
చోడవరం (అనకాపల్లి జిల్లా): వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పేర్కొన్నారు. నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశం చోడవరంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం జరిగింది. ఇటీవల మంత్రివర్గ విస్తరణలో చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి స్థానం కల్పించకపోవడంతో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు రాజీనామాలకు సిద్ధపడటంతో వారందర్నీ ఎమ్మెల్యే నివారించారు.
పదవులు వస్తుంటాయి, పోతుంటాయని.. ప్రజలకు ఎప్పుడూ సేవచేసే అదృష్టం వచ్చినప్పుడు దానికి న్యాయం చేయాలన్నారు. వివిధ సమీకరణాల వల్ల తనకు మంత్రి వర్గంలో స్థానం దక్కకపోయినప్పటికీ సీఎం జగన్మోహన్రెడ్డి అభిమానం తనపైన, నియోజకవర్గ ప్రజలపైన ఎప్పుడూ ఉంటుందన్నారు. పార్టీ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు కూడా అంకిత భావంతో రానున్న రోజుల్లో పార్టీ అభివృద్ధికి మరింత పనిచేయాలన్నారు.
సమావేశంలో జెడ్పీటీసీలు మారిశెట్టి విజయశ్రీకాంత్, దొండా రాంబాబు, పోతల లక్ష్మీశ్రీనివాస్, తలారి రమణమ్మ, ఎంపీపీ గాడి కాసు, యర్రంశెట్టి శ్రీనివాసరావు, పైల రాజు, మండల అధ్యక్షులు పల్లా నర్సింగరావు, మడ్డు అప్పలనాయుడు, కంచిపాటి జగన్నాథరావు, కొళ్లిమళ్ల అచ్చెంనాయుడు, డీసీసీబీ డైరెక్టర్ మూడెడ్ల శంకరరావు, విశాఖ డెయిరీ డైరెక్టర్ గేదెల సత్యనారాయణ, సర్పంచ్లు, ఎంపీటీసీలు, వివిధ విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment