
సాక్షి, కర్నూలు : ‘అమ్మీ కహా హై...మై అమ్మాకు దేక్నా..ఉన్కా బులావ్’ అంటూ చిన్నారులు అడుగుతుంటే ఆసుపత్రిలో ప్రతి ఒక్కరూ కంటతడి పెడుతున్నారు. చివరికి వారికి వైద్యం చేసే వైద్యులు, జూనియర్ డాక్టర్లు సైతం పిల్లలకు వచ్చిన కష్టాన్ని చూసి తట్టుకోలేక బయటకు వచ్చి నీళ్లతో నిండిన కళ్లను తుడుచుకుంటున్నారు. అమ్మా, నాన్నలను అడుగుతున్న ఆ చిన్నారులకు ఏమని సమాధానం చెప్పాలో తెలియక కుటుంబసభ్యులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. వెల్దుర్తి మండలం మాదార్పురం వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన 14 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.
ఈ ప్రమాదం నుంచి బయటపడిన నలుగురు చిన్నారులు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని చిన్నపిల్లల విభాగంలో కోలుకుంటున్నారు. ఖాసిఫ్ అనే బాలునికి కాస్త గాయాలు ఎక్కువ కాగా, మిగిలిన వారు స్వల్పగాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో చిన్నారులకు అవసరమైన వైద్యాన్ని ఆసుపత్రి అధికారులు దగ్గరుండి చూసుకుంటున్నారు. తల్లిదండ్రులను కోల్పోయిన ఈ చిన్నారులకు అక్కడి వైద్యులు, నర్సులు అన్నీ తామై సపర్యలు చేస్తున్నారు. సోమవారం ఉదయం మూస, ఆస్మా అనే పిల్లల మేనమామ చాంద్బాషా, కదిరి నుంచి మరికొందరు కుటుంబసభ్యులు వచ్చి పిల్లల ఆలనాపాలనా చూస్తున్నారు.
చదవండి: దొంగల కుటుంబం: వారి టార్గెట్ అదే..
ఘోర రోడ్డు ప్రమాదం.. అంతా మదనపల్లి వాసులే!
Comments
Please login to add a commentAdd a comment