫరా... వచ్చే నెల మొదటి వారంలో వానాకాలం సీజన్ ప్రారంభం కానుంది. ఒక వర్షం పడితే చాలు రైతులు దుక్కులు దున్నుతారు. దీంతో ముందస్తుగా మొదటి దఫా ఎరువులను మండలాలకు సరఫరా చేసినట్లు వ్యవసాయశాఖ వెల్లడించింది. మండలాల్లోని అన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (ప్యాక్స్), ఆగ్రోస్ రైతు సే వా కేంద్రాల ద్వారా ఎరువులను సరఫరా చేశా రు. రైతులకు ఎరువులు నిత్యం అందుబాటు లో ఉండేలా చూడాలని ప్యాక్స్, రైతు సేవా కేంద్రాలను వ్యవసాయశాఖ ఆదేశించింది. ఎరు వుల కొరత రాకుండా, ఎక్కడా బ్లాక్ మార్కెటింగ్ జరగకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. కాగా, ఎరువులను రేక్ పాయింట్ల నుంచి రవాణా చేసేందుకు మార్క్ఫెడ్ ఇటీవల ప్రైవేట్ ఏజెన్సీలను ఎంపిక చేసింది. మొత్తం 20 రేక్ పాయింట్ల నుంచి ఎరువులను తీసుకెళ్లేందుకు మూడు ఏజెన్సీలకు అవకాశం ఇచ్చింది. అందులో ఒక ఏజెన్సీకే 18 రేక్ పాయింట్లు వచ్చాయి. మిగిలిన రెండు రేక్ పాయింట్లు మరో రెండు ఏజెన్సీలకు ఒక్కొక్కటి చొప్పున ఇచ్చారు. ఎరువుల రవాణా కోసం రూ. 96 కోట్లు ఖర్చు కానుంది. -
రైతులకు చైతన్యమేదీ?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతులకు, వ్యవసాయశాఖ అధికారులకు మధ్య దూరం పెరుగుతోంది. రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వడంలో వ్యవసాయశాఖ వైఫల్యం కనిపిస్తోంది. మూడేళ్ల క్రితం వరకు సీజన్ ప్రారంభానికి ముందు మే నెలలో వారంపాటు రైతు చైతన్య యాత్రలను వ్యవసాయ శాఖ నిర్వహించేది. సీజన్కు ముందు రైతులకు కొత్త వంగడాలు, పథకాలు, పంట రుణాలు, సాగునీటి వసతి, వర్షపాతం, విద్యుత్ తదితర అంశాలపై అవగాహన కల్పించేవారు. ఎలాంటి పంటలు వేసుకోవాలో కూడా సూచించేవారు. ప్రతీ గ్రామంలో రైతు చైతన్య యాత్రలు జరగడం వల్ల కిందిస్థాయిలో రైతులకు, అధికారులకు మధ్య సంబంధాలు ఉండేవి. కానీ ఇప్పుడు రైతు చైతన్య యాత్రలు నిలిచిపోవడంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. లక్షలాది రైతులకు దూరం గతంలో రైతు చైతన్య యాత్రలకు వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్, పశు సంవర్థకశాఖ తదితర అనుబంధ శాఖల అధికారులు హాజరయ్యేవారు. సీజన్కు సన్నద్ధతపై వివరించేవారు. కొత్త వంగడాలు, విత్తనాలు ఎప్పుడు చల్లాలి, ప్రభుత్వ పథకాలు, ఎలాంటి పంటలకు డిమాండ్ ఉందనే విషయాలను చెప్పేవారు. సీజన్ను త్వరగా ప్రారంభించేలా చైతన్యం కలిగించేవారు. అలాగే వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించేవారు. పంట రుణాలపై బ్యాంకర్లు చెప్పేవారు. మోటార్లకు విద్యుత్ అందించే విషయంలో వివరించేందుకు విద్యుత్ అధికారులు.. సాగునీటి వసతి, కాలువల్లో నీటిని వదిలే విషయాలను వెల్లడించేందుకు నీటిపారుదల అధికారులు హాజరయ్యేవారు. ఇతరత్రా అన్ని రకాల వివరాలను చెప్పేందుకు రెవెన్యూ అధికారులు కూడా వచ్చేవారు. ఒకరకంగా రైతులకు ఇదో వర్క్షాప్ మాదిరిగా ఉండేది. ఇలా రాష్ట్రంలోని మొత్తం 12 వేల గ్రామాల్లో చైతన్య యాత్రలు నిర్వహించేవారు. దాదాపు 10 లక్షల మంది హాజరయ్యేవారని వ్యవసాయవర్గాలు చెప్పాయి. ప్రత్యామ్నాయంగా నిలవని రైతు వేదికలు రాష్ట్రంలో ప్రభుత్వం దాదాపు 2,500 రైతు వేదికలను ఏర్పాటు చేసింది. ఒక్కో ఏఈవో కేంద్రంగా వీటిని నెలకొల్పింది. వాటిల్లో రైతులకు శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు చేసింది. కానీ రైతు వేదికలు ఆ మేరకు సేవలు అందించలేకపోతున్నాయన్న విమర్శలున్నాయి. రైతు చైతన్య యాత్రలు ప్రతీ గ్రామంలో కొనసాగేవి. కానీ రైతు వేదికలు చైతన్య యాత్రలకు ప్రత్యామ్నాయంగా నిలవడంలేదు. అదీగాక కిందిస్థాయిలో ఉన్న ఏఈవోలకు రైతుల వద్దకు వెళ్లి అవగాహన కల్పించే పరిస్థితి లేదు. అలాగే, రైతు వేదికలకు వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్, పశుసంవర్థక, మత్స్య, విద్యుత్, సాగునీటిపారుదల తదితర శాఖల అధికారులు వచ్చే పరిస్థితి లేదు. గత నెలన్నర రోజులుగా అకాల వర్షాలతో లక్షలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నా రైతులకు సలహాలు ఇవ్వడంలో వ్యవసాయశాఖ వైఫల్యం కనిపిస్తోంది. కనీసం క్షేత్రస్థాయికి వెళ్లడానికి కూడా రాష్ట్రస్థాయి అధికారులు ఆసక్తి ప్రదర్శించడంలేదన్న ఆరోపణలున్నాయి. కాగా, వ్యవసాయ అధికారులకు రైతుబంధు, రైతుబీమా పనులు, ఇతరత్రా రోజువారీ సమాచార సేకరణ, ఆ డేటా అప్లోడ్ వంటి పనులతోనే సరిపోతోందన్న వాదన ఉంది. -
70 లక్షల ఎకరాల్లో పత్తి సాగు
సాక్షి, హైదరాబాద్: వచ్చే వానాకాలం సీజన్లో 70 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయాలని వ్యవసాయశాఖ లక్ష్యంగా ప్రకటించింది. కనీసం 60 లక్షల నుంచి 65 లక్షల ఎకరాల్లో సాగయ్యేలా చూడాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నూతన సచివాలయంలోని వ్యవసాయశాఖ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన తొలి సమీక్షలో వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అధికారులతో మాట్లాడారు. రానున్న వానాకాలంలో 1.40 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు చేయాలని పేర్కొన్నారు. మరో 14 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు వేసేలా చూడాలన్నారు. అందుకనుగుణంగా వ్యవసాయశాఖ సమాయత్తం కావాలని ఆదేశించారు. పత్తితోపాటు కంది సాగును మరింత ప్రోత్సహించాలని, ప్రస్తుతం వివిధ పంటల సాగుకు అవసరమయ్యే 18 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. సేంద్రీయ సాగు, భూసారాన్ని దృష్టిలో ఉంచుకుని పచ్చిరొట్ట విత్తనాల సరఫరాకు చర్యలు తీసుకోవాలనీ దీనికి రూ.76.66 కోట్లు నిధుల విడుదల చేయాలని చెప్పారు. ఆయిల్పామ్ సాగులో అంతర పంటల సాగుకై డీసీసీబీల ద్వారా ఎకరానికి రూ.40 వేలు వరకు పంటరుణాలు అందించాలని సూచించారు. ప్రతీ ఏడాది మార్చి చివరి వరకు యాసంగి కోతలు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటే వడగళ్ల వానల నుంచి నష్టాన్ని నివారించవచ్చని నిరంజన్రెడ్డి సూచించారు. వానాకాలం సాగు సమయంలోనే యాసంగి వరి సాగు నారుమళ్లకు అవసరమయ్యే భూమిని వదులుకోవాలని చెప్పారు. బాన్సువాడ, బోధన్, హుజూర్నగర్, మిర్యాలగూడల మాదిరిగా వరి సాగు సీజన్ ముందుకు జరపాలని సూచించారు. -
Telangana: కల్లాల్లో కన్నీళ్లు
సాక్షి, హైదరాబాద్/సాక్షి, నెట్వర్క్: రాష్ట్రంలో నాలుగు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు రైతులకు కన్నీళ్లు మిగుల్చుతున్నాయి. ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన వర్షాలతో కోతకు వచ్చిన వరి పొలంలోనే నేలరాలింది. కోసి పెట్టిన ధాన్యం నీట మునిగింది. కొనుగోలు కేంద్రాల్లో కుప్పలు వరదకు కొట్టుకుపోయాయి. 4.5 లక్షల ఎకరాల్లో వివిధ పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనా వేసినా.. ఒక్క వరి పంటే ఐదు లక్షల ఎకరాలకుపైగా దెబ్బతిన్నట్టు క్షేత్రస్థాయి పరిశీలనలో తెలుస్తోంది. కొన్నిచోట్ల ఎకరా పొలంలో కనీసం క్వింటాల్ ధాన్యం కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. ఒక్క వరి మాత్రమే కాదు.. మామిడి, నువ్వులు, మిరప, మొక్కజొన్న, టమాటా వంటి ఇతర పంటలు కూడా వడగళ్ల బీభత్సానికి తీవ్రంగా దెబ్బతిన్నాయి. వడగళ్లు, ఈదురుగాలుల కారణంగా సంగారెడ్డి, జగిత్యాల, సిద్దిపేట, కరీంనగర్, ఖమ్మం, సూర్యాపేట తదతర జిల్లాల్లో మామిడి భారీగా నేలరాలింది. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నల్లగొండ, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో పంట నష్టం అత్యధికంగా.. ఖమ్మం, ఆదిలాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాల్లో కాస్త తక్కువగా ఉంది. ఈదురుగాలులు, వడగళ్లతో అధిక నష్టం వేసవిలో అకాల వర్షాలు మామూలే అయినా.. ఈసారి తీవ్రమైన ఈదురుగాలులు, వడగళ్లతో ఒక్కసారిగా భారీ వర్షాలు కురుస్తుండటం తీవ్ర నష్టానికి కారణం అవుతోందని వ్యవసాయ నిపుణులు చెప్తున్నారు. పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో పలుచోట్ల ఎకరానికి క్వింటాల్ వడ్లు కూడా వచ్చే పరిస్థితి లేదని.. వరికోత కోసం తెచ్చే హార్వెస్టర్ అద్దెకు సరిపడా ధాన్యం కూడా వచ్చేలా లేదని రైతులు వాపోతున్నారు. పొలాలను కౌలుకు తీసుకొని వరిసాగు చేసిన రైతులకు మరింత దెబ్బపడింది. కౌలు, పెట్టుబడి కలిపి ఒక్కో ఎకరాకు 20వేలకుపైనే నష్టపోతున్నామని, ప్రభుత్వమే ఆదుకోవాలని వారు కోరుతున్నారు. తడిసిన ధాన్యం ముందుగా వరి సాగు చేసిన నిజామాబాద్, కామారెడ్డి, సూర్యాపేట, నల్లగొండతోపాటు వరంగల్, కరీంనగర్, పెద్దపల్లి తదతర జిల్లాల్లో కోతలు మొదలయ్యాయి. 2వేలకుపైగా కేంద్రాలను ఏర్పాటు చేసినా ఇంకా కొనుగోళ్లు మొదలుపెట్టలేదు. రైతులు తెచ్చిన పంటను కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోశారు. అకాల వర్షాలతో అంతా తడిసిపోయింది. పలుచోట్ల కొట్టుకుపోయింది. మొత్తంగా 5 లక్షల టన్నుల ధాన్యం తడిసినట్టు పౌరసరఫరాల సంస్థ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రకృతి బీభత్సం నేపథ్యంలో వరి దిగుబడి భారీగా తగ్గే అవకాశం ఉందని.. కోటి టన్నుల సేకరణ అంచనా వేసుకున్నా, అందులో సగమైనా వస్తుందా అన్న అనుమానాలు ఉన్నాయని అంటున్నారు. ఏడెకరాల్లో నష్టపోతే అర ఎకరమే రాశారు నేను ఏడెకరాల్లో మొక్కజొన్న సాగు చేశా. గత నెలలో కురిసిన వానలకు పంట పూర్తిగా నేలవాలింది. అయినా అధికారులు అర ఎకరమే నష్టం జరిగినట్లు రాశారు. మిగిలిన కాసింత పంటనూ వ్యాపారులు తక్కువ ధరకే అడుగుతున్నారు. నష్టమెలా పూడ్చుకోవాలో తెలియడం లేదు. – వరి మేకల నాగయ్య, రైతు, సువర్ణాపురం, ముదిగొండ మండలం రాళ్లవాన ముంచింది మూడెకరాల్లో వరి వేసిన. తెల్లారి కోద్దామనుకుంటే.. రాత్రి మాయదారి రాళ్లవాన నిండా ముంచింది. గింజలన్నీ మట్టిలో కలిసిపోయాయి. సర్కారు ఆదుకోవాలి. లేకుంటే కుటుంబం రోడ్డుపడుతుంది. – గుగులోతు నీల, మహిళా రైతు, ఆంధ్ర తండా, జనగామ జిల్లా పావు మందమే వడ్లు మిగిలాయి ఎనిమిది ఎకరాల్లో వరి సాగు చేసిన. వడగళ్ల వానతో పంటంతా నేలవాలి గింజలు రాలిపోయాయి. పావు మందమే వడ్లు మిగిలాయి. మిషిన్ పెట్టి కోయిస్తే గడ్డి మాత్రమే మిగులుతుంది. – రైతు ఆవుల మహేందర్, గర్రెపల్లి, సుల్తానాబాద్ పంట నష్టం అంచనాలివీ.. ఉమ్మడి కరీంనగర్లో.. కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలో లక్ష ఎకరాలకుపైగా వివిధ పంటలకు నష్టం వాటిల్లింది. ఇందులో వరి పంటే 80 వేల ఎకరాల్లో నష్టపోయింది. ఒక్క జగిత్యాల జిల్లాలోనే 50వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 60వేల మంది రైతులపై వర్షం ప్రత్యక్ష ప్రభావం చూపినట్టు అంచనా. మెదక్ ఉమ్మడి జిల్లాలో.. సిద్దిపేటలో పంట నష్టం అధికంగా ఉంది. ఈ జిల్లాలో 86,203 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, ఇందులో 79,350 ఎకరాల్లో వరికి నష్టం జరిగిందని వ్యవసాయ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. మెదక్లో 13,632 ఎకరాల్లో వరి, 342 ఎకరాల్లో మామిడి దెబ్బతిన్నాయి. మెదక్ జిల్లా పరిధిలోని కొనుగోలు కేంద్రాల్లో లక్షన్నర టన్నుల ధాన్యం తడిసినట్లు అనధికారిక అంచనా. సంగారెడ్డి జిల్లాలో నష్టం తక్కువగా ఉంది. ఉమ్మడి నిజామాబాద్లో.. కామారెడ్డి జిల్లాలో 22 వేల మంది రైతులకు సంబంధించిన పంటలు దెబ్బతిన్నట్టు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. మొత్తంగా 32 వేల ఎకరాల్లో పంటలు నష్టపోయినట్టు పేర్కొంది. నిజామాబాద్ జిల్లాలో వరి, మొక్కజొన్న, నువ్వు, పొద్దుతిరుగుడు, పసుపు, ఉద్యాన పంటలకు 600 ఎకరాల్లో నష్టం జరిగింది. నిజామాబాద్ మార్కెట్ యార్డులో పసుపు తడిసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో.. వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలో లక్షన్నర ఎకరాల వరకు వివిధ పంటలు నష్టపోయినట్టు సమాచారం. అయితే 75,603 ఎకరాల్లో వరి, మొక్కజొన్న, ఇతర పంటలు దెబ్బతిన్నట్టు అధికారులు అంచనా వేశారు. ఇందులో 58 వేల ఎకరాల్లో వరి, 10 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 7,603 ఎకరాల్లో ఇతర పంటలు ఉన్నట్టు పేర్కొన్నారు. జనగామలో వరి బాగా దెబ్బతింది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో.. మంచిర్యాల జిల్లాలో 2,379 ఎకరాల్లో వరి, 309 ఎకరాల్లో మామిడి.. ఆదిలాబాద్ జిల్లాలో 2వేల ఎకరాల్లో జొన్న పంటలకు నష్టం జరిగినట్టు అంచనా వేశారు. ఆసిఫాబాద్లో 3,419 ఎకరాల మేర పంటలు దెబ్బతిన్నట్టు గుర్తించారు. నల్లగొండ ఉమ్మడి జిల్లాలో.. సూర్యాపేట జిల్లాలో 25వేల ఎకరాలకుపైగా వరికి నష్టం వాటిల్లగా, సుమారు 1,000 ఎకరాల్లో మామిడి తోటలు నాశనమయ్యాయి. యాదాద్రి జిల్లాలో 11వేల ఎకరాల్లో వరి దెబ్బతిన్నది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో.. ఖమ్మం జిల్లాలో వరి 8,169 ఎకరాల్లో, మొక్కజొన్న 1751 ఎకరాల్లో నష్టపోయినట్టు కలెక్టర్కు వ్యవసాయ శాఖ నివేదించింది. -
Andhra Pradesh: సంపూర్ణ ‘మద్దతు’
రైతులు పండించిన ప్రతి పంటకూ మద్దతు ధర కల్పించాల్సిన బాధ్యత మనపై ఉంది. ఎక్కడైనా మద్దతు ధర లభించని పక్షంలో వెంటనే మార్కెట్లో జోక్యం చేసుకుని ఎమ్మెస్పీ దక్కేలా చర్యలు తీసుకోవాలి. పంటల ధరల పర్యవేక్షణకు తెచ్చిన ‘సీఎం యాప్’ విషయంలో మాక్ డ్రిల్స్ నిర్వహించాలి. యాప్ ద్వారా రోజువారీ పర్యవేక్షణ ఉండాలి. నిర్దేశించుకున్న విధంగా (ఎస్వోపీ) పనిచేసేలా పర్యవేక్షిస్తూ, లోపాలుంటే చక్కదిద్దుకుంటూ ముందుకెళ్లాలి. కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతన్నలను అక్కడకు వెళ్లండి.. ఇక్కడకు వెళ్లండంటూ తిప్పొద్దు. ఏ ఒక్క రైతన్న కూడా ఇబ్బంది పడటానికి వీల్లేదు. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రబీ ధాన్యం కొనుగోళ్ల సందర్భంగా ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకుండా పక్కాగా ఏర్పాట్లు చేయాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ధాన్యం సేకరించిన తర్వాత రైతులకు తప్పనిసరిగా రసీదు అందచేయడంతోపాటు అందులో కొన్ని సూచనలు తప్పనిసరిగా పొందుపరచాలన్నారు. నాణ్యతా ప్రమాణాలు ఎలా ఉండాలి? అందుకోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అనే వివరాలతో సూచనలు ఉండాలన్నారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి తీసుకొచ్చిన 1967 టోల్ఫ్రీ నంబర్ రసీదులో తప్పనిసరిగా ఉండాలని, దళారులు, మిల్లర్ల ప్రమేయానికి తావులేదని, ఎవరైనా ఫిర్యాదు చేస్తే తక్షణమే చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. కొనుగోళ్ల సందర్భంగా ఎవరైనా డబ్బులు డిమాండ్ చేసినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖలపై సమీక్షించిన ముఖ్యమంత్రి జగన్ ఉన్నతాధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ఆ వివరాలివీ.. విదేశాల్లో డిమాండ్ ఉన్న వంగడాల సాగు.. విదేశాల్లో డిమాండ్ ఉన్న వరి వంగడాలను సాగు చేయడంపై అన్నదాతలకు అవగాహన కల్పించాలి. ఆ విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాలి. దీనివల్ల ఎగుమతులు పెరిగి రైతులకు మంచి ధర వస్తుంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే మే నెలలో వైఎస్సార్ రైతు భరోసా తొలి విడత పెట్టుబడి సాయాన్ని జమ చేసేలా ఏర్పాట్లు చేయాలి. మే 10వతేదీ కల్లా అర్హులైన జాబితాలను సిద్దం చేయాలి ప్రతీ ఆర్బీకే పరిధిలో గోడౌన్ కొనుగోలు చేసిన పంట ఉత్పత్తులను నిల్వ చేసేందుకు వీలుగా దశలవారీగా ప్రతి ఆర్బీకే పరిధిలో ఒక గోడౌన్ ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకోవాలి. ఖరీఫ్ సీజన్ కోసం అవసరమైన నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలను ఆర్బీకేల ద్వారా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేయాలి. ఏటా పంపిణీ చేసే ఇన్పుట్స్ పెంచుకుంటూ వెళ్లాలి. పంపిణీ ప్రక్రియ మరింత సమర్థంగా ఉండాలి. ఆర్బీకేల్లో ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలి. మే 20వతేదీలోగా మిగిలిన ఆర్బీకేల్లో వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేసి సాగు ఉపకరణాల పంపిణీ చేపట్టాలి. జూలై కల్లా 500 ఆర్బీకేల పరిధిలో కిసాన్ డ్రోన్లు అందుబాటులోకి తెచ్చేలా సన్నద్ధం కావాలి. ఈ – కేవైసీ 97.5 శాతం రబీలో సాగైన 48.02 లక్షల ఎకరాల్లో పంటలను ఈ–క్రాప్ బుకింగ్ పూర్తి చేసినట్లు సమీక్షలో అధికారులు తెలిపారు. రైతులందరికీ డిజిటల్గానే కాకుండా భౌతికంగా కూడా రశీదులిచ్చి పౌరసరఫరాలు, మార్కెటింగ్ శాఖలకు డేటాను పంపినట్లు వివరించారు. ఈ–కేవైసీ 97.5 శాతం పూర్తైందన్నారు. రబీలో సాగైన పంట ఉత్పత్తుల కొనుగోలుకు అన్ని చర్యలు చేపట్టామని, తొలిసారిగా రైతులకు అందిస్తున్న గన్నీ బ్యాగులు, రవాణా ఖర్చుల చెల్లింపులు దాదాపుగా పూర్తి చేశామని చెప్పారు. ఖరీఫ్ సీజన్లో రూ.7,233 కోట్ల విలువైన ధాన్యాన్ని సేకరించగా ఇప్పటికే రూ.7,200 కోట్లు రైతులకు చెల్లించినట్లు వెల్లడించారు. సాంకేతిక కారణాల వల్ల మరో రూ.33 కోట్లు పెండింగ్లో ఉన్నట్లు తెలియచేయడంతో వాటిని పరిష్కరించి రైతులకు చెల్లింపులు జరిపేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. సమీక్షలో మంత్రులు కాకాణి గోవర్ధన్రెడ్డి, కారుమూరి వెంకట నాగేశ్వరరావు, వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, వ్యవసాయశాఖ సలహాదారు ఐ. తిరుపాల్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల ముఖ్య కార్యదర్శులు గోపాలకృష్ణ ద్వివేది, చిరంజీవి చౌదరి, వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్, ఉద్యాన, మార్కెటింగ్, పౌర సరఫరాల శాఖల కమిషనర్లు ఎస్ఎస్ శ్రీధర్, రాహుల్పాండే, హెచ్.అరుణ్కుమార్, విత్తనాభివృద్ధి, పౌరసరఫరాల సంస్థల ఎండీలు డాక్టర్ గెడ్డం శేఖర్ బాబు, జి.వీరపాండ్యన్ తదితరులు పాల్గొన్నారు. డ్రోన్ల వినియోగంపై ఎన్జీరంగా వర్సిటీ శిక్షణ ► జూలై నాటికి 500, డిసెంబర్ నాటికి 1,500 ఆర్బీకేల పరిధిలో కిసాన్ డ్రోన్లు సమకూర్చేలా కార్యాచరణ సిద్ధం. ► డ్రోన్ల వినియోగంపై తిరుపతి, కడప, మార్టేరు, విజయనగరంలో ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు. ► ఇప్పటికే 6,500 ఆర్బీకేల పరిధిలో యంత్ర సేవా కేంద్రాల ఏర్పాటు. మరో 3,953 ఆర్బీకేల పరిధిలో కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు (సీహెచ్సీ), 194 క్లస్టర్ స్ధాయి సీహెచ్సీలకు మే 20లోగా వైఎస్సార్ యంత్రసేవా పథకం ద్వారా సాగు ఉపకరణాలు అందించేలా సన్నద్ధం. ► ఆర్బీకేల స్ధాయి సీహెచ్సీలకు రూ.8.2 లక్షలు, క్లస్టర్ స్ధాయి సీహెచ్సీలకు రూ.25 లక్షల విలువైన యంత్రాలు అందుబాటులోకి. ► గతేడాది సుమారు 7 లక్షల టన్నులకు పైగా ఎరువుల సరఫరా. ఈ ఏడాది మరింత పెంచేలా చర్యలు. ► ఆర్బీకేల్లో 4,656 పశు సంవర్ధక, 1,644 ఉద్యాన, 467 వ్యవసాయ, 64 మత్స్య, 23 పట్టు సహాయకుల పోస్టుల ఖాళీల భర్తీకి చర్యలు. ► ప్రతి ఆర్బీకే పరిధిలో గోదాము నిర్మించే లక్ష్యంతో మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి. ఇప్పటికే 1,005 చోట్ల గోడౌన్ల నిర్మాణం చేపట్టగా 206 చోట్ల పూర్తి. తుది మెరుగులు దిద్దుకుంటున్న మరో 93 గోడౌన్లు. వివిధ దశల్లో గోదాములను జూలై కల్లా పూర్తి చేసేలా చర్యలు. -
రాష్ట్రంలోవిత్తన పరిశోధన, శిక్షణ సంస్థ
సాక్షి, అమరావతి: దేశంలోనే తొలి విత్తన పరిశోధన, శిక్షణా సంస్థ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు కాబోతుంది. కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలోని 8 ఎకరాల విస్తీర్ణంలో రూ.45 కోట్ల వ్యయంతో డాక్టర్ వైఎస్సార్ విత్తన పరిశోధన, శిక్షణా సంస్థ ఏర్పాటుకు వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. జాతీయ విత్తన పరిశోధన, శిక్షణా కేంద్రం ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉంది. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఈ తరహా కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. ధ్రువీకరించిన నాణ్యమైన విత్తనాలను రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామ స్థాయిలో రైతుల ముంగిటకు సరఫరా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఏపీ విత్తనాభివృద్ధి సంస్థకు అనుబంధంగా రాష్ట్ర స్థాయి విత్తన పరిశోధన సంస్థను ఏర్పాటు చేస్తోంది. ఈ ప్రాంగణంలో రాష్ట్ర స్థాయి విత్తన జన్యు బ్యాంక్, సీడ్ గ్రో అవుట్ టెస్ట్ ఫామ్, సీడ్ టెస్టింగ్ ల్యాబ్, గ్రీన్ హౌస్, సీడ్ ప్రాసెసింగ్, కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు, విత్తనాలు నిల్వ చేసేందుకు ప్రత్యేకంగా గోదాములు నిర్మించనుంది. రైతుల కోసం ట్రైనింగ్ సెంటర్తో పాటు వ్యవసాయ పట్టభద్రులు, పీజీ, డిపొ్లమా చదివే విద్యార్థుల సామర్థ్యాన్ని పెంపొందించడంతో పాటు ఈ రంగంలో పరిశోధనల వైపు అడుగు వేసే వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చేందుకు ట్రైనింగ్ సెంటర్, హాస్టల్ను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. సంస్థ లక్ష్యాలివే.. రాష్ట్రంలో విత్తన నాణ్యతను పరీక్షించే నెట్వర్క్ను బలోపేతం చేయడం, మానవ వనరుల అభివృద్ధి, సీడ్ సైన్స్, టెక్నాలజీలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయడం, ఈ రంగంలో ఉన్న ఇతర సంస్థలతో సమన్వయం చేసుకోవడం, ఏటా కనీసం 1,000 మంది అగ్రి గ్రాడ్యుయేట్స్, 2 వేల మంది అగ్రి డిపొ్లమా విద్యార్థులకు కెపాసిటీ బిల్డింగ్ ద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. వచ్చే ఏడాది ఖరీఫ్ నాటికి ఈ కేంద్రం సేవలను అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఉంది. కాగా, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ డాక్టర్ గెడ్డం శేఖర్బాబు మాట్లాడుతూ.. ఏ వాతావరణాన్ని అయినా తట్టుకోగలిగేలా, అధిక దిగుబడులనిచ్చే కొత్త రకాల విత్తనాలను రూపొందించడంలో, సంకర జాతులను అభివృద్ధి చేయడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. -
కడుపులో పెట్టుకుంటం: సీఎం కేసీఆర్
పంటలు దెబ్బతింటే తెలిసీ తెలియక నష్టపరిహారం అంటారు. కానీ వాస్తవంగా దీన్ని సహాయ పునరావాస చర్యలు అంటారు. నష్ట పరిహారం అనేది ప్రపంచంలో ఎవ్వరూ ఇవ్వలేరు. సాధ్యం కాదు కూడా. మళ్లీ రైతు పుంజుకుని వ్యవసాయం చేసుకునేందుకు వీలుగా సహాయ సహకారాలు అందించాలి. అందుకే ఎకరానికి రూ.10 వేలు ఇస్తున్నాం. – సీఎం కేసీఆర్ సాక్షి ప్రతినిధులు ఖమ్మం, కరీంనగర్/సాక్షి, మహబూబాబాద్, వరంగల్/దుగ్గొండి: ఇటీవలి అకాల వర్షాలకు రాష్ట్రంలోని 2,28,258 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని సీఎం కె.చంద్రశేఖర్రావు తెలిపారు. ప్రభుత్వం తరఫున సహాయ పునరావాస చర్యగా దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో రైతులకు ఎకరానికి రూ.10 వేల చొప్పున ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు రూ.228 కోట్లు గంటలోనే మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ఆ తర్వాత కరీంనగర్లో సంబంధిత జీవో కాపీని కూడా చూపించారు. ‘ఇది చాలా కాస్ట్లీ. ఎకరానికి రూ.10 వేలు ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా. ఈ పంట.. ఆ పంట అని కాకుండా దెబ్బతిన్న ప్రతి ఎకరాకు ప్రకటిస్తున్నా. తక్షణమే ఈ సహాయం బాధిత రైతులకు అందుతుంది..’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రైతులెవరూ అధైర్య పడొద్దని, అండగా ఉంటామని, కడుపులో పెట్టుకుని కాపాడుకుంటామని హామీ ఇచ్చారు. గురువారం ఆయన ఖమ్మం, కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో ఉన్నతాధికారులతో కలిసి పర్యటించారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రావినూతల, గార్లపాడు గ్రామాల్లో దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను పరిశీలించారు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం రెడ్డికుంట తండాలో మొక్కజొన్న, మిర్చి, మామిడి తోటలను, వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం అడవిరంగాపురంలో వరి, టమాట పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారికి భరోసా ఇచ్చారు. అడవి రంగాపురంలో పంట నష్టం చిత్రాలతో ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని సందర్శించారు. పలుచోట్ల మీడియాతో మాట్లాడారు. కేంద్రానికి చెప్పినా దున్నపోతు మీద వాన పడినట్టే.. ‘తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత రైతులకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేశాం. వ్యవసాయాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికతో మందుకెళ్తున్నాం. ఇటువంటి పరిస్థితిలో గాలి దుమారం, వడగళ్ల వాన రైతులను నిండా ముంచేసింది. మొక్కజొన్న 1,29,446 ఎకరాల్లో, వరి 72,709, మామిడి 8,865, ఇతర పంటలు 17,238 ఎకరాల్లో దెబ్బతిన్నాయి. నర్సంపేటలాంటి ప్రాంతాల్లో పంటలు గుర్తుపట్టలేనంతగా పాడయ్యాయి. కరీంనగర్లో 100 శాతం దెబ్బతిన్నాయి. నేను హైదరాబాద్ నుంచే ఎకరానికి రూ.3 వేలు చెల్లిస్తామని చెప్పి చేతులు దులుపుకోవచ్చు. కానీ రైతుల కష్టాలు నాకు తెలుసు. రైతులు బాధ తెలిసిన వాళ్లంగా రైతుల వద్దకు వచ్చి భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న కోడ్ ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు పెద్దగా రావు. ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం మరీ దుర్మార్గంగా, దౌర్భాగ్యంగా ఉంది. వారికి రాజకీయాలు తప్ప ప్రజలు లేరు.. రైతులు లేరు అనే పరిస్థితి ఉంది. చీఫ్ సెక్రటరీ, మేము పంటల నష్టంపై రాస్తే కేంద్ర బృందం వస్తుంది. ఎప్పుడు వస్తుందో.. ఏం సంగతో దేవునికి ఎరుక. వచ్చినా.. దొంగలు పడిన తర్వాత ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లుగా ఆరు నెలలకు కాని రూపాయి రాదు. కేంద్రం ఇస్తే మహద్భాగ్యంగా.. మొక్కజొన్నకు ఎకరానికి రూ.3,333, వరికి రూ.5,400, మామిడి తోటలు ధ్వంసం అయితే రూ.7,200.. ఇదీ ఉన్నటువంటి స్కేల్. ఇది ఏ మూలకూ సరిపోదు. గతంలో పంపినదానికి ఒక్క రూపాయి కూడా కేంద్రం ఇవ్వలేదు. ఈ విధానాలకు నిరసనగా మేం కేంద్రానికి పంట నష్టంపై నివేదిక పంపదలుచుకోలేదు. చెప్పదలుచుకోలేదు.. చెప్పినా దున్నపోతు మీద వానపడినట్టే. భగవంతుడు తెలంగాణకు ఆర్థిక శక్తి ఇచ్చాడు. మా రైతులను మేమే కాపాడుకుంటాం. వందశాతం మేమే ఆదుకుంటాం..’ అని కేసీఆర్ స్పష్టం చేశారు. రబ్బరు బంతిలా తిరిగి ఎగరాలి ‘ఖమ్మం జిల్లా జిల్లాలో కౌలు రైతుల సంఖ్య ఎక్కువగా ఉంది. వీరిని కూడా ఆదుకునేలా సీఎస్కు చెప్పి.. జిల్లా కలెక్టర్కు ప్రత్యేక ఆదేశాలు ఇప్పిస్తాం. డబ్బు రైతుకు ఇవ్వకుండా కౌలు రైతులను ఆదుకునేలా లిఖితపూర్వక ఆదేశాలు ఇస్తాం. పంట నష్టపరిహారం విషయంలో 2015 నాటి జీవోను కూడా సడలిస్తాం. అయితే మొత్తానికి కాకుండా ప్రస్తుతం కౌలు రైతులకు జరిగిన నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని జీవోను రివైజ్ చేస్తాం. తెలంగాణ ప్రభుత్వమే రైతు ప్రభుత్వం. ఎట్టి పరిస్థితుల్లో రైతులు నిరాశకు గురి కావద్దు. ధైర్యం కోల్పోవద్దు. రబ్బరు బంతిలా తిరిగి ఎగిరే విధంగా, జరిగిన నష్టానికి ఏమాత్రం చింతించకుండా భవిష్యత్తులో ఉన్నతమైన పంటలు గొప్పగా పండించే ఆలోచనకు పోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. వానల ముప్పు ఇంకా తొలగిపోలేదు. మరో రెండు మూడురోజుల్లో వడగళ్లు మళ్లీ పడవచ్చు. అయినా అధైర్య పడొద్దు..’ అని సీఎం అన్నారు. దేశంలోనే నంబర్ వన్గా తెలంగాణ ‘ఇప్పటికీ వ్యవసాయం దండగనే మూర్ఖులు, కొందరు మూర్ఖ ఆర్థికవేత్తలు ఉన్నారు. వ్యవసాయంతో ఏమీ రాదని చెప్పే వాళ్లూ ఉన్నారు. కానీ ఈ రోజు తెలంగాణ తలసరి ఆదాయం దేశంలోనే నంబర్ వన్గా ఉంది. జీఎస్డీపీ పెరిగితేనే తలసరి ఆదాయం పెరుగుతుంది. జీఎస్డీపీ పెరుగుదలలో వ్యవసాయం పాత్ర చాలా పెద్దగా ఉంది. లక్షలాదిమంది పొట్ట పోసుకోవడానికి, అనేక రకాల ఉపాధులు కల్పించేలా వ్యవసాయం రంగం ఉంది. ఒక అద్భుతమైన వ్యవసాయ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దినం. రాష్ట్రంలో వ్యవసాయం అత్యున్నత స్థితిలో ఉంది. వలస వెళ్లిన రైతును తిరిగి రప్పించి, రైతుబంధు, రైతుబీమా, ఉచిత నీరు, ఉచిత విద్యుత్తు, నీటితీరువా రద్దు తదితర సదుపాయాలు కల్పించాం. ఈ రోజు దేశం మొత్తం మీద చూస్తే తెలంగాణ కాకుండా ఇతర రాష్ట్రాలన్నింట్లో వరి 50 లక్షల ఎకరాలు ఉంటే.. ఒక్క తెలంగాణలోనే 56 లక్షల్లో ఈ పంట ఉంది. ఇది మనందరికీ గర్వకారణం. రైతులు ఏమాత్రం నిరాశకు గురి కావద్దు. ప్రభుత్వం అండగా ఉంటుంది. అద్భుతమైన వ్యవసాయ రాష్ట్రంగా రూపుదాల్చుతాం..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. కొత్త వ్యవసాయ పాలసీ రావాలి ‘దేశంలో ఒక పద్ధతి..పాడు అంటూ లేదు. ఇన్సూరెన్స్ కంపెనీలకు లాభం కలిగించే బీమాలే ఉన్నాయి తప్పితే.. పంట నష్టం జరిగినప్పుడు రైతుకు లాభం చేసే బీమాలు, కేంద్ర ప్రభుత్వ పాలసీలు లేవు. గత కేంద్ర ప్రభుత్వాలూ అంతే. ఇప్పుడున్న ప్రభుత్వమైతే చెవిటోడి ముందు శంఖం ఊదినట్టే ఉంది. వాళ్లకు చెప్పినా.. గోడకు చెప్పినా ఒకటేలా అన్నట్లు పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత ఒక మాట చెబుతున్నాం. కొత్త వ్యవసాయ పాలసీ రావాలి..’ అని కేసీఆర్ అన్నారు. మంత్రులు పువ్వాడ అజయ్కుమార్, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంఓ కార్యదర్శి స్మిత సబర్వాల్, సీఎంఓ అధికారి రాహుల్ బొజ్జ, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్రావు, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వరరెడ్డి, ఎంపీలు సంతోష్కుమార్, వద్దిరాజు రవిచంద్ర, పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీపీఎం, సీపీఐ కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ముఖ్యమంత్రి వెంట ఉన్నారు. బస్సులోనే మధ్యాహ్న భోజనం.. సమయం తక్కువగా ఉండడంతో సీఎం ఎక్కడా విరామం లేకుండా పర్యటించారు. ఖమ్మం నుంచి మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం రెడ్డికుంట తండాకు వచ్చిన కేసీఆర్.. ఉన్నతాధికారులు, మంత్రులు, ఎంపీలతో కలిసి బస్సులోనే మధ్యాహ్న భోజనం చేశారు. ముఖ్యమంత్రికి మంత్రి ఎర్రబెల్లి పెరుగన్నం వడ్డించారు. ధైర్యం చెప్పేందుకే వచ్చా.. కేసీఆర్ మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం రెడ్డికుంట తండాలో రైతు సోమ్లా నాయక్ పంటను పరిశీలించారు. అనంతరం ఆయనతో మాట్లాడారు. సీఎం: అరే...మిర్చి పంటంతా పాడైంది కదా.. ఈ చేను ఎవరిది? రైతు: నాదే అయ్యా...నా పేరు సోమ్లా నాయక్. సీఎం: ఎన్ని ఎకరాల్లో మిర్చి వేసినవ్...ఎంత కాలంగా సాగు చేస్తున్నావు? రైతు: ఈ ఏడు రెండెకరాల్లో వేసినా. పదేళ్ల నుంచి మిర్చి సాగు చేస్తున్నా. సీఎం: మిర్చి మీద లాభాలు వస్తున్నాయా? రైతు: పోయినేడు నష్టమే వచ్చింది. ఈ సంవత్సరం ధర మంచిగానే ఉంది. క్వింటాల్కు రూ.20 వేలకు పైగా పలుకుతుందనుకుంటే మాయదారి రాళ్ల వాన నట్టేట ముంచింది. సీఎం: అవును ఈ ఏడు మిర్చికి బాగానే ధర ఉంది. కానీ పంటంతా నష్టపోయావు. ఇలాంటి పరిస్థితిలోనే మనసు నిబ్బరం చేసుకోవాలి. నీకు ప్రభుత్వం అండగా ఉంటుంది. భవిష్యత్లో మరింత మెరుగ్గా వ్యవసాయం చేసుకునే విధంగా సౌకర్యాలు కల్పిస్తా. రైతు: అవును అయ్యా.. తెలంగాణ వచ్చిన తర్వాతే కరెంటు, నీళ్ల తిప్పలు పోయినయి. సీఎం: (రైతు భుజంపై చేయి వేసి) ఇది మన ప్రభుత్వం. రైతు ప్రభుత్వం. అందుకోసమే మీకు ధైర్యం కల్పించేందుకు వచ్చా. బాధ పడకండి..భయపడకండి. అటు తమ్మినేని.. ఇటు కూనంనేని.. కేసీఆర్ ఖమ్మం జిల్లా పర్యటనకు సీపీఎం, సీపీఐ కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు హాజరయ్యారు. రావినూతల, గార్లపాడు గ్రామాల్లో ఇద్దరు నేతలు సీఎం వెంటే ఉండి పంటల పరిశీలనలో పాల్గొన్నారు. జిల్లాలో పంట నష్టం వివరాలను తెలియజేయడంతో పాటు రైతులు, కౌలు రైతుల ఇబ్బందులను ఆయన దృష్టికి తెచ్చారు. ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడుతున్నప్పుడు కుడి, ఎడమ సీట్లలో కూర్చున్నారు. రైతులు, కౌలు రైతులను ఆదుకోవాలని కోరుతూ వినతిపత్రాలు అందజేశారు. -
రాజస్తాన్లోనూ ఏపీ తరహా రైతు సేవలు
సాక్షి, అమరావతి: ఏపీలో రైతులకు అందిస్తున్న సేవలు అద్భుతమని.. తమ రాష్ట్రంలో కూడా వాటి అమలుకు కృషి చేస్తామని రాజస్తాన్ వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు చెప్పారు. గతేడాది జూలైలో ఏపీలో పర్యటించిన రాజస్తాన్ వ్యవసాయ శాఖ మంత్రి లాల్చంద్ కటారియా ఆర్బీకే ద్వారా అందిస్తోన్న సేవలపై ప్రశంసలు కురిపించారు. ఈ తరహా సేవలను తమ రాష్ట్రంలో కూడా అమలు చేసేందుకు.. త్వరలోనే ఉన్నతాధికారుల బృందాన్ని పంపిస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో మంత్రి ఆదేశాల మేరకు ఆ రాష్ట్ర సీడ్ మార్కెటింగ్ చీఫ్ మేనేజర్ కేసీ మీనా నేతృత్వంలో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు అజయ్కుమార్ పచోరి, రాకేశ్ కుమార్ అతల్, దన్వీర్ వర్మ, తారాచంద్ బోచా లియా ఏపీకి వచ్చారు. బుధవారం గన్నవరంలోని ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్, ఆర్బీకే చానల్ను సందర్శించి.. వాటి పనితీరును అ«ధ్యయనం చేశారు. రాజస్తాన్లోని కాల్ సెంటర్ను కూడా ఏపీలో మాదిరిగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఆర్బీకే చానల్ నిర్వహణ, రైతు భరోసా మ్యాగజైన్, ఈ క్రాప్ నమోదు చాలా వినూత్నంగా ఉన్నాయని పేర్కొన్నారు. మరో 2 రోజుల పాటు ఆర్బీకే, ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్, ఇతర సేవలను అధ్యయనం చేసి.. తమ రాష్ట్రంలో కూడా ఈ తరహా సేవల అమలు కోసం నివేదిక అందజేస్తామన్నారు. పర్యటనలో ఆర్బీకేల జాయింట్ డైరెక్టర్ వల్లూరి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
రూ.1,654 కోట్లకు కేంద్రానికి ప్రతిపాదనలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా వ్యవసాయ, అనుబంధ రంగాల్లో వివిధ కార్యక్రమాల అమలుకు రాష్ట్రీయ కృషి వికాస యోజన (ఆర్కేవీవై), క్రిషోన్నతి పథకాల కింద 2023–24 సంవత్సరానికి రూ.1,654 కోట్లు కేటాయించాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపిస్తున్నట్టు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టే పథకాలకు నిధుల కేటాయింపుౖపై శుక్రవారం సచివాలయంలో జరిగిన సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. రాష్ట్రంలో వివిధ పంటల సాగు విస్తీర్ణం, ఉత్పత్తి పెంచడంతో పాటు వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు ఆర్కేవీవై, క్రిషోన్నతి యోజన కింద నిధుల కోసం కేంద్రం ప్రతిపాదనలు కోరిందని ఈ సందర్భంగా చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో నిధులు సమకూరుçస్తూ ఏటా ఈ పథకాలు అమలు చేస్తున్నాయన్నారు. ఆర్కేవీవై కింద ఈ ఏడాది రూ. 1,148 కోట్లకు కార్యాచరణ రూపొందించామని చెప్పారు. ఈ నిధులతో కిసాన్ డ్రోన్ టెక్నాలజీ ప్రోత్సాహం, భూసార పరిరక్షణ, సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు బిందు సేద్యానికి ప్రోత్సాహకాలు ఇవ్వడం, పొగాకుకు బదులుగా అపరాలు, నూనె గింజలసాగు పెంచడం వంటి కార్యక్రమాలు అమలు చేస్తామని తెలిపారు. అదేవిధంగా క్రిషోన్నతి యోజన కింద ఈ ఏడాది 506 కోట్ల రూపాయాలతో కార్యాచరణ రూపొందించామని చెప్పారు. వీటితోపాటు జాతీయ ఆహార భద్రత పథకం కింద 70 కోట్ల రూపాయలుర, జాతీయ నూనె గింజల పథకం కింద 29.50 కోట్ల రూపాయలు, రైతులకు నాణ్యమైన, ధ్రువీకరించిన విత్తనాలు అందించేందుకు 19 కోట్ల రూపాయలు, వ్యవసాయ విస్తరణ, శిక్షణకు రూ.36 కోట్లు, సమగ్ర ఉద్యాన అభివృద్ధి పథకం కింద రూ.200 కోట్లు మంజూరు చేయాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతున్నట్టు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్తో పాటు వ్యవసాయ, ఉద్యాన శాఖాధికారులు తదితరులు పాల్గొన్నారు.