
గుణదల (విజయవాడ తూర్పు): ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంతో పాటు రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించే దిశగా ప్రభుత్వం కృషి చేయాలని లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ కోరారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని గుణదల ఈఎస్ఐ రోడ్డులోని రోటరీ క్లబ్ భవనంలో లోక్ సత్తా పార్టీ సర్వసభ్య సమావేశం ఆదివారం నిర్వహించారు.
ఈ సందర్భంగా జయప్రకాష్ నారాయణ విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని వనరులు పుష్కలంగా ఉన్నాయని, ప్రభుత్వ విధానాల కారణంగా రాష్ట్రంలో విద్య, వైద్య రంగాలు పురోగమిస్తున్నాయని అభినందించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెరిగే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. కులం, మతం, ప్రాంతీయ భేదాలు లేకుండా ప్రజలందరికీ సంక్షేమ పాలన అందించాలని కోరారు. అనంతరం సర్వసభ్య సమావేశం నిర్వహించి పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.