
సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఏపీ ఎంసెట్ – 2020 కౌన్సెలింగ్ ప్రక్రియ ఈనెల 23వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. అడ్మిషన్ల కన్వీనర్, సాంకేతిక విద్య ప్రత్యేక కమిషనర్ ఎం.ఎం.నాయక్ శుక్రవారం బీఈ, బీటెక్, ఫార్మసీ అడ్మిషన్ల నోటిఫికేషన్ను విడుదల చేశారు. ఎంసెట్లో అర్హత సాధించిన విద్యార్థులు (ఎంపీసీ స్ట్రీమ్) ఈ వెబ్ కౌన్సెలింగ్లో పాల్గొనవచ్చు. ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.1,200, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.600 చొప్పున ఆన్లైన్లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి కౌన్సెలింగ్లో పాల్గొనాలి. ‘హెచ్టీటీపీఎస్://ఏపీఈఏఎంసీఈటీ.ఎన్ఐసీ.ఐఎన్’ ద్వారా ఈనెల 23 నుంచి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించవచ్చు.
► ఆన్లైన్ ఫీజు చెల్లించాక ప్రింటవుట్ తీసుకోవాలి. ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు సమయంలో సాంకేతిక కారణాల వల్ల ఫెయిల్యూర్ అని వస్తే మరోసారి చెల్లించి ప్రింటవుట్ తీసుకోవాలి. తొలుత చెల్లించిన డబ్బులు వారి ఖాతాకు జమ అవుతాయి.
► ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు అనంతరం ఎంసెట్ ఆన్లైన్ దరఖాస్తులో పేర్కొన్న మొబైల్ నంబర్కు రిజిస్ట్రేషన్ నంబర్, లాగిన్ ఐడీ నంబర్ వివరాలు ఎస్సెమ్మెస్ ద్వారా అందుతాయి. ఇలా సమాచారం వస్తే సర్టిఫికెట్ల డేటా పరిశీలన పూర్తయినట్లు. అసమగ్రంగా ఉంటే హెల్ప్లైన్ కేంద్రాల్లో ధ్రువపత్రాల పరిశీలన చేయించాలనే సందేశం వస్తుంది.
► వెరిఫికేషన్ పూర్తయ్యాక లాగిన్ ఐడీ ద్వారా పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని తదుపరి వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి.
► ప్రస్తుతం ధ్రువపత్రాల పరిశీలనకు మాత్రమే షెడ్యూల్ విడుదల చేశారు.
► ఈనెల 23 నుంచి 27 వరకు ర్యాంకుల వారీగా ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది.
► వెబ్ ఆప్షన్ల నమోదు, సీట్ల కేటాయింపు తేదీలను తదుపరి ప్రకటిస్తారు.
► దివ్యాంగులు, స్పోర్ట్స్, గేమ్స్, ఎన్సీసీ, ఆంగ్లో ఇండియన్ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనను విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఉదయం 9 గంటల నుంచి నిర్వహిస్తారు. సీఏపీ (చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్) అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లోని హెల్ప్లైన్ కేంద్రాలకు వెళ్లవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment