
వైవీయూ ప్రిన్సిపాల్ కార్యాలయం
సాక్షి, కడప: యోగివేమన విశ్వవిద్యాలయం విద్యారంగంలో అభివృద్ధి బాటలో నడుస్తుంటే కొందరు అధ్యాపకుల తీరువల్ల ప్రతిష్ట మసకబారుతోంది. విశ్వవిద్యాలయంలోని ‘ప్రధాన’ ఆచార్యుల కార్యాలయంలో సదరు ఆచార్యుడు అసభ్యకరంగా వ్యవహరించినట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు.. ఆదివారం రోజున కార్యాలయంలో పని ఉందని సిబ్బందిని పిలిపించుకున్న ఈ ఆచార్యుడు ఓ ఉద్యోగిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో ఆ ఉద్యోగిని ఏడ్చుకుంటూ బయటకి రావడంతో తోటి ఉద్యోగులు ఆమెకు బాసటగా నిలిచారు. ఆచార్యుడు మాట్లాడిన మాటలకు సంబంధించిన వాయిస్ రికార్డును బాధితురాలు ఓ అధ్యాపక సంఘం నాయకుడికి పంపడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
దీంతో ఆచార్యుడిని, ఉద్యోగినిని వేర్వేరుగా పిలిచి ఉన్నతాధికారులు విచారించారు. దీంతో పాటు విశ్వవిద్యాలయం ఉమన్ ఎంపవర్మెంట్ కమిటీ సభ్యులు సైతం సమావేశమై ఈ విషయమై చర్చించినట్లు తెలిసింది. కాగా మరో ఉద్యోగినికి సైతం రాంగ్కాల్స్, అసభ్యకర కాల్స్ వస్తుండటంతో ఆమె కూడా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వీటితో పాటు మూడు నెలల క్రితం ఓ అధ్యాపకుడు ఓ విద్యారి్థని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఆమె తల్లిదండ్రులు వచ్చి సదరు అధ్యాపకుడికి వార్నింగ్ ఇచ్చి వెళ్లిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా ఈ ఫిర్యాదుల నేపథ్యంలో వీటన్నింటిపైనా కమిటీ వేసి విచారణ చేపట్టేందుకు అధికారులు సన్నద్ధం అవుతున్నట్లు సమాచారం.