మళ్లీ తుపానుగా బలపడిన వాయుగుండం | Heavy rain forecast for the state | Sakshi
Sakshi News home page

మళ్లీ తుపానుగా బలపడిన వాయుగుండం

Published Sat, Nov 30 2024 5:31 AM | Last Updated on Sat, Nov 30 2024 5:31 AM

Heavy rain forecast for the state

ఫెంగల్‌ తుపానుగా రూపాంతరం 

నేటి మధ్యాహ్నం పుదుచ్చేరి సమీపంలో తీరం దాటే అవకాశం 

ప్రస్తుతం పుదుచ్చేరికి 270 కిమీ, చెన్నైకి 300 కి.మీ. 

దూరంలో కేంద్రీకృతం.. రాష్ట్రానికి భారీ వర్ష సూచన 

మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిక 

సందర్శకులు సముద్ర తీరం వద్దకు వెళ్లొద్దని సూచన 

సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: బలప­డ­టం.. బలహీనపడటం.. మళ్లీ బలపడటం.. ఇలా నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వా­యు­గుండం రోజు­కో రకంగా రూపాంతరం చెంది, శుక్ర­వారానికి తుపా­నుగా మారింది. తీవ్ర వాయుగుండం గమనాన్ని బట్టి మొదట తుపా­నుగా మారు­తుందని అంచనా వేసినా, గురువా­రానికి బలహీ­న­పడింది. కానీ, మళ్లీ పుంజుకొని గంటకు 13 కిలోమీటర్ల వేగంతో కదు­లుతూ శుక్రవారం మ«­ద్యా­హ్నం 2.30 గంటల ప్రాంతంలో ఫెంగల్‌ తు­పా­నుగా బలపడింది. 

వ్యతిరేక దిశలో ఉన్న షీ­ర్‌ జోన్‌ బలహీన­పడటం వల్లే వాయుగుండం మళ్లీ బలపడినట్లు వాతావ­రణ శాఖ అధికారులు తెలి­పారు. ఇది ప్రస్తుతం ట్రింకోమలికి 310 కిలో­మీ­ట­ర్లు, పుదు­చ్చేరికి తూర్పు ఆగ్నేయ దిశగా 270 కిలోమీ­టర్లు, చెన్నైకి ఆగ్నే­యంగా 300 కిలోమీ­టర్ల దూ­రంలో కేంద్రీకృతమై ఉంది. పశ్చిమ వాయవ్య దిశగా కదులు­తూ శనివారం మధ్యా­హ్నం లేదా సాయంత్రానికి పుదుచ్చేరికి సమీపంలోని కారైకల్, మహాబ­లిపురం మధ్య తీరాన్ని దాటే అవకా­శాలు­న్నాయని విశాఖ తుపా­ను హెచ్చ­రికల కేంద్రం అధికారులు తెలిపారు. 

తీరా­న్ని దాటే సమయంలో గంటకు 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయ­ని చెప్పా­రు. శనివారం అర్ధరాత్రి బలహీ­నపడి తీవ్ర వాయుగుండంగా మారుతుందని తెలి­పారు. దీని ప్రభావంతో శని, ఆదివా­రాల్లో  నెల్లూ­రు, అన్నమ­య్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో అక్క­డక్కడా అత్యంత భారీ వర్షాలు, కడప, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురు­స్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కోస్తాంధ్ర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు.

వేటకు వెళ్లొద్దు..
తుపాను ప్రభావంతో దక్షిణ కోస్తాలో తీరం వెంబడి గంటకు 60 నుంచి 80 కిమీ, ఉత్తర కోస్తాలో 40 నుంచి 60 కిమీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని అధికారులు తెలిపారు.  మత్స్యకా­రులు డిసెంబర్‌ 1 వరకూ వేటకు వెళ్లొద్దని సూచించారు. 

ఉత్తర కోస్తా జిల్లాల్లో సాధారణం కంటే 1.5 మీటర్లు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 2.7 నుంచి 3.3 మీటర్ల వరకూ ఎగసి పడుతూ అలలు అల్లకల్లోలం సృష్టిస్తాయని తెలిపారు. సందర్శకులు కూడా సముద్ర తీరానికి వెళ్లవద్దని సూచించారు.

పోర్టులకు హెచ్చరికలు
ఫెంగల్‌ తుపాను కారణంగా కృష్ణపట్నం పోర్టు­లో డేంజర్‌ సిగ్నల్‌ నం–6 జారీ చేశారు. విశాఖ­పట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కాకినా­డ, గంగవరం పోర్టుల్లో డిస్టెన్స్‌ వార్నింగ్‌ సిగ్నల్‌–­2 జారీ చేశారు. కళింగపట్నం, భీముని­పట్నం, వాడరేవు పోర్టుల్లోనూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement