సీతారామ కాల్వల్లో ‘గోదావరి’ పరవళ్లు | - | Sakshi
Sakshi News home page

సీతారామ కాల్వల్లో ‘గోదావరి’ పరవళ్లు

Published Wed, Mar 5 2025 12:24 AM | Last Updated on Wed, Mar 5 2025 12:23 AM

సీతారామ కాల్వల్లో ‘గోదావరి’ పరవళ్లు

సీతారామ కాల్వల్లో ‘గోదావరి’ పరవళ్లు

సోమ, మంగళవారాల్లో

16 గంటల పాటు ఎత్తిపోత

అశ్వాపురం/ములకలపల్లి : సీతారామ ప్రాజెక్ట్‌ ప్రధాన కాలువల్లో గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతూ ముందుకు సాగుతున్నాయి. రెండు పంప్‌హౌస్‌ల్లోనూ రెండో రోజు కూడా మోటార్లు ఆన్‌ చేయడంతో భారీగా దిగువకు తరలుతున్నాయి. అశ్వాపురం మండలం బీజీ కొత్తూరులోని పంప్‌హౌస్‌ –1 నుంచి ములకలపల్లి మండలం వీకే రామవరం శివారులోని పంప్‌హౌస్‌–2కు చేరుకున్నాయి. దీంతో ఇక్కడ మంగళవారం డిశ్చార్చ్‌ పాయింట్‌ వద్ద నీటిని ఎత్తిపోశారు. దీంతో 35 మిలియన్‌ క్యూబిక్‌ ఫీట్‌ల(ఎంసీఎఫ్‌టీ) నీళ్లు కమలాపురం పంప్‌హౌస్‌–3కి వదిలినట్లు ఐబీ డీఈ మోతీలాత్‌ తెలిపారు. మంగళవారం ఒక్కరోజే ఐదున్నర గంటలపాటు మోటార్లు నడిపించి, 30 ఎంపీఎఫ్‌టీల నీటికి దిగువకు మళ్లించినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. కాగా, అశ్వాపురం మండలం కుమ్మరిగూడెంలోని దుమ్ముగూడెం ఆనకట్ట నుంచి బీజీ కొత్తూరులోని సీతారామ ప్రాజెక్ట్‌ ఫేస్‌–1 పంప్‌హౌస్‌ ద్వారా సోమవారం ఎనిమిది గంటలు, మంగళవారం ఎనిమిది గంటల పాటు గోదావరి జలాలు దిగువకు ఎత్తిపోశారు. గంటకు 5.4 ఎంసీఎఫ్‌టీ చొప్పున 86.4 ఎంసీఎఫ్‌టీ నీరు దిగువకు ఎత్తిపోశారు. బీజీకొత్తూరు, పూసుగూడెం, కమలాపురం పంప్‌హౌస్‌ల ద్వారా 100.22 కిలోమీటర్ల వద్ద ఏన్కూరు లింక్‌ కెనాల్‌ మీదుగా 8.60 కిలోమీటర్లు ప్రవహించి నాగార్జున సాగర్‌ కెనాల్‌కు తరలించనున్నారు.

రైతుల్లో ఆనందం..

చండ్రుగొండ : రైతులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కల మంగళవారం సాకారమైంది. ట్రయల్‌రన్‌లో భాగంగా అధికారులు సీతారామ ప్రాజెక్ట్‌ కాలువలోకి నీరు వదలగా అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ మండలాలకు గోదావరి జలాలు రావడంతో రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. రాజాపురంలో ఆదర్శరైతు భీమిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో గోదావరి జలాలకు పూజలు చేశారు.

నేడు రాజీవ్‌ లింక్‌ కెనాల్‌ ట్రయల్‌ రన్‌..

జూలూరుపాడు: సీతారామ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ మెయిన్‌ కెనాల్‌ నుంచి ఏన్కూరు ఎన్నెస్పీ కెనాల్‌ను అనుసంధానం చేసే రాజీవ్‌ లింక్‌ కెనాల్‌ వద్ద బుధవారం ట్రయల్‌ రన్‌కు ఇరిగేషన్‌ అధికారులు ఏర్పాట్లు చేశారు. అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి వద్ద ఉన్న దుమ్ముగూడెం ప్రాజెక్ట్‌ నుంచి వంద కిలోమీటర్ల దూరాన వినోభానగర్‌లోని మెయిన్‌ కెనాల్‌ ద్వారా ఏన్కూరు ఎన్నెస్పీ కెనాల్‌కు నీటి సరఫరాకు ఈ కాల్వను నిర్మించారు. కాగా, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వైరా ఎమ్మెల్యే మాలోత్‌ రాందాస్‌ నాయక్‌ సీతారామ ప్రాజెక్ట్‌ కెనాల్‌ వద్ద గోదావరి జలాలకు పూజలు నిర్వహించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement