Heavy Rains in Andhra Pradesh
-
ఏపీలో ఓవైపు ముసురు.. మరోవైపు వర్షం.. ఇంకోవైపు గజగజలాడిస్తున్న చలి (ఫొటోలు)
-
ఏపీకి 4 రోజుల పాటు భారీ వర్షం
-
ఏపీ: వానలే వానలు.. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు (ఫొటోలు)
-
Cyclone Mandous: తీవ్ర తుపానుగా మాండూస్.. ఆ జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు
వైఎస్సార్ కడప జిల్లా: తుఫాను, భారీ వర్షాలు పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ప్రజలకు కలెక్టర్ విజయ రామరాజు హెచ్చరికలు జారీ చేశారు. జిల్లా కలెక్టరేట్తో పాటు నాలుగు రెవెన్యూ డివిజన్ల పరిధిలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు. తుఫాను బలపడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంతో పాటు కడప, బద్వేలు, జమ్మలమడుగు, పులివెందుల ఆర్డీవో కార్యాలయంలో 24 గంటలు పని చేసేలా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయం కంట్రోల్ రూమ్-08562 - 246344 కడప రెవెన్యూ డివిజన్.. కంట్రోల్ రూమ్-08562 - 295990 జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్ కంట్రోల్ రూమ్ -9440767485 బద్వేలు రెవెన్యూ డివిజన్ కంట్రోల్ రూమ్-9182160052 పులివెందుల రెవెన్యూ డివిజన్ కంట్రోల్ రూమ్- 7396167368 కొనసాగుతున్న మాండూస్ తుఫాను నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న మాండూస్ తుఫాను కొనసాగుతుంది. మామల్లపురంకి 135 కిలోమీటర్ల దూరంలో చెన్నైకి 170 కి.మీ.దూరంలో కేంద్రీకృతమైంది. ఈ అర్థరాత్రి, తెల్లవారుజామున శ్రీహరికోట మహాబలిపురం మధ్య తీరం దాటే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం పేర్కొంది. దీని ప్రభావం వలన రాయలసీమ దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. చిత్తూరు, నెల్లూరు, అన్నమయ్య, సత్య సాయి జిల్లా, వైఎస్సార్, ప్రకాశం జిల్లాలకు భారీ వర్ష సూచన. గంటకు 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఈ రోజు, రేపు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుపాను హెచ్చరికలతో ముందస్తు చర్యలు: మంత్రి కాకాణి తుపాను హెచ్చరికలతో ముందస్తు చర్యలు తీసుకున్నామని మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి అన్నారు. ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. పాఠశాలలకు సెలవులు ప్రకటించాం. లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేశామన్నారు. అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించి వసతులు ఏర్పాటు చేస్తామన్నారు. ఎండీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని మంత్రి వెల్లడించారు. నెల్లూరు జిల్లా ►మాండూస్ తుఫాన్ ఎఫెక్ట్తో జిల్లావ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు ►అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ►ముందస్తు చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేసిన మంత్రి ►తీరప్రాంత మండలాల్లో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించిన మంత్రి కాకాణి తిరుపతి జిల్లా ►బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుఫాను ప్రభావంతో అప్రమత్తంగా ఉండాలి: నగర పాలక సంస్థ కమిషనర్ అనుపమ అంజలి ►ఇప్పటివరకు తిరుపతి నగరంలో 10 లోతట్టు ప్రాంతాలను గుర్తించాం ►లోతట్టు ప్రాంతాల్లో త్వరితగతిన సహాయక చర్యలు చేపట్టాలని పిలుపు ►నగర పాలక సంస్థ తరపున హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేశాం తూర్పుగోదావరి జిల్లా ►మాండూస్ తుఫాన్ ప్రభావంతో గోదావరి జిల్లాల్లో మారిన వాతావరణం ►మేఘావృతంగా మారిన ఆకాశం పలు చోట్ల మోస్తరు వర్షం ►ఓడలరేవు, అంతర్వేది, కాట్రేనికోన ప్రాంతాల్లో ఎగసిపడుతున్న అలలు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ►మాండూస్ తుఫాన్ ప్రభావంతో అల్లకల్లోలంగా మారుతున్న సముద్రం ►అంతర్వేది, ఓడల రేవు తీరాల్లో స్వల్పంగా ఎగసిపడుతున్న అలలు ►వాతావరణశాఖ హెచ్చరికలతో తీరానికి వచ్చేస్తున్న మత్స్యకారులు ►జిల్లా కేంద్రంతో పాటు, తీర ప్రాంతంలో మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటుచేసిన అధికారులు కాకినాడ జిల్లా ►మాండూస్ తుఫాన్ ఎఫెక్ట్.. కల్లోలంగా మారిన ఉప్పాడ తీరం ►కాకినాడ - ఉప్పాడ బీచ్ రోడ్డు పై ఎగసిపడుతున్న కెరటాలు ►పది మీటర్లు ముందుకు వచ్చిన సముద్రం ►అధికారుల హెచ్చరికలతో వేటను ఇవాళ, రేపు నిలిపివేసిన మత్స్యకారులు తిరుపతి జిల్లా ► నేటి మధ్యాహ్నం పాఠశాలలు, కళాశాలలకు సెలవు: జిల్లా కలెక్టర్ వెంకట రమణ రెడ్డి ►బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మాండూస్ తుఫానుగా మారిన నేపథ్యంలో నేటి మధ్యాహ్నం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అనంతరం జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు సెలవుగా ప్రకటన.. జిల్లా కలెక్టర్ కే వెంకట రమణ రెడ్డి ►సంబంధిత పాఠశాలలు కళాశాలలు వాటి యాజమాన్యాలు తప్పనిసరిగా ఈ ఆదేశాలు పాటించాలని లేనిచో కఠిన చర్యలు ఉంటాయని ఆదేశం నెల్లూరుకు పొంచి ఉన్న మాండూస్ తుపాను ముప్పు ►జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన కలెక్టర్ చక్రధర్ బాబు ►తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశం ►కలెక్టరేట్తో పాటు ,అన్ని మండలాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు ►ఆస్తి, ప్రాణనష్టం జరక్కుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచన ►పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ దిశానిర్దేశం చేస్తున్న కలెక్టర్ చక్రధర్ బాబు చిత్తూరు ►జిల్లాలోని పాఠశాలలు కళాశాలలకు ఈరోజు మధ్యాహ్నం నుంచి సెలవులు ప్రకటించిన జిల్లా కలెక్టర్ హరి నారాయణ ►పాఠశాల పునఃప్రారంభంపై తిరిగి సమాచారం ఇవ్వడం జరుగుతుందని అన్నారు. తిరుపతి జిల్లాపై మాండూస్ తుపాను ప్రభావం ►మాండుస్ తుఫాన్ ప్రభావంతో అర్ధరాత్రి నుంచి జిల్లా వ్యాప్తంగా భారీ ఈదురుగాలులు ►తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఆ మోస్తరుగా చిరుజల్లులు ►సముద్రతీర ప్రాంత మండలాలు తడ, సూళ్ళురు పేట,వాకాడు,కోట, లో రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తం ►మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు చేసిన రెవెన్యూ యంత్రాంగం ►ఈరోజు అర్ధరాత్రి తీరం దాటే అవకాశం వాతావరణ శాఖ అలెర్ట్ ►తీరం దాటే సమయంలో బలమైన ఈదురు గాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం సాక్షి, చెన్నై/అమరావతి: మాండూస్ తుపాను ప్రభావంతో.. పలు పోర్టుల్లో తుపాను హెచ్చరికలు జారీ అయ్యాయి. కడలూరు, పుదుచ్చేరి, నాగపట్నం, కారైకల్.. ఓడరేవుల్లో ఐదవ ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి. పార్క్లు, బీచ్లు మూసేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. బంగాళాఖాతంలో మాండూస్ తుపాను కేంద్రీకృతం. సాయంత్రం కల్లా మహాబలిపురం-పాండిచ్చేరి మధ్య తీరం దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది మాండూస్. తుపాను తాకే సమయంలో గంటకు 85 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది వాతావరణ శాఖ. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) #CycloneMandous intensified to a #SevereCyclonicStorm,will make landfall near #Chennai b/w #Puducherry & #Sriharikota, around #Mahabalipuram. Wind speed Max 65-75 gusting to 85 kmph around midnight of 09th Dec as a #CyclonicStorm. #MandousCyclone (Visuals - Marina Beach) pic.twitter.com/w2k9CZoi8c — Sitam Moharana(ANI) (@SitamMoharana) December 8, 2022 తీర ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. ఉత్తర తమిళనాడు, పాండిచ్చేరి, ఏపీకి సంబంధించి.. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలపై తుపాను ప్రభావం పడనుంది. చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, అనంతపురం జిల్లాలకు భారీ వర్ష సూచన. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అన్నిచోట్లా ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకైనా సిద్ధమని అధికార యంత్రాంగాలు ప్రకటించాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుపాను మరింత బలపడి తీవ్ర తుపానుగా మారింది. పశ్చిమ వాయవ్య దిశగా పయనించి.. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి మధ్య మహాబలిపురం వద్ద శుక్రవారం అర్దరాత్రి తీరం దాటే అవకాశం ఉంది. దీని వల్ల పుదుచ్చేరి, శ్రీహరికోట, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వెంట 65 కిలోమీటర్ల నుంచి 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నెల్లూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు పడతాయి. రాయలసీమలోని చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, అనంతపురం, వైఎస్సార్ జిల్లాల్లోనూ ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. మత్స్యకారులు ఈ నెల 10 వరకు సముద్రంలో వేటకు వెళ్లవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ అంబేడ్కర్ సూచించారు. రాష్ట్రంలో తుపాను ప్రభావం చూపే ఆరు జిల్లాల్లోని 210 మండలాల్లో అధికారులను అప్రమత్తం చేస్తున్నామని తెలిపారు. ఏపీ అలర్ట్ ద్వారా ఇప్పటికే ఆరు జిల్లాలో హెచ్చరిక సందేశాలు పంపామన్నారు. -
Rain Alet: దక్షిణ కోస్తా వైపునకు వాయుగుండం!.. భారీ వర్షాలకు అవకాశం
సాక్షి, విశాఖపట్నం: దక్షిణ అండమాన్ సముద్రానికి ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 5వ తేదీన అల్పపీడనం ఏర్పడనుంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తూ ఏడో తేదీ ఉదయానికి వాయుగుండంగా బలపడనుంది. అనంతరం అదే దిశలో పయనిస్తూ నైరుతి బంగాళాఖాతంలోకి చేరుతుంది. క్రమంగా కదులుతూ ఎనిమిదో తేదీ ఉదయానికి ఉత్తర తమిళనాడు–పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్ర తీరానికి చేరుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శుక్రవారం రాత్రి నివేదికలో తెలిపింది. తొలుత ఈ వాయుగుండం దక్షిణ తమిళనాడు–పుదుచ్చేరి తీరాలకు చేరుకుంటుందని ఐఎండీ అంచనా వేసింది. తాజా అంచనాల ప్రకారం దిశ మార్చుకుని దక్షిణ కోస్తాంధ్ర తీరానికి చేరువయ్యే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావం ఈ నెల ఆరో తేదీ తర్వాత దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమపై ఉంటుందని తెలిపింది. వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల విస్తారంగా, ఉత్తర కోస్తాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు ప్రస్తుతం రాష్ట్రంపైకి ఈశాన్య, తూర్పు గాలులు వీస్తున్నాయి. ఫలితంగా రానున్న రెండు రోజులు ఉత్తర కోస్తాంధ్రలో పొడి వాతావరణ కొనసాగనుంది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో శనివారం ఒకటి, రెండుచోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని ఐఎండీ వివరించింది. చదవండి: మరోసారి గొప్ప మనసు చాటుకున్న సీఎం జగన్ -
బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. మరోవైపు అల్పపీడన ద్రోణి మధ్య బంగాళాఖాతం నుంచి ఉపరితల ఆవర్తన ప్రాంతం వరకు కొనసాగుతోంది. ఈ అల్పపీడనం రానున్న 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉంది. ఇది వాయవ్య దిశగా కదులుతూ 12వ తేదీ వరకు తమిళనాడు, పుదుచ్చేరి తీర ప్రాంతాలకు విస్తరిస్తుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) బుధవారం రాత్రి విడుదల చేసిన బులెటిన్లో వెల్లడించింది. ఈ ప్రభావంతో గురువారం ఉత్తర కోస్తాలో అక్కడక్కడ, దక్షిణ కోస్తాలో అనేక చోట్ల, రాయలసీమలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శుక్ర, శనివారాల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల, ఉత్తర కోస్తాలో కొన్ని ప్రాంతాల్లోనూ మోస్తరు వర్షాలకు ఆస్కారం ఉందని పేర్కొంది. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవవచ్చని వివరించింది. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు కూడా సంభవించే అవకాశం ఉందని తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో రానున్న మూడు రోజులు రాష్ట్రంలో తీరం వెంబడి గంటకు 40–45, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, సముద్రం అలజడిగా ఉంటుందని తెలిపింది. తీరాల వెంబడి శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సూచించారు. -
ఏపీకి మరో అల్పపీడనం.. విస్తారంగా వర్షాలు!
సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న భూమధ్య రేఖా ప్రాంతంలోని హిందూ మహాసముద్రంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది. దీని ప్రభావంతో గురువారం నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) మంగళవారం రాత్రి నివేదికలో తెలిపింది. అనంతరం ఈ అల్పపీడనం 11వ తేదీ వరకు వాయవ్య దిశగా తమిళనాడు, పుదుచ్చేరి తీరం వైపు కదులుతుందని పేర్కొంది. అల్పపీడనం ప్రభావంతో ఈనెల 11, 12 తేదీల్లో రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. అల్పపీడనం కారణంగా కోస్తా తీరం వెంబడి గంటకు 45–55, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, ఫలితంగా సముద్రం అలజడిగా మారుతుందని తెలిపింది. అందువల్ల మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని సూచించింది. -
10, 11 తేదీల్లో గాలులు, వానలు
సాక్షి, విశాఖపట్నం: మరో రెండు రోజుల్లో రాష్ట్రంలో మళ్లీ వానలు మొదలుకానున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో బుధవారం (రేపు) అల్పపీడనం ఏర్పడిన తరువాత ఈ వర్షాలు మరింత ఊపందుకోనున్నాయి. ఈ అల్పపీడనం వాయవ్యదిశగా తమిళనాడు, పుదుచ్చేరిల వైపు పయనించనుంది. దీని ప్రభావంతో బుధవారం ఒకటిరెండు చోట్ల తేలికపాటి వర్షాలకు ఆస్కారం ఉందని, ఈనెల 10వ తేదీ నుంచి దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని, గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం రాత్రి నివేదికలో వెల్లడించింది. 11వ తేదీ నుంచి కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అల్పపీడన ప్రభావంతో వీచే ఈదురుగాలులతో సముద్రం అలజడిగా మారుతుందని, అందువల్ల మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. సోమవారం విజయనగరం, శ్రీసత్యసాయి, చిత్తూరు, అల్లూరి సీతారామరాజు, అనంతపురం జిల్లాల్లో చిరుజల్లులు కురిశాయి. -
Rain Forecast: వచ్చే రెండు రోజులు వర్షాలు
సాక్షి,అమరావతి: రాబోయే రెండ్రోజులూ కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో శ్రీలంక తీరప్రాంతం మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, ఈశాన్య రుతు పవనాల ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, నెల్లూరు, తిరుపతి, వైఎస్సార్, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో బుధవారం పలుచోట్ల తేలికపాటి వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, అంబేద్కర్ కోనసీమ, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, నంద్యాల, కర్నూలు, వైఎస్సార్, అనంతపురం జిల్లాల్లో గురువారం అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు, మిగిలిన చోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. ఇక మంగళవారం అనంతపురం, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. నెల్లూరు జిల్లా బోగోలు మండలంలో 13 సెం.మీ., అనంతపురం జిల్లా కనేకల్లో 8.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. తిరుపతి జిల్లా మల్లంలో 7.9, వాకాడులో 5.7, పూలతోటలో 4.1, గునుపూడులో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
కొనసాగుతున్న కుండపోత వర్షాలు
సాక్షి, అమరావతి/నెట్వర్క్: రాష్ట్రంలోని పల్నాడు, గుంటూరు, బాపట్ల, పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాల్లోని పలుచోట్ల ఆదివారం భారీ వర్షాలు కురవగా మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. పల్నాడు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. ఆ జిల్లా వ్యాప్తంగా సగటున 10.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. బెల్లంకొండ మండలం పాపాయపాలెంలో 13.2 సెం.మీ. వర్షం పడింది. కారెంపూడి మండలం శంకరపురంసిద్ధాయిలో 8.6 సెం.మీ, నకరికల్లు మండలం చాగల్లులో 7.3, నాదెండ్ల మండలం గణపవరంలో 7, సత్తెనపల్లి మండలం కొమెరపూడిలో 6.5 సెం.మీ. వర్షం కురిసింది. ఇక కాకినాడ సిటీలో పలుచోట్ల 15–16 సెంటీమీటర్ల వర్షం పడింది. ప్రకాశం జిల్లా దర్శి మండలం ఈస్ట్ వీరయ్యపాలెంలో 6.1, అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చొప్పెలలో 6.1, పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో 5.9, గుంటూరు జిల్లా తాడికొండ మండలం బెజత్పురంలో 5.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. జిల్లాలోని నల్లడ్రెయిన్కు గండి పడింది. ఫలితంగా వందలాది ఎకరాల్లోకి నీళ్లు చేరాయి. ఎన్టీఆర్ జిల్లాలో ఆదివారం సగటు వర్షపాతం 28.6 మి.మీ., కృష్ణా జిల్లాలో 16.3 మి.మీ.గా నమోదైంది. ప్రకాశం జిల్లాలో శని, ఆదివారాల్లో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. ఒంగోలు నగరంలో ముసురుపట్టినట్లు రోజుకు నాలుగైదుసార్లుగా వర్షం పడుతూనే ఉంది. నల్లవాగు, చిలకలేరు వాగులు ప్రవహిస్తున్నాయి. మద్దిపాడు మండలంలోని గుండ్లకమ్మ వాగు ఎగువన కురిసిన వర్షాలకు మల్లవరం రిజర్వాయర్ ద్వారా శనివారం అర్ధరాత్రి నుంచి 8 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు పలు మండలాల్లో వర్షం కురిసింది. ప్రకాశం బ్యారేజ్కు భారీ వరద విజయవాడలోని ప్రకాశం బ్యారేజీలోకి ఎగువ ప్రాజెక్టుల నుంచి భారీగా వరద వచ్చి చేరుతోంది. ఆదివారం బ్యారేజీకి చెందిన 70 గేట్లను ఎత్తి వరద నీటిని సముద్రంలోకి వదిలేశారు. ఎగువ నుంచి 5,09,431 క్యూసెక్కుల వరద వస్తుండగా, కాలువలకు 2,827 క్యూసెక్కులు, సముద్రంలోకి 5,06,604 క్యూసెక్కులు వదులుతున్నారు. ఈ ఏడాది కృష్ణానదికి ఐదు లక్షల క్యూసెక్కుల పైబడి వరద రావడం ఇదే తొలిసారి. అలాగే, జూన్ 1 నుంచి ఆదివారం ఉ.6 గంటల వరకూ మొత్తం 1,035.768 టీఎంసీలు కడలిలో కలవడం గమనార్హం. అలాగే, నాగార్జునసాగర్లో 22 క్రస్ట్గేట్ల ద్వారా నీరు విడుదలవుతోంది. ఇక ఆదివారం సా. 6 గంటలకు శ్రీశైలంలోకి 4,01,187 క్యూసెక్కులు చేరుతుండటంతో తొమ్మిది గేట్లను పది అడుగుల మేర ఎత్తి 3,59,978 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. సాగర్ జలాశయం నుంచి దిగువకు 3,67,443 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలంలో శనివారం నుంచి ఆదివారం వరకు కుడిగట్టు కేంద్రంలో 14.650 మిలియన్ యూనిట్లు, ఎడమగట్టు కేంద్రంలో 16.760 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేశారు. -
మహోగ్ర కృష్ణా
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్/విజయపురి సౌత్: పరీవాహక ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటం, ఎగువన ప్రాజెక్టులన్నీ నిండిపోయి, వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తుండటంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణమ్మ మహోగ్ర రూపం దాల్చింది. ప్రకాశం బ్యారేజ్లోకి శనివారం సాయంత్రం 6 గంటలకు 4,53,067 క్యూసెక్కులు వస్తుండటంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కృష్ణా డెల్టాకు 2,827 క్యూసెక్కులు విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 4,50,240 క్యూసెక్కులను బ్యారేజ్ నుంచి సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఈ సీజన్లో జూన్ 1 నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు వెయ్యి టీఎంసీల కృష్ణా జలాలు సముద్రంలో కలిశాయి. శ్రీశైలంలోకి కొనసాగుతున్న వరద శ్రీశైలం ప్రాజెక్టులోకి ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. శనివారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 4,02,786 క్యూసెక్కులు చేరుతుండగా.. స్పిల్ వే 10 గేట్లను 15 అడుగుల మేర ఎత్తి 3,77,160 క్యూసెక్కులు, కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో పూర్తి స్థాయిలో విద్యుదుత్పత్తి చేస్తూ 65,643 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తుండటంతో నాగార్జునసాగర్, పులిచింతలలోకి వరద ఉద్ధృతి పెరుగుతోంది. సాగర్, పులిచింతలలోకి వచ్చిన వరదను దిగువకు వదలిలేస్తుండటంతో ప్రకాశం బ్యారేజ్లోకి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ఎగువన తగ్గుతున్న వరద.. పశ్చిమ కనుమల్లో వర్షాలు తగ్గడంతో ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్లలోకి వచ్చే వరద తగ్గింది. దీంతో ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్ల స్పిల్ వే గేట్లను మూసివేశారు. తుంగభద్ర, భీమా నదుల్లోనూ వరద తగ్గింది. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి శ్రీశైలంలోకి చేరే వరద తగ్గనుంది. విజయవాడకు ముంపు భయం లేదిక ప్రతి ఏటా కృష్ణా నది వరదల సమయంలో ముంపు ముప్పును ఎదుర్కొనే విజయవాడ లోతట్టు ప్రాంతాల వాసులకు ఇప్పుడా భయం లేదు. గతంలో ప్రకాశం బ్యారేజ్ నుంచి మూడు లక్షల క్యూసెక్కులు వదిలితే దిగువన విజయవాడలోని కృష్ణలంక నుంచి యనమలకుదురు వరకు లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యేవి. దాంతో ఆ ప్రాంతాల ప్రజలు వణికిపోయేవారు. వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తప్ప మిగిలిన ముఖ్యమంత్రులెవరూ ఈ ప్రాంతాల ప్రజల అవస్థలను పట్టించుకోలేదు. కృష్ణా వరద ముప్పు నుంచి ప్రజలను తప్పించడానికి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో యనమలకుదురు నుంచి కోటినగర్ వరకు కృష్ణా నదికి 2.28 కిలోమీటర్ల పొడవున రక్షణ గోడలు నిర్మించారు. పాదయాత్రలో వైఎస్ జగన్ ఇచ్చిన హామీ మేరకు కోటినగర్ నుంచి తారకరామనగర్ వరకు 1.56 కిలోమీటర్ల పొడవున రూ. 125 కోట్లతో రక్షణ గోడ నిర్మించారు. ఈ పనులను 2021 మే 31న ప్రారంభించి.. రికార్డు సమయంలో పూర్తి చేశారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి 12 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేసినా లోతట్టు ప్రాంతాలకు వరద చేరకుండా పటిష్ఠంగా ఈ గోడ నిర్మించారు. దీంతో లోతట్టు ప్రాంతాలైన కృష్ణలంక నుంచి యనమలకుదురు వరకు ప్రజలకు ముంపు ముప్పు తొలగింది. ప్రస్తుతం పద్మావతి ఘాట్ నుంచి కనకదుర్గమ్మ వారధి వరకు కృష్ణా నదికి రక్షణ గోడ నిర్మిస్తున్నారు. దీనికి రూ.135 కోట్లు ఖర్చు చేస్తున్నారు. పెన్నాలో మరింత పెరిగిన వరద కర్ణాటక, రాయలసీమలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో పెన్నా, ఉప నదుల్లో వరద ఉద్ధృతి మరింత పెరిగింది. పెన్నా ప్రధాన పాయతోపాటు ఉప నదులు జయమంగళ, కుముద్వతి, చిత్రావతి, పాపాఘ్ని, కుందు, బాహుదా, పించా, సగిలేరు ఉరకలెత్తుతున్నాయి. దీంతో పెన్నాలోకి భారీగా వరద వస్తోంది. శనివారం నెల్లూరు బ్యారేజ్ నుంచి 81 వేల క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారంటే.. పెన్నాలో వరద స్థాయిని అంచనా వేయచ్చు. ఇప్పటికే పెన్నా ప్రాజెక్టులన్నీ నిండుకుండలుగా మారడం, వరద భారీగా వస్తుండటంతో అప్పర్ పెన్నార్ నుంచి నెల్లూరు బ్యారేజ్ వరకు ప్రాజెక్టుల గేట్లన్నీ ఎత్తేశారు. ఒక సీజన్లో ప్రాజెక్టుల గేట్లను రెండోసారి ఎత్తేయడం చరిత్రలో ఇదే తొలిసారి. -
AP: రాష్ట్రానికి తుపాను ముప్పు
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: రాష్ట్రానికి తుపాను ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అండమాన్ సముద్రం, దాని పరిసరాల్లో ఈ నెల 18న ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. 20వ తేదీ నాటికి ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ.. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగా బలపడుతుందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. క్రమంగా ఇది ఏపీ–ఒడిశా తీరం వైపు కదులుతూ 24, 25 తేదీల్లో తుపానుగా మారే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఆ తర్వాత పెను తుపాను (సూపర్ సైక్లోన్)గా మారుతుందని పలు అంతర్జాతీయ ప్రైవేటు వాతావరణ సంస్థలు అంచనా వేస్తున్నాయి. కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం.. ప్రస్తుతం బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ఏపీ, ఉత్తర తమిళనాడు తీరాల వెంబడి సగటు సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో వచ్చే మూడు రోజులు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆదివారం, సోమవారం, మంగళవారాల్లో పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు.. కాగా రాష్ట్రవ్యాప్తంగా శనివారం భారీ వర్షాలు కురిశాయి. ప్రకాశం, విశాఖపట్నం, శ్రీకాకుళం, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు పడగా మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వానలు పడ్డాయి. కుంభవృష్టితో కోనసీమ తడిసి ముద్దైంది. విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. చంపావతి, నాగావళి నదుల్లో నీటి ప్రవాహం పెరిగింది. ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువకు 4.33 లక్షల క్యూసెక్కులు విడుదల చేయడంతో బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండ లం ఓలేరు, పల్లెపాలెం, పెదలంక, కాకుల డొంక వద్ద కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తోం ది. కాగా వర్షాల నేపథ్యంలో కృష్ణా, పెన్నా నదులు వరద ఉధృతితో ప్రవహించే ప్రమాదం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలంలో వేర్వేరు ప్రాంతాల్లో వాగుల్లో కొట్టుకుపోతున్న ముగ్గురిని స్థానికులు కాపాడారు. అష్టదిగ్బంధంలో అమరావతి ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు అమరావతి అష్టదిగ్బంధంలో చిక్కుకుంది. గత టీడీపీ ప్రభుత్వం ముందుచూపు లేకుండా నిర్మించిన అమరావతిని వాన నీరు చుట్టుముట్టింది. భూసమీకరణ పేరుతో వేలాది ఎకరాలు సేకరించిన చంద్రబాబు ప్రభుత్వం ఈ ప్రాంతంలో అందుకు తగినట్లుగా సౌకర్యాలు కల్పించకపోవడంతో సచివాలయ ఉద్యోగులు, న్యాయమూర్తులు, న్యాయవాదులు ఇబ్బందిపడ్డారు. -
వరద గుప్పిట్లో అనంతపురం
సాక్షి ప్రతినిధి, అనంతపురం/కర్నూలు (అగ్రికల్చర్): భారీ వర్షాలతో అనంతపురం జిల్లా కకావికలమైంది. బుధవారం రాత్రి నుంచి గురువారం వరకు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. కనీవినీ ఎరుగని రీతిలో అనంతపురంలో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాయదుర్గంలో 14.6, బుక్కరాయసముద్రంలో 12, పెద్దపప్పూరులో 11.6, గుత్తిలో 9.8, పుట్లూరులో 8.5, యాడికిలో 8.3 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. ప్రధానంగా అనంతపురం మండలం కక్కలపల్లి, కాటిగాని కాలువ, కట్టకిందపల్లి, ఆలమూరు, కామారుపల్లి, సజ్జల కాలువ, కురుగుంట, కొడిమి, రాచానపల్లి, ఎ.నారాయణపురం తదితర ప్రాంతాలతో పాటు రుద్రంపేట, చంద్రబాబు కొట్టాల, విమలా ఫారుఖ్నగర్, సుందరయ్య కాలనీ, వికలాంగుల కాలనీ, జాకీర్ కొట్టాల, నగరంలోని ఆజాద్నగర్, విశ్వశాంతి నగర్, హనుమాన్ కాలనీ, శాంతినగర్, ప్రశాంతి నగర్, రంగస్వామి నగర్, రజక నగర్, ఆదర్శ నగర్, యువజన కాలనీ, నాలుగు, ఐదు, ఆరో రోడ్డు, సోమనాథ నగర్, సుఖదేవ నగర్, శ్రీశ్రీనగర్, గౌరవ్ గార్డెన్, తడకలేరు తదితర ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వంక పరిసర ప్రాంతాల్లో నివాసముంటున్న ప్రజలను ఇళ్ల నుంచి ఖాళీ చేయించి పునరావాస ప్రాంతాలకు తరలించారు. వరద ఉధృతి కారణంగా చాలా ప్రాంతాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. బుక్కరాయసముద్రం వద్ద వాగులో సిమెంట్ కంటైనర్ బోల్తాపడింది. అనంతపురం ఐదో రోడ్డులో ఆహార పొట్లాల పంపిణీ ఉమ్మడి కర్నూలులో భారీ వర్షాలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం ఉదయం వరకు సగటున 85.1 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఉమ్మడి జిల్లాలో దశాబ్దాల కాలంలో ఇంత భారీ వర్షాలు కురవడం ఇదే మొదటిసారి. దేవనకొండలో రికార్డు స్థాయిలో 160.2 మి.మీ. వర్షం కురిసింది. నందవరంలో 112.6, బనగానపల్లెలో 107.4, పగిడ్యాలలో 98.2, పెద్దకడబూరులో 97.2, గోనెగండ్లలో 96.2, వెల్దుర్తిలో 96.2 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. హంద్రీ నది, వేదావతి నదితోపాటు వాగులు, వంకలు పొంగిపొర్లాయి. భారీ వర్షాలతో వెల్దుర్తి మండలంలో నాలుగు మట్టి మిద్దెలు కూలిపోయాయి. హాలహర్వి మండలం గూళ్యం సమీపంలో వేదావతి నది పొంగిపొర్లడంతో ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి. గాజులదిన్నె ప్రాజెక్టుకు వరదనీరు పోటెత్తింది. దీంతో నాలుగు గేట్లు ఎత్తి 32 వేల క్యూసెక్కుల నీటిని హంద్రీ నదిలోకి విడుదల చేస్తున్నారు. కర్నూలు నగరంలో భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సీఎం చొరవతో సహాయక చర్యలు వేగవంతం అనంతపురంలో జిల్లాలోని వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్షించడంతో సహాయక చర్యలు మరింత వేగం పుంజుకున్నాయి. అన్ని శాఖల సమన్వయంతో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి బాధిత ప్రజలకు అన్న పానీయాలు, నిత్యావసర వస్తువులు, మందులు అందజేస్తున్నారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్రెడ్డి, మేయర్ వసీం, కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, ఎస్పీ ఫక్కీరప్ప తదితరులు లోతట్టు ప్రాంతాల్లో బాధితులను పరామర్శించి సహాయక కార్యక్రమాలను పర్యవేక్షించారు. వరద బాధితులకు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని మంత్రి ఉషశ్రీ చరణ్ పేర్కొన్నారు. -
కొనసాగుతున్న వర్షాలు
సాక్షి నెట్వర్క్ : రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం కూడా వర్షాలు కురిశాయి. ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ ఈస్ట్ మండలంలో అత్యధికంగా 30.2 మి.మీ. సెంట్రల్, నార్త్, వెస్ట్ మండలాల్లో 29.6 మి.మీ.ల చొప్పున వర్షపాతం నమోదైంది. అలాగే, విజయవాడ రూరల్లో 25.2మి.మీ. వర్షం కురిసింది. కృష్ణా జిల్లాలో 9.2.మి.మీ. సగటు వర్ష పాతం నమోదైంది. అత్యధికంగా బంటుమిల్లిలో 27.2మి.మీ, అత్యల్పంగా ఉయ్యూరులో 1.8మి.మీ కురిసింది. అనంతపురం జిల్లాలోని 15 మండలాల్లో వర్షం కురిసింది. కుందుర్పిలో 60.2 మి.మీ., ఆత్మకూరులో 50.2 మి.మీ మేర భారీ వర్షం కురిసింది. కంబదూరు 37 మి.మీ, కూడేరు 32.2 మి.మీ, రాప్తాడు 20.2 మి.మీ. వర్షం కురిసింది. శ్రీశైలానికి పెరుగుతున్న వరద మరోవైపు.. శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి వరద ప్రవాహం పెరుగుతోంది. సోమవారం సాయంత్రానికి లక్షా 9 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా మంగళవారం సాయంత్రానికి జూరాల, సుంకేసుల నుంచి 1,28,106 క్యూసెక్కుల వరద ప్రవాహం శ్రీశైలానికి వచ్చి చేరుతోంది. రెండు గేట్లను 10 అడుగుల మేర తెరచి 55,874 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్కు విడుదల చేస్తున్నారు. బ్యాక్వాటర్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ ద్వారా 3 వేల క్యూసెక్కులు, హంద్రీనీవా సుజల స్రవంతికి 338 క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టారు. జలాశయంలో 213.8824 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యామ్ నీటిమట్టం 884.70 అడుగులకు చేరుకుంది. అలాగే, సాగర్ జలాశయం నుంచి 10 గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి 80,690 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. -
10 రోజులు ఏపీ వ్యాప్తంగా అనూహ్య వర్షాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత 10 రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ సీజన్లో వర్షాలు మామూలే అయినా అన్ని ప్రాంతాల్లోను పడుతుండడం ప్రత్యేకంగా చెబుతున్నారు. అక్టోబర్, నవంబర్ నెలల్లో ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉన్నా గతంలో అది కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యేది. కానీ ఈసారి అన్ని జిల్లాల్లోను భారీ వర్షాలు కురుస్తున్నాయి. బాపట్ల జిల్లాలో 90.4 శాతం అధికం ఈ నెల ఒకటో తేదీ నుంచి 10వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా సగటున 17.69 మిల్లీమీటర్ల అధిక వర్షపాతం నమోదైంది. సాధారణంగా ఈ 10 రోజుల్లో 82.3 మిల్లీమీటర్ల వర్షం పడాలి. కానీ 99.99 మిల్లీమీటర్ల వర్షం పడింది. 8 జిల్లాల్లో 50 నుంచి 90 శాతం అధిక వర్షం కురిసింది. బాపట్ల జిల్లాలో 90.4 శాతం అధిక వర్షం పడింది. అక్కడ 84.9 మిల్లీమీటర్ల వర్షం పడాల్సి ఉండగా 161.7 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. శ్రీకాకుళం జిల్లాలో 70 శాతం, విజయనగరం జిల్లాలో 62.2 శాతం, పార్వతీపురం మన్యం జిల్లాలో 61.2, ఏలూరు జిల్లాలో 66.4, కృష్ణాలో 51, గుంటూరు జిల్లాలో 64.5, పల్నాడు జిల్లాలో 50.4 శాతం అధిక వర్షం కురిసింది. ఒక్క నెల్లూరు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోను పడాల్సిన దానికంటే ఎక్కువ వర్షం పడింది. కృష్ణా, గోదావరి, పెన్నా బేసిన్లలో రిజర్వాయర్లు కళకళ భారీ వర్షాలతో గోదావరి, కృష్ణా, పెన్నా బేసిన్లలో రిజర్వాయర్లలోకి బాగా నీరు చేరి కళకళలాడుతున్నాయి. గోదావరి బేసిన్లో లక్ష్మి, సమ్మక్క బ్యారేజీల నుంచి దిగువకు భారీగా నీటిని వదులుతున్నారు. కృష్ణా బేసిన్లో తుంగభద్ర, సుంకేశుల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులు, ప్రకాశం బ్యారేజీ నిండిపోవడంతో 10 రోజులుగా వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు వదిలేస్తున్నారు. పెన్నా బేసిన్లో గండికోట, మైలవరం, సోమశిల రిజర్వాయర్లు కూడా నిండిపోవడంతో నీటిని కిందకు వదులుతున్నారు. సమృద్ధిగా కురుస్తున్న వర్షాలతో రిజర్వాయర్లన్నీ జలకళతో తొణికిసలాడుతున్నాయి. నైరుతి మురిసింది.. ఈ నైరుతి సీజన్లో రాష్ట్రమంతా సమృద్ధిగా వర్షాలు కురిశాయి. జూన్ ఒకటి నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు 657 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 683.1 మిల్లీమీటర్లు నమోదైంది. శ్రీ సత్యసాయి జిల్లాలో 41.3 శాతం అధిక వర్షం కురిసింది. అనంతపురం జిల్లాలో 36.6, బాపట్ల జిల్లాలో 30.6 మిల్లీమీటర్ల అధిక వర్షం పడింది. మిగిలిన అన్ని జిల్లాల్లోను సాధారణ వర్షపాతం నమోదైంది. -
సిక్కోలు, ఉమ్మడి విశాఖలో కుంభవృష్టి
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/సాక్షి, విశాఖపట్నం: శ్రీకాకుళం జిల్లాలో మంగళవారం వేకువజాము నుంచి కుండపోతగా వర్షం కురిసింది. గార మండలంలో దాదాపు 15 సెం.మీ. వర్షం పడగా, శ్రీకాకుళంలో 7, ఆమదాలవలసలో 6, నరసన్నపేటలో 4 సెం.మీ. పైగా వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఒక్కరోజే 722 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. భారీ వర్షానికి శ్రీకాకుళం నగర రోడ్లన్నీ జలమయమయ్యాయి. సూర్యమహల్ వద్ద ముంపు అంచనా వేయలేకపోవడంతో ఓ కారు కల్వర్టులోకి దూసుకెళ్లిపోయింది. పెదపాడు చెరువు పొంగి ప్రవహించడంతో జాతీయ రహదారిపైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. వాహనాలు మునిగిపోయేంత మేర నీరు ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జాతీయ రహదారిపై నీటిని కల్వర్టుల ద్వారా మళ్లించారు. ఇక నందిగాం మండలం కాపుతెంబూరుకు చెందిన రైతు కొల్లి వనజనాభం (40) పొలంలో నీటిని మళ్లిస్తుండగా పిడుగుపాటుకు గురై మృతిచెందాడు. భారీ వర్షాలతో 13 మండలాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఉమ్మడి విశాఖలోనూ కుండపోత.. మరోవైపు.. ఉమ్మడి విశాఖ జిల్లాలోనూ కుంభవృష్టి కురిసింది. సోమవారం అర్థరాత్రి దాటాక మొదలైన వర్షం మంగళవారం ఉదయం వరకు కొనసాగింది. విశాఖ నగర శివారుల్లో పల్లపు ప్రాంతాల్లోకి భారీగా నీరు చేరింది. భీమునిపట్నంలో అత్యధికంగా 17.9 సెం.మీల వర్షపాతం రికార్డయింది. గోపాలపట్నంలో 12.1, విశాఖ రూరల్లో 10.8, గాజువాక 8.2, అనకాపల్లి జిల్లా పరవాడలో 6.3, అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగులలో 4.8, చింతపల్లిలో 4.6 సెం.మీల చొప్పున వర్షం కురిసింది. మధ్యాహ్నం నుంచి వర్షం తగ్గుముఖం పట్టింది. రుతుపవన ద్రోణితో భారీ వర్షాలు ఇక రుతుపవన ద్రోణి చురుగ్గా ఉండడం భారీ వర్షాలకు దోహదపడిందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాల సీజనులో ఇప్పటివరకు ఒక్క విశాఖ జిల్లా మాత్రమే లోటులో ఉంది. నాలుగు రోజుల క్రితం వరకు ఈ జిల్లా వర్షపాతం సాధారణం కంటే 20.9 శాతం లోటులో ఉండేది. కానీ, ప్రస్తుత వర్షాలతో 3.9 శాతం అధిక వర్షపాతానికి చేరుకుంది. అంటే మూడ్రోజుల వ్యవధిలో దాదాపు 24 శాతం వర్షపాతం పెరిగినట్లయింది. -
తప్పిన వాయు‘గండం’
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ఆదివారం వాయుగుండంగా బలపడి ఒడిశా, ఛత్తీస్గఢ్ వైపు కదులుతోంది. దీంతో రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ఈ వాయుగుండం ఆదివారం సాయంత్రానికి ఒడిశాలోని భవానీపటా్ననికి 80 కిలోమీటర్లు, గోపాల్పూర్కు 110 కిలోమీటర్లు, ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్కు 210 కిలోమీటర్లు, కంకేర్కి 260 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా ప్రయాణిస్తూ సోమవారానికి అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం అక్కడక్కడా భారీవర్షాలు కురవగా చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. సోమ, మంగళవారాల్లో మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉందని, తీరం వెంబడి గంటకు 40 నుంచి 50కిలోమీటర్లు.. గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మత్స్యకారులు సముద్రంలోకి చేపలవేటకు వెళ్లవద్దని సూచించింది. గడచిన 24 గంటల్లో పాలకోడేరులో 14 సెంటీమీటర్లు, నూజివీడులో 11, సెట్టిగుంటలో 10.3, పూసపాటిరేగ, బలిజపేటల్లో 9, భీమడోలు, భీమవరం, కళింగపటా్నల్లో 8, ఆళ్లగడ్డలో 7.8, ఇబ్రహీంపట్నంలో 7.4, చింతలపూడి, తెర్లాం, జియ్యమ్మవలసల్లో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
మళ్లీ మహోగ్రం.. పోటెత్తిన కృష్ణమ్మ
సాక్షి, అమరావతి/నెట్వర్క్: కృష్ణమ్మ మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. ఆల్మట్టికి దిగువన తుంగభద్ర, వేదవతి, భీమా పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణాలో వరద ఉద్ధృతి పెరుగుతోంది. గురువారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం జలాశయంలోకి 4,26,201 క్యూసెక్కులు చేరుతుండగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 12,500, హంద్రీ–నీవా ద్వారా 1,125, కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 800 క్యూసెక్కులు తరలిస్తున్నారు. కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 62,091 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయంలో 884.4 అడుగుల్లో 211.95 టీఎంసీలను నిల్వ చేస్తూ స్పిల్వే పది గేట్లను 15 అడుగుల మేర పైకి ఎత్తి 3,76,670 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. బుధవారం నుంచి గురువారం వరకు కుడిగట్టు కేంద్రంలో 15.201 మిలియన్ యూనిట్లు, ఎడమగట్టు కేంద్రంలో 16.761 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేశారు. 589 అడుగుల్లో సాగర్ శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్లోకి 4,23,819 క్యూసెక్కులు చేరుతున్నాయి. సాగర్లో 589 అడుగుల్లో 309.06 టీఎంసీలను నిల్వ చేస్తూ స్పిల్వే గేట్లు, విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా అంతే స్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. నాగార్జున సాగర్ టెయిల్పాండ్ ప్రాజెక్టు పూర్తి స్థాయి మట్టం 75.50 మీటర్లకుగానూ 73.46 మీటర్లకు చేరుకుంది. పులిచింతలలోకి 3,67,262 క్యూసెక్కులు చేరుతుండగా 169.55 అడుగుల్లో 37.73 టీఎంసీలను నిల్వ చేస్తూ 3,98,349 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. వందేళ్లలో రికార్డు వరద.. పశ్చిమ కనుమల్లో సహ్యాద్రి సానువుల్లో జన్మించి దేశంలో అత్యల్ప వర్షపాతం నమోదయ్యే హగరి లోయ గుండా ప్రవహించే వేదవతి (హగరి) వందేళ్ల తర్వాత ఉగ్రరూపం దాల్చింది. అనంతపురం జిల్లాలోని భైరవానితిప్ప ప్రాజెక్టు నిండిపోయింది. ప్రాజెక్టు(బీటీపీ)లోకి 62,085 క్యూసెక్కులు చేరుతుండగా అంతే స్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. బీటీపీ చరిత్రలో ఇదే అత్యధిక వరద. బీటీపీ నుంచి దిగువకు వదిలేస్తున్న జలాలు తుంగభద్ర మీదుగా సుంకేశుల బ్యారేజ్లోకి, అక్కడి నుంచి శ్రీశైలంలోకి చేరుతున్నాయి. పెన్నా పరవళ్లు పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు పెన్నా నది మళ్లీ పరవళ్లు తొక్కుతోంది. శ్రీసత్యసాయి జిల్లాలోని అప్పర్ పెన్నార్ ప్రాజెక్టులోకి 16,500 క్యూసెక్కులు చేరుతున్నాయి. నీటి నిల్వ ఇప్పటికే గరిష్ట స్థాయి 1.52 టీఎంసీలకు చేరుకోవడంతో గేట్లు ఎత్తి 11 వేల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్)లోకి 21,030 క్యూసెక్కులు చేరుతున్నాయి. పీఏబీఆర్ సామర్థ్యం 11.1 టీఎంసీలు కాగా నిర్మాణ లోపంతో గరిష్ట స్థాయిలో నిల్వ చేయలేని పరిస్థితి నెలకొంది. పీఏబీఆర్లో 5.78 టీఎంసీలను నిల్వ చేస్తూ 13,770 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. అనంతపురం జిల్లాలోని మిడ్ పెన్నార్ రిజర్వాయర్లోకి 15,329 క్యూసెక్కులు చేరుతున్నాయి. రిజర్వాయర్ నీటి నిల్వ గరిష్ట స్థాయి 4.96 టీఎంసీలకు చేరుకోవడంతో 16,125 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. మిడ్ పెన్నార్ చరిత్రలో ఇదే అత్యధిక వరద. చాగల్లు రిజర్వాయర్లోకి 24,990 క్యూసెక్కులు చేరుతున్నాయి. ఈ రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 1.8 టీఎంసీలు కాగా 0.86 టీఎంసీలను నిల్వ చేసి 25 వేల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. చాగల్లు చరిత్రలోనూ ఇదే గరిష్ట వరద. గండికోట ప్రాజెక్టులోకి 35 వేల క్యూసెక్కులు చేరుతుండగా నీటి నిల్వ గరిష్టంగా 25.37 టీఎంసీలకు చేరుకోవడంతో గేట్లు ఎత్తి 30 వేల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. మైలవరం రిజర్వాయర్లో 9.98 టీఎంసీలకుగానూ 5 టీఎంసీలను నిల్వ చేస్తూ 32 వేల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. సోమశిల ప్రాజెక్టు 78 టీఎంసీలకుగానూ ఇప్పటికే 72.14 టీఎంసీలకు చేరుకుంది. ప్రాజెక్టులోకి 11,893 క్యూసెక్కులు చేరుతుండగా కండలేరుకు కాలువ ద్వారా 8 వేలు, విద్యుదుత్పత్తి చేస్తూ 2,453 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. కండలేరు రిజర్వాయర్లోకి 7,790 క్యూసెక్కులు చేరుతుండటంతో నిల్వ 47 టీఎంసీలకు చేరుకుంది. మరో 21 టీఎంసీలు చేరితే కండలేరు నిండిపోనుంది. సోమశిల రిజర్వాయర్కు దిగువన కొత్తగా నిర్మించిన మేకపాటి గౌతమ్రెడ్డి సంగం బ్యారేజ్లో పూర్తి సామర్థ్యం మేరకు 0.45 టీఎంసీలు, నెల్లూరు బ్యారేజ్లో 0.4 టీఎంసీలను నిల్వ చేస్తూ ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి సోమశిలకు వరద ప్రవాహం వస్తుండటంతో శుక్రవారం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయనున్నారు. సంగం, నెల్లూరు బ్యారేజ్లలోకి పెరిగే వరద ప్రవాహాన్ని బట్టి మిగులు జలాలను గేట్లు ఎత్తి సముద్రంలోకి వదిలేయనున్నారు. నేడు బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక! ప్రకాశం బ్యారేజ్లోకి చేరుతున్న వరద గంట గంటకూ పెరుగుతోంది. గురువారం సాయంత్రం 6 గంటలకు బ్యారేజ్లోకి 2,73,222 క్కూసెక్కులు చేరుతుండగా కృష్ణా డెల్టాకు 15,472 క్యూసెక్కులను విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 2,57,750 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఎగువ నుంచి బ్యారేజ్లోకి శుక్రవారం ఉదయానికి నాలుగు లక్షల క్యూసెక్కుల వరద చేరే అవకాశం ఉండటంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. లోతట్టు ప్రాంతాల వాసులను అప్రమత్తం చేస్తున్నారు. -
Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. శనివారం నాటికి...
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో గురువారం అల్పపీడనం ఏర్పడింది. ఇది శనివారంనాటికి ఉత్తర కోస్తాంధ్ర, ఒడిశాలకు చేరువలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనంగా బలపడనుంది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు రాష్ట్రంలో అనేక చోట్ల విస్తారంగా, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) గురువారం రాత్రి వెల్లడించింది. శుక్రవారం ఉమ్మడి గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు, ప్రకాశం, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అతి భారీ వర్షాలు, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురవవచ్చని తెలిపింది. శనివారం విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలకు అవకాశం ఉందని వివరించింది. ఆదివారం విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒకట్రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు, కోస్తాంధ్ర, రాయలసీమల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రానున్న నాలుగు రోజులు కోస్తాంధ్రలో తీరం వెంబడి గంటకు 45 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. పిడుగులతో కూడిన అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సూచించారు. -
బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం.. భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: తూర్పు మధ్య, దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో గురువారం ఉదయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది తీవ్ర అల్పపీడనంగా బలపడే అవకాశాలున్నాయని తెలిపింది. దీని ప్రభావంతో వచ్చే 2, 3 రోజులు రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు పడనున్నాయి. ఉత్తరాంధ్రపై దీని ప్రభావం ఎక్కువగా ఉండనుంది. విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. గురువారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాలకు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆరెంజ్ వార్నింగ్ను జారీ చేసింది. 10వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. ఇప్పటికే సముద్రంలో వేటకు వెళ్లిన వారు తిరిగి వెనక్కి రావాలని సూచించారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు నీట మునిగే అవకాశం ఉందని, రవాణా వ్యవస్థకు అంతరాయం కలుగుతుందని, చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయే ప్రమాదం ఉందని ఐఎండీ తెలిపింది. వరి, అరటి పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని తెలిపింది. వీటిని దృష్టిలో ఉంచుకుని యంత్రాంగం తగు చర్యలు తీసుకోవాలని చెప్పింది. ప్రజలు శిథిల భవనాలు/ఇళ్లలో ఉండవద్దని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. చెరువులు, కాలువలు, నదులు, విద్యుత్ స్తంభాలు, వైర్లకు దూరంగా ఉండాలని సూచించింది. -
ఏపీలో మూడు రోజులు వానలు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో రెండు, మూడు రోజులు విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. ప్రస్తుతం ఉత్తర–దక్షిణ ద్రోణి ఛత్తీస్గఢ్ నుంచి కర్ణాటక పరిసరాల వరకు ఆంధ్రప్రదేశ్ మీదుగా పయనిస్తోంది. ఇది సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. దీని ప్రభావంతో ఇప్పటికే రెండ్రోజులుగా కోస్తాంధ్ర, రాయలసీమల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమలో దీని ప్రభావం మరింత ఎక్కువ ఉండడంతో అక్కడ వానలు ఎక్కువ పడుతున్నాయి. బుధవారం తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, ఈనెల 9న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నాయి. ఇటు ద్రోణి, అటు ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో బుధవారం కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. గురు, శుక్రవారాల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) మంగళవారం నివేదికలో వెల్లడించింది. అదే సమయంలో ఉత్తరకోస్తాలోని విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు, శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమగోదావరి, దక్షిణ కోస్తాలోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం, రాయలసీమలోని కర్నూలు జిల్లాల్లో ఒకట్రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అక్కడక్కడ పిడుగులకు ఆస్కారం ఉందని పేర్కొంది. రానున్న మూడు రోజులు తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. అందువల్ల మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని సూచించింది. కాగా మంగళవారం రాత్రి వరకు వెంకటగిరిలో అత్యధికంగా 9.1 సెంటీమీటర్లు, సీతానగరం 8.8, బొబ్బిలి 8.3, సాలూరు 7.3, కొయ్యూరు 6.6, లింగసముద్రం 6.1, అమలాపురం 5.8, చోడవరం 5.2, గోకవరం 5.0, గుత్తి (అనంతపురం జిల్లా)లో 4.2 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైంది. -
Rain Alert: 9న అల్పపీడనం! రాష్ట్రంలో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 7న ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. 48 గంటల అనంతరం అంటే ఈ నెల 9న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం వెల్లడించింది. దీని ప్రభావం రాష్ట్రంపై ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఈనెల 8 నుంచి కోస్తాంధ్ర, రాయలసీమల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, కోస్తాంధ్రలో అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురిసే వీలుందని వివరించింది. అదే సమయంలో గంటకు 45 – 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని, అందువల్ల మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లవద్దని సూచించింది. ప్రస్తుతం ఉత్తర–దక్షిణ ద్రోణి ఉత్తర కర్ణాటక నుంచి కొమరిన్ ప్రాంతం వరకు తమిళనాడు అంతర్భాగంలో సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావంతో మంగళ, బుధవారాల్లో దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తాల్లో కొన్నిచోట్ల, రాయలసీమలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, సీమలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ పిడుగులు కూడా పడతాయని ఐఎండీ తెలిపింది. -
ఆంధ్రప్రదేశ్లో మూడు రోజులు వానలు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో రానున్న మూడు రోజుల్లో విస్తారంగా వానలు కురవనున్నాయి. దక్షిణ, ఆగ్నేయ దిశగా వీస్తున్న గాలుల ప్రభావంతో రానున్న మూడు రోజులపాటు రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరుగాను, అక్కడక్కడా భారీ వర్షాలకు ఆస్కారం ఉందని భారత వాతావరణ విభాగం శనివారం నాటి నివేదికలో వెల్లడించింది. ప్రధానంగా కోస్తాంధ్ర, యానాం, రాయలసీమల్లోని అనేక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడతాయని ఈ నివేదిక తెలిపింది. అదే సమయంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశమూ ఉందని పేర్కొంది. -
ఏపీ వాసులకు అలర్ట్.. రెండు రోజులు భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం/అనంతపురం అగ్రికల్చర్: రాష్ట్రంలో రెండురోజులు వర్షాలు కురవనున్నాయి. ప్రస్తుతం తూర్పు విదర్భ నుంచి దక్షిణ కోస్తాంధ్ర వరకు ఉత్తర–దక్షిణ ద్రోణి కొనసాగుతోంది. ఇది సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో సోమ, మంగళవారాల్లో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. ఉరుములు, మెరుపులు కూడా సంభవిస్తాయని పేర్కొంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. బుధవారం నుంచి వర్షాలు తగ్గుముఖం పడతాయని పేర్కొంది. పెద్దపప్పూరు, ధర్మవరాల్లో కుండపోత ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఐదురోజులుగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు భారీ వర్షాలు ముంచెత్తాయి. అనంతపురం జిల్లా పెద్దపప్పూరులో 15 సెంటీమీటర్లు, శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో 12 సెంటీమీటర్ల కుండపోత వర్షం కురిసింది. జిల్లావ్యాప్తంగా ప్రధాన వాగులు, వంకలు, చెక్డ్యాంలు పొంగి ప్రవహిస్తున్నాయి. పదుల సంఖ్యలో చెరువులు నిండి మరువ పారుతున్నాయి. వందలాది చెరువుల్లోకి వరదనీరు చేరుతోంది. చిత్రావతి, స్వర్ణముఖి, పెన్నా తదితర నదుల పరీవాహక ప్రాంతాలు వరదతో పోటెత్తాయి. దాదాపు ఆరులక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగులో ఉన్న ఖరీఫ్ పంటలకు ఈ వర్షాలు ఊరటనిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. -
శ్రీశైలంలోకి పెరిగిన వరద
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్/విజయపురిసౌత్/సత్రశాల (రెంటచింతల): కృష్ణా ప్రధానపాయపై నారాయణపూర్ డ్యామ్కు దిగువన.. తుంగభద్ర పరీవాహక ప్రాంతాల్లో భారీవర్షాలు కురుస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి మళ్లీ వరద పెరిగింది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు జూరాల, సుంకేశుల బ్యారేజ్ల నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి 2,79,268 క్యూసెక్కులు చేరుతుండగా.. గరిష్టస్థాయిలో అంటే 885 అడుగుల్లో 215.80 టీఎంసీలను నిల్వచేస్తూ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 20 వేలు, హంద్రీ–నీవా ద్వారా 1,688, కల్వకుర్తి ద్వారా 1,967 క్యూసెక్కులు తరలిస్తున్నారు. స్పిల్ వే ఏడుగేట్లను పదడుగులు ఎత్తి 1,96,525 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి చేస్తూ కుడిగట్టు కేంద్రం ద్వారా 30,924, ఎడమగట్టు కేంద్రం ద్వారా 31,784 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. నాగార్జునసాగర్లోకి 2,09,791 క్యూసెక్కుల నీరు చేరుతోంది. కుడి, ఎడమ కాలువలు, ఏఎమ్మార్పీ, వరద కాలువలకు 17,246 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. స్పిల్ వే గేట్ల ద్వారా, విద్యుదుత్పత్తి చేస్తూ 1,93,185 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రస్తుతం సాగర్లో 588.9 అడుగుల్లో 308.76 టీఎంసీలను నిల్వచేస్తున్నారు. పులిచింతలలోకి 1,82,816 క్యూసెక్కులు చేరుతుండగా.. 169.79 అడుగుల్లో 38.04 టీఎంసీలను నిల్వచేస్తూ స్పిల్వే గేట్లు, విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా 1,69,871 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్లోకి 1,60,937 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణాడెల్టాకు 15,687 క్యూసెక్కులను విడుదల చేస్తూ మిగిలిన 1,45,250 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. కృష్ణా బేసిన్లో ఎగువన మరో రెండ్రోజులు విస్తారంగా వర్షాలు కురుస్తాయన్న భారత వాతావరణ సంస్థ అంచనాల నేపథ్యంలో కృష్ణాలో వరద ఉధృతి మరో 3, 4 రోజులు ఇదే రీతిలో కొనసాగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. -
AP: మూడు రోజులు వానలు!
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురవడానికి పరిస్థితులు అనుకూలంగా మారాయి. కొద్ది రోజులుగా రాష్ట్రంలో వానలు తగ్గాయి. కొన్నిచోట్ల అరకొరగా కురుస్తుండగా, మరికొన్ని ప్రాంతాల్లో ఎండలు కాస్తున్నాయి. తాజాగా ఉత్తర బంగాళాఖాతం మీదుగా వాయవ్య బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి నైరుతి వైపునకు వంగి ఉంది. మరోవైపు ఉత్తర మధ్య అంతర్భాగ తమిళనాడు, పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన మరో ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. వీటి ఫలితంగా బుధవారం రాష్ట్రంలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. అనంతపురం జిల్లా బీకే సముద్రం మండలం రేకులకుంటలో అత్యధికంగా 17.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గురు, శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలో కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అనేక చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. శుక్రవారం రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. -
ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ ప్రాంతాల్లో వర్షాలకు అవకాశం
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: ఉత్తర బంగాళాఖాతంలో శనివారం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ వచ్చే 12 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా, తర్వాత 24 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దీని ప్రభావంతో ఆదివారం ఉత్తర కోస్తాంధ్రలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శనివారం రాత్రి విడుదల చేసిన నివేదికలో తెలిపింది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురవవచ్చని పేర్కొంది. మరోవైపు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ మీదుగా పశ్చిమ గాలులు వీస్తున్నాయి. వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో తీరం వెంబడి గంటకు 45–55 కి.మీ., గరిష్టంగా 65 కి.మీ., వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. సముద్రం అలజడిగా ఉంటుందని, ఆది, సోమవారాల్లో మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లవద్దని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం సూచించింది. -
వాయుగుండంగా మారిన తీవ్ర అల్పపీడనం.. భారీ వర్షాలు!
సాక్షి, అమరావతి: వాయువ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశాను ఆనుకుని కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా చత్తీస్గఢ్ వైపు పయనించి 24 గంటల్లో నెమ్మదిగా బలహీనపడుతూ భూమి మీదకు ప్రవేశిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో మంగళవారం కోస్తా జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. శ్రీకాకుళం జిల్లా జగ్గిలిబొంతులో 6.9 సెం.మీ వర్షం కురిసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మడుగుల మండలం కుంతలంలో 6.6, శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో 5.5, పలాసలో 5.2, కాకినాడ జిల్లా తాళ్లరేవులో 5.1 సెం.మీ వర్షం కురిసింది. బుధవారం నుంచి వర్షాలు అక్కడక్కడా తప్ప చాలా ప్రాంతాల్లో తగ్గుముఖం పడతాయని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. -
కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం.. భారీ వర్షాలకు అవకాశం
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: వాయువ్య బంగాళాఖాతానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి స్థిరంగా కొనసాగుతోంది. ఒడిశా, చత్తీస్గఢ్ వైపు కదులుతూ రాగల 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. దీనికి నైరుతి రుతు పవన ద్రోణి కూడా తోడైంది. వీటి ప్రభావంతో ఉత్తరాంధ్రలో పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. మంగళ, బుధవారాల్లో ఉత్తర కోస్తాలో అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం రాత్రి తెలిపింది. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిస్తాయని తెలిపింది. మంగళ, బుధవారాల్లో ఉత్తర కోస్తాంధ్రలో మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం సూచించింది. పలుచోట్ల భారీ వర్షాలు అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో సోమవారం అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, తూర్పుగోదావరి, ఎన్టీఆర్, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, నంద్యాల జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. అల్లూరి జిల్లా చింతపల్లిలో 9.5 సెంటీమీటర్ల వర్షం పడింది. శ్రీకాకుళం జిల్లా హిర మండలంలో 7.5 సెంటీమీటర్లు, అల్లూరి జిల్లా ముంచంగిపుట్టులో 7.4, నంద్యాల జిల్లా వెలుగోడులో 7, ఏలూరు జిల్లా జీలుగుమిల్లిలో 6.2, శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో 5.7, అల్లూరి జిల్లా మారేడుమిల్లిలో 5, నంద్యాల జిల్లా ఆత్మకూరులో 4.7, శ్రీశైలంలో 4.6 సెంటీమీటర్ల వర్షం పడింది. -
బలపడిన అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు
సాక్షి, అమరావతి, విశాఖపట్నం: వాయువ్య బంగాళాఖాతంలో ఆదివారం ఉదయం ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఇది ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతోంది. ఉత్తరాంధ్ర తీరానికి ఆనుకుని సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనంతో కొనసాగుతోంది. 48 గంటల్లో బలపడి ఛత్తీస్గఢ్, ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం ఉంది. మరోవైపు రుతుపవన ద్రోణి రాజస్తాన్ నుంచి అల్పపీడనం ప్రాంతం మధ్యగా పయనిస్తూ అండమాన్ వరకు విస్తరించింది. వీటి ప్రభావంతో సోమ, మంగళవారాల్లో ఉత్తర కోస్తాంధ్రలోని ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. గంటకు 45 నుండి 55 కిలోమీటర్లు వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మంగళవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని హెచ్చరించింది. కాగా, శనివారం అర్ధరాత్రి, ఆదివారం అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో 8.9 సెంటీమీటర్ల వర్షం పడింది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి, సంతబొమ్మాళి ప్రాంతాల్లో, రాజమహేంద్రవరంలో, ఏలూరు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయి. -
మళ్లీ శ్రీశైలం ప్రాజెక్టు ఒక గేటు ఎత్తివేత
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్టు/రామగిరి: ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర నుంచి దిగువకు భారీగా వరద వస్తుండడంతో శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం మరింతగా పెరిగింది. గురువారం రాత్రి 9 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 2,25,372 క్యూసెక్కులు చేరుతోంది. నీటి నిల్వ 884.4 అడుగుల్లో 212.43 టీఎంసీల గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో మళ్లీ ఒక గేటును పది అడుగుల మేర ఎత్తి 27,800 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు 64,073 క్యూసెక్కులు వదులుతున్నారు. దాంతో సాగర్లోకి వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రస్తుతం సాగర్లో 562.5 అడుగుల్లో 238.24 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. సాగర్ నిండాలంటే ఇంకా 73 టీఎంసీలు కావాలి. సాగర్కు దిగువన మూసీలో వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో పులిచింతలలోకి 10,400 క్యూసెక్కులు చేరుతుండగా.. విద్యుదుత్పత్తి చేస్తూ అంతే స్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. దీనికి పాలేరు, మున్నేరు తదితర వాగుల వరద తోడవడంతో ప్రకాశం బ్యారేజ్లోకి 22,107 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టాకు 12,043 క్యూసెక్కులు వదులుతూ బ్యారేజ్ గేట్లు ఎత్తి 10,064 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. మరోవైపు.. గోదావరిలో వరద ప్రవాహం మరింతగా తగ్గింది. ధవళేశ్వరం బ్యారేజ్లోకి 2.66 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 11 వేల క్యూసెక్కులు గోదావరి డెల్టాకు వదులుతూ మిగులుగా ఉన్న 2.55 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. కృష్ణా ఉప నదులు పరవళ్లు.. రెండ్రోజులుగా రాయలసీమ, కర్ణాటకలోని బళ్లారి, కొప్పళ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా ఉపనది అయిన వేదవతి.. పెన్నా, దాని ఉప నదులు చిత్రావతి, పాపాఘ్ని పరవళ్లు తొక్కుతున్నాయి. దీంతో.. చిన్న, మధ్య తరహా ప్రాజెక్టుల్లోకి భారీగా వరద ప్రవాహం చేరుతుండడంతో అవి నిండుకుండలను తలపిస్తున్నాయి. అలాగే, అనంతపురం జిల్లాలోని అప్పర్ పెన్నార్ ప్రాజెక్టు (పేరూరు డ్యామ్) గేట్లు ఎత్తేసి దిగువకు పది వేల క్యూసెక్కులు వదిలేస్తున్నారు. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ఈ డ్యామ్ 6 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. అప్పర్ పెన్నార్ ప్రాజెక్టులోకి పూర్తిస్థాయిలో వరద రావడం.. అన్నిగేట్లు ఎత్తడం మూడు దశాబ్దాల్లో ఇదే ప్రథమం. -
అప్రమత్తతతో తప్పిన గోదావరి ముప్పు
సాక్షి, అమరావతి: ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలకు తోడు నదీ పరివాహక ప్రాంతంలో విస్తారంగా కురిసిన వానలతో కొండ వాగులు, వంకలు, ఉప నదులు ఉప్పొంగడంతో గోదావరి ఉగ్రరూపం దాల్చిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లోని ఆరు జిల్లాల్లో వరద ప్రభావం చూపింది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద 2006లో 28.50 లక్షల క్యూసెక్కులు నమోదు కాగా.. ఆ తర్వాత ఈ ఏడాది 25.80 లక్షల క్యూసెక్కులు రికార్డైంది. ఈ వరద విపత్తు నుంచి ప్రజలను గట్టెక్కించడంలో సీఎం వైఎస్ జగన్ ఆదేశాలను అమలు చేస్తూ ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కీలకపాత్ర పోషించింది. గోదావరి వరద ముప్పు నుంచి ప్రజలను తప్పించేందుకు వారిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ వచ్చింది. వివిధ విభాగాలకు చెందిన 40 వేల మంది సిబ్బంది వరద ప్రభావిత జిల్లాల్లో ప్రజలకు అండగా నిలిచారు. వారిని రక్షించడం నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించడం వరకు విశేష సేవలందించారు. ఇందుకు సంబంధించిన వివరాలను గురువారం ఒక ప్రకటన ద్వారా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ముందుగానే అంచనా.. ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతుండటంతో వరద ప్రవాహాన్ని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ముందుగానే అంచనా వేసింది. వరద ప్రారంభానికి ముందుగానే సంస్థలోని ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్లో 24 గంటలు అందుబాటులో ఉండేలా స్టేట్ కంట్రోల్ రూమ్ను జూలై 9న ప్రారంభించింది. జిల్లాల్లో కూడా కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసింది. అంతేకాకుండా టోల్ ఫ్రీ నంబర్లతో ప్రజలకు అందుబాటులో ఉండి.. వెంటనే స్పందించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. ఆ తర్వాత వరద ప్రవాహాన్ని అంచనా వేస్తూ.. ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలోని అధికారులకు గంట గంటకు సమాచారం చేరవేస్తూ వచ్చింది. తద్వారా ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా గట్టెక్కించింది. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి విపత్తుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్, ఎండీ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, దాదాపు వంద మంది సిబ్బంది నిరంతరం పనిచేస్తూ సేవలు అందించారు. ప్రజలకు అండగా వేలమంది సిబ్బంది.. ఓ వైపు వరద ఉ«ధృతిని అంచనా వేసి మొదటి ప్రమాద హెచ్చరిక నుంచి మూడో ప్రమాద హెచ్చరిక వరకు ప్రతిక్షణం గమనిస్తూ ఆరు జిల్లాల ప్రజలను అప్రమత్తం చేశారు. కీలక సమయంలో గోదావరి పరివాహక ప్రాంతంలోని 23 లక్షల మంది ప్రజలకు వరద ఉధృతిని తెలుపుతూ అలెర్ట్ మెసేజ్లు పంపించారు. ఎన్ని లక్షల క్యూసెక్కులకు ఎన్ని మండలాలు ప్రభావితమవుతాయి? ఎన్ని గ్రామాలు ముంపునకు గురవుతాయి?.. వంటివాటిపై అంచనా వేసి జిల్లాల అధికారులకు సమాచారం అందించారు. తద్వారా వేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించి పెనుప్రమాదాన్ని తప్పించగలిగారు. ఓవైపు అధికారులు, ప్రజలను అప్రమత్తం చేస్తూనే.. మరోవైపు వరద ప్రభావిత జిల్లాల్లో సహాయక బృందాలను రంగంలో దింపారు. 10 ఎన్డీఆర్ఎఫ్, 11 ఎస్డీఆర్ఎఫ్, 3 ఇండియన్ నేవీ బృందాలు శ్రమించి ప్రాణాపాయంలో ఉన్న 183 మందిని రక్షించారు. సహాయక బృందాలు చేరలేని విపత్కర స్థితిలోనూ ఏలూరు జిల్లా కుక్కునూరు, వేలేరుపాడు మండలాలకు హెలికాప్టర్ల ద్వారా ఆరు రోజులపాటు ఆహారం, నిత్యావసర సరుకులను అందించారు. గర్భిణులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వారిని సురక్షితంగా తరలించారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 40 వేల రెవెన్యూ, జలవనరులు, వైద్య, గ్రామ సచివాలయాలు, పారిశుధ్యం, ఇతర విభాగాల సిబ్బంది బాధితులకు సేవలు అందించారు. క్రమంగా తగ్గుతున్న గోదా‘వర్రీ’ పోలవరం రూరల్ / నరసాపురం: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, నరసాపురం ప్రాంతాల్లో గోదావరి నీటిమట్టం గురువారం మరింత తగ్గింది. దీంతో గోదావరి పొడవునా ఏటిగట్టు వెంట ముంపు ప్రాంతాల్లో పరిస్థితులు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. వరద కారణంగా నీట మునిగిన పొన్నపల్లి, లాకుపేట, నందమూరి కాలనీ, స్టేషన్పేట, చినమామిడిపల్లి ప్రాంతాల్లో ఇంకా పూర్తిగా నీరు లాగలేదు. ముంపు ప్రాంతాల్లో నీటిని అధికారులు ఇంజన్లతో తోడిస్తున్నారు. పొన్నపల్లి ఏటిగట్టు ప్రాంతాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, జిల్లా జాయింట్ కలెక్టర్ జేవీ మురళి పరిశీలించి అక్కడ జరుగుతున్న చర్యలను పర్యవేక్షించారు. ముంపు తొలగిన ప్రాంతాల్లో సిబ్బంది పారిశుధ్య పనులు చేపట్టారు. వరదలకు నీట మునిగిన ఆలయాల్లో శుద్ధి కోనసీమ, కాకినాడ, ఏలూరు, తూర్పు గోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో గోదావరి వరద ఉధృతి సమయంలో నీట మునిగిన ఆలయాలన్నింటిలోనూ యుద్ధప్రాతిపదికన శుద్ధి నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆలయ సంప్రదాయాలకు అనుగుణంగా క్లీనింగ్, బ్లీచింగ్, క్లోరినేషన్, ఫాగింగ్, ధూపం తదితర కార్యక్రమాలు చేపట్టాలని దేవదాయ శాఖ కమిషనర్ హరిజవహర్లాల్ గురువారం ఉత్తర్వులిచ్చారు. -
ముంపు ప్రాంతాల్లో మంత్రుల ఏరియల్ సర్వే
సాక్షి, రాజమహేంద్రవరం/పాడేరు: భారీ వర్షాలు, గోదావరి వరద కారణంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో ముంపునకు గురైన ప్రాంతాల్లో రాష్ట్ర బీసీ సంక్షేమ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆదివారం ఏరియల్ సర్వే నిర్వహించారు. హెలికాప్టర్ ద్వారా తూర్పు గోదావరి, ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా గోదావరి ఉగ్రరూపం దాల్చిందన్నారు. వరద బాధితులను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటోందన్నారు. క్షేత్రస్థాయిలో వరద పరిస్థితిని అంచనా వేసేందుకు ఏరియల్ సర్వే నిర్వహించామన్నారు. ఇప్పటికే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏరియల్ సర్వే చేశారని, వరదలకు సంబంధించి సమగ్రమైన నివేదికను అధికారుల ద్వారా రూపొందించి ముఖ్యమంత్రికి అందజేస్తామని చెప్పారు. ఏరియల్ సర్వే నిర్వహిస్తున్న మంత్రి వేణు, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పోలవరం ప్రాజెక్టు, ధవళేశ్వరం బ్యారేజీ, లంక గ్రామాల్లో ముంపు పరిస్థితులపై అధికారులను అప్రమత్తం చేశామన్నారు. మరో 48 గంటలు ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. లంక గ్రామాల్లో చిక్కుకున్న 65 మందిని ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృంధాలు రక్షించాయని చెప్పారు. ప్రజలను ముందస్తుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించి ప్రాణనష్టం లేకుండా చర్యలు తీసుకున్నట్టు మంత్రులు తెలిపారు. బాధిత ప్రజలందరికీ సహాయ, పునరావాస కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. వరద పూర్తిగా తగ్గే వరకు సహాయక చర్యలు కొనసాగించాలని, బియ్యం, ఇతర నిత్యావసరాలన్నింటిని పంపిణీ చేయాలని, వైద్య ఆరోగ్య కార్యక్రమాలు విస్తృతం చేయాలని సీఎం ఆదేశించారని తెలిపారు. అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో విధులు నిర్వహించే విధంగా అప్రమత్తం చేసామని మంత్రులు తెలిపారు. ఏరియల్ సర్వేలో మంత్రులతో పాటు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పాల్గొన్నారు. -
పడవలో వచ్చిన పెళ్లికూతురు
మామిడికుదురు: కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి ఎంతో అట్టహాసంగా ఊరేగింపుగా పెళ్లికి వెళ్లాలని చేసుకున్న ప్లాన్ వర్షాల దెబ్బకు విఫలమైంది. ఊహించని రీతిలో ఎదురైన వరద బెడద ఆడ పెళ్లివారిని నానా తంటాలు పెట్టింది. వరద నీరు వారి గ్రామాన్ని పూర్తిగా చుట్టుముట్టేయటంతో చేసేది లేక పెళ్లికుమార్తె పడవలో వెళ్లి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం పెదపట్నంలంక లంకపేటకు చెందిన నల్లి ప్రశాంతికి, మలికిపురం మండలం కేశనపల్లికి చెందిన గంటా అశోక్కుమార్తో వివాహం నిశ్చయమైంది. గురువారం ఉదయం ముహూర్తంగా నిర్ణయించారు. కానీ పెదపట్నంలంకను గోదావరి వరద చుట్టు ముట్టింది. రోడ్లు ముంపు బారిన పడటంతో బాహ్య ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. అష్టకష్టాలు పడి పెళ్లి కుమార్తెను అతి ముఖ్యులతో కలిసి పడవపై అప్పనపల్లి కాజ్వే వరకు తీసుకువచ్చారు. అక్కడి నుంచి కారులో కేశనపల్లికి చేరుకున్నారు. ముహూర్త సమయానికి కాస్త ఆలస్యమైనా పెళ్లి వేదిక వద్దకు చేరుకోగలిగారు. అనంతరం పెద్దలు పెళ్లి ప్రక్రియ పూర్తి చేశారు. -
Godavari River Floods: ఉగ్ర గోదారి 'హై అలర్ట్'
సాక్షి, అమరావతి/సాక్షి, రాజమహేంద్రవరం/ అమలాపురం/ధవళేశ్వరం/సాక్షి ప్రతినిధి, ఏలూరు/ చింతూరు/ ఎటపాక/దేవీపట్నం (అల్లూరి సీతారామరాజు జిల్లా): గోదావరి మహోగ్రరూపం దాల్చింది. ఎగువనున్న మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశాల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో గోదావరి, దాని ఉప నదులు ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, కడెంవాగు ఉప్పొంగుతున్నాయి. దీంతో ఉప్పెనలా గోదావరి వరదతో విరుచుకుపడుతోంది. వరద ఉధృతి ధాటికి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి ధవళేశ్వరం వరకూ ఉన్న తొమ్మిది ప్రాజెక్టుల గేట్లను పూర్తిగా ఎత్తేశారు. అలాగే, కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన పార్వతి, లక్ష్మీ, సరస్వతి బ్యారేజ్లను గోదావరి వరద ముంచెత్తింది. లక్ష్మీ బ్యారేజ్ వద్దకు 28.30 లక్షల క్యూసెక్కులు చేరడంతో కాళేశ్వరం వద్ద వరద నీటిమట్టం 16.72 అడుగులకు చేరుకుంది. గోదావరి చరిత్రలో 1986లో రికార్డు స్థాయిలో 35,06,338 క్యూసెక్కులు ప్రవాహం వచ్చినప్పుడు కాళేశ్వరం వద్ద వరద నీటిమట్టం 15.75 అడుగులుగా నమోదైంది. ఇప్పుడు ఆ రికార్డు చెరిగిపోవడం గమనార్హం. ఇక ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం అత్యంత ప్రమాదకర స్థాయిని దాటిపోయింది. గురువారం రాత్రి 9 గంటలకు భద్రాచలం వద్ద 19,90,294 క్యూసెక్కులు ఉండగా.. వరద నీటి మట్టం 63.20 అడుగులకు చేరగా. ఇది శుక్రవారం 70 అడుగులను దాటే అవకాశముందని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ), జలవనరుల అధికారులు అంచనా వేస్తున్నారు. గోదావరికి 1986, ఆగస్టు 16న రికార్డు స్థాయిలో వరద వచ్చినప్పుడు భద్రాచలంలో గరిష్ఠంగా 75.6 అడుగులుగా నమోదైంది. ఆ తర్వాత ఆగస్టు 24, 1990న 70.8 అడుగులుగా నమోదైంది. అనంతరం.. గత 32 ఏళ్లుగా ఎన్నడూ భద్రాచలం వద్ద వరద నీటిమట్టం 70 అడుగులను దాటలేదు. తూర్పు గోదావరి జిల్లా బొబ్బిల్లంక వద్ద సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న హోం మంత్రి వనిత, ఎమ్మెల్యే రాజా, కలెక్టర్ మాధవీలత తదితరులు పోలవరం వద్ద హైఅలర్ట్.. ఎగువ నుంచి గోదావరి పోటెత్తుతుండడంతో పోలవరం ప్రాజెక్టు వద్ద రాష్ట్ర ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. 24 గంటలూ ప్రాజెక్టు వద్ద వరద ఉధృతిని అధికారులు సమీక్షిస్తూ ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పోలవరం వద్దకు గురువారం రాత్రి 9 గంటలకు 16,48,375 క్యూసెక్కులు చేరుతుండగా.. వచ్చింది వచ్చినట్లుగా దిగువకు వదిలేస్తున్నారు. పోలవరం ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద వరద మట్టం 36.495 మీటర్లకు చేరగా.. దిగువ కాఫర్ డ్యామ్ వద్ద 26.20 మీటర్లకు చేరుకుంది. ఇక్కడకు శుక్రవారం మధ్యాహ్నం లేదా సాయంత్రానికి 28.50 లక్షల క్యూసెక్కుల వరద చేరే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎంత వరద వచ్చినా ఎదుర్కొనేలా అధికారులు చర్యలు చేపట్టారు. ధవళేశ్వరం బ్యారేజ్లోకి వరద ఉధృతి మరోవైపు.. ధవళేశ్వరం బ్యారేజీలోకి వరద ఉధృతి గంట గంటకూ పెరుగుతోంది. బ్యారేజ్లోకి గురువారం 16,61,565 క్యూసెక్కులు చేరుతోంది. మొత్తం 175 గేట్లను పూర్తిగా ఎత్తి 16,76,434 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేశారు. వరద మట్టం 15.6 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. అలాగే, శుక్రవారం సాయంత్రం లేదా రాత్రికి ధవళేశ్వరం బ్యారేజీలోకి 28.50 లక్షల క్యూసెక్కుల వరద చేరే అవకాశముంది. అప్పుడు వరద మట్టం 17.75 అడుగులను దాటే అవకాశం ఉండటంతో మూడో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీచేయనున్నారు. రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జ్ వద్ద నీటిమట్టం 17.60 అడుగులుగా ఉంది. ఇక ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం పెరిగితే ఆరు జిల్లాల్లోని 42 మండలాల్లో 554 గ్రామాలపై ప్రభావం చూపే అవకాశముంది. అంబేద్కర్ కోనసీమలో 20, తూర్పు గోదావరిలో 8, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 5, పశ్చిమ గోదావరి 4, ఏలూరు జిల్లాలో 3, కాకినాడ జిల్లాలో 2 మండలాలపై వరద ప్రభావం చూపే అవకాశముంది. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కొయిదా గ్రామంలో హెలికాప్టర్ ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ చేస్తున్న దృశ్యం కోనసీమ లంక వాసుల ఆందోళన గోదావరికి మరింత వరద వచ్చే ప్రమాదం పొంచి ఉండడంతో కోనసీమ లంకవాసులు ఆందోళన చెందుతున్నారు. పి.గన్నవరం, మామిడికుదురు, అయినవిల్లి, ముమ్మిడివరం, కె.గంగవరం, ఐ.పోలవరం మండలాల్లోని పలుచోట్ల ఇళ్లలోకి నీరుచేరింది. 18 మండలాల్లోని 59 గ్రామాలు వరద నీట చిక్కుకున్నాయి. 73,400 మంది వరదబారిన పడ్డారు. వరద ఉధృతి మరింత పెరిగితే ఈ మండలాల్లో మరికొన్ని గ్రామాలతోపాటు కాట్రేనికోన, కపిలేశ్వరపురం, ఆత్రేయపురం మండలాల్లోని పలు గ్రామాల్లోని ఇళ్లలోకి నీరు చేరే అవకాశముంది. ముమ్మిడివరం మండలం అన్నంపల్లి అక్విడెక్టు సమీపంలో ఏటిగట్టు తెగే ప్రమాదం పొంచి ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పలు లంకలకు అధికారులు పడవలు ఏర్పాటుచేశారు. అల్లవరం మండలం బోడసకుర్రు మత్స్యకార కాలనీలో 65 ఇళ్లు వరద ముంపుబారిన పడ్డాయి. పి.గన్నవరం మండలం నాగుల్లంక శివారు పల్లిపాలెం, ఎల్.గన్నవరం శివారు జొన్నలలంక. పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని పుచ్చల్లంక, రాయలంక, కనకాయలంక, అయోధ్యలంకల్లో ఇళ్లలోకి నీరు చేరింది. ఈ జిల్లాలో 73 పునరావస కేంద్రాలను గుర్తించి, 143 బోట్లను సిద్ధంచేశారు. 7,600 మందికి అహార ప్యాకెట్లు అందించగా, సుమారు రెండు లక్షల మంచినీటి ప్యాకెట్లు అందించారు. 79 వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. కె.గంగవరం మండలం కోటిపల్లి మత్స్యకార కాలనీలో ముంపు బాధితుల వద్దకు మంత్రి వేణు పడవపై వెళ్లి నిత్యావసర సరుకులు అందజేశారు. పాండిచ్చేరీ యానాంలోని పలు ప్రాంతాల్లో ఇళ్లలోకీ వరద నీరు చేరింది. ‘తూర్పులో ఎనిమిది ప్రాంతాలపై దృష్టి ధవళేశ్వరం హెచ్చరికల నేపథ్యంలో తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ‘తూర్పు’లో ఎనిమిది వరద ప్రభావిత ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎన్టీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నారు. ప్రాణ నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొవ్వూరులో 70, సీతానగరం మండలంలో 270 మందిని రిలీఫ్ క్యాంపులకు తరలించారు. కడియం మండలం బుర్రిలంక గ్రామంలో నీటిలో చిక్కుకున్న 8 మంది గొర్రెల కాపరులను, 60 గొర్రెలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లోని కరకట్టలను ఇసుక బస్తాలతో పటిష్టపరిచారు. ఎటువంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంది. ఇక వరద ప్రభావిత ప్రాంతాల్లో హోంమంత్రి తానేటి వనిత, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, కలెక్టర్ కె.మాధవీలత గురువారం పర్యటించారు. విశాఖ జిల్లా ఎటపాక పోలీసుస్టేషన్లోకి గోదావరి వరద చేరింది. తూర్పు గోదావరి జిల్లా బుర్రింక వద్ద గోదావరి లంకల్లో చిక్కుకున్న గొర్రెలు, గొర్రెల కాపరులను ఒడ్డుకు చేర్చేందుకు బోట్లపైకి ఎక్కిస్తున్న దృశ్యం విలీన మండలాలు విలవిల గోదావరి మహోగ్రరూపంతో పోలవరం ముంపు (విలీన) మండలాల్లోని కుక్కునూరు, వేలేరుపాడు, కూనవరం, వీఆర్పురం, ఎటపాక, చింతూరు మండలాల్లోని అనేక గ్రామాలు వరద ముంపులో చిక్కుకున్నాయి. 12,694 కుటుంబాలకు చెందిన 36 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. చింతూరు కేంద్రంగా అధికారులు ముమ్మరంగా సహాయ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సాయంతో లాంచీలు, బోట్ల ద్వారా నిత్యావసరాలను ముంపు ప్రాంతాలకు తరలించి పునరావాస కేంద్రాల్లోని బాధితులకు అందచేస్తున్నారు. దేవీపట్నం మండలంలోని గండిపోశమ్మ ఆలయం పూర్తిగా నీటమునిగింది. వేలేరుపాడు మండలంలో కొయిదా గ్రామానికి గురువారం హెలికాఫ్టర్ ద్వారా 800 మందికి సరిపోయే నిత్యావసరాలు అందించారు. శుక్రవారం కూడా ఇలాగే అందించనున్నారు. పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, ఎస్పీ రాహుల్దేవ్శర్మలు వేలేరుపాడులో పర్యటించి పునరావాస కేంద్రాలు పరిశీలించారు. -
యుద్ధప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ పనులు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు, పోటెత్తుతున్న గోదావరి వరదల కారణంగా ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల పరిధిలోని విద్యుత్ వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లింది. అనేక గ్రామాల్లో ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అనేక చోట్ల ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు కుప్పకూలాయి. వాటిని పునరుద్ధరించేందుకు అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి యుద్ధప్రాతిపదికన పనులు జరిపిస్తున్నారు. ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని రాజమండ్రి, అమలాపురం, రంపచోడవరం, రామచంద్రపురం, జంగారెడ్డిగూడెం, నిడదవోలు డివిజన్లలో 33/11 కేవీ సబ్స్టేషన్లు 5 దెబ్బతినగా ఒక సబ్స్టేషన్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. 33 కేవీ ఫీడర్ ఒకటి పాడైంది. 11 కేవీ ఫీడర్లు 29 పాడయ్యాయి. 11 కేవీ స్తంభాలు 534, 11 కేవీ లైన్లు 20 కిలోమీటర్లు, ఎల్టీ స్తంభాలు 557, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు 2,326 దెబ్బతిన్నాయి. 4 మండలాలు, 241 గ్రామాలు, 2548 వ్యవసాయ,33226 వ్యవసాయేతర సర్వీసులకు 62 ప్రత్యేక బృందాలతో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు జరుగుతున్నట్లు డిస్కం సీఎండీ సంతోషరావు ‘సాక్షి’కి తెలిపారు. ఏపీసీపీడీసీఎల్ పరిధిలోని విజయవాడ, సీఆర్డీఏ, గుంటూరు, ఒంగోలు జిల్లాల్లో 33 కేవీ ఫీడర్లు 2, 33కేవీ స్తంభాలు 7, 11కేవీ ఫీడర్లు 13 దెబ్బతినగా వాటిని పునరుద్ధరించారు. 11కేవీ స్థంభాలు 173 పడిపోగా వాటిలో 104 నిలబెట్టారు. డిస్కం మొత్తం మీద 11కేవీ లైన్లు 3.54 కిలోమీటర్ల మేర తెగిపోగా బుధవారానికి 2.56 కి.మీ మేరకు బాగు చేశారు. ఎల్టీ లైన్లు 12.73 కి.మీ దెబ్బతినగా, 5 కి.మీ సరిచేశారు. ఎల్టీ స్తంభాలు 242 ఒరిగిపోగా 211 స్తంభాలను పునరుద్ధరించారు. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు (డీటీఆర్) 77 దెబ్బతిన్నాయి. వీటి స్థానంలో 31 డీటీఆర్లను ఏర్పాటు చేశారు. ప్రమాదాలు జరగవచ్చు.. జాగ్రత్త భారీ వర్షాలు, వరదల కారణంగా విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశముందని, విద్యుత్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని డిస్కంల సీఎండీలు విజ్ఞప్తి చేశారు. కరెంటుతో సంబంధం ఉండే ఏ వస్తువునైనా ఒకటికి రెండుసార్లు పరిశీలించిన తరువాతే తాకాలని సూచించారు. విద్యుత్ సమస్యలు తలెత్తితే టోల్ ఫ్రీ నంబర్ 1912కు తెలియజేయాలన్నారు. -
మహోగ్ర గోదావరి.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక
సాక్షి, అమరావతి/అమలాపురం/ధవళేశ్వరం/పోలవరం రూరల్/చింతూరు/ఎటపాక: మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండటం.. ఉప నదులు ఉప్పొంగుతుండటంతో గోదావరి నది బుధవారం మహోగ్రరూపం దాల్చింది. వరద తీవ్రరూపం దాల్చడంతో ధవళేశ్వరం బ్యారేజీకి గల 175 గేట్లు ఎత్తేశారు. బుధవారం రాత్రి 8 గంటలకు బ్యారేజీలోకి 15,11,169 క్యూసెక్కులు చేరుతుండగా.. వరద మట్టం 15.1 అడుగులకు చేరుకుంది. దాంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఎగువన కాళేశ్వరంలో 14.67 మీటర్లు, పేరూరులో 16.46 మీటర్లు, దుమ్ముగూడెంలో 14.41 మీటర్లు, కూనవరంలో 22.27మీటర్లు, కుంటలో 13.31 మీటర్లు, పోలవరంలో 13.84 మీటర్లు, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి వద్ద 17.23 మీటర్ల చొప్పున నీటిమట్టాలు నమోదయ్యాయి. వరద తీవ్రరూపం దాల్చడంతో ధవళేశ్వరం బ్యారేజీకి గల 175 గేట్లు ఎత్తేశారు. డెల్టా కాలువలకు 4 వేల క్యూసెక్కులు విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 15,07,169 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు.బ్యారేజీలోకి వచ్చే ప్రవాహం 19 లక్షల క్యూసెక్కులు దాటితే ఇళ్లలోకి నీరు చేరుతుందని భావిస్తున్నారు. గురువారం రాత్రికి బ్యారేజీలోకి భారీగా వరద వచ్చే అవకాశం ఉండటంతో ముంపు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. పోటెత్తిన కడెం ప్రాజెక్ట్ చరిత్రలో ఎన్నడూ లేనిరీతిలో జూలై రెండో వారంలోనే గరిష్ట స్థాయిలో వరద ప్రవాహం కడలి వైపు పరుగులు తీస్తోంది. తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో 3.82 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేసే సామర్థ్యంతో కడెం ప్రాజెక్టు స్పిల్ వేను నిర్మిస్తే.. ఆ ప్రాజెక్టులోకి కడెం వాగు నుంచి 5.69 లక్షల క్యూసెక్కులు చేరుతోంది. ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి, కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన పార్వతి, లక్ష్మి, సరస్వతి బ్యారేజీల గేట్లను పూర్తి స్థాయిలో ఎత్తేసి.. వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తున్నారు. దాంతో తుపాకులగూడెం వద్ద నిర్మించిన సమ్మక్క బ్యారేజీలోకి 17.65 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. అంతే స్థాయిలో దిగువకు విడుదల చేస్తుండటంతో భద్రాచలం వద్ద గంట గంటకూ ప్రవాహం పెరుగుతోంది. బుధవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్దకు 15,14,976 క్యూసెక్కులు చేరుతుండగా.. వరద మట్టం 54.70 అడుగులకు చేరుకుంది. దాంతో భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి లేదా గురువారం ఉదయానికి భద్రాచలం వద్దకు 18 లక్షల క్యూసెక్కుల వరద చేరే అవకాశం ఉందని.. నీటిమట్టం 60 అడుగులకు చేరే అవకాశం ఉందని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అంచనా వేసింది. గోదావరి చరిత్రలో ఆగస్టు 16, 1986లో గరిష్టంగా 36 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినప్పుడు.. భద్రాచలం వద్ద వరద మట్టం 75.6 అడుగులుగా నమోదైంది. పోలవరం వద్ద 24 గంటలూ అప్రమత్తత ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో పోలవరం ప్రాజెక్టు వద్ద జలవనరుల శాఖ అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉంటున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వరద నియంత్రణ చర్యలు తీసుకుంటున్నారు. ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టులోకి బుధవారం రాత్రి 8 గంటలకు 14,54,636 క్యూసెక్కులు చేరుతుండటంతో స్పిల్ వే వద్ద నీటిమట్టం 34.21 మీటర్లుగా నమోదైంది. ప్రాజెక్టు 48 గేట్లను పూర్తిస్థాయిలో ఎత్తేసి అంతే స్థాయిలో దిగువకు వరద విడుదల చేస్తుండటంతో దిగువ కాఫర్ డ్యామ్ వద్ద వరద మట్టం 26 మీటర్లకు చేరుకుంది. గురువారం ఉదయానికి పోలవరం ప్రాజెక్టులోకి 18 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. లంకల్ని ముంచెత్తిన వరద – నీట మునిగిన రహదారులు.. కాజ్వేలు కోనసీమ జిల్లాలోని లంక గ్రామాల్లో వరద ముంపు మరింత పెరిగింది. ప్రధాన రహదారులు ముంపుబారిన పడ్డాయి. ఇళ్ల చుట్టూ వరద నీరు చేరింది. ఆయా గ్రామాలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. పి.గన్నవరం మండలం జి.పెదపూడిలంక, బూరుగులంక, అరిగెలవారిలంక, ఊడుమూడిలంక, నాగుల్లంక, కె.ఏనుగుపల్లి ముంపుబారిన పడ్డాయి. ఈ గ్రామాల్లో నాలుగు అడుగుల ఎత్తున నీరు ప్రవహిస్తోంది. అలాగే మానేపల్లి శివారు పల్లిపాలెం, శివాయలంక జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ మండలాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలోని అయోధ్యలంక, పుచ్చల్లంక, కనకాయలంక, పెదమల్లంలంక, అనగారలంక సైతం నీట మునిగాయి. మామిడికుదురు మండలంలోని పాశర్లపూడి కాజ్వే, అయినవిల్లి మండలం ఎదురుబిడియం కాజ్వే మీదుగా వరద నీరు ప్రవహిస్తుండటంతో ఆరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ముమ్మిడివరం మండలం గురజాపులంక, లంకాఫ్ ఠాన్నేల్లంకలో ఎస్సీ కాలనీలు ముంపుబారిన పడ్డాయి. ఐ.పోలవరం మండలం కేశనకుర్రు పరిధిలో పొగాకులంక, పొట్టిలంకల్లో రోడ్ల మీద నీరు ప్రవహిస్తోంది. కె.గంగవరం మండలం కోటిపల్లి మత్స్యకార కాలనీలో ముంపుబారిన పడింది. పాండిచ్చేరి పరిధిలోని యానాంలో బాలయోగి నగర్ కాలనీ, ఓల్డ్ రాజీవ్ నగర్ వద్ద వరద నీరు ఇళ్లల్లోకి చేరింది. కోనసీమ జిల్లా వ్యాప్తంగా 43 పునరావాస కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ముంపులోనే విలీన మండలాలు తగ్గినట్టే తగ్గిన గోదావరి వరద మళ్లీ పెరుగుతోంది. వరుసగా మూడో రోజు కూడా పోలవరం ముంపు మండలాలైన చింతూరు, కూనవరం, వీఆర్పురం, ఎటపాక మండలాలు వరద గుప్పిట్లోనే ఉన్నాయి. వరద మరింత పెరిగే పరిస్థితి నెలకొంది. నాలుగు మండలాల్లో 87 గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకోగా ఇప్పటికే 6,500 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. అల్లూరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చింతూరు ఐటీడీఏలో మకాం వేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. బోటులో ప్రయాణించి వరద పరిస్థితిని, సహాయక కార్యక్రమాలను పరిశీలించారు. చింతూరు నుంచి బోట్లు, లాంచీల సాయంతో నిత్యావసర సరుకులను ముంపు మండలాలకు తరలిస్తున్నారు. బోటింగ్కు తాత్కాలికంగా బ్రేక్! .. గోదావరి, కృష్ణా నదుల్లో వరద ఉధృతి కారణంగా పర్యాటక శాఖ బోటింగ్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసింది. పోచమ్మగండి నుంచి పాపికొండలుకు విహార యాత్రను రద్దు చేసింది. రాజమండ్రి ఘాట్లతో పాటు దిండి ప్రాంతంలో బోటింగ్ ఆపేసింది. విజయవాడలోని బెరంపార్క్–భవానీ ద్వీపానికి జల ప్రయాణానికి విరామం ప్రకటించింది. చురుగ్గా సహాయక చర్యలు గోదావరి వరద సహాయక చర్యల్లో 6 ఎన్డీఆర్ఎఫ్, 4 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు నిమగ్నమై ఉన్నట్టు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. గోదావరి లంక గ్రామాల ప్రజలు వారి ప్రాంతాల్లో వరద ప్రభావం ఎక్కువగా ఉంటే కంట్రోల్ రూమ్కు సమాచారం ఇవ్వాలన్నారు. అత్యవసర సహాయం, సమాచారం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే స్టేట్ కంట్రోల్ రూమ్ నంబర్లు 1070, 1800–425–0101, 08632377118లో సంప్రదించాలన్నారు. కాగా, భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో రెవెన్యూ విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ మాట్లాడుతూ.. గోదావరి, కృష్ణా, తుంగభద్ర నదుల వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ సంబంధిత జిల్లాల కలెక్టర్లకు ఎప్పటికప్పుడు సూచనలు జారీ చేస్తున్నామన్నారు. మూడో ప్రమాద హెచ్చరిక వస్తే ప్రభావితం చూపే మండలాలపై జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని చెప్పారు. కృష్ణా నదిలో వరద పరవళ్లు కృష్ణా నదితోపాటు ప్రధాన ఉప నది తుంగభద్రలో వరద ప్రవాహం పరవళ్లు తొక్కుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర డాŠయ్మ్లలో నీటి నిల్వ గరిష్ట స్థాయికి చేరడం, ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో గేట్లు ఎత్తేసి దిగువకు భారీ ఎత్తున వరదను విడుదుల చేస్తున్నారు. దాంతో శ్రీశైలంలోకి గురువారం నుంచి వరద ప్రవాహం పెరగనుంది. పశ్చిమ కనుమల్లో మరో మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ దృష్ట్యా శ్రీశైలంలోకి భారీగా వరద ప్రవాహం కొనసాగే అవకాశం ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 167.49 టీఎంసీలు అసవరం. నాగార్జునసాగర్కు దిగువన కురుస్తున్న వర్షాల వల్ల మూసీ నుంచి పులిచింతల్లోకి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. పులిచింతలకు దిగువన కురుస్తున్న వర్షాల ప్రభావం వల్ల మున్నేరు, కట్టలేరు తదితర వాగులు, వంకల నుంచి వరద కృష్ణా నది మీదుగా ప్రకాశం బ్యారేజీలోకి 27,746 క్యూసెక్కులు చేరుతోంది. కృష్ణా డెల్టాకు 4 వేల క్యూసెక్కులు విడుదల చేస్తూ.. మిగులుగా ఉన్న 23,746 క్యూసెక్కులను 30 గేట్లను అరడుగు మేర ఎత్తి సముద్రంలోకి వదిలేస్తున్నారు. -
ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం
-
Rain Alert: బలపడిన అల్పపీడనం.. పలుచోట్ల భారీ వర్షాలు
సాక్షి, అమరావతి: ఒడిశా తీరంలో అల్పపీడనం మరింత బలపడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 7.6కి.మీ ఎత్తులో విస్తరించి ఉన్నట్లు తెలిపింది. వీటి ప్రభావంతో కోస్తా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మంగళవారం అల్లూరి సీతారామరాజు, పల్నాడు, అనకాపల్లి, నెల్లూరు, వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. ఎస్డీఆర్ఎఫ్ సహాయక చర్యలు గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎస్డీఆర్ఎఫ్ (స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) బృందాలు చురుగ్గా పనిచేస్తున్నాయి. మంగళవారం పలు గ్రామాల నుంచి 1,125 మందిని బోట్లలో సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. కూనవరం మండలం టేకులముండి నుంచి 275 మంది, రాజుపేట, వడ్డిగూడెం గ్రామాల నుంచి 200 మంది, టేకులబోరు, కూనవరం, గిన్నెల బజార్, రేఖపల్లి గ్రామాల నుంచి 300 మంది, ధర్మతులగూడెం నుంచి 350 మందిని బోట్ల ద్వారా బయటకు తీసుకువచ్చి షెల్టర్లకు తరలించారు. -
కృష్ణమ్మ పరుగులు
సాక్షి,అమరావతి/హొళగుంద/హొసపేటె/రాయచూర్ రూరల్: శ్రీశైలం ప్రాజెక్టు దిశగా కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల డ్యామ్ల గేట్లు ఎత్తేసి.. దిగువకు వరదను విడుదల చేస్తుండడంతో జూరాల ప్రాజెక్టు గేట్లనూ ఎత్తేశారు. ఈ ప్రవాహానికి.. స్థానికంగా కురిసిన వర్షాల ప్రభావంవల్ల వరద తోడవడంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి 39,351 క్యూసెక్కులు చేరుతున్నాయి. నిజానికి.. గతేడాది జూలై 11న ఎగువ నుంచి శ్రీశైలానికి కృష్ణమ్మ చేరగా.. ఈ ఏడాది రెండ్రోజులు ఆలస్యంగా చేరుకుంది. మరోవైపు.. నైరుతి రుతుపవనాలు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంవల్ల పశ్చిమ కనుమల్లో ప్రధానంగా కృష్ణా పరీవాహక ప్రాంతంలో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కృష్ణా, తుంగభద్ర, ఉప నదులు ఉరకలెత్తుతున్నాయి. మరో మూడ్రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ అంచనాలు.. ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో కృష్ణా ప్రధాన పాయపై ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ గేట్లను కర్ణాటక సర్కార్ మంగళవారం ఎత్తేసింది. అలాగే, తుంగభద్ర డ్యామ్లోకి సైతం భారీఎత్తున 1,27,188 క్యూసెక్కుల నీరు చేరుతుండటం.. నీటినిల్వ గరిష్ఠ స్థాయికి చేరడంతో 20 గేట్లనూ ఎత్తేశారు. డ్యాం చరిత్రలో 1971 తర్వాత ఈ స్థాయిలో జలాశయానికి జూలై నెలలో వరద నీరు చేరడం ఇదే మొదటిసారి. దీంతో ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర డ్యామ్ల నుంచి దిగువకు విడుదల చేస్తున్న వరద ప్రవాహం బుధవారం శ్రీశైలానికి చేరుకోనుంది. నాగార్జునసాగర్కు దిగువన పరీవాహక ప్రాంతంలో కురిసిన వర్షాల ప్రభావంవల్ల మూసీ, వైరా వంటి ఉప నదుల నుంచి పులిచింతలలోకి 11,548 క్యూసెక్కులు చేరుతోంది. అలాగే, పులిచింతలకు దిగువన పరివాహక ప్రాంతంలో కురిసిన వర్షాలవల్ల మున్నేరు, కట్టలేరు తదితర వాగులు, వంకల నుంచి ప్రకాశం బ్యారేజీలోకి 45,985 క్యూసెక్కులు చేరుతోంది. కృష్ణా డెల్టాకు 4,800 క్యూసెక్కులు వదులుతూ మిగులుగా ఉన్న 41,185 క్యూసెక్కులను ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తేసి సముద్రంలోకి వదిలేస్తున్నారు. -
ప్రాణ నష్టం జరగకూడదు
సాక్షి, అమరావతి: భారీ వర్షాలు, వరదల కారణంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణ నష్టం జరగరాదని, ఏ ఒక్క ప్రాణం పోకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టి అప్రమత్తంగా ఉండాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. బాధితుల పట్ల మానవతా దృక్ఫథంతో వ్యవహరించాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని వెంటనే సహాయ శిబిరాలకు తరలించాలన్నారు. శిబిరాల నుంచి తిరిగి ఇళ్లకు వెళ్లేటప్పుడు తక్షణ సాయంగా ఒక్కో కుటుంబానికి రూ.2 వేలు, వ్యక్తికి అయితే రూ.1,000 చొప్పున ఇవ్వాలని ఆదేశించారు. అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, ఏలూరు, బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాల కలెక్టర్లకు రూ.2 కోట్ల చొప్పున తక్షణం రూ.8 కోట్ల నిధులు ఇస్తున్నట్లు ప్రకటించారు. గోదావరికి వందేళ్లలో ముందస్తు వరదలు, భారీ వర్షాల నేపథ్యంలో మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన ముఖ్యమంత్రి జగన్ సహాయ చర్యలపై మార్గ నిర్దేశం చేశారు. వరద నష్టంపై ఎప్పటికప్పుడు వివరాలు సేకరించి సీఎంవో అధికారులకు రోజువారీ నివేదిక పంపాలని కలెక్టర్లకు సూచించారు. నెల ముందే భారీ వరదలు గోదావరికి ముందస్తు వరదలు వచ్చాయని, గత వందేళ్లలో ఇంత ముందుగా ఈ స్ధాయిలో వరద రాలేదని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. సాధారణంగా ఆగస్టులో 10 లక్షల క్యూసెక్కుల వరద ఉంటుందని, తొలిసారిగా జూలైలోనే అంతకు మించి వరద వచ్చిందని చెప్పారు. ఇది జాగ్రత్త పడాల్సిన అంశమని అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ప్రస్తుతం ధవళేశ్వరంలో 13 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల అవుతుండగా, రెండో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారని తెలిపారు. బుధవారం ఉదయానికి వరద పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని, ప్రవాహం 15 నుంచి 16 లక్షల క్యూసెక్కులకు చేరుకునే అవకాశం ఉందని వెల్లడించారు. దీనివల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. మహారాష్ట్రలో భారీ వర్షాల నేపథ్యంలో గోదావరికి వరద కొనసాగే అవకాశం ఉందన్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. 24 గంటలు కంట్రోల్ రూమ్లు కూనవరం, చింతూరు, వి.ఆర్.పురం, అమలాపురంలో ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. లైన్ డిపార్ట్మెంట్లు ప్రత్యామ్నాయాలతో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. కంట్రోల్ రూమ్స్ సమర్థంగా 24 గంటలపాటు నిరంతరాయంగా పని చేయాలని స్పష్టం చేశారు. శిబిరాల్లో ఖర్చుకు వెనుకాడొద్దు.. అవసరమైన చోట్ల వరద సహాయ శిబిరాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. శిబిరాల్లో ఏర్పాట్లు బాగుండాలన్నారు. మంచి ఆహారం, తాగునీరు, ఇతర సౌకర్యాల కల్పనలో ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని స్పష్టం చేశారు. బాధితుల పట్ల మానవతా దృక్ఫధంతో మెలగాలని, శిబిరాల నుంచి తిరిగి ఇళ్లకు వెళ్లేటప్పుడు వారంతా ప్రశంసించేలా సదుపాయాలు కల్పించాలని సూచించారు. సహాయ శిబిరాల్లో నాణ్యమైన సేవలందించే క్రమంలో ఖర్చుకు వెనుకాడొద్దని సీఎం జగన్ స్పష్టం చేశారు. అత్యవసర మందులు, నిత్యావసరాలు పీహెచ్సీలు, సీహెచ్సీలు, ఏరియా ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది, నర్సులు, ఇతర సిబ్బందిని పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంచి అత్యవసర మందులను అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. నిత్యావసర సరుకులకు సంబంధించి తగినంత నిల్వ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పారిశుధ్యం బాగుండాలని స్పష్టం చేశారు. తాగునీటి పథకాలు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్తు సరఫరాలో అంతరాయాలు తలెత్తితే అత్యవసర సేవలు అందించేందుకు వీలుగా జనరేటర్లను, తాగునీటి కోసం ట్యాంకర్లను సిద్ధం చేసుకోవాలని సూచించారు. బోట్లు, లైఫ్ జాకెట్లు.. వర్షాల నేపథ్యంలో శిథిలావస్థలో ఉన్న నిర్మాణాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు. చెరువులు, ఇరిగేషన్ కాల్వలు బలహీనంగా ఉన్నచోట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విద్యుత్ సబ్స్టేషన్లు ముంపు బారిన పడకుండా చర్యలు చేపట్టి బోట్లు, లైఫ్ జాకెట్లు అవసరమైన చోట్ల సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ఈ సమావేశంలో హోం, విపత్తుల నిర్వహణశాఖ మంత్రి తానేటి వనిత, వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్రెడ్డి, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ జి.సాయి ప్రసాద్, గృహ నిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్జైన్, ఇంధనశాఖ కార్యదర్శి కె.విజయానంద్, జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్కుమార్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, సివిల్ సఫ్లైస్ కమిషనర్ గిరిజా శంకర్, డిజాస్టర్ మేనేజ్మెంట్ డైరెక్టర్ బీఆర్ అంబేడ్కర్ తదితరులు పాల్గొన్నారు. -
ఏపిలో భారీ వర్షాలు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు
-
Andhra Pradesh: మరో రెండ్రోజులు వర్షాలే
సాక్షి, అమరావతి: బంగాళాఖాతంలో ఒడిశా–ఏపీ తీరం మీదుగా ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. ప్రస్తుతం ఇది ఒడిశా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర వైపు కదులుతోంది. మొన్నటి వరకు ఇది ఏపీ మీదుగా తెలంగాణ, మహారాష్ట్ర వైపు కదిలింది. ఇది భూమిపైనే కొనసాగుతూ రెండ్రోజుల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఒకవేళ తీవ్రరూపం దాల్చకపోయినా అల్పపీడనంగానే 4, 5 రోజులపాటు కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీని ప్రభావంతో నైరుతి రుతు పవనాలు చురుగ్గా మారాయి. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. తీర ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. వచ్చే రెండ్రోజులు ఉత్తరాంధ్ర, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండనుంది. మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాగా, సోమవారం అల్లూరి జిల్లాలో 1.2 సెం.మీ. సగటు వర్షపాతం నమోదైంది. ముంచంగిపుట్టు మండలం బోరంగులలో 5.3 సెం.మీ. అత్యధిక వర్షం కురిసింది. అరకు లోయ, పాడేరు, చింతూరు, హుకుంపేటలలో 3 నుంచి 3.5 సెం.మీ. వర్షం పడింది. వర్షాల కారణంగా పలు రైళ్లు రద్దు రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ముందస్తు భద్రత చర్యల్లో భాగంగా విజయవాడ డివిజన్ మీదుగా నడిచే పలు రైళ్లను పూర్తిగా, మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ పీఆర్వో నస్రత్ మండ్రూప్కర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాకినాడ–విశాఖపట్నం–కాకినాడ (17267/17268), విజయవాడ–బిట్రగుంట–విజయవాడ (07978/07977) రైళ్లు ఈ నెల 11 నుంచి 13 వరకు పూర్తిగా రద్దు చేశారు. కాకినాడ పోర్టు–విజయవాడ (17258) ఎక్స్ప్రెస్ రైలు ఈ నెల 11 నుంచి 13 వరకు రాజమండ్రి నుంచి బయలుదేరి, విజయవాడ వరకు నడుస్తుంది. విజయవాడ–కాకినాడ పోర్టు (17257) ఎక్స్ప్రెస్ రైలు ఈ నెల 11 నుంచి 13 వరకు విజయవాడలో బయలుదేరి, రాజమండ్రి వరకు నడుస్తుంది. భారీ వర్షాలు, వరదలు నేపథ్యంలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు కాకినాడ కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నెంబర్ 1800 425 3077 కాకినాడ ఆర్డీవో కార్యాలయం కంట్రోల్ రూమ్: 0884 2368100 పెద్దాపురం ఆర్డీవో కార్యాలయం కంట్రోల్ రూమ్: 9606363327 -
నాలుగు రోజులపాటు భారీ వర్షాలు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వచ్చే నాలుగు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరం నుంచి వాయువ్య దిశలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్టు గురువారం తెలిపింది. ఫలితంగా ఉత్తరాంధ్రతోపాటు యానాం, దక్షిణ కోస్తాలో 8, 9, 10, 11 తేదీల్లో అక్కడక్కడా మెరుపులు, ఉరుములతో కూడిన భారీ, అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రాయలసీమలో శుక్ర, శనివారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే వీలుందని తెలిపింది. కాగా, గురువారం రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలంలో 74.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. సీతంపేటలో 52.8, పెందుర్తిలో 45.6, ఆనందపురంలో 42.2, వేలేరుపాడులో 30.6, మంత్రాలయంలో 31.2, కూనవరంలో 20.4, నందికొట్కూరులో 24.4, కుకునూర్లో 25, వంగరలో 28.2, కోటనందూరులో 21.4, కోసిగిలో 21.6, సీతానగరంలో 20.4 మిల్లీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. కర్నూలు జిల్లాలో బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. -
గుడ్న్యూస్: నైరుతి ఆగమనం
సాక్షి,అమరావతి/చిత్తూరు అగ్రికల్చర్: అనుకున్నట్లుగానే నైరుతి రుతుపవనాలు ముందస్తుగా దేశంలోకి ప్రవేశించాయి. దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్, నికోబార్ దీవుల్లో ఎక్కువ భాగాలు, అండమాన్ సముద్ర ప్రాంతాన్ని సోమవారం రుతుపవనాలు తాకాయి. సాధారణంగా ఈ నెల 22న రుతుపవనాలు ఈ ప్రాంతంలోకి ప్రవేశించాల్సి ఉంది. కానీ అనుకూల వాతావరణ పరిస్థితుల కారణంగా వారం ముందే ప్రవేశించాయి. రాబోయే రెండు, మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం, మొత్తం అండమాన్ సముద్రం, అండమాన్ దీవులతోపాటు తూర్పు, మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి విస్తరించేందుకు అనువైన పరిస్థితులు నెలకొన్నట్లు వాతావరణ శాఖ, హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపాయి. వీటి ప్రభావంతో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు తగ్గాయి. భూవాతావరణంలోనూ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలోనూ 40 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కాకపోతే ఉక్కపోత ఉండడంతో కోస్తా ప్రాంతంలో వాతావరణం వేడిగా ఉంది. రాయలసీమలో భారీ వర్షాలు మరోవైపు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో సోమవారం భారీ వర్షాలు కురిశాయి. ఉత్తర ఛత్తీస్గఢ్, విదర్భ మీదుగా బిహార్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఉన్న ఉత్తర – దక్షిణ ద్రోణి మరింతగా విస్తరించి ఉంది. ఇది ఉత్తర తమిళనాడు, కర్ణాటక మీదుగా సగటు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో వ్యాపించింది. దీనికితోడు నైరుతి బంగాళాఖాతం, ఉత్తర తమిళనాడు తీరప్రాంతాల్లో ఉన్న ఉపరితల ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం చిత్తూరు, కర్నూలు, వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో జోరు వానలు కురిశాయి. శ్రీకాళహస్తి, సత్యవేడు, సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి, రేణిగుంట, పుత్తూరు, తిరుపతి, మదనపల్లి, పలమనేరు, చిత్తూరు, తిరుమల, చంద్రగిరి, కుప్పం, ఐరాల, జీడీ నెల్లూరు, వెదురుకుప్పం, కురబలకోట, గుర్రంకొండ, వాల్మీకిపురం, సుండుపల్లి, వీరబల్లి, ఆదోని, పత్తికొండ, బద్వేలు, దువ్వూరు, పోరుమామిళ్ల, సిద్ధవఠం, మైదుకూరు, రాయచోటి, సంబేపల్లె తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడ్డాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెట్ల కొమ్మలు, ఫ్లెక్సీలు నేలకూలాయి. తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం అరుదూరులోని శివాలయంలో ధ్వజస్తంభం కూలిపోయింది. ఇద్దరు గొర్రెల కాపర్లు మృత్యువాత వైఎస్సార్ జిల్లాలో సోమవారం భారీ వర్షం కురిసింది. దువ్వూరు మండలంలో పిడుగుపాటుకు గొర్రెల కాపర్లు.. నల్లబోతుల హనుమంతు (56), శెట్టిపల్లె మునిరావు (32) మృతి చెందారు. గొర్రెలు మేపుకునేందుకు గుట్టకు వెళ్లిన వీరు వాన ప్రారంభం కావడంతో సమీపంలోని మర్రిచెట్టు వద్దకు వెళ్లారు. అంతలోనే పెద్ద శబ్దంతో పిడుగుపడటంతో అక్కడికక్కడే మృతి చెందారు. బద్వేలులోని సురేంద్రనగర్లో ఓ ఇంటిపై పిడుగు పడటంతో గృహోపకరణాలు కాలిపోయాయి. వల్లూరు మండలం తప్పెట్ల బస్టాప్ వద్ద భారీ చెట్టు వర్షానికి కూలిపోయింది. అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని అనిబిసెంట్ వీధిలో ఓ మొబైల్ దుకాణంలోకి వర్షపునీరు చేరడంతో రూ.లక్షల విలువ చేసే ఎలక్ట్రానిక్స్ పరికరాలు నీటమునిగాయి. కోస్తాలో మోస్తరు వానలకు ఆస్కారం కాగా, వచ్చే రెండు రోజులు రాయలసీమలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అనేక చోట్ల పిడుగులు పడతాయని పేర్కొంది. కోస్తా ప్రాంతంలోనూ పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. -
అనూహ్య ‘అసని’
సాక్షి, విశాఖపట్నం/అమరావతి: వాతావరణ శాఖ అంచనాలను సైతం తలకిందులు చేస్తూ.. అనూహ్యంగా అటూఇటూ ప్రయాణిస్తోంది ‘అసని’ తీవ్ర తుపాను. రోజుకో దిశలో.. పూటకో వేగంతో కదులుతోంది. విశాఖ తీరానికి సమీపించి.. ఒడిశా వైపు వెళ్తున్నట్లు కనిపించిన తీవ్ర తుపాను మరోసారి దిశ మార్చుకుని మచిలీపట్నం వైపుగా ప్రయాణిస్తోంది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోంది. విశాఖ తీరం వైపు వచ్చిన సమయంలో గంటకు 16 కి.మీ. వేగంతో ప్రయాణించి.. దిశ మారిన తర్వాత నెమ్మదించింది. ప్రస్తుతం గంటకు 10 కి.మీ. వేగంతో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోంది. మంగళవారం రాత్రి 11.15 గంటల సమయానికి కాకినాడకు 170 కి.మీ., విశాఖకు 290 కి.మీ., గోపాలపూర్కు 530 కి.మీ., పూరీకి 630 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. బుధవారం ఉదయానికి మచిలీపట్నం–బాపట్ల మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తర్వాత ఉత్తర ఈశాన్య దిశగా మలుపు తిరిగి సముద్రంలోకి వెళ్తుందని.. అక్కడి నుంచి మరింత బలహీనపడి కాకినాడ మీదుగా విశాఖపట్నం తీరం వైపు వస్తుందని అంచనా వేస్తున్నారు. బుధవారం ఉదయానికి తుపానుగా.. గురువారం ఉదయానికి వాయుగుండంగా బలహీనపడనుంది. ప్రకాశం, చీరాల, బాపట్ల ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు తుపాను ప్రభావంతో ప్రకాశం, చీరాల, బాపట్ల ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. సుమారు 25 సెం.మీ. మేర వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. బుధ, గురువారాల్లో కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లోనూ మోస్తరు వానలు కురిసే సూచనలున్నాయి. కాకినాడ జిల్లా ఉప్పాడ వద్ద సముద్ర కెరటాల ఉధృతికి కూలిపోతున్న మత్స్యకారుల ఇళ్లు 75–85 కి.మీ. వేగంతో గాలులు బుధవారం ఉదయం తీరం వెంబడి గంటకు 55 నుంచి 65 కి.మీ., గరిష్టంగా 75 కి.మీ. వేగంతోనూ మధ్యాహ్న సమయంలో గంటకు 75 నుంచి 85 కిమీ, గరిష్టంగా 95 కి.మీ. వేగంతోనూ బలమైన గాలులు వీస్తాయి. కాకినాడ, విశాఖపట్నం, భీమిలి, గంగవరం పోర్టుల్లో గ్రేట్ డేంజర్ సిగ్నల్–10 (జీడీ–10), మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో జీడీ–8 హెచ్చరికలు జారీ చేశారు. సహాయక చర్యలకు నౌకాదళం సిద్ధం తుపాను నేపథ్యంలో భారత నౌకాదళం అప్రమత్తమైంది. సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలంటూ ఆంధ్రప్రదేశ్, ఒడిశా ప్రాంతంలోని నౌకాదళ సిబ్బంది, అధికారులకు విశాఖలోని తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రం నుంచి ఆదేశాలు వెళ్లాయి. 19 వరద సహాయక బృందాలు, 6 డైవింగ్ టీమ్లు, జెమినీ బోట్లని విశాఖలో సిద్ధం చేశారు. తిరుపతి జిల్లాలో భారీ వర్షం తుపాను ప్రభావంతో తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఓజిలి మండలం ఇనుగుంటలో 13.6 సెం.మీ. వర్షం కురిసింది. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మండలం తాళ్లమాపురంలో 11.2 సెం.మీ., ఖాజీపేట మండలం ఎట్టూరులో 10.7, తిరుపతి జిల్లా నాయుడుపేటలో 8.1, విశాఖలో 5.9, నెల్లూరు జిల్లా కావలి, గుడ్లూరు మండలం రావూరులో 5 సెం.మీ. వర్షం పడింది. మొత్తంగా ఉమ్మడి కోస్తాంధ్ర అంతటా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర, కోనసీమ, కాకినాడ, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. సగటున రాష్ట్ర వ్యాప్తంగా 3.1 మి.మీ. వర్షం పడింది. 5 జిల్లాలకు రెడ్ అలెర్ట్ రాబోయే మూడు రోజుల్లో కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలకు రెడ్అలర్ట్ జారీ చేశారు. కోనసీమ, పశ్చిమ గోదావరి, కాకినాడ, అనకాపల్లి జిల్లాల్లో ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. 68 విమానాలు రద్దు గోపాలపట్నం (విశాఖ పశ్చిమ)/మధురపూడి: తుపాను కారణంగా విశాఖ విమానాశ్రయంలో మొత్తం 68 సర్వీసులు రద్దయ్యాయని ఎయిర్పోర్టు డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఇండిగో విమాన సర్వీసులు 46, ఎయిర్ ఏసియా విమాన సర్వీసులు 4, ఎయిరిండియా విమాన సర్వీసులు 2 రద్దయ్యాయి. స్పైజ్జెట్ సర్వీసు కూడా రద్దయ్యింది. బుధవారం కూడా ఇండిగో విమానాలను రద్దు చేసినట్లు తెలిపారు. కాగా, రాజమహేంద్రవరం విమానాశ్రయానికి మంగళవారం రావాల్సిన పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. కాకినాడ బీచ్ రోడ్డు మూసివేత కాకినాడ సిటీ/విడవలూరు (నెల్లూరు): తుపాను ప్రభావంతో కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాల్లోని పలు మండలాల్లో బలమైన ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. పలు గ్రామాల్లో చెట్లు విరిగిపోయాయి. కొన్నిచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండంతో విద్యుత్ సరఫరాకు తరచూ అంతరాయం ఏర్పడుతోంది. కాకినాడ తీరంలో సముద్రం 30 మీటర్లు ముందుకు రావడంతో ఉప్పాడ–కాకినాడ బీచ్ రోడ్డును మూసివేశారు. ఉప్పాడ తీర ప్రాంతం సముద్ర కోతకు గురవుతోంది. సమీపంలోని ఇళ్లల్లోకి నీరు చొచ్చుకొచ్చింది. కెరటాల ఉధృతికి ఉప్పాడలో ఇళ్లు, బీచ్ రోడ్డు ధ్వంసమయ్యాయి. కాగా, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విడవలూరు మండలంలోని తీర ప్రాంతంపై తుపాను ప్రభావం చూపుతోంది. మండలంలోని రామతీర్థం పరిసర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. తీరంలో 5 అడుగుల మేర అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. సముద్రం దాదాపు 150 మీటర్లు మేర ముందుకొచ్చింది. -
Cyclone Asani: అతి తీవ్రంగా 'అసని'
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అసని తుపాను ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. వేడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారిపోయి ఈదురు గాలులు వీస్తున్నాయి. ఆదివారం నర్సీపట్నం, శ్రీకాకుళం, విశాఖ, రాజమండ్రి, కోనసీమ, విజయవాడ ప్రాంతాల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయి. అనంతపురం, కడప ప్రాంతాల్లోను వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలకు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలో భారీ వర్షానికి రోడ్లు నీళ్లతో నిండి ట్రాఫిక్ స్తంభించింది. కృష్ణా జిల్లా మోపిదేవి, చల్లపల్లి, అవనిగడ్డ మండలాల్లో భారీవర్షాలు, ఈదురు గాలులకు చెట్లు విరిగి రోడ్లపై పడ్డాయి. కోతకొచ్చిన మామిడికాయలు రాలిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తుపాను ప్రభావంతో 10, 11 తేదీల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో పలుచోట్ల భారీవర్షాలు, ఎక్కువచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. మత్స్యకారులు గురువారం వరకు వేటకు వెళ్లకూడదని విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ హెచ్చరించారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో రెండో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. మరోవైపు దక్షిణ కోస్తాంధ్ర, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఆవరించి ఉంది. -
Cyclone Jawad: బలపడిన వాయుగుండం
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. విశాఖకు 960 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న ఈ వాయుగుండం మరింత బలపడి శుక్రవారం మధ్య బంగాఖాళాతంలో జవాద్ తుపానుగా మారుతుందని విపత్తుల నిర్వహణశాఖ కమిషనర్ కె.కన్నబాబు, విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు వెల్లడించారు. ఇది తరువాత వాయవ్య దిశలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం తీరం వరకు ప్రయాణించి శనివారం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు చేరే అవకాశం ఉందని తెలిపారు. దీని ప్రభావంతో 2రోజుల పాటు ఉత్తరాంధ్రలో పలుచోట్ల మోస్తారు వర్షాలు, అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. శుక్రవారం అర్థరాత్రి నుంచి తీరం వెంబడి గంటకు 45–65 కిలోమీటర్లు, శనివారం 70–90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. మత్స్యకారులు సోమవారం వరకు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. తుపాను కారణంగా 95 రైళ్లు రద్దు గురు, శుక్ర, శనివారాల్లో 95 రైళ్లను నిలిపివేస్తున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే ఖుర్ధా డివిజన్ కార్యాలయం స్పష్టం చేసింది. ఇందులో విజయవాడ మీదుగా ప్రయాణించే 41 ఎక్స్ప్రెస్ రైళ్లున్నాయి. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోండి తుపాను నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లకు సీఎం ఆదేశం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఉత్తరాంధ్ర మూడు జిల్లాల కలెక్టర్లను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ఉత్తరాంధ్రకు తుపాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో గురువారం ఉదయం ఆయన వైఎస్సార్ జిల్లా పర్యటనకు వెళ్లే ముందు ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లు, సీఎంవో కార్యాలయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అవసరమైన చోట్ల సహాయ శిబిరాలు తెరిచేందుకు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసుకోవాలని నిర్దేశించారు. లోతట్టు, ముంపు ప్రాంతాలు ఉంటే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుపాన్ వల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితుల వల్ల ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా చూడాలని చెప్పారు. ఉత్తరాంధ్రలో తుపాను సహాయ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే బాధ్యతను ముగ్గురు సీనియర్ అధికారులకు అప్పగించారు. శ్రీకాకుళం జిల్లాకు హెచ్.అరుణ్కుమార్, విజయనగరం జిల్లాకు కాంతిలాల్దండే, విశాఖ జిల్లాకు శ్యామలరావును నియమించారు. వెంటనే ఆయా జిల్లాలకు చేరుకుని తుపాను సహాయ కార్యక్రమాల సమన్వయ, పర్యవేక్షణ బాధ్యతలు స్వీకరించాలని ఆదేశించారు. -
ఉత్తరాంధ్రకు తుపాను ముప్పు!
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: ఇటీవల ఉపరితల ఆవర్తనం రాయలసీమను అతలాకుతలం చేయగా.. ఇప్పుడు తుపాను ముప్పు ఉత్తరాంధ్రను వణికిస్తోంది. దక్షిణ థాయ్లాండ్ వద్ద అండమాన్ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఇది అల్పపీడనంగా బంగాళాఖాతంలో ఏపీ, ఒడిశా తీరం వైపు దూసుకొస్తోంది. మంగళవారం సాయంత్రం నెల్లూరు తీరానికి 1,400 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది డిసెంబర్ 2వ తేదీకి వాయుగుండంగా, 3వ తేదీకి తుపానుగా బలపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. తుపానుగా బలపడితే దీనికి జవాద్ అని పేరు పెట్టనున్నారు. 4వ తేదీ నాటికి ఇది ఉత్తరాంధ్ర, ఒడిశా తీరం వైపు వచ్చి బలపడే అవకాశం ఉందని చెబుతున్నారు. 5, 6 తేదీల్లో తీవ్ర తుపానుగా మారి శ్రీకాకుళం, ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావం అత్యధికంగా ఏపీపైనే ఉంటుంది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాలపై ఇది తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో 2వ తేదీ నుంచి భారీ, అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీస్తాయని, ఈ ఐదు జిల్లాల రైతులు పంటలు కాపాడుకోవడానికి ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని, ఇప్పటికే వేటకు వెళ్లిన వారు వెంటనే తిరిగి వచ్చేయాలని కోరారు. ఈ తుపాను ప్రభావంతో దక్షిణ కోస్తా జిల్లాలు, రాయలసీమలోను ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గోడ కూలి చిన్నారి మృతి నెల్లూరు జిల్లా అనంత సాగరం మండలం పాతదేవరాయపల్లి ఎస్సీ కాలనీలో మట్టి గోడ కూలి అమ్మణ్ణమ్మ (6) చిన్నారి దుర్మరణం పాలైంది. చేజర్ల మండలం నాగుల వెలటూరులో 40 మేకలు వాగులో కొట్టుకుపోయాయి. తెలంగాణకు చెందిన ఇద్దరు మహిళలు ఏఎస్పేట–ఆత్మకూరు మధ్య గల కలుజు వాగులో కొట్టుకుపోగా స్థానిక యువకులు రక్షించారు. నాయుడుపేట మండలం పండ్లూరు రైల్వేగేటు సమీపంలో రహదారి వద్ద పాల క్యాన్లతో వెళ్తున్న ఆటో కొట్టుకుపోయింది. ఆటోలోని యువకులు వరద ప్రవాహం నుంచి బయటపడ్డారు. కాగా, వైఎస్సార్ జిల్లాలో వర్షం తగ్గుముఖం పట్టింది. బేతాయిపల్లె చెరువు అలుగు పారుతుండటంతో గోపవరం–బేతాయిపల్లె మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. సింహపురిని వదలని వరద సాక్షి, నెల్లూరు/కడప: నెల్లూరు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో పెన్నా నదిలో వరద ఉధృతి మళ్లీ పెరిగింది. సంగం, నెల్లూరు బ్యారేజీల నుంచి 1,81,756 క్యూసెక్కులను అధికారులు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. సోమశిల జలాశయం నుంచి 12 క్రస్ట్ గేట్ల ద్వారా 1.15 లక్షల క్యూసెక్కులను పెన్నా నదికి విడుదల చేస్తున్నారు. వైఎస్సార్, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో చిన్న, మధ్యతరహా ప్రాజెక్టుల గేట్లు ఎత్తి వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తున్నారు. వాగులు, చిన్నపాటి ఉపనదులు, వంకలు పొంగి ప్రవహిస్తుండటంతో చాలా ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. చెన్నై–కోల్కతా జాతీయ రహదారి గూడూరు ఆదిశంకర కళాశాల వద్ద దెబ్బతినడంతో వాహనాలు నిలిచిపోయాయి. గూడూరు సమీపంలో పంబలేరు వాగు ఉప్పొంగి కోల్కతా, చెన్నై రహదారిపై ప్రవహించింది. దీంతో ఎక్కడికక్కడ రోడ్డు దెబ్బతింది. వాహనాల రాకపోకలు స్తంభించాయి. ఒక కిలోమీటరు దూరం ప్రయాణించాలంటే.. 4, 5 గంటల సమయం పడుతోంది. నాయుడుపేట వద్ద జాతీయ రహదారిపై భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. -
ఉదారంగా విపత్తు సాయం
సాక్షి, అమరావతి: భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కు మానవతా ధృక్పథంతో ఉదారంగా సాయం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కేంద్రానికి సిఫారసు చేయాల్సిందిగా నష్టాన్ని అంచనా వేసేందుకు వచ్చిన కేంద్ర బృందాన్ని కోరారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో తనను కలిసిన కేంద్ర అధికారులతో మాట్లాడుతూ... ఈ విపత్తు హృదయ విదారకరమన్నారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం అందచేసిన నష్టం వివరాల్లో ఎలాంటి పెంపూ లేదు. వాస్తవాలు ఎలా ఉంటే అలా ఇచ్చాం. ఎందుకంటే నష్టం అంచనాల తయారీకి మాకు క్షేత్రస్థాయిలో సమర్థవంతమైన వ్యవస్థ ఉంది. ప్రతి గ్రామంలోనూ రైతు భరోసా కేంద్రాలున్నాయి. ప్రతి రైతు పండించే పంటా ఇ–క్రాప్లో నమోదవుతోంది. సోషల్ ఆడిట్ కూడా నిర్వహిస్తున్నాం. ఇ– క్రాప్కు సంబంధించి రైతులకు రశీదులు కూడా ఇచ్చాం., నష్టపోయిన పంటలపై కచ్చితమైన, నిర్ధారించిన లెక్కలున్నాయి’’ అని ఆయన వివరించారు. తాత్కాలిక ప్రాతిపదికన నిధులివ్వాలి క్షేత్రస్థాయిలో నష్టానికి సంబంధించి వాస్తవ వివరాలను అందచేశామని, కోవిడ్ నియంత్రణ చర్యల కోసం వినియోగించినందువల్ల ఎస్డీఆర్ఎఫ్ నిధులు నిండుకున్నాయనే విషయాన్ని రాష్ట్ర ఆర్ధిక శాఖ కార్యదర్శి మీకు (కేంద్ర బృందానికి) వివరించారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. పనులు సాఫీగా జరగాలంటే నిధులు అవసరమని, వెంటనే తాత్కాలిక ప్రాతిపదికన విడుదలకు సహకారం అందించాలని కేంద్ర బృందాన్ని కోరారు. మీ సూచనలు పరిగణలోకి కేంద్ర బృందం సూచనలను పరిగణలోకి తీసుకుంటామని, దీర్ఘకాలంలో ఇలాంటి విపత్తులను నియంత్రించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. వరదనీటిని తరలించడానికి ఇప్పుడున్న కాల్వల సామర్థ్యాన్ని పెంచేలా ఇటీవలే ఒక కార్యక్రమాన్ని చేపట్టామని, దీనిద్వారా పెద్ద మొత్తంలో వేగంగా తరలించే అవకాశం కలుగుతుందని తెలిపారు. రిజర్వాయర్లు, డ్యామ్లపై పరిశీలన జరిపి తగిన చర్యలు చేపడతామని, ఆటోమేటిక్ వాటర్ గేజ్ సిస్టంపైనా దృష్టిపెడతామని చెప్పారు. చేతికందే పంట నీటి పాలైంది... వైఎస్సార్ కడప జిల్లాలో మౌలిక సదుపాయాలు దారుణంగా దెబ్బతిన్నాయని, పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని కేంద్ర బృందం సభ్యుడు, ఎన్ఎండీఏ, కేంద్ర హోంమంత్రిత్వశాఖ సలహాదారు కునాల్ సత్యార్థి చెప్పారు. అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయిన చోట అపార నష్టం జరిగిందన్నారు. తాగునీటి సరఫరా, ఇరిగేషన్కూ తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. బ్రిడ్జిలు, రోడ్లు తెగిపోవడం వల్ల చాలా గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయని, పంట చేతికందే సమయంలో నీటి పాలైందని, శనగ పంట కూడా తీవ్రంగా దెబ్బతిందని చెప్పారు. చిత్తూరులో జిల్లాలో కొంత భాగం, నెల్లూరులో కూడా వరదల ప్రభావం అధికంగా ఉందన్నారు. ధాన్యం కొనుగోలు నిబంధనలు సడలించాలి ధాన్యం కొనుగోలు నిబంధనలను సడలించేలా కృషి చేయాలని కేంద్ర బృందాన్ని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కోరింది. భారీ వర్షాల కారణంగా పంటలు దెబ్బ తిన్నందున తేమ, ఇతర నిబంధనల విషయలో సడలింపులు ఇచ్చి ఉదారంగా వ్యవహరించాలని అభ్యర్థించింది. మీ వేగం.. బాగుంది విపత్తు సమయంలో రాష్ట్ర అధికార యంత్రాంగం అద్భుతంగా పనిచేసిందని, మీ (ముఖ్యమంత్రి జగన్) నాయకత్వంతో ప్రభుత్వ పనితీరు ప్రశంసనీయమని వరద నష్టాన్ని అంచనా వేసేందుకు వచ్చిన కేంద్ర బృందం పేర్కొంది. విద్యుత్ సహా అన్నిరకాల శాఖలు చాలా బాగా పనిచేశాయని, అత్యవసర సేవలను వెంటనే పునరుద్ధరించారని తెలిపింది. అంకితభావంతో పనిచేసే అధికారులు మీకున్నారని, క్షేత్రస్థాయిలో తీసుకున్న చర్యలన్నీ బాగున్నాయని అభినందించింది. భారీ వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టాన్ని అంచనా వేసేందుకు మూడు రోజుల పాటు క్షేత్రస్థాయిలో పర్యటించిన కేంద్ర అధికారుల బృందం సభ్యులు సోమవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో సమావేశమై తమ దృష్టికి వచ్చిన అంశాలను తెలియచేశారు. తమ పర్యటనలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, మీడియా ప్రతినిధులను కలుసుకున్నామని, ప్రతి ఒక్కరూ వరదల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం పనితీరును ప్రశంసించారని చెప్పారు. వెంటనే నిధుల విడుదలతో తక్షణ సాయం.. ‘ఇలాంటి విపత్తులు సంభవించినప్పుడు ఇంత త్వరగా విద్యుత్తు పునరుద్ధరణ సహజంగా జరగదు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ చర్యలు ప్రశంసనీయం. సహాయ కార్యక్రమాల కోసం కలెక్టర్లకు వెంటనే నిధులిచ్చారు. దీనివల్ల పనులు చాలా వేగంగా జరిగాయి. ఈ డబ్బులతో బాధితులను తక్షణమే ఆదుకున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి ఏర్పాటును మేం చూడలేదు’ అని కేంద్ర బృందం సభ్యుడు, ఎన్ఎండీఏ, కేంద్ర హోంశాఖ సలహాదారు కునాల్ సత్యార్థి పేర్కొన్నారు. జేసీబీలను తరలించి అవసరమైన చోట యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టారని, సహాయక శిబిరాలను ప్రారంభించి ముంపు బాధితులను ఆదుకున్నారని చెప్పారు. యువకులు, డైనమిక్గా పనిచేసే అధికారులున్నారని అభినందించారు. అధికారులంతా తమకు చక్కటి సహకారాన్ని అందించారన్నారు. వైఎస్సార్ కడప జిల్లాకు భారీ నష్టం తన పర్యటన సందర్భంగా వీలైనన్ని గ్రామాలను, వరద కారణంగా నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించామని, కడప జిల్లాకు భారీ నష్టం వాటిల్లిందని కునాల్ సత్యార్థి తెలిపారు. పశువులు మృత్యువాత పడ్డాయని, రోడ్లు, భవనాలు, లాంటి మౌలిక సదుపాయాలతోపాటు ప్రాజెక్టులు బాగా దెబ్బతిన్నాయని చెప్పారు. ఆనవాయితీగా వరదలొచ్చే ప్రాంతాలు కావు.. అవి సంప్రదాయంగా వరదలు వచ్చే ప్రాంతం కాదని, అలాంటి చోట ఊహించని రీతిలో వర్షాలు కురిశాయని కునాల్ సత్యార్థి పేర్కొన్నారు. ఈ స్థాయిలో వరద ప్రవాహాన్ని మోసుకెళ్లగలిగే పరిస్థితి అక్కడున్న నదులు, వాగులు, వంకలకు లేదని చెప్పారు. కరువు ప్రాంతంలో అతి భారీవర్షాలు కురిశాయని, ఈ స్థాయిలో వరదను నియంత్రించగలిగే రిజర్వాయర్లు, డ్యామ్లు కూడా ఆ ప్రాంతంలో లేవన్నారు. ఉన్న డ్యామ్లు, రిజర్వాయర్లు కూడా ఈ స్థాయి వరదలను ఊహించి నిర్మించినవి కావన్నారు. ఇలాంటి పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా తలెత్తున్నాయని, కరువు ప్రాంతాల్లో కుంభవృష్టి, నిరంతరం మంచి వర్షాలు కురిసేచోట కరువు లాంటి పరిస్థితులు నెలకొంటున్నాయని తెలిపారు. తీరం దాటిన తర్వాత అల్పపీడనం వెంటనే తొలగిపోలేదని, అది చాలా రోజులు కొనసాగిందని చెప్పారు. మావంతు సహకారాన్ని అందిస్తాం వరదల వల్ల జరిగిన నష్టంలో 40 శాతం రోడ్లు, భవనాలు రూపేణా జరిగిందని, 32 శాతం నష్టం వ్యవసాయం, అనుబంధ రంగాల్లో జరిగిందని, ఇరిగేషన్ స్కీమ్ల రూపేణా 16 శాతం మేర నష్టం జరిగిందని కేంద్ర బృందం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ను వీలైనంత మేర ఆదుకునేలా తమ వంతు సహకారాన్ని అందిస్తామని వెల్లడించింది. -
కడప: పోటెత్తిన పాపాగ్ని నది.. కూలిన కమలాపురం బ్రిడ్జి
సాక్షి, వైఎస్సార్ కడప: ఆంధ్రప్రదేశ్లో గత మూడు రోజుల నుంచి వర్షాలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో రాయలసీమ అతలాకుతలమవుతోంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు కట్టలు తెంచుకొని ప్రవహిస్తుండటంతో ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయింది. భారీ వర్షాలతో కడప జిల్లా పాపాగ్ని నది ఉధృతికి కమలాపురం వంతెన కుంగిపోయింది. వెలిగల్లు ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తడంతో నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలిపెడుతున్నారు. దీంతో రెండు రోజులుగా భారీగా వరద నీరు వంతెనపై అంచు వరకు ప్రవహిస్తోంది. వరద ధాటికి చీలిపోయిన బ్రిడ్జి క్రమ క్రమంగా కూలిపోయింది. చదవండి: ‘ఐఎన్ఎస్ విశాఖపట్నం’ యుద్ధ నౌక జల ప్రవేశం బ్రిడ్జి మధ్య భాగంలోని దాదాపు ఆరు స్లాబ్స్ చీలిపోయి లోపలికి కుంగిపోయాయి. దీంతో కమలాపురం- కడప మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు కుంగిన బ్రిడ్జిమీదుగా వాహనాలు, పాదచారులు వెళ్లకుండా బ్యారికేడ్లు పెట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. నంతపురం నుంచి కడపకు వెళ్లే జాతీయ రహదారి కావడంతో కడప నుంచి తాడిపత్రి వెళ్లే ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలను ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, మైదుకూరు మీదుగా దారి మళ్లిస్తున్నారు. చదవండి: సీఎం చొరవతోనే మీరు ప్రాణాలతో బయటపడ్డారు పాపాగ్ని నది బ్రిడ్జిని ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి పరిశీలించారు. కొత్త బ్రిడ్జి నిర్మాణానికి సీఎం అంగీకరించారని, సోమవారం నిపుణుల బృందం వస్తోందని పేర్కొన్నారు. త్వరితగతిన కొత్త బ్రిడ్జి నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. కడప- బళ్లారి రహదారి పునరుద్ధరణకు చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. పాగేరు వంకపై కొత్త బ్రిడ్జి నిర్మాణానికి కూడా సీఎం అంగీకరించారని తెలిపారు. పంట నష్టంపై నివేదిక ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించినట్లు చెప్పారు. -
వర్షాల కారణంగా మృతి చెందిన వారికి రూ.5 లక్షలు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: భారీ వర్షాల కారణంగా ఏపీలోని పలు జిల్లాలు అతాలకుతలం అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వర్షాలపై ఐదు జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, వైఎస్ఆర్ జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం అధికారులతో చర్చించారు. (చదవండి: ఎక్కడా రాజీపడొద్దు.. నిరంతరం అందుబాటులో ఉంటా: సీఎం జగన్) వరద సహాయక చర్యలను పర్యవేక్షించడానికి మూడు జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించారు సీఎం జగన్. నెల్లూరు, చిత్తూరు, వైఎస్ఆర్ జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు తెలిపారు. వీరు జిల్లాలో నెలకొన్న పరిస్థితిని ఎప్పటికప్పుడు సీఎం జగన్కు నివేదిస్తారు. (చదవండి: రేణిగుంట ఎయిర్పోర్ట్లో భారీగా వరద.. విమానాల ల్యాండింగ్ నిలిపివేత) వరద సహాయక చర్యలను పర్యవేక్షించడానికిగాను నెల్లూరు జిల్లాకు విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజేశేఖర్.. చిత్తూరు జిల్లాకు మార్కెటింగ్ కమిషనర్ ప్రద్యుమ్న.. వైఎస్ఆర్ జిల్లాకు సీనియర్ అధికారి శశిభూషణ్ కుమార్ను నియమించారు. వారు ఇప్పటికే చేరుకున్నారని అధికారులు సీఎం జగన్కు తెలిపారు. ‘‘ముంపు బాధితులను కూడా వెంటనే సహాయక కేంద్రాలకు తరలించాం. వరదలో చిక్కుకుపోయిన వారిని హెలికాప్టర్ల ద్వారా తరలించే చర్యలు కూడా చేపట్టాం. సహాయక కార్యక్రమాల్లో ఎక్కడా రాజీలేకుండా అన్ని చర్యలూ తీసుకుంటున్నాం. ఆయా జిల్లాలకు అదనంగా నిధులు కూడా ఇచ్చాం’’ అని అధికారులు సీఎం జగన్కు తెలిపారు. తర్వాత జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు సీఎం జగన్. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణ్, స్పెషల్ ఆఫీసర్ ప్రద్యుమ్న జిల్లాలోని పరిస్థితులను వివరించారు. ఈ సదర్భంగా సీఎం జగన్.. తిరుపతిలో వరదనీరు నిల్వ ఉండిపోవడానికి కారణాలపై అధ్యయనం చేయాలని ఆదేశించారు. చెరువుల పూడ్చివేత వల్ల ఇది జరిగిందని అధికారులు తెలపడంతో.. దీనిపై తగిన కార్యచరణసిద్ధం చేయాలని.. బాధితులను ఆదుకోవడంలో ఉదారంగా ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు. ముంపునకు గురైన ప్రతి కుటుంబానికి రూ.2వేల రూపాయలు ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. ఇళ్లను శుభ్రం చేసుకోవడానికి ఈ డబ్బు ఉపయోగపడుతుందని తెలిపారు. బాధితులకు నాణ్యమైన సేవలు అందించాలని.. మంచి భోజనం, తాగునీరు అందించాలని.. వర్షాల తర్వాత కూడా వ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. తిరుమల దర్శనానికి వచ్చిన భక్తులకు సహాయంగా నిలవాలని సీఎం జగన్ తెలిపారు. రైళ్లు, విమానాలు రద్దైన నేపథ్యంలో వారికి అన్నిరకాలుగా తోడుగా ఉండాలన్నారు. ప్రమాదకర పరిస్థితుల నేపథ్యంలో భక్తులు కిందకు రాకుండా పైనే ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. కనీసం ఒకటి, రెండు రోజులు వారికి తగిన వసతులు సమకూర్చాలని తెలిపారు. టీటీడీ అధికారులను సమన్వయం చేసుకుని యాత్రికులకు సహాయంగా నిలవాలన్నారు. తిరుపతినగరంలో మున్సిపాల్టీ సహా, ఇతర సిబ్బందిని కూడా వినియోగించి పారిశుధ్యం పనులు చేపట్టాలని.. అవసరమైతే ఇతర మున్సిపాల్టీలనుంచి సిబ్బందిని తీసుకు వచ్చి ఆపరేషన్ చేపట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. వైఎస్సార్ జిల్లాలో.. వైఎస్సార్ జిల్లాలో పరిస్థితులను వివరించారు కలెక్టర్ విజయరామరాజు. ఈ క్రమంలో గండ్లుపడ్డ చెరువుల్లో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు సీఎం జగన్. రోడ్లకు గండ్లు కారణంగా ఎక్కడ రవాణా స్తంభించినా... నీరు తగ్గగానే వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలన్నారు. విద్యుత్ పునరుద్ధరణపైనా అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. వరదనీరు తగ్గగానే పంట నష్టంపై అధికారులు ఎన్యుమరేషన్ ప్రారంభించాలని సీఎం జగన్ సూచించారు. నెల్లూరు జిల్లాలో.. నెల్లూరు జిల్లాలో పరిస్థితులను వివరించారు కలెక్టర్ చక్రధర్. సోమశిలకు భారీగా వరద నీరు వస్తోందని తెలిపారు. ఈ క్రమంలో సమగ్ర వ్యూహంతో ముందుకు వెళ్లాలని సీఎం జగన్ ఆదేశించారు. పైనుంచి వరదను, డ్యాంలో ప్రస్తుతం ఉన్ననీటిని అంచనా వేసుకుని ఆమేరకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. నీటిపారుదల శాఖ అధికారులను సమన్వయం చేసుకుని వరదనీటి విడుదలలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. ఎక్కడెక్కడ ముంపు ఉండే అవకాశాలు ఉన్నాయో.. ఆయా ప్రాంతాల్లో సహాయక కేంద్రాలను తెరవాలని సీఎం జగన్ ఆదేశించారు. అనంతపురంలో.. అనంతపురంలో భారీ వర్షాల పరిస్థితిని వివరించారు కలెక్టర్ నాగలక్ష్మి. అలానే బాధిత జిల్లాల్లో దెబ్బతిన్న రోడ్లపై వివరాలను ప్రిన్సిపల్ సెక్రటరీలు కృష్ణబాబు, ద్వివేది అందించారు. సీఎం జగన్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతాల్లో రోడ్ల పునరుద్ధరణకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే తాగునీటి వనరులు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎప్పటికప్పుడు పరీక్షలు చేసి... తాగునీటి నాణ్యతను తెలుసుకోవాలని, వ్యాధులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పారిశుధ్యంపైనకూడా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. ‘‘ఎక్కడెక్కడ పంట నష్టపోయిందీ వివరాలు తయారు చేయాలి. వీలైనంత త్వరగా వారికి పరిహారం అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. నష్టాన్ని నమోదు చేసినప్పుడు కాస్త ఉదారతతో ఉండాలి. మళ్లీ పంటవేసుకునేందుకు రైతులకు విత్తనాలు సరఫరా చేయాలి. వర్షాల కారణంగా దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయిన వారికి రూ.5 లక్షల పరిహారం వీలైనంత త్వరగా అందించాలి. జిల్లాల్లో కాల్సెంటర్లను ఏర్పాటు చేసుకోవాలి. వచ్చే వినతులపై తక్షణమే అధికారులు చర్యలు తీసుకోవాలి. ఎలాంటి సహాయం కావాలన్న యుద్ధప్రాతిపదికన సమకూరుస్తాం’’ అని సీఎం జగన్ తెలిపారు. నెల్లూరులో సహాయక చర్యల పర్యవేక్షణకు నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ను పంపిస్తున్నామని.. కడపజిల్లాల్లో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ఇప్పటికే సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని సీఎం జగన్ తెలిపారు. చదవండి: తిరుపతి విల విల -
ఏపీ: భారీవర్షాలపై కలెక్టర్లతో సీఎం జగన్ సమీక్ష
సాక్షి, అమరావతి: భారీ వర్షాలు కురుస్తున్న నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో గురువారం జరిగిన ఈ సమావేశంలో.. తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. అవసరమైన చోట్ల సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. రిజయర్వాయర్లు, చెరువులు, నీటినరుల వద్ద ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తూ తగిన విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆహారం, మందులు సిద్ధంచేసుకోవాలన్నారు. చదవండి: ఈనెల 26 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. -
ఏపీ: భారీ వర్షాలతో విద్యుత్ శాఖ అప్రమత్తం
సాక్షి, తిరుపతి(చిత్తూరు): తుఫాను ప్రభావంతో చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆ సంస్థ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ హెచ్. హరనాథ రావు ఆదేశించారు. తుఫాను నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా గురువారం ఉదయం సీఎండి హరనాథ రావు 5 జిల్లాల సూపరింటెండింగ్ ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్లతో అత్యవసరంగా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అంతకుముందు రాష్ట్ర ఇంధన శాఖా మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి భారీ వర్షాల నేపథ్యంలో ఏపీఎస్పీడీసీఎల్ చేపడుతున్న ముందు జాగ్రత్త చర్యలపై సమీక్షించినట్లు సీఎండీ తెలిపారు. చదవండి: రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పారదర్శకత పాటించాలి: సీఎం జగన్ వర్షాల కారణంగా వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా చర్యలు చేపట్టాలని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సూచించినట్లు తెలియజేశారు. టెలికాన్ఫరెన్స్ సందర్భంగా సీఎండీ హరనాథ రావు మాట్లాడుతూ..తుఫాను కారణంగా ఎదురయ్యే విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశామని తెలిపారు. చిత్తూరు జిల్లా పరిధిలోని వినియోగదారులు మొబైల్ నెంబరు: 94408 17412, కడప: 94408 17440, కర్నూలు: 73826 14308, అనంతపురం: 94910 67446, నెల్లూరు జిల్లా పరిధిలోని వినియోగదారులు మొబైల్ నెంబరు: 9440817468లకు కాల్ చేసి విద్యుత్ ప్రమాదాలు, సమస్యలపై సమాచారాన్ని అందించవచ్చని తెలిపారు. చదవండి: Heavy Rains: ఆ జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి: సీఎం జగన్ తుఫాను దృష్ట్యా విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బందికి సెలవులు రద్దు చేస్తున్నట్లు తెలియజేశారు. వినియోగదారుల సమస్యలపై తక్షణం స్పందించేందుకు వీలుగా ప్రతి సబ్ స్టేషన్ పరిధిలో ఐదుగురు సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ స్తంభాలు ఒదిగిపోవడం తదితర ప్రమాదాలు సంభవించినట్లు అయితే వాటిని ఎదుర్కొనేందుకు వీలుగా డ్రిల్లింగ్ యంత్రాలు, సామాగ్రిని, వాకిటాకీలను, సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. బలమైన గాలి, వర్షం ఉన్న సందర్భాల్లో ప్రజలు విద్యుత్ లైన్లకు దూరంగా ఉండాలని, ఎక్కడైనా విద్యుత్ స్తంభాలు పడిపోవడం, లైన్లు తెగిపోవడం జరిగినట్లయితే తక్షణమే కంట్రోల్ రూమ్ లకు గానీ, సమీపంలోని విద్యుత్ శాఖ అధికారులు గానీ లేదా టోల్ ఫ్రీ నెంబరు; 1912కు ఫోన్ చేసి సమాచారం అందించాలని వినియోగదారులకు విజ్ఞప్తి చేశారు. -
Andhra Pradesh: వచ్చే 3 రోజులు భారీ వర్షాలు
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: రానున్న మూడు రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఆదివారం వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇది క్రమంగా ఒడిశా వైపు ప్రయాణించే అవకాశముంది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో 2 రోజులపాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయి. రాయలసీమలో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే సూచనలున్నాయి. ముఖ్యంగా మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అతిభారీ వర్షాలు.. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. తీరం వెంబడి గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడంవల్ల సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. అదేవిధంగా బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. మత్స్యకారులెవ్వరూ రాగల రెండు రోజులపాటు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇక గడిచిన 24 గంటల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. విజయనగరంలో 15సెం.మీ, పూసపాటిరేగలో 14.3 సెం.మీ, డెంకాడలో 14.2, కొప్పెర్లలో 13.5, గోవిందపురంలో 12.8, నెల్లిమర్లలో 12.2, రాంబిల్లిలో 10.9, పైడి భీమవరంలో 10.8, కె.కోటపాడులో 9.5, బొందపల్లిలో 8.7, భోగాపురంలో 8.4, మారికవలస, భీమిలిలో 8.3, ఎల్.ఎన్.పేటలో 8.1, కొయ్యూరులో 7.8, విశాఖ రూరల్, దేవరాపల్లిలో 7.7 సెం.మీ. వర్షపాతం నమోదైంది. -
పంట నష్టం త్వరగా అంచనా వేయండి
సాక్షి, అమరావతి: భారీ వరదలు, వర్షాల వల్ల తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో పంట నష్టం అంచనాలు వెంటనే పూర్తి చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన భారీ వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో నందిగామ, అవనిగడ్డ, పెనమలూరు, మైలవరం, తాడికొండ తదితర నియోజకవర్గాల పరిధిలోని ముంపు ప్రాంతాలను, దెబ్బతిన్న వ్యవసాయ, ఉద్యాన పంటలను, లంక భూములు, నదీ పరివాహక ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్షించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. – వీలైనంత వేగంగా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందించాలి. సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే రైతులకు రబీలో పంట పెట్టుబడికి ఉపయోగపడుతుంది. – ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణ, గుంటూరు జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు ప్రభుత్వం ఇప్పటికే ఐదు నిత్యావసర సరుకులతో ఉచిత రేషన్ను అందిస్తోంది. – మిగిలిన జిల్లాల్లో కూడా వరదల్లో మునిగిన పంటలతో పాటు ఇళ్లు, పశువులు నష్టపోయిన వారిని గుర్తించి వెంటనే పరిహారం ఇవ్వాలి. – సీఎం వెంట హోం మంత్రి మేకతోటి సుచరిత, పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, అధికారులు ఉన్నారు. ఆదుకునేందుకు పలు చర్యలు – భారీ వర్షాలు, వరదలపై ఇప్పటికే పలుమార్లు అధికారులు, మంత్రులతో సీఎం సమీక్ష నిర్వహించారు. వరద కారణంగా తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రానికి సాయం చేయాలని కేంద్రానికి ఇప్పటికే లేఖ రాసిన విషయం తెలిసిందే. – ప్రాథమిక అంచనాల ప్రకారం రూ.4,450 కోట్ల నష్టం జరిగిందని, బాధితులను ఆదుకోవడానికి రూ.2,250 కోట్ల సాయం అందించాలని కోరారు. తక్షణ సాయంగా రూ.1,000 కోట్లు మంజూరు చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్షాకు రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు. – వరద నష్టం అంచనాకు కేంద్ర బృందాన్ని పంపాలని కోరారు. ఇప్పటికే కరోనా కారణంగా ఆర్థికంగా దెబ్బతిన్న రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తడంతో తీవ్రంగా నష్టపోయామని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. -
శాంతించిన తమ్మిలేరు, ఏలేరు
సాక్షి, ఏలూరు/అమలాపురం : వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు అతలాకుతలమైన జిల్లాలు తేరుకుంటున్నాయి. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో గురువారం వాతావరణం పొడిగానే ఉంది. అయినా పల్లపు ప్రాంతాల్లోకి చేరిన నీరు బయటకు పోకపోవడంతో పలు కాలనీలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. కృష్ణానదికి వరద పోటెత్తుతుండటంతో కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని లంక గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరంపాలెంలో బుధవారం ఎర్రకాలువలో పడి రైతు రాటాల త్రిమూర్తులు (38) మృతిచెందగా గుంటూరు జిల్లా క్రోసూరు మండలం ఉయ్యందన గ్రామంలోని వాగులో గురువారం 88 త్యాళ్లూరు గ్రామానికి చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థి పిల్లి హేమంత్ (12) కొట్టుకుపోయాడు. చదవండి: నేడు విజయవాడలో రెండు ఫ్లైఓవర్లు ప్రారంభం పశ్చిమ గోదావరి జిల్లాలో తమ్మిలేరు శాంతించినా ఎర్రకాల్వ మాత్రం ఇంకా పోటెత్తుతూనే ఉంది. పశ్చిమగోదావరి, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో తమ్మిలేరుకు వరద తగ్గింది. ఆంధ్రాకాల్వ నుంచి మాత్రమే తమ్మిలేరుకు వరద వస్తోంది. ఎర్రకాల్వ నీరు నిడదవోలుతో పాటు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో పంటపొలాల్లోకి చేరింది. ఈ కాలువ నీరు కలవడంతో తణుకు రూరల్ మండలం దువ్వ వయ్యేరు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వరస్వామి క్షేత్రంలోకి ఎర్రకాల్వ ముంచెత్తింది. యనమదుర్రు డ్రైన్ ఉప్పొంగడంతో భీమవరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. చదవండి: దసరాకు 1,850 ప్రత్యేక బస్సులు ప.గో జిల్లా తాళ్లపాలెంలో ముంపును పరిశీలిస్తున్న మంత్రి వనిత, ఎమ్మెల్యే శ్రీనివాస్ వరద ముంపునకు గురైన గ్రామాలకు తాగునీరు, నిత్యావసర సరుకులు తీసుకెళుతున్న పడవ గురువారం దెందులూరు మండలం సత్యనారాయణపురం గుండేరువాగులో కొట్టుకుపోయింది. దీన్లో ప్రయాణిస్తున్న మత్స్యశాఖ ఏడీ, ఎఫ్డివో, గ్రామస్తులు ప్రమాదం నుంచి బయటపడ్డారు. నిడదవోలులో ముంపు ప్రాంతాలను రాష్ట్ర మహిళా శిశుసంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత, నిడదవోలు ఎమ్మెల్యే జీఎస్ నాయుడు పరిశీలించారు. బాధితులకు మంత్రి కన్నబాబు పరామర్శ తూర్పు గోదావరి జిల్లాలో ఉప్పొంగి పొలాలను, పలు ప్రాంతాలను ముంచెత్తిన ఏలేరు నెమ్మదించింది. రిజర్వాయర్లో 86.23 మీటర్లున్న నీటిమట్టం 86.13 మీటర్లకు తగ్గింది. బుధవారం రాత్రి వరకు 17 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన అధికారులు గురువారం ఉదయం నుంచి 14 వేల క్యూసెక్కులకు తగ్గించారు. పిఠాపురం– గొల్లప్రోలు మధ్య 216వ నంబరు హైవే మీద నీరు ప్రవహిస్తోంది. కాకినాడ రూరల్ మండలంలో 40 కాలనీలు ముంపులో ఉన్నాయి. ఎఫ్సీఐ కాలనీ, జనచైతన్య కాలనీలో మంత్రి కన్నబాబు మోకాలు లోతు నీటిలో పర్యటించి బాధితులను పరామర్శించారు. బాధితులకు సహాయ చర్యలను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయ చర్యల్లో పాల్గొన్నాయి. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం సీతమ్మధార (విశాఖ ఉత్తర): విశాఖ పశ్చిమ నియోజకవర్గంలోని గణపతినగర్లో భారీవర్షాలకు గత ఆదివారం గోడకూలి మరణించిన గర్భిణి రామలక్ష్మి, ఆమె కుమారుడు జ్ఞానేశ్వరావు కుటుంబానికి ప్రభుత్వం సాయం అందించింది. మృతురాలి తల్లి నెల్లి పార్వతికి ప్రభుత్వం తరఫున రూ.8 లక్షల చెక్కును పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ పశ్చిమ సమన్వయకర్త మళ్ల విజయప్రసాద్ గురువారం అందజేశారు. పుర్రె సురేష్యాదవ్, పీవీ సురేష్ తదితరులు పాల్గొన్నారు. బాధితులకు చెక్కు అందజేస్తున్న మంత్రి ముత్తంశెట్టి, మళ్ల విజయప్రసాద్ -
చంద్రబాబు నివాసం చుట్టూ వరద
సాక్షి, అమరావతి/శ్రీశైలంప్రాజెక్ట్/విజయపురిసౌత్(మాచర్ల)/అచ్చంపేట(పెదకూరపాడు): కృష్ణమ్మ మహోగ్రరూపం దాల్చింది. బుధవారంతో పోలిస్తే గురువారం వరద ఉద్ధృతి మరింత పెరిగింది. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రకాశం బ్యారేజీలోకి 7.44 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చింది. ఆ తర్వాత కాస్త తగ్గింది. సాయంత్రానికి ప్రకాశం బ్యారేజీలోకి 7,28,934 క్యూసెక్కుల వరద వస్తుండగా.. 70 గేట్లను పూర్తిగా ఎత్తేసి అంతేస్థాయిలో సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు విడుదల చేస్తున్న నీటికి.. కృష్ణా, గుంటూరు, ఖమ్మం జిల్లాల్లో విస్తారంగా కురిసిన వర్షాల ప్రభావం వల్ల కట్టలేరు, మున్నేరు, కొండవాగుల వరద తోడవడంతో ప్రకాశం బ్యారేజీలోకి వరద పోటెత్తింది. అదేస్థాయిలో దిగువకు వదులుతున్న నేపథ్యంలో గుంటూరు, కృష్ణాజిల్లాల్లో నదీ తీరప్రాంతంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. శుక్రవారం ప్రకాశం బ్యారేజీలోకి వరద మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ చరిత్రలో 2009 అక్టోబర్ 5న తొలిసారిగా గరిష్ఠంగా 11,10,404 క్యూసెక్కుల వరద వచ్చింది. గురువారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 5.30 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా పదిగేట్లను 20 అడుగుల మేర ఎత్తేసి, కుడి విద్యుత్కేంద్రం ద్వారా 5.07 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్లోకి నాలుగు లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. అంతేస్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నీటికి మూసీ వరద తోడవడంతో పులిచింతల ప్రాజెక్టులోకి 4.95 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. అంతే పరిమాణంలో దిగువకు వదులుతున్నారు. తుంగభద్ర పరీవాహక ప్రాంతంలోనూ భారీవర్షాలు కురుస్తుండటంతో తుంగభద్ర డ్యామ్, సుంకేశుల నుంచి 50 వేల క్యూసెక్కుల మేర నీరు కృష్ణానదిలోకి చేరుతోంది. (చదవండి: మహోగ్ర కృష్ణమ్మ) వంశధారలో స్థిరంగా వరద ఉద్ధృతి ఒడిశా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కురిసిన వర్షాలకు వంశధారలో వరద ఉద్ధృతి స్థిరంగా కొనసాగుతోంది. గొట్టా బ్యారేజీలోకి 41,253 క్యూసెక్కులు చేరుతుండగా.. 43,197 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. గొట్టా బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. నాగావళి ప్రధాన ఉపనది అయిన సువర్ణముఖి నదిలో వరద మరింత పెరిగింది. మడ్డువలస ప్రాజెక్టులోకి 25,428 క్యూసెక్కులు చేరుతుండగా.. 27,706 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తుండటంతో నదీ తీరప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ధవళేశ్వరం నుంచి 2.31 లక్షల క్యూసెక్కులు కడలిలోకి గోదావరిలో వరద ఉద్ధృతి స్థిరంగా కొనసాగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీలోకి 2.31 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. అంతే పరిమాణంలో సముద్రంలోకి వదిలేస్తున్నారు. చంద్రబాబు నివాసం చుట్టూ వరద ప్రకాశం బ్యారేజీలోకి 7.44 లక్షల క్యూసెక్కుల ప్రవాహం రావడంతో గురువారం ఎగువ ప్రాంతంలోని కరకట్ట వెంబడి రిజర్వ్ కన్జర్వేటరీలో అక్రమంగా నిర్మించిన గెస్ట్హౌస్ల చుట్టూ వరదనీరు చేరింది. కొన్ని గెస్ట్హౌస్లు వరదనీటిలో మునిగిపోయాయి. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు నివాసం చుట్టూ రహదారుల్లో తప్ప నాలుగువైపులా నీళ్లు చుట్టుముట్టాయి. హెలీప్యాడ్ సగం వరకు మునిగిపోయింది. గోకరాజు గంగరాజు గెస్ట్హౌస్, చందన బ్రదర్స్ గెస్ట్హౌస్ ఐదడుగుల వరకు నీళ్లలో మునిగిపోగా, ఆక్వా డెవిల్స్లో కరకట్ట వరకు నీళ్లు చేరాయి. ఇసుక ర్యాంప్ వద్ద ఉన్న మత్స్యకారుల ఇళ్లు మునిగిపోవడంతో అధికారులు వారిని అక్కడినుంచి ఖాళీ చేయించారు. గురువారం రాత్రి మరింత వరద వస్తుందని సమాచారం అందటంతో ముందు జాగ్రత్తగా కరకట్ట లోపల ఉన్న గెస్ట్హౌస్ల వారిని ఖాళీచేయాలని అధికారులు ఆదేశించారు. మేం ఉంటే గంటగంటకూ టెలీకాన్ఫరెన్స్లు: చంద్రబాబు సాక్షి, హైదరాబాద్: తాము అధికారంలో ఉంటే వరదల సమయంలో గంట గంటకు అధికారులతో టెలీకాన్ఫరెన్స్లు నిర్వహించేవాళ్లమని ప్రతిపక్ష నేత చంద్రబాబు చెప్పారు. యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టేవాళ్లమన్నారు. హైదరాబాద్లోని తన నివాసం నుంచి గురువారం టీడీపీ నాయకులతో టెలీకాన్ఫరెన్స్లో మాట్లాడారు. ‘తీరం దాటే సమయాన్ని, తాకే ప్రదేశాన్ని ముందే అంచనా వేసేవాళ్లం. ఏ ప్రాంతంలో ఎంత నష్టం వాటిల్లుతుందో ఆర్టీజీఎస్ ద్వారా అంచనా వేసి ప్రజల్ని ముందే అప్రమత్తం చేసేవాళ్లం. ప్రాణనష్టం, ఆస్తినష్టం నివారించేవాళ్లం. అధికార యంత్రాంగమంతా అక్కడే మకాం వేసేలా చూసేవాళ్లం. సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాకే తిరిగి వచ్చేవాళ్లం. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆ చొరవ, స్ఫూర్తి లేవు. ప్రజల ప్రాణాలన్నా, ఆస్తినష్టం అన్నా వైఎస్సార్సీపీకి లెక్కేలేదు’ అని చంద్రబాబు మండిపడ్డారు. -
'మహోగ్ర' గోదావరి
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, ఏలూరు/సాక్షి, కాకినాడ/శ్రీశైలం ప్రాజెక్ట్/సాక్షి, బళ్లారి/హొసపేటె/ఆదోని: నదీ పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటం.. ఉప నదులు, కొండవాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో గోదావరి మహోగ్రరూపం దాల్చింది. ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు ధవళేశ్వరం బ్యారేజీలోకి 15,28,632 క్యూసెక్కుల ప్రవాహం రావడంతో రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. డెల్టా కాలువలకు 5,500 క్యూసెక్కులను వదిలి, మిగులుగా ఉన్న 15,23,132 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేశారు. ఆదివారం రాత్రికి బ్యారేజీలోకి 17 లక్షల క్యూసెక్కులకుపైగా వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. నిండుకుండలా మారిన రాజమండ్రిలోని ధవళేశ్వరం బ్యారేజీ నుంచి దిగువకు ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి ► భద్రాచలం వద్ద గోదావరి వరద నీటిమట్టం 54 అడుగులకు చేరుకోవడంతో మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ► 1986లో భద్రాచలం వద్ద గరిష్టంగా వరద నీటిమట్టం 55.66 అడుగులుగా నమోదైంది. మళ్లీ ఆదివారం రాత్రి 9 గంటలకు అక్కడ వరద నీటిమట్టం మరింత ప్రమాదకరంగా మారొచ్చని కేంద్ర జలసంఘం హెచ్చరించింది. ► పోలవరం ప్రాజెక్టు ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద నీటిమట్టం 30 అడుగులకు చేరుకుంది. పోలవరం నుంచి ప్రాజెక్టుకు వెళ్లే మార్గంలోని కడెమ్మ వంతెన మునిగిపోయింది. ► పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు వద్ద గోష్పాద క్షేత్రం నీటమునిగింది. ► తూర్పు గోదావరి జిల్లాలో దేవీపట్నం మండలంలో 36 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకోగా, వేలేరుపాడు, కుక్కునూరు, చింతూరు, కూనవరం, వరరామచంద్రపురం, ఎటపాక మండలాల్లో 60 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు మండలంలో శబరి ఉధృతి కారణంగా తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశాలకు రాకపోకలు ఆగాయి. ► రాష్ట్ర ప్రభుత్వం నాలుగు రాష్ట్ర, జాతీయ విపత్తు దళ బృందాలను రంగంలోకి దించి ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస శిబిరాలకు తరలిస్తోంది. ► టి.నర్సాపురం మండలం అప్పలరాజుగూడెం – మధ్యాహ్నపువారిగూడెం మధ్య ఎర్రకాలువ దాటుతూ ములకాల దుర్గారావు మృతి చెందాడు. ► శనివారం ఉదయం ఆరు గంటల నుంచి ఆదివారం ఉదయం ఆరు గంటల వరకు ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 83.471 టీఎంసీల గోదావరి జలాలు కడలిలో కలిశాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 431.021 టీఎంసీలు సముద్రం పాలయ్యాయి. కృష్ణా నదిలో మళ్లీ పెరిగిన వరద ► కృష్ణా నదిపై ఉన్న శ్రీశైలం ప్రాజెక్టులోకి ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు 1.31 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా 42,378 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో 144.80 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ► నాగార్జునసాగర్లో నీటి నిల్వ 249.80 టీఎంసీలకు చేరుకుంది. ► పులిచింతలకు దిగువన మున్నేరు, కట్టలేరు, వైరా ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ప్రకాశం బ్యారేజీలోకి 1.56 లక్షల క్యూసెక్కులు చేరుతున్నాయి. దీంతో 70 గేట్లు ఎత్తి 1.25 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ఆదివారం రాత్రి బ్యారేజీలోకి వరద మరింత పెరగనుంది. తుంగభద్ర డ్యామ్ నుంచి మువ్వన్నెల విద్యుద్దీపాల వెలుగుల్లో జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి. -
భారీ వర్షాలు; అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం
సాక్షి, విశాఖపట్నం : గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగాన్ని, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్. ఫైర్ బృందాలను విపత్తులశాఖ కమిషనర్ అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు, నది పరీవాహక ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నది దాటి వెళ్లడం, వరద నీటిలో ఈతకు వెళ్లడం లాంటివి చేయరాదని హెచ్చరికలు జారీ చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులన్ని జలకళను సంతరించికున్నాయి. కృష్ణా నదికి వరద ఉధృతి పెరుగుతుండటంతో ప్రకాశం బ్యారేజీ వద్ద విపత్తుల నిర్వహణశాఖ మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఇక సుంకేశుల వద్ద ఇన్ ఫ్లో 1,87,077 అవుట్ ఫ్లో 1,86,973 క్యూసెక్కులు ఉంది. శ్రీశైలం డ్యాం వద్ద ఇన్ ఫ్లో 6,61,157 అవుట్ ఫ్లో 6,13,089 క్యూసెక్కులు ఉంది. నాగార్జునసాగర్ వద్ద ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 6,06,470 క్యూసెక్కులు ఉంది. పులిచింతల వద్ద ఇన్ ఫ్లో 4,88,987, అవుట్ ఫ్లో 4,95,054 క్యూసెక్కులు ఉంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ ఫ్లో 4,60,000, అవుట్ ఫ్లో 4,17,000 క్యూసెక్కలు ఉంది. -
ఎడతెరిపిలేని వర్షాలు.. స్కూళ్లకు సెలవు
సాక్షి, విశాఖపట్నం : మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి అనుకొని నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం వాయుగుండంగా మారుతుండటంతో ఈ రోజు రాత్రి వరకు విశాఖపట్నం, తూర్పుగోదావరి తీరం దాటే సూచనలు కనిపిస్తున్నాయని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ వెల్లడించింది. దీంతో రానున్న 24 గంటల్లో ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాలో పెను గాలులతో కూడిన భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. తీరం వెంబడి 45-50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తుండంటో మత్స్యకారులను వేటకు వెళ్లొద్దని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. పాఠశాలలకు సెలవు జ్ఞానాపురంలో లోతట్టు ప్రాంతాలలోకి భారీగా వరదనీరు చేరడంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కుంటున్నారు. నక్కలపల్లి మండలం దేవవరంలో చెరకు, పత్తి, వరి పోలాలు నీట మునిగాయి. అనకాపల్లిలోని రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో ఆర్టీసీ కాంప్లెక్స్ లోకి వర్షపు నీరు చేరడంతో నీటి మునిగింది. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లా కలెక్టర్ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి అధికారులను, ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లాలోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. దేవరాపల్లి దైవాడ రిజర్వాయర్కు భారీగా వరద నీరు చేరుతుండటంతో నీటిమట్టం ప్రమాద యికి చేరుకుంది. దీంతో అధికారులు ఒక గేటు ఎత్తి 360 క్యుసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పది గేట్లు ఎత్తివేత ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఆల్మట్టి, నారాయణపూర్, జురాల ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండాయి. దీంతో శ్రీశైల జలశయానికి భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.80 అడుగుల మేర నీరు చేరడంతో అధికారులు 10 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఇన్ఫ్లో 4.87 లక్షల క్యూసెక్కులు ఉండగా..ఔట్ఫ్లో 3.48 లక్షల క్యూసెక్కులు ఉంది. నెలకొరిగిన భారీ వృక్షం అదే విధంగా కృష్ణా జిల్లాలోని పామర్రులో రాత్రి వీచిన ఈదురు గాలులు వీస్తుండటంతో భారీ వృక్షం నేలకొరిగింది. ఈ చెట్టు అక్కడే పార్క్ చేసి ఉంచిన కారుపై పడటంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. అలాగే ప్రధానరహదారి కావడంతో వాహనదారుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. పెడన నియోజకవర్గంలో 24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు నమోదైంది. అత్యధికంగా బంటుమిల్లి మండలంలో1 0 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే తిరువూరు 38.2 మి.మీ, విస్సన్నపేట 66.4 మి.మీ, ఏ-కొండూరు 10.2 మి.మీ, గంపలగూడెం 14.6 మి.మీటర్లు గా నమోదు వివిధ జల్లాలోని పరిస్థితులు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో సముద్ర తీరంలో అలలు ఎగిసి పడుతున్నాయి. తూర్పుగోదావరిలోన కాకినడలో లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. సాంబమూర్తి నగర్, రామరావుపేటలో ఇళ్లలోకి వర్షపునీరు చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. డ్రైనేజీల నీరు పొంగిపొర్లడంతో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. అదే విధంగా గుంటూరు పులిచింతల ప్రాజెక్టులోకి వరదనీరు భారీగా పోటెత్తుతోంది. దీంతో 9 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఇన్ ఫ్లో 2.02 లక్షల క్యూసెక్కులు ఉండగా.. ఔట్ఫ్లో 2.5 క్యూసెక్కులు ఉంది. -
నేడు, రేపు భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: కోస్తాంధ్ర పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గురు, శుక్రవారాల్లో కోస్తాంధ్రలో పలుచోట్ల భారీ వర్షాలు, ఒకట్రెండు చోట్ల అతి భారీ వర్షాలు, అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ అధికారులు బుధవారం వెల్లడించారు. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, దక్షిణ కోస్తా జిల్లాల్లోని మత్స్యకారులెవరూ వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. కోస్తాంధ్ర తీరానికి సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టానికి 5.8 కిలో మీటర్ల ఎత్తులో ఆవరించి ఉంది. ఎత్తుకి వెళ్లే కొద్దీ నైరుతి దిశవైపు వంపు తిరిగి ఉంది. దీని ప్రభావంతో పశ్చిమ మధ్య బంగాళాఖాతం, కోస్తాంధ్ర ప్రాంతాల్లో రాగల 12 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే.. ఆవర్తనం ఎత్తు తగ్గడంతో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు తగ్గుముఖం పట్టాయని వివరించారు.