సాక్షి, అమరావతి : ‘వైఎస్సార్ వాహనమిత్ర పథకం–2022–23’ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 13న ఆర్థిక సహాయం అందించనుంది. దీనికింద అర్హులైన ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ కలిగిన డ్రైవర్లకు ఏటా రూ.10వేలు అందిస్తున్న విషయం తెలిసిందే. ఇందులోభాగంగా.. ఈ ఏడాదికిగాను అర్హుల నుంచి రవాణా శాఖ దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ నెల 7లోగా గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు చేసుకోవాలని రవాణా శాఖ కమిషనర్ పి.రాజాబాబు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే ఈ పథకం లబ్ధిదారులుగా ఉన్నవారితోపాటు కొత్తగా ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ కొనుగోలు చేసిన డ్రైవర్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఇలా..
► ఈ పథకం కింద ఇప్పటికే లబ్ధిదారులుగా ఉన్నవారు తమ వాహనం వద్ద ఫొటోను గ్రామ, వార్డు సచివాలయంలో అప్లోడ్ చేస్తే సరిపోతుంది.
► కొత్తగా వాహనం కొనుగోలు చేసిన డ్రైవర్లు తమ ఆధార్కార్డు, తెల్ల రేషన్ కార్డు, భూమి వివరాలు, ఆదాయ పన్ను, ఇంటి విద్యుత్ వినియోగం, కులం, ఇతర వివరాలకు సంబంధించిన అర్హత పత్రాలతో దరఖాస్తు చేయాలి.
► గత ఆరు నెలల్లో సగటున నెలకు 300 యూనిట్ల కంటే ఎక్కువ వినియోగించిన వారు ఈ పథకానికి అనర్హులు. ఒకవేళ ఒకటికంటే ఎక్కువ ఇళ్లకు కలిపి ఒకే మీటరుంటే ఇళ్ల సంఖ్యను బట్టి ఒక ఇంటికి సగటు విద్యుత్ వినియోగాన్ని లెక్కిస్తారు.
► వచ్చిన దరఖాస్తులను ఆరు అంచెల్లో పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు.
► అర్హులైన లబ్ధిదారుల జాబితాను ఎంపీడీవో/మునిసిపల్ కమిషనర్ కార్యాలయాల్లో ఈ నెల 9లోగా ఆమోదిస్తారు.
► 10న ఆ దరఖాస్తులను కలెక్టర్లు ఆమోదించిన తరువాత 11, 12 తేదీల్లో సీఎఫ్ఎస్ఎస్ ద్వారా సంబంధిత కార్పొరేషన్లకు పంపిస్తారు.
► ఇక అర్హులైనప్పటికీ జాబితాలో పేరు లేకపోతే ఫిర్యాదు చేసేందుకు అవకాశం కల్పిస్తారు.
► వారి ఫిర్యాదులను పరిశీలించి అర్హులుగా నిర్ధారణ అయితే వారికి కూడా వైఎస్సార్ వాహన మిత్ర పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తారు. (క్లిక్: అమరావతిలో అభివృద్ధి పనులు ప్రారంభం)
Comments
Please login to add a commentAdd a comment