
సాక్షి, విజయవాడ: కొత్త జిల్లాలపై మార్చి 3 వరకు సూచనలు తీసుకోనున్నట్లు ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్కుమార్ తెలిపారు. ఈ మేరకు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మార్చి 3 వరకు జిల్లా కలెక్టర్లకు సూచనలు ఇవ్వొచ్చు. అన్నింటినీ పరిశీలించాలని సీఎం జగన్ ఆదేశించారు. మార్చి మూడో వారంలో కొత్త జిల్లాల తుది నోటిఫికేషన్ ఇస్తాం. ఏప్రిల్ 2 ఉగాది నుంచి కొత్త జిల్లాల పాలన ప్రారంభమవుతుంది. మార్చి నెలలో అన్ని జిల్లాల్లో ఉద్యోగుల విభజన చేపడతాం. ఉద్యోగుల ప్రమోషన్లు, సర్వీస్కి ఇబ్బందులు ఉండవు. వర్క్ టు సెర్వ్ కింద ఉద్యోగులను కేటాయిస్తాం.
రెండు చోట్ల మాత్రమే ఉద్యోగుల జోనల్ సమస్యలు ఉంటాయి. కొత్త జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు నిర్మిస్తాం. ఎస్పీ కార్యాలయంతో సహా అన్ని కార్యాలయాలు ఒకే చోట ఏర్పాటు చేస్తాం. 4లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త కలెక్టరేట్లు నిర్మాణం జరుగుతుంది. జిల్లాలు ఏర్పాటయ్యాక కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఇస్తాం. కేంద్రం అనుమతి జిల్లాల ఏర్పాటుకు అవసరం లేదు. జిల్లాలను ఏర్పాటు చేసి కేంద్రానికి పంపిస్తే నోటిఫై చేస్తుంది' అని ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ అన్నారు.