
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ (సీఈఎస్ఎల్) తాజాగా 4,675 ఎలక్ట్రిక్ బస్లకు టెండర్లను పిలిచింది. వీటి విలువ రూ.5,000 కోట్లు. నేషనల్ ఎలక్ట్రిక్ బస్ ప్రోగ్రామ్ (ఎన్ఈబీపీ) కింద టెండర్లను ఆహ్వానించడం ఇది రెండవసారి అని సీఈఎస్ఎల్ గురువారం తెలిపింది. డ్రై లీజ్ ప్రాతిపదికన ఈ బస్లను తెలంగాణ, ఢిల్లీ, కేరళలో ప్రవేశపెడతారు. డ్రై లీజ్ పద్ధతిలో డ్రైవర్లు, కండక్టర్లు లేకుండా ఈ బస్లను ఆపరేటర్లు రాష్ట్ర రోడ్డు రవాణా (ఎస్టీసీ) సంస్థలకు సరఫరా చేస్తారు.
ఎస్టీసీలు తమ సిబ్బందితో వీటిని నడిపిస్తాయి. యాజమాన్య హక్కులతోపాటు నిర్వహణ బాధ్యతలను 10, 12 ఏళ్లపాటు సర్వీస్ ప్రొవైడర్లు (ఆపరేటర్లు) చేపడతారు. ఒక్కో బస్కు నిర్దేశిత రుసుమును ఆపరేటర్లకు ఎస్టీసీలు చెల్లిస్తాయి. బిడ్డర్లు, ఎస్టీసీలు తప్పనిసరిగా మహిళలను నియమించుకోవడంతోపాటు సురక్షిత వాతావరణాన్ని కల్పించాల్సి ఉంటుంది. 4,675 ఎలక్ట్రిక్ బస్లు వస్తే ఏటా 15 లక్షల కిలోలీటర్ల ఇంధనం ఆదా అవుతుందని సీఈఎస్ఎల్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment