
జీ 20 షెర్పా అమితాబ్ కాంత్
న్యూఢిల్లీ: కృత్రిమ మేధ (ఏఐ) విప్లవంలో భారత్ కేవలం పాల్గొనడం మాత్రమే కాదని, దీనికి నేతృత్వం వహించాలని దేశ జీ20 షెర్పా అమితాబ్ కాంత్ పిలుపునిచ్చారు. ఈ విషయంలో దేశాన్ని ప్రపంచ వేదికపైకి తీసుకురావడానికి తన సాంకేతిక శక్తి సామర్థ్యాలను సమీకరించాలని ఇక్కడ జరిగిన గ్లోబల్ ఇండియాఏఐ సదస్సులో ఆయన అన్నారు.
ఇండస్ట్రీ ప్రాతినిధ్య సంస్థ– నాస్కామ్ను ఉటంకిస్తూ, 70 శాతం భారతీయ స్టార్టప్లు తమ వృద్ధిని పెంచుకోవడానికి ఏఐకి ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని కాంత్ ప్రస్తావిస్తూ, తద్వారా స్టార్టప్ ఎకోసిస్టమ్లో ఏఐ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏఐ ప్రాజెక్ట్లలో 19 శాతం వాటాతో అత్యధిక సంఖ్యలో గిట్హబ్ఏఐ ప్రాజెక్ట్లను కలిగి ఉన్న రెండవ దేశంగా భారత్ ఉండడం గర్వకారణమని అన్నారు.
అంతర్జాతీయ స్థాయిలో ఏఐ అభివృద్ధికి సంబంధించి భారత్ శక్తిసామర్థ్యాలను ఈ విషయం స్పష్టంచేస్తోందన్నారు. ఈ స్ఫూర్తితో ఈ రంగంలో భారత్ మరింత పురోగమించాల్సిన అవసరం ఉందన్నారు. ఏఐ విశ్వసనీయంగా, నైతికంగా ఉండే భవిష్యత్తును రూపొందించడానికి చురుకైన విధానం అవసరమని కూడా కాంత్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment