![Rains in Uttarandhra and Godavari districts Andhra Pradesh - Sakshi](/styles/webp/s3/article_images/2022/08/14/RAIN1.jpg.webp?itok=9-tKtXoW)
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: ఉత్తర బంగాళాఖాతంలో శనివారం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ వచ్చే 12 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా, తర్వాత 24 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దీని ప్రభావంతో ఆదివారం ఉత్తర కోస్తాంధ్రలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శనివారం రాత్రి విడుదల చేసిన నివేదికలో తెలిపింది.
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురవవచ్చని పేర్కొంది. మరోవైపు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ మీదుగా పశ్చిమ గాలులు వీస్తున్నాయి. వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో తీరం వెంబడి గంటకు 45–55 కి.మీ., గరిష్టంగా 65 కి.మీ., వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. సముద్రం అలజడిగా ఉంటుందని, ఆది, సోమవారాల్లో మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లవద్దని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment