భయపెట్టే పాలనకు ముగింపు పలకాలి: వైఎస్‌ జగన్‌ | ys jagan says Law and Order Replaced by Fear | Sakshi
Sakshi News home page

భయపెట్టే పాలనకు ముగింపు పలకాలి: వైఎస్‌ జగన్‌

Jun 20 2026 6:32 PM | Updated on Jun 20 2026 7:26 PM

ys jagan says Law and Order Replaced by Fear

సాక్షి, తాడేపల్లి: ‘‘హలో ఇండియా.. చట్టపాలనను ‘భయపాలన’ భర్తీ చేస్తోంది’’ అంటూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఏపీలోని కూటమి పాలనపై మండిపడుతూ ట్వీట్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు ఇప్పుడు పోలీసులకే ఎక్కువగా భయపడే పరిస్థితి వచ్చిందా అని ప్రశ్నించారు. ఏపీలో భయపెట్టే పాలనకు ముగింపు పలకాలన్నారు.

‘‘కస్టడీలో మరణించిన గాదె సాయికృష్ణ మృతదేహాన్ని పోలీసులు రహస్యంగా దహనం చేశారన్న ఆరోపణలు కావచ్చు.. పోలీసుల వేధింపులు భరించలేక సెల్ఫీ వీడియోలో ఆరోపణలు చేసి క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకోవడం కావచ్చు.. ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకున్న ఇలాంటి వరుస ఘటనలు ఒక్కో విషాద సంఘటన మాత్రమే కాదు.. టీడీపీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న రెడ్ బుక్ పాలన పెంచిపోషించిన ప్రమాదకర సంస్కృతికి ఇవి ఫలితాలు.

ఈ రోజు ప్రజలు ఒక ప్రశ్న అడుగుతున్నారు. పోలీసులు భారత రాజ్యాంగం ప్రకారం పనిచేస్తున్నారా? లేక చంద్రబాబు నాయుడి రెడ్ బుక్ ప్రకారమా? న్యాయం కాదు.. భయమే పోలీసింగ్‌కు చిహ్నంగా మారుతోంది.

రెడ్ బుక్ ప్రకటించిన రోజు నుంచే, పోలీసుల ద్వారా రాజకీయ కక్షసాధింపును ప్రోత్సహిస్తే, పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే పరిస్థితి వస్తుందని, సంస్థలు కలుషితం అవుతాయని, పోలీసు వ్యవస్థలోని కొన్ని వర్గాలు చట్టాలు, నిబంధనలు, రాజ్యాంగ పరిరక్షణలను దాటి వ్యవహరించే ధైర్యం తెచ్చుకుంటాయని వైఎస్సార్‌సీపీ హెచ్చరించింది.

ఆ హెచ్చరిక ఇప్పుడు బాధాకరమైన నిజంగా మారింది. మొదట రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకున్నారు. ఆ తర్వాత సోషల్ మీడియా కార్యకర్తలు లక్ష్యంగా మారారు. తర్వాత జర్నలిస్టులు, మేధావులు, భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన వారు లక్ష్యంగా మారారు’’ అని తెలిపారు.

ఈ ధోరణి మరో రూపు తీసుకుంది.. 
రాజకీయ వేధింపులతో మొదలైన ఈ ధోరణి ఇప్పుడు అదుపు లేని పోలీసింగ్‌గా మారిందని వైఎస్‌ జగన్‌ చెప్పారు. ‘‘సాధారణ ప్రజలు కూడా బెదిరింపులు, వేధింపులు, అధికార దుర్వినియోగానికి బలవుతున్నారు. సాయికృష్ణ ఘటన ఆంధ్రప్రదేశ్ మనస్సాక్షిని కదిలించింది. తన కుమారుడి మృతదేహాన్ని ఇవ్వలేకపోతే కనీసం అతని చితాభస్మమైనా ఇవ్వాలని ఒక తల్లి ఇంకా వేడుకుంటోంది.

రాష్ట్ర చరిత్రలో ఇంత భయానక పరిస్థితి ఎప్పుడైనా చోటుచేసుకుందా? క్రాంతి కుమార్ ఘటన కూడా అంతే కలచివేస్తోంది. ఆత్మహత్యకు ముందు ఆయన సెల్ఫీ వీడియోలో పోలీసుల వేధింపులపై బహిరంగంగా ఆరోపణలు చేశారు. సంబంధిత అధికారుల పేర్లను కూడా ప్రస్తావించారు.

తునిలో తిరుపతమ్మ పోలీసుల వేధింపులపై సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకుంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కలావతి కూడా పోలీసుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. కర్నూలు జిల్లాలో దళిత మహిళ గంగమ్మను విచారణ సమయంలో పోలీసులు హింసించడంతో ఆమె మరణించిందన్న ఆరోపణలు వచ్చాయి. తర్వాత ఆమెను రహస్యంగా ఖననం చేశారని, ఘటనపై న్యాయ విచారణ జరపాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు’’ అని అన్నారు.

మళ్లీ మళ్లీ జరిగితే అవి యాదృచ్ఛికాలు కాదు 
ఇలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ జరిగితే అవి యాదృచ్ఛికాలు కాదని, ఆందోళన కలిగించే ధోరణికి అవి నిదర్శనంగా మారతాయని వైఎస్‌ జగన్‌ చెప్పారు. ‘‘ఇదే సమయంలో పోలీసులు అతిగా వ్యవహరించడం నిత్యకృత్యంగా మారింది. కోడి లేదా మేకను కోశారన్న చిన్న ఆరోపణలకే ప్రతిపక్ష కార్యకర్తలను ప్రజల ఎదుట అవమానించి రోడ్లపై ఊరేగిస్తున్నారు. నైతిక పోలీసింగ్ పేరుతో అధికారులు న్యాయమూర్తి, తీర్పు చెప్పేవారు, శిక్ష అమలు చేసేవారు అన్నీ తామేనన్నట్లు వ్యవహరిస్తున్నారు. అయితే వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఫిర్యాదులు ఇచ్చినా పోలీసులు కేసులు నమోదు చేయడం లేదు. లేక నిర్లక్ష్యంగా పక్కన పెడుతున్నారు.

ఈ స్పష్టమైన ద్వంద్వ వైఖరి పోలీసు శాఖపై ప్రజల విశ్వాసాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. జవాబుదారీతనం లేకుండాపోయింది. రాష్ట్ర డీజీపీ, హోంమంత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనికి బాధ్యత వహించకుండా తప్పించుకోలేరు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం పాలన జరిగే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కావాలి. రెడ్ బుక్ పాలన కాదు. పోలీసుల బాధ్యత ప్రజల హక్కులను కాపాడటం, చట్టాన్ని అమలు చేయటం, న్యాయం నిలబెట్టటం. రాజకీయ కక్షసాధింపునకు సాధనాలుగా మారటం కాదు. భయం న్యాయాన్ని భర్తీ చేస్తే, అధికారం చట్టాన్ని భర్తీ చేస్తే, ప్రజాస్వామ్యమే బలైపోతుంది’’ అని వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement