
సాక్షి, అమరావతి: వరుసగా మూడో ఏడాది జగనన్న చేదోడు పథకం కింద రజక, నాయీబ్రాహ్మణ, దర్జీ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం కానుక అందించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,30,145 మంది అర్హులైన రజక, నాయీబ్రాహ్మణ, దర్జీ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మల ఖాతాల్లో రూ.330.15 కోట్ల ఆర్థిక సాయాన్ని పల్నాడు జిల్లా వినుకొండలో నేడు బటన్ నొక్కి జమ చేయనున్నారు.
ఉదయం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి వినుకొండ చేరుకుంటారు. వెల్లటూరు రోడ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసిన అనంతరం వారితో, స్థానిక నేతలతో కొద్ది సేపు మాట్లాడి, తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
జగనన్న చేదోడు పథకం ద్వారా షాపులున్న రజకులు, నాయీబ్రాహ్మణులు, దర్జీలకు ఏటా రూ.10 వేల చొప్పున సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. నేడు అందిస్తున్న సాయంతో కలిపి ఒక్కొక్కరికి రూ.30,000 అందించినట్లవుతుంది. ఈ లెక్కన ఈ మూడేళ్లలో ఈ పథకం ద్వారా వైఎస్ జగన్ ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ.927.39 కోట్లు.
లంచాలకు, వివక్షకు తావులేకుండా అత్యంత పారదర్శకంగా.. గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హుల జాబితా ప్రదర్శించి, సోషల్ ఆడిట్ నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేశారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ మిస్ కాకుండా అందించాలని తపన పడుతూ.. అర్హులై ఉండి పొరపాటున, ఏ కారణం చేతనైనా సంక్షేమ పథకాల లబ్ధి అందని వారికి మరో అవకాశం కల్పిస్తూ జూన్, డిసెంబర్లలో వైఎస్ జగన్ ప్రభుత్వం లబ్ధిని అందజేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment