
రాయలసీమలోకి రుతుపవనాలు ప్రవేశించినట్లు ప్రకటించిన వాతావరణ శాఖ
సాక్షి, అమరావతి/మహారాణిపేట (విశాఖ): నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. సోమవారం రాయలసీమలోని పలు ప్రాంతాలను రుతుపవనాలు తాకినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. వీటి వేగాన్ని బట్టి మూడు రోజుల్లో రాష్ట్రమంతా విస్తరించే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాలు 16 ఏళ్ల తర్వాత ముందస్తుగా భారత ఉపఖండంలోకి ప్రవేశించాయి. సాధారణంగా ఇవి జూన్ ఒకటో తేదీన కేరళను తాకి, ఆ తర్వాత మూడు రోజుల్లో (జూన్ 4) ఏపీలోకి ప్రవేశిస్తాయి.
ఒక్కోసారి కేరళను తాకిన తర్వాత కూడా వాతావరణ పరిస్థితులు మారడంతో ఏపీకి రావడానికి ఆలస్యమైన సందర్భాలున్నాయి. కానీ, ఈసారి మాత్రం పది రోజులు ముందుగానే రాష్ట్రంలోకి ప్రవేశించాయి. లానినో పరిస్థితుల నేపథ్యంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రుతుపవనాల గమనాన్ని బట్టి ఈ ఏడాది అధిక వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
కూల్ సమ్మర్
వాతావరణంలో అనూహ్య మార్పులు, రుతుపవనాలు ముందస్తుగా పలకరించడంతో ఈ ఏడాది వేసవి ప్రభావం రాష్ట్రంలో పెద్దగా కనిపించలేదు. మామూలుగా మే నెలలో ఎండ తీవ్రత విపరీతంగా ఉంటుంది. 46 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యేవి. రోహిణీ కార్తెలో ఎండతోపాటు ఉక్కపోతతో జనం అల్లాడిపోయేవారు. కానీ ఈ మే నెలలో అనిశి్చత వాతావరణం వల్ల ఎండతోపాటు వర్షాలు కురిశాయి. దీంతో ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. ఈ వేసవిలో ఎక్కడా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాలేదు. ఆదివారం నుంచి రోహిణీ కార్తె మొదలైనా, ఎండల తీవ్రత మాత్రం లేకుండాపోయింది. రోళ్లు పగిలే రోహిణీ కార్తెలో ఇప్పుడు వర్షాలు కురుస్తున్నాయి.
నేటి నుంచి వర్షాలు..
ఏపీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశాలో విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో మంగళవారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. మంగళవారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు, ఇతర ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బుధవారం కృష్ణా, ఎనీ్టఆర్, గుంటూరు, ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వివరించింది.
సోమవారం పలు ప్రాంతాల్లో వానలు
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సోమవారం వర్షాలు కురిశాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా రాచపనుకులులో 56 మిల్లీమీటర్లు, విజయనగరంలో 42.7 మి.మీ, మారేడుమిల్లిలో 41.5 మి.మీ, గంపరాయిలో 34 మి.మీ, నెల్లిమర్లలో 33 మి.మీ, అన్నమయ్య జిల్లా ఎంగిలిబండ, కర్నూలు జిల్లా కామవరంలో 31.5 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.