
సాక్షి, అమరావతి: ఆర్టీసీ ఉద్యోగులకు కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించాలని ఆ సంస్థ యాజమాన్యం నిర్ణయించింది. కోవిడ్ కర్ఫ్యూ సడలింపులు ఇవ్వడంతో బస్ సర్వీసులను అమాంతంగా పెంచాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సంస్థలోని డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర ఉద్యోగులకు కోవిడ్ వ్యాక్సినేషన్పై ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు రీజనల్ మేనేజర్లతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
మొత్తం 55 వేల మంది ఉద్యోగుల్లో 45 ఏళ్ల దాటినవారు 33 వేల మంది ఉన్నారు. వారిలో 29 వేల మందికి మొదటి డోస్ వ్యాక్సిన్లు వేయగా, కేవలం 6 వేల మందికే రెండు డోసుల వ్యాక్సిన్లు పూర్తయ్యాయి. 45 ఏళ్లు దాటిన ఉద్యోగులందరికీ జూలై 31 నాటికి రెండు డోసుల వ్యాక్సిన్లు పూర్తి చేయాలని ఎండీ స్పష్టం చేశారు. తక్కినవారికి జూలై 31 నాటికి మొదటి డోసు వ్యాక్సిన్లు వేసి, ఆగస్టు 31 నాటికి రెండు డోసులు పూర్తి చేయాలన్నారు.