ఏడాదయినా.. ఎగరని కిసాన్‌ డ్రోన్‌ | TDP Govt Negligence on Kisan Drone Project | Sakshi
Sakshi News home page

ఏడాదయినా.. ఎగరని కిసాన్‌ డ్రోన్‌

Jun 3 2025 8:04 AM | Updated on Jun 3 2025 8:04 AM

TDP Govt Negligence on Kisan Drone Project

2024–25లో 875 కిసాన్‌ డ్రోన్స్‌ పంపిణీ లక్ష్యం

సీజన్‌ ముగిసినా ఒక్కటీ ఇవ్వని దుస్థితి

గత ప్రభుత్వంలోని సీహెచ్‌సీలను పక్కనపెట్టి 

కూటమి కార్యకర్తలతో కొత్త కమిటీల నియామకం

17 సంస్థలు ముందుకొచ్చినా 15 తిరస్కరణ

2 కంపెనీలతో ఎంప్యానెల్‌.. అయినా పట్టాలెక్కని ప్రాజెక్టు

తొలి ఏడాది తుస్‌.. మలి ఏడాదిలో రెట్టింపు టార్గెట్‌

2025–26లో ఏకంగా 1515 డ్రోన్స్‌ ఇవ్వాలని లక్ష్యం

నమో డ్రోన్‌ దీదీ పథకాన్నీ ఖాతాలో వేసుకునే ఎత్తు

సాక్షి, అమరావతి: అంతన్నారు.. ఇంతన్నారే అన్నట్టుగా ఉంది కూటమి ప్రభుత్వంలో కిసాన్‌ డ్రోన్‌ ప్రాజెక్టు పరిస్థితి. పగ్గాలు చేపట్టి ఏడాదైనా కూటమి డ్రోన్స్‌ ఎగరనంటున్నాయి. గతంలోనే డ్రోన్‌ పైలట్ల శిక్షణ ఇచ్చారు. రైతు కమిటీలను సిద్ధం చేశారు. కానీ, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడంతో కిసాన్‌ డ్రోన్స్‌ అడుగు ముందుకుపడలేదు. తొలి ఏడాది విఫలమైనప్పటికీ రెండో ఏడాది రెట్టింపు టార్గెట్‌ పెట్టుకోవడం విస్మయానికి గురిచేస్తోంది.

రైతు సేవా కేంద్రాల (పూర్వపు రైతు భరోసా కేంద్రాలు)కు అనుబంధంగా కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్స్‌ (సీహెచ్‌సీ)కు కిసాన్‌ డ్రోన్స్‌ను పంపిణీ చేయాలని గత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం సంకల్పించింది. పంటల సాగు విస్తీర్ణాన్ని బట్టి 596 మండలాల్లో 1,755 ఆర్బీకేలను ఎంపిక చేసింది. యూనిట్‌ రూ.10 లక్షల అంచనాతో రూ.85 కోట్లు సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించారు. డ్రోన్స్‌ నిర్వహణకు నలుగురు లేదా ఐదుగురు రైతులతో సీహెచ్‌సీలను సైతం ఏర్పాటు చేసి, వారిలో అర్హులైన 676 మందికి ఏన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న ఏపీ సెన్సార్‌ అండ్‌ స్మార్ట్‌ అప్లికేషన్స్‌ రీసెర్చ్‌ ఇన్‌ అగ్రికల్చర్‌ (అప్సరా) ద్వారా పైలట్లుగా శిక్షణ ఇచ్చారు. డీజీసీఏ సరి్టఫైడ్‌ డ్రోన్స్‌ ఎంపిక, తయారీదారులతో ఎంప్యానల్‌ కోసం రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీని సైతం  ఏర్పాటు చేశారు. సరిగ్గా.. కంపెనీ ఎంపిక సమయంలో పగ్గాలు చేపట్టిన కూటమి ప్రభుత్వం 80 శాతం సబ్సిడీపై గడిచిన రబీ సీజన్‌కు ముందుగానే కిసాన్‌ డ్రోన్స్‌ ఎగరవేస్తామంటూ గొప్పలు చెప్పింది. తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ మేరకు బడాయి పోయింది. డ్రోన్‌ సమ్మిట్‌లో సైతం కిసాన్‌ డ్రోన్స్‌పై ఊదరగొట్టారు. 

లక్ష్యానికి దూరంగా.. 
ఆర్‌కేవీవై–ఎఫ్‌పీఆర్‌ 2024–25లో సబ్సిడీ కింద రూ.80 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించింది. డీజీసీఏ ధ్రువీకరించిన హెక్సా కాప్టర్‌ మోడల్‌ డ్రోన్స్‌ (కనీసం 30 కేజీల బరువుతో)ను ఎంపిక చేయాలని రాష్ట్రస్థాయి సాంకేతిక కమిటీ (ఎస్‌ఎల్‌టీసీ) సిఫార్సు చేసింది. కనీసం 20 ఎకరాల విస్తీర్ణంలో పంటకు ఒకేసారి పిచికారీ చేయగల బ్యాటరీ సామర్థ్యం ఉన్నవాటిని మాత్రమే ఎంపిక చేయాలని ప్రతిపాదించారు.

17 కంపెనీలు 23 మోడల్స్‌ను ప్రదర్శించగా, క్షేత్రస్థాయి పరిశీలనలో 15 కంపెనీలకు చెందిన 19 మోడల్స్‌ను డీజీసీఏ ప్రమాణాల సాకుతో తిరస్కరించారు.  కేవలం విహంగ టెక్నాలజీస్, డ్రోగో డ్రోన్స్‌ కంపెనీలను ఎంపిక చేయడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు గతంలో రాజకీయాలకు అతీతంగా ఎంపిక చేసిన సీహెచ్‌సీలను పక్కనపెట్టి కూటమి రైతుల (సాగుకు దూరంగా ఉన్నవారితో)  కమిటీలు ఏర్పాటు చేశారు. 80% సబ్సిడీ అని గొప్పలు చెప్పిన ప్రభుత్వం తొలుత 100% రైతు కమిటీలే భరించాలని, యూనిట్‌ గ్రౌండింగ్‌ తర్వాత సబ్సిడీని విడతల వారీగా జమ చేస్తామని ప్రకటించడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.

ఏడాది పాటు ఇదిగో ఇచ్చేస్తున్నాం.. 
అదిగో ఇచ్చేస్తున్నామంటూ కాలయాపన   తప్ప ఒక్క డ్రోన్‌ కూడా పొలాల్లో ఎగురవేయలేని దుస్థితిలో ఉన్న కూటమి ప్రభుత్వం ఈ ఏడాది (2025–26)లో భారీ లక్ష్యాలను నిర్దేశించుకోవడం గమనార్హం.  

నిరుడు 875 కిసాన్‌ డ్రోన్స్‌లో ఒక్కటీ ఇవ్వలేకున్నా.. ఈసారి దాదాపు రెట్టింపుగా  1,515 డ్రోన్స్‌ ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. రైతు సంఘాలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు 80 శాతం సబ్సిడీపై వెయ్యి, వ్యవసాయ పట్టభద్రులకు 50 శాతం సబ్సిడీపై 75 కిసాన్‌ డ్రోన్లు ఇవ్వాలని సంకల్పించారు. ఇందుకోసం రూ.83.75 కోట్లు రాయితీగా ఖర్చు చేయనున్నట్టు చెబుతున్నారు.

నమో డ్రోన్‌నూ ఖాతాలో 
వేసుకునే ఎత్తు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఇప్పటికే డ్రోన్‌ ప్రాజెక్టు అమలులో విఫలమైంది. కొత్తగా భారీగా ఇస్తామని చెబుతూ.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘నమో డ్రోన్‌ దీదీ’ పథకంపై కన్నేసింది. దీని ద్వారా మహిళా సంఘాలకు 80 శాతం రాయితీపై ఇవ్వబోతున్న 440 డ్రోన్లను కూడా తన ఖాతాలో వేసుకునేందుకు ఎత్తు వేస్తోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement