
ఢిల్లీ –ముంబై ఎక్స్ప్రెస్ హైవే తరహాలోనే హైదరాబాద్ – బెంగళూరు రహదారిని పూర్తి స్థాయిలో రియల్ టైమ్ డిజిటల్ వ్యవస్థతో అనుసంధానం చేయనున్నారు. రియల్ టైమ్ డిజిటల్ వ్యవస్థ అనుసంధానం చేయగానే జాతీయ రహదారుల సంస్థకు చెందిన ఓ విభాగం ఆయా వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది.
సాక్షి, అనంతపురం: హైదరాబాద్ (తెలంగాణ) నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా బెంగళూరు (కర్ణాటక)కు వెళ్లే జాతీయ రహదారి–44 సూపర్ ఇన్ఫర్మేషన్ రహదారిగా మారనుంది. ట్రాఫిక్ క్లియరెన్స్ సమయంతో పాటు ఆస్పత్రులు, పెట్రోల్ బంకులు ఎంత దూరంలో ఉన్నాయో తెలుసుకునేందుకు అవసరమైన సమాచారం డిజిటల్ బోర్డులపై ప్రదర్శించేలా ఈ రహదారిని అత్యాధునికంగా మార్చేందుకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ అంచనాలు రూపొందించింది. త్వరలో క్షేత్రస్థాయి పరిశీలనకు రానుంది. ఇప్పటికే సర్వే మొదలైంది. ప్రస్తుతమున్న నాలుగు వరుసలను ఆరు వరుసల రహదారిగా విస్తరిస్తారు.
రహదారికి ఇరువైపులా ఏడు మీటర్ల వెడల్పుతో సర్వీసు రోడ్లు నిర్మించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ సరిహద్దు నుంచి కర్ణాటక సరిహద్దు వరకు 251 కిలో మీటర్లు ఉంది. ఢిల్లీ –ముంబై ఎక్స్ప్రెస్ హైవే తరహాలోనే హైదరాబాద్ – బెంగళూరు రహదారిని పూర్తి స్థాయిలో రియల్ టైమ్ డిజిటల్ వ్యవస్థతో అనుసంధానం చేయనున్నారు. రియల్ టైమ్ డిజిటల్ వ్యవస్థ అనుసంధానం చేయగానే జాతీయ రహదారుల సంస్థకు చెందిన ఓ విభాగం ఆయా వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది. అన్ని టోల్ప్లాజాల వద్ద ఇందుకు సంబంధించిన వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ ఆలోచనగా ఉంది.
చదవండి: (Subha Muhurtham: మళ్లీ కల్యాణ ఘడియలు వచ్చేశాయి..)
సర్వే పనులు ప్రారంభించాం
హైదరాబాద్ – బెంగళూరు జాతీయ రహదారి–44ను నాలుగు వరుసల నుంచి ఆరు వరుసల రోడ్డుగా మారుస్తున్నాం. ఈ జాతీయ రహదారి తెలంగాణ సరిహద్దు నుంచి కర్ణాటక సరిహద్దు వరకు ఆంధ్రప్రదేశ్లో 251 కిలో మీటర్లు ఉంది. ఇప్పటికే రహదారి విస్తరణకు సర్వే చేస్తున్నారు. త్వరలోనే రియల్ టైమ్ డిజిటల్ వ్యవస్థ అనుసంధానంతో సూపర్ ఇన్ఫర్మేషన్ రహదారిగా మారనుంది. త్వరలో ట్రాఫిక్, రోడ్డు ప్రమాదాల సమస్య తీరనుంది.
– జేఎల్ మీనా, ప్రాజెక్ట్ డైరెక్టర్, ఎన్హెచ్ఏఐ