టీడీపీ, జనసేన విధ్వంసం.. వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులు | TDP and Janasena attacks on YSRCP ranks | Sakshi
Sakshi News home page

టీడీపీ, జనసేన విధ్వంసం.. వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులు

Published Thu, Jun 6 2024 4:43 AM | Last Updated on Thu, Jun 6 2024 1:09 PM

TDP and Janasena attacks on YSRCP ranks

స్వైరవిహారం చేసిన నేతలు, కార్యకర్తలు 

విగ్రహాలు, శిలాఫలకాల ధ్వంసం, వాహనాల దహనం   

సచివాలయ బోర్డుల తొలగింపు  

పలుచోట్ల కూటమి జెండాల ఆవిష్కరణ  

వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులు

సాక్షి నెట్‌వర్క్‌: రాష్ట్రంలో టీడీపీ, జనసేన శ్రేణులు విధ్వంసం సృష్టిస్తున్నాయి. యథేచ్ఛగా విగ్రహాలు, శిలాఫలకాలు ధ్వంసం చేస్తూ వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులకు తెగబడు­తు­న్నాయి. వాహనా­లను ధ్వంసం చేస్తు­న్నాయి. మంగళవారం మొదలు­పెట్టిన ఈ అరాచకప­ర్వాన్ని టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు బుధవారం కూడా కొనసాగించారు. ఈ రెండురోజులు ప్రభుత్వ భవనాల వద్ద ఫలకాలను చిత్రపటాలను ధ్వంసం చేస్తూ స్వైరవిహారం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో మహానేత వైఎస్సార్‌ విగ్రహాలను ధ్వంసం చేసి, విగ్రహాల వద్ద కూటమి జెండాలు ఏర్పాటు చేశారు.

ఇప్పటంలో ప్రజల భాగస్వా­మ్యంతో నిర్మించిన దివగంత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగా పేరుతో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ హాల్‌ భవనం పైభాగంలో జన­సేన, టీడీపీ జెండాలను ఏర్పాటు చేశారు. డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి పేరును తొలగించారు. దుగ్గిరాల మండలం ఈమని గ్రామంలో 1, 2 సచివాలయాల వద్ద వైఎస్‌ జగన్‌  డిజి­­టల్‌ బోర్డులను తొలగించి రోడ్డుపై పడవేసి చిత్ర­పటంపై రాళ్లు వేశారు. నూతన సచివాలయం శిలా­ఫలకంలో ఉన్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రప­టాన్ని చిన్నపిల్లలతో పగులగొట్టించారు. 

రైతు­భరోసా కేంద్రంపై నవరత్నాల బోర్డును ధ్వంసం చేశారు. పల్నాడు జిల్లా గోళ్ళపాడులో వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌ శిలాఫలకాన్ని పగులగొ­ట్టారు. తిరుపతి జిల్లా పుత్తూరులో పలు ఆలయాల వద్ద వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఆర్కే రోజా పేరిట ఉన్న శిలా­ఫలకాలను బుధవారం సాయంత్రం తెలుగు­దేశం­ నాయకులు ధ్వంసం చేశారు. శ్రీకామాక్షీ సమేత శ్రీసదాశివేశ్వరస్వామి ఆలయం లోపల ఏర్పాటు చేసిన అన్నదాన, కళ్యాణోత్సవ మండప శిలాఫల­కాన్ని, ఆరేటమ్మ ఆలయం వద్ద పలు అభివృద్ధి పనుల పేరిట ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని, గేట్‌పు­త్తూరులోని గోవిందమ్మ ఆల­యం వద్ద ప్రారంభించిన జగనన్న సమావేశమందిర శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. 

తెలుగుదేశం నాయకులు డి.జి.ధన­పాల్, బి.శ్రీనివాసులు చేసిన ఈ విధ్వంసంపై పుత్తూరు సెంగుంధర్‌ మక్కల్‌ నల సంఘం ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ నాయకులు ఎస్‌.ఎన్‌.­గోపిరమణ, టి.జి.శక్తివేలు, ఎం.ఎస్‌.తిరు­నా­వక్క­ర్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నెల్లూరు జిల్లా దగ­దర్తి మండలంలోని యలమంచిపాడులో వైఎస్సార్‌­సీపీ కార్యకర్త షేక్‌ మస్తాన్‌పై టీడీపీ నాయకులు దాడిచేశారు. అడ్డుకోబోయిన ఆయన తల్లి షేక్‌ బీబీ తలపైకొట్టి తీవ్రంగా గాయపరిచారు. 

ఆమెను నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తడక­లూరులో వైఎస్సార్‌సీపీ కార్యకర్త యలమా వెంకటే­శ్వర్లు ద్విచక్ర వాహనాన్ని పెట్రోల్‌ పోసి తగుల­బెట్టారు. మరికొన్ని గ్రామాల్లో కూడా కవ్వింపు చర్య­లకు దిగుతున్నారు. గ్రామాల్లో వివాదాలు జర­గ­కుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని కావ­లి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి కోరారు. 

పంచాయతీలో ఫైళ్ల అపహరణ 
ఏలూరు జిల్లా పెదవేగి మండలం గార్లమడుగు సచి­వా­­లయం, హెల్త్‌క్లినిక్‌ ఆవరణలోని శిలాఫలకాలను టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. వైఎస్‌ జగన్‌­మోహన్‌రెడ్డి, అబ్బయ్యచౌదరి ఫొటోలను సుత్తితో పగులగొట్టారు. తన కార్యాలయంలో వస్తువుల్ని ధ్వంసంచేసి ఫైళ్లు అపహరించారని సర్పంచ్‌ జిజ్జువరపు నాగరాజు చెప్పారు. కొప్పులవారి­గూడెంలోని సచివాలయ ఆవవరణలోని శిలాఫలకా­లను, ప్రభుత్వ సామగ్రిని ధ్వంసం చేశారు. 

సచి­వాలయం ఆవరణలో జాతీయ పతాకాన్ని ఎగుర­వేసే స్థూపానికి టీడీపీ జెండా కట్టారు. ఉంగుటూరు మండలం కైకరం గ్రామంలో బొర్రా నారాయణ­రావు చికెన్‌ దుకాణాన్ని టీడీపీ, జనసేన కార్యకర్తలు ధ్వంసం చేశారు. దీనిపై నారాయణరావు పోలీసు­లకు ఫిర్యాదు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురం సచివా­ల­యం–1పై ఉన్న శిలాఫలకాలను ధ్వంసం చేశారు. 

వార్డు సభ్యులు ముప్పిడి లక్ష్మణరావు, లక్ష్మణ­రావులపై దౌర్జన్యానికి దిగారు. నంద్యాల జిల్లా అవుకు మండలం సంగపట్నంలో సచివా­లయం, హెల్త్‌క్లినిక్‌ పైలాన్లను ధ్వంసం చేశారు. టీడీపీ, జనసేన శ్రేణులు విధ్వంసాలకు పాల్పడుతుండగా సమాచారం ఇచ్చినా పోలీసులు స్పందించలేదని పలు గ్రామాల్లో బాధితులు తెలిపారు.

కైకలూరులో వైఎస్సార్‌విగ్రహం ధ్వంసం
కైకలూరు: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఏలూరు జిల్లా కైకలూరు మండ­లం వడ్లకూటితిప్పలోని ఆంజనేయస్వామి ఆల­య­ం వద్ద 2010లో వైఎస్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని ఆకతాయిలు కూలగొట్టారు.ఈ ఘటనను వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే డీఎన్నార్, ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ ఖండించారు. విగ్రహాల కూలి్చవేత ఘటనలపై పోలీ­సులు విచారణ చేస్తున్నారు.

నీ జీవితం నా చేతుల్లో..వలంటీర్‌కు టీడీపీ నేత బెదిరింపు
పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం భట్లూరు గ్రామానికి చెందిన వలంటీర్‌ బాబురావును గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు తీవ్రంగా బెదిరించారు. ‘అరేయ్‌ బాబురావుగా నీ పతనం స్టార్ట్‌ కాబోతుంది.. ఇక నువ్వు ఫిక్స్‌ అయిపో.. ఇప్పుడు నీ జీవితం నా చేతుల్లో ఉందిరా.. నిన్ను నువ్వు కాపాడుకోవా­లనుకున్నా.. నిన్ను వేరే వాళ్ళు కాపాడాలన్నా.. నీ జీవితాన్ని నేను తిరగరాసినా ఇప్పుడు. నీకు భయం అంటే ఏంటో చూయిస్తారా.. నా కొడకా. 

అరేయ్‌ బాబురావుగా.. ఇప్పుడు నీ జీవితం నా చేతుల్లో ఉంది రా.. నీ తలరాత బ్రహ్మ రాసినా ఇప్పుడు నీ జీవి­తాన్ని నేను తిరగరాస్తా.. కొడకా..’ అంటూ స్టేటస్‌ పెట్టి మరీ హెచ్చరించారు. మరోవైపు పెద­మక్కెన గ్రామంలోని ఎస్సీ కాలనీలో దళితుల ఇళ్లపై టీడీపీ వారు రాళ్లు, సీసాలు విసిరారు. అజయ్‌­కుమార్‌ జీవనాధారమైన ఆటోను ధ్వంసం చేశారు.

వైఎస్సార్‌సీపీ నేతలు,కార్యకర్తలపై దాడులు 
ఏలూరు జిల్లా దెందులూరు నియోజక­వ­ర్గంలో టీడీపీ నేతలు, కార్య­కర్తలు.. వైఎస్సా­ర్‌­సీపీ వర్గీయులపై కర్రలు, రాళ్లతో దాడులు చేస్తున్నారు. అడ్డొచ్చినవారిని చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు. ఏలూరు రూర­ల్‌ మండలాధ్యక్షుడు శ్రీనివాసరాజు, రాష్ట్ర వడ్డికుల కార్పొరేషన్‌ చైర్మన్‌ ముంగర సంజీవ్‌కుమార్, గార్లమడుగు వైఎస్సార్‌సీపీ నాయకుడు కృష్ణ కారులో వెళుతుండగా విజయరాయి వద్ద టీడీపీ వారు దాడిచేశారు. ‘గెలిచింది మేమే.. మాకు తిరుగులేదు.. రండి ఇప్పుడు..’ అంటూ కర్రలు, రాళ్లతో కారు అద్దాలు పగులగొట్టారు. 

కారులో ఉన్న కృష్ణను బలవంతంగా బయటకు లాగి పిడిగుద్దులు గుద్ది రోడ్డుపై పడేశారు. కొంతదూరం లాక్కెళ్లి కొట్టారు. గతంలో చింతమనేని ప్రభాకర్‌పై చేసిన విమర్శలకు క్షమాపణలు చెబుతున్నా అంటూ కృష్ణతో చెప్పించి వీడియో రికార్డు చేశారు. అడ్డుపడేందుకు ప్రయత్నించిన శ్రీనివాసరాజు, సంజీవ్‌కుమార్‌లను తోసేశారు. కారు అద్దాలు పగలడంతో వైఎస్సార్‌సీపీ నాయకులకు గాయా­లయ్యాయి. ఈ దాడిని మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి, నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్రకాశం జిల్లా దొనకొండ మండలం కొచ్చెర్లకోట పంచాయతీ సిద్ధాయ­పాలెంలో సింహం లలిత, ఆమె తండ్రి చొప్పరపు బాలస్వామిపై టీడీపీ కార్యకర్తలు దాడిచేశారు. 

తీవ్రంగా గాయపడిన బాలస్వా­మి­ని తొలుత మార్కాపురం జిల్లా వైద్యశా­లకు, అక్కడి నుంచి మెరుగైన వైద్యం నిమి­త్తం ఒంగోలు జీజీహెచ్‌కి తరలించారు. వైఎస్సార్‌ జిల్లా పులివెందులలో వైఎస్సార్‌­సీపీ సోషల్‌ మీడియా యూట్యూబర్‌ సుంకేసుల ఆదిశేషు ఇంటిపై టీడీపీ వర్గీయులు కొడవళ్లతో దాడిచేశారు. ఆ సమయంలో ఆదిశేషు ఇంట్లో లేకపోవడంతో వారు మహిళలతో దురుసుగా మాట్లాడి సామగ్రిని చిందరవందర చేశారు. ఆదిశేషు  భార్య, తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement