
మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న కాంగ్రెస్ నేతలు
సాక్షి, హైదరాబాద్: రైతుల ఖాతాలో వెంటనే రైతుబంధు సొమ్ము జమ చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ బుధవారం రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిర్వహించింది. అలాగే, హైదరాబాద్లోని వ్యవసాయ శాఖ కమిషనరేట్ ముందు ఆందోళనకు దిగింది. కాగా, ఖరీఫ్ సీజన్లో రైతులకు పెట్టుబడి సాయం కింద ఇచ్చే రైతుబంధు నిధుల విడుదల విషయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చింది.
ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు రోజుల్లో ఈ నిధులు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని, లేదంటే ప్రత్యక్ష ఉద్యమాలకు దిగుతామని హెచ్చరిం చింది. ఈనెల 26 నుంచి రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలు, మండలాలు, నియోజ కవర్గాలు, జిల్లాల వారీగా రైతులను సమీకరించి ఉద్యమించాలని, అవసర మైతే ‘చలో హైదరాబాద్’కు పిలుపునివ్వాలని ఆ పార్టీ నేతలు నిర్ణయిం చారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి బుధవారం ఈ మేరకు ట్వీట్ చేశారు.
రైతుబంధు సాయం చేయండి.. పరిహారం ఇప్పించండి
ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రైతులకు ఇవ్వాల్సిన పెట్టుబడి సాయాన్ని వెంటనే అందించాలని టీపీసీసీ కిసాన్సెల్ డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం టీపీసీసీ కిసాన్సెల్ నేతలు బుధవారం వ్యవసాయ కమిషనరేట్ ముందు ఆందోళన నిర్వహించి ఉన్నతాధికారులకు వినతిపత్రం అందజేశారు.
అనంతరం గాంధీభవన్లో విలేకరుల సమావేశంలో ఏఐసీసీ కిసాన్సెల్ వైస్చైర్మన్ ఎం.కోదండరెడ్డి మాట్లాడుతూ మే నెలాఖరుకే రైతుబంధు నిధులు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ జూన్ నెలాఖరుకు కూడా ఇవ్వకుండా ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతోందని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment