
సాక్షి, విజయవాడ : విజయవాడ పాతబస్తీలోని గొల్లపాలెం సెంటర్లో ఉన్న మాంసం దుకాణాలపై ఆదివారం ఫుడ్సేఫ్టీ అధికారులు కొరడా ఝుళిపించారు. ఇష్టానుసారంగా ఎలాంటి అనుమతులు లేకుండా మేకలను చంపడమే గాక కుళ్లిపోయిన మాంసం విక్రయాలు చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో పలు షాపుల్లో నిల్వ ఉంచిన మాంసంను పరిశీలించగా అది కుళ్లిపోయి దాని నుంచి పురుగులు బయటికి వచ్చాయి. దీంతో వివిధ షాపుల్లో 10 రోజులకు పైబడిన 750 కిలోల మటన్తో పాటు నిల్వ ఉంచిన 70 మేక తలకాయలు స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా సాయి, సాంబశివరావు అనే వ్యక్తులకు చెందిన మటన్ షాపులను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు మీడియాతో మాట్లాడారు. నిల్వ చేసి ఉన్న మటన్లో పురుగులు ఉన్నాయని.. ఇలాంటి మాంసం తింటే ప్రజలు అనారోగ్యానికి గురవుతారని సూచించారు. మటన్, చికెన్ ప్రియులు తాజా మాంసాన్నే కొనలాని తెలిపారు. కాగా షాపుల నుంచి స్వాధీనం చేసుకున్న మాంసం శాంపిల్స్ను అధికారులు ల్యాబ్కు పంపించారు. ఇకపై నిల్వ ఉంచిన మాంసం విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. కాగా సాంపిల్స్ రిపోర్టు ఆధారంగా ఆయా షాపులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment