
స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు తీసుకుంటున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్
సింహాచలం (పెందుర్తి)/శ్రీకాళహస్తి (తిరుపతి జిల్లా): పంచారామ క్షేత్రం ద్రాక్షారామంలో భీమేశ్వరస్వామికి దధి (పెరుగు) నివేదనను సమర్పించడం శుభపరిణామమని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి తెలిపారు. విశాఖ శ్రీశారదాపీఠం వార్షికోత్సవాల మూడోరోజు ఆదివారం వైభవంగా జరిగాయి. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పీఠం అధిష్టాన దేవత రాజశ్యామల అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు.
టీటీడీ ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీనివాస చతుర్వేద హవనంలో పాల్గొన్నారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మానందేంద్ర సరస్వతిలను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. నివేదనకు వినియోగించిన దధిని అన్నదానంలో వినియోగిస్తున్నామన్నారు. రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ పాల్గొన్నారు.
త్వరలో వైష్ణవ ఆగమ పాఠశాల ఏర్పాటు
మరోవైపు.. శారదాపీఠంలో త్వరలో వైష్ణవ ఆగమ పాఠశాలను ఏర్పాటుచేస్తున్నట్లు పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి వెల్లడించారు. పీఠం వార్షికోత్సవాల్లో భాగంగా గడిచిన మూడ్రోజులుగా నిర్వహించిన చాత్తాద వైష్ణవ ఆగమ సదస్సు ఆదివారంతో ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ గురువులు స్వరూపానందేంద్ర సరస్వతి సంకల్పం మేరకు త్వరలోనే వైష్ణవ ఆగమ సదస్సుని కూడా ఏర్పాటుచేయదలచామని తెలిపారు.
అర్చక అకాడమీ ఆధ్వర్యంలో వేదాంతం రాజగోపాల చక్రవర్తి నిర్వహించిన ఈ సదస్సులో చిర్రావూరి శ్రీరామశర్మ, విభీషణ శర్మ, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. ఇక శారదాపీఠం వార్షికోత్సవాల్లో ఆదివారం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్ సతీసమేతంగా రాజశ్యామల అమ్మవారి యాగంలో పాల్గొని స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మానందేంద్ర సరస్వతిల ఆశీస్సులు తీసుకున్నారు. అలాగే, వీరిద్దరికీ శ్రీకాళహస్తీశ్వరాలయ బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రికను దేవస్థానం ఈఓ సాగర్బాబు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment