యాసిడ్‌ తాగించి.. కత్తితో పొడిచి! | Shocking Incident Acid Attack On Woman On Valentines Day In Annamayya District, More Details Inside | Sakshi
Sakshi News home page

యాసిడ్‌ తాగించి.. కత్తితో పొడిచి!

Published Sat, Feb 15 2025 4:48 AM | Last Updated on Sat, Feb 15 2025 9:00 AM

Shocking incident on valentines day in annamayya district

అన్నమయ్య జిల్లాలో కదిరి టీడీపీ నేత కుమారుడి అకృత్యం 

పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువతిపై ఉన్మాదంతో పైశాచిక దాడి 

ఇంట్లో మాటువేసి బలవంతంగా యాసిడ్‌ తాగించి.. ఆపై కత్తిపోట్లు 

బాధితురాలికి వారం క్రితమే మేనత్త కుమారుడితో నిశ్చితార్థం 

పచ్చముఠాల బరి తెగింపు.. రెడ్‌బుక్‌ పాలనకిది పరాకాష్ట  

రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవనడానికిది ప్రత్యక్ష ఉదాహరణ 

గుర్రంకొండ (అన్నమయ్య జిల్లా), మదనపల్లె, పీలేరు: అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అండతో కామ పిశాచాలు వరుసగా అఘాయిత్యాలకు తెగబ­డుతున్నాయి. ఒకరు కాదు.. ఏకంగా ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు తమ కుటుంబం వెనుక ఉన్నారని.. రెడ్‌బుక్‌ రాజ్యాంగ పాలనలో తమను ఏమీ చేయ­లేరనే ధీమాతో అన్నమయ్య జిల్లాలో ఓ ఉన్మాది నిశ్చితార్థం జరిగిన యువతిపై అత్యంత కిరాతకంగా యాసిడ్‌తో దాడి చేసి కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. 

మరి కొద్ది రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కా­ల్సిన బాధితురాలు ఆస్పత్రిలో తీవ్ర గాయాలతో చికిత్స పొందుతోంది. వారం క్రితం నిశ్చితార్థం.. మరో రెండు నెలల్లో పెళ్లి.. ఇక జీవితమంతా ఆనందంగా సాగుతుందని కలలు కన్న ఆ యువతి జీవి­తం­లో ప్రేమికుల రోజు రోజే ఈ విషాద ఘటన చోటు చేసుకొంది. 

అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం నడిమికండ్రిగ పంచాయతీ ప్యారంపల్లెలో శుక్రవారం ఈ దారుణం వెలుగు­లో­కి వచ్చింది. నిందితుడి తండ్రి సంకారపు మురళి మద­నపల్లె, కదిరి టీడీపీ ఎమ్మెల్యేలకు సన్నిహి­తుడు కావడం గమనార్హం. మదనపల్లె టీడీపీ ఎమ్మెల్యే షాజహాన్‌­బాషా ప్రధాన అనుచ­రుడైన మురళికి టీడీపీలో క్రియాశీల సభ్యత్వం కూడా ఉంది.

వేధింపులతో ఉద్యోగం మానేసి..
ప్యారంపల్లెకు చెందిన దాసరి జనార్దన్, రెడ్డెమ్మల కుమార్తె గౌతమి (21) డిగ్రీ తరు­వాత బ్యూటీషియన్‌ కోర్సు చేసి మదనపల్లె­లోని ఓ బ్యూటీ పార్లర్‌­లో పని చేస్తోంది. మదన­పల్లెలోని అమ్మచెరువు మిట్ట ప్రాంతానికి చెందిన టీడీపీ నాయకుడు మురళీ కుమారుడు గణేష్‌ (24) ప్రేమ పేరుతో బాధితురా­లిని తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నాడు. అతడి ఆగడాలు భరించలేక బాధితు­రాలు మూడు నెలల కిందట ఉద్యోగం వదిలేసి సొంత గ్రామమైన ప్యారంపల్లెలో తల్లిదండ్రుల వద్దే నివసిస్తోంది. 

పీలేరుకు చెందిన మేనత్త కుమా­రుడితో ఆమెకు తల్లిదండ్రులు వివాహం నిశ్చయం చేశారు. బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న శ్రీకాంత్‌తో ఈ­నెల 7వ తేదీన నిశ్చితార్థం ఘనంగా జరిగింది. వచ్చే ఏప్రిల్‌ 29 తేదీన వీరిద్దరికీ వివాహం చేయా­లని నిర్ణయించారు. ఏడా­దిగా బాధితురాలిని వేధిస్తున్న నిందితుడు గణేష్‌ ఆమెను అంతమొ­ందించేందుకు 15 రోజుల కింద ప్యారంపల్లెకు వెళ్లి రెక్కీ నిర్వహించాడు. 

శుక్రవారం ఉద­యం బాధి­తు­రాలి తల్లిదండ్రులు పొలం వద్ద­కు వెళ్లిన సమయంలో ఇంట్లోకి చొరబడి గడియ వేశాడు. తనతోపాటు తెచ్చుకున్న యాసిడ్‌ బాటిల్‌తో ఆమెపై దాడి చేసి బలవంతంగా తాగించాడు. తలపై కూడా పోశాడు. పథకం ప్రకా­రం తన వెంట తెచ్చుకొన్న కత్తితో ఆమెపై దాడి చేసి పలుచోట్ల కత్తితో పొడిచాడు. అనంతరం ఆమె వద్ద నుంచి సెల్‌ఫోన్‌ లాక్కుని పరార­య్యాడు. 

పొలం నుంచి పరుగులు తీస్తూ..
బాధితురాలి ఇల్లు గ్రామం చివరిలో ఉండటం, అందరూ పొలం పనులకు వెళ్లడంతో ఈ దాష్టీకం ఎవరి కంట పడలేదు. అయితే తన తల్లి సెల్‌ఫోన్‌ను ఇంటి వద్దనే ఉంచి వెళ్లడంతో తండ్రికి ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చింది. పొలం నుంచి పరుగులు తీస్తూ ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులు అపస్మారక స్థితిలో ఉన్న తమ కుమార్తెను చూసి కుప్పకూలిపోయారు. తొలుత 108 వాహనంలో గుర్రంకొండ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ ఎవరూ లేకపోవడంతో మదనపల్లె ప్రభుత్వాస్ప­త్రికి తరలించారు. 

అనంతరం బెంగళూరులోని ఆస్ప­త్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానిక న్యాయమూర్తి బాధితురాలి నుంచి వాంగ్మూలం సేకరించారు. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న బాధితురాలి తల్లిదండ్రులకు ఇద్దరు సంతానం కాగా కుమారుడు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. అంతా సవ్యంగా జరుగుతోందని సంతోషంగా ఉన్న సమయంలో తమ కుమార్తె పరిస్థితిని తలుచుకుని తల్లడిల్లిపోతున్నారు.

దుశ్చర్యను ఖండించిన వైఎస్‌ జగన్‌
ఇది దిగజారిన శాంతి భద్రతలు, రెడ్‌బుక్‌ పాలనకు పరాకాష్టఅన్నమయ్య జిల్లాలో ఓ యువతిపై ప్రేమోన్మాది యాసిడ్‌తో దాడి చేయటాన్ని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ తీవ్రంగా ఖండించారు. నింది­తు­డి­పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బాధిత యువ­తికి మెరుగైన వైద్యం అందించి ఆ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉండాలని సూచించారు.

రాష్ట్రంలో దిగజారిన శాంతి భద్రతలకు ఇదొక నిదర్శనమని, రెడ్‌బుక్‌ పాలనకు పరాకాష్ట అని పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళల భద్రత విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం, వైఫల్యం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నా­యని, ఇకనైనా వారి భద్రతపై దృష్టి సారించాలని డిమాండ్‌ చేశారు.     –సాక్షి, అమరావతి

నిత్యం మహిళలపై దాడులు..
యువతిపై యాసిడ్‌ దాడికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని, ఇలాంటివి పునరావృతం కాకుండా కఠినంగా వ్యవహరించాలన్నారు. రాష్ట్రంలో నిత్యం మహిళలపై దాడులు జరుగుతుంటే ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, హోంమంత్రులు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మండిపడ్డారు. 

కూటమి ప్రభుత్వ హయాంలో మహిళలకు రక్షణ కరువైందన్నారు. బాధిత కుటుంబాన్ని సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత, మంత్రి లోకేశ్‌ ఫోన్‌లో పరామర్శించారు. మంత్రి రాంప్రసాద్, ఎమ్మెల్యే షాజహాన్‌బాషా బాధితురాలిని పరామ­ర్శి­ంచేందుకు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. 

ఘటన జరిగిన 15 నిమిషాల్లోనే పోలీసులు స్పందించి నిందితుడి ఆచూకీ గుర్తించినట్లు ఎస్పీ విద్యాసాగర్‌ నాయుడు చెప్పారు. నిందితుడిని పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను నియమించినట్లు తెలిపారు. నిందితుడి కోసం నాలుగు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement