
ఆరిలోవ (విశాఖ జిల్లా): అతను మరణిస్తున్నా.. మరో ఐదుగురికి ప్రాణదానం చేశాడు. ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడి జిల్లాకు చెందిన నరేష్ పట్నాయక్ (32) రెండు రోజుల క్రితం కళ్లు తిరిగి పడిపోయాడు. వెంటనే బంధువులు పర్లాకిమిడిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు.
పరీక్షలు చేసిన వైద్యులు... నరేష్ పట్నాయక్ బ్రెయిన్లో తీవ్ర రక్తస్రావమైందని, మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం తీసుకువెళ్లాలని సూచించారు. ఈ మేరకు విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా, ఇక్కడ వైద్యులు రెండు రోజులు చికిత్స అందించినా ప్రయోజనం లేకపోవడంతో బ్రెయిన్ డెడ్ అయినట్లు గుర్తించారు.
జీవన్దాన్ ప్రతినిధులు నరేష్ కుటుంబ సభ్యులను సంప్రదించి అవయవదానంపై అవగాహన కల్పించారు.బాధను దిగమింగుకుని నరేష్ కుటుంబ సభ్యులు అవయవదానానికి అంగీకరించారు. ఆస్పత్రిలో వైద్యులు శుక్రవారం నరేష్ దేహం నుంచి ఊపిరితిత్తులు, గుండె, కిడ్నీలు, లివర్ తొలగించారు. వాటిని జీవన్దాన్ ప్రొటోకాల్ ప్రకారం ఐదుగురికి కేటాయించారు. గ్రీన్ చానెల్ ద్వారా వాటిని అవసరమైనవారికి వెంటనే తరలించినట్లు జీవన్దాన్ రాష్ట్ర కో–ఆర్డినేటర్ డాక్టర్ రాంబాబు చెప్పారు. మృతుడి కుటుంబ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment