రామ రామ.. ఏమిటీ డ్రామా! | Reverse case in the chariot burning incident in Anantapur district | Sakshi
Sakshi News home page

రామ రామ.. ఏమిటీ డ్రామా!

Published Thu, Sep 26 2024 5:22 AM | Last Updated on Thu, Sep 26 2024 8:37 AM

Reverse case in the chariot burning incident in Anantapur district

అనంతపురం జిల్లాలో రథం దగ్ధం ఘటనలో రివర్స్‌ కేసు 

కీలక సూత్రధారులైన టీడీపీ మద్దతుదారులను తప్పించే కుట్ర 

టీడీపీ కుయుక్తులకు పోలీసుల సహకారం 

అధికార పార్టీ నేతల ఒత్తిడితో తిమ్మినిబమ్మిని చేసే యత్నం 

నేరంలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడి పాత్ర ఉందన్న ఎస్పీ 

వాస్తవంగా అతను టీడీపీ మద్దతుదారుడు 

పోలీసుల తీరుపై విస్తుపోతున్న హనకనహాళ్‌ గ్రామస్తులు

సాక్షి టాస్క్‌ ఫోర్స్‌: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అనంతపురం జిల్లా కణేకల్లు మండలం హనకనహాళ్‌ శ్రీరాములోరి రథం దగ్ధం కేసును పోలీసులు పక్కదారి పట్టిస్తున్నారు. రథానికి నిప్పు పెట్టిన ఘటనలో సూత్రధారులు, పాత్రధారులు టీడీపీ సానుభూతిపరులేనంటూ సర్వత్రా కోడై కూస్తున్నా.. పోలీసులు మాత్రం ఆ నెపాన్ని ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్‌సీపీపై నెట్టేస్తున్నారు. అధికార పార్టీ పెద్దల సూచనలకు అనుగుణంగా పోలీసులు ఇలా వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. 

పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ఈశ్వర్‌రెడ్డి అనే వ్యక్తిని బుధవారం అనంతపురంలో మీడియా ఎదుట హాజరు పరిచారు. రథానికి నిప్పు పెట్టడంలో ఈశ్వర్‌రెడ్డి పాత్ర ఉందని, ఇతను వైఎస్సార్‌సీపీకి చెందిన వాడని జిల్లా ఎస్పీ జగదీష్‌ ప్రకటించారు. వాస్తవంగా ఈశ్వర్‌రెడ్డి గత ఎన్నికల్లో టీడీపీకి పని చేశాడని, ఆ విషయాన్ని పోలీసులు దాచి.. వైఎస్సార్‌సీపీ ముద్ర వేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

రథం దగ్ధం తర్వాత పోలీసులు ఆధారాల సేకరణ కోసం డాగ్‌ స్క్వాడ్‌ను రంగంలోకి దింపారు. పోలీసు జాగిలాలు గ్రామంలోని నలుగురి ఇళ్ల వద్దకు వెళ్లాయి. ఆ నాలుగిళ్లూ టీడీపీ సానుభూతిపరులవే కావడం గమనార్హం. పోలీసుల ప్రాథమిక విచారణలోనూ టీడీపీకి చెందిన వారే ఈ పని చేసినట్లు తేలినప్పటికీ వారెవ్వరినీ నిందితులుగా చూపలేదు. ఆ పార్టీ పెద్దల ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటూ కేసును తప్పుదారి పట్టిస్తున్నట్లు సమాచారం.  

అన్ని వేళ్లూ వారి వైపే.. 
హనకనహాళ్‌ గ్రామంలో శ్రీరాములోరి రథం పట్ల ముందు నుంచీ తీవ్ర వ్యతిరేకతతో ఉన్నది టీడీపీ వారే కావడం గమనార్హం. ఈ విషయం గ్రామస్తులందరూ చెబుతున్నప్పటికీ వైఎస్సార్‌సీపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులైన మూలింటి ఎర్రిస్వామిరెడ్డి బ్రదర్స్‌ 2022లో రూ.19 లక్షల సొంత నిధులతో రథాన్ని తయారు చేయించారు. 

వైఎస్సార్‌సీపీ సానుభూతి పరులే ఈ రథాన్ని తయారు చేయించినప్పుడు అదే పార్టీకి చెందిన వారు ఎందుకు నిప్పు పెడతారని ప్రజలు సూటిగా ప్రశ్నిస్తున్నారు. పక్కా ప్రణాళిక ప్రకారం టీడీపీ వారే రథానికి నిప్పు పెట్టి.. ఆ నెపం వైఎస్సార్‌సీపీ మద్దతుదారులపై నెట్టేలా వ్యూహం పన్నినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో గ్రామంలో ఇలాంటి సంఘటనలెన్నడూ జరగలేదని, టీడీపీ అధికారంలోకి వచ్చాకే ఇలాంటివి జరుగుతున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సీఎం చెప్పిందొకటి..జరిగింది మరొకటి..
కేసును నిష్పక్షపాతంగా విచారించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకవైపు చెప్పినప్పటికీ, మరోవైపు అందుకు భిన్నంగా జరుగుతోంది. దోషులు టీడీపీ వారేనని తేలినప్పటికీ, ఈ విషయాన్ని బహిర్గతం చేస్తే ప్రభుత్వానికి మచ్చ రావడం ఖాయమని, వైఎస్సార్‌సీపీపైకి నెపం నెట్టాలని టీడీపీ పెద్దలు చెప్పడంతో పోలీసులు జీ హుజూర్‌ అన్నట్లు సమాచారం. 

సీఎం వ్యాఖ్యలకు అర్థం ఇదేనని సర్వత్రా అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ నేతల మెప్పు కోసం పోలీసు యంత్రాంగం ఈశ్వర్‌రెడ్డిని అరెస్ట్‌ చేసి, అతను వైఎస్సార్‌సీపీ అని చెప్పడం గమనార్హం. పోలీసుల తీరు పట్ల గ్రామంలో ఎప్పుడేం జరుగుతుందోనని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

రథానికి నిప్పు ఘటనలో ఒకరి అరెస్ట్‌: ఎస్పీ జగదీష్‌
అనంతపురం: అనంతపురం జిల్లా కణేకల్లు మండలం హనకనహాళ్‌ గ్రామంలో శ్రీ­రా­ము­ల వారి రథానికి నిప్పంటించిన కేసులో అదే గ్రామానికి చెందిన వైఎస్సార్‌­సీపీ నాయ­కుడు బి.ఈశ్వరరెడ్డిని అరెస్ట్‌ చేసినట్లు జిల్లా ఎస్పీ పి.జగదీష్‌ తెలిపారు. బుధవారం ఆయన మీడి­యాతో మాట్లాడారు. హనకన­హాళ్‌­లో ఈ నెల 23వ తేదీ అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తాళాలను పగులగొట్టి మండపంలోకి ప్రవే­శించి.. రథంపై పెట్రోల్‌­/­కిరోసిన్‌ పోసి నిప్పు పెట్టారని తెలిపారు. వెంటనే గ్రామ­స్తులు మంటలు ఆర్పారని, అప్పటికే రథం ముందు భాగం కాలిపో­యిందన్నారు. 

ఈ ఘటనపై కణేకల్లు పోలీస్‌­స్టేషన్‌లో కేసు నమోదు చేశారన్నారు. ఘటనా స్థలంలో ఆధా­రాల సేకరించామని  చెప్పారు. రథాన్ని 2022లో గ్రామానికి చెందిన ఎర్రిస్వామి రెడ్డి సోద­రులు రూ.20 లక్షలు వెచ్చించి తయారు చేయి­ంచారని తెలిపారు. గ్రామంలో ఏ ఒక్కరి సహాయ సహకారాలు తీసుకోకుండా వారి కుటుంబ సభ్యులే రథాన్ని స్వయంగా తయారు చేయి­ంచారన్నారు. దీంతో గ్రామ­స్తుల్లో విభేదాలు ఏర్పడ్డాయని చెప్పారు. 

ఈ ఘటనలో గ్రామానికి చెందిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు బోడిమల్ల ఈశ్వర రెడ్డి పాత్ర ఉన్నట్లు తెలియడంతో అరెస్ట్‌ చేశా­మని స్పష్టం చేశారు. పోలీస్‌ కస్టడీలోకి తీసు­కుని, ఈ నేరంలో ఇంకా ఎవరి పాత్ర­యినా ఉందా అనే అంశంపై విచారిస్తామ­న్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement