
సాక్షి, తిరుమల: చిరుత దాడి నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలకు నడక మార్గాల్లో చిన్నారుల భద్రతపై టీటీడీ దృష్టి సారించింది. ఈ క్రమంలో రేపటి నుంచి ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే చిన్నారులకు టీటీడీ అనుమతి ఇవ్వనున్నట్టు పేర్కొంది.
వివరాల ప్రకారం.. ఇటీవల తిరుమలకు నడకదారిలో ఓ చిన్నారిపై చిరుత దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అలిపిరి నడకమార్గం, శ్రీవారి మెట్లమార్గంలో టీటీడీ ఆంక్షలు విధించింది. రేపటి(సోమవారం) నుంచి మధ్యాహ్నం 2 గంటల తర్వాత 15 ఏళ్లలోపు పిల్లలకు అనుమతి నిరాకరించింది. సాధారణ పరిస్థితులు నెలకొన్ని తర్వాతే చిన్నారులను పూర్తి స్థాయిలో నడకమార్గంలో అనుమతించనున్నట్టు టీటీడీ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ క్రమంలోనే రెండవ ఘాట్ రోడ్డులో సాయంత్రం ఆరు గంటల తర్వాత బైక్లకు నో ఎంట్రీ అని స్పష్టం చేసింది.
మరోవైపు.. తిరుమలలో చిరుత కోసం ఆపరేషన్ కొనసాగుతోంది. చిన్నారి లక్షిత పై దాడిచేసిన చిరుత పట్టుకోవడానికి టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మూడు ప్రాంతాలలో బోన్లు ఏర్పాటు చేసిన అధికారులు.. చిరుత సంచారంపై నిఘా వేశారు. ఇందుకోసం పోలీసు బృందాలు ప్రత్యేకంగా పనిచేస్తున్నాయి. చిరుత జాడను కనిపెట్టడానికి దాదాపు 500 కెమెరాలను ఏర్పాటు చేశారు. చిరుత భయంతో నడకదారిలో భక్తులను గుంపులుగా పంపుతోంది టీటీడీ అధికారులు.
ఇది కూడా చదవండి: తిరుమల నడకమార్గంలో హైఅలర్ట్ జోన్ ప్రకటన
Comments
Please login to add a commentAdd a comment