
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లో కరోనా కట్టడికి అనేక చర్యలు చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు నిర్వర్తించే వారికి పీపీఈ కిట్ల తరహాలో ప్రత్యేక కిట్లను సమకూర్చింది. గ్రామాల్లో రోడ్లకు ఇరువైపుల ఉండే మురుగు కాల్వల్లో పూడిక తీత, రోడ్లను శుభ్రం చేయడం, ఇంటింటి చెత్త సేకరణ వంటి పనులు చేసే వారికి ప్రత్యేకంగా ఈ కిట్లను అందజేసింది.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 16,165 కిట్లను గ్రామపంచాయతీలకు సమకూర్చినట్టు పంచాయతీరాజ్ శాఖ అధికారులు వెల్లడించారు. ఒక్కో కిట్లో రెండు జతల బూట్లు, రెండు జతల ప్లాస్టిక్ గ్లౌజులు, ఒక కోట్ ఉంటాయి. కార్మీకులు పనిచేసిన తర్వాత ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకుని, తిరిగి ఉపయోగించుకునేందుకు వీలుగా ఈ ప్రత్యేక కిట్లను తయారు చేయించినట్లు అధికారులు పేర్కొన్నారు.