![Chennai based Waterfly Technologies incubated at IIT Madras unveiled WIG craft e flying boat at Aero India](/styles/webp/s3/article_images/2025/02/14/boat01.jpg.webp?itok=2ZYFQuxp)
ఇ-ఫ్లైయింగ్ బోట్ను ఆవిష్కరించిన వాటర్ ఫ్లై టెక్నాలజీస్
చెన్నై-కోల్కతాకు రూ.600 ఖర్చుతో కేవలం మూడు గంటల్లోనే ప్రయాణం చేయవచ్చు. నమ్మట్లేదు కదా.. నిజమేనండి.. చెన్నైకి చెందిన స్టార్టప్ కంపెనీ వాటర్ ఫ్లై టెక్నాలజీస్ తయారు చేసిన ఇ-ఫ్లైయింగ్ బోట్ ద్వారా ఇది సాధ్యమవుతుంది. ఐఐటీ మద్రాస్ సాయంతో ఈ కంపెనీ తయారు చేసిన వింగ్-ఇన్-గ్రౌండ్ (విగ్) క్రాఫ్ట్ను బెంగళూరులోని ఏరో ఇండియా 2025లో ఆవిష్కరించారు. దీనివల్ల కేవలం రూ.600 ఖర్చుతో మూడు గంటల్లో చెన్నై- కోల్కతా మధ్య ప్రయాణం సాగించవచ్చని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.
ఇ-ఫ్లయింగ్ బోట్ ‘విగ్ క్రాఫ్ట్ గ్రౌండ్ ఎఫెక్ట్’ అనే సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. నీటి నుంచి సుమారు నాలుగు మీటర్ల ఎత్తులో ఇది ఎగురుతుంది. ఇది గాల్లో నిలకడగా ఎగురుతూనే నిర్దిష్ట వేగంతో ప్రయాణిస్తుందని కంపెనీ అధికారులు తెలిపారు. గంటకు 500 కిలోమీటర్ల గరిష్ట వేగం దీని సొంతమని చెబుతున్నారు. ఈ ఫ్లయింగ్ బోట్ విగ్ క్రాఫ్ట్ పూర్తిస్తాయిలో అందుబాటులోకి వస్తే చెన్నై నుంచి కోల్కతాకు 1,600 కిలోమీటర్లు ప్రయాణానికి సీటుకు కేవలం రూ.600 ఖర్చు అవుతుందని అంటున్నారు. ఇది ఏసీ త్రీ టైర్ రైలు టికెట్ కంటే చాలా చౌక.
ఈ ఎలక్ట్రానిక్ ఫ్లయింగ్ బోట్ను జీరో-కార్బన్ ఉద్గారాలే లక్ష్యంగా రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. సాంప్రదాయ విమాన ప్రయాణాలకు ఇది ప్రత్యామ్నాయంగా మారుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. కర్బన ఉద్గారాలను తగ్గించడంపై, పర్యావరణ అనుకూల రవాణా పరిష్కారాలను అందించడంపై కంపెనీ దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు.
ఇదీ చదవండి: జియో హాట్స్టార్ ఆవిష్కరణ.. ఇకపై ఐపీఎల్ ఫ్రీ కాదు!
భవిష్యత్తు ప్రణాళికలు
వాటర్ ఫ్లై టెక్నాలజీస్ వచ్చే ఏడాది నాటికి నాలుగు టన్నుల పేలోడ్ను తీసుకెళ్లే సామర్థ్యం కలిగిన ఫ్లయింగ్ బోట్లను రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. పూర్తిస్థాయిలో 20 సీట్ల సామర్థ్యంతో విగ్ క్రాఫ్ట్ను అభివృద్ధి చేయాలని యోచిస్తోంది. 2029 నాటికి చెన్నై-సింగపూర్ వంటి ఖండాంతర మార్గాల్లోనూ ప్రయాణాలు సాగించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment