మీకు చౌకగా విద్యుత్‌ ఇస్తాం | Solar Energy Corporation of India letter to the state | Sakshi
Sakshi News home page

మీకు చౌకగా విద్యుత్‌ ఇస్తాం

Nov 25 2024 5:02 AM | Updated on Nov 25 2024 1:29 PM

Solar Energy Corporation of India letter to the state
  • సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సెకీ) రాష్ట్రానికి లేఖ 
  • తనంతకు తానుగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ 2021లో ప్రతిపాదన 
  • పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగంలో ఏపీ బెస్ట్‌
  • మీ విధానాలు, చొరవకు ప్రశంసలు 
  • వ్యవసాయానికి పగలే 9 గంటల ఉచిత విద్యుత్‌ అభినందనీయం
  • అందువల్ల మీ రాష్ట్రానికి చౌకగా విద్యుత్‌ సరఫరా చేస్తాం
  • 25 ఏళ్లపాటు యూనిట్‌ రూ.2.49 చొప్పున..
  • అంతర్రాష్ట్ర విద్యుత్‌ సరఫరా చార్జీలు కూడా మినహాయిస్తామని స్పష్టత
  • ఇంత మంచి ప్రతిపాదనను ఏ రాష్ట్రమైనా వదులుకుంటుందా?
  • ఒకవేళ వదులుకుంటే ఎందుకు తీసుకోలేదని బాబు గ్యాంగ్‌ గగ్గోలు పెట్టేది
  • ఇదే ఎల్లో మీడియా ప్రభుత్వాన్ని తప్పు పడుతూ కథనాలు రాసేది 
  • ఇంత పారదర్శక ఒప్పందంలో స్కామేమిటి? ముడుపులేమిటి?
  • కేంద్ర, రాష్ట్రాల మధ్య లంచాలకు తావెక్కడ? 

సాక్షి, అమరావతి: పునరుత్పాదక ఇంధన వనరులను వినియోగించుకోవడంలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అవలంభిస్తున్న వినూత్న విధానాలు, చూపిస్తున్న చొరవకు స్పందిస్తూ పాతికేళ్ల పాటు రాష్ట్రానికి చవగ్గా సౌర విద్యుత్‌ అందిస్తామని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సెకీ) తనకు తానుగా తొలుత ప్రతిపాదించింది. అందుకు 2021 సెప్టెంబర్‌ 15న సెకీ రాసిన లేఖే తిరుగులేని ఆధారం. వేరే ప్రయత్నాలు అవసరం లేదని, అతి తక్కువ ధరకు యూనిట్‌ రూ.2.49కి తామే అందిస్తామంటూ సెకీనే ఆరోజు రాష్ట్రానికి లేఖ రాసింది. 

రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేలా వ్యవసాయానికి పగటిపూట ఉచితంగా 9 గంటల పాటు నిరంతరాయంగా నాణ్యమైన పునరుత్పాదక విద్యుత్‌ను.. అదీ డిస్కంలపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా అందించాలనే జగన్‌ వినూత్న ఆలోచనను కేంద్ర సంస్థ ఆ లేఖలో కొనియాడింది. 6,400 మెగావాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్‌ కేంద్రం ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్‌ టెండర్లు పిలిచిందనే విషయం తమకు తెలిసిందని, అయితే తామే చౌక ధరకు సోలార్‌ విద్యుత్‌ను 25 ఏళ్ల పాటు సరఫరా చేస్తామని ఆ లేఖలో తెలిపింది. 

2024 సెప్టెంబర్‌లో 3 వేల మెగావాట్లు, 2025 సెప్టెంబర్‌లో 3 వేల మెగావాట్లు, 2026 సెప్టెంబర్‌లో 3 వేల మెగావాట్లు చొప్పున మొత్తం 9 వేల మెగావాట్లు ఇస్తామని వివరించింది. 25 సంవత్సరాల పాటు ఇంటర్‌ స్టేట్‌ ట్రాన్స్‌మిషన్‌ సిస్టమ్‌ (ఐఎస్‌టీఎస్‌) చార్జీల నుంచి రాష్ట్రానికి మినహాయింపు కూడా ఇస్తామని చెప్పింది. తామిచ్చే టారిఫ్‌ యూనిట్‌ రూ.2.49 వల్ల వ్యవసాయ విద్యుత్‌కు ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ భారం కూడా తగ్గుతుందని పేర్కొంది. 

అదే విధంగా 9 వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి ఏపీలో ప్రాజెక్టు నిర్మిస్తే అయ్యే ఖర్చులు, భూమి కూడా మిగులుతాయని, వాటిని రాష్ట్రం ఇతర అభివృద్ధి, ప్రాజెక్టుల అవసరాలకు వినియోగించుకోవచ్చని వివరించింది. డిస్కంలకు కూడా విద్యుత్‌ కొనుగోలు ఖర్చులు తగ్గుతాయని వెల్లడించింది. తమ ప్రతిపాదనకు అంగీకరించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌’కు ఏపీ మద్దతు ఇచ్చినట్టవుతుందని కూడా చెప్పింది. 

వెంటనే సానుకూల నిర్ణయాన్ని తెలపాలని రాష్ట్రాన్ని కోరింది. ఇలా కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీనే స్వయంగా విద్యుత్‌ ఇస్తామంటూ ముందుకు వచ్చిన ఈ వ్యవహారంలో స్కామ్‌కు ఆస్కారమే ఉండదన్నది స్పష్టం. ఇందులో ముడుపుల అన్న ప్రశ్నే ఉత్పన్నం కాదన్న విషయం ఎవరికైనా ఇట్టే అవగతమవుతుంది.

సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్రానికి లేఖ

కేంద్రం ఇంతగా చెప్పాక ఎవరైనా కాదంటారా..!  
అతి చౌకగా విద్యుత్‌ అందిస్తామని కేంద్ర ప్రభుత్వమే ఇంత స్పష్టంగా చెప్పాక ఏ రాష్ట్రమైనా ఎందుకు వద్దంటుంది? పైగా, ఈ విద్యుత్‌ తీసుకొంటే ఆర్థికంగా, ఇతరత్రా పలు ప్రయోజనాలూ ఉన్నాయి. ఇంత మంచి అవకాశాన్ని ఏ రాష్ట్రమూ వదులుకోదు. ఒక వేళ వద్దంటే ప్రతిపక్షాలు ఊరుకుంటాయా? తక్కువకు ఇస్తామని కేంద్రమే ముందుకు వస్తే ఎందుకు తీసుకోవడంలేదని, దాని వెనుక రాష్ట్ర ప్రయోజనాలకంటే వేరే కారణాలున్నాయంటూ గోల పెట్టేవి.

ఇదే ఎల్లో మీడియా ప్రభుత్వాన్ని తప్పు బడుతూ కథనాలు రాసేది. అలాంటి అవకాశాన్ని ఇవ్వకుండా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెంటనే కేంద్ర ప్రతిపాదనను మంత్రి మండలి సమావేశంలో ప్రవేశపెట్టారు. మంత్రులంతా ఏకగ్రీవంగా సెకీతో ఒప్పందానికి అంగీకారం తెలిపారు. అనంతరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య 7 వేల మెగావాట్ల విద్యుత్‌ కొనుగోలుకు ఒప్పందం కుదిరింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement