
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా టీప్లస్జీరో (T+0) సెటిల్మెంట్ను మరింత విస్తరించింది. లావాదేవీ చేపట్టిన రోజే సెటిల్మెంట్కు వీలు కల్పించే విధానంలోకి 500 కంపెనీల షేర్లను చేర్చింది. దీంతో మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రీత్యా 500 కంపెనీల స్టాక్స్కు ఆప్షనల్గా టీప్లస్జీరో సెటిల్మెంట్ను వర్తింపచేయనుంది.
నిబంధనలకు లోబడి టీప్లస్జీరో, టీప్లస్వన్ సెటిల్మెంట్ సైకిళ్లకు విభిన్న బ్రోకరేజీ చార్జీలకు సైతం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. సెబీ తొలుత 2024 మార్చిలో 25 కంపెనీల స్టాక్స్ ద్వారా టీప్లస్జీరో సెటిల్మెంట్కు తెరతీసింది. నాన్కస్టోడియన్ క్లయింట్లకు మాత్రమే ఇది వర్తింపచేసింది. తదుపరి అభిప్రాయ సేకరణ చేపట్టి సెటిల్మెంట్ను విస్తరించింది. 2024 డిసెంబర్31కల్లా టాప్–500 కంపెనీల షేర్లు టీప్లస్జీరో సెటిల్మెంట్ పరిధిలోకి చేర్చుతూ సర్క్యులర్ను జారీ చేసింది.
2025 జనవరి నుంచి అట్టడుగున ఉన్న 100 కంపెనీలు సెటిల్మెంట్లోకి రానున్నాయి. ఆపై ప్రతీ నెలా ఇదే రీతిలో 100 కంపెనీలు చొప్పున జత కానున్నాయి. వెరసి ప్రస్తుత 25 కంపెనీలతో కలిపి 525 షేర్లు టీప్లస్జీరో సెటిల్మెంట్ పరిధిలోకి చేరనున్నాయి. వీటికి ఉదయం 8.45–9 సమయంలో ప్రత్యేక బ్లాక్ డీల్ విండోను ఏర్పాటు చేయనుంది.
ఐసీఈఎక్స్కు చెల్లు
సెబీ తాజాగా ఇండియన్ కమోడిటీ ఎక్స్ఛేంజ్(ఐసీఈఎక్స్) మూసివేతకు అనుమతించింది. రెండేళ్ల క్రితమే స్టాక్ ఎక్స్ఛేంజీ గుర్తింపును రద్దు చేయగా.. ప్రస్తుతం నిబంధనలకు అనుగుణంగా ఐసీఈఎక్స్ కార్యకలాపాల నిలిపివేతకు ఓకే చెప్పింది. వెరసి ఎక్స్ఛేంజీ విభాగం నుంచి ఐసీఈఎక్స్ వైదొలగనుంది. అయితే ఆదాయపన్ను నిబంధనలను అమలు చేయవలసి ఉంటుందని సెబీ స్పష్టం చేసింది. పేరు మార్పుసహా గతకాలపు లావాదేవీలను డేటాబేస్ నుంచి తొలగించవలసిందిగా ఐసీఈఎక్స్ను సెబీ ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment