EPFO సేవల్లో మార్పులు.. ఇక అన్నీ ఆటోమేషన్‌లోనే! | EPFO Moves to Complete Automation Ends Manual Services | Sakshi
Sakshi News home page

EPFO సేవల్లో మార్పులు.. ఇక అన్నీ ఆటోమేషన్‌లోనే!

Mar 5 2026 10:12 AM | Updated on Mar 5 2026 3:55 PM

EPFO Moves to Complete Automation Ends Manual Services

సాక్షి, హైదరాబాద్‌: ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (ఈపీఎఫ్‌ఓ) ద్వారా అందే సేవలను పూర్తిగా ఆటోమేషన్‌ పద్ధతిలో నిర్వహించాలని సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ (సీబీటీ) నిర్ణయించింది. ఇందుకు ప్రతి చందాదారుడు తప్పనిసరిగా కేవైసీ సమర్పించాలని సూచించింది. అలా కేవైసీ సమర్పించిన వారికి ఈ సేవలన్నీ ఆటోమేషన్‌ పద్ధతిలో అందుతాయి.

ఇకపై మాన్యువల్‌ విధానానికి తావు ఇవ్వొద్దని సీబీటీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కసరత్తు చేయాలని ఈపీఎఫ్‌ఓ యంత్రాంగాన్ని ఆదేశించింది. ఇటీవల ఢిల్లీలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ అధ్యక్షతన జరిగిన సీబీటీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చందాదారుల సంఖ్య వేగంగా పెరుగుతున్న తరుణంలో సేవలను వేగంగా అందించే లక్ష్యంతో డిజిటల్‌ రీఫార్మ్స్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

మానవ జోక్యం లేకుండా... 
క్లెయిమ్‌ ప్రాసెస్‌ను మానవ జోక్యం లేకుండా పూర్తి చేసే వ్యవస్థను ఈపీఎఫ్‌ఓ అభివృద్ధి చేస్తోంది. పూర్తిగా ఆటో సెటిల్‌మెంట్‌ విధానాన్ని విస్తరిస్తోంది. ఒక క్లెయిమ్‌ పరిష్కారానికి ఇదివరకు మాన్యువల్‌గా కాగితాల సమర్పణ, అధికారుల ఆమోదం లాంటివి ఉండేవి. ఇకపై అలాంటి జాప్యం లేకుండా ఆటోమేషన్‌ పద్ధతిలో క్లెయిమ్స్‌ ప్రాసెస్‌ చేస్తారు. ఇందుకోసం చందాదారుడు ఆధార్, బ్యాంకు కేవైసీ ధ్రువీకరణ ప్రక్రియ పూర్తి చేసి ఉండాలి.

దీంతో మానవ ప్రమేయం లేకుండా సిస్టమ్‌ ఆధారంగానే క్లెయిమ్స్‌ సెటిల్‌ చేస్తారు. ఈ సందర్భంలోనే ఆన్‌లైన్‌ ట్రాకింగ్, ఎస్‌ఎంఎస్‌/ ఈ –మెయిల్‌ అప్‌డేట్‌ను మరింత పారదర్శకం చేయనున్నారు. ఇనాపరేటివ్‌ ఖాతాల నిర్వహణకు చెక్‌ పెట్టాలని సీబీటీ నిర్ణయం తీసుకుంది. రూ.1,000 కంటే తక్కువ బ్యాలెన్స్‌ ఉన్న ఈపీఎఫ్‌ ఖాతాలు, చాలాకాలంగా నిర్వహణ లేని వాటిని ఆటో–ఇనిషియేషన్‌ క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌ చేసేందుకు సీబీటీ నిర్ణయం తీసుకుంది.

ఇలాంటి ఖాతాలు దాదాపు 3 లక్షలకు పైబడి ఉన్నాయి. ఆటో–ఇనిషియేషన్‌ క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌ విధానాన్ని పైలట్‌ పద్ధతిలో ప్రారంభించనుంది. చిన్న మొత్తాలున్న ఖాతాలు, ఏళ్ల తరబడి నిర్వహణ లేని ఖాతాలను స్వయంచాలకంగా గుర్తించి, సభ్యుల బ్యాంక్‌ వివరాలు సరైనవని నిర్ధారించుకొని ఆ నిధులను వెనక్కి ఇచ్చేస్తారు. దీంతో ఏటా వడ్డీ చెల్లింపులు, నిర్వహణ భారం తగ్గుతుంది. ఈడీఎల్‌ఐ పథకం అమలు కూడా మరింత వేగవంతం కానుంది.

క్లెయిమ్స్‌ను వేగంగా పరిష్కరించేలా ప్రత్యేక సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నారు. ప్రావిడెంట్‌ ఫండ్, పెన్షన్, ఇన్సూరెన్స్‌ విభాగాల మధ్య డేటా సమన్వయానికి చర్యలు చేపట్టనున్నారు. చందాదారులకు ఒకేచోట సేవలు అందేలా యూనిఫైడ్‌ పోర్టల్‌ అభివృద్ధికి నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ఇదివరకే తీసుకోగా... పనుల ప్రగతి నివేదికపైనా సీబీటీ సమావేశంలో చర్చించారు.

యూనివర్సల్‌ అకౌంట్‌ నంబర్‌ (యూఏఎన్‌) ఆధారంగా రికార్డుల నవీకరణ, పేరు, పుట్టిన తేదీ సవరణను సులభతరం చేయనున్నారు. దీంతోపాటు ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేస్తారు. ఫిర్యాదుకు సంబంధించిన సమస్య పరిష్కారానికి నిర్దేశించిన గరిష్ట సమయం కంటే ముందే పరిష్కరించేలా సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement