
రాష్ట్ర ప్రభుత్వానికి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ డిమాండ్
భారీ వర్షాల వల్ల జరిగిన ప్రమాద ఘటనలపై దిగ్భ్రాంతి
మృతుల కుటుంబాలకు సంతాపం
బాధితులకు అండగా నిలవాలని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎడతెరిపిలేని వర్షాల కారణంగా జరిగిన ఘటనల్లో పలువురు మరణించడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయవాడలో కొండచరియలు విరిగిపడి నలుగురు మరణించడంతో పాటు గుంటూరు జిల్లా ఉప్పలపాడులో వరద ఉధృతికి వాగులో కారు కొట్టుకుపోయిన ఘటనలో టీచర్ సహా ఇద్దరు విద్యార్థులు మృతి చెందడం, మంగళగిరి గండాలయ్యపేటలో కొండచరియలు విరిగిపడి వృద్ధురాలు మృతి చెందడంపై వైఎస్ జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఆయా కుటుంబాలను ఉదారంగా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. భారీ వర్షాల వల్ల జనజీవనం స్తంభించిపోయిందని, విజయవాడ సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. ఈ ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టి బాధితులను ఆదుకోవాలన్నారు. బాధితులకు అండగా నిలవాలని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలకు వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు.