
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వచ్చే నాలుగు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరం నుంచి వాయువ్య దిశలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్టు గురువారం తెలిపింది. ఫలితంగా ఉత్తరాంధ్రతోపాటు యానాం, దక్షిణ కోస్తాలో 8, 9, 10, 11 తేదీల్లో అక్కడక్కడా మెరుపులు, ఉరుములతో కూడిన భారీ, అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
రాయలసీమలో శుక్ర, శనివారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే వీలుందని తెలిపింది. కాగా, గురువారం రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలంలో 74.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. సీతంపేటలో 52.8, పెందుర్తిలో 45.6, ఆనందపురంలో 42.2, వేలేరుపాడులో 30.6, మంత్రాలయంలో 31.2, కూనవరంలో 20.4, నందికొట్కూరులో 24.4, కుకునూర్లో 25, వంగరలో 28.2, కోటనందూరులో 21.4, కోసిగిలో 21.6, సీతానగరంలో 20.4 మిల్లీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. కర్నూలు జిల్లాలో బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి.
Comments
Please login to add a commentAdd a comment