
సాక్షి, అమరావతి: అంతటా పండుగ సంతోషాలు, సంబరాలు వెల్లివిరుస్తున్న శుభవేళ ప్రతిపక్ష టీడీపీ మాత్రం వికృత రాజకీయాలకు తెగబడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అల్లర్లు, అలజడులు, విధ్వంసాలు సృష్టించేందుకు కుట్రలు పన్నుతోంది. స్కిల్ కుంభకోణంలో ఆధారాలతో సహా అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి రాశారంటూ ఓ నకిలీ లేఖను ప్రచారంలోకి తేవడంతోపాటు సోమవారం సాయంత్రం ‘జగనాసుర దహనం’ అనే కార్యక్రమానికి నారా లోకేశ్ పిలుపునివ్వడం ద్వారా పార్టీ శ్రేణులు, రౌడీమూకలను అల్లర్లకు పురిగొల్పుతున్నట్లు స్పష్టమవుతోంది.
ముఖ్యమంత్రి దిష్టి బొమ్మలను దహనం చేయడంతోపాటు రాజకీయ ప్రత్యర్థులపై దాడులు, దుకాణాలపై దాడులు, లూటీలు చేయాలన్నది టీడీపీ లోపాయికారీ కుట్రగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కసారిగా వీధుల్లోకి వచ్చి సామాన్యులను భయభ్రాంతులకు గురిచేసి అల్లకల్లోలం సృష్టించాలని పథకం వేశారు. మత కలహాలు, వర్గ వైషమ్యాలు సృష్టించేందుకు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది.
విపక్షం కుట్ర రాజకీయాల పట్ల అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిన ‘నారా’సురుడు చంద్రబాబే అసలైన నరకాసురుడని వ్యాఖ్యానిస్తున్నారు. అటువంటి వ్యక్తి జైల్లో ఉండటమే ప్రజలకు అసలైన దసరా అని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.
పోలీసు యంత్రాంగం అప్రమత్తం
తాజా పరిణామాలతో పోలీసు యంత్రాంగం రాష్ట్రవ్యాప్తంగా అప్రమత్తమైంది. ఎక్కడా శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించింది. ప్రజలు సామరస్య పూర్వకంగా ఆనందోత్సాహాలతో దసరా పండుగ నిర్వహించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. అసాంఘిక శక్తులను ఏమాత్రం ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment